The Project Gutenberg eBook of కొల్లాయి గట్టితే నేమి? This ebook is for the use of anyone anywhere in the United States and most other parts of the world at no cost and with almost no restrictions whatsoever. You may copy it, give it away or re-use it under the terms of the Project Gutenberg License included with this ebook or online at www.gutenberg.org. If you are not located in the United States, you will have to check the laws of the country where you are located before using this eBook. Title: కొల్లాయి గట్టితే నేమి? Author: Mahidhara Ramamohan Rao Release date: September 6, 2012 [eBook #40687] Most recently updated: June 15, 2020 Language: Telugu *** START OF THE PROJECT GUTENBERG EBOOK కొల్లాయి గట్టితే నేమి? *** Produced by Volunteers at Pustakam.net కొల్లాయి గట్టితే నేమి? ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ అవార్డు పొందిన నవల మహీధర రామమోహనరావు నవోదయ పబ్లిషర్స్ కారల్‌మార్క్స్ రోడ్డు విజయవాడ - 2 Kollayi gattite nemi (Novel) Mahidhara Rama Mohana Rao First Edition : 1965 Second Edition : 1978 Third Edition : 2007 (Navodaya) Title Design : A. Giridhar Published by : Navodaya Publishers Karl Marx Road Vijayawada - 520 002 Phone : (0866) 2573500 Laser Type Setting : Sri Sri Printers Vijayawada - 520 002 Phone : (0866) 2571359 Printed at : Nagendra Press Suryaraopet, Vijayawada - 520 002 Phone : (0866) 244 2001 Price : Paperback : Rs. 150/- Hard Bound : Rs. 200/- ఒకమాట 1921 - మార్చి 31, ఏప్రిల్‌ 1. ఆనాడు బెజవాడలో అఖిలభారత కాంగ్రెస్‌ కమిటీ సమావేశం జరిగింది. కాంగ్రెస్‌ జీవితంలో ఆ సమావేశానికి ఎంతో చారిత్రక ప్రాముఖ్యం వుంది. - కాంగ్రెస్‌ను విస్తృత ప్రాతిపదికగల ప్రజాసంస్థగా రూపొందించేటందుకు ఆ సమావేశంలోనే నిర్ణయించారు. - ఖద్దరు వుద్యమం, మద్యనిషేధం కాంగ్రెసు కార్యక్రమంలో భాగాలుగా స్వీకరించబడ్డాయి. - ప్రజల నుంచే ప్రజోద్యమాల నిర్వహణకు ధనం సేకరించే నిర్ణయం తీసుకొన్నారు. ఆనాటి నుంచీ ముప్పేటన జాతీయోద్యమం తెలుగుదేశం నాలుగు చెరగులా అలుముకుంది. వివిధ తరగతుల ప్రజలు తమ ఆదరాలు, అభిమానాలు, ఆశలు, రోషాలు--ప్రక్కకు పెట్టారు. ఓపినంతలో తోచిన పద్ధతిలో ప్రతి ఒక్కరూ ఆ మహాయజ్ఞానికి సమిధనొక్కటి సమర్పించారు. అసంఖ్యాక ప్రజానీకాన్ని కదిలించి, ముందుకు తీసుకుపోగలిగిన ఒక మహావ్యక్తిని తెలుగు దేశం ముక్తకంఠంతో కీర్తించింది. ఆయన రూపొందించిన ఖద్దరు వుద్యమాన్ని చేతులు చాచి అందుకొంది, పాటలు పాడింది. సుందరమైన రాట్నమే పసందు బాంబురా||......... ఆనాటి తెలుగుదేశపు రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులను చిత్రిస్తున్న ఈ నవలకు 'కొల్లాయి గట్టితేనేమి?' అని పేరు పెట్టడం కొంతవరకు ఆక్షేపణీయంగా వుంటుందని నేనెరుగుదును. ఏమంటే గాంధీజీ ఈ కథ ముగిసిన మరి ఆరు నెలలకుగాని 'కొల్లాయి' కట్టడం ప్రారంభించలేదు. కొల్లాయి గట్టకపోయినా ఆయన నిరాడంబర జీవితం, సాధువర్తనం, సమాజంలో అడుగున వున్న జనానికి దగ్గరగా వుండాలనీ, వారిని పైకి తెచ్చేటందుకు ఆయన పడే తపన--ఇవే ఆనాడు ఆయనను తెలుగుదేశానికి ప్రియతముడిని చేశాయి. దానిని తెలుపడానికి మాత్రమే ఆ పేరు. ఇంకొక్కమాట చెప్పాలి. ఈ నవలకు కేంద్రంగా ముంగండనూ, పరిసరాలనూ తీసుకోవడం కల్పనలో కొంత భారం తప్పించుకొనేటందుకు తప్ప దీనిలో పాత్రలేవీ యదార్థాలు కావు. కథ జరిగి వుండనూ లేదు. ఇంక ఆనాటి సాంఘిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులను, వస్తున్న మార్పులను చిత్రించడంలో ఎంతవరకు కృతకృత్యుడనయ్యానో తెలుగుదేశం చెప్పాలి. వేచి వుంటా...... - రచయిత ఒకటోభాగం ఒకటి కాలేజీ హాస్టలు వరండాలో నిలబడి రామనాధం తాను విడిచిపోతున్న పరిచిత ప్రదేశాల వంక చూస్తూంటే మనస్సు ఎలాగో అనిపించింది. గోదావరి గట్టుమీద సామాను పెట్టెల్ని స్టేషనుకు లాక్కుపోతూ వగరుస్తున్న రైలు ఇంజను బుసలు ప్రతిరోజూ మాదిరిగా అసహ్యం అనిపించడం లేదు. రాజమండ్రి స్టేషనులో బయలుదేరబోతున్న రైలూ, గోదావరి రేవులో కదలబోతున్న డరోతీ స్టీమరూ ఒక్కమారే గీపెట్టేసరికి వులిక్కిపడ్డాడు. ఆ హోరులో వెనుక నుంచి సుబ్బారావు రావడాన్ని అతడు గమనించనే లేదు. రెండు మార్లు అడిగితేగాని అతని మాట వినబడలేదు. "ప్రయాణసన్నాహంలో వున్నట్లున్నావు." "రేపీ పాటికి మా ఊళ్ళో...." "అదృష్టవంతుడివి......" ఆ మాటలో వెక్కిరింతను గుర్తించేడు రామనాధం. "ఆ అదృష్టాన్ని నువ్వెందుకు పంచుకోవూ?" అని డెకారించేడు. "అంటే......." ఆ సాచివేతా, చూచిన చూపుతో రామనాథం తన ప్రశ్నలోని బలహీనతను అర్థం చేసుకొన్నాడు. "అదృష్టం మీ దృష్టిలో ఎప్పుడూ లాభం కలిగించేదే అయి వుండాలని. కాని...." "ఇప్పుడా అదృష్ట దురదృష్టాల పరిశీలన ఎందుగ్గాని, నీ నోట్సు పారేసి పో...." పారెయ్యడం ఏ గోదావరిలోనో అని కాదు. సుబ్బారావు గదిలో. కాకపోతే గాంధీగారు పిలిచేరని కాలేజీ వదిలివేస్తున్న వానికి మరి పుస్తకాలూ, నోట్సూ పనేముంది? రామనాథం విచారం తెలిపాడు. "సారీ....." "దానికేముందిలే" అన్నా సుబ్బారావు ముఖంలో నిరాశ కనిపిస్తూనే వుంది. "మీ తమ్ముడు తీసుకొని వుంటాడనుకొంటూనే అయినా అడిగి చూద్దామనుకున్నా, అతని దగ్గరే తీసుకొంటాలే." "మావాడు కాదు తీసుకొన్నది. హరినారాయణ" "వాడికెందుకు?" రామనాధం ఉత్సుకతను చూపలేదు. "ఏమో అడిగేడు. ఇచ్చేసేను." కాలేజీ మొదటివాడుగా రావడానికి రామనాధంతో పోటీపడుతున్న వాడు హరినారాయణ. స్వయంపాకం మనిషి. చాలా గుట్టయినవాడు. ఇతరులు తనతో సమానంగా రావడాన్ని సహించలేని కుట్ర బుద్ధియని తోటివాళ్ళలో వున్న విశ్వాసమే సుబ్బారావు ప్రశ్నకూ, వ్యాఖ్యకూ మూలం. "అగ్ని సాక్షాత్కారం చేశావన్నమాట. పుస్తకాలు కూడా." సహాయ నిరాకరణ ప్రతిజ్ఞ తీసుకొన్న రోజున సభావేదిక ముందు దువ్వూరి సుబ్బమ్మగారు వెలిగించిన విదేశీ వస్త్రదాహయజ్ఞకుండంలో అతని పక్క బట్టలతో సహా ఆహుతి అయిపోయాయి. సుబ్బారావు ఉపయోగించిన 'కూడా'లో కుండలీకరణం వానికి. హరినారాయణ గూర్చి తోటి విద్యార్ధులకెటువంటి అభిప్రాయం వుందో రామనాధం ఎరుగును. అతనికీ లేదని కాదు. అయినా దానిని పైకి ఒప్పుకోనూ లేడు. మిత్రుని మాటను సమర్థించనూ లేకపోయాడు. "అదేం మాటరా......" కాని సుబ్బారావు అతని సర్దుబాటును లక్ష్యం చేయలేదు. పైగా ఆ సర్దుబాటు చేయబోవడం చూసి కోపం వచ్చింది. రామనాధం నవ్వేసేడు. సుబ్బారావు పట్టలేకపోయేడు. "మీ ఇద్దరూ ఒక్కటే. కుళ్ళుబుద్ధులు. పక్కవాడెవ్వడేనా మీకు పోటీ అవుతాడని ఏడుస్తారు." అతని ఆరోపణ విన్నాక రామనాధం మరి నవ్వలేకపోయేడు. కాని, సుబ్బారావు అతని సమాధానాలు వేనినీ అంగీకరించలేదు. "హరినారాయణకు నీకన్న ఓపికా, శ్రద్ధా ఎక్కువ. ఎరుగుదువా?" రామనాధం సాయంకాలం ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌లో తప్ప దొరకడు. హరినారాయణ కాలేజీ వేళల్లో కాలేజీలో, ఇతర సమయాల్లో హాస్టలులోని తన గదిలో, పుస్తకాల మధ్య తప్ప మరెక్కడా ఉండడు. కాలేజీలో వాళ్ళిద్దరూ ప్రథమస్థానం కోసం ఇంచుమించు సరిసమాన స్థాయిలో పోటీపడుతున్నారు. అతనికి రామనాధం నోట్సుతో పనిలేదు. కాని అడిగేడు. తీసుకున్నాడు. మరొకరు వాటి సాయంతో తనకు పోటీ అవుతారనీ, ఆ ప్రమాదం లేకుండా చేసుకొనేందుకే ముందు పట్టేసేడంటాడు సుబ్బారావు. అతడు చెప్పేక ఆ అనుమానం రామనాధానికీ కలిగింది. మొదటనే కలగనందుకు సిగ్గూ కలిగింది. కానీ ఆ మాటను వొప్పుకోలేకపోయాడు. "ముందు నువ్వే అడక్కపోయావూ" అన్నది రామనాధం ఆత్మ సమర్థన. ఆ వాదం ఒక కొలిక్కి రాకపూర్వమే హాస్టలు గంట మ్రోగింది. "రా. టిపిన్‌ తీసుకొనిపోదువుగాని" కాని రామనాధం వచ్చినపని కాలేదు. "మా తమ్ముడు కోసం చూస్తున్నా, నువ్వెళ్ళు" అన్నాడు. "సెట్టి బలిజెనంటాడు. మళ్ళీ ఇద్దరూ అన్నయ్యా, తమ్మయ్యా అనుకుంటారు. ఈ బంధుత్వం ఎక్కడిదిరా బాబూ?" అని సుబ్బారావు నిలదీశాడు. రామనాధం చిరునవ్వు నవ్వేడు. అతడు తమ్ముడనే వెంకటరమణ భిన్న కులంవాడు. కాని, సుబ్బారావు అన్నట్లు ఒకరినొకరు అన్నయ్యా, తమ్ముడూ అని పిలుచుకుంటారు. అన్నదమ్ముల మధ్య వుండే అప్యాయతేగాని వాళ్ళిద్దరి మధ్యా మళ్ళీ సన్నిహితత్వం కనబడదు. ఆ విచిత్రమైన బాంధవ్యం అందరికీ ఆశ్చర్యమే. వేళాకోళం చేస్తుంటారు. కానీ, ఇద్దరూ పట్టించుకోరు. "భిన్న కులాల మధ్య బంధుత్వాలుండవా? ఉండకూడదా?" సుబ్బారావు వాదించగల సహనం చూపలేకపోయేడు. "ఎందుకుండవు? ఇదిగో ప్రత్యక్షంగా మీరున్నారుగా!" "మరి......" "మరీ లేదు గిరీ లేదు. లేవోయి పుల్లయ్యా!" "మళ్ళీ మేం చేరోదారి అయితే కష్టం." సుబ్బారావు అతని మాటలు వినిపించుకోలేదు. రెక్క పట్టుకున్నాడు. "చెరోదారీ లేదు. మరోదారీ లేదు. కబుర్లు చెప్పక నడు. కనిపించని మనిషిని పట్టుకోడానికి డైనింగ్‌ హాల్‌ కన్న మంచి చోటేమిటి?" ఆ మాట నిజమే అనిపించింది. "సరే, నడు....." అన్నాడు రామనాధం చేయి విడిపించుకుంటూ. "మళ్ళీ ఎన్నాళ్ళకో...." అంటున్న సుబ్బారావు ప్రక్కనే ఆడుగేస్తూ రామనాధం వేళాకోళం చేసేడు. "ఏం దేశం వదలిపోతున్నావా?" "మీ కాంగ్రెసువాళ్ళు మమ్మల్ని పొమ్మనేస్తారేమిటి?" "యుగాంతర పత్రిక ఖరీదు కథ విన్నావా?" రౌలట్‌ కమిషన్‌ రిపోర్టు ధర్మమాయని దేశంలో మూలమూలలకంటా స్వాతంత్య్ర యోధుల ప్రయత్నాల కథలు తెలిసివచ్చాయి. వానిలో ఇదొకటి. బెంగాల్‌లో టెర్రరిస్టులు రహస్యంగా "యుగాంతర" అంటూ పత్రిక తెచ్చారట. ఒక తెల్లవాని తల, లేదా రెండు నల్లవాళ్ళ తలలు దాని ఖరీదుగా పైన ముద్రించారట. సుబ్బారావు తిరగబడి చూశాడు. "ఆహా!" "ఏం?" "మీ గాంధీగారు....." వేళాకోళానికైనా తన 'కథ' ఎంత అర్థరహితమో గ్రహించి రామనాధం సిగ్గు పడ్డాడు. హాలులో అడుగుపెట్టే సరికి వెంకటరమణ ఎక్కడినుంచో పరుగెత్తుకుంటూ వచ్చేడు. సుబ్బారావు తనమీదినుంచి పెద్ద భారం దిగిపోయినట్లు "అమ్మయ్య" అన్నాడు. "ఇడిగోరా బాబూ మీ తమ్ముడు. ఏమైపోయాడోనని మహకంగారు పడ్డావు." "మీ కోసమే రావాలనుకొంటున్నా....." అన్నాడు వెంకటరమణ. "ఎక్కడికెళ్ళేవు? ఓ అరగంటనుంచి నీ గది ముందే కాచుకొని వున్నాడు." ఎక్కడికెళ్ళిందీ వెంకటరమణ చెప్పడానికి సిగ్గుపడ్డాడు. టిపిన్‌ పళ్ళెం అందుకోవడం ఆలస్యం కాకుండేందుకు అతడు హాలుముందున్న చెట్టు క్రిందనే పుస్తకం తెరచుకొని బైఠాయించేడు. "మధ్యాహ్నం పడవకెడుతున్నారా?" "ముందు రంగనాధం మాష్టార్ని చూడాలి తరువాత....." వెంకటరమణ ఆశ్చర్యమూ, అసంతృప్తీ ప్రకటించేడు. "ఇంకా వెళ్ళలేదూ?" రంగనాధం లెక్చరరు తన ద్వారా కబురు చేశారు. అప్పుడే రెండు రోజులయింది. ఇంతవరకూ వెళ్ళలేదంటే ఏమనుకుంటారు? తాను చెప్పలేదనీ, నిర్లక్ష్యం చేశాడనీ అనుకుంటారేమోనని అతని భయం. రంగనాధరావు లెక్చరరు. రామనాధం తెలివిగల విద్యార్థి యని ఆయనకెంతో అభిమానం. సత్యాగ్రహ ప్రతిజ్ఞ చేశాడనీ, కాలేజీ వదిలిపెడుతున్నాడనీ విన్నాక ఓ మారు వచ్చి కలుసుకోమని కబురు చేశాడు. కాని ఆయనకు తనమీద వున్న అభిమానమే ఆయన పిలవగానే వెళ్ళడానికి సందేహించేలాగ చేసింది. రంగనాధరావు ఆక్స్‌ఫర్డులో చదివి వచ్చినవాడు. వేష భాషలలో, ఇంటి ఆచారాలలో కూడా శుద్ధ ఆంగ్లేయుడల్లే వుంటాడు. ఆయన తన సహాయ నిరాకరణ ప్రతిజ్ఞను అభినందించలేడని రామనాధం అవిశ్వాసం. కనకనే వెళ్ళలేదు. వెళ్ళి ఆయనను నొప్పించడం అతనికి మనస్కరించలేదు. ఆఖరు నిముషంలో ఓ మారు కనిపించి పోదామనుకున్నాడు. తమ్ముడి ప్రశ్నలోని ఆదుర్దా గమనించి ఆ పిలుపు రమణ ప్రోత్సాహం మీద జరగలేదు గదా అనిపించింది. అతడికి తాను గాంధీగారు చెప్పినా సరే చదువు మానడం ఇష్టం లేదు. "పనుల తొందరలో రాలేకపోయానని చెప్తాలే." తమ్ముడికి మాటరాకుండా చేస్తానన్నంతవరకే రామనాధం ప్రయత్నం. రమణ ఆ అర్థం గ్రహించి సిగ్గుపడ్డాడు. "అది కాదు." "పెద్ద పనేం వుండి వుండదులే. కాలేజీ చదువు కట్టిపెట్టేస్తున్నావేమిటని అడుగుతారు. అంతే." ఆ నిర్లక్ష్యం వెంకటరమణకు ఇష్టం లేదు. "ఎందుకన్నా కానీండి." "వెడుతున్నా కదుటోయ్‌." రామనాధం ఎంతో ఆప్యాయంగా అతని చేయి పట్టుకొని దగ్గరకు లాక్కున్నాడు. "రా. టిఫిన్‌ తీసుకొన్నావా?" రెండు రంగనాధరావు చూపిన ఆదరానికి రామనాధం ఆశ్చర్యమూ, సిగ్గూ పడ్డాడు. ఆ స్వాగతం అప్రత్యాశితం. లెక్చరర్లు తమకభిమానులైన విద్యార్ధుల దగ్గర కూడా కనబరచే దూరపుతనం లవలేశంకూడా అందులో కనపడలేదు. విద్యాధికులూ, వయస్సులో పెద్దవాళ్ళూ తమకంటె చిన్నవాళ్ళయందు కనబరచే పెద్దరికం అక్కడ లేదు. రంగనాధరావు అతడు వచ్చిన వార్త వినగానే చదువుతున్న పుస్తకం ప్రక్కకు నెట్టేడు. ఎదురుగా వున్న కుర్చీ చూపేడు. యోగ క్షేమాలు తెలుసుకొంటూనే టేబిలుమీది 'కాలింగ్‌బెల్‌' ఒత్తేడు. వెంటనే ప్రత్యక్షమైన బంట్రోతుకు రెండు టీలు పురమాయించేడు. వాడు వెడుతుంటే వెనక్కి పిలిచేడు. "మేడమ్‌ ఏం చేస్తున్నారు?" వాడు చూడలేదు. నసిగేడు. "రామనాధంగారు వచ్చేరని చెప్పు." ఇంటి వద్ద తన గురించి చెప్పేరన్నమాట. తాను సత్యాగ్రహ ప్రతిజ్ఞ తీసుకొని, కాలేజీ చదువు కట్టిపెట్టేసినందుకు ఆయన అంత ఆదరాభిమానాలు చూపుతున్నారనుకోడానికి సమ్మతి చిక్కడం లేదు. కాని, మరో కారణం కనబడదు. కాలేజీలో చేరిన ఈ నాలుగేళ్ళ కాలంలో ఆయనను తానెప్పుడూ ఇంటి వద్ద కలుసుకోలేదు. ఆయన పిలవలేదు. అనాహూతంగా ఎవరన్నా వెడితే ఆయన చాలా చిరాకు పడతారని విన్నాడు. చిరాకుపడ్డా వెంటబడి హరినారాయణ గట్టిగా చివాట్లు తిన్నాడని ఎరుగును. అందుచేత రామనాధం ఎప్పుడూ దూరదూరంగానే ఉన్నాడు. ఆయన తన అభిమానాన్ని కూడా ఓ చిరునవ్వు 'బాగుంది చదువు!' లాంటి ఏకపద వాక్యాలతోనే ప్రదర్శించేవాడు. అటువంటి అలభ్యుడనుకొన్న రంగనాధరావు నోట అన్ని మాటలు, అంత సన్నిహితత్వం చూస్తుంటే రామనాధానికి ఎంతో ఆశ్చర్యం కలిగింది. ఆ ఆశ్చర్యంలో ఆచార్యాణి రాక నాతడు గమనించనే లేదు. "నే చెప్పిన రామనాధం ఇతడే"నని రంగనాధరావు పరిచయం చేస్తున్నప్పుడే అతడామె రాకను గమనించేడు. వెంటనే లేచి నిలబడ్డాడు. "నమస్కారం." టీ త్రాగుతూ చెప్తూన్న కబుర్లలో కనిపించిన రంగనాధరావు కేవలం కొత్త వ్యక్తి. ఒక్క అరగంటలో తాను ఇంగ్లండులో చదువుకొంటున్న రోజుల నాటి కథలు, చూసిన వ్యక్తుల పరిచయాలూ వినిపించాడు. మదన్‌లాల్‌ ధీంగ్రా తెల్లదొరని కాల్చివేసినప్పుడు తాను ఆ సభలో వున్నాడు. పెద్ద వీరాధివీరులమని డబ్బా కొట్టుకొనేవాళ్ళు ఆ రోజున ఎలకల్లా బల్లలూ, కుర్చీల మాటున దాగిన దృశ్యాలు వర్ణిస్తూంటే ఆయన కళ్ళు ఒక్కసారి మిలమిలలాడేయి. హఠాత్తుగా ప్రశ్నించేడు. "బాగా ఆలోచించుకొనే దిగి వుంటావులే." ధీంగ్రాలూ, సవర్కార్లూ చూపిన త్యాగాలూ, సాహసాలతో సమానమైన త్యాగం, సాహసం చూపుతున్నావు. అనే అభినందన ఆ మాటల్లో వినబడి రామనాధం వులిక్కిపడ్డాడు. "ఆలోచించనిదే ఏ పనీ చెయ్యకూడదు. ఓమారు తలపెట్టేక దాని అంతేదో చూడాల్సిందే గాని మధ్యలో వెనక్కి తిరగరాదని" ఆయన ఎప్పుడూ చెప్తూంటారు. అదే ఇప్పుడు కొత్త రూపంలో వినిపించింది. "అందులో ఎత్తుకొన్నది అల్లాటప్పా వ్యవహారం కాదు. దేశ స్వాతంత్య్రం తెస్తానంటున్నావు. ఇందులో శరీరానికి క్షేమం లేదు. ఆస్తులు వగైరా మనల్ని కాపాడవు. అభిమానించే వాళ్ళు కూడా ఒక్కొక్క దశలో కనబడరు" అన్నాడు. రంగనాధరావు చక్కగా సంభాషణలోకి దించేడు. ఆయన భార్య కలిసింది. రామనాధం చేరేడు. కథోపకథనంలో నాలుగు రోజుల క్రితం జరిగిన బహిరంగ సభలోని ఘటనలు, తర్వాత నాలుగు రోజుల్లో తన అనుభవాలూ రామనాధం చెప్పేడు. సత్యాగ్రహ ప్రతిజ్ఞ తీసుకొన్నప్పుడు తోడివాళ్ళంతా చప్పట్లు కొట్టేరు హుషారు చేశేరు. వాళ్ళే మళ్ళీ రాత్రి తన గదికి వ్రేలు మొగాలు వేసుకువచ్చి చదువు మానేస్తున్నందుకు అంత బాధా పడ్డారు. ప్రతిజ్ఞ నుంచి బయటపడేందుకు అన్ని మార్గాలూ చూపించేరు. ఆ మాటలు జ్ఞాపకం వచ్చి కితకితలు పెట్టినట్లయి రామనాధం నవ్వేడు. రంగనాధరావు భార్య వారి బలహీనతను ఈసడించింది. కాని, ఆయన గంభీరంగా తలతిప్పేడు. "అది బలహీనతా? ఉహు! ప్రేమ, గౌరవం, అభిమానం యొక్క మారు రూపం అది." ఆచార్యాణి ఆశ్చర్యం కనబరచింది. "దొడ్డ ప్రేమే." "ఔను. కాని చాలా ప్రమాదకరమైన రూపంలో ఉన్న ప్రేమ అది. దానికి తల ఒగ్గేవా ఇంక ఆ ప్రేమ మిగలదు. అసహ్యం రేగుతుంది. త్రోసిపుచ్చినా ఒక విధమైన ఈసడింపే నీకు లభించేది. ప్రేమ కనిపించదు." రంగనాధరావు లేచాడు. "నిన్ను ఎరుగుదునని చెప్పుకోడానికి సిగ్గుపడవలసిన అవసరం రాదని నాకు తెలుసు" అన్నాడు. రామనాధం ఆయన చాపిన చేతిని అందుకొన్నాడు. "తమ ఆశీర్వచనబలం." రంగనాధరావు ఆ మాట విన్నట్లే లేదు. "ప్రేమాభిమానాలలాగే దేశభక్తి బహు రూపం. అది ప్రకటించే పద్దతులు కూడా బహురూపాలే. వాటిని అర్ధం చేసుకోవడంలోనే దేశం ఏక ముఖం అవుతుంది" అన్నాడు. మూడు పనులన్నీ పూర్తిచేసుకొని రేవులోకి వచ్చేసరికి మొదటి పడవను నీళ్ళలోకి దిగతోస్తున్నారు. అతడిని చూడగానే గుమాస్తా ఎదురు వచ్చేడు. "పంతులుగారూ! రెండో నెంబరు గది ఖాళీగానే వుంది. వెళ్ళండి." కదలిపోతున్న పడవలో ఎక్కడానికి ఏమంత తొందరలే అని రామనాధం సాగారించబోయేడు. "రెండోదాని కెడతాలేండి." "ఇంకా రావలసినవాళ్ళెవరన్నా వున్నారా?" సమాధానానికెదురు చూడకుండానే గుమాస్తా సరంగును కేకేసేడు. అతడు వినిపించుకోకపోతే కళాసీల మీద కేకలేసేడు. "వెంకన్నా! చేర్చి పట్టుకోమంటే ఒక్కళ్ళూ వినిపించుకోరేం." అంత శ్రమపడి పడవ నాపిస్తూంటే రామనాధం తరువాతి పడవకెడతానులే అనలేకపోయేడు. కదలిన పడవను ఆపించినందుకు గుమాస్తామీద విసుక్కుంటూ వెంకన్న గెడవేసి అదిమిపెట్టేడు. "దెబ్బ కాయి" నిలబడివున్న పడవల్ని గుద్దుకోకుండా ఇద్దరు కాచుకొంటూంటే మరో ఇద్దరు తాడు విసిరి చేర్చిపట్టుకొన్నారు. తాను పడవలో ఎక్కడానికి ఇంతమందికి శ్రమ కలిగించేనా యని నొచ్చుకుంటూ రామనాధం పడిచెక్కమీద కాలు పెట్టేడు. "సామానులు వాళ్ళు అందుకుంటారులెండి. మీరు లోపలికి వెళ్ళిపోండి"--వెంకన్న కంఠంలో విసుగు, తొందర వినిపిస్తున్నా రామనాధం ఏమీ అనలేక పోయేడు. చటుక్కున గది గుమ్మంలో కూర్చున్నాడు. వెంకన్న గెడ మారుస్తూ మొదటి గదిముందు తొంగి చూస్తున్న స్త్రీలను హెచ్చరించేడు. "ఏమండోయ్‌ మొదటి గదిలోవారు! తల బయటపెట్టకండి. ఏ గెడన్నా తగులుతుంది. ఆ హెచ్చరిక విని రామనాధం తిరగబడి చూశాడు. వెంకన్న మాటల్ని లక్ష్యం చేయకుండా వారింకా బయటకు చూస్తూనే వున్నారు. ఇంత శ్రమపడి పడవను చేర్చి పట్టుకొన్నదెవరి కోసమా అని వారి ఆసక్తి. ఓ ఇరవయ్యేళ్ళ సాధారణ యువకుడు ఇచ్చే ఆరణాల కేవు కోసం గుమాస్తా అంత హడావుడి చేశాడని వారు నమ్మలేకపోయేరు. కాని, నమ్మక తప్పలేదు. అతడు తప్ప మరెవ్వరూ పడవ ఎక్కలేదు. అతడు ఎక్కగానే తోసేశారు. కళాసీ తెచ్చిన సామాన్లు సర్దుకుంటూండగానే రేవు గుమాస్తా వచ్చేడు. గది సుఖంగా వున్నదో, లేదో యోగక్షేమాలు తెలుసుకొన్నాడు. బల్ల చెక్కల కూర్పు ఎగుడుదిగుడు లేకుండా ఎల్లా సర్దితే సుఖంగా వుంటుందో సూచనలిచ్చేడు. వెనక నుంచి తొందరపెడుతున్నసరంగుకు రామనాధం మంచి చెడ్డలు కనుక్కుంటూండవలసిన అవసరాన్ని హెచ్చరించేడు. "పంతులుగారెవరో తెలుసా? గాంధీగారి మనిషి. పులి. మొన్న సభలో ఏం మాట్లాడేశారు! ఎంత బాగుంది. ఓహ్‌!" రామనాధం ఉత్సుకతను ఆపుకోలేకపోయాడు. "మీరు సభకు వచ్చేరా?" రామనాధం అమాయకత్వానికి నొచ్చుకుంటున్నట్లు గుమాస్తా పెడనవ్వు నవ్వేడు. "అదేమిటండోయ్‌, అల్లా అన్నారు? ఏదో బ్రతకడానికి ఈ పడవల దగ్గిర గుమాస్తా పని చేస్తున్నాగాని ఎప్పుడు, ఏ నాయకులు వచ్చేరన్నా హాజరు కావలసిందేననుకోండి." ఈలోపున పడవ హాలులో డబ్బులు వసూలు చేసుకువచ్చి సరంగు ఫలితాలు చెప్పేడు. "ముందుగదిలో వారు చిరతపూడి నాయుడుగారి తాలూకు. బాబుగారు...." గుమాస్తా ధారాళంగా కేవు చెప్పేసేడు. "పంతులుగారి దగ్గర అర్ధరూపాయికన్న ఎక్కువ తీసుకోకు. వారు చాలా గొప్పవారు. ఈవేళ వారు వచ్చేరంటే మనమూ, మన పడవా తరించామన్నమాట." ఆ అభిమానం, భక్తీ నిలవబెట్టుకొనేందుకు మోసపోతున్నామనుకొంటూనే అర్ధరూపాయి చేతిలో పెట్టేడు రామనాధం. సాధారణంగా గదికి కేవు పావలా, లేక ఆరణాలు. "వస్తానండి. తమకేం కావలసినా చెప్పండి" అంటూనే దగ్గరగా నిలిచివున్న పడవ మీదికి గెంతి క్షణంలో అదృశ్యం అయిపోయాడు గుమాస్తా. నాలుగు ఎదురుగాలి వీస్తోంది. చేప పరుగున పోవలసిన పడవ గెడపోటున పీత నడక నడుస్తూంది. తమ పనుల కడ్డంగా వుంటారని ప్రయాణీకులందరినీ క్రిందకు పంపేసేరు. పడి చెక్క మీద పొడవునా వెనక ముందులకు నడుస్తూ గెడ వేస్తూనే కళాసీలు ఎవ్వరినీ తల కూడా బయటకు పెట్టనివ్వడం లేదు. రామనాధం గదిలోనే కూర్చుండిపోయాడు. బయటకు తల పెట్టి నదీ దృశ్యాల్ని కూడా ఏకాగ్రంగా చూడడానికి లేదు. నిముషానికో రెండు మార్లు ఓ అరడజను కాళ్ళు ఆ దృశ్యాల్ని మూసేస్తూంటే అటు చూడ్డానికి కూడా విసుగు పుట్టింది. ఏమీ తోచడం లేదు. ఇటువంటి అవసరానికుపయోగిస్తుందని ఓ పేక పెట్టెలో వేసుకొచ్చేడు. హాలులో వున్న వాళ్లంతా అలగాజనం. వాళ్ళ మధ్యకు వెళ్ళడానికి మనస్కరించలేదు. పక్క గదిలోని వాళ్ళు ఆడవాళ్ళయిపోయేరు. పక్క పరిచేడు. కొద్దిసేపు 'పేషెన్సు' పరిచేడు. బాగుండలేదు. ఇంకా గెడతోపు మీదనే పడవ సాగుతూంది. ఓమారు తల బయటకు పెట్టి అటూ ఇటూ చూసేడు. కళాసీ హెచ్చరించడంతో తల వెనక్కి తీసుకొన్నాడు. ఈమారు ఏమీ తోచక ప్రక్క వేసేడు. ప్రక్క గదిలోంచి మాటలు వినిపిస్తున్నాయి. కళ్ళు మూసుకుని వింటున్నాడు. "సరిగ్గా వారం అయింది. ఆయన ఏం చేస్తున్నారో, మంగమ్మ కనుక్కుంటూందో లేదో, ఏం తింటున్నారో, ఏం బాధపడుతున్నారో ఏమిటో....." అది వయస్సు మళ్ళిన ఆమె కంఠం. రెండో గొంతు వినిపించలేదు. మూగదేమో అనుకొన్నాడు రామనాధం. ఆ ఆలోచనకు నవ్వు వచ్చింది. ఎక్కువగా మాట్లాడే స్వభావం కాకపోవచ్చు. లేదా, ఏదో ఆలోచిస్తూండి వుంటుంది. ఏమాలోచిస్తూంది? మగణ్ణి గురించా? బహుశా తల్లి ఆమెను ఏ కాన్పుకో తీసుకువెడుతూందేమో? తొలికాన్పు అయి వుంటుంది. బహుశా భయంగా వుండి వుంటుంది. అంత భయపడుతున్నామెను హాస్పిటలు సౌకర్యం వున్న రాజమండ్రి నుండి పనికట్టుకుని చిరతపూడి తీసుకెళ్ళడమెందుకో? అక్కడ ఓ వైద్యుడా, ఓ సౌకర్యమా? ఏ మాత్రం కష్టం వచ్చినా పోతే అమలాపురం పోవాలి. వెళ్ళడానికి దారా, తెన్నా? మట్టిరోడ్లూ, కాలవగట్లూ రెండెడ్లబళ్ళ ప్రయాణంలో ప్రాణం వసివాడిపోతుంది. మొదటి కాన్పుకేనా పుట్టింటివాళ్ళు తీసుకెళ్ళలేకపోయారంటారని బలవంత పెట్టింది కాబోలు..... --బొబ్బర్లంక వద్ద పడవ గట్టుకిపడుతూవున్న హడావిడిలో అతని ఆలోచనలు తెగిపోయాయి. బయటకు వచ్చేడు. అప్పుడే పడవ తిరుగుతోంది. చాలామంది ఆడవాళ్ళూ, మగవాళ్ళూ గట్టుకెక్కేశారు. రామనాధం కూడా గట్టుకి గంతేశాడు. పడవ లాకులు దాటి కాలువ దిగువ చేరేవరకు వారంతా కాలకృత్యాలు తీర్చుకొని అందుకొంటారు. రామనాధం అటూ ఇటూ తిరిగి కాలక్షేపం చేసి, ఇన్ని అరటిపళ్ళు కొనుక్కొని రేవులోకి వచ్చేసరికి పడవ సాగిపోతోంది. అతనిలాగే బయట మిగిలిపోయినవాళ్ళింకా నలుగురైదుగురున్నారు. వారిలో ఒక పడుచు కూడా వుంది. "వెలిచేరు దాకా పడవ చేరదు. వెనకదాంట్లో రండి" అని ఒకరు సలహా ఇచ్చేరు. ఆమె అంగీకరించలేదు. ఎలాగ? తల్లి పడవలో వుంది. సామాను? అప్పుడర్ధమయింది రామనాధానికి, తన ముందుగదిలోని ప్రయాణీకురాళ్ళిద్దరిలో తనకు వినిపించని కంఠం ఈమెది. అనుతాపం తెలిపేడు. "ఎందుకు దిగేరు?" "అరటిపళ్ళు తీసుకొందామని, ఎక్కినదానినే మళ్ళీ దిగేను." ఆమె మూగది కాదు, మాటలుతక్కువ మనిషీ కాదు. గర్భిణీ గాదు. ఆమెను గురించి తానూహించుకొన్న కల్పనలన్నీ గుర్తు వచ్చి అతడు నవ్వుకొన్నాడు. మాటకూడ ఆడలేనంత దుర్భలస్థితిలో లేదు. మంచి ఆరోగ్యంతో మిసమిసలాడుతోంది. ముఖంలో తెలివి, కళ్ళలో చురుకుదనం, మూర్తిలో ఆత్మవిశ్వాసం ప్రతిబింబిస్తూన్నాయి. ఆ ఇరవయ్యేళ్ళ వయస్సు మిసిమి కన్ను తిప్పుకోనివ్వడం లేదు. కాని ఆమె ముఖం వంక తదేకంగా చూస్తున్నందుకు తనలో తానే సిగ్గుపడి తల తిప్పుకొన్నాడు. "వెలిచేరు దాకా పడవ నిలపరు. ఏం చేద్దాం." ఒంటరిగా ఆమెను వదలిపెట్టి తనదారి తాను చూసుకొనేటందుకు మనసు ఒప్పలేదు. "నిలబడి ఆలోచించినకొద్దీ ఆలస్యమవుతుంది. నడవండి." "మీరు నడవగలరా?" ఆమె సమాధానం ఇవ్వకుండా ముందుకు అడుగువేసింది. ఆమె వెనకనూ, ముందర మిగిలినవాళ్ళూ బయలుదేరారు. ఒక అరమైలు వెళ్ళేసరికి రామనాధం ఆమెతో గట్టున మిగిలేడు. మధ్య మధ్య చెట్లు తెరిపి ఇచ్చిన ఒకటి రెండు చోట్ల చేప పరుగున పోతూనే పడవ ఒక్క క్షణం గట్టు దరిగా వచ్చి విడిపోతూ వచ్చింది. ఆ వ్యవధిలోపునే నడవమీదవున్న పడవమీదికి మిగిలినవాళ్ళు గంతేసేరు. వాళ్ళు ఇచ్చిన సులువులూ, ఉపాయాలూ అమలు జరిపి, ఆమె ఎగరలేకపోయింది. ఆమెతోపాటు రామనాధం కూడా గట్టునే దిగబడిపోయేడు. పడవను ఆపమన్న కేకలకు లక్ష్యం చెయ్యకుండా సరంగు కేక పెట్టేడు. "పంతులుగారూ! ఎదరే రేవు. కొంచెం వేగంగా అడుగెయ్యండి." ఆ రేవు కనీసం మైలు దూరంలో వుందని రామనాధం ఎరుగు. కనుక చీకటి పడుతోంది. నీటివంచకంటా తుమ్మలు పెరిగి జీబుమంటున్నాయి. నీటి కోతకి గట్టు కయ్యలు పడి వుంది. ఏటి గట్టెక్కటం మంచిదనుకొన్నాడు. "మీ పేరేమిటి?" "స్వరాజ్యం" "స్వరాజ్యంగారూ! మనం ఏటి గట్టెక్కితే మంచిది. ముళ్ళూ.... బురద....." నిర్జనంగా ఉండే ఏటి గట్టున ఒంటరిగా, చీకట్లో తనతో రావడానికి సందేహిస్తుందేమోనని అతని బెరుకు. కాని, ఆమె సందేహించలేదు. "కానీండి. పడవ మీదికి ఎగరలేకపోయాను గాని నడవలేకపోను" అంది. * * * * * వేళకు వచ్చి పడవ ఎక్కనందుకు తిక్క బాగా వదిలించేనని మీసాల లోపలనే నవ్వుకుంటూ సరంగు పడవను రేవుకు చేర్చేడు. "త్వరగా ఎక్కండి." త్వరగా ఎక్కడం సాధ్యం కానే లేదు. కాలవలో నీరు తక్కువగా ఉంది. పడవ గట్టుకి చేరలేదు. విసుక్కుంటూనే కళాసు గట్టుకి చెక్క వేసేడు. దానిమీద నడవడంలో కూడా స్వరాజ్యం రామనాధం చేయి ఆసరా తీసుకోవలసి వచ్చింది. అటు తర్వాత అవసరం లేకపోయినా రామనాధం చేయి వదలలేదు. ఆమె గది ముందుకంటా దిగబెట్టేడు. కూతురు పడవ ఎక్కలేకపోయినందుకు ఆదుర్దాపడుతున్న తల్లి ఓ మూల కూతురును కోప్పడుతూనే రామనాధాన్ని అభినందించింది. "ఏమి కష్టం కలిగింది? కాస్త కాలు సాగితేనే నలిగిపోతామా?" అని స్వరాజ్యం తల్లిని వూరడించబోయింది. "నాకేం కష్టం కలగలేదండి. ఆవిడే నడవగలుగుతూంటే నేను....." రామనాధం వినయం ప్రకటించేడు. "అటుకులున్నాయి, పెరుగు తీసుకొన్నాం. ఇంకేం వద్దంటే వినడమూ, పెట్టడమూ ఉందా? ఈ రాత్రి తెల్లారదా, అరటిపళ్ళు లేకపోతే?" "తల్లి సాధింపుకు స్వరాజ్యం చిరునవ్వుతో వూరుకుందేగాని, సమాధానం ఇవ్వలేదు. తనకు సాయపడినందుకు రామనాధానికి అభినందనలు తెలిపింది. "థాంక్సండీ." ఆ ఇంగ్లీషు పద ప్రయోగానికి రామనాధం ఆశ్చర్యపడ్డాడు. ఆ ఆశ్చర్యంలో సముచిత సమాధానం ఇవ్వడం మరిచిపోయేడు. "బాగుందండోయ్‌! ఈ మాత్రానికేనా?" రామనాధం పెట్టెలోంచి రెండు కొవ్వొత్తులు తీసి ఒకటి వెలిగించేడు. రెండోది ముందుగదిలో వాళ్ళకిచ్చేడు. "మీరు గట్టివారేనే." స్వరాజ్యం అందుకుంది. తల్లి సందేహిస్తూనే అడిగింది. "బాబూ! అటుకులు పెరుగులో వేసేను. తప్పులేదు. తీసుకోండి." ఆచారభంగం చేసుకోమంటావా అని తప్పు పడతాడేమోనని భయపడుతూ ఆమె అతని ముఖం వంక చూస్తోంది. అతడు సమాధానం ఇవ్వక పూర్వమే స్వరాజ్యం అందుకుంది. "ఆయన గాంధీగారి మనిషమ్మోయ్‌!" ఏటి గట్టున నడుస్తూ కబుర్లలో తెలుసుకొన్న సంగతులు ఏకరువు పెట్టేసింది. అతడు కాలేజీ మానివేసి ఇంటికి వెళ్ళిపోతున్నాడని విన్నప్పుడు తల్లి నమ్మలేకపోయింది. "పోవే, నీ మాటలూ, నువ్వూను" "నిజమేనండి" అన్నాడు రామనాధం. ఆమె నీరవురాలై ఒక్క నిముషం కూర్చుండిపోయింది. "ఏం పని చేశావు నాయనా!" ఆ మాటలో అభిశంసన లేదు. ఆక్రోశం. వట్టి అసహాయ ఆక్రోశం. ఏం చెపితే అర్ధం అవుతుందో రామనాధానికి తోచలేదు. తన బంధువులు తనను ఇంగ్లండు పంపి ఐ.సి.ఎస్‌. చదివించాలనుకుంటున్నారు. పాసై వస్తాడు; ఏ జిల్లాకో కలెక్టరుగా వేస్తారు. అతడు పెద్ద ఉద్యోగి అనిపించుకొంటాడు. హోదా, మర్యాద అన్నీ పెరుగుతాయి. ధనం ఆర్జిస్తాడు. కాని, అతని కవన్నీ ఎల్లా లభ్యం అయ్యాయి అనుకోవాలి? "మీ అమ్మా, నాన్నా చేసుకొన్న పుణ్యం అటువంటిది" అంది మాణిక్యమ్మ. "వాళ్ళు నే పుట్టక పూర్వమే చచ్చిపోయేరు." ఒక్క నిముషం అందరూ ఊరుకున్నారు. "నువ్వు చేసుకోబోయే పిల్ల ఎవరో బంగారు పువ్వులు పూజ చేస్తూండి వుంటుంది." "నాకు పెళ్ళయిపోయింది." "ఎవరో అదృష్టవంతురాలు." "ఇప్పుడు కాదని తేలిపోయిందిగా, నేను చదువు మానేశాను. ఇంక ఇంగ్లండు వెళ్ళడం లేదు. ఐ.సి.యస్‌. లేదు. జిల్లా కలెక్టరును కాను..." స్వరాజ్యం మాట అందించింది. "అంటే ఆవిడ మామూలు పువ్వులతో పూజ చేసిందన్నమాట." "మీ అమ్మగారిలాగే వాళ్ళూ అనుకొన్నారు. కాని....." తన్ను ఎగతాళి చేస్తున్నట్లనిపించి మాణిక్యమ్మ ఊరుకొంది. "అందుచేత నేను మొదట అనుకున్నట్లు చదివి, సంపాదిస్తే కలిగే లాభాలన్నీ ఎవరి పూజకో ఫలితం కాదు." "పోనీ మీరు చేసుకొన్న పూజాఫలంగానే వుండేదనుకోరాదూ?" అంది స్వరాజ్యం. "ఆ మాట నిజం. అయితే నేను చేసే పూజ దేవుడికి కాదు. తెల్లదొరతనానికి." "దొరతనానికి చేసే పూజ దేవుడికి చేసినట్లు కాదా? నావిష్ణు: పృధివీపతి:" అంది మాణిక్యమ్మ. ఆ శ్లోకభాగం విని రామనాధం విస్తుపోయేడు. 'ముసలిదేమో అనుకొన్నాను గాని దేవాంతకురాలే' అనుకొన్నాడు. ఒక నిముషం వూరుకున్నాడు. "జలియన్వాలాబాగ్‌ దురంతాల వంటివి చేయగల ప్రభుత్వానికి విష్ణు అంశ వున్నదనే అనగలమా?" అన్నాడు. ఈమారు ఏమంటావన్నట్లు స్వరాజ్యం తల్లి ముఖంలోకి చూసింది. తాము చదివి కలక్టర్లుగావచ్చి డయ్యరులా, ఓడ్వయర్ల స్థానం పుచ్చుకుంటారు. అమాయక ప్రజల్ని కాల్పిస్తారు. మనుష్యుడిలోని అభిమానాన్ని చంపడానికి పొట్టలపై పాకిస్తారు. ఆ విధంగా చేసిన సేవలకు ఫలితంగా లభించేవే ఆ హోదాలు, ఆ అధికారాలు, ఆ సంపదలూను. "అల్లాంటి రక్తపు కూడు తినేకంటే, నాలుగూళ్ళూ ముష్టి యెత్తుకు బ్రతకడం ఇహానికీ, పరానికీ కూడా మంచిది కదూ?" అన్నాడు. మాణిక్యమ్మ ఏమీ మాట్లాడలేకపోయింది. అన్నీ విని ఒక్క నిట్టూర్పు విడిచింది. "ఏం లోకమో, ఏం కాలమో, చదువుకొని వూళ్ళేలవలసిన మగమహారాజులు మాకీ చదువులే వద్దంటున్నారు. గడప దాటకుండా ఇల్లు దిద్దుకోవలసిన ఆడది మగాళ్ళతో సమానంగా చదువుకుంటాననడం...." "వట్టి పిదపకాలం....." అంటూ స్వరాజ్యం తల్లి మాటలను ఎగతాళి చేసింది. "పిదపకాలమో, కాదో, నీ బ్రతుకు చెప్పడం లేదూ?" స్వరాజ్యం చదువుకొంది. ఆమె చదువుకోవడాన్ని అత్తవారు సహించలేకపోయారు. మానిపించాలనుకుంటే ఆ రోజున ఆమె ఒప్పుకోలేదు. ఈ వేళ మానేసినా వాళ్ళు తీసుకెళ్ళడానికి ఒప్పుకొనే స్థితిలో లేరు. ఆరోజున కూతురు చదువుకోడాన్నే సమర్థించినా, ఈ వేళ కూతురు జీవితం మోడయిపోయిందని బాధపడుతూంది తల్లి. కుటుంబ జీవితంలో ఏవో గొడవలున్నాయని గ్రహించి రామనాధం గమ్మునయిపోయేడు. తొందరపడి ఇంటిగుట్టు బయటివాళ్ళవద్ద తేలిపోయానే అని మాణిక్యమ్మ సంకటపడుతోంది. అనవసర ప్రసంగం తెచ్చినందుకు స్వరాజ్యం తల్లిమీద కొరకొరా చూస్తోంది. ఈ అసందర్భ స్థితినుంచి బయటపడేస్తూ కళాసీ ఒకడు వచ్చేడు. "ఎడ్డుగారు రమ్మంటున్నారు." అక్కడినుంచి లేచిపోవడం ఎల్లాగా అనుకుంటున్న రామనాధానికి ఆ పిలుపు ఆకాశవాణిలా వినిపించింది. రమ్మంటున్నదెవ్వరో కూడా ఆలోచించకుండానే గమ్మున కదిలేడు. "ఇప్పుడే వస్తానండి." అయిదు పడవ టాపుమీద చాలా మంది కూర్చుని వున్నారు. వారిలో తన అవసరం ఎవరికి వచ్చిందాయని అంతవరకు వచ్చాక గాని రామనాధానికి తోచలేదు. అవసరం ఉంటే తన దగ్గరికి రావాలి గాని. ఈ పిలిపించే పెద్దరికం ఏమిటనిపించింది. ఎవరో పిలిచేరనగానే ఏమిటో తెలుసుకోకుండా బయలుదేరినందుకు తనమీదనే కోపమూ, విసుగూ కలిగేయి. కాని మర్యాద తప్పకుండానే అడిగేడు. "ఎవరండీ పిలిచేరట?" అంతా ముఖముఖాలు చూసుకొంటున్నారు. మాట్లాడ్డం లేదు. దూరం నుంచి పలకరింపు వినిపించింది. "పంతులూ ఇల్లారా." ఆ ఏకవచన ప్రయోగం, కంఠంలో దర్పం, నిర్లక్ష్యం, అధికారం వినిపిస్తూంటే రామనాధం అది తననే అనుకోలేకపోయేడు. "ఏం మాట్లాడరేం?" "మేం పిలవలేదు, ఎడ్డుగారు!" ఎడ్డు అన్నది హెడ్‌ అనే ఇంగ్లీషు మాటకు అపభ్రంశమన్నమాట. అయితే ఆ పిలుపు తనకేనా? అదంతా పోలీసు ఉద్యోగపు హుమ్మస్సన్నమాట. రామనాధానికి కోపం వచ్చింది. "ఎవరా ఎద్దు?" దూరం నుంచి నోట్లో చుట్టతోనే కానిస్టేబుల్‌ దర్పం కనబరిచేడు. "ఏటిరా బాపనోడు మా గీరగా మాట్లాడుతుండాడు. డొక్కలిరగ తన్నించుకొని బొక్కలోగాని కూకుండాలనుందేటి?" రామనాధానికి ఆ మాటలు మహా అవమానకరంగా ఉన్నాయి. కాని, ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఇంక తర్వాత మాటతో తన్నుకోవడమే మిగులుతుంది. పోలీసులంటే చిన్నప్పటి నుంచీ రక్తమాంసాలలో జీర్ణించిపోయిన బెరుకు ఓ మూల. నాలుగు తన్నితే వీడికిక్కడ దిక్కేమిటి? అనే పడుచుదనపు తీండ్రం ఓ మూల. రామనాధం పోలీసు కూర్చున్న చోటికి చరచరా నడిచేడు. జేబులోంచి అగ్గిపెట్టె తీసి పుల్ల వెలిగించేడు. ఆ వెలుతురులో ప్రక్కనే వున్న టోపీమీద నెంబరు చదివాడు. "మూడువందల తొంభయ్యారు." "ఏయ్‌ టోపీ ముట్టుకున్నావా జాగ్రత్త!" రామనాధం నిర్భయంగా దగ్గరికి రావడం, టోపీమీద నెంబరు చదవడం చూస్తోంటే పోలీసుకు ధైర్యం సన్నగిల్లుతోంది. "ఏ స్టేషను నీది?....." పోలీసు హెడ్డుగారంటూ నలుగురూ చేతులు నలుపుతూంటే దర్పం చూపబోయిన హెడ్డుకు ఆ ఏకవచన ప్రయోగం చెవిమీద తేలు కుట్టినట్లు అనిపించింది. "మర్యాదగా మాట్లాడు." రామనాధం ఇంక వెనక అడుగువేసే ధోరణిలో లేడు. అనవసరంగా అవమానించినందుకు ఓ మూల ఉక్రోషం. తన దూకుడు చూసి, పోలీసువాని మీద చూపుతున్న దాష్టీకం చూసి మెచ్చుకొంటున్న జనం. ఏమిటో ఈ గందరగోళం అని హాలులో వాళ్ళూ, గదులలో వాళ్ళూ బయటకు వచ్చేరు. పడవ ఓ ప్రక్కకు వొరుగుతూందని చుక్కాని దగ్గర నుంచి సరంగు కేకలు వేస్తున్నాడు. కాని ఎవ్వరూ వినిపించుకోవడం లేదు. సరంగు ఈ మారు రామనాధాన్నే అడిగేడు. "పంతులుగారూ! తమరు మీ గదిలోకి వెళ్ళిపొండి. పోలీసాయన ఏదో పొరపాటున అన్నాడు గాని....." "పొరపాటా! ఒళ్ళు కొవ్వు, గవర్నమెంటు మాది కదా అని తెగ నీలుగు" అని వినిపించింది. చూస్తున్న జనంలో ఎవరన్నారో, ఎక్కడనుంచి వినిపించిందో ఆ చీకట్లో ఎవరికీ తెలియలేదు. కాని ఆ మాటా, దానికి నాలుగు మూలల నుంచీ వచ్చిన ఆమోద ధ్వనులూ విన్నాక హెడ్డుకు తన స్థితి అర్ధమయింది. తర్వాత గవర్నమెంటు ఏం చేస్తుందో గాని, ప్రస్తుతం తన్ను చంపి కాలవలో పారేసినా అదేమిటని అడిగేవాడు లేడని అర్థం అయింది. గాంభీర్యం సడలినా ఉద్యోగపు బుకాయింపుతో బయటపడడానికి ప్రయత్నించేడు. "సర్కారు మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు. నిన్ను పోలీసుస్టేషనుకు తీసుకెడతా. రా ఇల్లా కూర్చో." ఈ దెబ్బతో రామనాధం భయపడతాడని అతని వూహ. కాని జరిగింది వేరు. రామనాధం ఆ మాట వింటూనే సరంగును కేకేసేడు. "సరంగుగారూ! ఆత్రేయపురం ఎంతదూరం వుంది?" "ఆ ముసుగులోదేనండీ, ఏం దిగుతారా?" రామనాధం తన మాటకు బెదిరిపోయేడని పోలీసువాడు భ్రమపడ్డాడు. "దిగడానికి వీల్లేదు, కూర్చో." పోలీసు కంఠంలో ఝమాయింపు వినిపించింది. రామనాధం అమాయక కంఠంతో హేళన చేసేడు. "ఏం, నన్ను పోలీసుస్టేషనుకు తీసుకెళ్ళవూ? పోనీలే నీకు పనుంటే నేనే వెడతాను. నువ్వు పంపించేవని చెప్తా. నీ నంబరు మూడు వందల తొంభయ్యారుగాని, ఎందుకేనా మంచిది నీ పేరేమిటి?" పోలీసువాడు ఆ అవహేళనకు గుటకలు మింగుతూంటే అందరూ ఫక్కున నవ్వేరు. అవహేళన ధోరణిలో పడ్డాక రామనాధం తన విజయాన్ని పూర్తి చేసుకొనకుండా వుండలేకపోయాడు. "సబినస్పెక్టరుగారి పేరేమిటి? సింగుగారా? జోసెఫ్‌గారా? అబ్దుల్లా సాయిబుగారా?" ఆ పేర్లన్నీ తానెరిగిన సబినస్పెక్టర్లవే కావడంతో పోలీసువానికి నోట మాట రాలేదు. తాను పొరపాటున కందిరీగల తుట్టెలో చేయిపెట్టేననిపించింది. ఈ వ్యక్తికి పోలీసు ఉద్యోగులతో ఎల్లాగయితేనేం మంచి పరిచయమే వున్నట్లుంది. తన డబాయింపు యెదురు తిరిగిందనిపించింది. సరంగు పరిస్థితుల స్వారస్యం గ్రహించేడు. "హెడ్డుగారూ, దిగుతారా?" "హెడ్డూ కాదు, గొడ్డూ కాదు. వట్టి మామూలు పోలీసు బంట్రోతు గాడండీ! డబాయించి ఓ పావలా డబ్బులు వడుక్కుంటే కల్లు పాక ఖర్చు వెళ్ళిపోతుందని చూసేడు"... అనేసేడు రామనాధం. అప్పటికప్పుడే పోలీసు హడావిడిగా పడవ దిగి గట్టు ఎక్కేస్తున్నాడు. "కల్లు పాకలో మాత్రం డబ్బిస్తాడనా, అక్కడా లొట్టెలివ్వకుంటే కుండలు పగలకొడతాననే కూర్చుంటాడు." పోలీసువాడు గట్టు మీదికి దిగిపోయేడని ధైర్యం చిక్కాక ప్రేక్షకులలో ఒకడు వ్యాఖ్యానించాడు. ఆ ఘటన రామనాధానికి చాలా చిరాకు కలిగించింది. పోలీసువాని బుకాయింపునూ, దబాయింపునూ అంత సులభంగా ఎదురు తిప్పగలిగినందుకు సంతోషం కలగలేదు. మాటా, మర్యాదా కూడా యెరగని లంచగొండులు జనాన్ని దబాయించుకొని తినేస్తున్నారనే ఆలోచన ఇంత ప్రత్యక్షంగా అతనికెన్నడూ అనుభవం కాలేదు. ప్రభుత్వంలో ఉన్న ఇంగ్లీషు వాళ్ళు పెద్ద ఎత్తున పెద్ద మొత్తాలు తినేస్తూంటే, వీళ్ళు చిన్న మొత్తాలు తినేస్తున్నారు. ప్రభుత్వానికి వీళ్ళు కాపలా, వీళ్ళకి ప్రభుత్వం రక్షణ. ఇద్దరూ జనాన్ని నొక్కేసి జలగల్లా పీల్చేస్తున్నారు. ఇద్దరికీ టిక్కట్టిచ్చేస్తేనే దేశానికీ, దేశంలోని ప్రజలకీ సుఖం. అనేక ఆలోచనల ఆవేశంతో ఉడికిపోతూ రామనాధం నిశ్శబ్దంగా వచ్చి తన గదిలో పడుకొన్నాడు. అప్పుడే ముగిసిన ఆ ఘటన మీద ప్రక్క గదిలో నడుస్తున్న వ్యాఖ్యలు వింటూనే లేచి కూర్చున్నాడు. "మామ్మగారూ!" "నాయనా!" రెండు గదుల మధ్యనున్న చెక్కల తలుపు తెరుచుకొంది. "ఇందాకా పూజాఫలం, సేవా, అదృష్టం అన్నారు. చూశారా--చదువుకొని పూజించవలసింది ఈ లుచ్ఛాలని, వీళ్ళ గురువుల్ని సేవించుకోవాలి. అదే మా అదృష్టం." ఒక్క క్షణం నిశ్శబ్దం. "చదువుకొని ఈ దుర్మార్గులకీ, దుష్టులకీ సహాయం చేయడమే కాదా మా ఆశయం. ఆ వుద్యోగమే బ్రతుక్కి పరమార్థం అనుకొన్నాం. మా పూర్వులు చేసిన పుణ్యకార్యాలూ, మా భార్యలు చేసిన పూజలూ మా చేత ఈ లుచ్ఛాలకి చేతులు నలిపించడం కోసమేనా......ఓరి దేవుడా!" ఆక్రోశం, ఆత్మగ్లాని, అభిశంసనంతో కంఠం నిండి రామనాధం పక్కమీదికి వొరిగేడు. ఆరు నీటిమీది నుంచి వస్తున్న చల్లనిగాలికి వళ్ళు కటకటలాడిపోతూంటే రామనాధానికి తెలివి వచ్చింది. బల్లలమీద జారి ముడుచుకుపోయిన జింఖానాను నడ్డి క్రిందికి లాక్కుంటూనే ముణగదీసుకొని శాలువా నెత్తిమీదకంటా తీసుకొంటూ ఆలకించేడు. పడవ టాపు మీద దబా దిబా మనుష్యులు అటూ ఇటూ నడుస్తున్న చప్పుడు. బయట గట్టుమీద కూడా హడావిడిగానే వుంది. దగ్గరలోనే కోళ్ళు అరుస్తున్నాయి. "ఎక్కడికొచ్చాం అబ్బా?" పడుకున్నవాడు లేవకుండానే, గది తలుపు తెరిచేడు. చల్లనిగాలి రివ్వున తలుపులు తోసుకు వచ్చింది. ఇంక బద్ధకంగా పడుకోవడం సాధ్యం కాలేదు. కనీసం తలుపులు వెయ్యడానికైనా లేవాలి. మసిబారిన లాంతర్ల వెలుతురులో గట్టుమీద మనుష్యులు నీడలలా కదులుతున్నారు. దట్టంగా కమ్ముకొన్న పొగమంచు తెరలను చీల్చుకొని రాలేక రాలేక వారి మాటలూ, కేకలూ కలలోలాగ వినిపిస్తున్నాయి. పడిచెక్క మీద చిన్న గుడ్డిలాంతరు చేతబట్టుకొని నిలబడి పనులు పురమాయిస్తున్న ఆసామీని రామనాధం పలకరించాడు. "ఎక్కడికొచ్చాం?" అతడు వెనుకకు తిరగకుండా, వార్ఫు మీదికి అడుగుపెడుతూ సమాధానం ఇచ్చేడు. "గన్నారం చేరింది. దిగొచ్చు." గోదావరి కాలవల్లో ఒకదానిమీద వుంది గన్నవరం. అక్కడ గోదావరి పాయల్లో ఒక దానిని ఆక్విడక్టుమీదుగా దాటి ఆ కాలవ రాజోలు ఖండంలో ప్రవేశిస్తుంది. తెల్లవారితే గాని పడవల్ని ఆక్విడక్టులోకి వదలరు. అందుచేత పడవలు గన్నవరం రేవు చేరేసరికి రాత్రి ఎంత మిగిలివున్నా అవి అక్కడ ఆగవలసిందే. ప్రయాణ సౌకర్యాలు లేకపోవడంచేత తెల్లవారి నలుగురూ చేరేవరకూ ప్రయాణీకులు కూడా అక్కడ ఆగవలసిందే. అందుచేతనే దిగవలసిన రేవు వచ్చినా రామనాధం తొందర చూపలేదు. పడవలోంచి సరుకును దింపుతున్నారు. ఆ హడావిడిలో మరి నిద్రపట్టదు. లేచాడు. నెమ్మదిగా లేచి చీకట్లోనే తడుములాడుతూ పక్కబట్టలు మడతలు పెడుతున్నాడు. ప్రక్క గదిలో నుంచి పలకరింపు వినిపించింది. "బాగా రాత్రుందేమిటి నాయనా?" రామనాధం గదిలోంచి తొంగి చూసేడు. "ఇంకా చుక్క పైకొచ్చినట్లు లేదండి మాణిక్యమ్మగారూ!" మాణిక్యమ్మ స్వగతం లాంటి సమాధానం ఇచ్చింది. "మా బండి వచ్చే వుంటుంది. సూరిగాడు ఎక్కడో పడి నిద్రపోతూండి వుంటాడు." స్వరాజ్యం నిద్ర లేవలేదాయని ఆ చీకట్లోనే రామనాధం రెండోగదివేపు చూసేడు. అతని సందేహాన్ని సంతృప్తి పరుస్తూ చెక్క కూర్పు ఆవల ఆమె కంఠం వినిపించింది. "వస్తే మాత్రం ఇప్పుడెక్కడ బయలు వెళ్ళగలం? చీకట్లో.... గతుకులూ.... గోతులూ........" ఆమెను పలకరించాలనిపించింది గాని సందేహించాడు. ఒక్క నిముషం నిశ్శబ్ధం. "పెట్టెలో పైనే వుంది నా చీర తీసియ్యి. నీది కూడా తీసుకో." "ఎందుకు?" "మళ్ళీ పనికట్టుకు వస్తామా? వశిష్ఠలో స్నానం చేసి పోదాం....." ఆమె మాట పూర్తి కాకుండానే కూతురు ఆ సలహాను నిరాకరించింది. "ఈ చలిలో నే మునగలేనమ్మా!" మాణిక్యమ్మ ఆశ్చర్యం ప్రకటించింది. "చలేమిటే?" "పుణ్యం లేకపోతే పీడాపోయిరి. నువ్వెళ్ళి స్నానం చేసిరా." కూతురు మొండితనం చూసి తల్లికి కోపం వచ్చింది. ఆ గునిపింపు విని రామనాధం నవ్వుకున్నాడు. "రాతని పట్టే బుద్దులు......" తల్లి విసువూ, విచారమూ కనబరచింది. "అమ్మా! నా బుద్ధికీ, రాతకీ లోపం చూపించి లాభం లేదు. నీ రక్తం పంచుకు పుట్టిందాన్నే నేను....." అంత విసువూ, కోపంలోను కూడ కూతురు గడుసు సమాధానానికి మాణిక్యమ్మ ఒక్క క్షణం విస్తుబోయి, నవ్వుకుంది. వస్తున్న నవ్వు ఆపుకొని, రామనాధం చప్పుడయ్యేలా పెట్టె మూతవేశాడు. "కొవ్వొత్తి వుంది, కావాలాండీ?" "రాత్రిదే వున్నదండీ, వెలిగించలేదు." తాను ఆపేక్షించిన కంఠమే సమాధానం ఇవ్వడం అతనికెంతో సంతృప్తి కలిగించింది. "దిగుతున్నారా యేం నాయనా?" "లేదండి. పడవల గుమాస్తా కోసం చూస్తున్నా, సామాను వప్పచెప్పేస్తే, ఇంక మా వూరు నడిచి....." తమ పాలేరూ, బండీ రేవు దగ్గరలో వుంటాయి చూసి పెట్టమని మాణిక్యమ్మ సాయము కోరింది. "వారి సామానూ మన బండిలోనే వస్తుంది. వారి వూరు మీదుగానే కదా మనము వెళ్ళేది?" స్వరాజ్యం ఆహ్వానానికి మనస్సు ఉత్ఫుల్లం అయినా రామనాధం ఎంతో సంకోచం చూపేడు. "అబ్బే! ఎందుకండి? రోజూ కొబ్బరికాయ బళ్ళు మా వూరినుంచి వస్తూనే వుంటాయి. ఏ బండీకో వప్పచెప్పేస్తాను. మధ్యాహ్నానికల్లా......" "మాకేం కష్టం లేదు. మొగమాటం......" అని మాణిక్యమ్మ చెప్పబోతోంది. కాని, స్వరాజ్యం తల్లి మాటకు అడ్డం వెళ్ళింది. "అంత బండెడు సామానుంటే కష్టమే అనుకోండి." ఆ కంఠంలో వినబడని నవ్వుకూ, వినబడిన హాస్యానికీ రామనాధం తొట్రుపడ్డాడు. "అబ్బే! అంత సామానేం లేదనుకోండి." "ఓ చిన్న కావడిపెట్టె......" ఈమారు రామనాధమూ ఆ హాస్యంలో మాట కలిపేడు. "కాదండి బోషాణమే......." ముగ్గురూ నవ్వేరు. సమస్య తేలిపోయింది. "అయితే అల్లా వెళ్ళి రెండు పందుం పుల్లలు విరుచుకొస్తా. మీ బండివాడి పేరేమిటన్నారు?" "సూరాయి!" అని మామ్మగారు అతని చివరి ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. మొదటి భాగానికి స్వరాజ్యం సమాధానం ఇచ్చింది. "పుల్లల కోసమే అయితే తొందరలేదు. మా దగ్గరున్నాయి." రెంగు గదుల మధ్య నున్న తలుపు తెరుచుకుంది. పలుదోము పుల్ల చేతికివ్వరు. తలుపు వద్ద మరచెంబు లీలగా కనిపిస్తోంది. "ఉండండి, వొత్తి వెలిగిస్తా." అవసరం లేదంటూ చెంబుమీది పుల్ల వొకటి తీసుకొని రామనాధం వార్ఫుమీద అడుగు పెట్టేడు. "ఇక్కడే వుంటారు గదా!" అన్నాడు. "మీరు వెళ్ళిరండి." అంది స్వరాజ్యం. ఏడు పూటీ గోతుల్లో ఓ మారటూ, ఓ మారిటూ ఒరగబెడుతూ రెండెడ్లబండి నెమ్మదిగా నడుస్తోంది. కొమ్ముతాళ్ళు చేతబట్టుకొని సూరాయి ముందు నడుస్తున్నాడు. మాణిక్యమ్మ ముందు వేపు కూర్చుండి, తామిల్లు వదిలిన ఈ ఏడెనిమిది రోజుల్లో ఇంటి వద్ద జరిగిన విశేషాలు తెలుసుకుంటోంది. స్వరాజ్యం ఏదో ఆలోచించుకుంటూ నడిచి వస్తున్న రామనాధాన్ని చూస్తోంది. ఇందాకా కాలవ రేవులో ముఖం కడుక్కుని పైకి వస్తూంటే ఎదురైన పెదతండ్రి శంకరశాస్త్రి పలకరించిన పద్ధతి మనస్సును ఆందోళన పరుస్తూంటే రామనాధం పరధ్యానంగా వున్నాడు. చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని పోగొట్టుకొన్న రామనాధాన్ని పెంచి పెద్ద చేసినవాడు శంకరశాస్త్రి. ఆయన చాల కోపిష్టి. తాను కాలేజీ మానడం ఆయనకు ఇష్టం కాదనీ, తిట్టి గందరగోళం చేస్తాడనీ రామనాధం అభిప్రాయం. కాని జరిగింది వేరు. రేవులో ఎదురయి పలకరిస్తే "ఓహో! నువ్వా! మనూరి బండి వుండాలి రా" అంటూ మారుమాటకేనా అవకాశం ఇవ్వకుండా ఆయన వెళ్ళిపోవడం అతనికి అంతు చిక్కలేదు. తాను కాలేజీ మానిన సంగతీ, సహాయ నిరాకరణ ప్రతిజ్ఞ తీసుకొన్న సంగతీ ఇంటికి వ్రాశానని వెంకటరమణ చెప్పేడు. అది తెలియకపోయినా, ఆ సమయంలో వచ్చినప్పుడు, "ఏం ఇప్పుడు వచ్చేవ"నేనా అడగాలి. అదీ జరగలేదు. తెలుసు. అయినా.... ఆయనేదో పెద్ద ఆలోచన చేస్తున్నాడనిపించింది. అల్లాంటప్పుడే అటువంటి శాంతం కనబరుస్తాడనేది అనుభవం. అయితే ఏమిటో అది? పరధ్యానంగా నడుస్తూంటే కాలికి ఎదురుదెబ్బ తగిలి తూలిపోయేడు. అతని ముఖము వేపే చూస్తున్న స్వరాజ్యం "అయ్యో" అని ఆదుర్దా కనపరచింది. సూరాయి బండి నిలిపి ముందుకు వచ్చేడు. కత్తుల్లా వున్న బెడ్డలు తగిలి అతన కాలివేలు చర్మము లేచిపోయింది. బాధగా వున్నా వోర్చుకుంటూ కుంటుతూ అడుగువేశాడు. స్వరాజ్యం బండిలో కొంచెము వెనక్కి సర్దుకొని పిలిచింది. "రాండి. బండిలోకి." రామనాధం మొగమాటపడుతూంటే మాణిక్యమ్మ పిలిచింది. "తప్పులేదు. రాండి." సందేహిస్తూ రామనాధం బండిలో చివరన కాళ్ళు వ్రేలవేసుకొని కూర్చో బోయేడు. ఆ కూర్చుండటంలో కాలివ్రేలి నరాలు తోడుకుపోతున్నాయి. అతని అవస్థ చూచి స్వరాజ్యం చాలా నొచ్చుకుంది. "ఏదీ కాలేది?" ఆ పేరున కాలు పైకి తీసుకొనడానికి అవకాశం ఏర్పడింది. గాయం చూసి స్వరాజ్యం "అబ్బా!" అంది. బొటనవ్రేలు బుగ్గ చితికిపోయి ఇంకా రక్తం కారుతోంది. స్వరాజ్యం వెంటనే సూరాయిని పిలిచింది. చెంబు ఇచ్చి రోడ్డు ప్రక్కనే పారుతున్న పంట కాలవలోంచి నీళ్ళు తెప్పించింది. గాయం కడిగింది. రామనాధం తన జేబులోని చేతిరుమాలు చింపియిస్తే తడిపి కట్టుకట్టింది. తడిగుడ్డ చుట్టబెట్టేక బాధ తగ్గింది. మరల బండి కదిలింది. "ఎల్లా వుందిప్పుడు?" "బాధ తగ్గిందా?" "రక్తం ఇంకా చిమ్ముతున్నట్లే వుందే." స్వరాజ్యం అడుగడుగునా సానుభూతి తెలుపుతూంటే రామనాధం సిగ్గుపడుతున్నాడు. కాలు క్రిందికి వ్రేలాడ వేసుకొంటే ప్రాణం జివ్వుమంటున్నా అంగీకరించడానికి మగతనపు ధీమా ఆటంకం అవుతోంది. మాట తప్పించడానికి ప్రయత్నించి సఫలుడయ్యేడు. "ఇంటికెళ్ళి ఇంకేం చేయబోతున్నారు?" అని స్వరాజ్యం ఆలోచనలను దారి తప్పించేడు. సూరాయి నుంచి ఇంటి కబుర్లు తెలుసుకుంటూ, ఆ ధోరణిలో పడి వున్న మాణిక్యమ్మ ఓ చెవి వెనక్కి వేసే వుంచింది. రామనాధం ప్రశ్నకు కూతురు ఏం సమాధానమిస్తుందో అని ఆమె సావధాన అయింది. "ఏం చేసేటందుకేముంది? వచ్చే ఏడాది కాలేజీ......" చదువు మాట వచ్చేక మాణిక్యమ్మ వూరుకోలేకపోయింది. ఆ సమస్య మీదనే రోజూ ఘర్షణలు పెరిగి, తత్ఫలితంగానే స్వరాజ్యం తల్లితో తన అత్తవారి ఇంటికి బయలుదేరింది. బయలుదేరి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా చెప్పింది. "ఇదే ఆఖరు మాటు." "నువ్వు కాపురం చేయడం నా కోసమే నన్నట్లు మాట్లాడుతావేం?" "నీ కోసమే ఈ ప్రయాణం." అక్కడ మాణిక్యమ్మ ఆశించిన ఫలితం కలగలేదు. చదువుకొన్న కోడలుకు ఆ ఇంట్లో అడుగుపెట్టే అధికారం లేదని అనేక రూపాలలో స్పష్టంగా చెప్పేసేరు. కాని మాణిక్యమ్మకు ఇంకా ఆశ పోలేదు. తన భార్య వేపు అల్లుడు చూసిన చూపులలో ఆమె ఆశ నిలుపుకుంది. మరల కూతురు కాలేజీలో చేరడం, చదవడం అనే విషయం తలపెట్టకుండా వుంటే ఆమె కాపురం ఓ నాటికి చక్కబడుతుందని ఆమె ఆశ. కూతురు తన ఆశను ప్రత్యాఖ్యానం చేస్తున్నట్లనిపించేసరికి తామసం కలిగింది. "ఆనవాయితీ లేదో అంటే విన్నారు కాదు. ఆడపిల్లకి బడి చదువులెందుకని నెత్తీ - నోరు కొట్టుకున్నా అటు తండ్రీ, ఇటు కూతురూ చెవి దూరనిచ్చారా? అక్కడి కింత అయింది. సిగ్గు లేకపోతే సరి. మళ్ళీ చదువుతుందిట. చదువు....." తాను చదివే రోజుల్లో ఆమె కూడా ప్రోత్సాహమే ఇచ్చిందనీ, అత్తవారితో తెగతెంపులు దశ వచ్చాకనే ఆమె ఆ మాటలన్నదనీ జ్ఞాపకం చేస్తే ఆమె అగ్గిపుంత అయిపోతుంది. పరాయివాళ్ళ ముందర రోడ్డు మీద మాటలెందుకులే అన్నట్లు స్వరాజ్యం ఓ చిరునవ్వు నవ్వి వూరుకుంది. మాణిక్యమ్మ ఆ అవకాశాన్ని జారవిడుచుకోలేకపోయింది. "సవ్యంగా సాగిపోతున్నన్నాళ్ళూ మా అంత తెలివైన వాళ్ళు లేరనుకుంటాం. కాస్త కాలూ, చెయ్యీ వంగేక అన్నీ తెలిసొచ్చేయి. ఇప్పుడేమనుకుంటే మాత్రం.....?" హఠాత్తుగా స్వరాజ్యం తండ్రి అబ్బాయి నాయుడుకు మశూచికం పోసి రెండు కళ్ళూ పోయాయి. చేస్తూన్న ప్లీడరు గుమాస్తా పని మానుకొని రాజమండ్రి వదలి స్వగ్రామం చేరుకున్నాడు. వియ్యాలవారితో పేచీ పడి కూడ సాగిస్తూన్న కూతురు చదువు నిలిచిపోయింది. తాను అవధ్యుడినై పోయాననీ, కూతురు నిరాధారురాలైపోతుందనీ నాయుడు ఆందోళన పడ్డాడు. మాణిక్యమ్మ ఎత్తిపొడుపు దానికే. ఆమె కోపాన్ని సర్దేటందుకు రామనాధం ప్రయత్నించాడు. "అదేం మాటలెండి. ఆడపిల్లని చదివించడానికి నాయుడుగారి మాదిరిగా సాహసం చెయ్యగలవాళ్ళు ఎందరున్నారు? చదువులో వున్న గొప్పదనం ఆయనకు తెలుసు కనుక..." అంత నిరాశలోనూ, కోపావేశంలోనూ కూడ మాణిక్యమ్మ ఆ మెచ్చుకోలుకి వుబ్బిపోయింది. "ఆ గొప్పదనం ఎద్దుముడ్డి పొడుచుకొనేవాళ్ళకి ఏం తెలుస్తుంది? ఆ నాలుగు ముక్కలూ నోట్లో ఉన్నాయి గనుకనే ఈ వేళ ఇంత అన్నం తింటున్నాం. అది మిగిల్చిన నాలుగెకరాలూ తీసుకోవోయి అనగలుగుతున్నాం. లేకపోతే ఏముంది?" అంది. 'తీసుకోవోయి' అన్నది అల్లుడితో. కాని, ఆ నాలుగెకరాలూ కోడలికి అబ్బిన 'చదువు దుర్గుణాన్ని' సరిపుచ్చగలుగుతాయని వియ్యంకుడు భావించలేకపోయేడు. స్వరాజ్యం మెళ్ళో పుస్తె కట్టిన ఆ యువకుడికి గునపం పట్టుకొనే చేతితో కలం పుల్ల పట్టుకోవచ్చుననే సంగతే తెలియదు. స్వరాజ్యం తల్లి మెత్తపడడాన్ని వుపయోగించుకొంది. "అప్పుడే చెప్పేరు వీరేశలింగం తాతగారు. మళ్ళీ వూరికెందుకు. కాలేజీలో చేరిపొమ్మన్నారు." "ఊరికే అవుతుంది. బువ్వ నడవద్దూ." "ఇప్పుడనకేమమ్మా! లేకపోతే శరణాలయం స్కూలులో పనిచేయమన్నారు కదా...." "అన్నీ అయాయి. ఇంక నీ సంపాదనమీద బ్రతకాలి. బాగుందమ్మా!" అత్తవారింట సలక్షణంగా కాపురం చేసుకుంటూ వుండవలసిన కూతురును తమ తిండికోసం ఉద్యోగంలో పెట్టడం అనే ఆలోచనను ఆమె సుతారమూ అంగీకరించలేక పోయింది. స్వరాజ్యం గతకాలపు ఆలోచనలలో కొట్టుకుపోతూ చెప్పుకుపోతోంది. "ఈపాటికి బి.ఏ. ఆఖరి ఏడాదిలో ఉండేదాన్ని, తాతగారి మాట వినే ఉంటే-- ఇప్పుడు మాత్రం ఏముంది? ఏమండీ, చదవమంటారా?" చివరి ప్రశ్న రామనాధానికి. అయితే ఆమె ఆలోచనను అతడు హర్షింపలేక పోయేడు. ఒక్క క్షణం క్రితం ఆమెను చదివించినందుకు తల్లిదండ్రులను అభినందించిన వాడే ఇప్పుడామె మరల కాలేజీలో చేరుతాననడాన్ని హర్షించలేక పోయేడు. అతనిలో పొంగులు వారుతున్న సహాయ నిరాకరణోత్సాహం దెబ్బతింది. "ఓ మూల దేశ స్వాతంత్య్రం కోసం కాలేజీలూ, స్కూళ్ళూ వదిలెయ్యాలని నాయకులు పిలుస్తూంటే, స్వరాజ్యం మళ్ళీ కాలేజీలో చేరుదామనుకోవడం!" కారణం ఏదయినా కూతురు కాలేజీలో చేరడాన్ని నిరుత్సాహపరుస్తున్న రామనాధాన్ని మాణిక్యమ్మ అభినందించింది. "అల్లా చెప్పు నాయనా! ఇంత చదువుకుంటే ఇంతయిందా? మళ్ళీ చదువేమిటి? చాల్చాలు...." ఇద్దరి వాదాల్నీ సమన్వయం చేస్తున్నట్లు స్వరాజ్యం తన పథకానికి చిన్న సవరణ జత పరచింది. "ఒక్క ఏడాదే కదా. గాంధీగారు చెప్పింది? మా యింటి వ్యవహారాలు ఇప్పుడప్పుడే తేలేయా? అవన్నీ సర్దుకొని బయటపడేసరికి ఆయన పెట్టిన గడుపు ఎల్లాగూ తీరుతుంది." గాంధీగారి మాటలమీద అవిశ్వాసమే అతనికా మాటల్లో వినిపించింది. 'నాకు విశ్వాసం లేదు. ఏదో పెద్దవాడు చెప్తున్నాడు గనుక విందాం. తీరా చేసి ఇదంతా ఓ ఏడాది ముచ్చటే కదా' అంటున్నట్లు అనిపించింది. ఆ ఆచరణ కూడా గాంధీగారు చెప్పినందుక్కాదు. తమ ఇంటి వ్యవహారాలు ఈ లోపున ఎలాగూ తేలవు గనక. గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం! రామనాధం నవ్వేడు. విశ్వాసం లేని పని నిరుపయోగం. వారం నాడు చెరుకువాడ లక్ష్మీనరసింహంగారు తమ ఉపన్యాసంలో ప్రబోధించిన గీతా శ్లోకం మనస్సులో మెదిలింది. మయి సర్వాణి కర్మాణి సన్న్యాస్యా ధ్యాత్మచేతసాః నిరాశీర్నిర్మమో భూత్వా: యుద్ద్యస్వ విగతజ్వరః ఆనాడు తోచని లోతులు బండి ముందు నడుస్తూ సూరాయి ఎత్తుకున్న పదంలో వినిపించేయి. మమ్ము బ్రోవా మహిని వెలసితివి మా......హాత్మాగాంధీ || రామనాధం తన ఆలోచనలను సమర్థిస్తున్నట్లు వినిపించిన ఆ పాటను వింటూ తల ఎత్తేడు. బహుశా ఆ ఆలోచనే తోచి ఉంటుంది, స్వరాజ్యమూ తల ఎత్తింది. ఇద్దరి చూపులూ నవ్వుకున్నాయి. ఎనిమిది బండి గోరింకల కాలవ దాటింది. వూరు దగ్గిర పడుతున్న కొద్దీ రామనాధం ఉత్సాహంగా సంభాషణలో పాల్గోవడం లేదని స్వరాజ్యం గ్రహించింది. బహుశా కాలి బాధ ఎక్కువగా వుందేమో ననుకొంది. "ఏం బాధ ఎక్కువగా..." ఆ ప్రశ్నతో రామనాధం చటుక్కున ప్రకృతిలో పడ్డాడు. "అబ్బే ఏం లేదు"--అంటూనే మాట మార్చేడు. "మీరు కాలేజీలో చేరుతానంటే నాయుడుగారేమంటారు?" అబ్బాయి నాయుడికి కాంగ్రెసు అన్నా, గాంధీగారన్నా ఎంతో భక్తి అని చుట్టు ప్రక్కల వూళ్ళల్లో ప్రసిద్ధి. అటువంటి వాడు ఓ మూల గాంధీగారు కాలేజీలు వదలమంటూ వుండగా, తాను కూతురును కాలేజీకి పంపుతాడా? మాణిక్యమ్మ ఒక నిట్టూర్పు విడిచింది. "నీకు తెలియదు నాయనా! గాంధీగారు చెప్పనీ, బ్రహ్మదేవుడే చెప్పనీ, ఆయన మాట ఆయనదే......" గాంధీ వుద్యమం మీద మాణిక్యమ్మకు ఏ మాత్రం సద్భావం లేదని రాత్రి నుంచీ ఆమె చెప్తున్న మాటల్ని పట్టి రామనాధం గ్రహించేడు. దానికి కారణం కూడా ఏమీ లేదు. భర్త తలపెట్టినదేదయినా తప్పుడుదే అయివుండాలని ఆమెలో విశ్వాసం ఏర్పడి పోయిందని గ్రహించేడు. ఈ మారు ఏమనాలో తోచక రామనాధం దిక్కులు చూశాడు. అతని మనస్స్థితిని గ్రహించి స్వరాజ్యం చిరునవ్వు నవ్వింది. "ఏమిటల్లా చూస్తారు?" "గాంధీగారంటే మా పెదనాన్నకు మంచి అభిప్రాయం. మీ అమ్మగారికి ఆ సదభిప్రాయం లేనట్లుంది. అయినా మీ అమ్మగారు కాలేజీ చదువు కూడదనడంలో గాంధీగారి మాటకు విలువనిస్తున్నారు. మా పెదనాన్నగారు...." "పెదనాన్నగారంటే...." "మా పెదతల్లి భర్త. వాళ్ళే నన్ను పెంచారు....." "పిల్లలు లేరు కాబోలు....." అంది మాణిక్యమ్మ. "అదీ నిజమేననుకోండి. కాని, అసలు నా తల్లిదండ్రుల్ని నేనెరగను. ఎప్పుడో నెలల వాడినై వున్నప్పుడే పోయారట. అప్పటినుంచీ....." మరల కొంతసేపటివరకూ అతడు తన ఆలోచనలలోకి జారిపోయేడు. స్వరాజ్యం కూడా నిశ్శబ్దంగా కూర్చుంది. రోడ్డు ప్రక్కనే ఉన్న చిన్న చిన్న ముగ్గు బట్టీలను దాటి బండి నడుస్తూంది. ఏదో జ్ఞాపకం వచ్చి స్వరాజ్యం బండి ఆపించింది. "ఏం కావాలి? ముగ్గు తీసుకొందామా? పండుగలు రెండు నెలల్లో వస్తున్నాయి. వెల్లలూ, అవీ వున్నాయి. సున్నపుగుల్లే తీసుకొందాం. జ్ఞాపకం చేశావు. మంచి పని చేశావు." మాణిక్యమ్మ ఒక్క బిగిని సంసారపు అవసరాల జ్ఞాపకాలలో పడిపోయింది. బండి ఆగగానే స్వరాజ్యం క్రిందికి వురికింది. "నే దిగుతా వుండండి." "ఏమిటా తొందర? ఏ కాలో నెప్పి పెడుతుంది." సర్దుకోబోతున్న రామనాధం కాలు మీద చేయి వేసి నొక్కుతూ స్వరాజ్యం అభ్యంతరం చెప్పింది. "బండిలోనే కూర్చోండి. దిగొద్దు. ఇంత ముగ్గు వేసి కట్టు కడితే ఆ బాధ తగ్గుతుంది. రోడ్డు ప్రక్కన చాపలు పరచి, కాల్చిన సున్నపు గుల్లతో ముగ్గు తయారు చేస్తున్న పల్లెకారు బేరం తగిలిందన్న సంతోషంతో హడావిడి చేస్తున్నారు. "రండమ్మగారూ!" మాణిక్యమ్మ సూరాయి సహాయంతో సున్నపు గుల్లా, ముగ్గూ కొలిపించుకుంటూ వుంటే స్వరాజ్యం రామనాధం వేలి గాయం మీద ఇంత ముగ్గు పోసి కట్టు కట్టేసింది. "పెద్ద బాధ లేదు. మీరింత....." "బాధ ఏమీ లేకపోతే, మీరింత మాటామంతీ లేకుండా కూర్చుండే వారేనా?" రామనాధం ఫక్కున నవ్వేడు. "నేను వట్టి వాగుడుకాయనని తేల్చేసేరన్నమాట." తన మాట కాతడు తీసిన అర్ధం విని ఒక్క క్షణం స్వరాజ్యం విస్తుపోయింది. అంతలో తేరుకొని తానూ నవ్వింది. ఇంక మళ్ళీ బండి ఎక్కడానికి రామనాధం సిగ్గుపడ్డాడు. చిన్న ఎదురు దెబ్బకి అంత ఆర్భాటమా అని స్నేహితులు నవ్వేస్తారు. పదడుగులు వేశాక కాలి తీపు తగ్గింది. మళ్ళీ ఏదన్నా తగులుతుందేమోననే భయంతో కాలు ఎత్తి వేయడం తప్ప మనిషి నడవగలిగాడు. "దెబ్బ తగిలాక బండి ఎక్కించారు గాని లేకపోతే సుబ్బరంగా ఈపాటికి నడిచేద్దును." "నెపం ఎల్లాగూ వేశారు. ఎక్కండి పోదాం" అంది స్వరాజ్యం. కాని, రామనాధం బండి ఎక్కలేదు. స్వరాజ్యమూ అతనితోనే నడిచింది. "ఇదిగో సప్తవటి. దాటగానే నల్ల వంతెన, ప్రక్కనే మా తోట." ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ బండి వెనకాలనే వస్తున్నారు. రోడ్డు ప్రక్కనే ఒకదాని తర్వాత ఇంకొకటీ ఏడు మర్రి చెట్లు దట్టంగా పెరిగి కొమ్మలతో రోడ్డును మూసేసి కనిపించాయి. వాటి పాదాల నొరుసుకుంటూ మురుగుబోదె జలజల దొర్లిపోతుంది. ఏదో చరిత్ర ప్రసిద్ధమైన ప్రదేశాన్ని చూపుతున్నట్లు రామనాధం చెప్పుకు పోతూంటే స్వరాజ్యం ఓ క్షణం నిలబడింది. చీకటి గుయ్యారంగా పెరిగిన మర్రి నీడలలో బండి నడుస్తూంటే స్వరాజ్యం ఎంతో వుత్సాహం ప్రకటించింది. రోడ్డుకిరువేపులా జొన్నచేలు లేత సూర్యుని ఎండలో మిలమిల మెరుస్తున్నాయి. "ఎంత బాగుందో." రామనాధం ఔనన్నాడు. "ఊళ్ళో వున్నప్పుడు తప్పకుండా సాయంకాలం ఓ మారేనా ఇక్కడికి వస్తాం. ఈ ఊడలు పట్టుకొని వూగుతూ....." పదడుగుల్లో మురుగుకాలవ మీద కట్టిన వంతెనలోకి బండి వచ్చేసింది. "అదే మా తోట." ఎదురుగా వున్న బోదె కొబ్బరితోటను స్వరాజ్యానికి చూపించేడు. స్వరాజ్యం ఏదో గుర్తు చేసుకొన్నట్లు ప్రయత్నిస్తూ ప్రశ్నించింది. "చెరువుగట్టు వేపున సంపెంగ పొదలున్న తోట ఇదేనా?" "మీకెలా తెలుసు? ఎప్పుడేనా వచ్చారా?" "మా పినతల్లిగారిది మీ వూరే. పాలెంలో అమ్మవారి గుడి వెనకనే వాళ్ళిల్లు." "సూరన్న కాపు మా మరదేనండి" అంది మాణిక్యమ్మ. "అలాగా?" "ఓ మారు మా పిన్నితో పిల్లలమందరం చెరువుకు వచ్చేం. అప్పుడా సంపెంగ పొదలు వదిలి రాలేకపోయామనుకోండి. ఇంకా అవి ఉన్నాయా?" "బ్రహ్మాండంగా వున్నాయి రాండి. ఓ మారు తోట చూసి వెడుదురు గాని." సంపెంగ పువ్వుల ఆశకు స్వరాజ్యం మెత్తబడేదే గాని, తల్లి ఆటంక పరచింది. "సూరాయి మీ పెట్టే, పక్కచుట్టా తోటలో పెట్టేస్తాడు. తోటలోకి వెళ్ళేటందుకు కోరడికి ఒకచోట కంత వుంది. కంత మధ్యలో ఒక పంగలకొయ్య పశువులు చొరబడడానికి వీలు లేకుండా కేవలం మనుష్యులు దాటి వెళ్ళేందుకు మాత్రం అనుకూలంగా పాతి వుంది. తన సామాను తాను పట్టుకుపోతానంటున్నా మాణిక్యమ్మ అంగీకరించ లేదు. "మీ ఊరి వీధుల్లోకి రానివ్వరని గాని, మీ ఇంటివద్దకే సూరాయి తెస్తాడు." సూరాయి పంచముడు. పంచములకి ముంగండ వీధుల్లోకి ప్రవేశం లేదు. సూరాయి తన సామానుల్ని తోట మకాం పాకలో పెట్టి వచ్చేవరకూ రామనాధం వారితో మాట్లాడుతూ నిల్చున్నాడు. బండి కదులుతూంటే స్వరాజ్యం అతనిని తమ ఊరు రమ్మని ఆహ్వానించింది. "ఇంక వూళ్ళోనే వుంటారు గనక యెప్పుడేనా వస్తూండండి." "రా బాబూ! మీబోటి వాళ్ళని చూస్తే వారెంతో ఆనందపడతారు" అంది మాణిక్యమ్మ. రామనాధం ఒక వారం లోపున వస్తానని వాగ్ధానం చేశాడు. "తప్పకుండా వస్తా. వచ్చి నాయుడుగారి దర్శనం చేసుకుంటా. అంతవరకూ నా నమస్కారాలు తెలపండి." "వీలు చిక్కినప్పుడల్లా దయచేయండి. మీబోటి పడుచువాళ్ళకేమంత దూరం?" ఆమె కళ్ళు ఒత్తుకుంది. మువ్వల గలగలలతో బండి కదులుతూంటే స్వరాజ్యం మరల హెచ్చరించింది. "తప్పకుండా రావాలి." తొమ్మిది బండి దూరం పోయే వరకూ రోడ్డు మీదనే నిలబడి, రామనాధం తోట వేపు తిరిగేడు. "ఎవరు వాళ్ళు?" అన్న ప్రశ్న వినబడ్డంతవరకూ తన వెనక ఎవరో నిలబడి వున్నారన్న ఆలోచన అతనికి కలగలేదు. తిరిగి చూసేడు. సుబ్బన్నశాస్త్రి. "నువ్వా?" సుబ్బన్నశాస్త్రి మళ్ళీ ప్రశ్నించేడు. "ఎవరు ఆవిడ? చూసిన గుర్తుంది." "చిరతపూడి. నాయుడుగారి తాలూకా." "అల్లా చెప్పు, సూరన్నకాపు ఇంట్లో చూశాను నిరుడు సత్యనారాయణ వ్రతానికి. ఎక్కడా చూశాను అనుకొంటున్నా." సుబ్బన్నశాస్త్రి పౌరోహిత్యాలు చేయిస్తుంటాడు. ఆ విధంగా చుట్టుప్రక్కల నాలుగైదు మైళ్ళలోపు గ్రామాలలో జరిగే ప్రతి చిన్న విషయమూ, ప్రతి కుటుంబ చరిత్రలోని సుఖదుఃఖాలూ అతనికి హృత్కవిలి. "మగడొదిలేసి మళ్ళీ పెళ్ళి చేసుకొన్నాడు......" చదువుకొన్నదనే కక్షతో భర్త తీసుకెళ్ళడం లేదనే గాని మిగిలిన గాథలు రామనాధానికి తెలియవు. సుబ్బన్నశాస్త్రి మహోత్సాహంతో చెప్పుకుపోయేడు. అబ్బాయినాయుడు బాగా సంపాదిస్తున్నాడు. ఆస్తి వుంది. ఒక్కర్తే కూతురు అనే ఆశతో చాగల్నాటి సంబంధం వచ్చింది. వాళ్ళూ బాగా వున్నవాళ్ళేనన్నారు. అప్పటికే ఈ అమ్మాయి ఏదో చదువుతూంది. పెళ్ళయ్యాక అత్తవారు ఆమెను చదివించవద్దన్నారు. నాయుడు ససేమిరా అన్నాడు. రెండేళ్ళు గుసాగుసీ పడ్డారు. చివరకు అతడీమెను వదిలేసి మరో పెళ్ళి చేసుకున్నాడు. రామనాధం ఆ వార్త విని మ్రాన్పడిపోయాడు. మరుక్షణంలో సర్దుకొన్నాడు. "దురదృష్టవంతుడు....." "అంటే....." "అంత మంచిపిల్ల పెళ్ళాం కావాలంటే మాత్రం యోగ్యత వుండొద్దూ?" సుబ్బన్నశాస్త్రి గబగబ ముందుకు అడ్డంగా వచ్చి వెక్కిరింతగా ముఖంలోకి తొంగి చూసేడు. "అప్పుడే కత్తు కలిపేశావేం?" "ఏడిశావు." అంతకంటె స్వరాజ్యం మర్యాద రక్షణకి మరో మాట తోచలేదు రామనాధానికి. "లేకపోతే మంచేమిట్రా నీ మొహం. మంచట మంచి. ఆ నాయుడు బ్రహ్మసమాజికం గాళ్ళతో కలిసి నానా కూళ్ళు కుడిచేడు. ఆ పాపం వూరికే పోతుందా? కళ్ళు రెండూ పోయి మూలబడ్డాడు. బంగారు గుడ్లు పెట్టే బాతులాంటి ప్లీడరు గుమాస్తా పని వదులుకోవలసి వచ్చింది. రెండుచేతులా సంపాదించేది పోయి వున్నది కాస్తా దావాలనీ, వ్యాజ్యాలనీ హారతి కర్పూరంలా హరించిపోయింది. ఒక్కొక్కళ్ళు పుట్టిన వేళా విశేషం, చమురు కాళ్ళ తల్లులు. ఆ మగడు పీనుక్కి ఇంత తిండి తినే యోగము వుంది కాబోలు, బయటపడ్డాడు....." ఆ వాక్ప్రవాహాన్ని అరికట్టడానికి చేసిన ప్రయత్నాలను దులపరించేసుకొని సుబ్బన్నశాస్త్రి తాను అనదలచుకొన్నవన్నీ అనేశాడు. అతని మాటలలో దేనిని కాదనాలో, దేనికి సమాధానం ఇవ్వాలో అర్ధం కానట్లు రామనాధం ఒక్క క్షణం నిలబడిపోయాడు. శాస్త్రి విజయ హుంకారం చేసి, ముక్తాయింపు సాయించేడు. "మంచి పిల్లట! యోగ్యత వుండాలిట.......హు" నాయుడు కళ్ళు పోగొట్టిన మశూచి రోగానికి బ్రహ్మసమాజ మతం మీద ప్రత్యేక కక్ష లేదన్న మాట శాస్త్రి చెవి దూరలేదు. మనిషి పుట్టిన వేళల్ని బట్టి వ్యాజ్యాలు రావడం, ఆస్తులు చేరడం వంటివి జరగవనే హేతువాదం అతడికంగీకారం కాదు. "మీ ఇంగ్లీషు చదువుకున్న వాళ్ళకిదో జబ్బు. మశూచికం ఆయనకే ఎందుకు రావాలి? అది వచ్చిన వాళ్ళందరికీ కళ్ళు పోతున్నాయా? ఆయనకే ఎందుకు పోవాలి....?" నూరు ప్రశ్నలు. అన్ని ప్రశ్నలకీ సమాధానాలు దొరకవు. అందరికీ దొరకవు. రామనాధానికి కొన్ని తెలుసు. మశూచికం ఎందుకు వస్తుందో తెలుసును. శాస్త్రం చెపుతూంది. కళ్ళు ఎల్లా పోయాయో చెప్పవచ్చు. కాని నాయుడికి వచ్చిన జబ్బులోనే ఆ తికమక ఎందుకు రావాలంటే....? తాను చెప్పలేడు. "నాకిల్లాంటి కబుర్లు చెప్పకు." శాస్త్రి సలహాను పాటించక తప్పదని రామనాధం ఎరుగును. అట్టే శ్రమ పడకుండా చెప్పడానికి కారణాలు కనిపిస్తూంటే, ఊహా బలం అవసరమయ్యే హేతు ప్రమాణాల్ని శాస్త్రి అంగీకరించడు. అతనిని ఒప్పించడానికి ప్రయత్నించడం కూడా వట్టి కంఠశోషయని ఎరుగును. అయినా వూరుకోలేకపోయాడు. "ఇల్లాంటి పిచ్చి నమ్మకాలు...." ఇంగ్లీషు చదువుకున్న వాళ్ళలో వ్యాపిస్తున్న జబ్బుకు ఉదాహరణగా శాస్త్రి మరో ఉపపత్తి తెచ్చి చూపించేడు. "నీ పక్కచుట్ట పాకలోకి తీసుకెళ్ళిందెవరో చెప్పరాని వాడై వుంటాడు." "చెప్పరాని వాడనేది మొహంమీద రాసిలేదన్నమాట." "అప్పుడే అనుకున్నా." "ఏమని?" "అదే....." "బ్రహ్మ సామాజికులు కులభేదాల్నీ, అంటుసొంటుల్నీ పాటించరు. బ్రహ్మ సామాజికుల కుటుంబంతో అంత లొల్లాపత్తుగా వుండే రామనాధానికి మాత్రం ఆ గాలి సోకకుంటుందాయని ఆలోచన శాస్త్రిది. "రేవుల్లో కూలీలంతా....." వాళ్ళని అంటరాని వాళ్ళెందరో అన్న ప్రశ్నను అతడు చెవి చొరవనివ్వడు. "తెలియక చేసింది పాపం కాదు. బయట ఏం చేశావో, ఏ మూల కూళ్ళు కుడిచేవో నాకక్కర్లేదు. ఊళ్ళో ఆ వెర్రివేషాలేం కుదరవు." "అయితే అక్కడితో రాజీపడగలవన్నమాట." ఎక్కడ చేసినా అనాచారం అనాచారమేనన్న ఆలోచనతో పోలిస్తే ఇది రాజీయే. స్నేహితుని వద్దనున్న చనువుతో హాస్యధోరణిలో మాట్లాడుతున్నా, అతని మాటల వెనుకనున్న ఆచార బలాన్ని రామనాధం ఎరుగును. చదువుకొనేటందుకే అయినా సముద్రాలు దాటి సీమకెళ్ళినందుకు ఆవుపేడ తినిపించి, ప్రాయశ్చిత్తం చేయించేటంత బలం దానికుంది. అందులోనూ ముంగండ. బ్రాహ్మణ గ్రామం. అగ్రహారం కాకపోయినా, అగ్రహారాలకున్న అలిఖిత శాసనాలన్నీ ఆచార బలంతో సాగించుకొంటున్న ఊరు. ఆ ఆచారాలకు తానూ ఎన్నో మార్లు గర్వపడ్డ వాడే. ఇప్పుడు మాత్రం తనకా అభిమానం లేదూ? తన ఊరి వీధుల్లో పంచముల్ని నడవనివ్వకపోవడం, గొంతు ఎండిపోతున్నా సరే చెరువులో నీటిని పంచములెవ్వరూ ముట్టుకోరాదనడం. చెర్లో చేపలు పట్టకుండా బరిసెలూ, బాణాకర్రలతో కాపలాలు కాయడమూ అగ్రహార బ్రాహ్మణుల నైష్ఠికత్వానికీ, భూతదయకూ ప్రమాణాలుగా చెప్తూంటే నిన్నటికి నిన్న పడవలో భుజాలు కుదిలించుకొని గర్వపడ్డాడు. అంటరానితనం మాన్పించడానికై వారం క్రితం బహిరంగ సభలో చేసిన ప్రతిజ్ఞ జ్ఞాపకమే రాలేదు ఆ సమయంలో. శాస్త్రి కా సమస్యలేవీ పట్టవు. అతనికి కావలిసింది తన గ్రామంలో ఆచార భంగం జరగకూడదు. ప్రపంచంకేసి చూడాలంటాడు రామనాధం. "మన ఊరు దాటనంతవరకే. పొలిమేర దాటండి...." "దేశం అంతా తగులబడిపోనీ, మా కంఠాలలో ప్రాణం వుండగా అనాచారం మన ఊళ్ళో అడుగు పెట్టడానికి వీలులేదు." రామనాధం నవ్వేడు. దేశం అంతా ఓ దారిన పోతూ వుంటే ముంగండ ఒక్కటే మనువు ప్రళయకాలంలో ఎక్కిన ఓడలా మిగిలిపోవడం జరగదు. ఆ అలల తాకిడిలో, మంటల వేడిలో, అటూ ఇటూ కాక తప్పదు. ఒడిలి నురగక తప్పదు. శాస్త్రికి ఆ నవ్వు అర్ధం అయింది. ఆ మాట అసత్యం కాదని తెలుసు. ఇంక మాట్లాడలేదు. ఒక నిముషం ఉన్నాక లేచి క్రింద వేసుక్కూర్చున్న తుండు దులిపి భుజాన వేసుకున్నాడు. "నీ మూలంగా స్నానానికి ఆలస్యమయింది. ఊళ్ళోకి రావూ?" రామనాధం వెంటనే ఇంటికి వెళ్లి పెదతండ్రి యెదుట పడడానికి సిద్ధంగా లేడు. ఓ నిముషం తోటలో కూర్చుని, ఆలోచనలు కూడదీసుకోవాలి. శాస్త్రి సమాధానం కోసం ఎదురు చూస్తూ ఓ క్షణం నిలబడ్డాడు. "కాలేజీ మానేసేవటగా....?" "స్మార్తం చెప్పుకోవాలనుంది. 'కులవిద్యకు సాటిరాదు గువ్వలచెన్నా' అన్నాడు." "మేమందరం తింటున్నాం. ఇంక నువ్వు తరువాయి." తమ కులవిద్య కూడూ, గౌరవం ఇవ్వలేదన్న నిరుత్సాహంలో సుబ్బన్నశాస్త్రి మిత్రుని అవహేళనకు అవకాశం ఇచ్చేడు. "హూణ విద్య చదవడం వట్టి అనాచారం..." "అనాచారమని మానావా? స్వాతంత్య్రం వస్తుందంటూ ఎవరో గాంధీ చెప్పేడు గనక మానావా?" "కారణం ఏదయినా ఫలితం ఒక్కటే. ఆ ఫలితం మంచిదా? చెడ్డదా?" "కార్యకారణ సంబంధం ఉండదూ? అనాచారం దృష్టితో చదువు మానితే ఆచార రక్షణకోసం తాపత్రయ పడతావు. మీ గాంధీ మాటమీద మానితేనే పంచముడిచేత పక్క బట్టలు తెప్పిస్తావు." దేశంలోని ఆచారాలకీ, జాతీయోద్యమానికీ, అంత వ్యతిరేకత వుంటుందనే మాట అతని కంతవరకూ తోచనే లేదు. స్వగ్రామం తిరిగివచ్చి ఏవో కార్యక్రమాలు చేపట్టాలని. ఊరికీ - దేశానికీ ఏదో సేవ చెయ్యాలనీ ఆవేశంతో వచ్చేడు. ఏ సేవ చేస్తాడు? ఏమిటి నీ కార్యక్రమం అంటే--అంతా అస్పష్టంగానే వుంది. తెర వేసినట్లుంది. అయితే శాస్త్రి ఆ తెర చింపేసేడు. ఆ తెర వెనుక ఉన్న అలవాట్లూ, ఆచారాలూ, అహంకారాలూ, అభ్యంతరాలూ ఒక్కమారు విశ్వరూపం చూపేసరికి అతని మనస్సు చెదిరిపోయింది. దానిని కూడదీసుకోవాలి. పది నాలుగుగోడల నడిమికి చేరుకొనే వరకూ ఉగ్గబట్టుకు వచ్చిన శంకరశాస్త్రి భార్యను చూడగానే ఒక్కమారు చక్రకాయలా భగ్గుమని నిప్పులు చిమ్మేడు. అంటుగిన్నెలు తోముకుంటున్న రాజమ్మ తన వెనక వేపున ఆ ధూంధాంలు వినబడేసరికి ముడుచుకుపోయింది. "ఏదో అపరాధం వచ్చిందిరా భగవంతుడా" అనుకుంటూ గబగబ చేతులు కడుక్కుంది. ఆమె నడుం యెత్తే లోపున మళ్ళీ పిలుపు. "ఏమే....." "వస్తున్నా....." చేతులు చీర కొంగుకి తుడిచివేసుకుంటూ గబగబ యెదటికి వచ్చింది. "ఈ వేళ మరిడమ్మ రాలేదు. అంట్లు తోముకోవలసి వచ్చింది." క్షమార్పణ చెప్పుకొంటున్నట్లున్న ఆ సమాధానాన్ని శంకరశాస్త్రి వినిపించుకోలేదు. "నీ సుపుత్రుడు దేశంలో దిగేడు." సుపుత్రుడిని గురించీ, అతడు చదువు మానడం గురించీ ఈ వారం రోజులుగా ఇంట్లో చర్చలు జరుగుతూనే వున్నాయి. ఇక ముందు తమ కర్తవ్యం ఏమిటో కూడా ఆలోచించుకున్నారు తామిద్దరూ. కాని తమ నిర్ణయాలకు విరుద్ధంగా మగడు ఈ విధంగా ఝణఝణ లాడుతూంటే ఆమె ఏమీ అర్థంగాక నిలబడిపోయింది. మనస్సులోని వ్యధను నిరాశ, నిస్పృహలను వెలిగ్రక్కుతూ ఇంటి వెంబడి చిందులు తొక్కుతూంటే వారం రోజుల ప్రశ్నలూ, సమాధానాలూ, బెదిరింపులూ, అనునయాలూ మళ్లీ ఓమారు భార్యాభర్తల మధ్య ఆవృత్తం అయ్యాయి. రాజమ్మకు కాన్పులూ, సంతానమూ కూడా నిలవలేదు. చెల్లెలు కొడుకు రామనాధాన్ని తల్లీ-దండ్రీ కూడా కరువైన పసిగుడ్డును తెచ్చి పెంచింది. అతనినామె యెన్నడూ పరాయమ్మ కన్న బిడ్డగా భావించలేదు. శంకరశాస్త్రికి కూడా రామనాధంమీద అభిమానం, ప్రేమా లేకపోలేదు. కాని అతడు తన కొడుకు కాదనే విషయాన్ని మరచిపోలేదు. విశేషమైన కోపం వచ్చినా, విపరీతమైన అభిమానం ప్రదర్శించినా శంకరశాస్త్రి అతనిని రాజమ్మ 'సుపుత్రుని'గానే పేర్కొంటాడు. ఈ క్షణంలో ఎంతో కోపం, కసితోనో ఆ సుపుత్రుణ్ణి తలచేడని రాజమ్మ యెరుగును. కాని ఇతర సమయాలలో మాదిరిగా ఆమెకీ మారు కోపం రాలేదు. అతని మీద పెట్టుకొన్న, పెంచుకొన్న యెన్నో ఆశలు ఒక్కమారు తల్లక్రిందులయే సరికి భర్త తట్టుకోలేకుండా ఉన్నాడని ఆమె గ్రహించింది. అతని మీద జాలి కలిగింది. కాని యెలాగ సర్దుబాటు చేయాలో ఆమెకు అర్ధం కాలేదు. నలభయ్యేళ్లు పైగా కాపురం చేస్తున్నా ఏ మాటకాతనికి కోపం వస్తుందో, ఏది సర్దుబాటు చేస్తుందో ఆమెకింత వరకు తెలియదు. భయపడుతూనే సన్నగా, సర్దుబాటుగా కొడుకు రాకకు ఏవేవో కారణాలు చూపబోయింది. అవన్నీ ఒకటికి పదిమార్లు ఈ వారంలో చెప్పుకొన్నవే. "ఏ వంట్లోనో బాగుండక వచ్చేడేమో, మీదంతా....." అంత కోపంలోనూ శాస్త్రి ఒక్కమారుగా నవ్వేడు. కలిపోసినా వుట్టికేసి చూడడంగా శాస్త్రి దానిని జమకట్టేడు. "ఏమిటోయ్‌ శాస్త్రీ! రాజమ్మ వున్నదా?" అంటూ మూడుకాళ్ళ ముసలమ్మ నరసమ్మ గుమ్మాలెక్కింది. రాజమ్మ అమ్మయ్య అనుకుంది. "రాండి అత్తయ్యగారూ!" నరసమ్మ కర్ర నేలపడేసి గోడకి జారబడి కూర్చుండిపోయింది. ఆయాసం తీర్చుకున్నాక ఆకాశం వంక చేతులెత్తి మొక్కి అంగలార్చింది. "ఇంకా ఎంత కాలమయ్యా భగవంతుడా?" "నీకేం పిన్నీ పుణ్యాత్మురాలివి. బోలెడు బలగం ఉన్నారు. నీ బరువు ఎవరికి?" శంకరశాస్త్రి మర్యాదకు ఓదార్చాడు. నరసమ్మ మర్యాదకే అభినందించింది. "మీరంతా వుండగా నాకు లోటేమిటోయి శాస్త్రీ? కాలూ, చెయ్యీ కదపలేని దశ వచ్చాక ఈ బ్రతుకు ప్రపంచానికే భారం కాదుటయ్యా!" మరల మనస్సులో లేని మాటలతోనే ఓదార్పు. "దేముడిచ్చినదానికి వెక్కసపడితే పోతుందా?" "ఆయువిచ్చిన దేవుడు అన్నానికీ, గుడ్డకీ తిప్పటపెడితే ఎట్లాగోయి." మరల దిక్కుమాలిన గొడవ ప్రారంభమయిందని శంకరశాస్త్రి మనస్సులోనే తిట్టుకున్నాడు. రాజమ్మ పరిస్థితిని గ్రహించి మాట మార్చటానికి ప్రయత్నించింది. "ఈ వేళ పనిమనిషి రాలేదు. ఇంకా మజ్జిగ చెయ్యలేదు. చేసి తెద్దామనుకొంటూనే ఉన్నా, పాపం నిన్న ఉపవాసం కూడా కాబోలు. నే తెచ్చిపెడుదును కదా....." అసలు ఆమె ఎందుకు వచ్చిందో ఎరిగిన శంకరశాస్త్రి అసలు విషయానికి వచ్చేశాడు. "ఈ ఏడాది ఇవ్వవలసింది ఎప్పుడో ఇచ్చేశానన్నాడు కదా పిన్నీ!" "ఇచ్చేడు. నే లేదనలేదుగా. కాని, ఎంత నాయనా! ఏడాదికి పన్నెండు రూపాయలు. ఎప్పుడో రూపాయకి పాతిక శేర్లు బియ్యం కొలిచిన రోజుల్లో ఇచ్చినట్లే నాలుగు శేర్లిచ్చేటప్పుడూ ఇస్తానంటే యెట్లాగోయ్‌. యెవరిపంచనో పడి వుంటాననుకో. రాజమ్మ ధర్మమా అని ఇంత మజ్జిగ పోస్తుంది. ఎవరో ఓ కూర ఇస్తారు. నేనొక్క పూటే తింటా. అయితే మాత్రం ఆ రూపాయితో తిండి గడుస్తుందంటావా?" "పోనీ నీకీ బాధలూ, తిప్పలూ ఎందుకూ? ఆవిడే ఇంత వుడకేసి నలుగురితో పాటు పడేస్తుంది. తిని రామా, కృష్ణా అనుకుంటూ కాలక్షేపం చేసేదానికి...." దేవుడికి పెట్టినంత విసురుగానూ నరసమ్మ మరో నమస్కారం పెట్టింది. "ఒద్దు నాయనా! ఆ అనాచారం చూడలేను. ఓ మడీ, మైలా లేదు." "అదేమిటి అత్తయ్యా.....!" "చయనులుగారింట పుట్టేను, సోమయాజులుగారింట మెట్టేను. ఇంత బ్రతుకూ బ్రతికి గ్రామ పాచకుడి ఇంట ఎలా తిననోయ్‌." కొన్ని వందలో మారు శంకరశాస్త్రి జ్ఞాపకం చేసేడు. "మరి డబ్బు ఇవ్వమనేది కూడా గ్రామ పాచకుడినే కదా?" "నా మెడకురి పోసి అర్ధాంతరపు చావు చచ్చిన ఆ పెద్ద మనిషికి ఆస్తంటూ వుంది కదా. ఏ పొత్తర్ల బియ్యమో పొయ్యక్కర్లేదు కదా." మళ్ళీ కొన్ని వందలోమారు ఆమె వాదం ఎంత తప్పో శాస్త్రి నచ్చ చెప్పడానికి ప్రయత్నించేడు. షోడశ కర్మలు చేయడం అవసరమని చెప్పి, అవి చేయించడం బ్రాహ్మణ ధర్మమని చెప్పి, మళ్ళీ చేయించేవాడిని గ్రామ పాచకుడంటూ నీచంగా చూస్తే ఎలాగ? మగడు నరసమ్మగారికి బోధ చేయడం ధోరణిలో పడ్డాక రాజమ్మ బ్రతుకు జీవుడా అని బయటపడింది. ఇంట్లో మాట మూడోకంటి వాని చెవిని పడనీయరాదంటాడు శంకరశాస్త్రి. అంత జాగ్రత్తగానూ ఉంటాడు. "క్షణంలో మజ్జిగ తిప్పేస్తా, కూర్చో అత్తయ్యా!" "వెళ్ళిరా తల్లీ, లేవలేను. ఇక్కడే కూర్చుంటా." రాజమ్మ వెళ్ళిపోయేక నరసమ్మ ఒక నిట్టూర్పు విడిచి శంకరశాస్త్రి సలహాకు సంతాపం తెలిపింది. "మిమ్మల్ని ఎవర్నీ అని లాభం లేదు నాయనా! కాలం! కాలం!" శంకరశాస్త్రి ఆమెకు నచ్చచెప్పే ప్రయత్నం మానలేదు. "మళ్ళీ సుబ్బన్నశాస్త్రి కదా నీకు కర్మ చేసినా, పిండ ప్రదానం చేసినా, వాడి యింట." నరసమ్మ విసిరేసింది ఆ సలహాను. "చచ్చేక చూడొచ్చేనా ఎవడు కొరివి పెట్టేడో....." ఒక్క నిముషం ఊరుకొన్నాక మళ్ళీ అన్నది. "బ్రతికుండగా పిడికెడు మెతుకులకి మొహం వాస్తున్నానా! పరలోకానికి ముట్టకపోతుందని విచారం." "పరలోకం అంటూ ఒకటి వుందనుకుంటే, ఈ లోకంలో వాళ్ళు చేసే పిండప్రదానం అక్కడికి అందుతుందనుకొన్నాక......" "ఏమో ఎవరు చూడొచ్చేరు? వుందనుకుంటున్నాం. చేస్తున్నాం. పరలోకం అంటూ ఉందో లేదో, ఉంటే అక్కడెల్లా ఉంటుందో చూసి వచ్చిన వాడెవడూ లేడు. దానిని నమ్ముకొని ఇక్కడ అనాచారపు బ్రతుకు గడపమంటావు?" ఆ చర్చలు తేలవు. చుట్టు తిరిగి మళ్ళీ మొదటికే వస్తాయి. శాస్త్రికి ఆ క్షణంలో రామనాధం ఇంట్లో అడుగుపెట్టడం ఊపిరి తీసుకోడానికి వీలిచ్చింది. "రారా, ఇంతసేపు చేసేవేం? బండి దొరికిందా?" ఇంట్లో అడుగు పెట్టేసరికి పెద్ద రభస ప్రారంభం అవుతుందని తయారయి వచ్చినవానికి ఆ ఆహ్వానం చాల గంద్రగోళంగా వినిపించింది. దానిని యెలా అర్థం చేసుకోవాలో కూడా తెలియలేదు. అప్రయత్నంగానే 'ఆ', 'ఊ'లతో సమాధానం ఇచ్చేడు. "అమ్మేది?" "లోపలుంది. నరసమ్మని పలకరించవేం...." రామనాధం చటుక్కున తన పొరపాటు గ్రహించి సర్దుకున్నాడు. "బాగున్నావా అవ్వా!" "ఏదో ఇల్లా వున్నా నాయనా! చదువుకు వెళ్ళేవంది. సెలవలా ఇప్పుడు?" "నీకు తెలియదు. మనవాడే కాలేజీకి సెలవిచ్చేసేడు........" ఆ విషయాన్ని నరసమ్మకు అర్ధం అయ్యేటట్లు చేయడంలో శంకరశాస్త్రి యెదురు చెప్పడానికి వీలులేకుండా రామనాధాన్ని ఎగతాళి చేశాడు. అన్నీ విని నరసమ్మవ్వ చిన్న ప్రశ్న వేసింది. "తెల్లవాళ్ళు దేశంలోంచి పోవాలంటున్నాడా?" ఈమారు రామనాధం మాట మార్చేందుకు అవకాశం దొరకపుచ్చుకున్నాడు. "మనింట్లో ఎవడో వచ్చి పెద్దరికం చేస్తానంటే ఒప్పుకుంటామా అవ్వా!" సరసమ్మవ్వ నమ్మలేనట్లు తల తిప్పింది. "అరాజకమయి పోతుంది." ప్రజలు ఒకరినొకరు చంపుకుంటారు, దోపిళ్ళు సాగుతాయి, కరువు పెరిగిపోతుందని అవ్వ నిశ్చితమైన అభిప్రాయం. "నా వయస్సు తెలుసా?" ఆమె తన చిన్ననాటి కథలూ, తాను విన్న కథలూ చెప్పే ధోరణిలో పడిందని నెమ్మదిగా శంకరశాస్త్రి సర్దుకున్నాడు. ఇంగ్లీషు వాళ్ళు వచ్చేక దేశం బాగుపడిందని ఆమె కథలు చెప్తాయి. బందిపోట్ల చేతుల్లో వాళ్ళ తాతగారు మరణించారు. పిండారీదండ్లు వస్తున్నాయనే సరికి వూళ్ళలో బీభత్సం ఎల్లా వుండేదో వాళ్ళ అమ్మ చెప్పింది. ఆమె అయిదేళ్ళదయి వుండగా పెద్ద కరువు వచ్చింది. చూచాయగా మిగిలిన ఆ జ్ఞాపకాలు వింటేనే వొళ్ళు జలదరిస్తుంది. "తెల్లవాడొచ్చాక ఆ అరాజకం లేదు. ఆనకట్ట కట్టేక ఆ కరువు లేదు. వాళ్ళని పొమ్మని మీరేం చేస్తార్రా కుర్రనాగమ్మల్లారా.....!" వర్తక వ్యాపారాల్లో సాగిపోతున్న వందలకోట్ల రూపాయల దోపిడీ, పరిపాలనా వ్యవస్థలో జరుగుతున్న అన్యాయం. ప్రపంచ ప్రజల మధ్య చేస్తున్న అవమానాలూ అవ్వకు అర్ధం కావు. శంకరశాస్త్రి అతనినా ఇబ్బంది నుంచి బయట పడేశాడు. "నీ లోకం వేరు. నా లోకం వేరు. వాడి లోకం వాడిది. ఒకళ్ళు చెప్తే వినేదుందా? అర్థం అయ్యేదుందా? ఎవళ్ళ దారి వాళ్ళది.. నువ్వు మీ అమ్మకు కనిపించి రారా! లోపలుంది. చల్ల చిలుకుతూంది కాబోలు. వెళ్ళు." ఆ మాట వచ్చిందే తడవుగా రామనాధం నిశ్శబ్దంగా ఇంట్లోకి నడిచేడు. వెనక నుంచి నరసమ్మవ్వ నిర్వేదం వినబడింది. "ఆచారాలు, కట్టుబాట్లు, మర్యాదలు, మన్ననలు అన్నీ పోతున్నాయి లోకం తల్లక్రిందులయిపోతోంది...." పదకొండు గుమ్మంలో రామనాధాన్ని చూడగానే శంకరశాస్త్రి తన కోపతాపాలకు అట్టే బలం వుండదనే విషయాన్ని గ్రహించడం కష్టమేం కాలేదు. రామనాధం ముతక కోరా పంచె కట్టేడు. అల్లాంటిదే ఓ లాల్చీ వేశాడు. తెల్లవారగట్ల చీకట్లో గమనించలేదు గాని, అసలు రామనాధం ఆకారమే మారిపోయినట్లనిపించేడు. ఇంగ్లండు పంపించి చదివించేటందుకూ, ఏ ఐ.సి.ఎస్సో ప్యాసై ఓ జిల్లా కలెక్టరుగా రాగలిగేటందుకూ ప్రాతిపదికగా ఇస్తున్న వేషభాషల తయారీ లవలేశం కూడా మిగిలినట్లు లేదు. ఆ దుస్తులతో తన ముందుకు రాగలగటం తన కోపతాపాల ప్రభావానికి ఆశ్వాసాంతం అని అర్ధం అయిపోయింది. వెంటనే శంకరశాస్త్రి సర్దుకొన్నాడు. ఆ వేళకు నరసమ్మ అక్కడ వుండడం ఎంతో సాయపడింది. ఆమె ఎదుట తన ఓటమిని ప్రదర్శించుకోలేడు. కనక తెలివిగానే సర్దుకొన్నాడు. "చెప్తే వినని పిల్లవాడు కాదు. ఒకవేళ పొరపాటున తొందరపడ్డా చెప్తే వింటాడా.." అని ఈ వారం రోజుల నుంచీ భార్య చెప్తున్నా అతడు నమ్మలేకుండా వున్నాడు. ఇప్పుడు రామనాధాన్ని చూశాక తనలోని అవిశ్వాసాన్ని మనస్సాక్షి హెచ్చరికగా తీసుకొన్నాడు. రామనాధం పెంకితనాన్ని తాను వర్ణిస్తూంటే రాజమ్మ అతని మేదకత్వానికి ఒకే ఒక వుదాహరణను రెట్టిస్తూ వచ్చింది. నాలుగేళ్ళ క్రితం తన కప్పుడే పెళ్ళేమిటని కూర్చున్నాడు. కనీసం ఇరవయ్యేళ్ళయినా వస్తేనేగాని పెళ్ళి చేసుకోనన్నాడు. స్కూలులో తోటి వాళ్ళంతా వొట్టేసుకున్నారట. అంత పట్టుదలా మానుకొని, చెప్పినట్లు పెళ్ళి చేసుకోలేదా అంటుంది ఆమె. ఆమెకేం తెలుసు? ఆ ఒప్పుదల కోసం తన ప్రతిష్ఠను సంపూర్ణంగా వెచ్చబెట్టేసిన సంగతినామె ఎరగదు. అమే కాదు. మరెవ్వరూ ఎరగరు. అప్పటికాతని వయస్సెంత? పదిహేను! తోటలోకి తీసుకెళ్ళి రెండు గుద్దులూ, బుగ్గనులుములూ, గద్దింపులూ తగిలించేక కాని అతనిని ఆలోచనలో పెట్టించలేకపోయేడు. పెంచిన అభిమానం యావత్తూ ఒడ్డేసేనని ఆ రోజునే గ్రహించేడు. తమ కుటుంబంలో మంచి విద్యాంసులుండవచ్చు. కాని, మంచి వుద్యోగాలలో ఎవ్వరూ లేరు. సర్కిలినస్పెక్టరు నారాయణమూర్తి స్వయంగా పిల్లనిస్తానన్నాడు. అదే గొప్ప అనిపించింది. ఆ దృష్టితోనే తాను అంత పట్టుదల చూపేడు. సర్వం ఒడ్డేసేడు. మరల అంత అవసరం కలగవచ్చునని వూహించలేదు ఆనాడు. కాని, అంత అవసరమూ వచ్చింది. ఇప్పుడు ఒడ్డకుండా మిగిలినదేమన్నా వున్నా--లాభం లేదు. ప్రాప్తేతు షోడశే వర్షే పుత్రం మిత్రవదాచరేత్‌ || రామనాధం తనకు పుత్రుడు కూడా కాదు. ఆ సంగతిని వెంటనే అర్థం చేసుకొన్నాడు. కాని, ఇంతకాలంగా అతని మీద పెట్టుకున్న ఆశల్ని అంత సున్నితంగా వదలలేడు. ఆ ఆశలు కలిగించింది వియ్యంకుడు. వ్యతిరేకిస్తారని ఎరిగి వున్నా, బ్రాహ్మణీకాన్ని కూడా లక్ష్యం చేయనంత ఆశ కలిగించేడు నారాయణమూర్తి. ఉన్న ఏడెనిమిది ఎకరాలూ అమ్మేసి అయినా ఇంగ్లండు పంపాలి. అతడు ఐ.సి.ఎస్‌. అయి వస్తే అంతకు పదింతలు భూమి కొనుక్కుంటాడు. హోదా కొలిచేటందుకు ఇప్పుడు ప్రాతిపదిక లేదు. తల్లిదండ్రులు లేనివాడిని పెంచి పెద్దను చేసిన తమకు, అతడే కలక్టరో అయి వస్తే ఎంత ప్రతిష్ట! ఎంత మర్యాద! అన్ని ఆశలూ చూస్తుండగా ఆవిరి అయిపోతూంటే తనకు పట్టనట్లు వూరుకోవడం సాధ్యం కావడం లేదు. కాని, తాను చెయ్యగలదేమిటో అర్థమూ కాలేదు. రాజమ్మ తన సలహాకు విలువ వుంటుందనే నమ్మకం లేకపోయినా వూరుకోలేకపోయింది. "పిల్లనిచ్చిన మామగారున్నాడు. ఆయనకూ వుంది బాధ్యత. వెళ్ళి మాట్లాడండి. దూరం భారం కాదు. అమలాపురంలోనే కదా వున్నాడు....." తాను చెయ్యలేనిది వియ్యంకుడు చెయ్యగలగ వచ్చుననే ఆలోచన దుర్భరం అనిపించింది. విసుక్కుని విదిలించేసేడు. "హు. చెప్పేవు. పోదూ." కాని, ఆ మాట పూర్తికాకుండానే మెరుపులా ఓ ఆలోచన తట్టింది. చటుక్కున విదిలింపు నిలిపేడు. ఆమె మాటలోనూ సబబు కనిపించింది. మామగారు పిల్లనిచ్చిన వాడు! నెమ్మదిగా అడుగు కూడదీసుకొన్నాడు. "అవునేమో. అదీ చూద్దాం." రాజమ్మ తన సలహాకు వినియోగం వుందనుకొనేసరికి కొండ ఎక్కినంత సంతోషపడింది. శంకరశాస్త్రి వ్రేళ్ళు దులిపి 'ఛట్‌' మనిపించేడు. మనస్సులో ఆలోచనకో రూపం వస్తూంది...."అంతే!" "అయితే తొరగా వంట కానియ్యి." రాజమ్మ గబగబ కట్టు విడిచిన బట్టలు రెండు బిందెలో కూరి చెరువుకు బయలుదేరింది. "బట్టలుతుకుతూ కూర్చోకు." "అబ్బే! ఇక్కడున్నట్లు రానూ!" అంటూ రాజమ్మ గుమ్మం దిగింది. పన్నెండు భోజనం చేస్తూ రామనాధం ఆగి తల ఎత్తేడు. "నేను కాలేజీ మానేసి వచ్చానమ్మా!" వడ్డిస్తున్న రాజమ్మ తల ఎత్తకుండా బహు తాపీగా సమాధానం ఇచ్చింది. "మీ బాబాయి చెప్పేరు." "నేనింకా ఆయనతో చెప్పలేదు." రాజమ్మ ఏమీ అనలేదు. రామనాధం ఒక్క నిముషం వూరుకొని మళ్ళీ ప్రశ్నించేడు. "కోప్పడ్డారా?" "భోజనం చెయ్యవోయ్‌! తర్వాత వేద్దువుగాని ఆ ప్రశ్నలు." ఒక నిముషం వూరుకున్నాడు. మళ్ళీ ప్రారంభించేడు. "బాబయ్యకి కోపం వచ్చిందని ఎరుగుదును...." "ఎరిగివుండే మానేవన్నమాట." రామనాధం తల తిప్పేడు. "మరి?" రాజమ్మ చాలా సేపు సమాధానం కోసం ఆగింది. "మీ మామగారినేనా ఓ మారు అడిగితే...." రామనాధం కళ్ళతో నవ్వేడు. "బాబాయికన్న ఆయన దగ్గర బంధువుటమ్మా!" "దగ్గరికీ, దూరానికీ ఏముంది? ఆయన కాకపోతే మీ ఆవిడ వుంది....." "దానికేం తెలుస్తుంది, చిన్నపిల్ల." "నువ్వు మహా ఆరిందా అయ్యావు." రామనాధం ధీమాగా తన వయసు చూపించేడు. "నాకు ఇరవయ్యేళ్ళు వస్తున్నాయమ్మా!" ఆ కంఠస్వరానికి రాజమ్మ నవ్వుకుంది. హేళన చేసింది. "ఇంకో ఏడాదికి......" "సంవత్సరాదికి కాదమ్మా నా పుట్టినదినం." "సరే మూడు నెలల తేడా చెప్పాను." రామనాధం ఆ మాట వినిపించుకోలేదు. "బి.ఏ. చదువుతున్నా చిన్నపిల్లడినేనా?" "మహ గొప్ప చదువు చదివేవు. కాని, నువ్వు చదువుతున్నావంటే...." రామనాధం హాస్యం ఆడేడు. "......ఆయనే కారణం అంటావు." "కాకపోతే? మీ బాబాయి స్కూలు మానిపించి--'హరి ఓమ్‌ అనిపించే వారు." "అదే బాగుండేదేమో....." "కాని నువ్వు అప్పుడల్లా అనుకోలేదు." "ఔననుకో....." "నువ్వు చాలా తెలివిగలవాడివనీ, ఏదో పెద్ద చదువులకెడతావనీ....." ఆ ఆలోచనే ఇష్టం లేనట్లు రామనాధం తుంపేసేడు. "ఇంక చదివేది లేదు. అంతే." రాజమ్మ ఏమీ అనలేదు. అతడు భోజనం ముగించి లేచేడు. చేయి తుడుచుకొన్న తుండు దండెం మీద ఆరవేస్తూ అడిగేడు. "బాబయ్య మాట వినిపించదు. ఎక్కడికెళ్ళేడమ్మా?" శంకరశాస్త్రి అమలాపురం వెడుతున్నానని చెప్పే వెళ్ళేడు. ఎందుకు వెడుతున్నదీ తామిద్దరూ మాట్లాడుకొన్నారు. కాని, ఆ విషయం బయట పెట్టవద్దనుకున్నారు. వూరుకుంది. రామనాధం ఓ మారు మిద్దెగదిలోనూ, వీధి అరుగుమీదా చూసి వచ్చేడు. "లేడు." అతని కంఠంలో ఏదో ఆతురత వినిపించి రాజమ్మ అన్నం తింటూ తల ఎత్తి చూసింది. "తర్వాత మాట్లాడవచ్చునులే. ఏం తొందర?" "మళ్ళీ టపా కట్టేస్తారు. మని ఆర్డరు చెయ్యాలి." మని ఆర్డరు చెయ్యడం అనేసరికి రాజమ్మ కంగారుపడింది. మని ఆర్డరు చెయ్యాలంటూ ఆయన కోసం వెతుకుతున్నాడంటే ఆయన డబ్బు ఇవ్వాలన్నమాట. తన చేతిలోంచి వెళ్ళే ప్రతి పైసాకూ శంకరశాస్త్రి ఆరా తీస్తాడు. అందుచేత ఆయన్ని అడగాలంటే భయం. కాలేజీకి వెళ్ళేటప్పుడల్లా రామనాధం చేతికి డబ్బు చిక్కడం ఒక చిన్నపాటి బ్రహ్మప్రళయం జరిగినాకనే. ఎన్నో చివాట్లు తినాలి. వుపన్యాసాలు వినాలి. గదిమి, గంద్రగోళం చేస్తాడు. ఒక్కొక్కప్పుడు నిష్ఠూరంగా అనేస్తుంటుంది కూడా. "వాడి డబ్బు వాడికివ్వడానికి ఇంత ఇదయిపోతారేం?" శంకరశాస్త్రి ఓపట్టాన తగ్గడు. "ఇప్పుడు డబ్బూ ఇవ్వాలి. తర్వాత లెక్కా చెప్పాలి. మరచిపోకు." "మీరు తినేసేరని అనుకోరు లెండి." తల్లిదండ్రులు చనిపోయిన నాటికి రామనాధానికి నాలుగెకరాల భూమి వుంది. ఆ పొలం మీద శిస్తు దాచి, పెంచి మరో నాలుగెకరాలు కొన్నాడు. అయితే అది నాలుగేళ్ళ క్రితంనాటి మాట. ఈ నాలుగేళ్ళ ఆదాయం ఎప్పటికప్పుడు అతని చదువులకే సెలవయిపోతూంది. నాలుగెకరాలున్నప్పుడు మిగిలింది. ఎనిమిదెకరాలున్నప్పుడు చాలక పోయిందా అంటారని ఆయన భయం. ఇదివరకు తాను కుర్రవాడికొక్కడికే సమాధానం ఇచ్చుకోవలసి వుండేదనీ, ఇప్పుడు వియ్యంకుడికి కూడా చెప్పుకోవలసి వస్తుందనీ అంటాడు. తమ తమ నెలవులు తప్పిన తమ మిత్రులె శత్రులౌట తథ్యము.. అంటూ సుమతీ శతక పద్యాన్ని భార్యకు గుర్తు చేస్తాడు. క్షణశ: కణశశ్చైవ విద్యామర్థంచ సాధయేత్‌ అని రామనాధానికి బోధ చేస్తాడు. కొసిరి కొసిరి అడిగిన దానికన్న మరో పదిరూపాయలు చేతులో పెడతాడు. "మళ్ళీ కావాలంటే పొరుగూళ్ళో ఎవరిస్తారు. ఈ పదీ దగ్గరుంచు" అంటాడు. అయినా అంత గందరగోళమూ, రభసా సాగవలసిందే. ఆ అనుభవంతో రాజమ్మ కుమారుడి మాటకు కంగారుపడింది. "నూరూ తీసుకెళ్ళి ఇంకా నెలేనా కాలేదు కాదట్రా." తన అవసరం ఏమిటో చెప్పాలి. రామనాధం తల్లికెదురుగా వంటింటి గడపమీద కూర్చుండబోయేడు. "పీట వాల్చుకో, గడపమీద కూర్చోకూడదు." "కూర్చుంటేనేమమ్మా!" మామూలు ప్రకారం అనేశాడేగాని, వాగ్వాదం పెట్టుకునే ధోరణిలో లేడు. మాట్లాడకుండా పీట వాల్చుకున్నాడు. "ఖద్దరు బట్టలకివ్వాలి. ఓ ఏభయి కావాలి." రాజమ్మ ఏదో భయానక వృత్తాంతం విన్నదానిలాగ గాభరా పడింది. "ఇప్పుడు బట్టలేమిట్రా, మొన్ననేకదా కుట్టించుకొన్నావు...." అందులోనూ అతడు దుప్పట్లూ, తుండ్లతోసహా తీసికొన్నానని చెప్పేసరికి ఆమె ఆశ్చర్యపడింది. "వెళ్ళేటప్పుడు దుప్పట్లు పట్టుకెళ్ళలేదూ?" పట్టుకెళ్ళకేం? పట్టుకెళ్ళేడు. కాని, కాలేజీ ఎదట రోడ్డుమీద అగ్ని సాక్షాత్కారం అయిపోయాయి. బట్టలను అగ్నిహోత్రంలో పడవెయ్యడంలో వున్న రాజకీయ ప్రాముఖ్యాన్ని అతడెంత చెప్పినా ఆమెకు అర్థం కాదు. బట్టలే కాదు, ఏ వస్తువునైనా పొదుపుగా వాడుకోవడం, అనవసరపు, అదనపు ఖర్చులు చేయకపోవడంలో వున్న ఆర్ధిక ప్రాముఖ్యం అతనికి అర్థం కాలేదు. తాననుకొంటున్న దానికన్న ఈ వ్యవహారం చాలా లోతుగా వున్నదనిపించి రాజమ్మ చాలా నిరాశపడిపోయింది. ఇప్పటికే ఆస్తిపాస్తుల వ్యవహారం వప్పచెప్పేస్తానని మగడు బెదిరిస్తున్నాడు. పెంచిన మమకారంలో ఆమె సర్దుబాటు చేస్తుందిగాని, ఆ మాటే అనేసింది. ఆ నిరాశతో చేతిలో ముద్ద విస్తట్లో పడేసి, గోడకి జారబడిపోయింది. "ఏమోరా! నీ పద్ధతి నాకేం బాగా లేదురా, బాగా చదువుతున్నావు. పైకొస్తావనుకుంటే, అది కాస్తా మానేశానంటావు. బోలెడంత ఖరీదుపోసి నిక్షేపంలాంటి బట్టలు కొనుక్కొని నిప్పుల్లో పారేశానంటావు..." హఠాత్తుగా అతని వొంటినున్న బట్టలు వెనకటివేనని గమనించింది. "నన్ను ఆడిస్తున్నావట్రా భడవా!" ఆమె చూపు గమనించీ, అభిప్రాయం గ్రహించీ రామనాధం తాను కట్టుకున్న బట్టలవేపు చూసుకొని సిగ్గుపడ్డాడు. ఇంటిదగ్గర వాడుకొనేటందు కుద్దేశించిన నేతపంచె కట్టుకున్నాడు. నలిగిందని పెట్టెలో పడేసిన చొక్కా ఒకటి తొడుక్కున్నాడు. రెండూ విదేశీ నూలుతో తయారు చేసినవే. విదేశీ వస్త్రాలు ముట్టకూడదని చేసిన ప్రతిజ్ఞను యద్దేవా చేస్తున్నట్లనిపించింది. సుబ్బమ్మగారు పట్టుకెళ్ళమనే అన్నారు. అయితే డబ్బివ్వనిదే తీసుకోవడం తనకే ఇష్టంలేకపోయింది. వెంటనే కట్టుకోడానికి రెండు జతలే తీసుకున్నాడు. "ఏవీ? ఎక్కడ పెట్టేవు?" ఈ నూతన వ్రతంలో అనాచారం కూడా ఒక భాగమేమోనని భయపడుతున్నట్లనిపించింది ఆమె కంగారు. "తోటలో వదిలిపెట్టి నారాయడికి కబురు చేశాను." ప్రయాణంలో మైలపడిన బట్టలు ఇంట్లో కలపనందుకు రాజమ్మ సంతృప్తిపడింది. కాని, కథంతా విన్నాక మరల వ్యధ పట్టుకుంది. ఆ సుబ్బమ్మ ఎవరో కొరివిలా దాపురించిందనిపించి మండిపడింది. "ఎవర్రా ఆ సుబ్బమ్మా, దిబ్బమ్మాను? మొగుడూ, మొద్దులూ ఎవరూ లేదా ఏమిటి, ఆవిడగారికి? ఇల్లా...." దువ్వూరి సుబ్బమ్మగారి వంటి వ్యక్తిని ఎరుగని అజ్ఞానంకన్న ఆమెను పట్టుకొని తిట్టడంలోని అపచారం అతనికెంతో బాధ కలిగించింది. అతని మాటలు విన్నాక రాజమ్మ తన అవజ్ఞతకు లెంపలు వాయించుకుంది. కాని, తన కొడుకును భర్త మీదికి రెచ్చగొడుతున్న ఈ చర్యకు మూలం అమెయేనన్న అభిప్రాయం మాత్రం మార్చుకోలేదు. అయితే డబ్బు సమస్యను పరిష్కరించే విషయం అల్లాగే వుండి పోయింది. భర్తముందు ఆ ప్రసక్తి తేవడానికామె సిద్దంగా లేదు. రామనాధం కూడా ఇప్పుడే డబ్బు మాట ఎత్తకూడదని ఆమె సలహా. "కాస్త కోపం తగ్గేక పంపొచ్చులే." కాని, డబ్బు పంపడం తన ప్రతిష్టతో ముడిపడి వుందనిపిస్తూంది. ముక్కు మొగం ఎరుగని తనకు, రాజమండ్రి వదిలి వెళ్ళిపోతున్న వాడికి ఏభయి రూపాయల బట్టలు అప్పిచ్చి పంపడానికి ఆమె చూపిన నిబ్బరాన్నీ, మానవులపై ఆమెకు గల విశ్వాసాన్ని చూశాక ఆమె మీద విపరీతమైన భక్తి పెంచుకున్నాడు. రెండు రోజుల్లో డబ్బు పంపుతాననీ, తరువాతనే తీసుకెడతాననీ చెప్పివచ్చేడు. ఇప్పుడా మాట తప్పితే తన మర్యాద ఏముంటుంది? రామనాధం ఒక్కక్షణం ఆలోచించి నిశ్శబ్దంగా లేచిపోయేడు. అతని ముఖం చూశాక రాజమ్మకు చాలా వేదన కలిగింది. ఇంతకాలం చేరదీసి పెంచిన కొడుకు దూరమైపోతున్నట్లనిపించింది. "ఒరే రాముడూ?" ఏదో నచ్చచెప్పాలనీ, సర్దుబాటు చెయ్యాలనీ తపన. కానీ అతడు అప్పటికే గుమ్మం దిగేసేడు. ఆమె పిలుపు వినబడనేలేదు. పదమూడు వంటింటి తలుపు గొళ్ళెం పెట్టి సావిట్లోకి వచ్చేసరికి, ఎవరో కిటికీకి ఎదురుగా మడత మంచం వాల్చుకొని పడుకుని వుండడం చూసి, విశాలాక్షి చటుక్కున ఆగింది. అంతలో రామనాధాన్ని గుర్తుపట్టి ముందుకు అడుగు వేసింది. "నువ్వుట్రా, హడలిపోయేను." రామనాధం కళ్ళ మీద చెయ్యి తీసేడు. అతడు వచ్చేసరికి విశాలాక్షి లోపల ఏదో పని చేసుకొంటూంది. బద్దకంగా వుండి మంచం వాల్చుకు పడుకున్నాడు. "ఈ లోపున ఏ దొంగాడైనా ఇల్లంతా చక్కపెట్టుకు పోవచ్చు. అంత బేఫరవాగా వున్నారు." "ఇప్పటివరకూ నాన్న ఇక్కడే వున్నాడు. ఎంగిలాకు పారేసి రావడానికి దొడ్లోకి ఇప్పుడే వెళ్ళేను. నువ్వు భోంచేసేవా?" "చేసే వస్తున్నా." "మరి ముఖం అల్లా వుందేం?" రామనాధం మంచం దిగి గోడనున్న అద్దం ముందు నిలబడ్డాడు. ముఖం డీలా పడ్డట్లు తనకూ తోచింది. "రాత్రి పడవలో సరిగ్గా నిద్రలేక అయివుంటుంది." "కాస్సేపు పడుకో. వుండు, తలగడ తెచ్చిస్తా." విశాలాక్షి లేచింది. రామనాధం వెనక్కి తిరిగేడు. "వద్దు, ఇప్పుడు నిద్ర రాదు. పనుంది కూడాను." "ఏమిటా ముంచుకుపోయే పని?" ఆ మాట అంటూనే లోపల నుంచి ఓ తలగడ తెచ్చింది. మంచం మీద అమర్చింది. "పడుకో." అతడు ఏ సమాధానమూ యిచ్చే లోపునే వీధి గుమ్మంలోంచి పిలుపు వినిపించింది. "వదినా!" పిలుపు వెనకనే మంగమ్మ లోపలికి అడుగు పెట్టింది. విశాలాక్షి "రావే" అంటూ ఆహ్వానించింది. "పైవాళ్ళెవరూ లేరు. మా తమ్ముడు." "ఎవరు, కలెక్టరు బావా?" రామనాధం ఇంగ్లండు చదువుకొనేటందుకు వెళ్ళడానికై చేస్తున్న ప్రయత్నాలు బంధువులలో కలిగించిన ఆశల ప్రతిధ్వని. మంగమ్మ అతని పెద్ద అత్తగారి కూతురు. రామనాధం నవ్వేడు. విశాలాక్షి చాపమీద కూర్చుంటూ ఆమెనూ ఆహ్వానించింది. "రావే. అందరివీ భోజనాలయేయా? ఇప్పుడే చెయ్యి కడుక్కున్నా." మంగమ్మ--"పోవాలి తల్లీ! నీకేం కూర్చోమంటావు" అంటూనే గోడను ఆనుకొని దూరంగా వట్టి నేలనే కూర్చుంది. రామనాధం హాస్యం చేశాడు. "నువ్వు చాపలో కూర్చోమనాలి కాబోలునే అక్కా!" మంగమ్మ ఎంతో విసువూ, ఆయాసమూ కనబరచింది. "కూర్చున్నట్లే వుంది. వారం రోజులనుంచి ప్రాణాలు తోడేస్తున్నారు." రామనాధం అర్ధంగాక అక్క ముఖం వంక చూసేడు. "వాళ్ళ చెల్లెలి పెళ్ళి కాదుట్రా? పనులు చేస్తున్నారు." "ఓస్‌ అంతేనా? ఊరందరి పనులూ నెత్తిన పడిపోయినట్లు అంటూంటేను." రామనాధం తేలికగా తీసివేయడాన్ని మంగమ్మ సహించలేకపోయింది. "మీకేమిటోయి మగ మహారాజులు! అన్నీ అమర్చి విస్తట్లో పెడితే 'ఓస్‌ ఇంతేనా' అని తేలికగా చప్పరించేస్తారు." ఆడవాళ్ళకు జరుగుతున్న అన్యాయాలన్నింటికీ రామనాధమే కారణం అన్నంత ఆవేశంతో మంగమ్మ చర్రుమనేసరికి అతడు పకపక నవ్వేడు. విశాలాక్షి చిరునవ్వు నవ్వింది. "నీ మెత్తదనం అనుకోక వాడి మీద కోపపడతావెందుకే?" అనవసరంగా ఆవేశపడ్డందుకు మంగమ్మ కళ్ళ నీళ్ళు పెట్టుకుంది. విశాలాక్షి లేచింది. "కనీసం వాళ్ళ పనులన్నా వాళ్ళను చేసుకోమనాలి." మంగమ్మ ఉడుకుబోతుతనంతో బుంగమూతి పెట్టింది. "నే వద్దంటున్నానా?" "వద్దనవు. కాని చెయ్యలేననీ అనవు." మంగమ్మ తన బలహీనతను సమర్ధించుకొంటున్నట్లు నసిగింది. "ఇంక వాళ్ళ చేత దెబ్బలు తినడం ఒకటి తరవాయి." దెబ్బల మాట వచ్చేసరికి రామనాధం విస్తుపోయాడు. కాని నమ్మలేకపోయేడు. "నిజంగా?.....' అప్పటికే తాను బయటపెట్టకూడనివి చాలా తేలిపోయినట్లు మంగమ్మ భయపడి లేచింది. "మీతో మాటలు పెట్టుక్కూర్చుంటే అయిందే. పోతా." "ఓ అర ఘడియలో నేనూ వస్తున్నా కూర్చో. అప్పుడే వాయ పెట్టేరా?" "రోకలి కోసం వచ్చా." "పంచలో వుంది పట్టుకెళ్ళు." మంగమ్మ లోపలికెళ్ళింది. విశాలాక్షి అనుతాపం తెలిపింది. "నోరూ, వాయీ లేదు. ఎల్లా బ్రతుక్కొస్తుందో పాపం! ఇరవయ్యేళ్ళు నిండలేదు. ఈ బతుకు యెంతకాలానికి తెల్లవారను?" రామనాధం అక్కగారి ముఖం వంక చూసేడు. ఒక్క మంగమ్మ కోసమేనా ఆమె విచారం? తనకి మాత్రం వయస్సెంతుంది? తన బ్రతుకేమిటి? కొడుకొకడున్నాడు గాని...... విశాలాక్షి ఆ హడావుడి ఎందుకో చెప్పింది. "పెళ్ళికి అటుకులు అంటూ ఓ బస్తాడు కొట్టిస్తున్నారు. అవన్నీ ఈ వెర్రిమొహం చేతి మీదుగా నడవాలి కాబోలు. ఇల్లు పట్టిన విధవ కూతుళ్ళుంటే ఊరికే పోనిస్తారూ...?" "పెళ్ళిళ్ళకి కూలీల్ని పెట్టి కొట్టించుకోకూడదూ?" "మడి ఎల్లాగ?" మడి అన్నది బ్రాహ్మణ్యానికి లక్షణమాయె. రామనాధం నిరుత్తరుడయ్యేడు. "నువ్వు పడుకో ఓ నిముషం. నాలుగు వాయల్లో పోటు వేసి చక్కా వస్తా." రామనాధం ఏమనడానికీ అవకాశం ఇవ్వకుండానే విశాలాక్షి లోపలికి వెళ్ళింది. బట్టలు మార్చుకొని తిరిగి వచ్చేసరికి అతడు పడుకుని వున్నాడు. వీధి తలుపు జేరవేసి వెళ్ళిపోయింది. ఆమె రావడం, వెళ్ళడం ఎరిగి వున్న రామనాధం కళ్ళమీది చెయ్యి తియ్యలేదు. ఏమేమో ఆలోచిస్తూ అలాగే పడుకుని వుండిపోయాడు. ఆ ఆలోచనలలో వుండిపోయి మంగమ్మ లోపలికి రావడాన్ని అతడు గమనించనేలేదు. మంగమ్మ ఒక్క నిముషం నిలబడింది. కళ్ళను మూసి వున్న చేతి క్రింద అతడు నిద్రపోతున్నదీ లేనిదీ తెలియలేదు. కాలి బొటనవేలు పట్టుకుని కదిలించింది. రామనాధం వులికిపడి లేచి కూర్చున్నాడు. "మీరా?" మంగమ్మ మందహాసం చేసింది. నెమ్మదిగానే అయినా వేళాకోళం చేయకుండా వుండలేకపోయింది. "ఎవరనుకొన్నావేం?" అతడు సమాధానం ఇవ్వడానికి అవకాశం ఇవ్వకుండానే తాను వచ్చిన పని చెప్పింది. "ఇందాక నేను అన్నది మనస్సులో పెట్టుకోకేం. మళ్ళీ ఎవరి దగ్గరా అనకు." ఎవరి దగ్గరా అనకూడని మాట ఆమె ఇందాక ఏమందో అతనికి అర్ధం కాలేదు. అదే అడిగేడు. మంగమ్మకు ఆశ్చర్యం కలిగింది. "అతిశయం పోకు." "నిజంగానే...." "దొంగాడు చెయ్యి కరుస్తాడే--అన్నట్లు జ్ఞాపకం చెయ్యడం కూడా ఎందుకులే." అన్నదే కాని ధైర్యం లేకపోయింది. రామనాధం ఆమె ముఖం వంక చూస్తూ, అడగడానికి సందేహించేడు. "ఒక్కటి అడుగుతాను. ఏమీ అనుకోరు కదా?" ఆమె అనుమానిస్తూనే అంది. "ఏమిటది?" "పార్వతి అభిమానంగా చూస్తుందా?" పార్వతి మంగమ్మకు అన్న భార్య. ఆమె రామనాధానికి బంధువురాలు కూడాను. మంగమ్మ మనస్సులోది చెప్పడానికి జంకింది. "అందరూ అభిమానంగానే వుంటారు." "సుబ్బారావు?" సుబ్బారావు ఆమె అన్న. ఆ ప్రశ్నలకు ఆమె చిరాకు కనబరచింది. "అమ్మా, నాన్నా వుండగా ఒకరి అభిమాన దురభిమానాలతో పనేం వుంటుంది." ఒక్క నిముషం వూరుకున్నాక తాను వచ్చిన పని చెప్పేసింది. "నేనేదో ఇబ్బందులు పడిపోతున్నానని మళ్ళీ ఎవరి దగ్గరన్నా అంటావేమో సుమా...." ఆమె భయం అతనికి అర్ధం అయింది. జాలీ, విచారమూ కలిగేయి. కాని తానామెకు ఏ విధంగా సాయం చెయ్యగలడు? వీరేశలింగం పంతులు గారి శరణాలయం జ్ఞాపకం వచ్చింది. కాని, ధైర్యంగా ఆ సూచన ఇవ్వలేకపోయేడు. సులభంగా చెప్పగలదీ, ఆమె వరకు తప్పు పట్టుకొంటుందనే భయం లేనిదీ ఒక్కటే. తన్ను ఏమన్నా అన్నారంటే నోరుకొక్కేసెయ్యమని చెప్పడానికి మనసు ఒప్పలేదు. అమాయకంగా ఎప్పుడూ నవ్వుతూ వుండే ఆమె ముఖాన్ని కసీ, కార్పణ్యంతో వూహించలేడు. అందుచేత మాట తప్పించాలనుకొన్నాడు. "మీ చదువు జరుగుతూందా?" మంగమ్మ కళ్ళనీళ్ళు తిరిగినట్లనిపించింది. "ఎక్కడో ఏదో దేశంలో ఆడపిల్లలు పుట్టగానే నదిలో మొసళ్ళకి పారేసే వారంటూ ఆ మధ్య చెప్పేవు. మన దేశంలో కూడా ఆ ఆచారం వుంటే ఎంత బాగుండునో....." రామనాధం తన నెత్తిన ఎవరో మొత్తినంత బాధపడ్డాడు. మనస్సులో ఎంత బాధ వుంటే ఆ మాట అని వుంటుందనిపించింది. తానా బాధకి ఏమి వూరడి ఇవ్వగలడు? రామనాధం వూరుకున్నాడు. "ఒక చిన్న సాయం చెయ్యగలవా?" తానామెకు చేయగల సాయం ఏమిటో? కాని, తానేదో సాయం చేయగలనని ఆమె అనుకోవడం చాలా గొప్ప అనిపించింది. 'చేయగలిగిందైతే'--అనే మినహాయింపు కూడా వుంచుకోకుండా మహోత్సాహంగా మంచం దిగేడు. "చెప్పండి." మంగమ్మ అటూ ఇటూ తొంగి చూసింది. "వీరేశలింగంగారి అనాథ శరణాలయంలో ఆడవాళ్ళకి చదువు చెప్పిస్తారట కదూ." తాను చేయదలచిన సూచన అదే. ఇప్పుడామె ఆ ప్రతిపాదన తెచ్చింది. తీరా ఆమె నోటినుంచే ఆ మాట వచ్చేసరికి అన్నీ అనుమానాలే కలిగేయి. బంధువులందరినీ కాదని శరణాలయంలో చేరాలి. ఆమె తండ్రి, అన్నలూ అంగీకరించి పంపరు. అక్కడ వితంతు వివాహం చేసేసుకొంటుందని భయం. తనంత తానుగా వెళ్ళితే మాత్రం, వెతకరూ? కనిపిస్తే లాక్కు వచ్చేస్తారు. నిగ్రహించి నిలబడగలదా? అన్నింటికన్నా పెద్ద చిక్కు వేరే వుంది. అగ్రహారాచారాల మధ్య పెరిగింది, అన్ని కులాల వాళ్ళతో కలిసి వుండగలదా? అన్నీ అనుమానాలే. "అదే అడగాలనుకొన్నా? ఏమనుకొంటారో....." మంగమ్మ అతని మాట పూర్తికాకుండానే ముందు కర్తవ్యం సూచించింది. "నువ్వు నాన్నని ఒప్పించాలి." రామనాధానికి నిరుత్సాహమే అనిపించింది. "జరిగినట్లే....." "ఒప్పించాలి మరి...."' అతనికి నమ్మకం లేదు. "నేను అడగమన్నట్లు చెప్పేవు గనక....." ఔచిత్యానౌచిత్యాలు ఎరగని కుర్రవానికి చెప్పినట్లు చెప్పడం అతనికి కష్టం తోచింది. "అంత తెలియనివాడిననుకొన్నారా యేమిటి?" "అదికాదోయి." రామనాధం కష్టపెట్టుకొన్నట్లు ఒక్క నిముషం వూరుకున్నాడు. "కోపం వచ్చిందా?" "మనస్సు నొచ్చే మాటకి కోపం ఎందుకేమిటి?" మంగమ్మ అంత భయమూ, ఆదుర్దాలోనూ నవ్వేసింది. "మళ్ళీ వదిన వచ్చేస్తుంది. మరిచిపోకు. మా నాన్నకి నచ్చ చెప్పాలి." గిర్రున వెనుతిరిగింది. తన మాటమీద ఆ విశ్వాసం వుంచుతారనే ఆ దిలాసా ఏమిటో, అడుగుదామనుకుంటుండగానే ఆమె వెళ్ళిపోయింది. పద్నాలుగు విశాలాక్షి అటుకుల వడ్లపోటు నుంచి తిరిగి వచ్చేవరకూ రామనాధం అక్కడే కూర్చున్నాడు. తన సమస్యకు పరిష్కారమార్గం అతడెరగడు. అడగడానికైనా అక్కకన్న దగ్గరవాళ్ళూ, మనసిచ్చే వాళ్ళూ కనబడలేదు. ఆమె చూపాలి దారి. వస్తూనే విశాలాక్షి తమ్ముడక్కడే వుండడం చూసి, ఆశ్చర్యం కనబరచింది. "ఇక్కడే వున్నావుట్రా, వెళ్ళిపోయేవనే అనుకొన్నా, అక్కడ నరసం పిన్ని ఏదో గొడవలు విడేసింది, వదుల్చుకు రావడం మర్యాద కాదు. అక్కడికీ వీధి తలుపు గొళ్ళెం పెట్టి వచ్చేనని చెప్పి వచ్చేశా." "నువ్వు రాలేదని....." "ఉండు, వస్తున్నా కాళ్ళు కడుక్కుని." కాళ్ళు కడుక్కుని వస్తూ నాలుగు అరటి పళ్ళు తెచ్చింది. "తీసుకో, దొడ్లో నూతి దగ్గరున్న అమృతపాణీ బోదె వేసింది. మంచి గెల పడింది. విశాలాక్షి మళ్ళీ లోపలికెళ్ళి గుండ్రటి కంచు చెంబుతో మంచినీళ్ళు తెచ్చి మంచం పక్కనే వున్న కిటికీలో పెట్టింది. గృహస్వామినిగా తన బాధ్యతలు పూర్తి అయినాక చాప పరుచుకొని కూర్చుంది. "ఏమిట్రా సంగతులు? ఏమిటి ఇప్పుడొచ్చేవు, సెలవులేమన్నా వున్నాయా?" ఇంతవరకూ ఆ ప్రశ్న రాలేదేమనుకొంటున్న రామనాధానికి తాను కాలేజీ వదిలి వచ్చేసిన సంగతి తన అక్క చెవిన పడనేలేదని అర్థం అయింది. దాపరికం ఏముంది? చెప్పేసేడు. అతడు గాంధీగారి ఆదేశానుసారం కాలేజీ మానేశాననేసరికి విశాలాక్షి మ్రాన్పడిపోయింది. భవిష్యత్కార్యక్రమం గురించి అస్పష్టంగా వున్న తన ఆలోచనలు ప్రస్తరించేసరికి ఒక్క నిట్టూర్పు విడిచింది. "బాగుంది నాయనా! బాగుంది." ఆ కంఠంలోని నిరసన భావాన్ని గమనించినా అతడు గుర్తించదలచుకోలేదు. డబ్బు పంపించవలసిన అవసరం అతనికి మరో ఆలోచనను తోచనివ్వడం లేదు. "శంకరం బాబాయి ఎక్కడికో వెళ్ళేడు. ఇప్పుడు మని ఆర్డరు చెయ్యాలి. ఏభయి రూపాయలు అవసరం." ఎందుకని అడగను కూడా లేదు. ఆ మొత్తం వినేసరికే ఆమె హడలిపోయింది. తమవన్నీ చిన్న చిన్న సంసారాలు. నిల్చున్నపాటున ఏభయి రూపాయలు సర్దగలవాళ్ళు అసలా వూళ్ళో మాత్రం ఎందరున్నారు? మిగిలిన వాళ్ళకన్న రామనాధం వాళ్ళే నయం. శంకరం బాబయ్యకి వడ్డీ వ్యాపారం కూడా వుంది. ఆ విషయాన్నే మరో విధంగా చెప్పింది విశాలాక్షి. "ఏభయి రూపాయలే, బాబాయి వచ్చేలోపున అంత తొందరేం వచ్చింది?" రామనాధం నిరుత్సాహంగా అన్నాడు... "వచ్చింది." విశాలాక్షి ఒక్క నిముషం ఆలోచించింది. ఆమెకు వేరు దారి తోచలేదు. "బాబాయి వూళ్ళోనే వుండాలిరా. పొద్దుట చెరువుకెడుతూ రావి క్రింద చూశాను. ఎక్కడికెడతాడు?" ఇంక ఆ అవసరం ఏమిటో చెప్పక తప్పలేదు. అంతా విని విశాలాక్షి ఒక్క నిట్టూర్పు విడిచింది. "ఇహ నీదన్నమాట వంతు." వంతు ఆస్తి పాడు చేసుకోవడంలోనని విశాలాక్షి వుద్దేశం. ఇంత క్రితం ఆమె తండ్రి తన వంతు పని చేసేడు. కాంగ్రెసు సభలనీ, ఆంధ్రరాష్ట్ర మహాసభలనీ, రాజకీయ సమావేశాలనీ వెళ్ళి రావడానికి ఆయన తన వంతుకు వచ్చిన అయిదు ఎకరాలలో సగం ఇప్పటికే అమ్మేశాడు. మిగిలిందానికి సరిపడా అప్పు వుంది. వ్యవసాయ పంటలకి కాస్త ధరలు పలుకుతున్నాయి గనుక అప్పులాళ్ళు వూరుకున్నారు గాని, లేకుంటే అది కూడా ఎప్పుడో అయిపోయేది. శుభ్రంగా చదువుకుంటున్న తమ్ముడు కాలేజీ వదిలేసేనన్నప్పటికన్న బట్టల కోసం ఒక్కమారుగా ఏభయి రూపాయలు అప్పు చేసేననే సరికి ఆమెకు ఎక్కువ భయం, ఆదుర్దా కలిగింది. వుండబట్టలేక పోయింది. తన తండ్రి ఆస్తి పాడుచేసేడనే అభిప్రాయాన్ని ఆమె ఎన్నడూ బయటకు తేలేదు. తనకో నాలుగెకరాలు వుంది. తిండికీ, పిల్లవాడి చదువుకీ లోటు లేదు. ఆయనకు మాత్రం ఆ భూమి మిగిలి ఏం వుద్దరిస్తుంది? మరింకెవ్వరు మాత్రం వున్నారు? అని సర్దుకొంది. ఎవరన్నా తన తండ్రి ఆస్తి పాడుచేసేడన్నా ఒప్పుకొనేది కాదు. ఆయనతో ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు తమ యింటికి అప్పుడప్పుడూ రావడం పెద్ద గొప్పగా అనిపించేది. ఓ మారు తమ ఊరిలోని వివేకోదయ పుస్తక భాండాగారానికి వార్షికోత్సవం జరిగినప్పుడు కాశీనాథుని నాగేశ్వరరావు వచ్చేరు. ఆయన తమ ఇంటనే బస చేసేరు. అల్లాంటి పెద్దవాళ్ళతోడి పరిచయాలు, ఆ గొప్పదనం ఆస్తి పోతూందన్న కష్టాన్ని తోచనీయలేదు. అయితే అటువంటి గొప్పతనం కోసం తన తమ్ముడు ఆస్తి పోగొట్టుకోడం ఇష్టం లేదు. తన తండ్రి అంటే వయసు మళ్ళినవాడు. తాను తప్ప ఆయనకెవరూ లేరు. తనకాయన ఆస్తి లేకపోతుందనే బాధ లేదు. కాని రామనాధం కుర్రవాడు. అతని విషయంలో ఆమె వూహించుకుంటున్న గొప్పతనం వేరు. బాగా చదువుతూంటే పెద్దరికం వుంటుంది. పెద్ద వుద్యోగస్థులతో బంధుత్వాలు కలిస్తే అంతస్థు పెరుగుతుంది. మంచి ఉద్యోగం అయిందంటే ఆ అంతస్థు నిలబడడమే కాదు, పెరుగుతుంది. ధనం లభిస్తుంది. ఈ మాదిరి కల్పనలతో ఆమె తమ్ముడి భవిష్యత్తు గురించి ఊహలల్లుతూంది. దానికి తగినట్లుగానే అతని జీవితం నడుస్తూంది. బాగా చదువుతున్నాడు. సర్కిలినస్పెక్టరంత వాడు వెతుక్కుంటూ వచ్చి పిల్లనిచ్చేడు. ఇంగ్లండు పంపించి, ఐ.సి.ఎస్‌. చదివించాలనే ప్రయత్నాలలో వున్నారు. ఏ జిల్లాకో కలక్టరయి వస్తాడు. తమ వూళ్ళో ఘనాంత స్వాధ్యాయులున్నారు. భాష్యాంత వైయాకరణులున్నారు. పేరున్న మంత్ర శాస్త్రవేత్తలున్నారు. కాని ఇంగ్లీషు పెద్ద చదువులు చదువుతున్నది చాలా కొద్దిమంది. ఓ పుంజీడుకు మించరు. ఒక్క నాలుగైదేళ్ళలో అంత పెద్ద పరీక్ష నిచ్చేవాడు తమనాట అతడొక్కడే వుంటాడు. అదెంత గొప్పదనం? తమ కుటుంబానికే ఎంత ప్రతిష్ఠ! హఠాత్తుగా ఈ వార్త విన్నప్పుడు దాని ఫలితాలు ఏ విధంగా వుంటాయో ఆమె కర్థం కాలేదు. ఉన్న బట్టలు తగులబెట్టేసి, మరల అప్పుచేసేడన్న వార్త వినేసరికి దాని లోతులు అర్థం అయినట్లు తోచింది. ప్రాణం వుసూరుమంది. తన తండ్రి అప్పులు చేయడం, ఆస్తి పోవడం గుర్తు వచ్చింది. ఆ సాంప్రదాయాన్ని అందిపుచ్చుకున్నాడో యేమో! ఆ ఆవేశంలో అంది. "ఇంక నీదన్నమాట వంతు." రామనాధం తిరగబడి చూసేడు. అతని సమస్యకు దారి చూపుతున్నాననుకోకుండానే విశాలాక్షి హితోపదేశం చేసింది. "నాన్నలాగ ఇంక అణాబిళ్ళ మీద సంతకాలకు దిగుతావు కాబోలు, అటువంటి పని మాత్రం చెయ్యకు. శంకరం బాబాయి ఆవాలన్నీ ముద్దచేసి నువ్వేదో నిర్వాకం చేస్తావని జాగ్రత్త పెట్టేడు." తనకు ఉపకారం చేస్తున్నవారి మనస్సులు నొప్పిస్తున్నాననే ఆరోపణకు రామనాధం సిగ్గుపడ్డాడు. "ఇంతకీ ఏం చేశావో బాబయ్యకి చెప్పేవా?" ఔను, కాదు తేలని విధంగా రామనాధం తల వూపేడు. "అమ్మకి చెప్పా." "ఏమంది?" "ఏమీ అనలేదు." ఆ మాట నమ్మలేక విశాలాక్షి అతని ముఖం చూసింది. తాను చదువు మానినట్లు విన్నాక పెత్తల్లి రాజమ్మ ఏమందో వరసగా చెప్పలేకపోయేడు. ఏదో అంది. తిట్టలేదు, కోప్పడా లేదు, అంతే. అంతవరకే చెప్పగలిగేడు. రామనాధం లేచేడు. తాను చేసిన పనికి కనీసం తన పెదతండ్రిగారింటి వద్దనైనా అభినందన లభిస్తుందనుకున్నాడు. కాని, నిరాశ కలిగింది. ఎక్కడో చోట డబ్బు చూచి మనియార్డరు చెయ్యాలి. ఎవరిస్తారు. ఆలోచించుకొనేటందుక్కూడా విశాలాక్షి అవకాశం ఇవ్వడం లేదు. "కూర్చో, ఇప్పుడెక్కడికెడతావు?" "కాదు, బాబాయిని పట్టుకోవాలి." విశాలాక్షి ఏమీ అనలేకపోయింది. "అప్పులు మాత్రం మొదలెట్టకు. ఓ రోజు ఆలస్యమయితే మునిగి పోయింది లేదు." "ఊ"--అన్నాడేగాని ఆలోచిస్తే మరోలాగ తోచింది. శంకరం బాబాయితో ఇప్పుడే డబ్బు కోసం పేచీ పడడం కూడా మంచిది కాదనుకున్నాడు. తర్వాత ఎలాగూ తప్పదు. ఇప్పుడు కాదు, మరి! ఒక్కటే దారి! పదిహేను తోటలోకి తిరిగి వెళ్ళేసరికి మిత్రబృందం నలుగురూ పాక ఎదుట మామిడిచెట్టు క్రింద కొబ్బరితడకలు పరచుకొని కూర్చుని వున్నారు. అతడిని చూడగానే నలుగురూ ఏక కంఠంతో వుత్సాహం తెలిపేరు. "అడిగోరా." "నీ కోసమే ఎదురు చూస్తున్నాం." రామనాధం కూడా వాళ్ళని చూసి అంత సంతోషమూ ప్రకటించేడు. "వీధిలో ఎవ్వరూ కనిపించలేదు. ఏమయిపోయారా అనుకున్నా. ఇక్కడ తేలేరన్నమాట." రామనాధం అటూ ఇటూ చూశాడు. "సూరప్ప కనిపించడేం?" "జగ్గయ్య కొట్టుకెళ్ళేడే." ఎందుకో చెప్పవలసిన పనిలేదు. ఏ పకోడీలో వేసుకొనే ప్రయత్నంలో సరుకులు తేవడానికి వెళ్ళేడు అన్నమాటే-- మిత్రులు నలుగురూ తలో అణా వేసుకొని సరుకులు తేవడం, ఏ పకోడీలో, ఉప్మాయో చేసుకుని తింటూ కాలక్షేపం చేయడం ఆ కూటానికో అలవాటు, హఠాత్తుగా ఏ అర్థరాత్రి ఎవరికి గుబులుపుట్టినా కూటాన్నంతనూ లేపుకొస్తాడు. ఊరికి అతి సమీపంలో పెద్ద చెరువుగట్టు నానుకొని రామనాధం పొలం, మకామూ వుండడంచేత చోటుకోసం వెతుక్కోనక్కర్లేదు. ఏ చెట్టుక్రిందనో పొక్కిళ్ళు పెట్టేస్తారు. "ఇంకా ఇల్లా కూర్చున్నారేం?" "నీ కోసమే." "లేవండి." నరసింహం లేచి, క్రింద పరుచుక్కూర్చున్న తుండు తీసి దులిపి పైన వేసుకున్నాడు. "నువ్వే వెళ్ళి ఓ అరడజను అరటికాయలు విరుచుకురా."--అని రామనాధానికి పని పురమాయించేరు. "మీరెవరన్నా తెస్తే....." అర్ధోక్తిలోనే నరసింహం భయం ప్రకటించేడు. "వద్దురా నాయనా! మీ బాబాయి దూర్వాసుడి అవతారం." "ఆ. మీరు మరీరా. మనం ఇక్కడ ఏం చేస్తున్నామో ఆయన ఎరగడంటావా? ఎప్పుడూ ఏమీ అనలేదు." "ఔననుకో.....అయినా..... నువ్వు కోసిన దారి వేరు.... కనీసం నువ్వుండగా కోసినా...." "సింగినాదం కాదూ..." ఈ మాదిరి సంభాషణ పాఠభేదాలతో తరచు సాగుచుండేదే. కాని ఎవ్వరూ, ఎప్పుడూ ఆ హద్దులు దాటడానికి ప్రయత్నించలేదు. మిత్రులకు దిలాసా ఇస్తున్నా రామనాధం తానే ఏ కొడవలో తీసుకొని బయలుదేరకనూ పోలేదు. ఇప్పుడూ అంతే జరిగింది. "నిచ్చెన ఎక్కడుందో చూసేరట్రా." "ఇంతోటి దానికి నిచ్చెన కూడా ఎందుకు? రా." అని నరసింహం ముందుకి అడుగు వేసేడు. "ఏ చెట్టు నున్నాయో కూడ చూసి ఏర్పాట్లు చేసినట్లే వుందే?" నరసింహం చిరునవ్వు నవ్వేడు. "ఉండు. కొడవలి తెస్తా." నరసింహం అదీ అనవసరమేనన్నాడు. అతడు చెట్టు ప్రక్కన నిలుచుంటాడు. రామనాధం అతని భుజంమీద నిలబడి గెల నుంచి కాయలు విరచి పడేస్తాడు. "చొన బట్టల మీద పడి తగులబడతాయిరా?"--అని రామనాధం భయపడ్డాడు. కాని నరసింహానికి ఆ భయం లేదు. తన భుజంమీద వుండేది రామనాధం. విరిచి క్రింద పడేసిన అరటి కాయల్ని ఏరుతూ నరసింహం హఠాత్తుగా ప్రశ్నించేడు. "ఏమిట్రా. నువ్వు కాలేజీ మానేశావు అన్నారు నిజమేనా?" "ఎవరన్నారు?" "ఎవరంటేనేం? నిజమేనా, కాదా?" సరాసరి సమాధానం ఇవ్వకుండా ఎదురు ప్రశ్నలతో అసలు విషయాన్నిసూచించడం అగ్రహారపు సంభాషణ పద్ధతి. "మానడం మంచిదంటావా, కాదంటావా?" "అదేమి ప్రశ్నలే." "ప్రశ్న కాకేం?" రామనాధం తన మనస్సులో చెలరేగుతున్న ఆందోళనను నాలుగు మాటలలో చెప్పేడు. కాలేజీ మానేసిన మాట నిజం. ఆ రోజున సభలో ఆ ప్రతిజ్ఞ తీసుకొన్నప్పుడు అంతా చప్పట్లు కొట్టేరు. రాజమండ్రి కాలేజీ ప్రతిష్ఠను నిలబెట్టేడన్నారు. "బ్రహ్మరథం పట్టేరనుకో." వందేమాతరం వుద్యమం రోజుల్లో రాజమండ్రి కాలేజీలో చదువుతున్న గాడిచర్ల హరిసర్వోత్తమరావు అనే యువకుడు వందేమాతరం బాడ్జి పెట్టుకుని కాలేజీకి వెళ్ళేడు. ప్రిన్సిపాల్‌ ఎగిసిపడ్డాడు, ఆయనను పంపేసేడు. ఇంక అంటుకుంది. వెన్నేటి సత్యనారాయణ మొదలయినవారు అనేకమంది హరిసర్వోత్తమరావుననుసరించేరు. అదో పెద్ద వుద్యమమే అయింది. దానికి ఫలితంగా రాజమండ్రిలో జాతీయ పాఠశాల ఒకటి ఏర్పడింది. ఆ పాఠశాలలోనే చదువుకొన్న నరసింహానికి రామనాధం నిర్ణయం చాలా సంతోషం కలిగించింది. కాని.... రామనాధం భవిష్యత్తుమీద అతని బంధువులు పెట్టుకొన్న ఆశలు వారికే పరిమితంగా లేవు. అందుచేతనే ఆ సంతోషంలో కూడ ఏదో వెలితి కనిపిస్తూనే వుంది. "కాని...కాలేజీ వదిలెయ్యడం మంచిదేనా!" అని మిత్రుడు ప్రశ్నిస్తూంటే నరసింహం ఏమీ చెప్పలేకపోయేడు. ఆ ప్రశ్నే పకోడీల బాణలి వద్ద మరో రూపంలో ప్రత్యక్షమైంది. బాణలిలో వేగుతున్న పకోడీని ఒక పుల్లతో గుచ్చి పైకి లాగేటందుకు ప్రయత్నిస్తూ శివరామయ్య ప్రశ్నించేడు. "ఏం పనిరా?" "ఏం చేస్తే బాగుంటుందంటావు?" వేగుతూ వేగుతున్న పకోడీని పళ్ళ మధ్య గిట్టకరచి పట్టుకొని నోటి వూర్పుతోనే చల్లార్చ ప్రయత్నిస్తున్న శివకామయ్య ఆ ప్రశ్నకు సమాధానం ఎరిగి వున్నా చెప్పలేదు. అల్లాంటి ప్రశ్నలు సాంబావధాన్లకి మహా చికాకు. ముందేం వుందో చూసుకోకుండా ఏ మనిషీ అడుగు వెయ్యకూడదని అతని ఉద్దేశం. చర్రుమన్నాడు. "గాడిదల్ని కాయి." సభాసదులంతా గొల్లున నవ్వేరు. శివకామయ్య నవ్వబోయి పెదవులూ, నాలుకా కాల్చుకున్నాడు. ఆ గంద్రగోళంలో సమస్య కొంత వెనుకబట్టినా మళ్ళీ అదే ప్రశ్న వచ్చింది. ఏదో ఒకటి చెప్పాలి గనక రామనాధం చటుక్కున అనేసేడు. "వ్యవసాయం....." "ఆ మాత్రం దానికయితే పరీక్షల ముందు కాలేజీ మానుకోవడం ఎందుకు?" అన్నాడు శివకామయ్య. "అదీ ప్రశ్నే." నరసింహం తన సమాధానం అందించేడు. "ఇంగ్లీషు తెల్లవాళ్ళ భాష. వాళ్ళకి కావలసిన గుమాస్తాల్ని తయారు చేయడంకోసం మనకి చెపుతున్నారు. స్కూళ్ళూ, కాలేజీలలో వాళ్ళు తమ గొప్పదనాన్ని నూరిపోస్తున్నారు. మనకి తాటేకులు కడుతున్నారు. మన అభిమానాల్ని చంపేసి తమకి తాళం వేసే వాళ్ళనిగా చేస్తున్నారు. ఆ ధోరణిలో నరసింహం ఎంత సేపన్నా చెప్పుకు పోగలడు. అదే అసలు ప్రశ్నకు సమాధానం కాదు. అవధానులు తృణీకరించేసేడు. "పోరా పక్షీ! ఇంగ్లీషు చదువుకొని యెంతెంతటి డాక్టర్లవుతున్నారు?" "గంటకు వేల రూపాయలు ఫీజు తీసుకొనే గొప్ప గొప్ప వకీళ్ళు మాత్రం?" అన్నాడు రామన్న. సూరప్పకి ఇంగ్లీషు వైద్యులన్నా, వైద్యాలన్నా నమ్మకం లేదు. అతని తండ్రి ఆయుర్వేద వైద్యుడు. దిగ్దంతులనుకొనే ఇంగ్లీషు వైద్యులు పేరు గూడా పెట్టలేని గడ్డు రోగాల్ని తానెల్లా కుదిర్చేడో, చరక సుశ్రుతాలూ, భావప్రకాశాల్లోంచి శ్లోకాల సాయంతో ఆయన చెపుతూంటాడు. ఆ మాటల్నే మరికొంచెం నిందపాలు కలిపి సూరప్ప వివరించపోయేడు. "తానూ మనిషే. తవుడూ, ఓ రొట్టె-నీ...." అంటూ సూరప్ప ప్రారంభించేడు. ".....ముండా రంగు నీళ్ళూ ఓ మందే..." అని అవధాని సూరప్ప మాటను మధ్యలోనే అందుకుని పూర్తి చేసేడు. మళ్ళీ కూటం యావత్తూ ఫక్కుమంది. సూరప్పకి కోపం వచ్చింది. "తెల్లవాడు ఏం చేసినా నోరు తెర్రబెట్టుకుని హాహా. హోహో.... అని భజన చేస్తే." "నాకు నచ్చిన మాటలు చెప్పేవురా. లేకపోతే...." అంటూ రామనాధం అతనిని ప్రోత్సహించబోయేడు. కాని సూరప్పకి నమ్మకం లేదు, కోరచూపులు చూస్తూ విదిలించివేసేడు. "ఒరేయి నాకు తైరు కొట్టకు." అవధాని ఫక్కుమని నవ్వేడు. ప్లీడరు వృత్తియెడ అక్కడున్న వారెవ్వరికీ సదభిప్రాయం లేదు. ఆ జీవితం అబద్ధాల పుట్టయని ఈసడింపు. అనేకరకాల వాదనలు. అనేక వృత్తులూ, ఉద్యోగాలూ, మంచిచెడ్డలూ పున:పునరావృత్తం అయ్యాయి. సమస్యలు బయలుదేరిన చోటనే ఉండిపోయాయి, తాను చేయదలచుకోనివేమిటో రామనాధం లెక్క తేల్చేడు. "నేను చదవదలచుకోలేదు." "నేను ఉద్యోగం చేయదలచుకోలేదు." "దేశానికి నష్టం కలిగించే పని చేయబోవడం లేదు." అతడు చదువు మానడం, ఉద్యోగం చేయక పోవడం దేశానికి లాభమో నష్టమో చెప్పగల స్తోమత అక్కడున్న వారెవరికీ వున్నట్లు లేదు. శివకామయ్య సమాధానం వాళ్ళ మనఃస్థితిని ప్రకటించింది. "దేశానికి కష్టమో, నష్టమో జరిగిపోయింది. జరుగుతూనే వుంది. పరీక్షలు నాలుగు నెలల్లో వున్నాయి. పరీక్ష ఇస్తే గుమాస్తా పని చెయ్యాలనే నిర్బంధం ఏమీ లేదు కదా, ఆ పరీక్ష పూర్తి అయ్యేలోపున వచ్చే అదనపు నష్టం ఏమిటి?" రామనాధం ఆలోచించేడు. తాను చేసింది ఆవేశకృతమూ, అజ్ఞానకృతమూ మాత్రమేనా? ఆ మాటనాతడు ఒప్పుకోలేడు. సమాధానం ఇచ్చేలోపున రామన్న సమాధానం ఇచ్చేడు. "మంచిది కాదనుకొన్నాక ఆ పని పూర్తి చెయ్యకూడదా--అంటావేమిట్రా?" శివకామయ్య అంతతో వూరుకొనే మనిషి కాదు. "బాగుందోయ్‌. మంచిది కాదు. బ్రహ్మాండంగా వుంది. మరి మంచిదనుకున్నదేదో చెయ్యవద్దుట్రా." రామనాధం తన మార్గాన్ని మళ్ళీ వారి ముందు పెట్టేడు. "వ్యవసాయం...." "మళ్ళీ అదే మాటా..." అని నరసింహం అడ్డు తగిలేడు. అతడు కాకపోతే అతని వూరి వాళ్ళూ, జిల్లాలో వాళ్ళూ, దేశజనాభా నూటికి ఎనభయ్యయిదు, తొంభయి వంతుల మంది జీవనాధారమే అదాయిరి. అది కూడా ఈవేళ నుంచి కాదు. వందలు, వేల యేళ్ళ నుంచి, తరాల తరబడి ఆ మంచి పనేదో చేస్తూనే ఉన్నారు. అయినా దేశానికి అన్యాయం జరిగిపోతూనే వుంది. ఇంగ్లీషు వాళ్ళొచ్చేరు. అంతకు ముందు మరొకరు, వారి ముందు ఇంకొకరు. ఎవరికి కావలసిన చదువులు వారు మన నెత్తిన రుద్దుతూనే వచ్చేరు. మనవాళ్ళు చేస్తూ వచ్చిన మంచి పని--ఆ వ్యవసాయం వాటిని వేటినీ మార్చనేలేకపోయింది. "ఇప్పుడు నువ్వు కూడా ఆ మంచి పనికి దిగుతానంటున్నావు. బాగుంది చెయ్యి. అంతోటి గుమాస్తాల్ని తయారు చెయ్యడానికి తెల్లవాళ్ళు చేస్తున్న అన్యాయం ఏమవుతుంది? దానిని తొలగించడానికి నువ్వేం చేస్తావు?" శివరామయ్య వాదనను వెక్కిరించడం తప్ప సభాసదుల వద్ద సమాధానం లేదు. ఆ లోపాన్ని మామూలు పద్ధతిలోనే పూర్తి చేశారు. "మన సన్యాసికి అక్షరాలు వొంటబట్టలేదు గాని, గొప్ప వకీలు కావలసిన బుర్ర కాదూ, కొద్దిలో ఆ గీత తప్పిపోయింది కాని...." మళ్ళీ అందరూ ఫక్కున నవ్వేరు. ఆ నవ్వులలోనే అంత ముఖ్యమైన సమస్యనూ తేలగొట్టేసేరు. లేచారు. పదహారు "పెద్దనాన్న ఏరమ్మా?" అంటూ వాకిట్లోకి వచ్చిన రామనాధాన్ని చూస్తూనే లచ్చమ్మ ఎంతో సంతోషం ప్రకటించింది. అతని ప్రశ్నకు సమాధానం ఇవ్వాలనే ఆలోచన కూడా మరిచిపోయి అతనిని ప్రశ్నలతో ముంచెత్తింది. "ఎప్పుడొచ్చేరు బాబూ!" "రమణయ్య ఎల్లా వున్నాడు?" కొడుకును గురించిన ప్రశ్నలకు అంతు లేదు. వెంకటరమణ ఆమె కొడుకు. "ఒళ్ళు వెచ్చదనం లేకుండా వున్నాడా?" "మీకు కనిపిస్తుంటాడా?" ఆ వెనువెంటనే అతడు చూపుతున్న నిర్లక్ష్యాన్ని గోడు వెళ్ళబోసుకుంది. "ఒక్క ఉత్తరం రాయడు." "పోనీ వాడన్నా సుఖంగా వుండనీ"--అని మనస్సును ఊరడించుకోడానికి ప్రయత్నించబోయింది. కాని ఆ సంతృప్తి ఎంతోసేపు నిలుపుకొనలేకపోయింది. "అమ్మంటూ ఒకర్తి బతికివుందనేనా అనుకుంటాడా రాంబాబూ" అంది అక్కసు కంఠాన్ని రుద్ధం చేస్తూంటే... రమణ మనస్సులోని కష్టం ఏమిటో రామనాధం ఎరుగును. రామనాధమే కాదు లచ్చమ్మా ఎరుగును. ఆమె విశ్వనాధానికి చట్టరీత్యా భార్య కాదు. భార్య పోయిన తర్వాత విశ్వనాధం ఆమెను చేరదీశాడు. చాకలి చెరువు గట్టున పొలంలో ఇల్లు కట్టి ఆమెనక్కడ వుంచేడు. వారికో పిల్లవాడు కలిగేడు. వాడు అతనిని నాన్నగారూ అనే పిలుస్తాడు. ఆ పిల్లవానికి చదువు సంధ్యలు చెప్పిస్తున్నాడు. లోకవృత్తంలో వారు భార్యాభర్తలే. గాని వారి కులం ఒకటి కాదు. అతడు భోజనం మాత్రం ఇంటి వద్ద చేసి, మిగిలిన గంటలన్నీఆమెతోనే గడిపినా సమాజం వారిని భార్యాభర్తలుగా ఆమోదించలేదు. వెంకటరమణ తన జన్మకారణమైన ఈ బాంధవ్యాన్ని గుర్తు చేసుకొనేటందుక్కూడా ఇష్టపడలేకున్నాడని రామనాధానికి తెలుసు. కాని, ఆ మాటలను లచ్చమ్మకు చెప్పలేడు. లచ్చమ్మ చూచాయగా అర్థం చేసుకొనకపోలేదు. కాని, దానిని విశ్వసించేటందుకు సిద్ధంగా లేదు. "నీ వెర్రి నీది, ఒక వారం రోజులు వుత్తరం రాయడం ఆలస్యమైతే..." అంటూ విశ్వనాధం సర్దబోయేడు. "ఒక వారమా, రెండు నెలలయింది." అంటూ లచ్చమ్మ తేదీలు లెక్కబెట్టింది. "అయితే కావచ్చుననుకో, చదువులూ, పరీక్షలూ, ఏదో హడావిడి. దానికి తోడు మనం వుత్తరం వ్రాయలేదని వేధిస్తూంటే...." విశ్వనాధం ఆమెను వూరుకోబెట్టేందుకు చెప్తున్నాడో, నిజంగానే నమ్ముతున్నాడో రామనాధానికి అర్ధం కాలేదు. కాని, దానిని సూచనగా తీసుకోవడంలో ఆటంకం కనిపించలేదు. రమణ చదువులో ఎంత శ్రద్ధ చూపుతున్నాడో, తిండి వేళప్పుడు కూడా అతని చేతిలో పుస్తకం ఎలా తెరిచే వుంటూందో వర్ణించేడు. "నేను వచ్చేసే రోజున వాడిని కలుసుకొందామని హాస్టలుకెళ్ళేను. గదిలో లేడు. కూర్చున్నా, ఎంతకీ వాడు రాడు. ఇంతలో ఎవరో చెప్తే భోజనాలకేసి వెళ్లేను. అక్కడో చెట్టు క్రింద మనవాడు చదువులో మునిగిపోయి కాఫీకి గంట కొట్టిన సంగతి కూడా ఎరుగడు." రామనాధం అతని శ్రద్ధను సుదీర్ఘంగా వర్ణించి, వర్ణించి అతని తరఫున క్షమాపణ వేడుకున్నాడు. "పాపం నలిగిపోతున్నాడు. ఒక్క క్షణం కూర్చోడం లేదు. కాలేజీ ఫస్టు రావాలనే పంతంతో చదువుతున్నాడు....." విశ్వనాధం ముఖం ఉత్ఫుల్లమయింది. "డబ్బుకేం ఇబ్బంది పడ్డం లేదు గదా." "మీ పెదనాన్నకి డబ్బు రంధి తప్ప వేరే లేదు. అబ్బాయి 'పెద్ద చదువులు చదివించడానికి డబ్బు ఇస్తారు. బాగా వున్నవాళ్ళు పైకి తీసుకువస్తార'ని ఆ సంబంధం చేశారు. కొడుకుని మాకు కాకుండా చేసేశారు వాళ్ళు. ఈయన పనే ఇదంతా." విశ్వనాధం ఆ ఆరోపణను స్వీకరించలేకపోయేడు. "ఏమిటో నీ పిచ్చిగాని, వాడికి ఏం లోటు చేశారు? హాస్టలులో పెట్టి చదివిస్తున్నారు. చదువయ్యేక మంచి ఉద్యోగం వేయించుకొంటారు. మన కోసమా, వాళ్ళ పిల్ల సుఖం కోసం చేసుకొంటారు గాని....." "తల్లీ, తండ్రీ అనే పేగును చంపేసే చదువులెందుకంట. ఏదో వుద్యోగం లేకపోతే బతకలేడా? నాలుగెకరాల కొండ్ర దున్నుకుంటే జీవితం వెళ్ళమారుతుంది." లచ్చమ్మ సంతృప్తి విశ్వనాధానికి లేదు. తన కొడుకుగా అతనికి సంఘంలో గౌరవస్థితి కల్పించలేడు.... అందుచేతనే వెంకటరమణ స్కూలు ఫైనల్‌ ప్యాస్‌ కాగానే పెద్ద ధనవంతుల సంబంధం వచ్చేసరికి చటుక్కున వొప్పుకున్నాడు. వాళ్ళు లచ్చమ్మ కులం వాళ్ళే. ఆ కులంలో వివాహ క్రతువుకు పెద్ద పట్టింపు లేదు, చదువుకుంటున్నాడు, చక్కగా వుంటాడు అనేసరికి రాయబారం పెట్టేరు. పెళ్ళి అయిపోయింది. పెళ్ళికి విశ్వనాధం వెళ్ళలేదు. ఆ వెళ్ళకపోవడం చేతనే వెంకటరమణకు తన జన్మస్థితిలో వున్న అల్పత్వం అర్ధమయింది. విశ్వనాధం తనకు కుదిర్చిన సంబంధాన్ని, తన వియ్యంకులనుగా, బంధువులుగా అంగీకరించలేడు. ఆ సంగతిని ఎవ్వరూ పట్టించుకోలేదు. కాని రమణ చాలా కష్టపెట్టుకొన్నాడు. ఇంక అటువేపు సంబంధం సాగించడానికి మనసొప్పలేదు. పెళ్ళి అయినాక ఓమారు రెండు మార్లు తల్లిని చూడబోయినా, అతడు తనకు దూరమయిపోయాడని లచ్చమ్మ గ్రహించడం కష్టం కాలేదు. తానంటే అయిష్టం లేకపోయినా తల్లిని మాత్రం గౌరవించలేక పోతున్నాడని విశ్వనాధమూ అర్ధం చేసుకోగలిగేడు. మొదట కొంచెం బాధ అనిపించినా త్వరలోనే తట్టుకోగలిగేడు. కాని, లచ్చమ్మ సర్దుకోలేకపోతూంది. అతడు దూరమవుతున్నాడనిపించేక, దగ్గరకు తెచ్చుకొనేటందుకు మార్గాల నన్వేషించ సాగింది. వారం వారం ఎవరినో పట్టుకొని ఓ కార్డు వ్రాయించేది. కొత్తగా వూళ్ళో తెరిచిన పోస్టాఫీసును నిలవబెట్టుకునేందుకు గ్రామస్థులు చేస్తున్న ప్రయత్నంలో ఆమెకు వుత్తరాలు రాసిపెట్టేందుకు మనుష్యుల లోటు లేదు. ఏదన్నా వుత్తరం వస్తే చదివిపెట్టేందుకూ లోటు లేదు. అసలు లోటల్లా వుత్తరం రావడమే. కొడుకు అభిమానాన్ని గ్రహించినా ఆమె దానిని స్వీకరించే స్థితిలో లేదు. ధనికులయిన అత్తవారు బీద అయిన తనతో సంబంధం పెట్టుకోరాదని శాసించి వుంటారని కారణం కల్పించుకొంది. ఆ సంబంధం చేసినందుకు విశ్వనాధాన్ని తప్పు పడుతూంది. "సరేలే, తేగలు కాల్చేవనుకుంటా, తీసుకురా. కొత్తింబరి కారం వుందా? ఇంత ముద్ద నెయ్యి కూడా వెయ్యి. ఏమిరా అబ్బాయి?" లచ్చమ్మ అరిటాకులో నెయ్యీ కారం వేసి, ఇన్ని తేగలు తెచ్చి వారి ముందు పెట్టింది. "ఇప్పుడే పకోడీలు తిన్నా"నంటూ రామనాధం ఓ తేగను ఒలిచి చీరేడు. "అప్పుడే కూటం తోటలో చేరేరన్నమాట"--అన్నాడు. రామనాధం స్నేహితుల అలవాట్లు తెలిసిన విశ్వనాధం. రామనాధం చిరునవ్వు నవ్వేడు. విశ్వనాధం "స్కూలు మానేశావట. రమణ వ్రాసేడు" అన్నాడు. "చెప్పేడు" అంటూ రెండో వాక్యానికి మాత్రమే సమాధానం ఇచ్చేడు రామనాధం. ఆ మాట వింటున్న లచ్చమ్మ చటుక్కున అందుకుంది. ఆ రెండో భాగాన్నే. "వెంకటరమణ వుత్తరం వ్రాశాడా?" దొరికిపోయినట్లు విశ్వనాధం గతుక్కుమన్నాడు. కాని నిజం చెప్పక తప్పింది కాదు. "నాలుగు రోజులయింది." "నాతో చెప్పేరు కాదేం?" అతడికి ఏం చెప్పాలో తెలియలేదు. ఆ వుత్తరంలో తల్లిని గురించిన మాట ఒక్కటీ లేదు. చదివి వినిపిస్తే లచ్చమ్మ గోల పెట్టేస్తుంది. కనుక చెప్పవద్దనుకున్నాడు. కాని, ఇప్పుడు దొరికిపోయేడు. "చెప్దామనుకుంటూనే మరిచిపోయా." కాని, లచ్చమ్మ ఆ సమాధానానికి సంతృప్తి పడలేదు. కోపం వచ్చి విసురుకుని ఇంట్లోకి వెళ్ళిపోయింది. విశ్వనాధం ముఖం కమిలినట్లయింది. తమ్ముని కొడుకు ఎదుట అటువంటి పరిస్థితి ఎదురవడం సిగ్గు అనిపించింది. "చదువుకుంటున్నాడన్నమాటే గాని ఉత్తరాలు వ్రాయడం కూడా చేత కాదు. తల్లి పేరు చెప్పి ఆమె ఎట్లా వుందని వ్రాస్తే తప్ప ఆమెకు సంతృప్తి వుండదు. ఏదో కుర్రాడు మరిచేపోయేడేమో అనుకోదు." ఆ మాటలకు రామనాధం ఏమీ చెప్పలేదు. చెప్పాలని విశ్వనాధం వుద్దేశ్యమూ కాదు, ఒక్క నిముషం ఊరుకుని మరల ప్రస్తుతానికి వచ్చేడు. "తొందర పడ్డావనుకుంటా." "ఇంక చదువు సాగించడం దేశానికి ద్రోహం చేయడమే ననిపించింది." విశ్వనాధం 'ఎందుచేత' అని ప్రశ్నించలేకపోయాడు. స్కూళ్ళు, కాలేజీలు, కోర్టులు, వుద్యోగాలూ మానేసి పరాయి ప్రభుత్వంతో సహాయ నిరాకరణ చేస్తే వాళ్ళు దేశం నుంచి వెళ్ళిపోక తప్పదనే విశ్వాసాన్ని తాను రోజూ రావి క్రిందా, పెద్ద రేవులో, పొలం గట్టునా అనేక రూపాల్లో చెపుతూంటాడు. బహుశా తన మాటలు ఈ కుర్రవాని నిర్ణయానికి కారణమేమో కూడా. ఒక్క నిముషం ఇద్దరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు. మరల విశ్వనాధమే ప్రారంభించేడు. "ఏం చెయ్యాలని?" "పునర్నిర్మాణ కార్యక్రమం...." "అంటే.......?" ఆ కార్యక్రమం బహుముఖం. ఖద్దరు వుత్పత్తి, ప్రచారం, పాఠశాలలు నడపడం, గ్రంథాలయాలు నిర్వహించడం, గ్రామాలలో పారిశుద్ధ్యం గురించి ప్రబోధం. అంటరానితనం నివారించేటందుకు కృషి. మద్యపాన నిషేధ ప్రచారం... "నేనేం అనుకోలేదు."--అన్నాడు రామనాధం అసహాయత చూపుతూ. విశ్వనాధం ఓ నిముషం ఆలోచించేడు. "స్వయంతీర్ణంపరాన్‌ తారయతి" అన్నాడు ఒక నిముషం పోయేక. "అంతే మరి."...... అని అంగీకరించేడు రామనాధం. మరల ఓ క్షణం ఇద్దరూ వూరుకున్నారు. "ముందు మనూళ్ళో గ్రంథాలయం మూలబడింది. కుర్రాళ్ళు నలుగురినీ పోగుచేసి దానిని నడిపించడానికి ప్రయత్నం చెయ్యి." ముంగండ గ్రంథాలయం అయిదారేళ్ళ క్రితం వరకూ జిల్లాలోకే పేరుపడ్డ గ్రంథాలయాలలో ఒకటి. అంతవరకూ నిర్వహించిన వాళ్ళు సంసార జంజాటంలో పడి శ్రద్ధ చూపలేకుండా అయ్యారు. కొత్త వాళ్ళు వచ్చి ఆదుకోలేదు. ఎప్పుడన్నా, ఎవరన్నా పడుచువాళ్ళు ఉత్సాహం చూపబోయినా వాళ్ళ పట్టుదలమీద పెద్దవాళ్ళకు విశ్వాసం వుండేది కాదు. చివరకది మూలబడింది. ఆ అవిశ్వాసాన్నే రామనాధం జ్ఞాపకం చేసేడు. విశ్వనాధం దిలాసా ఇచ్చేడు. "వాళ్ళు మాత్రం ఏం చేసుకొంటారు? ఎంతో కష్టపడి పోగుచేసిన గ్రంథాలయం ఎందుకూ కాకుండా పోతుందని కాని. నువ్వు నిలబడతానను." రామనాధం ఆలోచించుకోకుండా ఏ మాట ఇవ్వదలచుకోలేదు. "నలుగురినీ అడుగుతా." గ్రామానికి గ్రంథాలయ అవసరం ఎంతుందో విశ్వనాధం బహుముఖాలుగా వర్ణించేడు. మధ్యలో లచ్చమ్మ తిరిగి వచ్చింది. "రాంబాబూ! తమ్ముణ్ణి కూడా తీసుకువచ్చెయ్యకపోయారా." "వాడు రాకేం?" అన్నాడు విశ్వనాధం. "ముందు మీకు ఇష్టం వుందా?" అని లచ్చమ్మ కవ్వించింది. ఆ ప్రశ్నకు విశ్వనాధం వద్ద సమాధానం లేదు. అతడా ప్రశ్ననెన్నడూ ఆలోచించలేదు. చదువు మాని, వుద్యోగాలను త్రోసిపుచ్చి గ్రామాలకు తిరిగి రావలసిన వాళ్ళల్లో ఆయన ఎన్నడూ రమణను లెక్కవెయ్యలేదు. "ఇది ఒకరు చెప్పి చేయించవలసిన పనిటమ్మా! ఎవరికి వారు ఆలోచించుకోవలసిందిగాని" అని రామనాధం పెద్దతండ్రిని సందిగ్ధస్థితి నుండి తప్పించేడు. విశ్వనాధం ఏదో తప్పుచేస్తూ దొరికిపోయినట్లు, ఎదురుగా వున్న చింతచెట్టు చివరి రెబ్బలవేపు చూస్తూ నెమ్మదిగా అన్నాడు. "వాడి ఆలోచనలు తెలుసా?" రామనాధం తల వూపేడు. "ఎప్పుడేనా మాట్లాడేవా?" "ఉహు." "నేను చెప్పేను. కాని వాడికి పోలీసు ఆఫీసరు కావాలనే పట్టుదల. పట్టుదల కాదు, జీవితాశయం. మరేవీ వాడి తలకెక్కలేదు." "కానీండి. వాడికది నచ్చింది. వుద్యోగం అయినప్పుడు ఏదైతేనేం?" విశ్వనాధం అతనివంక ఆశ్చర్యంగా చూశాడు. "ఏదైతేనేమా?" "పెద్దంత తేడా వుందా?" విశ్వనాధం ఒక్క నిముషం తటపటాయించేడు. "వుంది. చాలా తేడా వుంది. తన కుటుంబానికే ఆ ఆలోచన శత్రువును చేసి పెడుతుంది. నువ్వు విదేశీ పాలన పోవాలంటున్నావు. వాడి ఉద్యోగం ఆ పాలనకు కాపలాకాయటం. అన్నా, తమ్ముడూ, తండ్రీ, కొడుకూ శత్రువులుగా బతుకుతారు...." రామనాధం ఆ భయాన్ని లెక్కచేయలేదు. తన మామగారు ఓ పోలీసు ఆఫీసరేనాయె. అదేమాట మరొక విధంగా గుర్తు చేశాడు. "మనకిదివరకే వున్న బంధుత్వాలకన్న ఇందులో వచ్చి మునిగేదేముంది?" రామనాధం చేసుకున్న సంబంధం విశ్వనాధానికెంతమాత్రం ఇష్టం లేదు. ఆ మాట స్పష్టంగా చెప్పి శంకరశాస్త్రీ వాళ్ళ చేత మాటపడ్డం కూడా అయిపోయింది. పెళ్ళి జరిగి నాలుగేళ్ళయిపోయినాక ఇప్పుడా అయిష్టాన్ని బయటపెట్టడం న్యాయం అనిపించలేదు. అందుచేత సాచేశాడు. "సరేలే. ఏదెల్లా జరగాలో మనమేమన్నా కర్తలమా?" తండ్రికి కొడుకు ఆలోచనలు నచ్చలేదన్నంతవరకే అర్ధం అయిన లచ్చమ్మ తన కొడుకుని ఇంటికి రప్పించెయ్యడానికి అదొకదారి కావచ్చుననుకుంది. "పెంచి, చదువు చెప్పిస్తున్న బాబయ్యగారినే కాదనేంత వాడయ్యాడా? మాట విననప్పుడు చదువు మానిపించేసి తీసుకొచ్చెయ్యకపోయారా?" విశ్వనాధం సమాధానం చెప్పకపోయేసరికి ఆమె తన వాదాన్ని ప్రస్తరించసాగింది. అప్పటికీ సమాధానం రాకపోయేసరికి తన వాదానికి అభిమానాన్ని జోడించింది. "అసలు మీకు ఇష్టం లేదు." "ఏమిటి?" "వాడు ఇంటికి రావడం....." విశ్వనాధం నవ్వేడు. "నువ్వు చెప్తే ఇంటికి రాడు. నేను చెప్పానని ఆ ఉద్యోగం ఆశా వదులుకోడు." "ఏం?" "కారణం ఒక్కటే...." రామనాధం ముందు ఆ కారణం ఏమిటో ఎన్ని మార్లడిగినా విశ్వనాధం చెప్పలేదు. అతడు వెళ్ళిపోయేక తానే పిలిచి చెప్పేడు ఆమెకు. "తన తల్లి కులం చిన్నదనేది తప్ప ఆమెగాని, తానుగాని ఈ అగ్రహారంలో వారికి ఏ విధంగా తీసిపోతామని వాడి అభిమానం. నీ కులం చిన్నదనం నీకూ పట్టలేదు. నాకూ పట్టలేదు. ఓ భోజనం దగ్గర నేనింకా అంగీకరించలేకపోయేను. వాడు నా కొడుకు. నువ్వు నా భార్యవు. నీ చేతి అన్నం తినలేను. వాడిని పంక్తిని కూర్చోబెట్టుకోలేను. అది అభిమానం అనిపించదూ...." లచ్చమ్మ ఆ సంగతి ఎప్పుడూ ఆలోచించలేదు. ఆశ్చర్యపడింది. "వాడికా....." ఆమె మాటను విశ్వనాధం పూర్తిచేయనీయలేదు. "వూళ్ళో చిన్నా పెద్దా అందరూ వాడిని ఏమిరా అంటూంటే వాడందరినీ ఏమండీ అనాలి. ఎవరింటికేనా వెడితే దూరంగా అరుగు చివరన ఆనీ ఆననట్లు కూర్చోవాలి. ఋషి పంచమి నోముల ప్రసాదాలు తినే అర్హత వాడికి లేదు. ఇవన్నీ అన్యాయాలే. అయితే మనకవి తోచలేదు. అలవాటు పడిపోయాం. వాడికి అవి శూలాలు అయేయి." లచ్చమ్మ జ్ఞాపకం చేసుకొంది. "బాలకృష్ణని 'ఏమిరా' అంటే విశాలాక్షమ్మ కోప్పడ్డారట." "నాతో చెప్పలేదు." "నేనే వద్దన్నాను." విశ్వనాధం ఎంతో అభిమానంతో ఆమె వంక చూసేడు. "పోలీసు ఆఫీసరైతే తప్ప తనకీ అగౌరవాలు తప్పవని, ఎవ్వరూ గౌరవించరనీ వాడి మనస్సులో పడింది." కొడుకు మనస్సులో పడిన ఆ అభిమానం లోతుల్నీ, విస్తృతుల్నీ ఆలోచించుకుంటూ ఆ దంపతులు చీకట్లు దిక్కుల్ని అలుముకోడాన్ని కూడా గమనించలేదు. పదిహేడు ముఖం కడుక్కుని లేస్తూ, తోట్లో అడుగు పెడుతున్న సూరాయిని రామనాధం ఆప్యాయతతో పలకరించేడు. "ఏమిరా సూరాయి! పొద్దున్నే వచ్చేవు...." "ఏం లేదయ్యగారూ"--అన్నది కేవలం మాటవరసకు అన్నమాట. అబ్బయ్య నాయుడు తోడి అల్లుడుగారికి తోలిపెట్టిన ఆవును తీసుకొచ్చేడు. "పెద్ద కాపుగారికి ఆవుపాడి లేదండి. చంటిపిల్ల పాలకి పెద్ద అయ్య ఆవుని తోలిపెట్టారు. తీసుకొచ్చేనండి." "మీ పెద్దయ్యగారు బాగున్నారా?" "చిత్తమండి. తమ కాలి దెబ్బ ఎల్లాగుందో కనుక్కుని చూసి రమ్మని చిన్నమ్మ ఈ సీటి ఇమ్మన్నారండి." సూరాయి ఎంతో భక్తి ప్రవత్తులతో చేతిలో వున్న చీటీని దూరంగా ఒక రాయిమీద పెట్టి పక్కకు తప్పుకున్నాడు. రామనాధం తీసి చదువుకొన్నాడు. అతని ముఖం ఉత్పుల్లమయింది. "మీ చిన్నమ్మగారు ఏం రాశారో ఎరుగుదువట్రా?" "నాకేం తెలుసుద్ది బాబూ! ఏవన్నా పుస్తకాలు ఇస్తే తెచ్చిపెట్టమన్నారండి." రామనాధం కాస్సేపు ఆ మాటా ఈ మాటా చెప్పి అసలు విషయానికి వచ్చేడు. "మధ్యాహ్నం వచ్చి మీ అయ్యగారి దర్శనం చేసుకుంటానని చెప్పు. పుస్తకాలు అప్పుడు నేను తెస్తానులే." మధ్యాహ్నం మూడుగంటల వేళ రామనాధం అవిడి కాలవగట్టుమీద కనిపించగానే సూరాయి తోటలోంచి కేకవేసేడు. నూతి వద్ద నిల్చుని మాణిక్యమ్మ పలుకరించింది. గుమ్మం వద్ద ఎదురయి స్వరాజ్యం ప్రశ్నించింది. "మీ కాలు ఎలా వుందో ముందు చెప్పండి. చూసిరారా అంటే సూరాయి మరిచిపోయానన్నాడు. సన్నాసి." కాలుమీది దెబ్బ అంత పెద్దది కాదన్నా స్వరాజ్యం అంగీకరించలేదు. "కాస్త మానేవరకూ ఓ కట్టు వుంచండి. తగిలిన వేలికే తగులుతుందని సామెత కూడాను." "సామెత కనక తగులుతుందా?" అని ఎగతాళి చేసేడు రామనాధం. సావిట్లో కూర్చున్న అబ్బయ్య నాయుడు వుత్సాహంతో స్వాగతం ఇచ్చేడు. "ఎవరు రామనాధంగారా, నమస్కారం పంతులుగారూ! దయచేయండి.... అమ్మా! ఓ కుర్చీ వేయించేవా... రాండి, బాబూ!..... మిమ్మల్ని గురించి మా ఇంటిదీ, అమ్మాయీ నిన్నటి రోజంతా ఒకటే చెప్పడం. వచ్చి దర్శనం చేసుకుందామన్నా అవధ్యుణ్ణి. తమరినే శ్రమ పెట్టవలసి వచ్చింది... అమ్మా! సూరాయిని పిలిచి ఈశాన్యం మూలలో చెట్టు నుంచి రెండు లేత బొండాలు తీసి తెమ్మను...." తనకిస్తున్న పెద్దరికానికి రామనాధం చాల సిగ్గుపడుతున్నాడు. అతని అభ్యంతరాలను ఎవ్వరూ పట్టించుకోడం లేదు. మాణిక్యమ్మ పళ్ళెంలో రెండు పట్టెడేసి మినప సున్నివుండలు పెట్టుకొని వచ్చింది. స్వరాజ్యం నాలుగు అమృతపాణీ అరటిపళ్ళు తెచ్చి ఎదురుగా బల్లమీద పెట్టింది. "మా దొడ్లో చెట్టువి. మంచి రుచిగా వున్నాయి, చూడండి." ఇంతలో సూరాయి నాలుగు లేత కొబ్బరి బొండాలు చెలిగి సిద్ధం చేసి తెచ్చి కత్తితో సహా తెచ్చిపెట్టేడు. రామనాధం నిస్సహాయుడుగా ఒక్కొక్కరి ముఖాలే చూసి నవ్వేడు. "నేనేమన్నా వృకోదరుణ్ణా? మీకు నా మీద ఇంత చెడ్డ అభిప్రాయం ఎలా కలిగింది?" అబ్బయ్య నాయుడూ, భార్యా కూడా ఏక కంఠంతో అనునయం తెలిపేరు. "తమబోటి గొప్పవాళ్ళు మా యిళ్లకు రావడమే గొప్ప." "మీరు ఇంత అభిమానం చూపిస్తే మళ్ళీ రావడానికి సాహసం వుంటుందా?" చాలా సేపు లోకాభిరామాయణం సాగించి రామనాధం లేచేడు. "ఒక్క నిముషం కూర్చోండి." అబ్బాయి నాయుడు కూతురును పిలిచేడు. "అవధాన్లుగారి నోటు లెక్కకట్టేవు కద. ఇవ్వవలసింది..." స్వరాజ్యం సంకోచిస్తూనే రామనాధాన్ని సాయం కోరింది. "మీ వూరు అవధాన్లుగారి వద్ద మేము కొంచెం అప్పు తెచ్చేం. అది ఇచ్చెయ్యాలని ప్రయత్నం...." "ఆయన దొరకడు. రోజూ ఆడకూతురు ఎక్కడ వెళ్ళగలదు? ఆయననే రమ్మంటే రావడం లేదు" అని పూర్తి చేశాడు నాయుడు. "పోతుందనే భయం లేనప్పుడు ఆయన తొందరెందుకు పడతాడు?"--అన్నాడు రామనాధం. అప్పయ్యావధాన్లు స్వభావాన్ని గురించి స్వయంగా ఎరక్కపోయినా వూళ్లో బోలెడు కథలు విని వున్నాడు. "ఆయనకు తొందర లేకపోయినా మనకుండాలి కదా, రోజు తెల్లవారిందంటే బోలెడు వడ్డీ పెరిగిపోతూంది" అన్నాడు నాయుడు. రామనాధం తను సలహా ఇవ్వకుండా ఉండలేకపోయేడు. "ఏ సూరయ్య కాపునో పంపితే తీరిపోతుందిగా...." అబ్బయ్య నాయుడు ఒక్క క్షణం ఏమీ అనలేదు. తన సూచన ఆయనకిష్టం కాదని రామనాధం గ్రహించేడు. "మీరు ఎరుగరనుకుంటా! మా సూరయ్య కాపుగారికీ, అవధానులు గారికీ మధ్య జరిగిన గొడవ తరవాత జాగ్రత్త అయినవాళ్ళ ద్వారా గాని పంపడానికి మనసొప్పడం లేదు...." రామనాధం ఏమీ అనలేదు. ఓ నిముషం వూరుకొని నాయుడే తన సంకల్పం వెలిబుచ్చేడు. "తమరు ఆ డబ్బు కాస్తా జమ కట్టించిపెట్టాలి...." "రేపు పది గంటల వేళ సూరాయికి డబ్బు ఇచ్చి పంపండి. నేను చూస్తాను. దానిదెంత పని?" "సూరాయి ఎందుకులెండి." స్వరాజ్యం చిన్న కాగితం పొట్లం తెచ్చి తండ్రికిచ్చింది. ఆయన దానిని రామనాధానికి అందించడానికి చేయి జాపేడు. రామనాధం ఉలిక్కిపడ్డాడు. "ఏమిటండదీ?" "మీకే ఆ శ్రమ ఇస్తాను. తప్పదు." రమారమి వెయ్యి రూపాయల భారాన్ని నెత్తిన పెట్టుకోడానికి రామనాధం జంకేడు. అవధానులుగారినే పంపిస్తానన్నాడు. స్వరాజ్యమే వస్తే దగ్గరుండి ఆ పని పూర్తి చేయించి పెడతానన్నాడు. ముక్కు మొగం ఎరుగని వాడిని వారు నమ్మినా, ఆ గౌరవం తాను దక్కించుకోవడానికైనా ఆ సాహసం చెయ్యలేనన్నాడు. కాని నాయుడు కుటుంబం ముగ్గురూ అతని భయాలకు నవ్వేశారు. చివరకు రామనాధానికి తప్పలేదు. "మీరు ఒక్కటి చూసుకోండి. నోటు చెల్లు రాసి చేతికిస్తే గాని చెయ్యి వదలకండి. సూరయ్య కాపు గోలకి మూలం అదే" అన్నాడు నాయుడు. "నాకు భయంగా వుంది సుమండి." "కాలేజీలో చదువుకొచ్చిన వారికీ, సామాన్య రైతుకీ తేడా లేదా? అతనిని చేసినట్లు మిమ్మల్ని మోసం చెయ్యలేడు." "ఇంకో విధంగా చెయ్యొచ్చు. వడ్డీ లెక్క తప్పు కట్టవచ్చు కదా...." అదో పెద్ద సమస్య కాదన్నాడు నాయుడు. "ఆయన మొహం చాటు చేస్తుంటే నెల రోజుల నుంచి రోజుకి రూపాయికి అర్ధణా పోవడం లేదూ...." రెండు రోజుల నుంచి ఓ యేభయి రూపాయల అప్పు కోసం తాను ఆయనవద్దకే వెళ్ళాలనుకొంటున్న విషయం మరిచిపోయి, అంత దగాకోరు అని ఎరిగీ అప్పయ్యావధానులుగారి వద్దనే ఎందుకు అప్పు తెచ్చారని ప్రశ్నించేడు. నాయుడు నవ్వేడు. అప్పు చేసేవాడి మనస్తత్వం గురించి హాస్యం చేసేడు. "ఏమి నా మీద పెద్దభారం పెట్టేరు. అది పూర్తి చేసే వరకూ నిద్ర కూడా రాదు..." అంటూ రామనాధం లేచేడు. "తమరు దేశం కోసం ఒక త్యాగం చేశారు. నాబోటి అవధ్యుడికి సాయం చెయ్యడంతో మీ దేశ సేవ ప్రారంభం కావాలని కోరుకోరూ......." అందరి వద్దా సెలవు తీసుకొని గుమ్మం దిగుతూంటే స్వరాజ్యం ఆహ్వానించింది. "మళ్ళీ ఎప్పుడొస్తారు?" "ఇదో పని పెట్టేరు కదా, పూర్తి కావడంతోనే వస్తా." "ఈ పనితో మీ రాక ముడిపెట్టకండి. తీరిక ఉన్నప్పుడెప్పుడన్నా వస్తూండండి. పుస్తకాలు చదివినాక సూరాయి చేత పంపిస్తా. మళ్ళీ ఏవన్నా ఇద్దురు గాని." పద్దెనిమిది రామనాధం సాయంకాలం ఇంటికి వచ్చేసరికి తల్లి మహోత్సాహంతో చెవినవేసిన శుభవార్త విని మ్రాన్పడిపోయేడు. "ఈ నెలలో ఇంటికి కోడలు వస్తుందిరా అబ్బాయి." మొదట ఆ వార్తకాతడు అంత ప్రాముఖ్యం ఇవ్వలేదు. అప్పుడప్పుడు తన భార్యను తీసుకువచ్చి ఓ పదిరోజులుంచుకు పంపేస్తూండడం అలవాటుందని అతడికి తెలుసు. ఇప్పుడూ అటువంటి రాకగానే భావించేడు. రాట్టం ఆకులకు దారం బిగిస్తూ యథాలాపంగా సమాధానం ఇచ్చేడు. "బాగుందమ్మా!" "ముహూర్తం పెట్టించి, మళ్ళీ కబురు చేస్తామన్నారు." "అమలాపురం నుంచి ముంగండ వచ్చి నాలుగు రోజులుండి వెళ్ళేందుక్కూడా ముహూర్తాలు కావలసొచ్చిందేమమ్మా." రాజమ్మ కొడుకు అన్నీ ఎరిగి అమాయకత్వం నటిస్తున్నాడనుకొంది. ఆ కొంటెతనం తలుచుకొని నవ్వింది. "పెళ్ళాం వచ్చేక కూడా ఆవిడ ముందు ఆ ఏకుల బుట్టా, నువ్వూ తయారవుతావా యేం! నవ్వుతుంది." "ఎందుకమ్మా నవ్వడం?" "ఏమిట్రా నీ ఎందుకులూ, నువ్వూనూ? కాలేజీ చదువు మాని ఏకులొడుకుతాననే వాడిని చూస్తే ఎవరయినా నవ్వుతారు." ఆమె అభ్యంతరాన్ని నవ్వులో తేల్చివేయడానికి రామనాధం ప్రయత్నించేడు. అతని నవ్వు చూసేసరికి రాజమ్మకు కోపం చేసింది. "రేపు వియ్యాలవారి తరఫున శుభపత్రిక తీసుకొని ఎవరో వస్తారు. శుభమా యని నువ్వు....." అప్పుడు అర్ధం అయింది. తల్లి చెప్పే ముహూర్తానికి ఓ ప్రత్యేకార్థం ఉందని. "ఏమిటమ్మా నువ్వనేది?" రాజమ్మ చెప్పింది. "మీ మామగారు కబురుచేశారు. నాన్నగారు వెళ్ళారు." అయిదారు నెలల క్రితం సుందరి రజస్వల అయినప్పుడే రాజమ్మ కోడల్ని వెంటనే ఇంటికి తెచ్చుకోవాలనుకొంది. కాని వియ్యంకుడే అభ్యంతరం చెప్పేడు. కూతురుకు పదమూడేళ్ళయినా నిండలేదనీ, ఆ చిన్న వయస్సులో దంపతుల్ని కలపడం ఆరోగ్యకరం కాదనీ అన్నాడు. ఆ సమస్య ఆనాడు తనదాకా రాలేదు కనక తాను అభ్యంతరం చెప్పవలసిన అవసరం కలగలేదు. మామగారికి మనస్సులోనే అభినందనలు తెలిపేడు. ఈవేళ ఆయనే ప్రోత్సాహమిస్తున్నాడని తల్లి చెపుతూంది. ఇంక తాను వూరుకోడానికి వీలులేదు. బయటపడక తప్పదు. ఆడపిల్లలకు కనీసం పదహారేళ్ళూ, మగవానికి ఇరవయ్యేళ్ళూ వస్తే గాని దాంపత్య జీవితం ప్రారంభించరాదని అతని విశ్వాసం. కాలేజీలో లెక్చరర్లూ, బయట సంఘసంస్కరణవాదులూ శారీరక మానసిక ఆరోగ్య సూత్రాల బలంతో ఆ అభిప్రాయాన్ని మనస్సుకు నాటించేరు. మామగారికి లలితపూజా వగైరా ఛాందసాలున్నా ఆ మాత్రం కాలానుగుణంగా ఆలోచించగలిగినందుకు ఆనాడు సంతోషపడ్డాడు. అయితే, ఆయన తన భార్యా వాళ్ళూ రాసి రంపానపెడితే మెత్తపడ్డాడు కాబోలుననుకొన్నాడు. ఆయన మెత్తపడ్డాడని తాను మెత్తపడాలా? ధృఢస్వరంతో నిరాకరణ తెలిపేడు. "నీ కోడల్ని ఇప్పుడు తీసుకురావటం పడదమ్మా." "అదేమిట్రా అల్లా అంటావు? శుభమా యని కోడల్ని తీసుకు రావాలనుకొంటూంటే..." ఆమె కంఠంలో ఆశ్చర్యం, ఆదుర్దా వినిపించింది. ఆ అభ్యంతరంలో ఆమెకు కేవలం అశుభ శంక మాత్రమే కనిపించింది. రామనాధం గ్రహించేడు. "కోడల్ని పంపమను. ఆవిడ వుంటానన్నంత కాలం వుంచుకోండి. పంపించండి. అంతేగాని...." ఒక్క నిముషం ఆగి ఆ దృఢస్వరంతోనే ఆ అభిప్రాయాన్నే మరో రూపంలో వివరించేడు. "నాతో చెప్ప పనిలేదు." "నీతోగాక ఇంకెవరితో చెప్తాను? ఎవరన్నా వింటే నవ్వుతారు. యెందుకా కోపం? వాళ్ళేం చేశారని?....." అయిదారు నెలల క్రితమే తన భార్యను పంపనందుకు కోపం వచ్చిందనీ, అదే ఈ అభ్యంతరానికి మూలమనీ ఆమె అనుకొంది. ఆమెకు ఎల్లా సమాధానం చెప్పాలో రామనాధానికి అర్ధం కాలేదు. "ఇప్పట్నుంచీ...." కొడుకు మాటను మధ్యలోనే త్రోసిపుచ్చింది రాజమ్మ. "పెద్ద మనిషి అయిన పిల్లను వాళ్ళెంత కాలం మాత్రం వుంచుకుంటారురా?......" "కూతురు బరువుగా వుంటే పంపెయ్యమను. దానికి ముహూర్తాలూ...." "తప్పు, తప్పు...." రాజమ్మ మందలించింది. "అలాంటి మాటెప్పుడూ అనకు. వింటే వాళ్ళేమనుకుంటారు. కూతురికి తిండి పెట్టలేని దురవస్థ లేదు వాళ్ళకి. రాజాలాంటి వుద్యోగం. నౌకర్లు, చాకర్లు, బోలెడంత సంపత్తి. ఆ మాట అన్నావని తెలిస్తే....." మాటకు మాటగా వచ్చేసినా, ఆ మాట అన్నందుకు రామనాధమే సిగ్గుపడ్డాడు. "అది కాదమ్మా! ఆ సందేహం వుంటే పంపెయ్యమన్నమాటగా అన్నా గాని...." రాజమ్మ సంతృప్తిపడింది. కాని అది జరిగేది కాదంది. "అలా అడగనూ కూడదు. వాళ్ళు పంపనూ పంపరు. ఆ అడ్డు కాస్తా తీరితేగాని వాళ్ళెల్లా పంపుతారు? మనమెల్లా అడుగుతాం...." ఈమారు రామనాధం తన మనస్సులో వున్న అభ్యంతరాన్ని బయటకు స్పష్టంగా చెప్పక తప్పలేదు. "పదమూడేళ్ళన్నా నిండలేదమ్మా! ఇప్పటినుంచీ...." ఆమె రజస్వల అయిందని రాజమ్మ గుర్తుచేసింది. రజస్వల కావడం కుటుంబ జీవితానికి అర్హతగా తీసుకోరాదంటాడు రామనాధం. "పెద్దమనిషైతే మాత్రం, వయస్సేం వుందమ్మా." కొడుకు మాటలకు ఆశ్చర్యపడడంకన్నా రాజమ్మ ఎక్కువగా సిగ్గుపడింది. భార్య వయస్సును గురించి అటువంటి సానుభూతిని తెలపడం ఆమె ఎన్నడూ ఎరగదు. ఆడపిల్ల పన్నెండేళ్ళు వెళ్ళినా పెద్దమనిషి కాకపోతే నిషేకం జరిపెయ్యటం చూసింది. ఆడపిల్ల త్వరగా పనికిరావాలని అరటికాయను ఊదరపెట్టినట్లు తెగ మేపడం చూసింది. ఆలస్యంగా రజస్వల అయ్యే సంప్రదాయం గల కుటుంబాల్లో ఆడపిల్లల్ని గురించి ఎదురుచూస్తూండడం ఎరుగును. పెద్దమనిషయితే చాలు పదేళ్ళకే ఆడపిల్లను భర్తతో కలపడం తప్పుకాదనే ఆలోచనల మధ్య ఆమె పెరిగింది. ఇప్పుడు కొడుకు వేసిన ప్రశ్ననామె ఎరగనే ఎరగదు. "పోరా సిగ్గుమాలినవాడా!" అని సంభాషణను తుంపివేసి వంటపని చేసుకొనేటందుకు వెళ్ళిపోయింది. పందొమ్మిది ఆ అభ్యంతరాన్ని శంకరశాస్త్రి అతని భార్య అంత తేలిగ్గా తీసుకోలేక పోయేరు. ఆమెకు నవ్వు మాత్రమే తెప్పించిన ఆ మాట చెవిని బడేసరికి ఎదురుదెబ్బ తిన్నట్లు దిగ్భ్రాంతుడయ్యేడు. పెళ్ళికి ఒప్పించడానికై తానెంత శ్రమపడవలసి వచ్చిందో అతడు మరచిపోలేదు. అప్పటికీ, ఇప్పటికీ మధ్య నాలుగేళ్ళు గడిచేయి. పేరుకు నాలుగేళ్లు గాని, అంతక్రితం గడిచిన 15-16 ఏళ్ళ పెంపకమూ ఈ నాలుగేళ్ళ జీవితమూ ఒకదానికొకటి పోలిక లేదు. ఎవ్వరితో మాట మాత్రం కూడా చెప్పకుండా కాలేజీ వదిలేసి రావడంలోనే అది కనబడింది. పెంచిన బిడ్డను ఇంకా ఇంకా గొడవల్లో పడిపోకుండా చెయ్యడం కోసం తాను తయారు చేసిన పథకం అంత సులభంగా నిరుపయోగం కాగలదని శాస్త్రి వూహించనే లేదు. * * * * * మధ్యాహ్నం భోజనం కాగానే ఓ కునుకు తీయడం ఆయన అలవాటు. ఆ రోజున ఆ అలవాటు తప్పించేడు. తిండి తిని చేయి కడుక్కుంటూనే ఆమలాపురం పరుగెత్తాడు. వియ్యంకుణ్ణి చూడగానే చూపిన వుత్సాహం, ఆయన చెప్పిన వార్త విన్నాక నారాయణమూర్తిలో కనబడలేదు. అల్లుని దేశహితైక చర్యను విని నారాయణమూర్తి నిర్విణ్ణుడయ్యేడు. కాబోయే కలెక్టరుకు మామనవ్వాలన్న ఆశ మిగలలేదు. ముందు తన ఉద్యోగం మాటేమిటని భయం పట్టుకొంది. తన అల్లుడు. సాక్షాత్తూ తన కూతురు మగడు సహాయ నిరాకరణం చేశాడు. ప్రభుత్వం ఏమంటుంది? అల్లునిలో రాజభక్తి కలిగించడమో, రాజభక్తి గల అల్లుడిని తెచ్చుకోవడమో తనదే బాధ్యత అనరా? మరో మరో ఉద్యోగం కాదు కదా. పోలీసు డిపార్టుమెంటు. ప్రభుత్వానికి రెప్పలా భావించబడే శాఖ. ఉద్యోగుల నుంచే కాక, వారి బంధువుల నుంచి కూడా అచంచల భక్తి, విశ్వాసాలు కోరే శాఖ. ఈ కథ తెలిస్తే తన స్థితి ఏమవుతుంది? ప్రమోషన్ల మాట దేవుడెరుగు. అసలీ ఉద్యోగం మాత్రం వుంచుతారా? అంత దర్పం, దాష్టీకం చూపే అంతమనిషీ ఆ ఆలోచన తోచేసరికి జావయిపోయేడు. ఎటువంటి వాడికి పిల్లనిచ్చానురా భగవంతుడా అనిపించింది. వెతికి వెతికి తీసుకొచ్చిన సంబంధం ఇప్పుడేమనుకొంటే ఏం లాభం? తప్పు చేశాననుకున్నా దిద్దుకోవడం సాధ్యమా? తన అసమర్థతకి ఉక్రోషం పుట్టుకొచ్చింది. ఆ ఉక్రోషంలో ముంగండ వాళ్ళందర్నీ కలిపి తిట్టేడు. ఆ వూళ్ళోని బ్రాహ్మణశాఖ వారి బలహీనతను వెక్కిరించే ప్రస్తావిక శ్లోకం చదివేడు. "మొత్తం మీద 'నోభయంగాళ్ళ'నే మాట సార్ధకం చేశారు" అన్నాడు. మొదట కొంచెం సేపు ఓపిక పట్టి శంకరశాస్త్రి వియ్యంకుడికి తన పథకం నచ్చచెప్పడానికి ప్రయత్నించేడు. కాని, చచ్చిపోయిన వాళ్ళనూ, బ్రతికివున్న వాళ్ళనూ, గ్రామాన్నీ, శాఖనూ కలిపి తిడుతూంటే ఎంతోసేపు సహించలేకపోయేడు. కోపం మాట వస్తే శంకరశాస్త్రి తక్కువవాడు కాదు. ఎదుటివాడు పోలీసు ఉద్యోగి అయ్యేది, మరొకడయ్యేది. ఝుణంఝణలాడించేడు. "తర్వాత ఏమిషయీది."--అనేసి పైనున్న కండువా కుర్చీలో పారేసి ఝయ్యిన లేచేడు. రెండు గొంతులూ పెద్దవిగా వినబడేసరికి వియ్యంకుడికి ఫలహారం ఏర్పాట్లు చేస్తున్న అన్నపూర్ణమ్మ పరుగెత్తి వచ్చింది. గదిలో మంచంమీద పడుకొని వారి మాటలన్నీ వింటున్న సుందరి లేచి వచ్చింది. ఆమె ముఖం చూడగానే తమ మాటలు ఆమె విన్నదని శాస్త్రి గ్రహించేడు. ఆమెను బెదరకొట్టకూడదు. చటుక్కున సర్దుకు కూర్చున్నాడు. కాని, ముఖంలో ఆ ఉద్విగ్నత మాయలేదు. అసలు సంగతి వినేసరికి అన్నపూర్ణమ్మ ముఖం నల్లబడింది. కాని, తెలివి కోల్పోలేదు. ముందు రంగంలోంచి కూతుర్ని పంపేసేటందుకు పని పురమాయించింది. "పొయ్యి చూడు తల్లీ." ఆమె వెళ్ళిపోయేక ఉభయుల్నీ శాంతపరచ పూనుకొంది. "ఆయనకు ప్రథమ కోపం అన్నయ్యా! వారిని ఎరగరా ఏమన్నానా? వారి మాటలే అంత. పైగా గవర్నమెంటుతో వ్యవహారమేయని ఆందోళన. ముందుకు రావలసిన కుర్రాడు తప్పుదారి పట్టేశాడే అన్న విచారం. ఆ మాటలకు కోపం తెచ్చుకొంటే ఎల్లాగ? మీబోటి వారు......" అన్నపూర్ణమ్మ అటు మొగుణ్ని కసిరీ, కనుసంజ్ఞలతో బ్రతిమలాడీ మాట్లాడకుండా చేసింది. ఆ మాటా, ఈ మాటా చెప్పి వియ్యంకుణ్ణి సముదాయించింది. "మరిప్పుడేమిటి చెయ్యడం?" అని ముందు ఆలోచనకు హెచ్చరించింది. ఆమె తెలివీ, మాట నేర్పూ, ఓర్పూ చూస్తూ పరకాయిస్తున్న శాస్త్రి మనస్సులోనే ఆనందపడ్డాడు. ఈ తల్లి తరిఫీదులో పెరిగిన పిల్ల తన కొడుకుని దారిలోకి తేగలిగేదేయని విశ్వాసం కలిగింది. "......ఈ వరస చూస్తే ఇతగాడు అసలా అవకాశం ఇచ్చేలాగే లేడే..." అనుకొన్నాడు శంకరశాస్త్రి. * * * * * "జరిగిపోయిందేదో జరిగిపోయింది. అంతకంటె ముందుకెళ్ళి సభలనీ, ఖద్దరనీ...." అర్ధోక్తిలోనే అన్నపూర్ణమ్మ మాటకు అడ్డం వచ్చేడు శాస్త్రి. "అదేం మిగలలేదు. ఖద్దరుతోటే వచ్చేడు ఊళ్ళోకి." ఖద్దరు వేసుకొన్న వాళ్లు ఎంత ఖరీదునైనా తమ పూర్వపు దిరీసుల్ని మంటల్లో పారేస్తున్న కథల్ని వింటున్న అన్నపూర్ణమ్మ ఆశ్చర్యంతో నోరు తెరిచింది. "అల్లుని వద్ద మంచి ఖరీదయిన బట్టలు...." నారాయణమూర్తి పళ్ళు కొరుకుతున్నాడు. అవన్నీ మరి లేనట్లు శాస్త్రి తల తిప్పేడు. అన్నపూర్ణమ్మ ఒక్క నిట్టూర్పు విడిచి ఆశ్చర్యం నుంచి తేరుకుంది. మళ్ళీ అదే ప్రశ్న.... "మరిప్పుడేమిటి చెయ్యడం!" నారాయణమూర్తికి తన పోలీసు పద్ధతులపై అనంతమైన విశ్వాసం. దానికి అనుగుణంగానే ఉంది ఆయన సలహా. అతి గారాం, తినడానికి మస్తుగా ఉండడం వగైరా అవలక్షణాల వలన ఈ మాదిరి ఔద్దత్యం పుట్టుకొస్తూంటుందని అయన నమ్మకం. దానికొక్కటే మందుంది. ఆయన సంచికట్టులో. "గూళ్ళు విరగబొడిచేసి, బొక్కలో తోసేస్తే...." అంటూ దాని ప్రాశస్త్యాన్ని నిరూపించడానికి, కనుబొమ్మలు మిటకరించేడు. అన్నపూర్ణమ్మ ఎర్రబారి చూసింది. శాస్త్రి మరల భుజం మీది కండువా సవరించుకొన్నాడు. ప్రత్యామ్నాయ సూచనను శంకరశాస్త్రి వియ్యపురాలి ముందుంచేడు. నారాయణమూర్తి అక్కడున్నట్లు కూడా గుర్తించడం ఇష్టం లేనట్లు ఆయనకు వీపు తిప్పేడు. సుందరిని ఎరగాచేసి రామనాధాన్ని పట్టెయ్యాలనేది ఆయన సూచన. అయితే తెలివిగా ఆ మాటను తిప్పి తిప్పి వారి ముందు పెట్టేడు. ఆమెకు యుక్తవయస్సు వచ్చింది. దంపతుల్ని కలిపేస్తే అన్నీ సర్దుకొంటాయన్న ఆలోచనను అన్నపూర్ణమ్మ ఆలోచించవలసిందే అనుకొంది. నారాయణమూర్తి గర్జించేడు. "అదేం కుదరదు." శాస్త్రి ఆ అభ్యంతరాన్ని పట్టించుకోకుండా తన పథకం ప్రాశస్త్యాన్ని వివరించేడు. కొత్తగా కాపురానికి వచ్చిన పడుచు పెళ్ళాం మరులలో రామనాధం ఇంటిపట్టునే ఉంటాడు. ఈలోపున వ్యవసాయం అవీ ఆయన వప్పచెప్తాడు. కదలడానికి వీలూ వుండదు. అసలు అనిపించదు. ఓ యేడాది గడిచిందంటే ఈ పట్టుదలలేవీ వుండవు. అన్నీ మరిచిపోతారు. ఈలోపున ఒకళ్ళిద్దరు పిల్లలు కలిగేరా ఇహ చెప్పనక్కర్లేదు. "నన్నెక్కడ కూర్చోమంటావే--అని దిక్కులు చూసే దర్జాలే. మనం యెరగని మొహాలా ఏమిటి?" అని శాస్త్రి వియ్యంకుని వేపు చూసేడు. ఐ.సి.యస్‌. అయి ఏ కలక్టరుగానో వస్తాడనుకొన్న అల్లుడిని గురించి ఆ విధంగా ఆలోచించడం ఏదోలా వుంది అన్నపూర్ణమ్మకి. నారాయణమూర్తికి కసి వుబికి వస్తూంది. "ఏదో ఉద్ధరిస్తాడనుకొంటే....." అన్నపూర్ణమ్మ సర్దుబాటు చెయ్యడానికి ప్రయత్నించింది. "ఇప్పుడేమంత వయస్సు మీరిందనీ, ఇరవయ్యేగా, ఇంకా ఐదేళ్ళు, రేపు జూన్‌లో వెళ్ళమంటే సరి." నారాయణమూర్తికి భవిష్యత్తు గురించి ఆ విధమయిన ఆశ లేశం కూడా మిగలలేదు. "ఇవి అల్లా వదిలే జబ్బులు కాదు. ఓమారు వచ్చేక మనిషి సర్వనాశనం అయ్యేవరకూ వదలవు. అప్పుడూ వదలవు. వంశంలో జీర్ణించిపోతాయి. సెలల్లా బయటవేస్తూనే వుంటాయి." నారాయణమూర్తి పోటు ఏమిటో శాస్త్రి గ్రహించేడు. రామనాధం అతని పెదతండ్రి విశ్వనాధంమీద జంటదాడి. తన పుత్రుడు తొందరపడ్డాడనీ, తాత్కాలికావేశంలో కాలు జారేడనీ తలుస్తూ దానిని సరిదిద్దుకోవాలనుకొంటూంటే 'కుదరని జబ్బులూ, వంశం నుంచి వదలని జబ్బులూ అంటాడేమిటీతడి నీలుగు'. అనిపించింది శాస్త్రికి. ఓ మారు దులిపెయ్యాలనుకొన్నాడు. అయితే ఈ మారు కొత్త పద్ధతి తొక్కేడు. "అంతేనండి వియ్యంకుడుగారూ! కొన్ని జబ్బులున్నాయి చూశారూ, అవి ఉద్యోగాన్ని బట్టో, ఇంట్లో వున్న బంగారాన్ని బట్టో, ఒంట్లో వున్న హుమ్మస్సును బట్టో సంక్రమిస్తుంటాయి. నాలుగు పిచికలు చేరేసరికి క్రిందూ మీదూ తెలియదు. ఏమంటారు? ఆ హోదా, బంగారం, రక్తం వడి మళ్ళేసరికి ఏడ్పు మొహం పెట్టేస్తారు. అల్లాంటి వాళ్ళను గురించే అన్నాడెవడో మహానుభావుడు, సత్యదర్శి...." శంకరశాస్త్రి ఆ అప్రత్యక్ష కవికి చేతులు జోడించి నమస్కరించేడు. "....ఉద్యోగాంతము నందు చూడవలెరా ఆ యయ్యసౌభాగ్యముల్‌." అంత అవమానకరంగా తన ఉద్యోగపు హోదాను ఎద్దేవా చేసిన వాడు వియ్యంకుడైపోవడం చేత గాని, మరొకరూ, మరొకరూ అయితే వళ్ళు హూనం చేసివేసేద్దునని నారాయణమూర్తి పళ్ళు కొరికేడు. శంకరశాస్త్రి చర్రుమన్నాడు. కండువా మడత దులుపుతూ, అపహాస్యంగా వియ్యంకుణ్ని విసిరేశేడు. "ఇదే పతకం అయితేనా...." ...."అమ్ముకు తిననా" అన్న తరువాయి మాట ప్రక్షిప్తం. ఏదో గొప్పతనం చూసి పతకం ఇస్తారు. కాని, దానిని అమ్ముకు తినెయ్యడం వరకే అతనికి దాని విలువ తెలుసు. ప్రపంచం తనకిచ్చిన విలువ నాతడు ఆ పతకం విలువకే కుంచించుకుంటాడు. అంత పరమఅజ్ఞానివే నువ్వూనని శంకరశాస్త్రి వెక్కిరింత. అన్నపూర్ణమ్మ అతి కష్టంమీద వియ్యంకులిద్దరినీ సమాధానపరిచింది. కూర్చోబెట్టింది. కాని, నారాయణమూర్తి ఓ పట్టాన మనస్సు కుదుటపరచుకోలేక పోతున్నాడు. అన్నపూర్ణమ్మ మాటతప్పించి కాస్త వ్యవధానమిస్తేనేగాని వ్యవహారం తెమలదని అర్ధం చేసుకొంది. "సుందరీ!" "పీటలు వేశానమ్మా" అని లోనుంచి సుందరి సన్నగా సమాధానమిచ్చింది. "లేవండి అన్నగారూ!" అంటూ తొందరపెట్టి మగణ్ణి హెచ్చరించింది. "లేవండి మీరు కూడా. ఆ దుస్తులు తియ్యండి. అమ్మా! నాన్నగారి పంచె చూడమ్మా!" ఉపాహారాలయి మరల ముగ్గురూ సావిట్లోకి వచ్చి కూర్చున్నారు. మొదటి ఆవేశం చల్లబడి మగవాళ్ళిద్దరూ నిలకడగా మాట్లాడే స్థితిలో వుండడం చూసి అన్నపూర్ణమ్మ సంతోషించింది. విషయం ప్రస్తావన చేసింది. "అన్నయ్యగారి ఆలోచన బాగానే వుందనుకుంటా. మీరేమంటారు?" నారాయణమూర్తి ఓ నిముషం ఆలోచించేడు. "పిల్లదాన్ని కూడా ఈ గొడవలో దింపితే?" "వాళ్ళిద్దరూ చూసుకొంటారు. ఎవరు ఎవరిమాట వినాలనేది మనం చెప్పితే జరిగేదా యేమన్నానా?" అన్నాడు శాస్త్రి. "ఇప్పుడైతే నా కూతురుకూ అతనికీ సంబంధం లేదనొచ్చు" పై అధికార్లు ఏదో అంటారనే భయంతో తన మగడు కూతురు కాపురమే చెడగొడతాననడం అన్నపూర్ణమ్మకు నచ్చలేదు. అల్లుడితోపాటు కూతురు కూడా దూరం కావడం మనస్సుకు కష్టంగానే వుంది. ఇదివరకే ఓ కొడుకు వర్ణాంతర వివాహం చేసుకొని ముఖం చూడకుండా అయ్యేడు. ఇప్పుడు కూతురు. కారణం ఏదయితేనేం? కాని తప్పనిసరి. కూతురు సంసారాన్ని భగ్నం చెయ్యలేదు. ఆ మాటే చెప్పింది. "మనకి దూరంగా వున్నా వాళ్ళిద్దరూ కలిసి వుంటారు. అంతగా అయితే మనింటి ఛాయలకు రావద్దందాం. అంతేగాని, మనకేదో కష్టం కలుగుతుందని పిల్లదాని జీవితం...." తన ప్రయత్నం ఇద్దర్నీ దూరం చేసుకోడానికి కాదని గుర్తుచేశాడు శాస్త్రి. "కుర్రాణ్ని కూడా దగ్గిరికి తెచ్చుకోవాలనిగాని....." నారాయణమూర్తి రుసరుసలాడేడు. "మీ ఇష్టం వచ్చినట్లు చేయండి. ఈ ప్రయత్నాలకు ఇదే మొదలు ఇదే ఆఖరు కూడా." అన్నపూర్ణమ్మ భర్త ముఖం వంక చూసింది. ఆ చూపు అర్ధం గ్రహించేడు నారాయణమూర్తి. "ఏమల్లా చూస్తావు?" "బంధుత్వాలు చూసుకోవలసిన చోట కూడా మీ వుద్యోగపు దాస్టీకమేనా?" "నా వుద్యోగానికి సంబంధించినంతవరకూ అల్లుడూ లేడు, కూతురూ లేదు." నారాయణమూర్తి చిరచిరలాడుతూ లేచేడు. "మీరే నిర్ణయం చేసుకున్నా సరే. కాని, ఆ కుర్రవాడు నా యింట అడుగు పెట్టడానికి వీలు లేదు. ఆ కార్య కరామత్తులకు నేను రాను." "మరి?" అని అన్నపూర్ణమ్మ ఆయన ముఖంలోకి చూసింది. "అది అంతే. ఓ చీర పెట్టి పిల్లను పంపించెయ్యి. ఆ శుభకార్యం వాళ్ళింట్లోనే చేసుకుంటారు." "అదెల్లాగ?" "ఎల్లాగో నన్నడిగితే లాభం లేదు" అంటూ నారాయణమూర్తి వీధిలోకి వెళ్ళిపోయేడు. శంకరశాస్త్రి ఓ నిముషం ఆలోచించేడు. "సరే. మీరేమంటారు?" అన్నపూర్ణమ్మ అతనికి ధైర్యం చెప్పింది. "మీ ఆలోచన భేషుగ్గా వుంది. అన్నయ్యగారూ! కానీండి. శుభస్య శీఘ్రం. ముహూర్తం పెట్టించండి." "ఎక్కడ అని....." "మీ వూళ్ళోనే, మా చెల్లెలిగారింట జరపడానికి మీకేమన్నా అభ్యంతరం వుందా?" శాస్త్రికి అభ్యంతరం లేదు. ఆయన అక్కడికక్కడ ముహూర్తం నిర్ణయం చేసేడు. ఆమె సంతృప్తికి సిద్ధాంతిని పిలిపించేడు. అతడు ముహూర్తం ఏమిటో కూడా ఎరక్కుండానే శాస్త్రిని పొగిడేడు. "భేష్‌! బ్రహ్మాండంగా వుంది. సందేహము ఏమీ అక్కర్లేదు." అన్నాడు. "చొరవ ఆలోచన మీనుంచే వచ్చినట్లు నడపండి" అంటూ చూచాయగా హెచ్చరించి శాస్త్రి వచ్చేశాడు. అంత కష్టపడి తయారు చేసిన పథకం అంతా టప్పున ఎగిరిపోతున్నట్లు నిర్విణ్ణుడయ్యేడు. * * * * * ఒక్క క్షణానికి సర్దుకొని ప్రశ్నించాడు "ఏడీ వాడు?" తాను చెప్పిన మాటకు మగని ముఖంలో కనిపించిన వైలక్షణ్యం చూసి రాజమ్మ భయపడింది. రామనాధం అభ్యంతరం వెనక ఏదో లోతులుంటాయనిపించింది. సంకోచిస్తూనే సమాధానం ఇచ్చింది. "ఇంకా భోజనానికి రాలేదు." శంకరశాస్త్రి ఏమీ అనలేదు. ఏదో ఆలోచిస్తూనే భోజనం ముగించేడు. వీధి అరుగుమీదికి వచ్చేసరికి దారినపోతున్న సుబ్బన్నశాస్త్రి కనిపించేడు. "ఎవరు సుబ్బన్నా! ఎక్కడినుంచోయి?" "పావంచాల రేవునుంచి మామగారూ!" అంటూ సుబ్బన్నశాస్త్రి నిలబడి కబుర్లు ప్రారంభించేడు. "భోజనమయిందా?" "ఇప్పుడే అయింది." --అంటూనే రామనాధం ఎక్కడన్నా కనిపించేడా యని వాకబు చేశాడు శాస్త్రి. "మధ్యాహ్నం చిరతపూడి వెళ్ళేడు. వచ్చేడా?" అదో కొత్త వృత్తాంతం. చిరతపూడి ఎందుకు వెళ్ళేడాయని కుతూహలం కలిగింది. సుబ్బన్నశాస్త్రి విశేషప్రోత్సాహంతో నిమిత్తం లేకుండానే రామనాధం ఎక్కడికి ఎందుకు వెళ్ళేడో తనకు తెలిసిన సమాచారం తెలియపరిచేడు. "పొద్దు ఆవేళప్పుడు కుంపటి పొలంగట్టున కనబడ్డాడు. చిరతపూడి అబ్బయ్యనాయుడిగారిని చూసివద్దామని వెడుతున్నానన్నాడు." "నాయుడుగారితో వీడికి పరిచయం ఏమిటి?" సుబ్బన్నశాస్త్రి సమాధానం విన్నాక శంకరశాస్త్రి కనుబొమ్మలు ముడిసేడు. ఆడపిల్లకి మగవాడితో పరిచయం అన్నమాటకర్ధం ఏమిటి? పడవలో కలిసి ప్రయాణం చేసినంతమాత్రాన వాళ్ళ ఇంటికి వెళ్లాలా? వయసొచ్చిన పిల్ల పిలవడమేమిటి? వీడు బయలుదేరడం ఏమిటి? శంకరశాస్త్రి అనేక అనుమానాలతో కొట్టుకుపోయేడు. కూడా వున్న తల్లి ఎరగదా? గుడ్డివాడైతే మాత్రం తండ్రికి అర్ధం కాదా? ముక్కు మొగం తెలియని పడుచువాడు పని కట్టుకుని తనతో పరిచయం పేరుతో ఇంటికి రాకపోకలు ప్రారంభిస్తే ఏమిటో, ఎందుకో గ్రహించలేడూ? కొడుకు తన భార్య వద్ద తెలిపిన అభ్యంతరానికి మూల కారణం దొరికిందనిపించింది. ఇదే కారణమయితే అతని అభ్యంతరం నామమాత్రంగానే వుంటుంది. శంకరశాస్త్రి అబ్యయ్యనాయుడి ఆస్తి వ్యవహారాలూ, కుటుంబ పరిస్థితులూ తెలుసుకోవడం మాటున స్వరాజ్యం చదువు సంధ్యలూ, రూపు రేఖలూ వివరాలూ తెలుసుకున్నాడు. గ్రామ పురోహితుడుగా సంగ్రహించిన సమాచారంతోపాటు నాలుగురోజుల క్రితం తాను చూసిన మనిషిని కూడా సుబ్బన్నశాస్త్రి పరిచయం చేసేడు. తను చేసిన వేళాకోళం మాట చెప్పకుండా రామనాధానికి ఆమె యెడగల సదభిప్రాయాన్ని వివరించేడు. "మనవాడు ఆమె చాల మంచిపిల్ల అన్నాడు. చదువుకున్నదీ, మర్యాదలెరిగినదీ, మంచి దక్షురాలూ అన్నాడు." ఒక్క రాత్రి పడవలో పక్క గదుల్లో ప్రయాణం చేసినంతమాత్రానే అంతా అర్ధమయిపోయిందేం అనుకున్నాడు శాస్త్రి. అసలు విషయం తెలియకుండానే, తాను సకాలంలో సరియైన పని చేస్తున్నాననిపించింది. 'ఇంక ఫర్వాలేదు.' అనుకొని బేఫర్వాగా వీధిలోకి బయలుదేరేడు. ఇరవై కాని మరునాడు మధ్యాహ్నం భోజనాలయ్యాక రామనాధం తాను పడుకున్న చోటికి వచ్చి అసలు విషయంలోకి దిగాక గాని తన పొరపాటు శంకరశాస్త్రికి అర్ధం కాలేదు. "ఏమిటి కథ......"--అన్నాడు యథాలాపంగా ఎదుట నిల్చున్న కొడుకును చూచి. "మీరేదో ప్రయత్నంలో వున్నారని తెలిసింది."--ఆ ప్రయత్నం దేనిని గురించో చెప్పడానికి సిగ్గుపడ్డాడు. శంకరశాస్త్రి పనుల తొందరలో చెప్పడం మరిచినట్లూ, అతడు జ్ఞాపకం చేస్తేనే గుర్తు వచ్చినట్లూ కొద్ది చిరాకు నటించేడు. "ఆ. ఔనౌను. చెప్పడం మరిచేను, మీ అమ్మను చెప్పమన్నాను గదా. మొన్న అమలాపురం వెడితే మీ మామగారు చెప్పేరు. పిల్లను పంపుతాం తీసుకెళ్ళమన్నారు. ఏదో మాటవరసకు అన్నారనుకున్నాను. నిన్న వుత్తరం వ్రాశారు. నాలుగైదు రోజుల్లో ముహూర్తం పెట్టి కబురు చేస్తామన్నారు..." రామనాధం నిర్ద్వంద్వంగా ఆ ప్రయత్నం ప్రస్తుతానికి పనికిరాదని చెప్పేడు. "ఆమె చాల చిన్న వయస్సుది....." తన వయస్సు ఏ మాత్రం ఎక్కువ. పందొమ్మిదో ఏడు నడుస్తూంది. అప్పుడే సంసారం ఏమిటి? పనికిరాదని చెపుతూంటే శంకరశాస్త్రి ఆశ్చర్యంతో నోరు తెరిచేడు. శరీర శాస్త్రరీత్యా భార్యాభర్తలుగా జీవించడానికి తగిన వయస్సు గురించి తాను చదువుకున్నవీ, విన్నవీ అనేక సంగతులు రామనాధం వివరిస్తూన్నాడు. కొడుకు మాటలు వింటూంటే శంకరశాస్త్రికి అరికాలి మంట తలకెక్కుతూంది. ఆ శరీర శాస్త్రాలూ, మనశ్శాస్త్రాలూ గురించి ఆయనకే మాత్రం నమ్మకం లేదు. ఆ అమ్మాయి రజస్వల అయింది. ప్రకృతి పెట్టిన అడ్డు తీరింది. ఆమెకన్న రామనాధం అయిదేళ్లు పైగా పెద్దవాడు. వరహీనం మనిషి కాదు, ఒడ్డూ పొడుగూ పాతికేళ్ళ వాడల్లే ఉంటాడు. మరెందుకా అభ్యంతరం. పెంకితనం కాకపోతే..... పైగా తాను స్వయంగా వెళ్ళి వాళ్ళని కదిలించి, చేసుకువచ్చిన ఏర్పాట్లవి. ఆ మాట పైకి చెప్పకపోయినా జరిగిందది. నారాయణమూర్తిని గదిమి, వియ్యపురాలిని వొప్పించి చేసుకువచ్చిన ఏర్పాటు, ఇప్పుడు వయస్సు, శరీర శాస్త్రంలాంటి అర్ధం పర్ధం లేని ఆటంకాలు తెస్తూ, దానినంతనూ కాదంటూంటే వొప్పుకోవలసిందేనా--అనుకున్నాడు. "అవతల పెద్ద మనుషులతో పని....." రామనాధం వెనక్కి తగ్గలేదు. తాను మాట ఇచ్చేనంటే 'ఎవరిమ్మన్నారు?'... అదే అడిగేసేడు. "నన్ను అడగందే......" పెళ్ళీ, కుటుంబ జీవితం అనేవి వానిననుభవించేవాళ్ళ అభిరుచీ, ఇష్టానిష్టాలు బట్టి జరగాలనే ఆధునికాభిప్రాయం రామనాధానిది. అలవాట్లూ, ఆచారాల రీత్యా శంకరశాస్త్రి దృష్టిలో అది చాల చిన్న విషయం. తమ బిడ్డలకి పెళ్ళి చేయడం తల్లిదండ్రుల కర్తవ్యాలలో ఒకటి. పిల్లల్ని పాడు చెయ్యాలని ఎవ్వరూ అనుకోరు. అదీగాక...... చిన్నవాళ్ళకి ప్రపంచ జ్ఞానం ఏం వుంటుంది? వాళ్లు ఏం చెప్పగలరు? పిల్ల అందంగా వుందో లేదో చూస్తామనుకొంటారు. కాని, వాళ్ళ మొహం! సిగ్గుపడుతూ, భయపడుతూ, కన్ను ఎత్తగానే సరా? ఎర్రగా బుర్రగా వుంటే సరేనా? కను, ముక్కు తీరు వుండనక్కర్లేదూ? కుటుంబ గౌరవం, వంశ సంప్రదాయం, రోగాలు-భోగాలు ఎన్ని చూడాలి? పిల్లల భవిష్యత్తునాలోచించి, ఏది మంచిదో చూసి తల్లిదండ్రులే ముడిపెట్టెయ్యాలి గాని.... శంకరశాస్త్రి ధోరణి అది.... ఆ విధంగానే ఆయన రామనాధం పెళ్ళి చేసేడు. పెళ్ళికి వొప్పించడానికి ఓ మొట్టికాయ వేయవలసి వచ్చినా, అప్పుడే సంఘంలో కొత్తగా అలవాటు అవుతున్న పద్ధతి ప్రకారం అతనిని తీసుకెళ్ళి పిల్లనోమారు చూపించేడు. "ఇదిగోరా అబ్బాయి! నీ పెళ్ళాం. చూసుకో...." అన్నాడు. ఆ మాట వినేసరికి అంతవరకూ తల్లిని ఒత్తుకొని, తలవంచుకొని నిలబడ్డ ఆ తొమ్మిదేళ్ల పిల్ల సిగ్గుతో ఉక్కిరిబిక్కిరి అయిపోతూ తల్లి పట్టు విడిపించుకొని ఇంట్లోకి పారిపోయింది. నలుగురూ నవ్వేరు. ఆ క్షణం వరకూ ఇప్పుడప్పుడే పెళ్ళి వద్దని గునుస్తూ ముఖం మాడ్చుకుని వున్న రామనాధం చక్కగా వున్న ఆ సిగ్గరిని చూసేక మరి గునసలేదు. ముఖం విడింది. ఆ విషయాన్నే శంకరశాస్త్రి జ్ఞాపకం చేసేడు. వయస్సు వచ్చేక దంపతుల్ని కలపడం కూడా వాళ్ళ తల్లిదండ్రుల బాధ్యతలలోనిదేనని అతడు భుజాలు కుదిలించుకున్నాడు. అది ఓ కర్తవ్యం. తమ కర్తవ్య నిర్వహణ గురించి పిల్లల నడిగేదేముంది? అడిగితే మాత్రం ఏం చెప్తారు? అడిగితే సిగ్గుపడతారు. అందుచేత అడగరు. తాము ఆడదానికోసం అలమటించిపోతున్నట్లు హాస్యం పట్టిస్తారని భయపడి అప్పుడే కాదంటారు. కాని, కార్యం చేసేస్తే వూరుకుంటారు. నవ్వుకుంటూ పిల్లల్ని కనేస్తారు. అందుచేతనే పెళ్ళిళ్లూ, పునస్సంధానం విషయంలో దాని కష్టనష్టాలననుభవించే వాళ్లు గదా యని ప్రత్యేకంగా పిల్లవాళ్ళని అడగరు. అడగాలనీ అనుకోరు. ఇంట్లో హడావిడితోనే వాళ్ళకి అర్ధం అవుతుంది. ఎవరన్నా చెప్పినా మాటవరసగా మాత్రమే. అలాగే శాస్త్రీ వ్యవహరించేడు. ఇప్పుడు తన్ను అడిగి వుండవలసింది--అంటే? తన కర్తవ్యంలో అదో భాగం. దానికీ ఒకర్ని అడగాలా యని శంకరశాస్త్రి ఆశ్చర్యం ప్రకటించేడు. రామనాధం ఆ కర్తవ్యాన్ని పూర్తిగా నిరాకరించేటందుకు సిద్ధంగా లేడు. "బాగుంది, కాని నాకది అభ్యంతరం అన్నప్పుడు....." కొడుకు పట్టుదల చూస్తున్న కొలది శంకరశాస్త్రికి తామసం కలుగుతూ వుంది. అతని అభ్యంతరం తాననుకున్నట్లు నామమాత్రం కానందుకు చికాకుపడుతున్నాడు. తన మాటకెదురు పలకనివాడు అడ్డు చెప్పేంత వాడయ్యాడా అని కసి పుట్టింది. కాక..... నాయుడు కూతురితో వ్యవహారం పెళ్ళామే వద్దనేంతవరకూ వెళ్ళిందా అని కూడా అనిపించింది. ఆ అడ్డు తీర్చేసి కోడల్ని ఇంటికి తెచ్చేస్తే తప్ప లాభం లేదనుకున్నాడు. 'ఆవిడ నట్టింట కనబడేవరకే ఎగిసిపాట్లన్నీ--' అనుకున్నాడు. అయితే వ్యవహారజ్ఞానం వున్నవాడు గనుక కోపతాపాలు చూపి రెచ్చగొట్టరాదనుకున్నాడు. ఈమారు శంకరశాస్త్రి బ్రహ్మాండమైన కారణం తీసుకొచ్చేడు. "అన్నీ సిద్ధం అయ్యేక ఏ కారణం లేకుండా శుభకార్యమిప్పుడు చేసుకొనేది లేదంటే లోకం ఏమంటుంది? పోనీ చదువుతున్నాడు, పరీక్షల ముందు ఇదేమిటంటావా? అదీ మానుకుకూర్చున్నావాయె." పోనీ ఈ పేరునన్నా మళ్ళీ కాలేజీకి వెడతానులే అంటాడేమోనని శాస్త్రి ఒక్క నిముషం ఆగేడు. రామనాధం ఆ ధోరణిలోనే లేడు. "ఇప్పుడిదేమీ తలపెట్టద్దు. కనీసం రెండేళ్లు....." శాస్త్రి మాట మధ్యలోనే అందుకున్నాడు. "ఇప్పుడు అలా అనడం మంచిది కాదు. నేనెందుకు చెప్తున్నానో విను. ఇప్పుడు మనం కాదన్నామంటే మనలో ఏదో లోపం వుంది అనేస్తారు. అల్లాంటి మాట వచ్చిందంటే ఎంత అప్రతిష్ట!" ఆ 'ఏదో లోపం' పుంస్త్వహీనతకు సూచన. పడుచువానిని పట్టుకుని అతని పుంస్త్వం గురించి అస్తినాస్తి విచికిత్స ప్రారంభిస్తారనడం కన్న రెచ్చగొట్టే మాట మరొకటి వుండదు. ఆ మానవ బలహీనతను శంకరశాస్త్రి ఉపయోగించుకోదలచేడు. కాని, రామనాధం మెత్తబడలేదు. శాస్త్రి ఈ మారు ఇంకాస్త నొక్కేడు. "మీ మామగారు చాలా అసాధ్యుడు. అందులో పోలీసు ఆఫీసరు. ఇల్లాంటి మాటొకటి పుట్టిందా మన్ని అల్లరి పెట్టేస్తాడు. పెద్దవాళ్ళ పరీక్షలనీ, డాక్టరు పరీక్షలనీ.... ఇంక తలెత్తుకు తిరగలేం..." ఆ పరీక్షల బెదిరింపులక్కూడా రామనాధం లొంగలేదు. రాజకీయ కారణాలతో కాలేజీ మానెయ్యడం ఏమిటంటే చెప్పడానికీ, వాదించడానికీ ఇంకా పటుత్వం చేకూరలేదు. కాని, సంఘ సంస్కారానికి సంబంధించిన విషయాలమీద అతడు చాలా విన్నాడు, చదివేడు. వీరేశలింగంగారి ప్రహసనాలూ, సంఘ సంస్కరణలను సమర్థిస్తూ ఆయన తెచ్చిన శ్రుతి-స్మృతి-పురాణ ప్రమాణాలూ అన్నీ అతనికి హృత్కవిలి. ఆ సమస్యలపై అతడెందరితోనో వాదించేడు. వానిని గురించి అతనికి స్థిరమైన అభిప్రాయాలు ఏర్పడుతున్నాయి. ఈ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గవలసిన అవసరం కనబడలేదు. పైగా ఇదేమంత సంస్కారం? సంఘ సంస్కరణ వాదనలు తెచ్చేసరికి శంకరశాస్త్రి మనస్సులో అబ్బాయి నాయుడు మెదిలేడు. సుబ్బన్నశాస్త్రి చెప్పిన వృత్తాంతం కళ్ళముందు కదిలింది. "నాయుడు కూతురు చెప్తున్న పాఠాలు బాగానే వొంటబడుతున్నట్లున్నాయే...." శంకరశాస్త్రి తప్పుమాట అన్నట్లు కనిపించకుండానే తన అనుమానాలు, అభిమానాలు అన్నీ అర్థం అయ్యేలా చేశాడు. నాయుడు కూతురు మాట వినగానే రామనాధం ఆశ్చర్యపడ్డాడు. వారితోడి పరిచయాన్ని అతడు దాపరికం చేయాలనుకోలేదు. కాని, అది తండ్రికెల్లా తెలిసిందాయని అతని ఆశ్చర్యం. అప్రయత్నంగానే అడిగేడు. "నాయుడు కూతురేమిటి?......" శంకరశాస్త్రి విదిలించేడు. "పిల్లి కళ్ళు మూసుకొని తన్నెవరూ చూడడం లేదనుకుంటుంది. రాజమండ్రి నుంచి కలిసి పడవలో రావడం, ఆవిడ తమ యింటికి రమ్మనడం, నిన్న పగటివేళంతా నువ్వు అక్కడే వుండడం ఎవరికీ తెలియదనుకోకు. ఎన్నాళ్ళనుంచేం ఈ పరిచయం....?" ఇదివరకు ఏమన్నా గోప్యంగా వుంచినా ఈమారు శాస్త్రి తన ప్రశ్నలో దాపరికం మిగల్చలేదు. రామనాధం నిర్విణ్ణుడైపోయేడు. ఒక్క క్షణం కోపం వచ్చింది. అడుగుతున్నది తండ్రిలాగ పెంచినవాడు. ఏమీ అనలేని స్థితి. కోపాన్ని దిగమింగుకున్నాడు. కాని, కంఠంలో ఆ కసి ప్రత్యక్షరంలో తొణికింది. "పెంచిన పెద్దరికం చూసి మీరు నన్ను ఏమన్నా చెల్లుతుంది. కాని, వాటిక్కూడా ఓ పరిమితి వుండాలి. ఇంక నామీద కోపం వుంటే నాతోనే సరిపుచ్చడం మంచిది. నాకు తెలిసిన వాళ్ళనీ, ఎప్పుడో ఓమారు మాట్లాడిన వాళ్ళనీ, అందులో ఆడపిల్లల్నీ నిందించడం...." అంతకన్న నీతో మాట్లాడవలసిన పని ఏమీ లేదన్నట్లు రామనాధం వెనక్కి తిరిగేడు, మాట కూడా పూర్తి చేయకుండా..... తాను నీతి తప్పలేదని సమర్థించుకోడానికి రామనాధం కోపం చూపినా, నిస్సహాయత చూపి కళ్ళనీళ్ళు పెట్టుకొన్నా, అటువంటి అనుమానాలకాధారం లేదని ఘటనలు ఏకరువు పెట్టినా శంకరశాస్త్రి నమ్మి వుండేవాడు కాదు. కాని అతడు చూపిన అభిమానం, నిర్లక్ష్యం చూసేక తన అనుమానం అర్థరహితమని గ్రహించేడు. పొరపాటున మాట జారేనేమో అనిపించింది. కాని అంతవరకూ వచ్చేక వెనక్కి తగ్గడం చేత కాలేదు. పైగా తాను తయారుచేసిన వలను ఏం చేయడం.... తానూ అభిమానం, నిర్లక్ష్యం చూపించడం తప్ప మార్గాంతరం లేదనుకొన్నాడు. "ప్రాప్తేతు షోడశే వర్షే.... అని పెద్దలూరికే అన్నారా..... కన్న కొడుకు విషయంలోనే ఆమాట అన్నప్పుడు పెంచడం తప్ప ఇతర రక్త సంబంధం కూడా ఏమీ లేని నేను నా పరిమితిలో వుండడం మంచిదే. సరే, ఇప్పటినుంచే వుంటాను. నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో. ఆ మామగారికి సమాధానం ఏమిస్తావో నువ్వే చూసుకో" శంకరశాస్త్రి విసురుకుని వెళ్ళిపోయేడు. ఇరవయ్యొకటి "ఏడీ, వీడేడీ." --అని అపోశనపడుతూ, శంకరశాస్త్రి రామనాధం గురించి వాకబు చేశాడు. "చీకటి పడుతూనే ఆకలేస్తూందని అన్నం పెట్టించుకొని తిని వెళ్ళిపోయేడు." రామనాధం రాత్రి ఇంటికి రాలేదు. కాని, ఆ విషయం ఎవ్వరూ పట్టించుకోలేదు. ముంగండ పెద్ద చెరువులో చేపలు ఎవ్వరూ పట్టకుండా కాపలా కాయడం ఓ అలవాటుంది. వూళ్ళో పడుచుకారుకు అదో తరిఫీదు. వెన్నెల రాత్రులూ, హుషారు పుట్టినప్పుడూ కర్రసామూ వగైరా నేర్చుకొంటూంటారు. చెరువు కాపలాకి వెడుతూంటారు. చాలా కుటుంబాలు ఆ అలవాట్లని ప్రోత్సహిస్తాయి. రామనాధం కూడా వూళ్ళో వున్నప్పుడు ఆ జట్టులోనే వుంటాడు. వాళ్ళతోపాటు ఏ చెరువుగట్టుమీదనో కండువా పరుచుకు పడుకుంటాడు. బహుశా అలాగే అనుకున్నారు ఈవేళాను. పొద్దుట కూడా రాకపోయేసరికి రాజమ్మ ఎందుచేత చెప్మా అని విశాలాక్షికి కబురంపించింది. కబురు రాగానే చేతిలో పని వదిలిపెట్టి విశాలాక్షే వచ్చింది. "ఏమిటి పిన్నీ! రాత్రి పడవకి వెడుతున్నానన్నాడే, నువ్వెరక్కపోవడం ఏమిటీ? చెప్పలేదా?" అంది. "ఆ మాటేం చెప్పలేదే" అని రాజమ్మ ఆశ్చర్యపడింది. ఆ మాట విని శంకరశాస్త్రి మరొకలాగా సంతోషించేడు. గతరోజు గంద్రగోళం పనిచేసిందనుకున్నాడు. భార్యను తీసుకురాకుండా తప్పించుకోడానికి మళ్ళీ కాలేజీకే వెళ్ళి వుంటాడని భావించేడు. బహుశా తమతో చెప్పడానికి సిగ్గుపడి వుంటాడు. ఆ సంతోషం ఎంతోసేపు వుండలేదు. పదిగంటలవేళ పొలం నుంచి వస్తూ విశ్వనాధం పలకరించేడు. "అబ్బిగాడు రాత్రి మెయిల్‌బోటుకి వెళ్ళాలన్నాడు. వెళ్ళినట్లేనా? కాకినాడ కూడా పోయిరావాలన్నాడు." విశాలాక్షి అన్నదని విన్నప్పుడు రాని కోపం విశ్వనాధం అన్నప్పుడు వచ్చింది. వూళ్ళో అందరికీ తెలుసు. తనకొక్కడికే తెలియదు. ఆ కోపంలో విసుక్కున్నాడు. "వాడి తోచినచోటికి వెళ్ళనీ కాకినాడ వెళ్ళినా సరే, కాశీ వెళ్ళినా సరే. నేను చదువు మాని రమ్మంటేనే వచ్చేడా? ఎవరి కష్టసుఖాలు వాళ్ళవి. గడ్డాలూ, మీసాలూ వచ్చేదాకానే మన మాట. తర్వాత ఎవరి ప్రారబ్ధం వాళ్ళది." పోకపొత్తిలో కట్టిన అరిటాకుల కట్టతో వాకిట్లోనే నిల్చుని వున్న విశ్వనాధం శాస్త్రి విసుగుదల చూశాక ఆ కట్ట అరుగుమీద పెట్టేడు. తానూ అరుగుమీద కూర్చున్నాడు. "నీకు నేను చెప్పవలసినవాణ్ణి కాదనుకో. అయినా, నువ్వంత చెండనాడుకోవడం మంచిది కాదనుకుంటా. బాగులేదు. పోనీ, వాడిది ఒక పిచ్చే అనుకుందాం. చదువు చెప్పించేవు, పెద్దవాణ్ణి చేసేవు. ఇప్పుడు......" మొదట విశ్వనాధం చెప్పేది ఏమిటో అర్ధంకాలేదు శాస్త్రికి. కాని క్రమంగా విశదమయింది. రామనాధం వద్దంటూంటే ఇప్పుడు కార్యం చేసుకోమని నిర్బంధించడం బాగులేదని విశ్వనాధం బోధ. "ఏడిసినట్లే వుంది నీ తెలివి" అనుకున్నాడు ఓ మాటు మనసులోనే శంకరశాస్త్రి. కాని, ఆ ఓర్పు ఎంతో సేపు నిలవలేదు. సర్దుబాటుగా విశ్వనాధం మాట్లాడుతూంటే శంకరశాస్త్రి ఆగ్‌బబూలా అయిపోతున్నాడు. విశ్వనాధానికి రామనాధం స్వయానా తమ్ముడి కొడుకు, అయినా అతని మంచిచెడ్డలూ, యోగక్షేమాలూ గురించి విశ్వనాధం ఎన్నడూ పట్టించుకోలేదని శాస్త్రి అభిప్రాయం. నిజానికి విశ్వనాధం దగ్గరున్న వాడిని తానూ, భార్యా బ్రతిమాలి తీసుకువచ్చిన మాటనెన్నడో అతడు మరిచిపోయేడు. ఏ అనారోగ్యమో అని విని చూసిపోవచ్చినప్పుడూ, పరీక్ష ప్యాసైన వార్త విని సంతోషం తెలపడానికి వచ్చినప్పుడూ ఏదో పుల్లవిరుపుమాట అనేవాడు. ఈసడిస్తూ మాట్లాడేవాడు. అందుచేత విశ్వనాధం రావడం తగ్గించేడు. ఊళ్ళో వుంటే రామనాధమే వెడతాడు పెదతండ్రిగారి యింటికి. అది శాస్త్రికి ఇష్టం వుండదు. కాని రామనాధం ఆ అభ్యంతరాన్ని ఎప్పుడూ లెక్కచెయ్యలేదు. అది శాస్త్రికి మరీ కోపం. కుర్రవాడు తనకు రక్తబంధువేం కాదు, భార్యకు అక్క కొడుకు. తమకు పిల్లలు లేరు. తల్లితండ్రీలేని పిల్లడు, చక్కనివాడు. చేరదీద్దామంటే సరేనన్నాడు. ఆ కుర్రవాడి వాటా ఆస్తి, భూమి తానే చూసిపెట్టేడు. పెళ్ళిచేసేడు. చదువు చెప్పించేడు. తన ఇల్లు వదిలేక ఈ రక్తబంధువు మాటమాత్రంగానయినా "పంటలు పండుతున్నాయా, వ్యవహారాలు ఎల్లా వున్నాయని" అడగలేదని శాస్త్రి మనస్సులో కోపం. అడిగితే చెప్తాడా అంటే అది వేరుమాట. చెప్పడు. అది తథ్యం. తన మీద నిఘా వుంచేవా అనేస్తాడు. అందుకే అడగలేదేమో అనుకోడు. మాటకేనా అడగలేదంటాడు. అదో కక్ష. ఆ కోపాన్ని శాస్త్రి ఎన్నడూ రహస్యంగా వుంచుకోలేదు. విశ్వనాధం ఆస్తి కరిగిపోయి, మనిషి ఆర్ధికంగా లుగసాను అవుతున్నకొద్దీ ఆ కోపం చిన్నచూపుగా మారింది. పిల్లవాడిని తాను చేరదీసి వుండకపోతే వాని ఆస్తికూడా కరారావుడు చుట్టేసేవాడేననీ, తాను ఆ ఆస్తిని కాపాడడమే గాక మరో నాలుగెకరాలు చేసి పెట్టేనని శాస్త్రికొక సంతృప్తి. తనకు అంత చిన్నచూపు వున్న చోటి నుండి ఆ సలహా రావడం శాస్త్రికి ఎంతో అక్కసు కలిగించింది. అంతవరకూ తనకు తట్టివుండని మాట ఒకటి స్ఫురించింది. రామనాధం పెంకితనానికి వెనక మద్దతు వుందన్నమాట అనుకున్నాడు. దానితో మరికొంత వెనక్కి కూడా ఆలోచన సాగించాడు. "కాలేజీ మానడాన్ని కూడా ఈ ప్రబుద్ధుడే ప్రోత్సహించి వుంటాడు" అనిపించింది. దానికి శాస్త్రి దృష్టిలో బోలెడంత ఆస్కారం వుంది. వందేమాతరం వుద్యమం రోజులప్పటి నుంచీ విశ్వనాధం వూళ్ళో స్వరాజ్యం గురించి మాట్లాడుతున్నాడు. కేసరి పత్రికలో ఏదో వ్యాసం వ్రాసినందుకు తిలక్‌ను ఆరేళ్ళు మాండలే జైలుకు పంపేరని రావిచెట్టు క్రిందా, పెద్ద చెరువు పావంచాలలోనూ గవర్నమెంటును తిట్టిపోసేవాడు. విపిన్‌ చంద్రపాల్‌ వుపన్యాసం వినడానికి పనికట్టుకొని కాకినాడ వెళ్ళేడు. మొన్నటికి మొన్న గాంధీని చూస్తానని బెజవాడ వెళ్ళేడు. ఆంధ్రపత్రికను ప్రచురిస్తానని నాగేశ్వరరావు పంతులుగారు అనుకొన్నారో లేదో కార్డు రాసి పడేశాడు. ఆనాటి నుంచి నాగా లేకుండా తెప్పిస్తున్నాడు. పత్రిక ఆఫీసులోనన్నా వుంటాయో లేదోగాని, అతని వద్ద ఈ ఆరేడేళ్ళ పత్రికలూ ఒక్కటీ బీరుపోకుండా నెలవారిగా కట్టలు కట్టి జాగ్రత్తగా వున్నాయి. తీరుబడిగా వున్నప్పుడు పాత వుపన్యాసాలూ, వ్యాసాలూ చదువుతూంటాడు. కాంగ్రెసు సభలు ఎక్కడ జరిగినా వెళ్ళవలసిందే. ఆతనికి ఇంగ్లీషు రాదు, అసలే భాషా రాదు. ఆంధ్రపత్రిక ధర్మమాయని తెలుగు వ్రాయనూ, చదవనూ వచ్చింది. నిత్యవ్యవహారానికి మించి హిందీ రాదు, సభల్లో ఎవరేం మాట్లాడినా ఇంటికొచ్చి ఆంధ్రపత్రిక చదివి తెలుసుకోవలసిందే, అలాగని ఒక్క సభకు మానడు. కాంగ్రెసుయెడ అతనికి గల భక్తీ, ఆసక్తీ ఆతని పరోక్షంలో గ్రామస్తుల హాస్యానికే గురి అవుతుంటాయి. ఏమంటే ఆ భక్తి వేడిలో ఆస్తి కాస్తా హరించి పోయింది. అంతా ఆతనిని మంచివాడంటారు. న్యాయపరుడు అంటారు. కాని ఆర్ధికంగా చితికిపోయాడు. ఇంక ఆ మంచికి బలం ఏదీ? రామనాధాన్ని ప్రోత్సహించడానికి అతని దేశభక్తి కారణం అయి వుంటుందని కూడా శాస్త్రి అనుకోలేదు. అతని ఆస్తి మీద కన్నుపడడమే కారణం అనిపించింది. రామనాధం అతని మాటలలో పడి కాలేజీ మానేసేడు. ఇప్పుడు భార్యను తీసుకురావద్దని కూడా మొరాయిస్తున్నాడు. దానికీ విశ్వనాధం ప్రోత్సాహం వుందనడానికి ఎన్నో కారణాలు కనిపించేయి. నారాయణమూర్తితో సంబంధం విశ్వనాధానికి మొదటి నుంచీ ఇష్టం లేదు. పోలీసు ఆఫీసరుతో సంబంధం ఏమిటని అప్పుడే అన్నాడు. వాళ్ళు బ్రిటిష్ ‌వాళ్ళ తాబేదార్లు. ప్రజల్ని హింసిస్తారు కనక పనికిరాదన్నాడు. చివరకాతడు పెళ్ళికి కూడా వెళ్ళలేదు. పోలీసు వాళ్ళంటే వున్న అసహ్యమూ, ద్వేషమూతో ఆ సంబంధం చెడగొట్టడానికే రామనాధానికి ఈ ఆలోచన కలిగించేడనిపించింది. ఆ మాటే అనేసేడు. "వాడి ముడ్డిగిల్లి ఇప్పుడీ సలహా ఇవ్వక మరేమంటావు?" ఆ ఆరోపణ విన్నాక విశ్వనాధం చాలా చిన్నపుచ్చుకొన్నాడు. ఆ మాటకు అభ్యంతరం తెలుపడం కూడా అనవసరం అనుకొన్నాడు. లేచేడు. కాని వెళ్ళిపోయే ముందు ఇంకొక్కమాటు హెచ్చరించకుండా వుండలేకపోయేడు. "ఇదిగో శాస్త్రీ! మనస్సు చికాకుగా వుండి ఏదో అన్నావు. ఫర్వాలేదు. పడ్డవాడు చెడ్డవాడు కాదు. కాని ఒక్కటి ఆలోచించు. రామం చెప్పింది నాకు బేసబబుగా అనిపించలేదు. సంసారం మోసే ఈడు ఇద్దరిదీ కూడా కాదు. ఆలోచించు. చెండనాడుకోకు. నలుసంతవాడిని ఇంతవాడిని చేశావు!" శంకరశాస్త్రి కూర్చున్నవాడు బుస్సుమని లేచేడు. అంగోస్త్రం దులిపి భుజాన వేసుకున్నాడు. "ఇంతమంది బంధువులుండగా వాడికేం లోటు? వాడికిప్పుడు నా అవసరం ఏం వుంది గనుక?" ఇరవైరెండు అబ్బాయినాయుడుగారి తోట ఇదేనా అని అడుగుతున్న కుర్రవాని గొంతు విని మాణిక్యమ్మ గుమ్మంలోకి వచ్చింది. "ఎవరి కోసం నాయనా!" "అబ్బాయినాయుడుగారి కోసం....." "వారితో ఏం పని?" "పనుంది." "ఏ వూరు మీది?" "ముంగండ." "ఎవరి అబ్బాయివి....." "మా అమ్మ పేరు విశాలాక్షి..." "నాన్న పేరు?" "ఆయన పేరు సుబ్రహ్మణ్యం. ఆయన లేరు. నా పేరు బాలకృష్ణ, నా వయస్సు పదేళ్ళు, అంబాజీపేటలో చదువుకుంటున్నా, థర్డుఫారం. మా హెడ్మాస్టరు పేరు కూడా కావాలా?" మాణిక్యమ్మ విస్తుపోయి "గడుసువాడివేనే" అంటూంటే, పక పక నవ్వుతూ స్వరాజ్యం వచ్చింది. "ఇప్పుడేనా చెప్తారా, అబ్బాయినాయుడిగారిల్లు ఇదేనా?" అన్నాడు బాలకృష్ణ తిరిగి. "ఎవరు పంపించేరు?" అంది స్వరాజ్యం కొంటెతనంగా. "అదొకటి మిగిలిపోయిందన్నమాట? కాని, నేను చెప్పను ముందు మీరెవరో చెప్పండి." "అబ్బాయినాయుడుగారు మా నాన్నగారు." "మీ పేరు?" "స్వరాజ్యం." "మీ తోట్లో ఎన్ని కొబ్బరి చెట్లున్నాయి?" "ఎందుకు?" "ఏం, మీరు అన్ని ప్రశ్నలు వేయగా లేంది, నేను ఆమాత్రం అడక్కూడదా?" "ఎందుక్కూడదు? కాని అవసరం ఏమిటాయని గాని...." "ప్రస్తుతం అటువంటి అవసరం లేదనుకోండి. కాని, అబ్బాయినాయుడుగారి యిల్లు ఇదేనో కాదో, ఆయన ఎక్కడున్నారో అవసరం వుంది." "వస్తారు కూర్చోండి." "ఆయన ఇల్లు ఇదేనో కాదో చెప్పేరు కాదు." "వస్తారు అంటే ఇది ఆయన యిల్లు అనే కదా...." "కాదు. ఆయన ఇల్లయితే వుంటారు. పరాయి ఇంటికి వస్తారు." స్వరాజ్యం కళ్ళు తిప్పింది. "ఓహో, అదీ నిజమే, సరే. ముందు ఇల్లా దయచెయ్యండి." బాలకృష్ణ వచ్చి అరుగు మీద కూర్చున్నాడు. "ఏమిటి సంగతి? మా యిల్లు ఎలా పట్టుకొన్నారు?" బాలకృష్ణ ఇంకా కొంటెతనం పక్కకు పెట్టలేదు. "ఇదెవరి ఇల్లో తెలియందేనా?" స్వరాజ్యం పక పకా నవ్వింది. ఇంతలో అబ్బాయినాయుడు గుమ్మంలోకి వచ్చేడు. "ఎవరు కావాలంటారాయన?" "అబ్బాయినాయుడుగారిల్లు కావాలంటారు. ఎందుకంటె చెప్పరు. వస్తారంటే ఆయన ఇల్లేదంటారు." నాయుడుకూడా మాటల చెలగాటంలో ప్రవేశించేడు. "నాయుడుగారు కావాలో, వారిల్లు కావాలో మరి?" అన్నాడు. "అవును అది మరిచేపోయేను... ఏమంటారు? మీకు కావలసినది?" అంది స్వరాజ్యం. "నాయుడుగారిల్లు...." "ఇదే మరి....." "అయితే నాయుడుగారు....." ప్రశ్నా, సంబోధనా తేలని కంఠస్వరం విని స్వరాజ్యం సమాధానమిచ్చింది. "ఈయనే....." బాలకృష్ణ పకపక నవ్వేడు. "నేను ఎవరని అడగలేదు. నాకు తెలుసు. అందుకే ఆయన్నే పిలచేను" అంటూ బాలకృష్ణ ఒక కవరు తీసి ఆయనకిచ్చేడు. "ఇది మా మామయ్య మీకివ్వమన్నాడు." నాయుడు ఆ కవరు కూతురుకు అందచేసేడు. ఆమె విప్పి జమకట్టిన ప్రోనోటు తీసింది. "ప్రోనోటు పంపించేరు." "అంత తొందర ఏం వచ్చింది? పాపం చిన్నాయన్ని శ్రమపెట్టేరు." "నాకేం శ్రమ లేదండోయి. నేను ప్రతివారం రెండుమూడుమాట్లు మీ వూరు వస్తూనే వుంటాను." "ఎవరింటికి?" బాలకృష్ణ సమాధానం ఇవ్వలేదు. "ఎందుకేమిటి?" అని నాయుడు ప్రశ్నించేడు. "నే చెప్పనా?" అంది స్వరాజ్యం. "ఊ." "కోపం చెయ్యరు కదా?" "ఉహు" "ఆచార్లుగారింటికి..." ఆచార్లుగారు పిచ్చాసుపత్రి నడుపుతారు. బాలకృష్ణ ఆశ్చర్యంతో కళ్ళు తెరిచేడు. పొరపాటున అనేశాడు. "నన్నెప్పుడు చూసేరు?" "ఔనా కాదా.......?" అని నిలదీసింది స్వరాజ్యం. "మీరెప్పుడో చూసేరు....." "ఎప్పుడూ చూడలేదు." "జగన్నాధాచార్లు చెప్పి వుంటాడు--" లేకపోతే తెలియడానికి వీలు లేదన్నంత ధీమాతో. నాయుడు కూతురు కొంటెతనం, అంత పెద్ద కబుర్లు చెప్పే బాలకృష్ణ అమాయకత్వం చూసి నవ్వేడు. స్వరాజ్యం తానన్న కొంటెమాట అర్ధం చేసుకోనందుకు చాల సంబర పడింది. వెంటనే జగన్నాధాచారి పేరు విని ఆమె అనుమానపడింది. "నేనెందుకో చెప్పనా?" అని మళ్ళీ కవ్వించింది. "మీరు చెప్పుకోలేరు." "పందెం." "పందెం." "సరే!" "సరే!" "ఎంతెంత?" బాలకృష్ణ జేబు తడిమి బేడకాసు తీసేడు. "మా నాన్నగారు మధ్యవర్తి" అంది స్వరాజ్యం. "సరే!" నాయుడు నాణెం తడిమి చూసి నవ్వేడు. "మరి నువ్వు కూడా ఇవ్వాలి" అని కూతుర్ని అడిగేడు ఆయన. స్వరాజ్యం అక్కడినుంచి కదలకుండానే తల్లిని కేకేసింది. మాణిక్యమ్మ గుమ్మంలోకి రాంగానే ఒక రూపాయి అడిగింది. విషయం విని మాణిక్యమ్మ బాలకృష్ణను వెనకవేసుకు వచ్చింది. "చిన్నవాడిని చేసి...." తనను చిన్నవాడనేసరికి బాలకృష్ణకు అభిమానం వేసింది. తాను స్వరాజ్యం చేతిలోంచి రూపాయి లాగేస్తున్నట్లే గంతువేసేడు. "ఏం ఫర్వాలేదు. కాయమనండి." కూతురు ఎత్తు గ్రహించిన నాయుడు బాలకృష్ణను హుషారు చేసేడు. "వెనకతియ్యవద్దు పంతులూ! ఏమిటో చెప్తుందిట చూద్దాం." స్వరాజ్యం నవ్వింది. ఓడిపోతావు సుమా అన్నట్లు కవ్విస్తున్న ఆ నవ్వు చూసి బాలకృష్ణ అభిమానపడ్డాడు. "చెప్పండి చూద్దాం." ఒక నిముషం ఆగి పందెంలో వున్న అన్యాయాన్ని గుర్తు చేసేడు. "పోతే నాది బేడ. కాని మీది రూపాయి సుమండి." "నాది పోదు." "అయినా ఎందుకేనా మంచిది? తగ్గించుకోండి"--అన్నాడు బాలకృష్ణ. "ఫర్వాలేదు." స్వరాజ్యం కొద్దిసేపు ఆలోచిస్తున్నట్లు నటించింది. "చెప్పెయ్యనా?" అని కవ్వించింది. "ఊ, త్వరగా చెప్పాలి." "కాచుకోండి చెప్పేస్తున్నా. జగన్నాధాచార్లు మీకు ఓ పుస్తకం ఇస్తానన్నాడు." "అది చాలదు. ఆ పుస్తకం ఏమిటో చెప్పాలి." అన్నాడు బాలకృష్ణ ఆదుర్దాతో. స్వరాజ్యం నవ్వింది. కాని, నాయుడు బాలకృష్ణను సమర్థించేడు. "వారిద్దరూ ఒక క్లాసు వాళ్ళు. ఒక స్కూలులో చదువుతున్న వాళ్ళూను. వాళ్ళు ఒకరి పుస్తకాలనొకరు పుచ్చుకోవడంలో ఆశ్చర్యం లేదు. పుస్తకం కోసం వచ్చేడంటే చాలదు." బాలకృష్ణ ఔనన్నాడు. "అందులో గొప్పేం లేదు. ఏం పుస్తకమో చెప్పాలి." "అల్లాకాదు. పుస్తకం కోసం వచ్చేవని నాకేం తెలుసు. ఊరికే రాకూడదూ? అంతే. ఆ బేడ ఇల్లా ఇవ్వండి." "చాలదు" అన్నాడు బాలకృష్ణ. "చాలదు" అన్నాడు అతనిని సమర్థిస్తూ నాయుడు. "అన్యాయం" అంది స్వరాజ్యం. "ఏమీ కాదు" అన్నాడు బాలకృష్ణ. "అంతే" అన్నాడు నాయుడు. "చెప్పలేకపోతే ఓడిపోయినట్లే...." అని బాలకృష్ణ. "ఏమంటావు, ఆలోచించుకో...." అని నాయుడు వంత. స్వరాజ్యం ఆలోచన నటించింది. ఆమె ఓడిపోతుందనే నిర్ణయంతో నాయుడు ఆ రూపాయిని ఎలాగ ఖర్చు పెడతావని అడిగేడు. "రానీండి చెప్తా." అని బాలకృష్ణ సంతోషం కనబరిచేడు. "మిఠాయి కొనుక్కోవచ్చు"నని నాయుడు సూచన. "ముందు రాజస్థాన కథావళికి ఆరణాలు అయిపోతాయి." "రాజస్థాన కథావళా?" అన్నాడు నాయుడు ఆశ్చర్యంగా. బాలకృష్ణ తల వూపుతూ ఆ పుస్తకం వివరాలు ఇచ్చేడు. "చిలకమర్తి లక్ష్మీనరసింహంగారు వ్రాసేరు. రాజపుత్ర వీరుల కథలు. చాలా బాగుంటుంది." "చదివేరన్నమాట. అందులో ఓ కథ చెప్పండి చూద్దాం" అంది స్వరాజ్యం ఆసక్తి కనబరుస్తున్నట్లు. "మాట మార్చేస్తున్నారు. మన పందెం తేల్చండి ముందు"--అని తక్షణ కర్తవ్యం గుర్తు చేసేడు బాలకృష్ణ. "చదివిన పుస్తకం మళ్ళీ ఎందుకు?" అది నాయుడు ఆలోచన. బాలకృష్ణ అది దగ్గరుండవలసిన పుస్తకం అన్నాడు. అతడు స్కూలు లైబ్రరీలో తెచ్చి చదివేడు. జగన్నాధాచారి అతని వద్ద చదువుకొనేటందుకు పుచ్చుకొని దాని నిండా సిరా పోసేసేడు. అది ఇస్తే మేస్టారు తంతారు. కనక ఓ పుస్తకం కొని ఇచ్చేస్తాడు. స్వరాజ్యం కథ అంతా విని నవ్వేసింది. "నాకు తెలిసింది." "ఏమిటమ్మా తెలుస్త?" అని డెకారించేడు హేళనగా నాయుడు. "చెప్పెయ్యనా?" "చెప్పమనవయ్యా!" అన్నాడు నాయుడు హుషారిస్తూ. "ఎప్పుడో చెప్పేను ఆ మాట..." "పైకి చెప్పను, చెవిలో చెప్తా" నంది స్వరాజ్యం. "కాదు బయటికే చెప్పాలి" అన్నాడు నాయుడు. "నాకు భయం వేస్తూంది. నిజం కాదేమోనని." ఆమె భయం అన్న తర్వాత బాలకృష్ణ మరింత తొందరపెట్టసాగేడు. "చెప్పండి. అలాగే." అయితే స్వరాజ్యం మరో పేచీ వేసింది. "మీరు కాదంటే--నేను ఔనంటే తీర్పు ఎల్లాగ?" అదీ సమస్యే. బాలకృష్ణ ఆలోచించేడు. "నేను నిజం చెప్తాను." "సరే." బాలకృష్ణకు ఆలోచన తట్టింది. "కాగితం మీద వ్రాసి నాయుడుగారికి ఇస్తాను....." అన్నాడు. "అక్కర్లేదు. మీ మాటమీద నమ్మకం వుంది" అంది స్వరాజ్యం. ఆమె మాటను నాయుడు బలపరిచేడు. లోపలి నుంచి మాణిక్యమ్మ వచ్చి తాను కూడా కలిసింది ఆ ఆటలో. "మీ చేత అన్నీ చెప్పించేసి...." "ఏమీ భయంలేదు. చెప్పమనండి." స్వరాజ్యం అతనిని దగ్గరగా తీసికొని చెవిలో ఒక్కమాట చెప్పింది. ఆమాట వినగానే బాలకృష్ణ వెలవెలపోయేడు. ఆమె ఎలా చెప్పగలిగిందో అతనికి అర్ధం కాలేదు! "మీకెల్లా తెలిసింది?" అన్నాడు ఆశ్చర్యంతో. తాను సరిగ్గా చెప్పినట్లు స్వరాజ్యం అతని ముఖకవళికలను పట్టి గ్రహించ గలిగింది. పందెం నెగ్గినందువలన కలగవలసిన వుత్సాహం ఆమెలో లేదు. "నిజం!" బాలకృష్ణ తల వూపేడు. "మీకెల్లా తెలిసిందో చెప్పండి--" అని ఆమెను తొందర చేసేడు. ఆమె చెప్పింది సరిగానే వున్నదని తెలిశాక నాయుడు కూడా వుత్సాహం చూపలేదు. కాని ఆమె ఏం చెప్పిందో.... "అధర్వణవేదం.... అన్నాను." అంది స్వరాజ్యం. "అధర్వణ వేదమా.....?" అన్నాడు ఆశ్చర్యంతో నాయుడు... "ఆ పేరు నీకెందుకు తోచింది. అసలు." "జగన్నాధాచార్లుగారు అప్పుడప్పుడు వస్తూంటారు కదూ, ఆయన ఎప్పుడు వచ్చినా అధర్వణ వేదంలో ఏవేవో నారాయణాస్త్రం, బ్రహ్మాస్త్రం లాంటి వానికి మంత్రాలున్నాయిట నిజమేనా, అని అడుగుతుంటారు. అదేదో సంపాదిస్తే ఇంగ్లీషు వాళ్ళని దేశంలోంచి ఒక్క దెబ్బని తరిమెయ్యగలం కాదండీ అంటూంటాడు. ఆయన పేరు వస్తే ఆ మాట జ్ఞాపకం వచ్చేసింది. చెప్పేను." ఆ మాట విని బాలకృష్ణ ఆశ్చర్యపడ్డాడు. "ఆచార్లుగారింట్లో వుందని చెప్పేడే.... వాళ్ళింట్లో వుందన్న మాట అబద్ధమేనా...." తాను పందెంలో వోడిపోయిన దాని కన్న ఆ వార్త బాలకృష్ణకు మరింత బాధ కలిగించింది. "అబద్ధాలకోరు" అన్నాడు. అధర్వణవేదం పని బాలకృష్ణకు ఏం వచ్చిందో అన్న ఆశ్చర్యం స్వరాజ్యాన్ని వేధించింది. "ఏం చేద్దామనుకున్నారు ఆ పుస్తకం వుంటే...." బ్రిటిష్‌వాళ్ళు పంజాబులో ఎన్నో దురాగతాలు చేశారు. జలియన్వాలాబాగ్‌లో డయ్యరు అనేవాడు ఇంచుమించు రెండువేల మందిని కాల్పించి చంపించేసేడు. వాడినింక బ్రతకనీయకూడదనుకొన్నారు ఆ కుర్రవాళ్ళు ఎల్లాగా? వాళ్ళకి మంత్ర తంత్రాలు సులువుగా కనిపించేయి. జగన్నాధాచారి తమ యింట్లో అధర్వణవేదం వున్నదన్నాడు. దానికోసం తిరుగుతున్నాడు బాలకృష్ణ. నాయుడు కుర్రవాళ్ళ ఆలోచనలకు నవ్వేడు. స్వరాజ్యం బాలకృష్ణ భుజంమీద చేయివేసి దగ్గరకు తీసుకొని కూర్చోబెట్టుకుంది. "మరేమంటాడు?" "ఆ పుస్తకం అటకమీద వుందిట. తన తండ్రి చూడకుండా తియ్యాలి. ఎప్పుడొచ్చినా సరిగ్గా దాని క్రింద కూర్చుని ఆయన జపం చేయడమో, నిద్రపోవడమో చేస్తుంటాడు. ఆయన కదిలేవరకూ కూర్చోబెడుతున్నాడు. మరునాడు రమ్మంటున్నాడు. తిప్పుతున్నాడు. కాని డయ్యరును చంపెయ్యాలనే కక్ష, పట్టుదలతో బాలకృష్ణ అతడు రమ్మన్న రోజు, వేళకే వస్తున్నాడు. కాని, అది దొరకనే లేదు. "అవన్నీ వట్టి బూటకం నాయనా! జగన్నాధాచార్లు గారింట్లో అధర్వణవేదం వుండడం ఎంత నిజమో, అందులోని మంత్ర తంత్రాలు పని చెయ్యడమూ అంతే నిజం." అన్నాడు నాయుడు. తాను కొన్ని నెలలుగా పెంచుకున్న ఆశలనూ, చేసుకున్న కల్పనలనూ ఒక్కమాటలో కొట్టిపారవేస్తూంటే బాలకృష్ణ సహించలేకపోయేడు. మంత్రశక్తిని గురించి ముంగండలో అనేక కథలు అతడు వింటూంటాడు. అతి ప్రశాంతంగా కూర్చుని రాత్రింబగళ్ళు జపం చేసుకొనేవారు ఆ వూళ్ళో వున్నారు. వారు గొప్ప మంత్ర శాస్త్రవేత్తలని ఎంతో గౌరవం చూపడం చూస్తుంటాడు. పెద్ద కుంకం బొట్టుపెట్టి, మీసాలూ వాళ్ళూ భయంకరంగా వుండే తంత్రశాస్త్రవేత్తలూ వూళ్ళో వున్నారు. వారిని చూసి జనం భయపడ్డం చూస్తున్నాడు. ఒక్కమాటతో అవన్నీ కొట్టిపారేస్తూంటే ఎల్లా నమ్ముతాడు? తాను విన్న కథల బలంతో అతడు చెప్తూంటే నాయుడు అనుభవంగాని, స్వరాజ్యం తెలివిగాని పనిచెయ్యలేదు. వాళ్ళ తాతయ్య తేలుమంత్రం వేస్తాడు, నరసమ్మవ్వ చప్పి మంత్రం వేస్తూంది. భైరవశాస్త్రిగారు పాము మంత్రం వేస్తారు. ఏనుగుపల్లి రాజుగారు పుప్పిపన్ను మంత్రం వేస్తారు. ఆ అనంతకోటి సాక్ష్యాలకు సమాధానం వుంది. కాని, తనకు కొన్నే తెలుసు. తెలియనివి చాలా. దేని కారణాలు దానివి. అన్నింటికీ ఒకే సమాధానం కాజాలదు. ఆ సమాధానాలకు శాస్త్రజ్ఞానం కావాలి. కొన్నింటికింకా శాస్త్రాలు కూడా కారణాలు పట్టుకోలేకపోయాయి. ఇంకా పరిశీలించాలి..... నాయుడు చర్చను మళ్ళిస్తూ వాళ్ళూరు కబుర్లు అడిగేడు. బాలకృష్ణ విజయశంఖం పూరించి నవ్వేడు. "ఓడిపోయారన్న మాటేనా...?" స్వరాజ్యం నవ్వింది. ఇంత ప్రజ్ఞావంతుడివి కనక నీకో పుస్తకం బహుమతి ఇస్తాం అని లోనికి వెళ్ళి వీరేశలింగం పంతులుగారి స్వీయచరిత్ర తెచ్చి యిచ్చింది. అది చూసి బాలకృష్ణ ఆనందించేడు. "మా వూళ్ళో లైబ్రరీలో చాలా మంచి పుస్తకాలున్నాయిట. కాని అది తీయటం లేదు, పుస్తకాలిచ్చే వాళ్ళూ లేరు." తర్వాత కొంత సేపు కబుర్లు చెప్పి బయలుదేరేడు. "మీ మావయ్యగారికి వందనాలు చెప్పండి." అన్నాడు నాయుడు. "ఆయన రాజమండ్రి వెళ్ళేడు." "ఎందుకు?" తండ్రీ కూతుళ్ళ మనస్సులలో ఒకే ఆశంక కలిగింది. "ఎందుకు?" బాలకృష్ణ ఎరగడు. 'ఏమో' "ఎప్పుడొస్తారు?" "అదీ తెలియదు." ప్రతి ఆదివారం వస్తూండడానికి వాగ్దానం తీసుకొని స్వరాజ్యం అతనిని కాలవగట్టు ఎక్కించింది. వెళ్ళేముందు తమ పందెం కేవలం ఆట మాత్రమేననీ అతడు వోడడం లెక్కకాదనీ చెప్పింది. కాని బాలకృష్ణ ఏ మాత్రం ఒప్పుకోలేదు. "ఆ బేడ నాకక్కర్లేదు." స్వరాజ్యం నవ్వుతూ 'సరే'నంది. ఇరవైమూడు "నిన్న సాయంకాలం డబ్బు మాట ఏదో చెప్పేవు...." అంటూ శంకరశాస్త్రి చేస్తూన్న సంధ్యావందనం మధ్యలో ఆపి ఆ దిశగా వచ్చిన భార్యను ప్రశ్నించేడు. ఆ ప్రశ్న ఏమిటో ఆమెకు అర్ధం కాలేదు. "డబ్బేమిటి? నేనేం చెప్పేను?" తన ప్రశ్నను అర్ధం చేసుకోలేని తెలివి తక్కువదనానికి శాస్త్రి ఆమె మీద చుర్రుమన్నాడు. "ఆ మాత్రం తెలివుంటే లేకపోయిందేమిటి? మన ప్రబుద్ధుడు డబ్బు కావాలన్నాడన్నావు...." రాజమ్మ 'అదా?' అంది. "నిన్న కాదు, రాజమండ్రి నుంచి వచ్చిన రోజునే అడిగేడు. ఆ మాట నిన్న జ్ఞాపకం వచ్చింది." "ఏడవలేకపోయేవు." ఆ సలహా తీసుకొని రాజమ్మ గబగబ లోనికి పోయింది. ఇంకెన్ని తిట్లు తినవలసి వస్తుందోనని ఆమె భయం. "యదహ్నా కురుతే పాపం! తదహ్నా ప్రతిముచ్యతే....." శాస్త్రి మరల సంధ్యావందనంలో మునిగిపోయేడు. కాని అతని మనస్సు దానిమీద లేదు. నాలుగైదు రోజుల క్రితం తల్లిని డబ్బు కావాలన్నవాడు తననెందుకు అడగలేదు? ఆ అవసరం ఏమయింది? ఇప్పుడు ప్రయాణానికి కావలసిన డబ్బు ఎక్కడిది? కాకినాడ కూడా వెళ్లాలంటే ఆరోజున కావాలన్నదానికన్న ఎక్కువే కావాలి మరి? శంకరశాస్త్రి ఆలోచనలు ఉన్నట్లుండి అప్పయ్య అవధాన్లు వేపు మళ్ళేయి. పెద్దవాళ్ళచాటు కుర్రకారుకు డబ్బు అప్పు కావాలంటే తమ వూళ్ళో మొదట జ్ఞాపకం వచ్చేది అప్పయ్య అవధాన్లు. ఇంకెవరిదగ్గరకెళ్లినా పుచ్చుకొనే వడ్డీ తీసుకొంటూనే లక్ష హితోపదేశాలు చేస్తారు. పెద్దవాళ్ళతో కూడా చెప్పేస్తారు. విషయం కాస్తా వీధిన బడుతుంది. అప్పయ్య అవధాన్లు అసలు సంగతి ఆస్తి మునిగిపోయే దశ వచ్చేవరకూ పైకి పెట్టడు. పైగా విశ్వనాధం సలహా సహాయాలతో రామనాధం పనిచేస్తున్నాడనిపించేక డబ్బు సమస్య వచ్చే సరికి అవధాన్లు పేరే గుర్తురావడంలో ఆశ్చర్యం లేదు. విశ్వనాధం ప్రోనోటు మీద వ్రాలు చెయ్యడం నేర్చుకొన్నది అవధాన్ల వద్దనే. ఇంతవరకూ భూమి అమ్ముకొన్నదీ, అమ్ముకోగా మిగిలింది తనఖా పెట్టినదీ అప్పయ్య అవధాన్లు వద్దనే. కనుక తమ్ముని కొడుకుచేత కూడా అక్కడనే కాతా పెట్టించాడనిపించింది. అదే జరిగితే తానీ పదిహేను, పదహారేళ్ళుగా పడ్డ శ్రమ అంతా వ్యర్థమే. పైసా పైసా చొప్పున జాగ్రత్త చేసికొన్నదీ, అసలు వున్నదీ కూడ చూస్తూ చూస్తుండగా హరించి పోతుంది. ఆ ప్రమాదం కనిపించేక మరి సంధ్యావందనం కూడా సాగలేదు. 'కోప్పడీ, బెదిరించీ ఇల్లాంటి అలవాట్లు మాన్పించలేము' అనుకున్నాడు. డబ్బు అవసరం కనబడకుండాలి. లేదా ఇచ్చేవాడు దొరక్కపోవాలి. అంతేకాని, ఒకమారు అప్పుకేసి మళ్ళిన వ్యక్తి చిన్న అవసరం వచ్చినా అప్పులాడి కోసం వెతుకుతాడనే విషయం కొద్దీ గొప్ప వడ్డీ వ్యాపారం తిప్పుతున్న శంకరశాస్త్రికి తెలియకపోలేదు. ఇంక డబ్బు అవసరం వుండకపోవడం ఏమిటి? అందులో ఈనాటి చదువులూ, అలవాట్లూ లోనే డబ్బును మంచినీళ్ళకన్న ధారాళంగా ఖర్చు పెట్టించే స్వభావం వుంది. తాను కానీ ఖర్చు లేకుండా పంచకావ్యాలూ, అలంకార శాస్త్రం చదువుకొన్నాడు. కట్టుకొనేందుకో అంగవస్త్రం, భుజాన వేరొక అంగవస్త్రం తప్ప చదువుకొనే రోజుల్లో మారు దుస్తులు ఎరుగడు. కాని రామనాధం చదువు ప్రారంభించిన ఈ పదిహేనేళ్ళలోనూ పదేళ్ళలోపు వయస్సులో వంటింట్లో భోజనానికి కూర్చున్నప్పుడు ఎప్పుడు పెట్టుకున్నాడో తప్ప గోచీ ఎరగడు. చొక్కాలు, లాగూలు, టోపీలు వీటి కోసం ఒక్క ఏడాదిలో అయిపోతున్న ఖర్చు తాను చదువుకొన్న మొత్తం కాలంలో బట్టలమీద చేసిన ఖర్చును మించిపోతూందని శాస్త్రి కొడుకును ఎన్నో మార్లు మందలించేడు. పుస్తకాలకయ్యే ఖర్చుకి అసలు పోలికే లేదు. ఏడాదికేడాదికి ఎన్నో పుస్తకాలు, ఏవేవో పుస్తకాలు, పైన తిండి ఖర్చు, బసలకి ఖర్చు. ఇన్ని ఖర్చులకి అలవాటుపడ్డ వాళ్ళకి డబ్బు విలువ ఏం తెలుస్తుంది? చదువుకొన్న రోజుల్లో తాము సంభావనలకు వెళ్ళి, బ్రాహ్మణార్థాలు చేసుకొనీ తెచ్చుకొన్న డబ్బుల్లో తమ ఖర్చు వెళ్ళిపోయేది. ఇప్పుడల్లా వెళ్ళడం నామోషీ కాకున్నా ఆ ఖర్చులకి ఈ డబ్బులు ఏ మూలకి? అందుచేత డబ్బు అవసరం అసలీనాటి చదువుల్లోనే వున్నదని శాస్త్రి దృఢ నిశ్చయం. చేతికి ధారాళంగా డబ్బు చిక్కనివ్వకపోడమే ఆ అవసరాన్ని అదుపులో పెట్టేటందుకు మార్గమని తలచేడు. ఇంతవరకూ ఆ బిగింపు తాను చూసుకొన్నాడు. కాని ఇప్పుడు? రామనాధానికీ వయస్సు వచ్చింది. అతనికి వెనక ఆస్తి వుంది. అప్పు ఎవరేనా ఇచ్చేస్తారు. అల్లా ఇవ్వకుండా కొంచెం గట్టెయ్యాలి--అనుకొన్నాడు. రాత్రి అంతా ఆలోచించేడు. అసలు అప్పయ్య అవధాన్లు వద్ద అప్పు తెచ్చేడో లేదో తెలుసుకోవాలి. ప్రొద్దున్న తోటనుంచి వస్తూంటే దారిలో రావి క్రింద అవధాన్లు కనిపించేడు. ఆయనే పలకరించేడు. "దింపు తీయిస్తున్నావా? పొద్దుపోయింది" అన్నాడు. అవధాన్లు కొబ్బరికాయ కమీషను వ్యాపారం కూడా చేస్తూంటాడు. "దింపువాళ్ళు వస్తామన్నారు. కాని. ఏదో పనుందని రామని కబురు పెట్టేరు. ఎల్లా వుంది పచ్చికాయ?" ఆ మాటా ఈమాటా చెపుతూ శాస్త్రి యధాలాపంగా అన్నట్లు అప్పు ప్రసక్తి తెచ్చేడు. "వారంనాడు మా వాడు ఏ మాత్రమో డబ్బు కావాలంటే లేకపోయింది. అవధాన్లు మామ దగ్గిరికెళ్ళి తీసుకోమని పంపేను. వచ్చాడా?" అవధాన్లు చటుక్కున అబద్ధం ఆడలేకపోయేడు. "పట్టుకెళ్ళేడు." "రేపో ఎల్లుండో దింపుకాయ అమ్మేసి ఇస్తాను" అన్నాడు శాస్త్రి. అప్పుడుగాని అవధాన్లుకు తాను చేసిన పొరపాటు అర్థం కాలేదు. రామనాధం నోటు వ్రాసి ఇవ్వడమే ఆ విషయాన్ని చెపుతూంది. శాస్త్రి ఆ అప్పు విషయం గ్రహించేసేడు. నలుగురిలో తన చేత ఔననిపించేడు. ఇంక సర్దుకోలేకపోయేడు. "అంత తొందరేముందిలే, చేతిలో వున్నప్పుడే ఇద్దువుగాని...." ప్రక్కనే వున్న భగవచ్ఛాస్త్రులు హాస్యమాడేడు. "అణాబిళ్ళ మీద సంతకం చేయించే వుంటాడు. అదీ ఆ ధైర్యం." కాదనడానికి అవకాశం లేకుండా శాస్త్రి అందుకున్నాడు. "బిళ్ళ ఇచ్చే పంపేను. చేబదులంటే అర్ధం తెలియదు. అది నేర్పకూడదు. ఈనాటి కుర్రాళ్ళకి డబ్బు విలువ బొత్తిగా తెలియకుండా పోతూంది." "పంపించే వాళ్ళుంటే..." అని వెంకప్ప తన కొడుకు తోడి అనుభవం తలుచుకొని అంగలార్చేడు. ఆయన కొడుకు ఎప్పుడూ అమలాపురం బోగంవాళ్ళ ఇళ్ళలోనే వుంటాడు. డబ్బు కావలసినప్పుడే ఇంటికి వచ్చి తెస్తావా, చస్తావా అని కూర్చుంటాడు. "అడిగిన వెంటనే డబ్బిస్తే దాని విలువ అర్ధం కాదు. ఎక్కడో చూడలేకనా? అవధాన్లు మామనడిగి నేనే తేలేకనా? కాని, వాళ్ళకీ కష్టసుఖాలు తెలిసిరావాలి....." శాస్త్రి చెప్తున్నదంతా అబద్దమేనని మనస్సుకి తోస్తూ వున్నా ఏమీ చెప్పలేక అంతకన్న లోతుకి వెళ్ళడం ఇష్టమూ లేక పిలుస్తున్నా వినిపించుకోకుండా అవధాన్లు పని వుందని వెళ్ళిపోయేడు. అందులో ఏదో రహస్యం వుందని గ్రహించిన భగవచ్ఛాస్త్రులు అడిగేడు. "ఏమిటి వ్యవహారం?" "మామూలే." "గుణం పోనిచ్చుకున్నాడు కాదు." అని వెంకప్ప తన అసహ్యం వెలిబుచ్చేడు. తాను ఇవ్వవద్దని చెప్పినా కొడుక్కు అవధాన్లు అప్పిస్తూనే వుంటాడు. "ఇచ్చి చెప్పడు. వడ్డీ పెరిగి ఇనప్పెట్టె నిండాలి." అంటూ ఆయన బాధ వెళ్ళకక్కుకున్నాడు. ఒకరోజు పోనిచ్చి శాస్త్రి డబ్బు తీసుకొని అవధాని ఇంటివద్ద హాజరయ్యేడు. అతని రాక చూసి అవధాని కొబ్బరి బేరానికి వచ్చిన వాళ్ళ పని ఆపి వారు దగ్గరుండేటట్లు చేసుకొన్నాడు. శాస్త్రికి మహచెడ్డ కోపం. చెయ్యి దురుసుతనం కూడా ఎక్కువే. ఆయన వస్తూనే అసలు విషయం ఎత్తుకుంటాడనుకొన్నది. అలా చెయ్యలేదు. ఆ మాటా ఈ మాటా చెపుతూ హాస్యమాడుతూ కూర్చున్నాడు. ఆలోపున వీధిన పోతున్న వాళ్ళూ వీళ్ళూ చేరేరు. తన భయం అనవసరం అనిపించింది అవధాన్లకి. కబుర్లు చెప్తూ చెప్తూ హఠాత్తుగా శాస్త్రి అసలు సంగతి ఎత్తుకున్నాడు. "మామా! నోటు తీసుకొచ్చి చెల్లు రాయి. డబ్బు తెచ్చేను". "నోటేమిటి?"--అనేసేడు అప్పయ్య శాస్త్రి. పొరపాటున అంతలో సర్దుకున్నాడు. ఇంట్లో లేని కొడుకును పెద్దగా గొంతెత్తి పిలిచేడు. "భానూ! భానూ!" లోనుంచి భార్య సమాధానం ఇచ్చింది.-- 'అంబాజీపేట వెళ్ళేడు, కొబ్బరి సంతకని. మీతో చెప్పలేదా?" ఆవిడ కీ యిచ్చి వదిలిపెట్టినట్లు అల్లాగే రెండు రోజులయినా అదే విషయం మీద మాటలు చెపుతూనే వుంటుంది. ఇంట్లో లేడని ఎరిగి వుండే ఎందుకు పిలిచేనా అని అప్పయ్య అవధాన్లు మనసులో గుందిల్లేడు. తాను కొడుకుకి చెప్పి పంపిన మాటలు కూడా ఆమె బయటపెట్టేస్తుంది. భార్య నోరు మూయించాలని అవధాని గర్జించేడు. "ఈపాటికి నోరు ముయ్యి. తెలిసిందిలే. ముండావాగుడు." ఆ ఆదేశం వినిపించేక ఆమె మరి మాట్లాడలేదు. అవధాని ఇంక కార్యక్రమం ప్రారంభించేడు. "ఇనప్పెట్టిలో పెట్టి మావాడు వెళ్ళిపోయేడు. తరువాత చూసుకొందాం. నీ దగ్గరుంటే ఒకటీ, నా దగ్గరుంటే ఒకటీనా?" శాస్త్రి అంత అభేదభావాన్ని చూపించలేకపోయేడు. "అంత నమ్మకం వున్నవాడివి చేబదులివ్వక నోటు ఎందుకు వ్రాయించుకొన్నావు?" ఆ అప్పు పత్రం అంతతో ముగించకూడదని అవధాని ప్రయత్నం. "శాస్త్రీ! నీతో అబద్ధమాడతానటోయ్‌. నిజమే, మా వాడి దగ్గరుంది అది. అంతగా దగ్గరుంటే మరోలాగ ఖర్చయిపోతుందనుకొనేటట్లయితే డబ్బు ఇచ్చి వెళ్ళు. అబ్బాయి రాగానే నోటు పంపిస్తా" శాస్త్రి విషయంలో అవధాన్లు మోసం చెయ్యకపోవచ్చు. అంత మంది ముందు తీసుకొన్న సొమ్ము లేదనకపోవచ్చు. కాని, ఒకరిద్దరి వద్ద డబ్బు తీసుకొని చెల్లు రాయకుండా మళ్ళీ వసూలు చేశాడని వూళ్ళో గొడవలు వున్నాయి. శాస్త్రి వ్యవహారజ్ఞానం లేనివాడేం కాదు. అవధాని సూచన విన్నాక కోపం చర్రుమంది. అప్పయ్య గడుసుతనం అర్ధం అయింది. నోటు చూస్తేనేగాని రామనాధం ఎంత అప్పు చేశాడో తెలియదు. తాను ఎంత అని ఇస్తాడు? ఆ రహస్యం బయటపడితే తన చాటున కుర్రవాడు అప్పులు చేస్తున్నాడని నలుగురికీ తెలిసిపోతుంది. అదొక విధంగా లోకువా, అప్రతిష్ఠా కూడా. "ఇదిగో మామా! సూరయ్యకాపు అనుకుంటున్నావేమిటి?" సూరయ్య కాపు నమ్మకం మీద డబ్బు అలాగే ఇచ్చి మూడెకరాల భూమి పోగొట్టుకొన్నాడని వూళ్ళో చెప్పుకుంటారు. అంతమాట విసిరేసినా అవధాని కోపం తెచ్చుకోలేదు. "నీకూ అదే తోచిందిటోయ్‌"--అని మాత్రం అన్నాడు. లేచి వెళ్ళిపోయి తలుపు వేసేసుకున్నాడు. ఇంకెందరు ఎన్ని పిలిచినా మాట్లాడలేదు. తలుపు తియ్యలేదు. శాస్త్రి మహాకోపంతో అరుగు దిగి పైబట్ట నడుముకి బిగించేడు. వాలకం చూస్తే కలబడేలా ఉన్నాడు. దగ్గరున్నవాళ్ళు అతనిని శాంతింపచెయ్యటానికి ప్రయత్నించేరు. కాని శాస్త్రి వినిపించుకోలేదు. "నిన్నిల్లా వదిలేస్తే నా పేరు శాస్త్రి కాదు....." అని ఘోర శపథం చేసేడు. అయితే అంత కోపంలో కూడా తపోబలం, వాక్శుద్ధి బలం వంటి అతీత శక్తులు తనకిక్కడ సాయపడవనే మాటను మరిచిపోలేదు. భౌతికశక్తుల్లో కూడ పోలీసుశాఖకున్న బలం, ప్రాభవం మరెవ్వరికీ లేవని కూడా గుర్తుంది. అందుచేత ఆ బెదురునే కలిగించడానికి ప్రయత్నించేడు. "వాడి మామగారు నారాయణమూర్తిగారే వచ్చి ఆ నోటు సంగతి చూసుకొంటారు ఇనప్పెట్టిలో వుందో, పోపులపెట్టిలో వుందో అయనే చూస్తాడు." అంత దుర్దాంత వ్యక్తి పేరు వుచ్చరించాక అవధాని బిగువు ఎంతోసేపు నిలువలేదు. మరుగంటలో రెండో కొడుకు చేతికిచ్చి నోటు పంపించేసి, డబ్బు తెచ్చేసుకొన్నాడు. శాస్త్రి బాకీ యిచ్చేస్తూ ఖబడ్దార్‌ చెప్పేడు. "ఈమారు తండ్రిచాటు కుర్రాళ్ళకి డబ్బు యిచ్చేటప్పుడు వెనకా, ముందూ చూసుకొని మరీ చెయ్యమని చెప్పు మీ నాన్నతో." రామలింగం అమాయకంగా ఎదురుప్రశ్న వేశాడు. "అయితే డబ్బు కోసం నువ్వు పంపించలేదన్నమాట?" జారినమాట కమ్ముకోవడం సాధ్యంగాక శాస్త్రి వానిమీద మండిపడ్డాడు. "అతితెలివి! సంతోషించాం." ఇరవైనాలుగు రామనాధం కాకినాడలో రైలు దిగి దేవాలయం వీధిలో వున్న రుక్కమ్మ హోటలుకి తిన్నగా వెళ్ళేడు. అక్కడే స్నానం చేసి బట్టలు మార్చుకొన్నాడు. భోజనం చేశాక తన బావ చంద్రశేఖరాన్ని వెతుక్కుంటూ పిఠాపురం రాజా కాలేజీకి బయలుదేరాడు. చంద్రశేఖరం కాలేజీలో లెక్చరరు. రామనాధం వెళ్ళేసరికి అతడు క్లాసులో వున్నాడన్నారు. వచ్చేవరకూ ఎదురుచూస్తూ అక్కడే టీచర్ల గదిలో కూర్చున్నాడు. ముతక ఖద్దరు బట్టలతో వున్న రామనాధంవేపు నలుగురూ వింతగా చూస్తుంటే అతడు ముళ్ళమీదున్నట్లు కూర్చున్నాడు. హఠాత్తుగా, అనుకోని విధంగా చూడడంచేత చంద్రశేఖరం మొదట అతనిని గుర్తుపట్టలేకపోయేడు. "నీ కోసం ఎవరో వచ్చి కూర్చున్నారు." అని తోడి లెక్చరరు చెప్తూంటే చంద్రశేఖరం దగ్గరకు వచ్చేడు. "తమరు...." అంటూ ముఖంకేసి చూసి చటుక్కున నిలబడ్డాడు. "మీరు.....ఏమిటీ వేషం" అనబోయినవాడే సర్దుకొని "ఎంతసేపయింది వచ్చి" అన్నాడు. తనను హెచ్చరించిన మిత్రునికి పరిచయం చేసేడు. "మా చెల్లెలి భర్త." తరువాత ప్రశ్నలకు అవకాశం ఇవ్వకుండా గంటకొట్టి ఫ్యూనును పిలిచేడు. గదిలోనున్న సంఖ్యను చూసుకొని తేవలసిన కాఫీల సంఖ్య చెప్పేడు. "ఆరు తీసుకురా." మిత్రులలో ఒకరు గుర్తుచేసుకొనేటందుకు ప్రయత్నిస్తున్నట్లు అన్నాడు. "చెల్లెలు ఒక్కర్తేనన్నావు కాబోలు." ఆ ప్రశ్నకు మూలం ఏమిటో గ్రహించనట్లు చంద్రశేఖరం నటించేడు. "ఔను, ఆమె భర్త రామనాధం. ఈ ఏడాది విదేశాలకి వెళ్ళే ఆలోచనలో వున్నారని చెప్పింది ఈతనిని గురించే." ఖద్దరు దుస్తులవాడు ఐ.సి.ఎస్‌.కు వెళ్ళాలనుకొంటున్నాడంటే మిత్రులకాశ్చర్యమే కలిగింది. కాని, తోటి మిత్రుడు నొచ్చుకుంటాడని ఎవ్వరూ ఏమీ అనలేదు. అతని ప్రయత్నాన్ని అభినందించేరు. రామనాధం చిరునవ్వుతో వారి అభినందనలను త్రోసిపుచ్చేడు. "ఒకప్పుడా అభిప్రాయం వుండింది." "ఇప్పుడు?" "లేదు...." చంద్రశేఖరం ఆ సంభాషణను ఆ విధంగా కొనసాగనివ్వడం ఇష్టంలేక మాట మార్చేడు. "ఎప్పుడు బయలుదేరేవు?" మిత్రులు అతని అభిప్రాయాన్ని గుర్తించేరు. ఓ నిముషం ఆమాట యీమాట చెప్పి తమ క్లాసులకి వెళ్ళిపోయేరు. తనకు ఆ గంట పనేమీ లేదని రామనాధం కళ్ళలో కనిపించిన ప్రశ్నకు సమాధానమిచ్చేడు చంద్రశేఖరం. "పరీక్షలు దగ్గిరికొచ్చినట్లే. బాగా చదువుతున్నావా?" అతడు కట్టిన ఖద్దరు బట్టలు చూసేక మనస్సులో కలుగుతున్న భావాలను చంద్రశేఖరం నమ్మదలుచుకోలేదు. దేశంలో వ్యాపిస్తున్న విదేశీ ప్రభుత్వ ద్వేషానికి చిహ్నంగా మాత్రమే ఆ దుస్తులను గుర్తించదలిచేడు. సత్యాగ్రహం, సహాయ నిరాకరణం చేసి వుంటాడనుకోలేకపోయేడు. కాలేజీలో మొదటి మార్కుకోసం పోటీపడుతున్న వాడల్లా ఉన్నట్టుండి రంగాన్ని వదిలేస్తాడనుకోలేకపోయేడు. తన ప్రశ్నకు సమాధానం విని తెల్లబోయేడు. "పరీక్షలకు వెళ్ళడం లేదు." "అంటే?" "కాలేజీ మానేశాను." చంద్రశేఖరం చాలా బాధగా అన్నాడు. "సహాయ నిరాకరణం?" రామనాధం తల ఆడించేడు. "ఔను." 'ఎంతపని చేశావు?' అన్నట్లు చంద్రశేఖరం విచారంగా, జాలిగా చూసేడు. చాలాసేపటివరకూ మాట్లాడలేకపోయేడు. అందరూ స్కూళ్ళూ, కాలేజీలూ మానవలసిందనీ, ప్రభుత్వోద్యోగాలకు రాజీనామాలివ్వాలనీ, కోర్టుల్ని బహిష్కరించాలనీ గాంధీగారు ప్రబోధిస్తున్నారు. అలా చేస్తే ఏడాదిలో స్వరాజ్యం వస్తుందని ఆయన వాగ్దానం చేశారు. తామంతా ఆ కార్యక్రమం విని నవ్వేశారు. పరీక్షలు ప్యాసుకాని మందమతులూ, బోర్డు డబ్బు కిట్టని వకీళ్ళూ దేశభక్తులయిపోవడానికీ, ప్రతిష్ఠ కాపాడుకోడానికీ మంచి అవకాశం దొరికిందని వేళాకోళం చేశారు. కాని, ఇదేమిటి; మంచి తెలివిగలవాడూ, భవిష్యత్తు వున్నవాడూ రామనాధం. అతడు చదువు కట్టిపెట్టేసి సహాయ నిరాకరణం చేసేడు. రామనాధం పెదతండ్రి ఒకాయన కాంగ్రెసువాడు ఉన్నారన్నారు. ఆయన్ని తాను చూడలేదు. తన తమ్ముడి కొడుకు పెళ్ళికికూడా ఆయన రానే లేదు. ఆయన చదువుకోలేదని విన్నాడు. కాని, రామనాధం చదువుకున్నవాడు. చెల్లెలిని అతనికిచ్చి పెళ్ళిచేయడానికి కారకుడు తానే అయివుండడం ఒక విశేషం. ఇప్పుడు అందరూ తనమీదపడిపోతారనిపించింది. చంద్రశేఖరం లేచేడు. "సెలవుచెప్పి వచ్చేస్తా, కూర్చో. ఇంటికి వెడదాం." "వెళ్ళిరాండి." తాను చేసిన పనినీ, తన వుత్సాహాన్నీ ఎంతోమంది అర్థం చేసుకోలేరని ఈ వారం పదిరోజుల్లోనూ రామనాధం గ్రహించేడు. చంద్రశేఖరం వారిలో ఒకడు అయ్యేడు అంతే. ఏడాదిలో స్వాతంత్య్రం వస్తుందని గాంధీ చెప్తూంటే నమ్మినవాళ్ళూ, సమర్థించినవాళ్ళూ కూడ సహాయ నిరాకరణంలో తమవంతు పాత్ర ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకోవడం లేదు. పరీక్షలయ్యేక అంతగా అయితే ఓ ఏడాది మానెయ్యకూడదేమిటి? అంటున్నారు. ఈ ఏభయివేల రూపాయల కేసు ఒక్కటీ పూర్తిచేసి తర్వాత కోర్టు మానమని బంధువులూ, స్నేహితులూ చెప్పినా తాను వొప్పుకోలేదని అయ్యదేవర కాళేశ్వరరావుగారు ఆరోజున సభలో చెప్పేరు. చేస్తూ చేస్తూన్న వుద్యోగం వదిలేసుకొన్నాక స్వరాజ్యం వచ్చి మాత్రం కూడూ, గుడ్డా పెడుతుందా అని వాళ్ళ వాదన. కాని చంద్రశేఖరం వాదనలు ఆ పంథాలో లేవు. తన సెలవు పని పూర్తిచేసుకువచ్చి చంద్రశేఖరం సావకాశంగా ప్రారంభించేడు. "మన దేశం చాలా చిత్రమైన పరిస్థితుల్లో నడుస్తూంది. మీరంతా దేశాన్ని ఏదో వుద్ధరిస్తామంటున్నారు. ఆ పనికోసం గాంధీ అంటూ ఓ నాయకుడు కూడా ఏర్పడ్డాడు. ఆయన మీద మీ అందరికీ వుండుకున్న విశ్వాసం నాకు లేదు." బావగారి అవిశ్వాసాన్ని పోగొట్టడానికి రామనాధం మాటమధ్యలోనే అందుకున్నాడు. "మనదేశంలో విదేశీయుల పరిపాలన వున్నదనీ, దానిని తొలగించి మన పరిపాలనను మనం సాగించుకోవడం అవసరమనీ వొప్పుకుంటారా?" చంద్రశేఖరం చరిత్రాధ్యాపకుడు. ఆయన అభిప్రాయం ప్రకారం ఇప్పుడీ దేశంలో వుంటున్న ప్రజల పూర్వీకులంతా బయటినుంచి వచ్చిన వాళ్ళే. ఇచ్చటి ఆదివాసులీనాటికీ ఆదివాసులుగానే వుండిపోయారు. ఈ గడ్డ దురదృష్టం ఏమిటోగాని విజేతలుగా వచ్చినవాళ్ళు తమ తరువాత వచ్చిన వాళ్ళ చేతుల్లో ఓడిపోతూండడమే చరిత్రలో పొడుగునా కనిపిస్తుంది. ఈ గడ్డమీద స్వతంత్రం అనుభవించడం ఎన్నడూ జరగనేలేదని అతని అభిప్రాయం. ఆ వాదనలను ఖండిస్తున్న అనేకమంది వుపన్యాసాలను రామనాధం విన్నాడు. దేశంమీద దండెత్తిన వాళ్ళని ప్రతిఘటించిన వారి చరిత్రలూ, స్వాతంత్య్రం కోసం సర్వస్వం త్యాగం చేసిన మహావ్యక్తుల కధలూ విన్నాడు. కాని, ఆ వీరచరిత్రలు ఆ చరిత్రాధ్యాపకుడికి సంతృప్తి కలిగించలేదు. రామనాధం ఈమారు చరిత్రకి అర్థశాస్త్రం కూడా జతపరిచేడు. వెనుకటి రోజుల్లో దేశాన్ని ఎంతమంది ఆక్రమించినా వాళ్ళు తమ తరంలోనే దేశంలో స్థిరపడిపోతూ వచ్చేరు. వాళ్ళూ దేశీయులే అయిపోయారు. ఆఖరున వచ్చిన ముసల్మానులు కూడా ఇక్కడ వాళ్ళలోనే కలిసిపోయారు. ఇదే తమదేశం అనుకున్నారు. ఇక్కడి వాళ్ళతోపాటే కష్టసుఖాలు పంచుకొంటున్నారు. "కానీ ఇంగ్లీషువాళ్ళు అల్లా కాదు. వాళ్ళకీ దేశం రావడం డబ్బు సంపాదనకో మార్గం. ఆ లాభం దేశం నుంచి దండుకుపోతున్నారు. మన దేశం అంతకంతకు దరిద్రంలో కూరుకుపోతూంది...." రామనాధం గోల్డ్‌ ఎక్సేంజి స్టాండర్డు గురించీ, కౌన్సిలు బిల్లులూ, రివర్స్‌ కౌన్సిల్‌ బిల్లుల మోసం గురించీ చెప్పుకుపోయేడు. "స్వరాజ్య సంపాదనమే దీనికి మంచి మందు".... అని తేల్చేడు. గోల్డు స్టాండర్డు వగైరా పితలాటకాన్ని చిన్న చిన్న వుదాహరణలతో చక్కగా చెప్తూంటే ఇంతసేపటినుంచీ కట్టుగుడ్డలు చూసి తేలికగా భావించిన లెక్చరర్లందరూ దగ్గిరికి చేరేరు ఒక్కొక్కరు. ఒక్కొక్క ప్రశ్న వేస్తున్నారు. పంజాబు దురంతాలూ, జలియన్వాలాబాగ్‌ హత్యలూ కథోపకథనంతో వస్తున్నాయి. చంద్రశేఖరం సంకోచంలో పడ్డాడు. "లేవండి వెడదాం." ఇద్దరూ రోడ్డుమీదికి వచ్చేరు. "మన ఇంటికి వెడదాం." రామనాధం అలవాటులేమిని ఒక్క క్షణం తటపటాయించేడు. చంద్రశేఖరం అతని ముఖం వంక చూసేడు.... "అనుమానమేమన్నా వుందేమిటి?" రామనాధం సర్దుకొని "అటువంటిదేమీ లేదు" అన్నాడు. "అంత అభ్యంతరం వుంటే భోజనానికి మళ్ళీ వచ్చేద్దువుగాని ఇక్కడికే. ఇంటికి రావడానికేం పోతుంది?" మనస్సులో బెగటు, హేళన వగైరాలు లేకుండా అంత సరళంగా సంఘంలోని తన స్థితిని అంత నిర్వికారంగా తీసుకోగలిగిన చంద్రశేఖరాన్ని చూస్తూంటే రామనాధానికి సిగ్గు కలిగింది. చంద్రశేఖరం ఏ కులానిదో తెలియని అనాథశరణాలయపు అమ్మాయిని పెళ్ళి చేసుకొన్నాడు. వారిద్దరూ కలిసి చదువుకున్నారు. ఇద్దరూ చెరో ఉద్యోగమూ చేసుకుంటూ జీవిస్తున్నారు. అతడా పెళ్ళి చేసుకొన్నాక బంధువులు యావన్మందీ తల్లీ తండ్రితో సహా అతనిని వెలిపెట్టేరు. ఇంటికి రానివ్వకూడదనుకొన్నారు. అతడూ వారికా అవకాశం కలిగించతలచుకోలేదు. అటు తర్వాత తల్లిని చూడ్డానికి కూడా ఇంటికి వెళ్ళలేదు. అగ్రహారంలో పుట్టిపెరిగిన రామనాధానికి కులాంతరంలో వివాహాలు అనూహ్యం. కులాంతరులతో సంబంధాలు కలవాళ్ళని చాలామందిని చూసేడు. తన పెదతండ్రే వున్నాడు. అయితే ఆ స్త్రీలతో వారి సంబంధం పడకగదికి మాత్రమే పరిమితం. వాళ్ళ చేతినుంచి మంచినీళ్ళు కూడా తీసుకోరనేది ఓ సంతృప్తి. కాని ఇక్కడి స్థితి వేరు. చంద్రశేఖరం ఆమెను పెళ్ళి చేసుకొన్నాడు. ఆమె వంట తింటున్నాడు. అది గొప్ప అపరాధం, అనాచారం అని శంకరశాస్త్రి కొత్త రోజుల్లో పరవళ్ళు తొక్కేడు. అన్నగారు మరో కులం పిల్లను పెళ్ళి చేసుకొన్నాక ఆ చెల్లెల్ని ఇంకా కోడలుగా స్వీకరించవచ్చునా అనే విషయం మీద తమ ఇంట్లో కొన్నాళ్ళు చర్చలు జరగడం రామనాధం ఎరుగును. ఆ ఆలోచనలను రామనాధం ఆనాడే హర్షించలేదు. పెళ్ళి అయినాక ఏవో పనులమీద చంద్రశేఖరం రాజమండ్రి వచ్చేవాడు. చెల్లెలి భర్త మీద అతనికెంతో అభిమానం. వచ్చినప్పుడు తప్పకుండా అతనిని కలుసుకొనేవాడు. హోటలులో పొత్తిపంచె కట్టుకొనే రామనాధం భోజనానికి కూర్చున్నా, బావతో సహపంక్తిని కూర్చోడానికెన్నడూ ఆలోచించలేదు. --అయితే అతని తల్లిదండ్రుల ఆచారపు ఆలోచనలు వీధిదాకా రాకుండానే ఆగిపోయాయి. దానికి కారణం నారాయణమూర్తి బహుశ్రద్ధగా సాగించే లలితా ఉపాసనా కాదు, రామనాధాన్ని ఇంగ్లండు పంపుతాడన్న ఆశా కాదు. పోలీసు ఉద్యోగి దుర్దాంత కోపభయం ఆ ప్రమాదాన్ని తప్పించింది. ముంగండలో ఒకరిద్దరు ఆ సమస్యను తీసుకురా ప్రయత్నించినా శంకరశాస్త్రి ఉపద్రష్ట జగన్నాధ పండితరాయలు మొగలుదర్బారులోని రాజనర్తకిని దర్జాగా పెళ్ళిచేసుకొని చెప్పిన శ్లోకాలని రాగవరసలో చదివి వినిపించి నోరు మూయిస్తూ వచ్చేడు. ఈ వాదోపవాదాలనూ, చర్చలనూ చంద్రశేఖరం వినలేదనుకోలేము కాని, అవేవీ అతని మనఃస్థైర్యాన్ని కదిలించలేదు. తన రాకకు ఇబ్బంది పడనివారి ఇంటికే అతడు వెడతాడు. తన ఇంటికి రావడానికి అభ్యంతరం లేకుంటేనే పిలుస్తాడు. ఇంటికి వచ్చేకకూడా అడిగితేనేగాని మంచినీళ్ళు కూడా ఇవ్వడు. మంచినీళ్ళు త్రాగేటందుకు సందేహం కనబరచినా అతడు నొచ్చుకోడు. ఆ నిర్వికార స్థితి చూసి రామనాధం సిగ్గుపడ్డాడు. అలవాటు లేకపోవడం తప్ప అభ్యంతరం ఏమిటో అతనికి తెలియదు. "అబ్బెబ్బే! అదేమిటల్లా అంటారు? నా వరకు అటువంటి పట్టింపులేమీ లేవు" అన్నాడు. "మరి......?" "ఏమీలేదు. రావడమే....." "నీ సామాను ఎక్కడుంది?....." "రుక్కమ్మ హోటలులో పడేశాను." "నేనిక్కడే వుంటాను. వెళ్ళి తీసుకొచ్చెయ్యి. నీతో నన్ను కూడా చూసిందేమో, మరి నీకెప్పుడూ మంచినీళ్ళు కూడా ఇవ్వదు." ఇరవయ్యయిదు లెవల్‌ క్రాసింగ్‌ అవతల కొద్ది దూరంలో సర్పవరం రోడ్డుమీద, విశాలమైన ఆవరణలో లోపలగా కనిపిస్తున్న చిన్న బంగాళా పెంకుటింటి ముందు ఆగింది బండి. "బావగారూ, దిగండి" అంటూ చంద్రశేఖరం ముందు దిగేడు. "బెడ్డింగు లోపలకి తీసుకురావయ్యా" అని బండి అతనికి పురమాయిస్తూ "అదే మా దివ్యభవనం" అన్నాడు. కోరడి గుమ్మానికి ఓ పాతికగజాల దూరంలో వుంది యిల్లు. అక్కడి వరకూ దారికి అటూ ఇటూ పలు ఛాయలలో ముద్దబంతిపూలూ, చంద్రకాంతలూ, బంగాళాబంతిపూలూ బరాబరులు చేస్తున్నాయి. కన్నుల పండువుగా వున్న ఆ దృశ్యాన్ని చూసి రామనాధం సంతృప్తి వెలిబుచ్చేడు. "చక్కగా, ప్రశాంతంగా వుంది." "కదూ" అని చంద్రశేఖరం ఎంతో సంతృప్తి ప్రకటించేడు. "సునందకి పువ్వులంటే మహా ప్రాణం." "ఆమె ఇంట్లో లేరు లాగుంది" ద్వారానికి తగిలించి వున్న తాళం చూస్తూ రామనాధం అన్నాడు. "వుద్యోగం చేస్తోంది కదా. ఈవేళ నేను పెందరాళే వచ్చేను. గాని సాధారణంగా ఇద్దరం కలిసే వస్తుంటాం." "మరి పిల్లవాడు?" భార్యాభర్తలిద్దరూ వుద్యోగాలు చేస్తే పిల్లలూ, ఇల్లూ ఏమిటవుతాయనే ప్రశ్నను ఎలా పరిష్కరిస్తున్నారో రామనాధం తెలుసుకోగోరేడు. ఆడవాళ్ళు చదువుకోవాలనీ, వుద్యోగాలు చెయ్యాలనీ తానెప్పుడన్నా అంటే తన మిత్రులు ఈ బ్రహ్మాండమైన సమస్య తెచ్చి నోరు నొక్కేస్తున్నారు. దగ్గరలోనే ఓ ముసలమ్మ వుంది. ఆమెకు నెలకు ఏదో ఇస్తూంటారు. ఆమె చూస్తూంటుంది. కానీ... చుట్టుప్రక్కల యిళ్ళేం లేవు. ఒంటరితనం అనిపించదూ? ఆడా, మగా కూడా ఇల్లు వదిలిపోతే ఎల్లాగ? దొంగల బెడద వుండదా? కాలేజీకి దూరం అయింది. రోజూ బళ్ళకి బోలెడు అయిపోతుందే? అనంత సందేహాలు. బాగుందనే యింటిక్కూడా అనేక ఈతిబాధలు. చంద్రశేఖరం నవ్వేశాడు. అతడు దూరంగా, ఈ ఒంటరి కాపురమే బాగుందనుకున్నాడు. "ఏదో పోదూ, వాళ్ళనడుమ అనుకోవడమేగాని అక్కడుండేదంతా కశ్మలం." అందని ద్రాక్షపళ్ళ రుచిలాంటి మాటకాదని ఆ యిల్లు చూస్తూనే రామనాధం గ్రహించేడు. మురుగుకాలవలూ, దుర్వాసనా లేదు. శుభ్రమైన గాలి. చంద్రశేఖరం చెప్పిన కశ్మలం ప్రాదేశికమే కాదు, ప్రజల మనస్సుల్లో వున్నది కూడా అతడి వుద్దేశంలో వుంది. నిజమే. అతడు కులం తెలియని పిల్లను కట్టుకున్నాడు. కులం బలం మీద ఏర్పడిన సంఘం మధ్య వారికి నిలవ నీడ దొరకడం కష్టం. "అదీ నిజమేలెండి" అన్నాడు. "ఇంత అందమైన చోట వుంటే అన్నం, నీళ్ళూ కావాలనిపిస్తుందా?" అంటూ అతడు పువ్వుల మొక్కలు చూస్తూ మురిసిపోయేడు. అగ్రహారం ఇళ్ళల్లో కూడా ఏవో పువ్వుల మొక్కలుంటాయి. ములుగోరింట అక్కడ మహాపుష్పం. దేవపూజకి పది పవ్వులుంటాయి. అంతకన్నా కాస్త శ్రద్ధగల వాళ్ళు ఓ నందివర్ధనమో, కరవీరమో, పారిజాతమో వేస్తారు. దేనికైనా ప్రయోజనం ఒక్కటే. పువ్వులు పూజ కోసం. కనక తెల్లవారే సరికి మొక్కలన్నీ బోడిగా కనిపిస్తాయి. ఇక్కడ ప్రతి మొక్కకీ ఒకటో రెండో పువ్వులున్నాయి. రంగు రంగుల పువ్వులు. మొక్కలకు సమీపంగా వరల నుయ్యి. బారెడులో నీరు. రామనాధం చేద వేసేడు. "నీరు బాగానే వుంది." "ఈ నీరే మేము త్రాగేది" ఇద్దరూ కొద్దిసేపు అటూ ఇటూ తిరిగి ఇంట్లోకి వచ్చేరు. ఇద్దరూ హాలులో వున్న కుర్చీలలో కూర్చున్నారు. చంద్రశేఖరం ఇంక మళ్ళీ మొదటికి వచ్చేడు. "ఏమిటో ఇప్పుడు చెప్పు, కాలేజీ ఎందుకు మానినట్లు?" రామనాధం చెప్పినంతసేపూ అతి జాగ్రత్తగా విన్నాడు. చివరకు ఒక్క ప్రశ్న వేసేడు. "గురజాడ అప్పారావుగారనే ఆయన ఒక దేశభక్తి గీతం వ్రాశారు విన్నావా?" రామనాధం వినలేదు. తలతిప్పేడు. "అందులో ఆయన మీరంతా చెప్పే దేశం అంటే ఏమిటో చెప్పేరు." "ఏమన్నారు?" చంద్రశేఖరం గురజాడ కవి గీతం వినిపించేడు. "దేశమంటే మట్టి కాదోయ్‌ దేశమంటే మనుజులోయ్‌" రామనాధం కళ్ళు విప్పారితాలయ్యాయి. ఎంత గొప్ప భావం. బంకించంద్రుడు ఆనందమఠంలో దేశానికి జోహారులర్పించిన గీతం నేడు ఒక మహోద్యమానికే తలకట్టయింది. గురజాడకవి దృష్టిలో దేశంలోని జనతే దేశం. ఎంత ఆత్మీయత....... "పద్యం అంతా చదవండి." చంద్రశేఖరం జ్ఞాపకం వున్నంత వరకు చదివేడు. రామనాధం ఆలోచనలో పడ్డాడు. "చాలా వుదాత్తంగా వుంది." చంద్రశేఖరం ఒక్కక్షణం వూరుకొని, అతడు ఆలోచించుకొనేటందుకు అవకాశం ఇచ్చేడు. రామనాధం గీతం చరణాలు గుర్తుచేసుకుంటూ పాడుతున్నాడు. "స్వంతలాభం కొంతమానుకు పొరుగువాడికి తోడుపడవోయ్‌. --బ్రహ్మాండమైన వూహ." ఆ పద్యంలో రామనాధాన్ని ఆకర్షించిన చరణం వింటూనే చంద్రశేఖరం విస్తుపోయేడు. "మీరు నా చెల్లెలి భర్త కనక చెప్పవలసిన బాధ్యత కొంత నాకూ వుందనుకుంటున్నాను." "తప్పేం వుంది?" "మన దేశాన్ని వుద్ధరించడానికి చదువులెందుకు మానుకోవాలి? నాకర్థం కావడంలేదు. చదువు విజ్ఞానం కలిగిస్తుంది. అజ్ఞానం అభివృద్ధిని ఎలా సాధిస్తుంది? ప్రజలలో విపరీతమైన మూఢాచారాలు, అజ్ఞానపుటలవాట్లూ పాతుకు పోయి వున్నాయి. అంటురోగాలూ, కులమత కలహాలతో జాతి అంతా చివికి, శిథిలం అయిపోతూంది. వాళ్ళ అజ్ఞానం పోవాలి. కులాచారాల మూర్ఖపు కట్టుబాట్లు పోవాలి. దానికి విద్య, ఆధునిక విద్య ఒక్కటేదారి..... అదీ ఆయన అభిప్రాయం. ఈ వారం పదిరోజులలోనూ ఈ ప్రశ్న అనేక రూపాలలో చర్చకు వచ్చింది. పాఠాంతరాలతో ప్రత్యక్షమయింది. అనేక కోణాలనుంచి రామనాధం దానికి సమాధానాలనిచ్చేడు. ఇంగ్లీషు చదువుకోని మన పూర్వులు అజ్ఞానులా?......కాదు. వేల సంవత్సరాలుగా భారతదేశం అనేక నాగరికతలను కళ్ళ చూచింది. ఔను..... ఆ మాటలనెవ్వరూ కాదనలేదు. చంద్రశేఖరమూ అనడం లేదు. "కాలేజీ చదువూ, ఇంగ్లీషు చదువూ మాత్రమేనా విజ్ఞానం కలిగించేది?" అనే ప్రశ్నకు మాత్రం "తప్పకుండా"-- "సందేహం ఏముందీ?"-- "ఇంకా అనుమానమా?" వంటి సమాధానాలనే ఇచ్చేడు. "ఆధునిక విజ్ఞాన శాస్త్రాలలో వాళ్ళు నిధులు"--అన్నాడు. రామనాధం దానిని అంగీకరించలేదు. వాళ్ళకి విజ్ఞాన శాస్త్రాల పరిజ్ఞానం వుంటే మాత్రం మనకేం వొరుగుతుందన్నాడు. "తమకు కావలసిన గుమస్తాలను తయారు చేసుకొనేటందుకు విదేశ పాలకులు తయారుచేసిన పథకం కాదా యిది, మెకాలే...." "మెకాలే ఏమన్నా అననీ, అనుకోనీ. వాళ్ళు ఏ వుద్దేశంతో ఈ చదువులు ప్రవేశపెట్టినా, ఆ చదువులే మన కళ్ళు తెరిచాయి." అది చంద్రశేఖరం అచంచల విశ్వాసం-- "గురజాడ కవి చెప్పినట్లు దేశం అంటే ప్రజ. దేశం బాగుపడడం అంటే ప్రజలు బాగుపడటం. వాళ్ళలో విజ్ఞానం కలగాలి. మూఢాచారాలు పోవాలి. అప్పుడే ప్రజలు, దేశం బాగుపడుతుంది." అంతవరకే అయితే రామనాధానికీ అభ్యంతరం లేదు. "కాని, అదొక్కటే కర్తవ్యం అంటే ఎల్లాగ?" రామనాధం అతని మాటలనే మరొక దృక్కోణంలోంచి వివరించి చంద్రశేఖరం వాదాన్ని అతనికే ఎదురుతిప్పేడు. దేశం అంటే ప్రజ. ప్రజలు బాగుపడడమే దేశం బాగుపడడం. ఈవేళ దేశం మహా దారిద్య్రంలో వుంది. తిండిలేనివాడు చదువు ఏం చదువుతాడు? వానికి తిండి కలిగించాలి. తిండిలేకుండా చేస్తున్న ప్రభుత్వాన్ని తొలగించాలి. అందుకే గాంధీజీ ఖద్ధరు ఉద్యమమూ, సహాయనిరాకరణమూ అన్నారు--అని అతని వాదం. సమస్య మెలితిరిగింది. ఏది ముఖ్యం? కడుపునకు తిండా? మెదడుకు పుష్టియా? ఏది ముందు? ఏది వెనుక? ఆంగ్లేయుల వైజ్ఞానిక సంపదమీద బావగారికిగల అభిమానాన్ని తగ్గించేటందుకు రామనాధం ఎత్తుకున్నాడు. "మన పూర్వులు చాలా మేధావంతులు. పాశ్చాత్యులు నేడు సాధించేమన్న శాస్త్రజ్ఞానం మనవాళ్ళకి ఏనాడో వుంది...." చంద్రశేఖరం చిరునవ్వు నవ్వేడు. "వారి శాస్త్రపరిజ్ఞానము గురించి ఈవేళ కొలతలు తియ్యడం సాధ్యం కాదు. కనక వొప్పేసుకొందాం. పేచీలేని పని, కాని బావా! ఈనాడు మన స్థితి ఏమిటి? మా తాతలు నేతులు త్రాగేరు. మా మూతులు వాసన చూడమనా?" రామనాధం తన వుత్సాహం నుంచి ఇంకా తేరుకోలేదు. "మనం మహాభారత యుద్ధ కాలం నాటికే....." "ఇంగ్లీషువాళ్ళకి గోచీ పెట్టుకోవాలనే జ్ఞానం కూడా లేదు...." అని చంద్రశేఖరం ఆ భావాన్ని పూర్తి చేశాడు. "కాదంటారా?" "ఎందుకనాలి? ఎంతో ఆలస్యంగా మేలుకున్నా వాళ్ళు మనల్ని మించిపోయేరు." రామనాధం ఆ మాటల్ని అంగీకరించే ధోరణిలో లేడు. ప్రాచీన కాలంలోనే భారతీయులు నౌకలపై దేశవిదేశాలతో వర్తక వాణిజ్యాలు, సంస్కృతీ ప్రచారం సాగించిన కథల నాతడెన్నింటినో చదివేడు. వేలి వుంగరంలోంచి ఏడెనిమిది మూరల కట్టుబట్ట దూర్చేటంతటి సన్న వస్త్రాలు తయారుచేసిన నిపుణుల కథలూ చదివేడు. విన్నాడు. తాజ్‌మహల్‌ వంటి సుందర నిర్మాణం అనాగరికుల పనా? చంద్రశేఖరం నవ్వేడు. "తాజ్‌మహల్‌ను నిర్మించిన శిల్పిని గురించి కాదు, మనం మాట్లాడుతున్నది. ఈనాడు ఈ దేశపౌరులమయిన మన స్థితి ఏమిటని ప్రశ్న." రామనాధం వెనకడుగు వేయనే లేదు. "ఆధ్యాత్మిక సంపదలో మనం వాళ్ళకన్న చాలా ఉన్నత దశలో వున్నాం." నిజంగా నమ్మకంతోనే చెప్తున్నావా ఆ మాట అన్నట్లు చంద్రశేఖరం నిశితంగా చూసేడు. "మన ఆధ్యాత్మిక సంపద ఏ మాత్రం పటిష్ఠంగా వుందో మీ గాంధీగారి అస్పృశ్యతా నివారణ ప్రయత్నాలకు లభిస్తున్న ఆదరణ చెప్పడం లేదూ?" రామనాధం ఉడికిల్లేడు. "తెల్లవాళ్ళు దక్షిణాఫ్రికాలో అల్లాంటిపనే చెయ్యడం లేదూ?" "గాంధీగారిని దర్బాన్‌లో అవమానించేరు గనక ప్రతీకారంగా ముంగండ చెరువులో పంచములని మంచినీళ్ళు ముట్టుకోకూడదని నిషేధం పెట్టేరా?" తన వరకూ, తన గ్రామం వరకూ వచ్చేసరికి రామనాధం చల్లబడ్డాడు. చంద్రశేఖరం వెంటనే సర్దుకొన్నాడు. "మన లోపాన్ని తెలుసుకోవడం, అర్థం చేసుకోవడంలో తప్పు లేదు. ఆ ప్రయత్నంలో మన లోపాల్ని దిద్గుకోగలమనే ధైర్యం వుంటుంది. వెనుకటి రోజులు తలుచుకొని, మురిసిపోవడం మన పతనానికి ఒక మెట్టు. మనం నేర్చుకున్న మంచినికూడా మరచిపోడానికి అది ఒక దారి...." అంటూ తన ముఖంలోకి చూస్తుంటే ఆ మాటలలో ఏదో ప్రత్యేకమయిన అర్థం వున్నట్లనిపించింది. ఉదాహరణకి... అంటూ చంద్రశేఖరం తన జేబులోంచి ఒక శుభలేఖ తీసి చేతికిచ్చాడు. రామనాధం చదివి తిరిగి ఇచ్చేశాడు. తాను మాట్లాడడానికి వచ్చిన సమస్యను ఎలా ప్రారంభించాలో అర్థంగాక కొట్టుమిట్టాడుతున్నవాడికి దారి దొరికినట్లయింది. "ఔను." "చూడు, నీ పెండ్లికి పూర్వమూ, తర్వాతా కూడా నాతో కొన్ని విషయాల మీద చర్చ వేసుకొన్నావు. జ్ఞాపకం వుందా?" తొమ్మిది పదేళ్ళ చెల్లెలికీ, పదిహేను, పదహారేళ్ళ వయస్సున్న తనకూ వివాహం కుదిర్చింది చంద్రశేఖరమే. అప్పుడు తాను అమలాపురం హైస్కూలులో చదువుతున్నాడు. ఓ రోజున ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌లో తన్ను చూసేడు. పరిచయం అయింది. ఆ క్షణం నుంచి తమకు పెళ్ళి కావడానికి పదిహేనురోజులే వ్యవధి. ఆ పదిహేనురోజులూ అతడు తన్ను విడువలేదు. పెళ్ళిళ్ళ వయస్సు గురించి తాను చెప్పినవన్నీ అతడు ఒప్పుకొన్నాడు. తాను చిన్నతనపు పెళ్ళిళ్ళంటే అయిష్టం చూపించేడు. అయినా తాను మెత్తబడ్డాడు. దానికి చంద్రశేఖరమే ప్రధాన కారణం. తాను పెళ్ళిచేసుకోవాలనే ప్రయత్నంలో ఆయన తనను పెళ్ళికి వొప్పించేడని తర్వాత అనుకొన్నాడు. లేకపోతే సుందరికి పెళ్ళి కావడం సాధ్యం కాదు. అన్న కులాంతరురాలని పెళ్ళి చేసుకోవడం ఆమె పెళ్ళికి పెద్ద ఆటంకం అయి కూర్చుంటుంది. అందుకే తన్ను వొప్పించేడు. ఇరవయ్యేళ్ళు వచ్చేక మగవాడు పెళ్ళి చేసుకొంటానంటే స్త్రీకి 15-16 ఏళ్ళుండాలిసుంటుందని వాదం తెచ్చాడు. సంఘంలో పదేళ్ళకుమించి ఆడపిల్లల్ని వుంచడం లేదు, గనక ఇరవయ్యేళ్ళవాడు తనకంటె పది పన్నెండేళ్ళ చిన్నపిల్లను కట్టుకోవలసి వుంటుంది. అది సరికాదన్నాడు. ప్రస్తుత స్థితిలో పెళ్ళికి ప్రధానంకన్నా విలువలేదన్నాడు. సంసారం ప్రారంభించడం ఇరవయ్యేళ్ళు దాటాకనయితే తన విశ్వాసం నిలబడ్డట్లేనంటూ ఒక్క ప్రశ్న వేసేడు. "నీకు నా చెల్లెలు నచ్చిందా?" నచ్చడం ఏమిటి, చాలా బాగా నచ్చిందనుకొన్నాడు రామనాధం. "ఊ." "అయితే చేసుకో. లేకపోతే మా నాన్న వుంచడు. పెళ్ళికాక పూర్వమే రజస్వల అయిపోతే ఆయన పూర్వులకు పుట్టగతులుండవని ఆయన భయం." సుందరి కావాలనుకొంటే తాను వెంటనే పెళ్ళిచేసుకోవలసిందేనన్నాడు. వాయిదా వేయడం ఆమె మీద ఇష్టం లేదనుకోవాలన్నాడు. పదిహేనేళ్ళవాడికి పదేళ్ళ పిల్లమీద ఇష్టం వుండడం, లేకపోవడం ఏమిటో ఆతడు ఆలోచించగల స్థితి లేదు. ఊళ్లో వున్న ఆడపిల్లలకన్న సుందరిలో ప్రత్యేకత ఏమిటో తెలిసే వయస్సూ, అనుభూతం అయ్యే వయస్సూ కాదు. కాని సుందరిని చెయ్యిజారిపోనీకూడదనుకున్నాడు. సరేనన్నాడు. ఆనాడు తొందరపెట్టినవాడు ఈ రోజున "సుందరి వయస్సెంత? నీ వయస్సేమిటి?" అంటున్నాడనిపించింది. "చదువు పూర్తి చేసుకోకుండా అప్పుడే సంసారం ఏమిటి?" అన్నాడు చంద్రశేఖరం. "ఆ విషయం మీతో మాట్లాడాలనే వచ్చేను. మీ చెల్లెలు చిన్నపిల్ల, నేనూ ఆ మాటే అన్నాను. ఇప్పుడు కాదంటే విపరీతార్ధాలు తీస్తున్నారు. మగతనం లేక టలాయిస్తున్నానంటారంటారు బాబాయి. ఆ పిల్ల అంటే ఇష్టంలేక టలాయిస్తున్నానంటారు పెద్దనాన్న." అదంతా చిత్రంగా వినిపించింది చంద్రశేఖరానికి. "నువ్వు మా నాన్నగారితో చెప్పకపోయావా? చెప్పించకపోయావా?" "నా అభ్యంతరం మా బాబాయి తెలుపుతారనుకొన్నాను. తెలుపమన్నాను. కాని మీ వుత్తరం చూస్తే చెప్పినట్లు లేదు. లేక చెప్పినా లెక్క చెయ్యలేదో. పరిస్థితులు చెప్పి మీ నాన్నగారికి వ్రాయించడానికే వచ్చేను." "ఇష్టం-అయిష్టం మాటెందుకు వచ్చింది?" అని చంద్రశేఖరం ముందుమాట గుర్తు చేసుకొన్నాడు. "నేను సహాయనిరాకరణం చేశాను." "అయితే?" "మీ నాన్న పోలీసు ఆఫీసరు. బ్రిటిష్‌వాళ్ళ వుద్యోగి." "ఓహో." సావధానంగా జరిగిందంతా విన్నాక చంద్రశేఖరం అసలు పరిస్థితి అర్ధం అవుతూందనుకొన్నాడు. కాలేజీ మానడానికీ, ఈ శుభకార్యం తలపెట్టడానికీ ఎక్కడో సంబంధం వుందనిపించింది. కానీ, అదెటువంటిదో అర్థం కాలేదు. అయితే చంద్రశేఖరానికి తండ్రి స్వభావం తెలుసు. అల్లుడు సత్యాగ్రహం చేస్తే తన వుద్యోగానికి ఏం ప్రమాదమోనని భయపడే మనిషి. అదొక్కటే అయితే ఒక విధం. బ్రిటిష్‌ పరిపాలన పోవాలనే వాళ్ళు వట్టి సన్యాసులని ఆయన ఖచ్చితమైన అభిప్రాయం. ఆయన తన కూతుర్ని సత్యాగ్రహి అల్లుడి దగ్గరకు కాపురానికి పంపనన్నాడంటే నమ్మగలడు. కాని ఇదేమిటి? తన అలవాట్లకూ, అభిప్రాయాలకూ విరుద్ధంగా ఈ కార్యం తలపెట్టడం ఏమిటి? ఈ తొందర ఎందుకు? అల్లుడు కాలేజీ మానినట్లెరగడా? చెప్పలేదన్నాడు రామనాధం. అతడింతవరకు అమలాపురం వెళ్ళనే లేదు. "కాని తెలియకుండా వుండడం సాధ్యం కాదు. ఆ అవసరం మాత్రం ఏముంది?" అన్నాడు. చంద్రశేఖరం ఆలోచించేడు. ఆయనకు తెలియకుండా వుండడం సాధ్యం కాదు. ఇంకా గొడవయ్యాకనయితే కూతురు కాపురం చెడుతుందని తల్లి చేసిన ఏర్పాటేమోననిపించింది. ఆలోచించిన కొద్దీ అదే స్థిరపడింది. 'అంతే' అనుకొన్నాడు. ఇరవయ్యారు వంట మధ్యలోనే సునంద వచ్చేసింది. గుమ్మంలోంచే పలకరించింది. "ఈ వేళ బాగా పొద్దుగల్లనే వచ్చేశారన్నారు. ఎక్కడికెళ్ళేరో అనుకున్నా" నంటూ ఆమె సావట్లో అడుగుపెట్టింది. అక్కడ భర్తతో మరొకరు కూడా వుండడం గమనించి ఒక్కక్షణం ఆగింది. ఆమె మాట వినబడగానే చంద్రశేఖరం సంతోషంతో లేచేడు. "అదిగో ఆమె కూడా వచ్చేసింది" అంతలో గుమ్మంలోపల అడుగుపెట్టి ఆమె నిలబడిపోవడం చూసి నవ్వేడు. "నందా! ఈతడెవరో ఎరుగుదువా?" అన్నాడు. సునంద లోనికి వచ్చి చేతులు జోడించి, నమస్కారం చేసి తనకు తెలియదన్నట్లు తల తిప్పింది. చంద్రశేఖరం నవ్వేడు. రామనాధం లేచి తానే పరిచయం చేసుకొన్నాడు. "మీరు నన్నెరగరు. రామనాధం నా పేరు. వీరి చెల్లెల్ని....." చంద్రశేఖరం మాట మధ్యలోనే అందుకొని "మా చెల్లెలి మగడు." అన్నాడు. "శేఖరం గారు చెప్తూంటారు. వినడమేగాని చూడలేదు" అంది పరిచయం లేమికి క్షమాపణ చెప్పుకొంటున్నట్లు. శేఖరం అంటే ఎవరో అతనికి అర్థం కాలేదు. అలవాటులేమిని భర్తనే ఆమె పేరున పిలుస్తూందని తోచలేదు. "శేఖరంగారు ఎవరు?" అన్నాడు. "మీ బావగారే. రోజూ ఓమారేనా మీ ప్రసక్తి తెస్తూంటారు. ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌లో మొట్టమొదటి మారు బంతి అందివ్వడం అందుకోవడంతో మీకు పరిచయం అయిందిట కదూ." రామనాధం నవ్వేడు. "మరిచిపోలేదన్నమాట" అన్నాడు చంద్రశేఖరం వేపు చూస్తూ. "ఎల్లా మరిచిపోతాను. ఆ చిన్న వూళ్ళో అంత ఆటగాడు కనబడతాడనుకోలేదు" "అదేమిటండీ, అమలాపురం హైస్కూలు జట్టుకు ఫుట్‌బాల్‌లో జిల్లాలు దాటి పేరుంటేను." "ఇప్పుడే వస్తున్నా, కూర్చోండి" అంటూ వారిని కబుర్లకి వదిలేసి సునంద లోనికి వెళ్ళింది. ఆమె పదినిముషాలలో వచ్చినప్పుడు కొత్త మనిషిలా కనబడి రామనాధం ఆశ్చర్యంగా చూసేడు. అంతకు పూర్వం ముఖంలో కనిపించిన నలుగుడు, అలసట అంతర్ధానమయ్యేయి. ముఖంలో దీప్తి, హుషారు కనిపించాయి. బట్టలు మారిపోయాయి. మనిషే కొత్తగా వుంది. ఆమె గదిలోకి వస్తూనే అడిగింది. "మీరు ఏమన్నా తీసుకొన్నారా? వట్టినే కబుర్లు చెప్తూ కూర్చోబెట్టేరా?" వారు ఏమీ తినలేదని విని చాలా నొచ్చుకొంది. గబగబా లోనికి వెళ్ళి రెండు ప్లేట్లలో బిస్కట్లు పెట్టి వారి ఎదుట పెట్టింది. "తీసుకోండి, చా చేసి తీసుకొస్తా." "తీసుకురా, ముగ్గురం కలిసే త్రాగుదాం." అన్నాడు చంద్రశేఖరం. ఆ యువదంపతుల జీవిత పద్ధతి చూస్తూంటే రామనాధానికి అంతా కొత్తగానే వుంది. సిగ్గుపడుతూ, ఏదో మూల ఒదిగి కూర్చోకుండా ఆమె టీ కప్పుతో వచ్చి భర్త పక్కనే సోఫాలో కూర్చుంది. పరాయివాళ్ళముందు అంతగా మగణ్ని ఆనుకున్నంత దగ్గరగా కూర్చుని కబుర్లు చెప్పడం సిగ్గుమాలినతనంగా భావించాలో, జీవితానందాన్ని అనుభవించడంగా అర్థం చేసుకోవాలో అతనికి అర్థం కాలేదు. వాళ్ళముందర తాను సహజంగా ప్రవర్తించలేకున్నాడు. తాను వారి మధ్య సత్రకాయలా వున్నాననిపిస్తోంది. అతని పరాకు ఏమిటో సునంద సులభంగానే కనిపెట్టేసింది. తమ అలవాట్లు అతనికి కొత్తగా వున్నాయనీ, ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయనీ గ్రహించింది. ఏదో పనిమీద లేచినట్లు లేచి ఈ మారు వేరే కుర్చీ లాక్కుని కూర్చుంది. రామనాధానికి కష్టం తోచింది. తన రాక వారికి ఇబ్బంది కలిగిస్తోందనుకొన్నాడు. మామగారు వ్రాసిన జాబు చూసేక సునంద అభినందనలు తెలిపింది. చంద్రశేఖరం నవ్వేడు. "వారు తమ చెల్లెల్ని ఇంతవరకూ చూపించలేకపోయేరు. మీరేనా మీ భార్యను తీసుకువస్తారా?" అంటూ రామనాధాన్ని సూటిగా అడిగింది. చంద్రశేఖరం తమ సంభాషణ సారాంశం అంతా చెప్పేక ఈమారు నవ్వడం వంతు ఆమెదయింది. "మామగారి ఎత్తు చాలా పెద్దదే. చూడలేదుగాని, మా ఆడపడుచు ఎలా వుంటారు? తనకు నచ్చిందా, రూపురేఖలు ఎలా వుంటాయని ప్రశ్నించినట్లనిపించి రామనాధం సిగ్గుపడ్డాడు. ఆ సిగ్గులో ఆమె మొదటి వాక్యం అర్థం గురించి ఆలోచన తట్టలేదు. "ఆ వయస్సులో సరిగా అలాగే వుండేవాడిననేది మా అమ్మ." చంద్రశేఖరానిది చూడముచ్చటయిన ఆకారం. సునంద కళ్ళతోనే నవ్వింది. "మరింకేం. నేనూ అదే అనుకున్నా." ఆ సంభాషణ వెనకనున్న కొంటెతనమూ, అప్యాయమూ ఛాయగా చెవులకి తగిలి రామనాధం మనస్సులోనే ఆనందించేడు. తన సమాధానంలోని కొంటెతనం కనబడకుండా సర్దడానికి చంద్రశేఖరం చెల్లెలి గుణవర్ణన ప్రారంభించేడు. "ఆ చాదస్తపు ఇంట్లో వుండడం చేత రాణింపుకు రావడంలేదుగాని చాలా చురుకైనది. ఈడుకు మించిన తెలివి వుంది. చదివించి వుంటే చాల పైకి రాగల వూహ వుంది." "తమ్ముడుగారే చదివించుకోవచ్చు కదా...." ఆ అభిప్రాయం బాగానే వుంది అనిపించింది చంద్రశేఖరానికి. ఉద్యమాల ప్రవాహంలో కొట్టుకుపోకుండా తన తండ్రి లంగరులాగ సుందరిని వుపయోగించతలచినట్లు సునంద సూచనను పట్టి అతడు గ్రహించేడు. అదీ బాగానే వుందనిపించింది. కారణం ఏదయినా తాను చెప్పదలచిన మార్గమూ అదే. అయితే రామనాధం ఆ అభిప్రాయాన్ని అంగీకరించలేకపోయాడు. చదువు చెప్పించుకోడానికి భార్యను తెచ్చుకోమన్న సలహా అతడికి ఏ మాత్రం నచ్చలేదు. "ఇందాకా ఏమన్నారో జ్ఞాపకం వుందా?" చంద్రశేఖరం అంగీకరించేడు. "కాని స్థితిగతులు...." ఆ స్థితిగతుల్ని అనేక దృక్కోణాలనుంచి వివరించేడు. రామనాధం రాజకీయాలు తన తండ్రికి నచ్చవు. ఆయనకు ఈ స్థితి తెలుసో, తెలియదో. ఏ కళనున్నాడో కూతుర్ని పంపేస్తానంటున్నాడు. తెచ్చేసుకోవడమే మంచిది. ఆ సలహా తన మగతనానికే పెద్ద అవమానంగా భావించి రామనాధం ససేమిరా అన్నాడు. మగడు తీసుకెళ్ళడేమోనన్న భయం ఆడపిల్లవాళ్ళకుండాలేగానీ, తనకు బెదురేమిటనిపించింది. అటువంటి భయం కలిగించబోవడం చూసి, చంద్రశేఖరం తనను వెర్రి పప్పాయిగా భావించడం లేదుగదా అనిపించింది. కాని, ఆ దంపతులిద్దరూ ఏకకంఠంతో అదేమాట చెప్తూంటే ఆ విధంగా అనుమానించలేకపోయేడు.... అయినా.... ఆపద్ధర్మం పేరుతోనైనా తప్పు అనుకొంటున్నది చేయవలసిందేనా? "అక్కడే నీ నిగ్రహం...." --అంటూ చంద్రశేఖరం వుపదేశం చేస్తూంటే రామనాధానికి చాల విసువే కలిగింది. ఒకే ఇంట వుండడం, ఏకశయ్య--కాని దాంపత్య జీవితం నుంచి నిగ్రహం సులభమేనా? సులభమేననుకొన్నా ఆమె ఏమనుకొంటుంది? ఎంత గొడవ జరిగిపోతుంది? ఆ మాట నిజమేనని చంద్రశేఖరం ఒప్పుకొన్నాడు. కాని-- ఈమారు మరో భయం సూచనగా తెచ్చేడు. ఆ యింట్లో దేవతాపూజలూ, నోములూ, వ్రతాలూ, చాదస్తాలూ మాత్రమే పట్టుబడతాయి. ప్రపంచం ఏమిటో తెలియదు. ఇదే నేర్చుకొనే వయస్సు. ఆమెనిప్పుడు తెచ్చుకోవడం మంచిది. "సంగతులన్నీ చెప్పు, చదువు చెప్పుకో...." అంటున్నాడు. వీధిలోనుంచి 'అమ్మా' అని కేకపెడుతూ కేశవచంద్ర తుఫానులా పరుగెత్తుకొని వచ్చేడు. సునంద ఎదురెళ్ళి ఎత్తుకొని, అతనిని గుండెలకదుముకుని ముద్దు పెట్టుకుంది. "చూడు ఎవరొచ్చేరో చెప్పుకో?" ఆమె దగ్గరకు తీసుకువచ్చి నమస్కారం పెట్టించింది. "మామయ్య" రామనాధం వానిని దగ్గరకు తీసుకొని చేతిలో ఓ అయిదు రూపాయలు పెట్టేడు. "నీ మాటే గుర్తులేకపోయిందోయి." ఇరవయ్యేడు తాను వచ్చిన పని నెరవేరలేదు. అమలాపురంలో వాళ్ళ ప్రయత్నాలు వారు చేసుకుపోతున్నారు. ఇప్పటికే దానిని నిరోధించగల అవకాశం దాటిపోయినట్లు అనిపిస్తూంది. ఇంక తను ఏమన్నా పెద్ద గొడవ అయిపోతుంది. కాని ఏమి చెయ్యాలి? "ఆపద్ధర్మం పేరుతోనైనా తప్పు అనుకొన్నవి చేయవలసిందేనా?" రాత్రి భోజనం వేళ చంద్రశేఖరం కొత్త దిశనుంచి కవ్వించేడు. "నువ్వు బయటపడేందుకొక్కటే మార్గం. సునంద వడ్డిస్తూంటే నీ మేనల్లుడి పంక్తిని కూర్చుని భోజనం చేసినట్లు కబురందిస్తే బయటపడతావు." "శాశ్వతంగా దూరంగా వుంచుతారేమో మీ చెల్లెల్ని...." అంటూ సునంద భయం ప్రకటించింది. "తాను సిద్ధంగా వున్నప్పుడు బావగారు ఓ చిన్న ప్రాయశ్చిత్తకాండకి తయారయితే మళ్ళీ సర్దుకొంటాయి" అని చంద్రశేఖరం పరిష్కారమార్గం సూచించేడు. "ఇప్పుడు నేను చేస్తున్న పని తప్పు అని ఒప్పుకోవాలా?" "లండన్‌ వెళ్ళి వస్తే ప్రాయశ్చిత్తం చేసుకున్నట్లే, అదెంత అపరాధమో ఇదీ అంతే, మూర్ఖత్వాలకి హేతువులతో నిమిత్తం వుండదు. కొన్నింటికి చూసీ చూడనట్లు సర్దుకుపోతూంటే తప్ప అడుగెయ్యలేం." అన్నాడు చంద్రశేఖరం. కాని సునంద ఆవిధంగా సర్దుకుపోవాలనే భావాన్ని అంగీకరించలేదు. "మీరు అలాగ సర్దుకుపోలేదేం?" చంద్రశేఖరం నవ్వేడు. "సర్దుకుపోయేటట్లూహిస్తే, బాబిగాడికి వాళ్ళ మామయ్య కులం చెడగొట్టే ఛాన్సు వుండేది కాదు." కాని, సంభాషణ సాగినకొద్దీ సమస్యలంత సున్నితంగా పరిష్కారం గావనిపించి చంద్రశేఖరం ఆలోచనలో పడ్డాడు. రామనాధం తొందరపాటు మనిషిగాకపోయినా నిశ్చితమయిన అభిప్రాయాలు గలవాడు. తన ఇంటివద్ద మనుష్యుల స్వభావం ఎరిగిన చంద్రశేఖరానికి ప్రస్తుతం నడుస్తున్న పద్ధతిలో తన చెల్లెలు కుటుంబ జీవితం భగ్నమైపోయే ప్రమాదం వున్నదనిపించింది. తాను చేస్తున్నది తప్పుకాదనిపించినాక రామనాధం వెనకడుగు వేయడు. తాను వేళాకోళానికన్న మాట కూడా నిజమయి ఇదివరకే వున్న చిక్కులకు మరొకటి కూడా తోడవుతున్నట్లనిపించింది. మేనల్లునితో కబుర్లు చెపుతూ చెపుతూ చటుక్కున సునందను అడిగేడు. "మీరేమంటారు?" "ఇల్లాంటివి పైవాళ్ళు చెప్పదగినవి కాదు. ఎవరికివారు ఆలోచించుకోవలసినవి గాని." అంది ఆమె. రామనాధం చటుక్కున కుడిచేతి చూపుడువ్రేలూ, మధ్యవేలూ ముందుకు చాపి మేనల్లుడికి చూపేడు. "గమ్మున నీకు తోచిన వేలు పట్టుకోవోయ్‌?" చంద్రశేఖరం, సునంద ఫక్కున నవ్వేరు-- "లాటరీ వేస్తున్నావా?" "ఏం చెయ్యను? మీరు చెప్పింది నాకు నచ్చడం లేదు. నామాట మీదే కూర్చుంటే చాల మందితో విరోధం కొని తెచ్చుకోవలసి వుండేలా వుంది. ఈ దశలో లాటరీ తప్ప మార్గం ఏం వుంది?" కేశవచంద్ర మేనమామ ఆదేశాన్ని పాటించేడు. రామనాధం నవ్వేడు. "మీవాడు ఆదర్శం వొదులుకోవద్దన్నాడు." చంద్రశేఖరం ఆదుర్దాతో ప్రశ్నించేడు. "కొంపతీసి ఆలోచన, హేతువాదం కట్టిపెట్టేసి ఈ లాటరీ మీద ఆధారపడి పనిచేస్తావేమిటి?" "ఇంతకన్న మంచి మార్గం తోచకపోతే నామాట మీదనే వుండదలచుకొన్నాను. అంతే." తెల్లవారగట్ల రైలుస్టేషనుకి దిగబెడుతూ చంద్రశేఖరం మరల ఒకమారు హెచ్చరించేడు. "నాకు తోచినంత వరకు సుందరిని తెచ్చేసుకోమనే అంటాను. మా నాన్నకి వ్రాస్తాననుకో. కాని, మా మధ్యనున్న సయోధ్యల దృష్ట్యా అది జరగదు. ఆలోచించుకో, మరెవరినేనా అడుగు." "మీకంటె నాకు ఈ విషయంలో అడగడానికి చనువున్న సన్నిహితులెవరున్నారు? కానీండి." బండి కదిలే వరకూ చంద్రశేఖరం అక్కడే నిలబడి ఆ కబురూ ఈ కబురూ చెప్పేడు. ఇంటికి తిరిగి చేరుకొనేసరికి సునంద అతని రాకకోసం ఎదురుచూస్తూ కూర్చుని వుంది. "వెళ్ళేడా?" పరధ్యానంగానే సమాధానం ఇచ్చేడు. "ఆ". ఉభయులూ ఒకనిమిషం వూరుకున్నాక మరల చంద్రశేఖరం ప్రారంభించేడు. "హఠాత్తుగా నాన్నగారికి ఈ ఆలోచన ఎందుక్కలిగిందోగాని, చెల్లాయి చిక్కుల్లో పడుతుంది. ఇంత చిన్న విషయంమీద ఒక సంసారం భగ్నమయిందంటే సిగ్గుచేటు." "అంత మంచిగా, నెమ్మదిగా కనిపించినవాడు ఎంత పట్టుదల చూపుతున్నాడు?" అంది సునంద ఆశ్చర్యంతో. "అతనికి నచ్చచెప్పగల కీలకం మనకి దొరకలేదు." అని చిరాకుతో చొక్కావిప్పి సోఫాలో గిరాటువేసి హాలులో అటూ ఇటూ పచార్లు ప్రారంభించేడు చంద్రశేఖరం. ఇరవయ్యెనిమిది రాజమండ్రి స్టేషనులో దిగే వరకూ అక్కడ ఏం చెయ్యాలో రామనాధానికి ఓ ఆలోచన అంటూ లేదు. తన తమ్ముడు వెంకటరమణను చూడడం ఒకటి ముఖ్యం. బెడ్డింగు కూలివాని నెత్తికెత్తి కాలేజీ హాస్టలుకు బయలుదేరాడు. గేటులోకి వచ్చేసరికి రాజరత్నం ఎదురయ్యేడు. అతడు హాస్టలులో తన పక్క గదిలోనే వుండేవాడు, కూలివాని నెత్తిన బెడ్డింగు పట్టించుకొని వస్తున్న మిత్రుని చూసి అతడెంతో వుత్సాహం ప్రకటించేడు. "వచ్చేశావట్రా. చాలా మంచి పని చేశావు. నా గదిలో పెట్టించు." తన పాత మిత్రుని కలుసుకొన్న ఆనందంలో అతని మాటలలోని ప్రత్యేకతను రామనాధం గ్రహించలేదు. "మా తమ్ముడు" "తమ్ముడెక్కడికీ పోడులే. రా!" అని రాజరత్నం అతనిని తన గదికే తీసుకుపోయేడు. రామనాధం వెళ్ళిపోయినాక కాలేజీలో జరిగిన ఘటనలన్నింటినీ రాజరత్నం పదినిముషాలలో వివరించి కర్తవ్యం నిర్దేశించేడు. "పోయి వెంటనే ప్రిన్సిపాల్‌ని చూడు." రామనాధం వంటి విద్యార్థి కాలేజీ, చదువూ మానడం ప్రిన్సిపాల్‌కు ఎంతో అసంతుష్టి కలిగించింది. ఏదో తాత్కాలికావేశంలో తొందరపడి వుంటాడనీ, పేరు తీసెయ్యకుండా కొన్నాళ్ళు చూసి, తిరిగివస్తే చేర్చుకుందామనుకుంటున్నాడనీ రాజరత్నం వార్త. అసలటువంటి ప్రశ్న రావడమే రామనాధానికి చాలా అవమానకరం అనిపించింది. తాను వట్టి అనాలోచనాపరుడనుకోవడం చిన్నతనంగా తోచింది. "ఆ రోజున బహిరంగ సభలో చప్పట్లు కొట్టించుకొని...." రాజరత్నం హేళనగా నవ్వేడు. "ఆ చప్పట్లు కొట్టింది అభినందిస్తూననుకోవడం చేతనే ఈ పుట్టి మునక, పెళ్ళిభోజనాలూ, విందుల్లో గోవిందా కొడతారు ఎరగవూ! దానికీ దీనికీ అర్థం ఒక్కటే. 'ఓరి చవట పెద్దమ్మా! నీ బ్రతుకింతే సుమా' అని తాటేకులు కట్టిన చప్పుడురా నాయనమ్మా! అది." ఆ రోజున సహాయ నిరాకరణ ప్రకటించిన అయిదుగురిలో మంగరాజు నాలుగోరోజున వచ్చి కాలేజీలో చేరిపోయేడు. రామనాధానికి చాలా ఆశ్చర్యం కలిగింది. నిజానికి ఆరోజున తనకు హుషారునిచ్చింది ఆ మంగరాజే. "నిజంగా?" "వెళ్ళి తెలుసుకో"మన్నాడు రాజరత్నం నిర్లక్ష్యంగా. నాలుగోరోజున మంగరాజును వాళ్ళ నాన్నగారు కారులో కూర్చోబెట్టుకొని కాలేజీకి తీసుకొచ్చేరు. ఇద్దరూ సరాసరి ప్రిన్సిపాలు గదిలోకి వెళ్ళేరు. అక్కడినుంచి మంగరాజు క్లాసులోకి ఎలా వచ్చేడో, వాళ్ళ నాన్నగారు కారులో ఏ విధంగా నిష్క్రమించేరో రాజరత్నం సాభినయంగా వివరించేడు. "వెంకటేశ్వర్లు నిన్న వచ్చేడు. సూపరింటెండింగ్‌ ఇంజనీరు కొడుకు గనక మంగరాజును మాట్లాడకుండా చేర్చుకొన్నారుగాని, వెంకటేశ్వర్లుగాడికెవరున్నారు? వట్టి అనాధప్రేతం. కనక సంజాయిషీ అడిగి, పదిహేను రోజులు సస్పెండు చేశారు. ఆ అన్యాయానికి రామనాధం చాల బాధపడ్డాడు. "అంటే పరీక్షకు కూర్చోడానికి వీలు లేకుండేటన్ని రోజులు సస్పెండు చేశారు. వాడు నెత్తిన గుడ్డేసుకొని పోయేడు." "మీరంతా చూస్తూ కూర్చున్నారు." "ఏం చెయ్యమంటావు? ఆ నక్కకోసం మమ్మల్ని తోకలు తెగ్గోసుకోమంటావా?" పది పన్నెండేళ్ళక్రితం ఇదే కాలేజీలో గాడిచర్ల హరిసర్వోత్తమరావనే ఆయన వందేమాతరం బాడ్జి పెట్టుకు వచ్చినందుకు ప్రిన్సిపాలు ఆయనను సస్పెండు చేశాడు. ఆ శిక్షను వ్యతిరేకిస్తూ కాలేజీలో పెద్ద తిరుగుబాటే వచ్చింది. దాని ఫలితం చాలావరకు వెళ్ళింది కూడా. న్యాపతి సుబ్బారావుగారి వంటి ప్రముఖులు కదిలేరు. ప్రభుత్వం మోచర్ల రామచంద్రరావుగారితో విచారణ కమిటీని వేయవలసి వచ్చింది. ఆ విధంగానే విద్యార్ధులు నేడు కూడా ప్రతిఘటించి ఐక్యత కనబరచాలని రామనాధం చెప్పబోయేడు. కాని ఆ నాటి ఘట్టం వేరు. నేటి స్థితి వేరు. ఆనాడు గాడిచర్లవారు లొంగనందుకు ప్రిన్సిపాల్‌ సస్పెండు చేశాడు. కనకనే కాలేజీ అంతా ఆయన వెనక నిలబడింది. కాని, ఈ రోజున? వెంకటేశ్వర్లు లొంగిపోయేడు. అందుచేతనే ఆయన సస్పెండు చేయగలిగేడు. "ఆ బలహీనతను సమర్ధించమనా నీ అభిప్రాయం?" అని అడుగుతూ వుంటే రామనాధం నిరుత్తరుడయ్యేడు. ఒక్క నిముషం ఆలోచించి రామనాధం తన ఆలోచనకు తప్పు వ్యాఖ్యానం చేశావన్నాడు. "ఇక్కడ బలహీనత సమస్యే కాదు. ఒకే పనిచేసిన ఇద్దరికి చెరొకలాగా..." "అంటే మంగరాజుని కూడా సస్పెండు చెయ్యాలంటావు." రామనాధం విసుక్కున్నాడు. "నీకు తప్పు అర్థమేకాని కనబడదేమిట్రా?" తన్ను సమర్ధించుకోడానికి రాజరత్నం వెంకటేశ్వర్లు మరో అపరాధాన్ని వివరించేడు. "ఆ చచ్చు పీనుగ వస్తూవస్తూ శుద్ధ కోరా, ముతక బట్టలతో హాజరయ్యేడు. ఆ వేషం చూసేసరికి రంగనాధరావు లెక్చరరు మండిపడ్డారు. కాలేజీ మానేశానన్న వాడు మళ్ళీ రావడంగాక ఖద్దరు బట్టల ఏడ్పు ఎందుకు? చెప్పు, ఏం నోరు మూసుకొన్నావేం? ముందు మాలో ఎవరి దగ్గరకైనా ఏడిస్తే బట్టలిచ్చేవాళ్ళంగా! తిన్నగా రంగనాధరావు లెక్చరరు వద్దకు వెళ్ళాడు. ఆయన కస్సుమని ఆ బట్టలు మీ నాన్న మొహాన పారేసి రమ్మన్నాడు. లెక్చరరుకు కోపం ఎందుకు వచ్చిందో రామనాధానికి అర్థం అయిందనిపించింది. రంగనాధరావు మాటవచ్చేక అబ్బాయినాయుడు రష్యా విప్లవం గురించి అడిగిన మాట జ్ఞాపకం వచ్చింది, ఆయనకేమన్నా తెలుసునేమో "అడగాలి......" అనుకొన్నాడు. "నేను ప్రిన్సిపాల్‌ని కలుసుకుంటాను." రాజరత్నం అతనిని ఆపాదం చూసేడు. "ఆ బట్టలతో వెళ్ళకు, నా పాంటూ, కోటూ వేసుకెళ్లు." కాని, కాలేజీలో తన్ను చేర్చుకోమని అడగడానికిగాక వెంకటేశ్వర్లుకి అన్యాయం చేయడం గురించి అడిగేస్తానంటూంటే రాజరత్నం కంగారుపడ్డాడు. అతడు బెడ్డింగు తన గదిలో వుంచి ప్రిన్సిపాల్‌ని కలుసుకుంటే తాను పంపినట్లు మాట వస్తుందని భయపడసాగేడు. "ఏడవకురా...." "నీకేమిరా బాబూ! ఏదో పదెకరాల భూమి వుంది గనక ఎన్ని గంతులేనా వేస్తావు. ఎప్పుడు పరీక్ష పూర్తిచేస్తానో, వుద్యోగంలో చేరతానో అని మా ఆవిడ పుట్టింట పిల్లవాడితో ఎదురుచూస్తూంది." అన్నాడు రాజరత్నం. రామనాధం ఏమీ అనలేదు. "మధ్యాహ్నానికి కనిపిస్తానని మా రమణతో చెప్పు." అంటూ కూలీని పిలిచి బెడ్డింగుతో సహా నాళంవారి సత్రం వేపు వెళ్ళాడు. ఇరవైతొమ్మిది నాళంవారి సత్రంలో గుమాస్తా చూపిన గదిలో సామాను పడేసుకొని తిన్నగా గోదావరికెళ్ళి స్నానం చేసి వచ్చేడు. బట్టలు మార్చుకొని వీధిలోకి వచ్చేసరికి చిన్న ఖద్దరు బట్టల మూటతో సొట్టకాలుతో కుంటుకుంటూ ఇన్నీస్పేటలోకి మళ్ళుతున్న దువ్వూరు సుబ్బమ్మగారు కనిపించింది. ఆమె అతన్ని చూడగానే ఆప్యాయంగా పలకరించింది. "వచ్చేవురా తమ్ముడూ." వెనువెంటనే తన భుజాన వున్న బట్టలమూట అతనికిచ్చింది. అందుకోవడమయితే అందుకున్నాడు కాని, భుజాన పెట్టుకోలేకపోయేడు. ఆమె వుద్దేశ్యం అర్ధం అయింది. ఆ మూటతో ఆమె తనను వీధులవెంట తిప్పుతుంది. ఇంటింటికీ తిప్పుతుంది. ఆమె మాట తాను కాదనలేడు. అయినా బట్టలమూట భుజానవేసుకొని వీధులవెంట బయలుదేరడం ఎంతో సిగ్గనిపించింది. ఆ విధంగా తిరిగి అమ్ముకొనేవాళ్ళున్నారు. తానా కులం వాడు కాదు. అదో అభ్యంతరం. కానీ అంతకన్నా పెద్ద అభ్యంతరం నామోషీ. చిన్నతనం. పడవలోంచీ, రైలులోంచీ పక్కచుట్ట దింపడానికి కూడా కూలివాడు కావలసి వస్తుంది. అల్లాంటిది బట్టలమూట భుజాన వేసుకొని ఇన్నీస్పేట వీధులలో అమ్మాలంటే..... అతని తటపటాయింపును సుబ్బమ్మగారు కనిపెట్టేసింది. "సిగ్గేస్తూందట్రా వెర్రినాయనా?" ఆ సిగ్గును ఒప్పుకోడానికి కూడా ధైర్యం లేదు. "అబ్బే అదికాదక్కగారూ!" అతడు ఏవో సాకులు చెప్పబోయేడుగాని ఆమె అవకాశం ఇవ్వకుండా నవ్వేసింది. "ఆ హోదా తక్కువ పనికి దిగేవని మెళ్ళో వేసే దండ...." "ఆ దండ పడిపోయిందంతే.....!" "మరింకేం. పేచీయే లేదు. రా." రామనాధానికి మరి మాట తోచలేదు. ఆమె పక్కన పిల్లిలా నడుస్తూ ఆలోచనలో పడ్డాడు. ఈమె తన సమస్యకు ఏమన్నా పరిష్కారమార్గం చూపించగలదేమోననిపించింది. "అక్కగారూ!" "ఏమిట్రా, కొత్త పని ఏదన్నా జ్ఞాపకం వచ్చిందా?" "వుండడం అయితే చాలా పనులున్నాయి. కాని మీతో మాట్లాడాలండీ...." "ఏమిటది?" రామనాధం ఇంటికి వెళ్ళేక తన పరిస్థితి చెప్పేడు. అంతా విని ఆమె సులభంగా చెప్పేసింది. "అక్కడ విడిచిపెట్టకు. వెంటనే తీసుకువచ్చెయ్యి." అతడా సలహాకు నోరు తెరిచేడు. తన నియమం మాటేమిటి?" సుబ్బమ్మగారు నవ్వింది. అతని ఆలోచనా లేమికి జాలిపడింది. "ఓరి వెర్రినాగన్నా" అంది. "ఎప్పటికేనా అసలంటూ పెళ్ళాం కావాలనుకుంటున్నావా?" అంది. "ఆ పెళ్ళాం కాస్త అనుకూలంగా వుండేది కావాలా?" అంది. "సంసారంలో సుఖం, శాంతీ లేకుండా చేసుకోవాలనుకుంటున్నావా?" అంది. సుందరికి కుటుంబ జీవితంలో ప్రవేశించే వయస్సు లేకపోవచ్చు. కాని చూసింది ఇట్టే పట్టుకొనే వయస్సులో వుంది. జీవితాన్ని మలిచే అనుభవాల్ని నేర్చుకొనేది ఈ వయస్సులోనే, ఈ స్థితిలో ఆమెను ఒక పోలీసు ఉద్యోగి పెంపకంలో వదల వద్దని ఆమె సలహా. "విషం నూరిపోసేస్తాడు. దానికి మరి విరుగుడు కూడా దొరకదు. యావజ్జీవం నీకు ఓ సమస్య అయి కూర్చుంటుంది." భార్య తనకో సమస్య అయి కూర్చుంటుందనే సరికి రామనాధానికి మగతనపు అహంకారం దెబ్బతింది. చర్రుమన్నాడు. "అల్లాంటిది మన దగ్గర చెప్పకండి. మరీ సమస్య కావాలనుకుంటే వాళ్ళ నాన్నకే అవుతుంది." కాని ఆ మాట అనేశాక రామనాధం నొచ్చుకున్నాడు. సిగ్గు పడ్డాడు. ఇంతకీ తానూ, మామగారూ తగవుపడి సుందరి మీదనా కసి తీర్చుకోవడం? ఆ మాటనే సుబ్బమ్మగారూ అనేక రూపాలలో చెప్పింది. ఇదివరకే ఆడవాళ్ళకి అనంతంగా వున్నాయి బాధలు. వానిలో మరొకటి జతపరచడం ఆమెకేమాత్రం సమ్మతం కాలేదు. నిజమే. సుందరి చేయగలదేముందనిపించింది. కాని.... తానిప్పుడు చేయవలసిందేమిటి? తీసుకువచ్చెయ్యడానికి చిన్న పిల్లాయె. వాళ్ళు పంపెయ్యడానికే ఏర్పాట్లు చేస్తున్నారు. అదీ నిజమే. అయితే తన నియమం మాటేమిటి? "నియమం నియమం అంటావేమి"టంది ఆమె. దానిని పరిస్థితులకు వీలుగా సవరించుకోమంది. "అదే మీరు చెప్పండని అడుగుతున్నా"నన్నాడు రామనాధం. తిరిగి తిరిగి సమస్య మళ్ళీ మొదటికే వచ్చింది. సుబ్బమ్మగారు ఆలోచించింది. "ఇప్పటినుంచీ సంసారం పెట్టడం మంచిది కాదంటావు కదూ. పెట్టకు. ఉన్నవ లక్ష్మీనారాయణగారూ, భార్యా కన్యా విద్యాలయం లాంటిదేదో నడపాలనుకొంటున్నారు. "వారు నడపదలచుకొన్నది ఏదో ఆషామాషీ విద్యాలయం కాదు. స్త్రీలకు చదువుతోపాటు చిత్త సంస్కారమూ, దేశభక్తీ, జాతీయాభిమానమూ కలిగించాలనేది వారి ధ్యేయం." "ఆమధ్య అన్నారు. ఆ ప్రయత్నం చేస్తున్నామన్నారు. వుత్తరం వ్రాస్తాను." "కానీ, ఉన్నవవారి విద్యాలయం ఇంకా ఆలోచనల దశలోనే వుందాయె." "నీ భార్యే వాళ్ళ విద్యాలయంలోనే మొదటి విద్యార్థిని అవుతుంది." అదీ బాగానే వుంది.... "కాని....." మరల ఏదో అనుమానం. సుబ్బమ్మగారు నవ్వింది. "ఇన్ని సమస్యలు తెచ్చుకొని, ప్రశ్నలు వేసుకొని వాటికి సమాధానాలేమిటని బుర్ర పాడుచేసుకొంటూ కూర్చుంటే జీవితంలో ఒక్క అడుగు వెయ్యలేం." భార్య అన్నగారి సలహా, సుబ్బమ్మగారి సలహా ఒక్కటే. భార్యను వెంటనే తెచ్చేసుకోమనే ఇద్దరి సలహా. అయితే ఆ సలహాల వెనుకనున్న ఆలోచనా ధోరణులు వేరు. ఉన్నవవారి విద్యాలయం ఏర్పడే వరకూ సుందరి బాధ్యతను తాను తీసుకోడానికి ఆమె సిద్ధపడింది. "మా ఇంట్లో వుంటుంది. జాతీయ పాఠశాలలో చేర్పిద్దాం." అంది. కాని వారిద్దరూ ఎరగనిదీ, తెలుసుకోక తప్పనిదీ మరో ముఖ్య విషయం వుంది. ఆ పిల్ల ఏమంటుంది? రామనాధం వరకు పంపుతారు గాని, దువ్వూరి సుబ్బమ్మగారి వద్ద రాజమండ్రిలోనో, ఉన్నవవారి విద్యాలయం వచ్చేక గుంటూరులోనో వుంచుతానంటే పెద్దవాళ్ళు ఒప్పుకోరు. అత్తగారూ, మామగారూ మాట అటుంచి, తన్ను పెంచిన వాళ్ళే వొప్పుకోరు. వాళ్ళందరిదీ ఒక ఎత్తూ, అసలు సుందరిది ఒక ఎత్తూను. ఆమె ఏమంటుంది? బంధువులూ, భర్తా లేనిచోట వుండాలనేదొకటి? రెండోది ఉన్నవవారి విద్యాలయం అన్ని కులాలనూ సమీకరిస్తుంది. ఏ జాతీయ విద్యాలయమయినా చేయవలసిందదే. ఆ మార్పుకు మెట్లు లేవు. కులభేదాలు పాటించడం, పాటించకపోవడం--అంతే, సుందరి ఏం చేస్తుంది? ఆమె స్వభావం ఎటువంటిదో అతడెరుగడు. తొమ్మిదేళ్ళ పిల్లప్పుడు పెళ్ళి అయిదురోజులూ కూడా వున్నదేదో అంతే. ఈ నాలుగైదేళ్ళలో అతడు చాలామార్లు అత్తవారింటికి వెళ్ళేడు. కాని పరికిణీ మెరుపు, చేతి గాజుల గలగల, తమ్ముళ్ళూ, చెల్లెళ్ళూ ఆట పట్టించినప్పుడు వినిపించే అణిచిపెట్టుకొన్న నవ్వు, కృత్రిమమైన విసుగుదల మాటలు తప్ప అతడు భార్య ముఖం చూసిన గుర్తు కూడా లేదు. పరాకుగా వున్నప్పుడు ఎన్నడేనా తాను సందర్భపడితే, ఒక్క క్షణం మెరుపులా మాయమయ్యేది. ఇంక మాటా, పలుకూ ఎక్కడ? ఆమె స్వభావం ఏం ఎరుగును? ఏం చెప్పగలడు? పైగా మామగారు పోలీసు ఆఫీసరు. ఆయన బాలామంత్రోపదేశం పొందేడు. ఆ యింటి ఆడపడుచు. అటువంటిదే ఏదో చంద్రశేఖరం సూచనగా చెప్పిన మాట కూడా గుర్తు వచ్చింది. సుబ్బమ్మగారు ఇంత తటపటాయింపూ, మీన మేషాల లెక్కా పనికి రాదంది. "తిన్నగా వెళ్ళు, ఆ పిల్లతో మాట్లాడు. రెండు ఖద్దరు చీరెలు, లంగాలు, ఓణీలు తీసుకెళ్ళు, కట్టుకోమను...." పొందూరు రకాల సన్నబట్టలు చూచి మరీ ఇవ్వండి--అనాలనిపించింది. కాని ఆమె ఏమంటుందో అని భయపడ్డాడు. ఆమె నోరు మహా చెడ్డది.... ఎవరో ఆఫీసరు పెళ్ళాం "నేనింత బరువు బట్టలు కట్టలేనండోయి" అందిట. దానిమీద సుబ్బమ్మగారు అనేసిన మోటు మాట చెప్పుకొని ఇప్పటికీ పక్కలు పట్టుకొని దొర్లిదొర్లి నవ్వుతుంటారు. 'ఆరు మణుగుల మగడిని మోస్తున్నావు. అరవీశ చీర నీకు బరువయిందా?" అనేసరికి అంత ఆఫీసరు పెళ్ళాం నిలువునా చచ్చిపోయిందట. ఆ మాట జ్ఞాపకం వచ్చేసరికి అతడికీ నవ్వు వచ్చింది. "ఎందుకురా నవ్వుతున్నావు?" ఈ మాటతో అతడు పైకే నవ్వేశాడు. "చూస్తే హడలిపోయేలా గాకుండా బాగా సన్నరకం చూచి మరీ ఇప్పించండి. ఈ వందా తీసుకోండి. ఇంకా పడితే.." అతని నవ్వూ, సందేహమూ చూచి సుబ్బమ్మగారు ఒక్కక్షణం విస్తుపోయి, తరువాత తనూ నవ్వేసింది. "మొగం ఎరక్కపోయినా పెళ్ళామంటే ఆ అభిమానం, సానుభూతి వుండాలి. ఆ పిల్ల ఎవరో అదృష్టవంతురాలు. వెళ్ళు వెళ్ళు." ముప్ఫయి హాస్టలు గదిలో వెంకటరమణ దొరికేడు. మనిషిలో ఇదివరకటంత ఆప్యాయత కన్పించలేదు. ఏదో మాటవరసకి అడిగినట్లు "ఎప్పుడొచ్చేవు?" అన్నాడు. "ఏమిటల్లా వున్నావు?" అంటూ కుశలప్రశ్న వేసి, కొద్దిసేపు ఆ మాటా ఈ మాటా మాట్లాడేడు. చటుక్కున ప్రశ్నించేడు. "మీ అమ్మకి వుత్తరం వ్రాయలేదుట. ఆవిడ బాధపడుతూంది." హఠాత్తుగా ఎదురయిన ఆ ప్రశ్నకు వెంకటరమణ కంగారుపడ్డాడు. "ఏదో వ్రాయలేదు. బాబయ్యగారికి వ్రాశా కదా అని...." "అందులో మీ అమ్మమాటే రాయలేదట. అది వినిపిస్తే బాధపడుతుందని ఆయన వుత్తరం వచ్చిందని చెప్పకుండా దాచిపెట్టేడు. ఆమె ఒకటే గొడవ." వెంకటరమణ ఏదో అస్పష్టంగా గొణిగేడు. రామనాధం మరో విషయం ఎత్తుకున్నాడు. "నువ్వు సైంటిస్టువి కావాలని బాబయ్య అభిప్రాయం." "కాని, ఎల్లా చదవడం? ఆ అత్తవారి వాళ్ళ డబ్బు తీసుకోవడం నాకు ఇష్టం లేదు. బాబయ్య ఇవ్వలేరు. ఇంకో ఆరేడేళ్ళు చదవడం మాటలా?" అది యథార్థం. బాబయ్య డబ్బు ఇవ్వగల స్థితిలో లేడు. ఏమన్నా ఇచ్చినా అది పెట్టుకొని చదువు కొసకంటా సాగించడం సాధ్యం కాదు. తనకు సాయపడాలని వుంది. కాని, తనకే ప్రస్తుతం దారి లేదు. బట్టలు కొనుక్కొనేటందుకు నోటు వ్రాయవలసి వచ్చింది. ఇప్పుడు తన భార్య సంగతి తేల్చుకోవలసి వుంది. ఆమెను ఎక్కడ వుంచినా డబ్బు కావాలి. ఆస్తిపాస్తుల విషయం ఏదో తేల్చుకొంటేనే గాని, తనకు కాళ్ళూ చేతులూ ఆడడం లేదు. కాని చదువు చెప్పించుకుంటామని తీసుకెళ్ళిన అత్తవారి వద్ద డబ్బు తీసుకోననడం ఏమిటో రామనాధానికి అర్థం కాలేదు. ఏమన్నా గొడవలు వచ్చేయో ఏమిటో... ఆ విషయాన్ని ప్రస్తావించడం ఎల్లాగో అర్ధం కాలేదు. "వాళ్ళు చదివిస్తామంటున్నప్పుడు ఎందుకు సందేహం? ఏం జరిగింది?" వెంకటరమణ ముఖం నల్లబడిపోయింది. కాని పైకి ఏమీ చెప్పలేదు. "నాకిష్టం లేదు." ఇద్దరూ ఒక్క నిముషం వూరుకున్నారు. తమ్ముని అభిమానాన్ని ఎరిగిన రామనాధం ఇంక ఆ విషయం కదపతలచుకోలేదు. "పోనీ, ఉద్యోగమే చేయాలనుకొన్నప్పుడు మరొకటి లేదా?" "దానికేం?" "బాబయ్య కిష్టం లేదు." "బాబయ్య కిష్టం లేదు. ఆయన కిష్టం అయింది. పెళ్ళి చేసేడు. ఆ పెళ్ళిచేసి నాకెంత అపకారం చేసేరో ఆయనకి తెలియదు. నాకు తెలుసు. ఇంక నా కష్టసుఖాలు నాకు వదిలెయ్యడం మంచిది." అతని అసంతృప్తి ఏమిటో అర్ధం కాకపోయినా ఏదో మనస్సులో చాలా బాధపడుతున్నాడనిపించింది. ఇంతకాలం తమకెవ్వరికీ చెప్పలేదు. తాము పట్టించుకోనూ లేదు. అదేదో సర్దుబాటు చేయవలసి వుటుంది. బాబయ్యతో చెప్పాలనుకొన్నాడు రామనాధం. "పోనీ నీకయినా పోలీసుశాఖ ఎల్లా నచ్చింది?" వెంకటరమణ మొండిగా మాట్లాడినట్లనిపించినా రామనాధం పట్టించుకోలేదు. "ఏం, దానికేం లోటొచ్చింది?" అని రమణ ప్రశ్న. "బ్రతకడానికి ఏ వుద్యోగమైతేనేం?" "హోదా, ఫాయిదా లేని చచ్చు మేస్టరీకన్న ఇది నయం." వెంకటరమణ ప్రశ్నల్నీ, నిశ్చితాభిప్రాయాల్నీ వివిధ దృక్కోణాల నుంచి ప్రత్యాఖ్యానం చెయ్యడానికి రామనాధం ప్రయత్నించేడు. పోలీసు వుద్యోగంలో వున్న హింసా ప్రవృత్తిని వర్ణించేడు. పై అధికారులకు ఎంత హెచ్చుగా లొంగివుండాలో చెప్పేడు. "ఆ విధంగా లొంగి చేతులు నలపడం ఎందులోనైనా తప్పదు." అన్నాడు రమణ. "దేశం అంతా విదేశీ ప్రభుత్వాన్ని సాగనంపడానికి పెద్ద వుద్యమం నడిపిస్తూంటే నువ్వు ఆ ప్రభుత్వానికి కొమ్ము కాయాలి." "అంటే.....?" "దేశాన్నీ, బంధువుల్నీ కాదనాలి." వెంకటరమణ చురుకు చురుకున చూసేడు. "అది నా ఒక్కడి విషయంలోనేనా?" అతని అభిప్రాయం గ్రహించి రామనాధం చిరునవ్వు నవ్వేడు. తల అడ్డంగా తిప్పేడు. నాలుగేళ్ళ క్రితం పోలీసు సర్కిల్‌ ఇన్స్‌పెక్టరు కూతుర్ని కోడలుగా తెచ్చుకోవడం తమ కుటుంబానికే గొప్పగా భావించేరు తమవాళ్ళు. ఆనాటి స్థితి వేరు. నేడు తాను ఐ.సి.ఎస్‌.కి వెళ్ళాలన్న సన్నాహాలను కూడా కట్టిపెట్టుకొని జాతీయోద్యమంలో చేరేడు. "కాని, మీరాయనతో తెగతెంపులు చేసుకోబోవటం లేదు కదా..." "అంటే....?" "ఈవేళ ఆయన నీకు మామగారు కాకపోతారా, ఆ సర్కిలినస్పెక్టరు కూతురు భార్య కాకపోతుందా?" "ఎందుకు కారు? కాని, మామగారు పోలీసు ఆఫీసరు అయినంత మాత్రాన నువ్వు దేశద్రోహివి గావాలా?" రామనాధం చర్చలలో తన సోదరుడి మనస్సు నొప్పించగలిగేడే గాని అతనిని వొప్పించలేకపోయాడు. ఆ మాట తోచి అతనికెంతో బాధ కలిగింది. కాని ఏమనడానికీ తోచలేదు. "సరే కానియ్యి." ఇద్దరూ బయటకు వచ్చేరు. గదికి తాళం వేస్తూ వెంకటరమణ ప్రశ్నించేడు. "నువ్వు ప్రిన్సిపాల్‌ను కలుసుకోవా....?" "లేదు. మొదట అల్లా అనుకొన్నా, కాని, వెంకటేశ్వర్లుకే పట్టింపు లేనప్పుడు...." "రాజరత్నంగారు చెప్పినప్పుడే అనుకొన్నా, నువ్వు అనవసర విషయంలో కలగచేసుకొంటున్నావని..." "మొదట అల్లా అనుకోము... ప్రపంచంలో సమస్యలన్నీ మన సమస్యలే అనుకొని ప్రారంభం అవుతాము." అది వెంకటేశ్వర్లును గురించి అన్న మాటో, తననుద్దేశించినదో రమణకు అర్ధం కాలేదు. ఏదయినా దానికి సమాధానం ఇవ్వవలసి వుంటుందనుకోలేదు. "తండ్రి బాధ పడలేక ఆయనను సంతృప్తి పరచడానికి ప్రిన్సిపాల్‌ను కలుసుకొన్నాడు. ఆయన కాదన్నదే చాలునని బ్రహ్మానందపడ్డాడు. నిజంగా వెంకటేశ్వర్లు గారికి కాలేజీలో చేరాలనే వుంటే ప్రిన్సిపాల్‌ను సంతృప్తిపరచడమేం గగనం కాదు." "...... నే తోచింది." ఇదివరకటి మాదిరిగా తన తమ్ముడు తనతో గేటు వరకూ రాలేదనీ, తనతో వుండడంలో వుత్సాహం చూపలేదనీ గ్రహించేక రామనాధం నవ్వుకొన్నాడు. "నాతో కనిపిస్తేనే పోలీసు ఉద్యోగానికి ముప్పు మూడుతుందని భయం కాబోలు" అనుకొన్నాడు. ముప్ఫయ్యొకటి కూలివాని నెత్తిన బట్టల మూట పట్టించుకొని రామనాధం గుమ్మం మెట్లెక్కుతూంటే రంగనాధరావు ఆశ్చర్యం కనబరచేడు. "నమస్కారం గురువుగారూ! ఏదో పనిమీద ఊళ్లోకి వచ్చేను. తమ దర్శనం చేసుకుపోదామని....." రామనాధం కూలివాని నెత్తిమీద మూట దింపి డబ్బులిచ్చి పంపేసేడు. "ఏమిటయ్యా ఇది?" "తమతో మాట్లాడాలనుకొన్నా, పోనీ ఎలాగూ వస్తున్నాకదాయని దుప్పట్లూ, వగైరా పట్టించుకొచ్చా. తమ యింట్లో వాడకానికి మంచి రకాలు వున్నాయి." రామనాధం చూపుతూంటే రంగనాధం, భార్యా కొన్ని దుప్పట్లూ, డోర్‌ కర్టెన్లూ, టేబుల్‌క్లాతూ తీసుకొన్నారు. బేరం ముగించి రంగనాధరావు అభినందించేడు..."బలేవాడివోయి." "అసలు నీకీ ఆలోచన ఎందుకు తట్టిందంట. వారం నుంచి బజారుకెళ్ళి కొన్ని బట్టలు తేవాలనుకుంటూనే బద్ధకిస్తున్నా" నంటూ గురుపత్ని రెండు కప్పులతో టీ తెచ్చి ముందుంచింది. "తీసుకోవయ్యా"--అంటూ రంగనాధరావు ఒక కప్పు అతనికందించి తానొకటి తీసుకొన్నాడు. "ఇప్పుడు చెప్పు, ఖద్దరు ప్రచారం పట్టుకున్నట్లున్నావు? ఔను కాని, ఈ ఖద్దరు అమ్మితే బ్రిటిషువాళ్లని పంపెపయ్యగలమనే అనుకుంటున్నారా మీరంతా?" రామనాధం నిజం వొప్పేసుకున్నాడు. ఆ రోజు వుదయమే దువ్వూరి సుబ్బమ్మగారు ఖద్దరు మూట భుజానికెత్తేరు తప్ప అంతవరకూ అతడా ఆలోచన కూడా చెయ్యలేదు. "నేను స్వతంత్రంగా చేసిన మొదటి బేరం మీ యింటి వద్దనేనండి." "మరీ పదిహేను రోజులనుంచీ ఏమి చేస్తున్నట్లు? ఏం చెయ్యాలనుకుంటున్నావు?" రామనాధం ఇంకా ఏమీ నిశ్చయించుకోలేదు. "నిజంచేత నేనీ పదిహేను రోజుల నుంచీ చూస్తున్నది నేనెరిగిన ప్రపంచమేనా అనిపిస్తూంది. మామూలు విషయాలు గాక ఏవేవో కొత్త కొత్తవి చూసేననుకోకండి. నా చిన్నప్పటి నుంచీ చూస్తున్నవే. అయితే వానినీ దృష్టిలోంచి ఎన్నడూ చూడలేదు." రంగనాధరావు శిష్యుని అనుభవాలను వినడానికి వుత్సహించేడు. అవన్నీ విని చాల ఆందోళన ప్రకటించేడు. మంగమ్మ తన తల్లిదండ్రుల, అన్నదమ్ముల మధ్య నుంచి ఎక్కడికైనా పోయి చదువుకోవాలనుకొంటూంది. గ్రామాలలో చదువు సౌకర్యాలు లేవు. ఉన్నవి వీలుగా లేవు. స్వరాజ్యం ఏవన్నా చదవడానికి పుస్తకాలు కావాలని మూడు మైళ్ళ దూరం మనిషిని పంపింది. గ్రామాలలో పుస్తకాలు దొరకవు. స్వయంగా తెప్పించుకోవడం అందరికీ సాధ్యం కాదు. అన్నీ తెచ్చుకోలేరు. ఆ లోటును గ్రంథాలయాలే తీర్చగలవు. కాని అవి వూళ్ళలో లేవు. వున్నవి కూడా నిర్వహించే వాళ్ళు లేక మూలబడి వున్నాయి. గ్రామాలలో కులం అహంకారాలు, సాంఘిక దురాచారాలూ చాలా బలంగా వున్నాయి. ఆ బాధ ఎదురవుతూనే వుంది. కాని దాని నుంచి బయట పడలేకుండా వున్నారు. మరీ ఘోరం. వూళ్ళలో వడ్డీ వ్యాపారస్తుల మూలంగా ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. పల్లెటూళ్ళలో పరపతి సౌకర్యాలు లేవు. తన వూళ్ళో, తన చుట్టుపట్ల తాను చూసిన ఒకటి రెండు ఘటనలను దేశావసరాలనుగా వర్ణించడానికి అతనికేమాత్రం సందేహం కలగలేదు. నిజంచేత అతడు చూడనిదల్లా ఖద్దరు అవసరమే. "గురువుగారూ! ఇంగ్లీషు వాళ్ళు తమ మిల్లు బట్టల మార్కెట్ ‌కోసం ఢాకాలో మస్లిను నేతగాళ్ళ బొటనవ్రేళ్ళు నరికించేరంటారు. కావచ్చు కాని మా యింట్లో ఓ రాట్నం అటక మీద వుంది. అది అటక ఎక్కడానికి కారణం వేళ్ళు నరికించడం కాదు. కళ్ళు పీకించడమూ కాదు. వ్యాపారం పోటీలో అది మూలబడింది. ఆ పోటీ అలా వుండగానే...." రంగనాధరావు కూర్చుని వింటున్నవాడల్లా లేచి పచార్లు ప్రారంభించేడు. "మీ గాంధీ దేశాన్ని కృతయుగం వేపుకు తిప్పాలనుకుంటున్నాడనుకోవాలి. అది జరిగే పని కాదు. గాంధీ వుద్యమానికి ఖద్దరు ఓ 'సింబల్‌' కావచ్చు. అంతేగాని, దేశం పురోగతికి మాత్రం దాని పాత్ర వుండదు. నువ్వు ఇన్ని ఘటనలు చెప్పేవు. వానిని చూస్తే నీకు ఏమి అర్ధం అయింది?" సాంఘికాదర్శాలూ, సంసార లక్షణాల యొక్క పద్ధతులూ, ధర్మాలూ పూర్తిగా మారవలసి వున్నాయంటూంటే రామనాధం ఆశ్చర్యంతో వింటున్నాడు. "వెనుకటి పద్ధతులూ, కట్టుబాట్లూ మధ్య జీవించలేమన్నమాట?" వారం రోజులుగా తన్ను వేధిస్తున్న సమస్యలు గుర్తు వస్తూంటే రామనాధం తల వూపేడు. "ఔను......" హఠాత్తుగా వున్నట్లుండి రంగనాధరావు రామనాధం కట్టెదుట నిలబడ్డాడు "రష్యాలో జరిగిన విప్లవం సంగతి ఏమన్నా విన్నావా?" తాను దానిని గురించే అడగాలని వచ్చినట్లు రామనాధం చెప్పేడు. "మా ప్రక్క ఊళ్ళో ఒక గుడ్డి ఆయన వున్నారు. ఆంధ్రపత్రికలో చదివి వినిపించుకున్న వార్తలన్నీ ఆయనకు జ్ఞాపకం. మొన్న వాళ్ళింటికెడితే ఎన్నెన్నో ప్రశ్నలు వేశారు. నాకు వొక్కటీ తెలియదు. అవన్నీ నేనూ చదివేను. కాని వానిని గురించి ఆలోచించలేదు. వొక్క లెనిన్‌ పేరినడం తప్ప....." లెనిన్‌ పేరు చెప్పినప్పుడు రంగనాధరావు తానాయనను చూసి కూడా మాట్లాడలేకపోయేనని చాలా విచారపడ్డాడు. బ్రిటిష్‌ మ్యూజియమ్‌లో చదువుకొంటున్న ఒక బట్టతల మనిషిని చూపించి ఆయనే లెనిన్‌ అన్నారు. ఆ రోజుల్లో సావర్కరు ఆలోచనలలో వున్న నేను ఆయన గురించి వినిపించుకోలేదు. రెండేళ్ళక్రితం హఠాత్తుగా ఆయన పేరు పత్రికల్లో కనిపించింది. ఆయన రష్యాలో తెచ్చి పేట్టేడన్న దుష్టపరిస్థితుల వర్ణన బ్రిటిషు పత్రికలలో చదివినకొద్దీ ఆయనతో ఆనాడు పరిచయం పెట్టుకోలేక పోయానేయని బాధపడుతున్నాను." రంగనాధరావు పత్రికల్లోని వార్తలను ఏ విధంగా అర్ధం చేసుకోవాలో హుషారుగా చెప్పుకుపోతున్నాడు. "రష్యాలో యంత్రాలు, బ్యాంకులు, భూములు అన్నీ జనపరం చేశామన్నారు. అంతవరకు వానిమీద అపార ధనం ఆర్జిస్తున్న వారంతా మిగిలిన జనంతోపాటు పనిచేయవలసి వచ్చింది. కష్టపడి పనిచేయడం చేతగాక దేశం వదలి పారిపోయి వచ్చారు. ఆ దేశం చూడబోయిన వారీ రెండు మూడేళ్ళలో ఎవరన్నా వుంటే వాళ్ళు తమ తమ దేశాలలోకెల్ల భాగ్యవంతులు, తమ మిత్రులూ, బంధువులూ ఈనాడు వీధిలో అందరితోపాటు మంచు ఎత్తిపోయడం దగ్గిరినుంచి చేస్తున్నారని వినేసరికి భరించలేక పోతున్నారు. నానా అవాకులూ వ్రాస్తున్నారు." ప్రాక్పశ్చిమ దేశాల అధ్యాత్మిక-భౌతికాదర్శాల సమ్మేళనం నేటి రష్యాలోని వ్యవస్థయని రంగనాధరావు అభిప్రాయం. యూరపులో యంత్రాలమీద వుత్పత్తి చేస్తున్నారు. ఫలితంగా అంత వరకు ఉత్పత్తికి కేంద్రంగా వున్న కుటుంబ వ్యవస్థ అంతరించింది. యంత్రాల రాకతో కుటుంబాలు, సంసారాలు విచ్ఛిన్నమైనాయి. యంత్రాలకు ప్రజలు దాసులయ్యేరు. ఏ కొద్దిమందో భోగభాగ్యాలతో తులతూగుతూంటే జన సామాన్యానికి తిండిలేక, వసతిలేక మలమల మాడిపోతూన్నారు. ఫలితంగా పెట్టుబడిదారులకీ, పాటకపు జనానికీ పోరాటం ప్రారంభమయింది. యూరపు అంతటా వుందది. ఈ పోరాటం ధనము, ఆర్థిక వసతి, గృహ సౌకర్యము కలిగిస్తే తీరిపోయేది కాదు. సంసార నిర్మాణము, సాంఘిక నిర్మాణము అనేక క్లిష్ట సందర్భాలకు చెందిన సమస్య యిది. ఇది కేవలమూ కూలివాడు రాజ్యాంగాధికారాన్ని పట్టుకొన్నంత మాత్రంతో తెమలదు. అధికారంలో వుండేవారివే కావు, సామాన్య ప్రజలయొక్క సాంఘికాదర్శాలూ, సంసార లక్షణాల పద్ధతులూ, ధర్మాలూ పరిపూర్ణంగా మారాలి. "రష్యాలో జరిగిన మార్పు అది." "సంఘం ఆ విధంగా విచ్ఛిన్నమైపోనివ్వడం, దానికోసం మరో మార్గం వెతుక్కోడం కన్న అసలు యంత్ర నాగరికతను నిరోధించడం....." అని రామనాధం తన ఆలోచనను సూచించాడు. "మీ గ్రామాన్ని ఓ వారం రోజులు చూసి వచ్చి నువ్వు లోపంగా వున్నాయని బాధపడుతున్నవేమిటి? చెప్పగలవా?" రామనాధం ఆలోచించేడు. ఒక్క నిముషం ఆగి రంగనాధరావే సమాధానము ఇచ్చేడు. "నువ్వు దేని నుంచి తప్పించుకోవాలనుకొంటున్నావో ఆ యంత్ర నాగరికత సుఖాల కోసమే అలమటించేవు...." రామనాధం విస్తుబోయేడు. "ఔను నువ్వు తప్పించుకోలేవు. వెనక్కి తిరగలేవు. కొరడా చేత పుచ్చుకొని కాలధర్మం నిన్ను తరుముతూంది. తప్పించుకోలేవు. కనక నువ్వు చెయ్యగలదల్లా యూరపులో మాదిరిగా ఆ మార్పు జనానికి అధిక దుఃఖకరం కాకుండా మార్గం చూడడం" "ఏ విధంగా?.....రష్యాలో మాదిరిగానా? అది మాత్రం నిలబడుతుందని నమ్మకమేమిటి? వాళ్ళు మాత్రం సరియైన పనేచేస్తున్నారనేమిటి...." "దౌర్జన్యం దౌర్జన్యాన్ని సృష్టిస్తుంది." "బలాత్కారంగా కొందరిని హింసించి కత్తి బలంతో నెలకొల్పిన ప్రభుత్వం కత్తితోనే కూల్చివేయబడదా?" రామనాధానికి అనేక ప్రశ్నలు. రంగనాధరావు మహదావేశంతో ప్రత్యాఖ్యానం చేశాడు. "నిలబడకపోతే మాత్రం ఏమవుతుంది? ఆ భావాల బలం ఏమవుతుంది? ఫ్రెంచి విప్లవం మొదట అపజయమే పొందింది. కాని, ఆ భావాలు యూరపునంతనూ కదిలించి వేశాయి. ఫ్రాన్సు దేశానికి స్వేచ్ఛా స్వాతంత్య్రాలు లభించకపోయినా ఐరోపా ఖండంలోని తక్కిన దేశాలలోనన్నా ఆ స్వేచ్ఛా స్వాతంత్య్రాలు కొద్దీ గొప్ప లభించేయి. మనుష్యుని జీవితానికి ఉత్సాహం కలిగించేవి కార్యాలు కావు. విప్లవాలు కార్యాలు. అవి విఫలమే అయినా ఆ కార్యాలకు ప్రోత్సాహం ఇచ్చిన, ప్రేరేపించిన మహోద్దేశాలు మానవునికి నిజంగా ఉత్తేజం ఇస్తాయి." [NOTE: 31వ ప్రకరణంలో రష్యను విప్లవం గురించి రంగనాధరావు తెలిపిన అభిప్రాయాలు 1921 నాటి ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచికలో శ్రీ భోగరాజు పట్టాభి సీతారామయ్య పంతులుగారు వ్రాసిన 'సోవియట్టులు' అనే వ్యాసం నుంచి స్వీకరించాను. -గ్రంథకర్త] ముప్ఫయి రెండు రేవులో అడుగు పెట్టేసరికి పడవల గుమాస్తా పెద్ద హడావిడి చేస్తూ ఎదురొచ్చేడు. "పంతులుగారూ! రండి, మొదటి పడవ గెంటేస్తున్నారు. మీ కోసమే మొదటి గది వుంచేశాను ఎవ్వరికీ ఇవ్వకుండా." అతడా గది సౌకర్యాలు వర్ణించే ప్రయత్నంలో వుండగా రామనాధం చిరునవ్వు నవ్వేడు. "అమలాపురం పడవకి వెడుతున్నా. ఎక్కడుంది? ఎంతసేపట్లో బయలుదేరుతుంది?" "ఆ పడవకే వెళ్ళండి. మీకు గది ఏర్పాటు చేసేస్తానుగా, హనుమయ్యగారి పడవ వుండగా అయ్యగారు మరోటి ఎక్కుతారనుకున్నారేమిటి?" ఎదుటలేని పోటీదారుల్ని కవ్విస్తూ గుమాస్తా పద్దయ్య సరంగుల్ని కేకవేసేడు. పడవగదిలో పక్క పరుచుకొని సావధానంగా కూర్చున్నాక రామనాధం అమలాపురం వెళ్లేక తాను ఏం చెయ్యాలో, అక్కడి ఘటనలు ఎలా వుండగలవో ఆలోచించుకోవడం ప్రారంభించేడు. వెనుకటి అనుభవం రీత్యా తాను కాలవగట్టున కనబడగానే ఏ బావమరదులో, ఏ మరదలో చూస్తారు. కాలువ రేవులో కాళ్ళూ ముఖం కడుక్కుని గట్టెక్కేసరికి తాను వచ్చిన వార్త ఇంట్లోకి అందిపోతుంది. గుమ్మంలోకి వెళ్ళేసరికి అత్తగారు స్వాగతం పలుకుతుంది. కాలువలో కాళ్ళు కడుక్కుని వచ్చినట్లు ఎరిగి కూడా నీళ్ళు తెప్పిస్తుంది. పోలీసు జవాను ఒకడు ఎప్పుడూ గుమ్మంలో వుంటాడు గనక తడుముకోకుండా వేళనిపట్టి సింగు కొట్టులోంచి మిఠాయిలో, కోర్టు దగ్గర అయ్యరు హోటలులోంచి ఇడ్డెన్లో తెప్పించుతుంది. మరదులూ, మరదళ్ళూ చుట్టూ చేరి కబుర్లు చెపుతూంటే ఆమె వంట పని చూచుకుంటూ మధ్యమధ్య వచ్చి ఏవో పలకరించి వెడుతూంటుంది. మామగారు ఇంట్లో వుంటే వీళ్లెవ్వరూ రారు. ఆయనే యోగక్షేమాలు, ముంగండ కబుర్లు, కాలేజీ చదువులు గురించి తెలుసుకొంటాడు. ఇన్ని విధాలుగా ఇందరు తన చుట్టూనే వుంటారు. కాని ఆ ఇంటితో తనకు బాంధవ్యం కలుపుతున్న ఆమె మాత్రం ఎన్నడూ కనిపించదు. ఆమె మాట కూడా వినబడదు. ఒక్కొక్కప్పుడు అసలు ఆ అమ్మాయి ఇంట్లో వుందా అనే అనుమానం కలుగుతూంటుంది కూడా. ఎప్పుడూ వెంట వదలని కుర్రవాళ్ళూ, పెద్దవాళ్ళూ మధ్య వాళ్ళకు తెలియకుండా, ఎప్పుడూ కనిపించని భార్యతో మాట్లాడాలి. అదెల్లాగ జరుగుతుందో అర్థం కాలేదు. అనేక కోణాలనుంచి ఆలోచించీ అది సాధ్యం కాదని తేల్చుకున్నాడు. ఇంక ఒక్కటే మార్గం. పడవ గదిలో కూర్చుని తన ఆలోచనలన్నింటినీ కాగితంమీద పెట్టి ఓ సుదీర్ఘమయిన జాబు తయారుచేసేడు. నాలుగుమార్లు చదువుకొన్నాడు. తన అభిప్రాయం స్పష్టంగా లేదనిపించినచోట ఒకటి రెండు వాక్యాలు సర్దేడు. సంతృప్తి కలిగింతర్వాత జాగ్రత్తగా మడిచి జేబులోపెట్టుకున్నాడు. ఏ క్షణంలోనో ఆమె కనిపించినప్పుడు ఆ వుత్తరం ఆమె చేతిలో పెట్టి దౌత్యం నడపాలి. దానికి తగిన సన్నాహంలోనే వచ్చేడు. కానీ, తీరా గుమ్మంలోకి వచ్చేసరికి తన సన్నాహాలన్నీ అనవసరమేననిపించేయి. వాకిట్లో ఒక్కరూ కనబడలేదు. సాధారణంగా వుండే పోలీసు జవాను కూడా లేడు. ఇంటి తలుపులు తెరచే వున్నాయి. కాని, ఎవ్వరూ తిరుగుతున్న జాడ కూడా లేదు. ఆశ్చర్యం కలిగింది, సావిట్లో బెడ్డింగు పెట్టి గుమ్మంలోకి వెళ్ళేడు. "అత్తయ్యగారూ!" పిలిచేడు. లోపలినుంచి గొంతు వినిపించింది. సుందరిదా గొంతు. "ఎవరు వారు?" ఎన్నడూ మాట్లాడి వుండని కొత్తదనంతో ఆ పలకరింపుకు సమాధానం ఇవ్వలేకపోయేడు. ఏదో గొణిగేడు. "ఎవరది, కూర్చోండి వస్తున్నా"నంటూ సుందరి వంట గదిలోంచి బయటకు వచ్చి నాలుక కొరుక్కొని వెనక్కి తగ్గింది. అతనిని చూడడంతో ఆశ్చర్యం కలిగింది. సిగ్గు ముంచెత్తుకు వచ్చింది. ఏం చెయ్యాలో తెలియలేదు. "ఎవ్వరూ కనబడరేం?" తనలో అనుకున్నట్లూ కాదు, చాటున వున్న సుందరిని అడిగినట్లు కాకుండా రామనాధం గట్టిగానే స్వగతంగా ప్రశ్నించుకొన్నాడు. ఆ ప్రశ్నతో సుందరి ఆలోచనలనుంచి తేరుకుంది. నెమ్మదిగా వెనకడుగు వేసి వంట యింట్లోకి వెళ్ళి ఓ చెంబుతో నీళ్ళు అక్కడే గడప బయట పెట్టింది. గృహిణి ప్రథమ ధర్మం పూర్తిచేసింది. కాని, రామనాధం దానిని స్వీకరించగల స్థితిలో లేడు. అది అతడు ఎదురుచూసి వుండని పరిస్థితి. అసలు కనిపించదనుకొన్న ఆమె ఎదుట వుంది. ఒకర్తే వుంది. ఆమెకివ్వడానికై తాను తయారు చేసుకున్న ఆ లేఖ అనవసరమే. గృహిణి ధర్మ నిర్వహణలో తన ఎదుటకే వస్తూంది. ముఖాముఖీ మాట్లాడవచ్చు. కాని, ఆమెఅంతగానూ అతడూ సిగ్గుపడుతున్నాడు. సుందరి స్థితి మరీ కష్టంగా వుంది. కన్నెతనంలో భర్తను పలకరించడం సిగ్గుచేటు పనిగా భావించుతారు. కాని, ఇప్పుడు తానే అతనికి సమస్త పరిచర్యలూ చేయవలసి వచ్చింది. తల్లిచాటున తప్పుకొన్నట్లు పారిపోవడానికి వీలులేదు. అల్లా పారిపోవడం ఇప్పుడు అవినయం. వంట యింటి గుమ్మంలో పెట్టిన నీళ్ళ చెంబును అతడు తీసుకొనేటందుకు రాలేదు. ఓ నిముషం చూసింది. గృహిణీ మర్యాద తప్పడానికి వీలులేదు. తానే పట్టుకు వచ్చి సావడిలో గుమ్మంలో పెట్టింది. అతడది తీసుకొని అటు వీధిలోకో, పెరట్లోకో కాళ్ళు కడుక్కునేటందుకు వెడితే, అదో సందు వెళ్ళి తుండుతెచ్చి యివ్వాలి. గదిలోకి వెళ్ళాలంటే హాలులోంచి వెళ్ళాలి. అతడక్కడ కూర్చుని వుండగా వెళ్ళడం ఎల్లాగ? గుమ్మంలోనే నిలబడింది. అంతవరకూ ఇంట్లో ఎవరో ఒకరు వుండేవుంటారనుకున్న రామనాధానికి ఇప్పుడింక ఆలస్యం చేస్తే ఎవరన్నా వచ్చేస్తారేమోనని భయం పట్టుకుంది. వారంతా ఎక్కడికెళ్ళేరో తెలియదు. కాని లేరు. ఎప్పుడొస్తారో తెలియదు. కనక వెంటనే సుందరితో మాట్లాడెయ్యాలి. ఇంత ఏకాంత అవకాశం మరి దొరకదు. "ఏమోయ్‌!" -- అని పిలిచేడు. తన బావమరిదిలాగా తను భార్యను పేరు పెట్టి పిలవాలనీ తమ వూళ్ళో వాళ్ళలాగ ఏమే, ఇదిగో, ఆ, ఇల్లా చూడు, లాంటివి ఆమె పేరుకు పర్యాయపదాలు చేయకూడదనీ అతడు పడవలో వచ్చేటప్పుడు కూడ పది మాట్లనుకున్నాడు. కాని, తీరా ఆ అవకాశం వచ్చేసరికి రక్తమాంసాలలో జీర్ణించిపోయిన ఆచారబలం, అలవాటూ నాలికను పట్టేసింది. 'ఏమే'కు బదులు 'ఏమోయ్‌' తో సంతృప్తి పడవలసి వచ్చింది. ఎవరినాయని సుందరి లోనికి తొంగిచూసింది. అక్కడ మరెవ్వరూ లేరు. ఆ పిలుపు తననేనని అర్ధం అయింది. నవ్వునాపుకొనేటందుకు వోణి చెరగు నోటికి అడ్డం పెట్టుకుంది. అతడు తన పిలుపును ధృవపరుస్తూ 'నిన్నే' అనేసరికి ఆమె గోడ పక్కకు మరింత తప్పుకుంది. రామనాధానికి సమయం మించిపోతుందనిపించింది. తానూ సిగ్గుపడి లాభం లేదు. ఈ దాగుడు మూతల మధ్య ఎవరన్నా వస్తే.....? జేబులో వుత్తరం చేతిలోకి మార్చుకున్నాడు. గుమ్మంలోకి వచ్చేడు. ఆమె మరింత తల దించేసుకుంది. ఆమెను చూస్తే నవ్వు వచ్చింది. ఆమె చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకువచ్చి మాట్లాడెయ్యాలనిపించింది. కాని, ఆమె మెరుపులా వంట యింట్లోకి పరిగెత్తింది. ఇప్పుడు తొందరపడకూడదు. జాప్యము కూడదు. అతడూ వంట యింట్లోకి వెళ్ళేడు. "సుందరీ." ఆమె మాట్లాడలేదు. ఆమె చేతినందుకొని తన జాబు చేతిలోది పెట్టేడు. "ఇది చదువు. నేనింతలోకి నీళ్ళు పోసుకు వస్తాను. చదివి నాకు సమాధానం చెప్తావు కదూ." చేతిలో కాగితం వంక చూసి, ఆమె గుప్పిడి మూసుకొంది. అతడు వెనుతిరిగి గుమ్మం వరకూ వెళ్ళి తిరిగి చూసేడు. ఆమె నెమ్మదిగా అంది.... "వేణ్ణీళ్ళు వున్నాయి." "మాటలు వచ్చునన్నమాటే....." ఆమె తల వంచుకొని నవ్వుకొంది. అతడు మరల దగ్గరకొచ్చేడు. గడ్డం క్రింద వేలు పెట్టి తలపైకెత్తేడు. కళ్ళు మూసుకొందేగాని, దరహాసం మూయడం సాధ్యం కాలేదు. రామనాధం కనురెప్పల మీద వూది నవ్వేడు. "ఏం?" "ఊఁ" అతనిని తప్పించుకొని ఆమె దొడ్లోకి వెళ్ళి స్నానాల గదిలో వేడినీళ్ళు పెట్టి, సబ్బు బిళ్ళ వుంచింది. ఈమారామె అంత సిగ్గు పడలేదు. గదిలోకి వెళ్ళి తుండు తీసుకువచ్చి గుమ్మంలో అతని కోసం నిలబడింది. అతడు వచ్చేక స్నానాల గది వరకూ ముందు నడిచింది. "మీ వాళ్ళంతా ఏరీ?" "వస్తారు"--అంది. ఆ మాట వినడంతోనే అతను కంగారు పడ్డాడు. స్నానాలగది తలుపు జేరవేస్తూ హెచ్చరించేడు. "త్వరగా చదివి, సమాధానం చెప్పు." ఆమె నవ్వుకుంటూ వంట ఇంట్లోకి వెళ్ళింది. అతడు స్నానంచేసి బట్టలు మార్చుకొనేసరికి ఆమె ఎప్పుడు తయారు చేసిందో ఫలహారపు పళ్ళెం తీసుకొని హాలులోకి వచ్చింది. ఒక్క క్షణం నిలబడి గదిలోకి వెళ్ళింది. ఆమె రాకను అతను గమనించలేదు. బెడ్డింగులోంచి తాను తెచ్చిన చీరలూ, జాకెట్టు గుడ్డలూ బయటకు తీస్తున్నాడు. అతని దృష్టిని ఆకర్షించడానికి ఆమె గదిలో కుర్చీని లాగింది. ఆ సంకేతం అర్థం అయింది. అతడు "వస్తున్నానోయ్‌." అంటూ లేచేడు. రామనాధం తనతో తెచ్చిన చీరను పట్టుకొని లోపలికి వచ్చేడు. "ఇది నీకు నచ్చుతుందా?" ఆమె ఒక్కమారు దానివేపు తల తిప్పి చూసింది. సుందరమైన అంచూ, బుటేదారీపని చేసివున్న సాధారణమైన ఖద్దరు చీర. బాగానే వున్నదనిపించింది. అది తనకోసమే, తన భర్త తీసుకొని వచ్చేడన్న విషయం గుర్తు వచ్చి సిగ్గుపడింది. ఆమె కళ్ళలోనే సంతోషాన్ని చదివి రామనాధం సంతృప్తి పడ్డాడు. "నీకు నచ్చుతుందనే తెచ్చేను." "కూర్చోండి. మంచినీళ్ళు తెస్తాను." అంది రహస్యం చెప్పినట్లు. రెండో మాటకు అవకాశం ఇవ్వకుండా ఆమె వెళ్ళిపోయింది. మరు నిముషంలో మంచినీళ్ళ చెంబుతో హాజరయింది. "మీ నాన్నగారు వూళ్ళోలేరూ?" ఆమె తల అడ్డంగా తిప్పింది. "క్యాంపుకు వెళ్ళేరా?" ప్రశ్న వేశాక తన పొరపాటు అర్థం అయింది. ఆ ప్రశ్నలోనే సమాధానం కూడా వుంది. నోరు విప్పకుండా తల తిప్పితే సమాధానమే. ఆమె మరల తల తిప్పింది. "మీ అమ్మగారు...." ఆమె తలవంచుకు సమాధానం ఇవ్వలేదు. "తమ్ముళ్ళూ, చెల్లెళ్ళూ..." లేరన్నట్లు ఆమె తల మళ్ళీ తిప్పింది. "ఎక్కడికెళ్ళేరు?" "ముంగండ...." అతనికి ఆశ్చర్యమయింది. "ఎందుకు?" ఆమె సిగ్గుపడింది. తమ్ము కలిపేటందుకు ఏర్పాట్లు చూసుకొనడానికే ఆమె వెళ్ళింది. వారందరూ అక్కడుండడం చూసే భర్త వచ్చి వుంటాడని ఆమె యింతవరకూ అనుకుంటూంది. అతడు కాకినాడ వెళ్ళినట్లు ఎరగదు. అతని వుత్తరంలో ఆ మాటా లేదు. ఆమె వెనక్కి తిరిగి పోబోతూంటే రామనాధం చటుక్కున వోణి పట్టుకున్నాడు. ఆమె నిలబడింది. భుజాలు పట్టుకొని తనకేసి తిప్పుకున్నాడు. "చదివేవా?" ఆమె చిరునవ్వు నవ్వుకుంది. మామగారు వచ్చి తన తల్లితోనూ, తండ్రితోనూ మాట్లాడినవన్నీ ఆమె ఎరుగును. అతనిని మార్గంలో పెట్టే ప్రయత్నంలో తన పాత్ర ఏమిటో కూడా ఆమె వింది. అతని రాక, ఆ చీర తీసుకువచ్చి చూపడం ఆమెకు సంతృప్తిగానే వుంది. ఆ ఆలోచనలతో ఆ వుత్తరంలోని విషయాలకు పెద్ద ప్రాముఖ్యం ఇవ్వలేదు. అందులో ఏ ఒక్కటీ తాను ఒప్పుకోలేదు. కాని, ఆ విషయాన్ని ఇప్పుడు చెప్పవలసిన పనేముంది? సరేనంటే వదలిపోతుంది... కాని కొంటెతనానికి తల తిప్పింది. "ఎందుచేత?" అన్నాడు రామనాధం. ప్రశ్నించేక గుర్తు వచ్చింది. పెళ్ళికాక పూర్వం నాలుగోక్లాసు చదువుతూంది అన్నారు. పెళ్ళి అయాక మానిపించేశారు. ఇప్పుడా అక్షరాలన్నా గుర్తున్నాయో లేదో? తానా విషయమే వూహించలేదు. నిరుత్సాహం ప్రతిధ్వనిస్తూన్న కంఠంతో "చదవలేవా" అని ప్రశ్నించేడు. తాను చదవలేననుకోవడమూ బాగానే వుందనిపించింది. సమాధానం చెప్పడం ఎల్లాగా అనుకొంటూ వుంటే దారి దొరికింది. తలతిప్పి వోరగా అతని వంక చూసింది. కంఠధ్వనితో ముఖాన్ని పోల్చుకోవాలని ప్రయత్నం. అక్కడ విసుగు కనబడలేదు. "నిజంగా...." అని రెట్టించేడు. ఆమె కళ్ళు నవ్వుతున్నాయి. అంగీకారం తెలుపుతూ తల తిప్పింది. అతనికి ఏం చెయ్యడానికీ తోచలేదు. ఆమెను చూసిన ఈ అరగంట నుంచీ ఆమెను ముట్టుకోవాలనీ, కూర్చోబెట్టి కబుర్లు చెప్పాలనీ కోరిక మనస్సునావరించి వున్నా తన నియమం, నిష్ఠ గురించి మరిచిపోలేదు. ఆమె చదవలేకపోతే తానే చెప్పాలి. చెప్పడం కోసమేనా ఆమెను దగ్గర కూర్చోబెట్టుకోవాలి. సిగ్గుపడి పారిపోకుండా పట్టుకొని కూర్చోపెట్టాలి. రామనాధం లేచి ఆమె భుజాలు పట్టుకొని తీసుకువెళ్ళి కుర్చీలో కూర్చోబెట్టేడు. ఆమె లేచిపోతూంటే ఎదురుగా నిలబడి, కుర్చీ చేతులమీద ఆనుకొని, ముఖం మీదికి వొంగేడు. ఇప్పుడు ఆమె లేస్తే తన తల అతని ముఖానికి కొట్టుకొంటుంది. సుందరి సిగ్గు తోసుకు వస్తున్నా మాట్లాడక తప్పలేదు. "ఎవరేనా వస్తారు." "ముందు టిఫిన్‌ తీసుకోండి." "పొయ్యిమీద పాలు పెట్టేను. పొంగిపోతాయి."--అనేక సాకులు, భయాలు. రామనాధం ఏమీ వొప్పుకోలేదు. నవ్వొక్కటే అతనికి సమాధానం. అతని ప్రశ్న ఒక్కటే. "నిజం చెప్పు." ఆమె నిజం చెప్పినా చెప్పకపోయినా ప్రమాదం లేదు. అవసరమూ లేదు. తాను చెప్పవలసినదానికి ఆ ప్రశ్నతో పని లేదు. కాని, ఆమె నవ్వు-చిరునవ్వు అతనిలో చెలగాటాన్నే ప్రోత్సహించింది. "నిజమేనా?" "నిజమే....." అతడది నమ్మదలచలేదు. "కాదు." ఆమె ధృవీకరించింది. "ఔను." "అబద్ధం...." అతడు తన అవిశ్వాసాన్ని తెలిపేడు. "కాదు....." ఆమె ఆ అభిప్రాయాన్ని ప్రత్యాఖ్యానం చేసింది. "కాదు." "ఔను." ముప్ఫయిమూడు అప్పుడే ఎక్కడినుంచో వచ్చి సావట్లో అడుగుపెట్టిన నారాయణమూర్తికి గదిలోంచి వినిపించిన మాటల పేచీ అర్ధం అయ్యే అవకాశం లేదు. ఒక గొంతు కూతురుదని తెలిసింది. రెండోది ఎవరిదో అర్ధం కాలేదు. గుమ్మంలోకి వచ్చేసరికి కనిపించిన దృశ్యం అతనికి మహావేశం కలిగించింది. కూతురు కుర్చీలో కూర్చుంది. ఆమె కదలకుండా మీదకు వొంగి ఎవరో పడుచువాడు నిల్చుని వున్నాడు. ఆ పడుచువాడు తన అల్లుడే అయి వుంటాడనే ఆలోచన రాలేదు. ఆ పంచకట్టూ, లాల్చీలో వున్న రామనాధాన్ని అసలు గుర్తుపట్టనేలేక పోయేడు. ఇంక వూహించగలిగిందీ, వూహించిందీ ఒక్కటే. ఇంట్లో ఎవరూ లేకుండా చూసి సుందరిని ఎవరో తుంటరి అల్లరి పెడుతూ వుండాలి. రామనాధం వెనుతిరిగి వుండడంచేత మామగారిని చూడలేదు. మాటల ఆటలో సావట్లో బూట్ల చప్పుడును వారిద్దరూ వినలేదు. గుమ్మంలోంచి "ఎవడ్రా అది" అని తండ్రి గర్జన వినిపించేసరికి సుందరి వులికిపడింది. సన్నగా "నాన్నా" అని లేవబోయింది. రామనాధం లేవబోతూన్న భార్య భుజంమీద చెయ్యివేసేడు. ఆమెతో పాటు ద్వారంకేసి తల తిప్పేడు. విషయం గ్రహించే లోపున నారాయణమూర్తి చేతిలోని హంటరు అల్లుని వీపుమీద పడిపోయింది. వెనువెంటనే మరొకటి. సుందరి ఆ ప్రళయానికి దిగ్భ్రమచెంది తేరుకొనేలోపున మూడో దెబ్బ తలపై పడింది. "అదేమిటి నాన్నా!" అనేమాట నోట రాకపూర్వమే రామనాధం మెడ బట్టుకొని సావట్లోకి విసిరివేసేడు. ఆ దెబ్బలకు ఉపక్రమణికగా చేసిన గర్జన విని హాలులోకి పరుగెత్తి వచ్చిన సబినస్పెక్టరూ, పోలీసులూ ఆయన చేతుల్లోంచి రామనాధాన్ని అందుకున్నారు. వీపునా, తలమీదా తగిలిన దెబ్బలకు దిమ్మ తిరిగిపోయిన రామనాధం సావిట్లోకూడ మరో నాలుగు పోట్లు తగలడంతో ఊపిరి పట్టేసినట్లయి కూలబడిపోయేడు. అతనిని రెక్కలు పట్టుకొని ఇద్దరు పోలీసులు అరుగుమీదికి ఈడ్చివేశారు. మగనికి తగులుతున్న దెబ్బలు చూసి సుందరి నివ్వెరపోయింది. "నాన్నా! నాన్నా!" అంటూ హాలులోకి పరుగెత్తబోయింది. తాను పట్టుకొన్నవాడో దొంగ అనీ, ఒంటరిగా వున్న కూతురు పీక నొక్కి నగలు హరించే ప్రయత్నంలో వున్నాడనీ కల్పన చేసుకొంటున్న నారాయణమూర్తికి కూతురు ఆదుర్దా అర్థం కాలేదు. ఆమె సావట్లోకి పరుగెత్తబోవడమూ, ఆమె ఆందోళనా అతనిలో విపరీతమయిన అనుమానాలకు కారణం అయింది. మర్యాద కాపాడుకొనేటందుకు ఆతురత చూపేడు. ఆమె చేయిపట్టుకొని నిలిపేడు. ఆ పట్టుకు చెయ్యి విరిగిపోతుందనిపించి సుందరి కెవ్వుమంది. ఒక్క లాగుతో ఆమెను గదిలో మూలకు తోసేసేడు. "ఇవతలకి వచ్చేవంటే జాగ్రత్త." తండ్రియెడ గల భయంతో ఆమె ఆ ఆదేశాన్ని ధిక్కరించలేకపోయింది. అప్పటికప్పుడే సర్కిల్‌ ఇన్‌స్పెక్టరుగారి ఇంటిముందు ఆ హడావిడికి జనం చేరుతున్నారు. కూతురు ప్రవర్తనమీద అనుమానం అంకురించిన మనస్సుతో నారాయణమూర్తి జనుల అధిక్షేపానికి హడలిపోయేడు. తాను వీధిలోకి రాకుండానే పోలీసులకు ఆదేశించాడు. "వాడిని లాకప్‌ చేయండి." సబినస్పెక్టరు ఏదో చెప్పబోయేడు. గాని నారాయణమూర్తి వినిపించుకోలేదు. "నే వస్తున్నా. నడవండి." పోలీసులు రామనాధాన్ని తీసుకొని వెళ్ళిపోయేరు. జనం చెదిరిపోయేరు. వాళ్ళకీ అదేమిటో అర్ధం కాలేదు. ఎవరో దొంగ సర్కిల్‌ ఇన్‌స్పెక్టరుగారింట ప్రవేశించి పట్టుబడిపోయేడని సమాధానం చెప్పుకొన్నారు. ఏడుస్తున్న కూతురు నోట అసలు మనిషి ఎవరో గ్రహించేక నారాయణమూర్తి నిశ్చేష్టుడయిపోయేడు. ముప్ఫయి నాలుగు తమ అధికారి పట్టుకొన్నది తమ అల్లుణ్ణేయని సబినస్పెక్టరూ, జవానులు కూడ అతనిని అరుగుమీదకు తీసుకువెళ్ళినప్పుడే గ్రహించేశారు. కూతురును భర్త వద్దకు పంపడానికి సన్నాహాలు జరుగుతున్నాయని వారెరుగుదురు. ఆ అల్లుడు సత్యాగ్రహంలో చేరేడనే వార్త కూడా వారి వరకూ వచ్చింది. ఆ కారణం చేతనే ఆ శుభకార్యం తన యింట్లో చేయబోవడంలేదని కూడా చెప్పుకున్నారు. కాని, ఆ అల్లుడు ఇంటికి వస్తే కొడతారా? వారికి అందులో రహస్యం అర్థం కాలేదు. కాని రామనాధం బట్టలవేపు చూసేక వారు కారణం అర్ధం అయింది అనుకున్నారు. అతడు శుద్ధ కోరా ఖద్దరు కట్టుకున్నాడు. దేశంలో స్వాతంత్య్రం కోసం పెనుగులాట తీవ్రం అవుతూంది. సహాయ నిరాకరణ ఆలోచన జనాన్ని క్రమంగా ఆకర్షిస్తూంది. ఆ విధమైన చర్యను రాజద్రోహంగా జమకట్టి కఠినంగా అణచివేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేసుకొంటూంది. ఆ సన్నాహంలో భాగంగానే జిల్లా కలెక్టరు పోలీస్‌ ఆఫీసర్లను సమావేశపరిచాడు. ఆ సమావేశం నుంచే నారాయణమూర్తి ఇంటికి వస్తున్నాడు. ఇంటికి వచ్చేసరికి తన యింటివద్దనే రాజద్రోహి ప్రత్యక్షమయ్యాడు. అతడు అల్లుడే అయితేనేం. పట్టుకొని తన కర్తవ్యం నిర్వహించేడని వాళ్ళు భ్రమపడ్డారు. ఆ కర్తవ్య నిర్వహణలో అల్లుణ్ణి కొట్టడం, అందులోనూ రక్తాలు కారేలాగ కొట్టడం అవసరమా అనే ప్రశ్న కలగకపోలేదు. కాని తామందరూ కూడ తలో రెండు దెబ్బలు వేసేరు. రక్తం కళ్ళ చూసింది ఎవరో అందులో. అందుచేత ఆ ప్రశ్న పైకి రాకుండా పక్కకు పెట్టేశారు. రాజద్రోహి అల్లుడేమిటి, కొడుకేమిటి? చీరి పారెయ్యవలసిందేనని మనస్సునూ సరిపుచ్చుకొన్నారు. తమ పై అధికారి నిజాయితీని మెచ్చుకున్నారు. స్టేషనుకి తీసుకెడుతూంటే రోడ్డు మీద ఒకరిద్దరు రామనాధాన్ని గుర్తించేరు. ఆ దెబ్బలేమిటో, పోలీసులు పట్టుకోవడమేమిటో వాళ్ళకేమీ తెలియలేదు. కొంతసేపు గుసగుసలు సాగించేరు. పోలీసువారి వద్దకు వెళ్ళి ఏమిటిది అని అడగడానికి భయం. చివరకు ఎరిగిన ఆమె ఒకరు అడిగేసింది. "ఆయన దొరగారి అల్లుడు కాదూ?" పోలీసువాడు అంగీకరించేడు. "బాబుగారు లేరా? ఏం చేశాడేంటి?" పోలీసు ఒక్క నిముషము ఆలోచించేడు. చివరకు అడిగిన మనిషిని పురుగును చూచినట్లు దులపరించుకొన్నాడు. "ఆ బట్టలు చూడ్డం లేదూ?" "ఏం?" "ఖద్దరు బట్టలు....." "ఔను కాబోలు" "అంటే గాంధీగారి మనిషి." ఆ ఆడమనిషి వరకూ గాంధీగారి పేరు రాలేదు. కనక దానిలో వున్న ప్రమాదం ఏమిటో అర్ధం కాలేదు. "గాంధీగారు సర్కారు పోవాలంటారు." అని వివరించాడు పోలీసు. ఆ ఆడమనిషికి ఆ గొడవలేమీ తెలియకపోయినా ఊ కొట్టడం క్షేమంగా భావించింది. "ఆయన సత్యాగ్రహం చేశాడంట. దొరతనం పోవాలన్నాడంట...." ఆ అంటలతో పోలీసువాడు పెద్ద కథ అల్లేశాడు. రామనాధం మామగారిని వుద్యోగం మానెయ్యమన్నాడు. ఆయనను సత్యాగ్రహం చేయమన్నాడు. ఆయన నా కూతురును తీసుకువెళ్ళిపో. నా జోలికి రావద్దని చెప్పాడు. ముహూర్తము పెట్టించేడు. కాని రామనాధం వూరుకోలేదు. ఇంటికే వచ్చాడు. వెంటబడ్డాడు. ఇంక ఏం చెయ్యాలి? "అయ్యగారు నిప్పంటిమనిషి, నిజాయితీ గలవాడు. అల్లుడైనా సరే, ఆడి అమ్మ మొగుడయినా సరే....." అని పోలీసువాడు ముక్కేడు. నారాయణమూర్తి నిక్కచ్చితనం, నిజాయితీ ఆ ప్రాంతాలలో అందరూ ఎరుగుదురు. ఆ మధ్యనే పేటలోకల్లా ధనబలం, కులబలం గల కుటుంబం తాలూకు యువకుడొకడు తప్పతాగి ఆ వీధి గృహస్థు ఇంటిమీద పడి ఆగం చేస్తూంటే నారాయణమూర్తి అరెస్టు చేయించేడు. ఆ కుర్రవాని తండ్రీ, బంధువులూ, అతనిని బయటకు తెచ్చుకొనేటందుకు సర్వవిధాలా ప్రయత్నించేరు. డబ్బు ఆశను నారాయణమూర్తి లెక్క చేయలేదు. చంపేస్తారేమోనన్న భయాన్ని ఖాతరు చెయ్యలేదు. అదివరకే ఆ కుర్రవాడిని గురించి తండ్రికి హెచ్చరికకూడా ఇచ్చి వుండడంచేత మరి ఆలోచనకూడా లేకుండా కీళ్ళు తిప్పించేసేడు. మళ్ళీ ఎక్కడన్నా ఫిర్యాదు వచ్చిందంటే కాల్చిపారేస్తానని వాగ్ధానం చేశాడు. కోర్టుకీ, న్యాయస్థానానికీ దూరంగా చాటుగా జరిగిన ఈ కార్యక్రమానికి సాక్ష్యం, సంవన్నం లేదు. ఇంక బంధువులంతా పోగడి వానికి జైలు శిక్ష తప్పించేసరికి తల ప్రాణం తోకకి వచ్చింది. అది జరిగాక ఆ కుటుంబం తల ఎత్తుకోలేక ఓ ఏడాదిపాటు తీర్ధయాత్రలు చేసి వచ్చేరు. ఆ వీధి వాళ్ళంతా నారాయణమూర్తికి చెయ్యెత్తి మొక్కేరు. అటువంటి కథలతో ఒక వాతావరణం సృష్టించుకొన్న నారాయణమూర్తి సత్యాగ్రహం చేసినందుకు అల్లుణ్ణయినా అరెస్టు చేశాడంటే నమ్మడం అసాధ్యం కాదు. నారాయణమూర్తి ఆఫీసుకి వచ్చేసరికి కథ చిలవలూ, పలవలూ చేర్చుకొని మంచి రసవత్తరంగా తయారయింది. దానిని కాదనడానికి కూడా వీలులేనన్ని అలంకారాలు చేర్చుకొంది. తాలూకా ఆఫీసుకి రాగానే ఎస్‌.డి.ఓ. స్వయంగా వచ్చి అతని రాజభక్తినీ, నిజాయితీని అభినందిస్తూంటే తన సామర్ధ్యానికి తానే ఆశ్చర్యపడవలసి వచ్చింది. నిజంచేత అందరిచేతా తిట్లు తినవలసి వస్తుందనీ, అపహాస్యం పాలయిపోతానేమోయనీ భయం మనస్సులో పీకుతూంటే ఏమి చెయ్యాలో తోచక ఆపీసుకి వచ్చాడు నారాయణమూర్తి. తనచేత దెబ్బలు తిన్నది దొంగ కాదనీ, అల్లుడేననీ తెలిశాక నారాయణమూర్తి నిస్తబ్ధుడయ్యాడు. కూతురు, అల్లుడూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూంటే తాను గుర్తించలేకపోయాడు. అల్లుణ్ణి దొంగ అనుకొన్నాడు. పెద్ద ప్రజ్ఞగా కొట్టేడు. చేతులలో వున్న పని కనక జైలులో పడేశాడు. ఈమాట ప్రజలలో పడితే తన ఆబోరు దక్కదు. తనను ప్రతివాళ్ళూ రేపటినుంచి వేళాకోళం చేసేస్తారు. తొందరపడ్డానే అన్న బాధ కన్న తన బ్రతుకు ప్రజలలో నవ్వుల పాలవుతుందేమోనన్న భయంతో నారాయణమూర్తి వొణికిపోయేడు. నవ్వులపాలయింతర్వాత తానా ఉద్యోగాన్ని కాపాడుకోలేడు. కథ అందరికీ తెలుస్తుంది. పై ఆఫీసర్లదాకా వెడుతుంది. వాళ్ళు నవ్వుతారు. నవ్వుతూనే తన భవిష్యత్తును త్రుంచేస్తారు. వైకుంఠపాళి ఆటలో పాము నోటపడ్డ కాయలాగ ఈ వున్న ఉద్యోగం కూడా పోతుంది. ఇన్ని ఆలోచనలలో కూతురు ఏడ్పు వొకటి. ఇప్పుడు అల్లుణ్ణి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఈ చిక్కు నుంచి ఎలా బయటపడాలో తోచక కొట్టుమిట్టాడుతూంటే ఎస్‌.డి.ఓ. అభినందనా, పొగడ్తా దారి చూపుతున్నట్లు కనబడింది. దెబ్బలు తిన్న అల్లుడి మీదకన్న, కొట్టిన తనమీద సానుభూతి వుండే అవకాశం కనిపించేక ఆయన వీపు నిలబడింది. తనకు వినిపించేలా సబినస్పెక్టరు, పోలీసువాళ్ళు, తాలూకా ఆఫీసులోని చిన్న పెద్ద వుద్యోగులు అదేమాట చెప్పుకుంటున్నారు. అవి వింటూంటే అపహాస్య భయం తీరింది. గౌరవ ప్రపత్తులు, కీర్తి, బహుశా ప్రమోషను కూడా తనకోసం చేతులు చాచుకుని కూర్చున్నట్లుగానే కనిపించేయి. అయాచితంగా లభించిన కీర్తిని కాదనవలసిన పని కనబడదు. పైగా, వెనకడుగు వేయడానికి ఏమాత్రం వీలుగా లేదనిపించింది. అల్లుడని తానేమాత్రం వెనుకతీసినా పై ఆఫీసర్లకి రిపోర్టులు వెళ్ళిపోతాయి. అందరి కళ్ళు తనమీద ఉన్నాయి. తాను వింటూండగా, తాను కాదనలేని కథ ప్రచారమయిపోయింది. దానినిప్పుడు కాదనలేడు, కాదనవలసిన అవసరమూ కనబడలేదు. * * * * * పోలీసు ఆఫీసర్లలో రాజద్రోహం ప్రచారం చేసేడన్న నేరంతో రామనాధం సబ్‌జైలుకీ, మాజిస్ట్రేటు కోర్టుకీ మధ్య సంచారం ప్రారంభించేడు. ముప్ఫయ్యయిదు కాకినాడ వెళ్ళేడని విన్న అల్లుడు సబ్‌జైలుకు ఎలా చేరుకున్నాడో అన్నపూర్ణమ్మకు ఎంత ఆలోచించినా అర్ధం కాలేదు. పోలీసు రామస్వామి అంతకన్న ఒక్కమాట చెప్పలేనన్నాడు. అసలా మాటకూడా చెప్పదలచుకోలేదు. పొరపాటున చెప్పేడు. ఆ మాట ఇంకెవ్వరి చెవినీ పడరాదని తన అధికారి ఆజ్ఞను జ్ఞాపకం చేసుకొన్నాడు. ఆమెకు మళ్ళీ మళ్ళీ చెప్పేడు. "గుర్రబ్బండీ రాను పోను కుదిర్చి అయ్యే పంపించేరు. మిమ్మల్ని నిల్చున్న పాటున తీసుకురమ్మన్నారు." --అన్నదొక్కటే అతడు చెప్పదలచుకొన్నదీ, చెప్పిందీ, కాని, ఇంట్లో దిగవిడిచి వచ్చిన పెద్ద కూతురు ఈ రెండు రోజులనుంచీ ఇంట్లో ఎలా వుండగలుగుతూందో తెలుసుకొనేటందుకు తాను ప్రశ్నలు వేస్తూంటే అతడు నోరుజారి అనేశాడు. "మగణ్ణి జైల్లో పెట్టేక ఒకటే ఏడుస్తున్నారు." ఆమె విస్తుపోయింది. "జైలేమిటి?" తన పొరపాటును గ్రహించి రామస్వామి ఇంక ఏమి చెప్పడానికీ నిరాకరించేడు. "నాకేం తెల్దు" అన్నాడు. తన భర్త వూరునుంచి వచ్చి కబురు చేశారని మాత్రమే చెప్పి అన్నపూర్ణమ్మ పిల్లలతో బండి ఎక్కింది. అమలాపురం వచ్చి చూసేసరికి ఇల్లంతా అస్తవ్యస్తంగా వుంది. తనను చూడగానే చుట్టుకొని ఏడుస్తున్న కూతురును ఊరడించి ధైర్యం చెప్పింది. తాను వచ్చిన వార్త విని పలకరించ వచ్చిన ఇరుగు పొరుగు అమ్మలక్కలు కూడా ఆమెకు ఏమీ చెప్పలేకపోయేరు. సూర్యోదయం వేళ అల్లుడుగారు వచ్చేరు. ఒక గంటపోయేక అయ్యగారు వచ్చేరు. వచ్చేక కొద్దిసేపటికి సబినస్పెక్టరు అల్లుడిగారిని తీసుకువెళ్ళిపోయారు. భయంచేతనో, ఆమె మనస్సు బాధించడం ఇష్టంలేకనో వారెవ్వరూ అల్లుడికి తగిలిన దెబ్బల విషయం చెప్పలేదు. ఒక్క అరగంట అటుతిప్పి, ఇటుతిప్పి ప్రశ్నించినా తన అల్లుడి అపరాధం ఏమిటో వాళ్ళెరగరు. చెప్పలేదు. గొల్ల పుల్లమ్మ చెప్పినమాటను పట్టి అల్లుడుగారు మామగారిని ఉద్యోగం మానేసి గాంధీగారి వుద్యమంలో చేరమన్నాడనీ, అందుకే అరెస్టు చేశారనీ వారు అంటున్నారు. వాళ్ళని పంపేసి కూతురుని ప్రశ్నించింది. కాని, ఆమె చెప్పిన దాని వలన ఏమీ అర్ధంకాలేదు. మగడితో అల్లుడు ఒక్కమాట ఆడలేదు. ఆయన వస్తూనే కొట్టేశాడు... 'ఎందుకు?' "ఏమో....." కూతురుకూడా ఏదో దాస్తుందని ఆమె అభిప్రాయపడింది. ఆ అభిప్రాయం కలిగేక అన్నపూర్ణమ్మకు మరో కుంటి సమాధానం కనబడింది. కూతురూ, అల్లుడూ గదిలో వుండగా చూసేడేమో. ఆచారం పట్టుదలా, తన ఆశలు వ్యర్థం చేశాడన్న అహంకారమూ కలిసిన కోపంతో కొట్టి.... అయితే మాత్రం కొట్టడం ఏమిటి? సాంప్రదాయక పద్ధతిలో ఏకం చెయ్యబడకపోయినా వాళ్ళు భార్యా భర్తలు, చిన్నతనంకొద్దీ తొందరపడితే నవ్వుకుని వూరుకోవాలిగాని..... కొట్టడం... పైగా జైలు... కూతురు అదేమీ లేదంది. అన్నపూర్ణమ్మ విసుక్కుంది. "కర్రదెబ్బలేనా, కడుపుకేమన్నా పెట్టేవా?" కొట్టినది తానే అన్నట్లు మాట్లాడుతున్న తల్లిని కౌగిలించుకొని సుందరి బావురుమంది. అల్లుడు సహాయ నిరాకరణం చేశాడని మగడికి మహాకోపంగా వుందని తెలుసు. అతడు తన యింటికి రావడం ఇష్టం లేకనే శుభకార్యం ముంగండలో ఏర్పాటు చెయ్యమన్నాడు. ఆ అల్లుడు ఇంటికి రావడం చూసి కోపంకొద్దీ.... ఎంత కోపం వున్నా మగడు అంత కసి చూపగలుగుతాడని అనుకోలేక పోయింది. మరి.... ఆలోచన నిలిపింది. తాను వచ్చినట్లు తెలియడానికి చిన్నపిల్లల్ని తాలూకా కచేరివేపు పంపింది. "నాన్నగారిని తొందరపెట్టకండి. కనిపించి లేచిరండి." అని వారికి బుద్ధిచెప్పింది. ఇంక ఇల్లు సర్దడం ప్రారంభించింది. గదిలో బల్లమీద వున్న పలహారపు పళ్ళెమూ, మంచినీళ్ళ చెంబూ, పొయ్యిమీద అడుగంటి, కాటుపోయి, క్రమంగా ఇగిరి మాడిపోయిన పాలగిన్నె కూతురు చెప్పిన మాటలకు సాక్షీభూతాలుగా కనిపించేయి. పొయ్యివద్ద కనిపించిన నాలుగు పేజీల వుత్తరం చూసేక అసలు విషయం అర్ధమయిందనుకొంది. అందులోని విషయాలమీద మామగారూ, అల్లుడూ కుస్తీ పట్టివుంటారనుకుంది. మరల కూతురు ఆ ఆలోచననే నిరాకరించింది. "వస్తూనే మీదపడిపోయేరు. అసలు మాటా మంతీ ఏదీ?" ఈ మారు అన్నపూర్ణమ్మ మరో సమాధానం సూచించింది. "నీ భర్త కాకినాడనుంచి వస్తున్నాడని తెలుసా?" ఆమె ఎరుగదు. బహుశా ఈ మాటలు అల్లుడూ మామల మధ్య అక్కడే వచ్చి వుంటాయి. మామగారు ఒప్పుకొని వుండరు. అక్కడే మాటా మాటా పెరిగి వుంటుంది. అని సమాధానం చెప్పుకుంది. ఆమె సరాసరి నారాయణమూర్తినే ప్రశ్నించింది. "ఏమిటీ అప్రతిష్ఠ...." అల్లుడు రాజద్రోహం బోధించినట్లు. తాను వుద్యోగ ధర్మం పాటించి కర్తవ్యం నిర్వహించినట్లూ వీధిలో చెప్పుకొన్న విధంగా ఇంట్లో చెప్పుకునేటందుకు నారాయణమూర్తికి ధైర్యం చాలలేదు. అదంతా అబద్ధం అనడానికి కూతురు సాక్ష్యం. ఆమె తల్లితో చెప్పే వుంటుంది. కనక అతడు క్షేమకరమయిన మార్గాన్నే అనుసరించేడు. ఏ మాటా చెప్పడానికి నిరాకరించాడు. అతడు ఖండితంగా చెప్పిందల్లా ఒక్కటేమాట. "అతడు నా అల్లుడు కాడు. అతని పేరు ఇంటిలో రావడానికి వీల్లేదు..." "మీరు కాదంటే పోతుందా? ఇంటిలో కూతురు ముఖం చూసి...." మాట మధ్యలోనే నారాయణమూర్తి గఁయ్‌మన్నాడు. అన్నపూర్ణమ్మ సర్దుకుని అప్పటికి వూరుకుంది. * * * * * అన్నపూర్ణమ్మ వెంటనే వియ్యంకుడికి కబురు పెట్టింది. ఆయన ఆదరా బాదరా చీకటిపడే వేళకి పరుగెత్తి వచ్చేడు. ఆ వేళకి నారాయణమూర్తి ఇంటిలో వున్నాడు. ఆయన వియ్యంకుడు ఇంటిలోకి రావడానిక్కూడా వీలులేదనే ఆంక్షను జారీ చేశాడు. సబ్‌ జైలులోకి కొడుకును చూడబోతే వేళ కాదని అక్కడ నిరాకరించేరు. శంకరశాస్త్రి అక్కడినుంచి తిన్నగా ఎరిగి వున్న ఒక వకీలు ఇంటికి పరుగెత్తేడు. ముప్ఫయ్యారు జైలు గదులలో పడేశాక అన్నం పెట్టడం అవసరం వుంటుందనే ఆలోచన కనీసం ఒక రోజయినా గడిచేక గాని పోలీసులకు కలగడం అసాధారణ విషయం. రామనాధం విషయంలో కూడా అంతే జరిగింది. ఎవ్వరూ జేబులోంచి ఖర్చుచేసి హోటలు నుంచి తెప్పించేటంత శ్రద్ధ చూపలేదు. మేజిస్ట్రేటుకు హవాలా చేసే సరికి ఆ రోజుకు రేషన్లు తీసుకొనేటందుకు వ్యవధి దాటిపోయింది. అందుచేత రాత్రికూడా భోజనం దక్కేలాగ లేదు. ఆకలివేస్తూంది. కాని, ఏం చెయ్యాలో అర్థం కాలేదు. పక్క గదిలోంచి ఖైదీ నెమ్మదిగా కాపలా పోలీసును పిలిచేడు. "జవానుగారూ! ఓ అణా మిఠాయి కొమ్ములయినా తెప్పించండి. కుర్రవాడు ప్రాణం కడబట్టేను." పోలీసువాని ఖర్చుకి కూడా ఓ అణాయిస్తేగాని ఆ మాత్రం సరుకు జైలులోకి రావడం సాధ్యం కాదు. "పంతులుగారూ! డబ్బు ఏమీ జాగ్రత్త చేయలేదూ?" అని పోలీసు జవాను యోగక్షేమాలు వాకబు చేసేడు. తన పర్సూ, డబ్బూ బెడ్డింగులోనే వుండిపోయిన మాట రామనాధానికి జ్ఞాపకం వచ్చింది. కాని ఆ మాట చెప్పడం ఇష్టం లేకపోయింది. "ముంగండకి కబురు చేస్తే మా వాళ్ళు వస్తారు." "వస్తే వచ్చేరులెండి. ఇప్పుడు మాటేమిటి?" అని తోడి ఖైదీ కర్తవ్యం ప్రశ్నించేడు. ఆ సమయంలో కోర్టు వద్దనున్న హోటలు అయ్యరు కొడుకు అన్నపు కారియరుతో వచ్చేడు. ఖైదీలకు అన్నం తెస్తూండడం ఆ కుర్రవాడికి అలవాటే. ఆ పురమాయింపు ఎవరిదో ఆ కుర్రవాడు చెప్పలేకపోయేడు. కాని నాలుగు వందల రెండు పోలీసు జవాను వచ్చిన సంగతి గుర్తుంది. అతడెవరో పోలీసు బంట్రోతు చెప్పగలిగేడు. "ఈ వేళ సర్కిల్‌ అయ్యగారింటి వద్ద డ్యూటీ అతనిదే." సర్కిల్‌ ఇన్‌స్పెక్టరో, ఆయన ఇంట్లోవాళ్ళో చేసిన ఏర్పాటిది. ఆ భోజనం చేయడమా, మానడమా అని రామనాధానికి పెద్ద సమస్య అయి పట్టుకుంది. పక్క గదిలో ఖైదీ ఫక్కున నవ్వేడు. తాను తటపటాయించడానికి కారణం ఏమిటో అతడు గ్రహించేడు. "పొరుగువాడింట ఓ విస్తరెళ్ళినా వెళ్ళడమే." ఆ తర్కానికి రామనాధం మనస్సు ఒప్పుకోలేదు. పొద్దుటి నుండి మాడి వున్న పొట్టమీద ఆ ఇంటి వాళ్ళని శత్రువులుగా తప్ప బంధువులుగా భావించరాదనే ఆవేశంలోకి వచ్చేడు. ఆ శత్రువులు పంపిన భోజనం, వాళ్ళని అవమానపరచడానికయినా తిప్పెయ్యాలనిపించింది. కాని తోడి ఖైదీ వూరుకోలేదు. "మీ భార్య ఆ యింటనే వుంది కదా?" రామనాధం ఆలోచించేడు. తన డబ్బు ఖర్చుచేసి అన్నం పంపించేటందుకు ఆమె ఏర్పాటు చేసేటట్లు కబురు చేస్తాడు. ఆ మాట తోచేకనే అతడు భోజనం చేసేడు. తాను తెచ్చిన అన్నం తినడమా మానడమా అనే చర్చను ఆ అయ్యరు కుర్రవాడు ఎన్నడూ ఎదుర్కోలేదు. భోజనం బాగులేదని తిట్టిన వాళ్ళున్నారు. ఇదో కొత్త పద్ధతి. రామనాధం చెప్పిన ప్రకారం డబ్బు తెచ్చుకొనేటందుకు సర్కిల్‌ ఇన్‌స్పెక్టరుగారింటికి వెళ్ళినప్పుడు అయ్యరు కుర్రవాడు ఆ సరికొత్త సమాచారాన్ని అన్నపూర్ణమ్మకు చెప్పడం మరిచిపోలేదు. ఆ మాటలు విని ఆమె నిస్తబ్ధురాలైపోయింది. కన్నీళ్ళు పెట్టుకొంది. తండ్రిమీద కోపంతో అల్లుడిక కూతురును ఏలుకొనడనే ఆమె విచారం. "పిల్లదాని అదృష్టం ఎలాగుందో?" "దాని అదృష్టం బాగానే వుంది గనకనే వేళకి వచ్చేను. ఈపాటికి నోరు ముయ్యి" అని నారాయణమూర్తి గర్జించేడు. "చాలులెండి ప్రజ్ఞ" అన్నపూర్ణమ్మ ఈసడింపు వినేసరికి నారాయణమూర్తికి కోపమే వచ్చింది. అల్లుడిప్పుడే కార్యం చేసుకోనన్నాడనీ, తామంతా నచ్చచెప్పి దారిలోకి తెస్తూంటే నారాయణమూర్తే అంతా భగ్నం చేసేడనీ, దాని ఫలితం అనుభవించండనీ సాయంకాలమే శంకరశాస్త్రి తిట్టిపోయిన మాటలామె మనస్సులో ఇంకా కలక వేస్తున్నాయి. "పిల్లవాళ్ళిద్దరూ ఏవో కబుర్లు చెప్పుకుంటూ గదిలో వుంటే....." నారాయణమూర్తి ఆమె తెలివిహీనతను నిరూపించేటందుకు సుందరికి వ్రాసిన రామనాధం వుత్తరాన్నే ఆధారం చేసుకున్నాడు. పిల్లదాన్ని మంచి మాటలతో తీసుకుపోయి ఎక్కడో వదిలెయ్యాలనేది రామనాధం సంకల్పం. చదువు అనేది వట్టి సాకు. అది నారాయణమూర్తి అభిప్రాయం. శుభ్రమైన పిల్లను తీసుకొనిపోయి ఎక్కడో వదిలెయ్యడం ఎందుకు? అదీ ప్రశ్నే? నారాయణమూర్తి పోలీసు ఆఫీసరు. పోలీసులు బ్రిటిష్‌ ప్రభుత్వానికి అభిమాన పాత్రులు. రామనాధం సత్యాగ్రహం చేసేడు. సత్యాగ్రహం అంటూ తెచ్చినవాడు గాంధీ. గాంధీ ఇంగ్లీషు గవర్నమెంటుకి వ్యతిరేకం. "నా మీద శత్రుత్వంతో కూతురు జీవితం నాశనం చేసి కసి తీర్చుకోదలిచేడు" అని మగడు చెప్తూంటే అన్నపూర్ణమ్మ సందిగ్ధంలో పడింది. "ఉన్నవ లక్ష్మీనారాయణగారి వద్ద వుందువుగాని అన్నమాట ఎంతవరకు నిజమో, తీసుకుపోయి ఏ భోగం వాళ్ళకేనా అమ్మేసునో ఏమో?" ఆ మాటలు గోడ పక్కనుండి వింటున్న సుందరి అటువంటి భవిష్యత్తును తలచుకొని వొణికిపోయింది. "ఛ, అబద్ధం" అనుకుంది. కాని ఆ అభిప్రాయాన్ని కూడా నారాయణమూర్తి ఎంతోసేపు నిలువనీయలేదు. ఉన్నవ లక్ష్మీనారాయణ వీరేశలింగంగారిలా విధవా వివాహాలు చేస్తున్నవాడు. "ఆయన్ని కులంలోంచి వెలివేసేరు. అత్తగారివాళ్ళు కూతుర్ని పంపించక పోతే ముందుగా ఏడాది పిల్లవాణ్ని ఎత్తుకుపోయి భార్యను వస్తావా చస్తావా అన్నాడు. పాపం ఏం చేస్తుంది? వెళ్ళి ఆ ఇల్లాలు వూళ్ళో విధవముండలకీ, మాలగూడేల వాళ్ళ పిల్లలకీ నానా చాకిరీచేస్తూ పడివుంది". నారాయణమూర్తి చెప్పిన ఈ వృత్తాంతం తెలిసినాక తన మగడు తననొక మహాప్రమాదంలోకి తోసేస్తూంటే తన తండ్రి కాపాడాడనే అభిప్రాయం సుందరిలో ఏర్పడడం కష్టం కాలేదు. మగని లేఖలోని అంశాలు చదివినప్పుడే ఆమెకు ఇష్టం కాలేదు. తండ్రి చెప్పిన ఈ వివరాలు తెలిసి కాదు. కాని, ఇప్పుడు తండ్రి చెప్తూన్న కథలు వింటూంటే సుందరి పైప్రాణాలు పైనే పోయాయి. వితంతు వివాహాలు.... వెలి...... సమాజంలోంచి వెలిబెట్టిన వాళ్ళవద్ద తనను విడుస్తాననడం.... రాత్రి తెల్లవార్లూ ఆలోచిస్తూంది. తన మగడికి అన్యాయం జరిగిందా....? లేక తనను తండ్రి మగడి బారినుంచి కాపాడేడా......? తెల్లవారగట్ల వెళ్ళి తల్లి ప్రక్కలో కూర్చుంది. "ఏమిటే అమ్మా"--అని ఆమె దగ్గరకు తీసుకొంది..."ఇల్లా పడుకో...." అని చోటు ఇచ్చింది. సుందరి పడుకోలేదు. చాలాసేపటి వరకూ మాట్లాడలేదు. చివరకు అడిగింది. "నాన్న చెప్పింది నిజమేనా?" నారాయణమూర్తే ఆ మాట విని లేచి వచ్చేడు. ఉద్యోగరీత్యా తాను గుంటూరులో రెండేళ్ళు వున్నాడు. అప్పటికి సుందరి చిన్నపిల్ల. ఆరోజుల్లో లక్ష్మీనారాయణగారు చేసిన అకార్యకారణాలనీ, సనాతనపరులు ధర్మరక్షణకు చేసిన కృషినీ వర్ణించేడు. ఆనాటి సంగతులు తనకు బాగా తెలుసునని నిరూపించడానికి నారాయణమూర్తి ఉన్నవదంపతుల తల్లిదండ్రులను గురించి, వాళ్ళ వూళ్ళను గురించీ చెప్పేడు. కొండవీడుకు దగ్గరలో అమీనాబాద్‌ కరణం లక్ష్మీబాయమ్మగారి తండ్రి. ఆ దగ్గరలోనిదే వేమలూరుపాడు లక్ష్మీనారాయణది. తండ్రి శ్రీరాములుగారు బహు యోగ్యుడు. "దేవుడులాంటి మనిషి ఆయన. ఆయన మొహం చూసి పిల్లనిచ్చేం; చూడండి నారాయణమూర్తిగారూ, చివరకి తల ఎత్తుకు తిరిగే పని లేకుండా చేసేడు.... అని శీతారామయ్యగారు ఒకటే ఇదయి పోతూండేవారు..." శీతారామయ్యగారు లక్ష్మీబాయమ్మగారి తండ్రి. తనకు తెలిసినవీ, తెలియనివీ, జరిగినవీ, జరగనివీ, కలిపి చెప్పేసేడు. అంత తిరుగులేని సమాచారం విన్నాక తల్లీ కూతుళ్ళు ఇద్దరూ ఒక్క నిట్టూర్పు విడిచేరు. నారాయణమూర్తి తన కార్యక్రమానికీ ఇంట్లోంచే రాగల వ్యతిరేకతను నిర్జించేడు. విజయాన్ని ధృవపరచుకొంటూ తన ఆదేశాలు జారీచేశాడు. "ఈ వుత్తరం మాట పైకి తీసుకురావద్దు. వచ్చిందా పిల్లదానిని సాక్ష్యాలూ, సంపన్నాలూ అంటూ తిప్పుతారు" అన్నాడు. అన్నపూర్ణమ్మ ఇంక సర్దుకోలేకపోయింది. "ఆ దిక్కుమాలిన గాంధీ ఎవడో, నిక్షేపంలాంటి ఇంట్లో చిచ్చుపెట్టేడు." గాంధీని గురించి మంచి, చెడ్డలు ఏర్పరచుకొనే వయస్సూ, అనుభవమూ లేకపోయినా సుందరి ప్రస్తుతం చర్చిస్తున్న అన్యాయానికీ గాంధీని నెపం పెట్టడం న్యాయం అనుకోలేదు. "కట్టుకున్నదానిని ఎక్కడికో తీసుకుపోయి వదిలెయ్యమని ఆయన చెప్పేరేమిటిలే" అంది. ముప్ఫయ్యేడు మరునాడుదయం అడ్వొకేట్‌ రామసోమయాజులు రామనాధాన్ని సబ్‌జైలుకు వచ్చి చూసేడు. ఆయనను గురించి కూడా వచ్చిన సబినస్పెక్టరు పరిచయం చేశాక రామసోమయాజులు తాను వచ్చిన పని చెప్పేడు. "మీ నాన్నగారు పంపించేరు. మీ తరఫున డిఫెన్సులో నేను వాదిస్తాను." కాని, రామనాధం తాను డిఫెన్సు పెట్టుకోదలచలేదని ఖండితంగా నిరాకరించేడు. "నేను సత్యాగ్రహంలో పాల్గొంటానని వాగ్ధానం చేసేను. ఆ సహాయ నిరాకరణం పాఠశాలకు మాత్రమే పరిమితం కాదు. గాంధీజీ కోర్టులు కూడా బహిష్కరించమన్నారు." రామసోమయాజులు ఆ యువకుని ధృఢ సంకల్పానికి మెచ్చుకొన్నారు. "కాని, మీ నాన్నగారు చెప్పిన దానిని బట్టి ఇది అబద్ధపు కేసు గదా. మీరు డిఫెన్సు పెట్టుకోకపోవడం అబద్ధాన్ని పెంచి పోషించినట్లే కదా, సత్యాగ్రహి అసత్యాన్ని ప్రోత్సహించినట్లవుతుంది కదా... అది న్యాయమా." గత రాత్రి శంకరశాస్త్రి ఒకరిద్దరు వకీళ్ళు ప్రభుత్వ భయంతో సత్యాగ్రహి తరఫున వాదించడానికి నిరాకరిస్తే తన వద్దకు వచ్చేడు. తాను ఎన్నో ఆశలు పెట్టుకొన్న కొడుకు తన జీవితాన్నే నాశనం చేసుకొంటున్నాడని చెప్పి ఆయన కళ్ళనీళ్ళు పెట్టుకొన్నప్పుడు తనకు నవ్వు వచ్చింది. రామసోమయాజులు తన బంధువుల కుర్రవాడు పది పన్నెండేళ్ళ వాడున్నాడు. చూద్దురు గాని వుండండి అన్నాడు. ఆ కుర్రవాడొచ్చి నిలబడ్డాడు. "నీ చేతులు ఆయనకు చూపరా అబ్బాయి." వాడు చాపి చూపేడు. అరచేతులు రెండూ జువ్వ దెబ్బలతో కమిలిపోయి వున్నాయి. శంకరశాస్త్రి విస్తుబోయేడు. "ఏమిటది?" ఆ కుర్రవాడు అంబాజీపేటలో చదువుతున్నాడు. రామనాధాన్ని అరెస్టు చేశారన్న వార్త విని అసమ్మతి ప్రకటనగా మూడోఫారం కుర్రాళ్ళు టోపీలు లేకుండా బళ్ళోకి వెళ్ళేరు. టోపీలు తీసెయ్యడం ఎందుకో శంకరశాస్త్రికి అర్ధం కాలేదు. కాని, టోపీ తీసివెయ్యాలని తోచినందుకు రామసోమయాజులుకి ఆశ్చర్యం. పాఠశాలల్లో కుర్రవాళ్ళకి టోపీలుండి తీరాలనే నిబంధనా, నిర్బంధం ఉంది. నిబంధనలను ధిక్కరించడం తమ అసమ్మతి తెలపడంగా తోచి ఉంటుంది ఆ కుర్రాళ్ళకి. తీసేశారు. క్లాసు టీచరుకి మండింది. అందర్నీ బల్లలెక్కించి నిలబెట్టేడు. నాయకులన్న వాళ్ళని ఓ నలుగురిని పేకబెత్తం విరిగిపోయేవరకూ కొట్టేడు. "ఇంటికెడితే వాళ్ళ నాన్న తంతాడని అటు పెదపూడి వెళ్ళకుండా మా యింటికొచ్చేడు" అన్నాడు. "దెబ్బలు తిన్న వాళ్ళలో మీ వూరి కుర్రాడే ఒకడున్నాడట. అతడే అసలు దీనికంతకూ కథానాయకుడట" అన్నాడు కూడా. ఆ కథానాయకుడు రామనాధం మేనల్లుడేనని తెలిసి సోమయాజులు ఆశ్చర్యపడ్డాడు. "శాస్త్రిగారూ! ఈ ప్రపంచంలో సుఖం, బాగుపడడం వగైరాలను గురించి మీకూ మాకూ వున్న అభిప్రాయాలే వేరు. ఇప్పటి కుర్రవాళ్ళు ఆలోచనలు వేరూను." తన మేనల్లుడొకడు చదువు పాడుచేసుకొని కాంగ్రెసు వుద్యమంలోకి తమందరి వుద్దేశాలను కాదని దిగిన సంగతి చెప్పేడు. "ఏమో ఒకనాటికి వాళ్ళ ఆలోచనలే సరి అయినవవుతాయేమో...." అన్నాడు సోమయాజులు. "సరి అవడం గురించి మనం అనుకొనేది వాళ్ళమీది ప్రేమవల్లనే గాని, తమకూ ఆ విశ్వాసం వుందని చెప్పగలరా?" అని శాస్త్రి నిలవదీసేసరికి రామసోమయాజులు వద్ద సమాధానం లేకపోయింది. ఏమంటే తాను ఆ నమ్మకం లేదు గనుకనే కోర్టును బహిష్కరించలేక పోయేడు. అప్పుడే అనిపించింది.--ఆ కుర్రవాడెవరో ఓ మాటు చూడవలసిందే.... వచ్చేడు. కాని, ఇప్పుడాతడు చూపుతున్న పట్టుదల ఆయనకు చాల ఆశ్చర్యం కలిగించింది. "మీరు చేసినట్లు వాళ్ళు చెపుతున్న నేరం...." రామనాధం అడ్డు తగిలేడు. "అది నేరమంటారా?" "వాళ్ళు చెప్పేది అంతేకదా?" "వాళ్ళు చెప్పింది బ్రహ్మవాక్కు కాదు. అది....." "అయితే సర్కిలినస్పెక్టరుగారిని మీరు ఉద్యోగం మానమన్నారా?" రామనాధం ఆలోచించేడు. "లేదు." "మరి ఇది అన్యాయమూ, అబద్ధమూనే కదా." "అసలీ ప్రభుత్వం ఉండడమే అన్యాయం, అధర్మం, ఈ అధర్మపు దొరతనం క్రింద పనిచేసే కోర్టులకి న్యాయం, ధర్మం ఏమిటి? వాళ్ళ న్యాయాన్ని నేను వొప్పుకోను. నాకు న్యాయవాదితో పనిలేదు." రామసోమయాజులు నవ్వేడు. "జగన్మిథ్య అని శంకరుడు చెప్పినంత మాత్రాన ఇప్పుడు నీ మీద వచ్చిన కేసు మిథ్య కాదు, దీనికి శిక్ష పడితే ఏడాదో, ఆరు నెలలో మీ ఇష్టానిష్టాలూ, వొప్పుకోటంతో నిమిత్తం లేకుండా జైలులో వుండడమూ తప్పదు." రామనాధం ఇంక తాను చెప్పవలసిందేమీ లేనట్లు వూరుకొన్నాడు. రామసోమయాజులు ఆ యువకునితో పరిచయం కలిగినందుకు సంతోషం తెలియబరచి లేచేడు. "మీరు మీ అభిప్రాయం మార్చుకొన్నట్లయితే కబురు చెయ్యండి. మీ విషయంలో....." "సోమయాజులుగారూ! సర్కిల్‌ ఇన్‌స్పెక్టరుగారితో మాట్లాడడానికి వ్యవధి దొరికివున్నట్లయితే, తప్పక చెప్పి వుండేవాడిని. ఈ 'నేరం' చేసి వుండేవాడిని. మా వెంకటరమణకి మొన్న చెప్పేను. వింటారా అంటే అది వేరు మాట. కాని, మనం తప్పనుకొన్నది చెప్పడం న్యాయం." వెనక తిరిగినవాడే రామసోమయాజులు ఆగేడు. "మీకు తెలిసి వుండకపోవచ్చు నిన్న మీ మేనల్లుడట...." తన అరెస్టుకు అసమ్మతిగా కుర్రవాళ్ళు చూపిన ధిక్కారం మాట విని రామనాధం నవ్వేడు. వాళ్ళందరినీ టీచరు కొట్టినందుకు విచారపడ్డాడు. "కొండ కొమ్ము కదిలింది. జారడం ప్రారంభమయింది. జరుగుతున్నది అన్యాయమని పిల్లలు సహా గుర్తించేరు. నేను దానిని కోర్టులో నిరూపించనక్కర్లేదు." "ఆ కుర్రవాడు మీ మేనల్లుడేనయ్యా స్వామీ...." "వాడొక్కడే. కాని మీ బంధువుల అబ్బాయి. క్లాసులో వున్న మిగిలిన ముప్పయి మందీ? వాళ్ళ మాటేమిటి?" రామసోమయాజులు తల పంకించేడు.... "నిజమే...." ముప్ఫయ్యెనిమిది ఒక్కక్షణం వూరుకోకుండా కబుర్లు చెప్తూండే బాలకృష్ణ ఏమీ మాట్లాడకుండా బడినుంచి రాగానే పక్క వేయడంతో విశాలాక్షి కంగారుపడింది. మడికట్టుకొన్న విషయం కూడా మరచి ముట్టుకు చూసింది. ఒళ్ళు పేలిపోతూంది. కంగారుగా మృత్యుంజయుడు కోసం పరుగెత్తింది. అప్పుడే పొలం నుంచి తిరిగి వస్తున్న మృత్యుంజయుడు ఆమె ఆదుర్దా చూసి కదిలేడు. "ఈవేళ బడికి వెళ్ళేడా?" "బడినుంచి జ్వరంతోనే వచ్చేడు." "ఏం భయం లేదు. కంగారు పడకమ్మా! విశ్వనాధం బావగారు ఇంటికి రాలేదా? ఈ మధ్యన కనబడ్డమేలేదు. కాంగ్రెసు కబుర్లు ఏమీ చెప్పడం లేదు." ఆమె మనస్సుని ఆందోళన నుంచి బయటపడెయ్యడానికి దారి పొడుగునా కబుర్లు చెప్తూనే వచ్చేడు. మంచానికి ప్రక్కనే వేసిన పీటమీద కూర్చుని మృత్యుంజయుడు బాలకృష్ణకి కప్పిన దుప్పటి తీసి నాడి చూడ్డానికి చెయ్యి అందుకోబోయేడు. బాలకృష్ణ కెవ్వుమన్నాడు. "ఏమిట్రా నాన్నా! ముత్తన్నతాత చెయ్యి చూస్తాడు. ఒక్కమాటు చెయ్యి చాపరా నాన్నా." కాని బాలకృష్ణ చెయ్యి చాపడానికి ససేమిరా ఒప్పుకోలేదు. "దీపం దగ్గిరిగా చూపించమ్మా." మృత్యుంజయుడు బాలకృష్ణ అరచేతిలో వున్న నల్లని చారికలు చూసి తల్లివంక చాల తీవ్రంగా చూసేడు. "ఏమిటీ దెబ్బలు?" విశాలాక్షి కంగారుపడింది. "దెబ్బలేమిటి?" బాలకృష్ణ దాచలేకపోయేడు. మేనమామ రామనాధాన్ని అమలాపురంలో అరెస్టుచేసి జైలులో పెట్టేరని చెప్పేరు. తామంతా హర్తాళ్‌గా టోపీలు తీసేసి బడికెళ్ళేము. ఆ పనికి ప్రోత్సహించిన నన్నూ, మరో ముగ్గురినీ మేస్టారు కొట్టేరు. క్లాసు అందరినీ బెంచి ఎక్కించేరు. విశాలాక్షి తన కొడుకును ఆ విధంగా బాదేసిన టీచరును తిట్టేసింది. "ఆ టీచరు మనిషా, పశువా?" ఆ విషయం తెలుసుకోడానికి తెల్లవారకుండానే విశ్వనాధం అంబాజీపేట బయలుదేరేడు. ఆయన ఆకారాన్ని చూసి హెడ్మాష్టరు హడలిపోయేడు. తన అసిస్టెంటును సమర్థించడానికి క్షీణ ప్రయత్నం చేసేడు. "అలా కొట్టడం తప్పే అనుకోండి." విశ్వనాధం చర్రుమన్నాడు. "కొంచెం కొట్టడం మంచిదన్నమాట. మీకు ట్రెయినింగ్‌ ఇస్తున్న నిర్భాగ్యులెవరయ్యా? పిల్లల్ని బుజ్జగించి చదువు వచ్చేటట్లు చెయ్యాలనీ, వాళ్ళ ఆలోచనల్ని అరికట్టకుండా, సరియైన దార్లో పెట్టాలనీ ముండా ఉపన్యాసాలిస్తారెందుకయ్యా?" "చూడండి విశ్వనాధంగారూ! కోపంలో వున్నారు..." "ఆ దెబ్బలు కొట్టింది నేనయి, ఆ పిల్లవాడు మీ పిల్లవాడయి వుంటే ఆ కోపం తాపం తెలిసేది." హెడ్మాస్టరు తాను చేసి వుండని తప్పుకు తన్నులు తింటూన్నట్లనిపించింది. విశ్వనాధం కోపం చూస్తే ఆయన పిల్లల్ని కొట్టిన లెక్కల మేస్టరు కళ్ళముందే వుంటే గొంతుపిసికేసేలా వున్నాడు. టీచరు కొంచెం అతి చేసినా పిల్లలు చెడిపోతున్నారే అనే బాధతోనే శిక్షించుతాడనే వాదం తీసుకొన్నాడు. "ఇంతకీ పిల్లలు ఏం చేసేరో ఎరుగుదురా?" అని ప్రశ్నించేడు. ఆయన ధోరణికి విశ్వనాధం మరింత మండిపడ్డాడు. "పెద్దవాళ్ళం అయినా మనకి బుద్ధిలేదని చూపించేరు. పంజాబులో అన్ని ఘోరాలు జరిగితే పట్టలేదు. గాంధిగారిని అరెస్టుచేస్తే చీమ కుట్టినట్లనిపించలేదు. మన వొంట్లోది రక్తంకాదు మనం మనుష్యులమనిపించుకోలేకపోయేము. దేశం కోసం నిలబడ్డ వాడిని ఒకడిని అరెస్టుచేసినందుకు వాళ్ళ గుండె మండిపోయింది. తమకి బుద్ధి వుందని చూపించేరు. దేశానికి భవిష్యత్తు వుందని చూపించేరు." హెడ్మాస్టరు సిగ్గుపడ్డాడు. "కాని, ఈ చిన్నతనంలోనే వీళ్ళు ఇంత..." విశ్వనాధం మాట మధ్యలోనే అందుకున్నాడు. ".......ఉత్తమమైన మనస్సు కనబరిస్తే, పెద్దవాళ్ళయ్యేక ఎంత దేశభక్తులవుతారో, ఎంత త్యాగమూర్తులవుతారోయని సంతోషించాలి కాని, విచారపడకూడదు." విశ్వనాధం లేచేడు. "మా పిల్లలకి చదువు చెప్పమనీ, దేశానికి పనికివచ్చేలా చేస్తారనీ పిల్లల్ని బళ్ళకి పంపుతున్నాంగాని వాళ్ళని కైమా వండమని కాదు. వాళ్ళ బుద్ధి వికాసాన్ని పేకబెత్తానికి బలిచేయమని కాదు." హెడ్మాస్టరు ఆయనను వీధిలోవరకూ సాగనంపేడు. ఆయన లెక్కల మేస్టరు ఇంటికెళ్ళి మళ్ళీ రంతు చేస్తాడేమోనని సంకోచం కలిగింది. "ఆ మేస్టారితో మాట్లాడుతా. నాకు చెప్పడం మంచిపని చేసేరు." "మా పిల్లలు తప్పుపనులు చేస్తే దారిని పెట్టాలనే మా కోరిక..." హెడ్మాస్టరు నవ్వేడు, ఇప్పుడీ గంద్రగోళం ఎందుకన్నట్లు. విశ్వనాధానికి చుర్రుమంది. "తప్పు వొప్పులు తెలియనివాళ్ళు మాస్టర్లు అయ్యేరు కనక ఇంక ఆ బాధ్యత మేమే తీసుకోవడం మంచిది. చదువు మీరు చెప్పండి చాలు. వాళ్ళు తప్పుచేస్తే మాకు చెప్పండి. మేం నేర్పుకుంటాం..." నెత్తిన నీళ్ళు దిమ్మరించినట్లు హెడ్మాస్టరు ఉక్కిరిబిక్కిరి అయిపోయేడు. ముప్ఫయితొమ్మిది భోజనం చేస్తూ చేస్తూ నారాయణమూర్తి తలఎత్తి చూసేడు. "అమ్మాయి ఏదీ?" "వీధివేపున వుంది కాబోలు. పిలవమంటారా?" "వద్దులే... " అని ఒక్క నిట్టూర్పు విడిచి అతడు మరల భోజనం సాగించేడు. అతని మనస్సుని ఏదో విషయం బాధిస్తూన్నదని అన్నపూర్ణమ్మ గ్రహించింది. ఏదో ఏముంది? కూతురి మగని విషయమే అయి వుండాలి. కాని, ఆ ప్రసక్తి మగనివద్ద తీసుకురాగల ధైర్యం లేకపోయింది. "ఇందాకటి నుంచి మాట్లాడి వెళ్ళేరే, ఎవరో...?" అసలా మాదిరి ప్రశ్నలు కూడా నిషిద్ధమే. కాని, ఏదో మాట్లాడాలి కదా అని అడిగింది, "నీకనవసరమైన వాటిల్లోకి దిగకు"--అని సలహా కోసం ఎదురు చూస్తూనే. కాని నారాయణమూర్తి గదిమెయ్యకుండా వూరుకోవడం ఆమెకూ ఆశ్చర్యం కలిగించింది. ఆ ప్రశ్నకి సమాధానంగా నారాయణమూర్తి తన మనస్సుని వేధిస్తున్న ఆలోచనల పర్యవసానాన్ని వినిపించేడు. "ఎగిరి ఎగిరి రాక్షసి మూక మధ్యకి వెళ్ళి పడ్డాం." ఆ రాక్షసి మూక ముంగండ గ్రామస్థులని అన్నపూర్ణమ్మ అర్ధం చేసుకోవడం కష్టమేం కాలేదు. అయితే వాళ్లు రాక్షసి మూక అని కూతురు సంబంధం చేయకముందూ, చేశాకా కూడా అనుకోలేదు. బ్రాహ్మణుల్లో తమ శాఖవాళ్ళే నివసిస్తున్న పెద్ద గ్రామం ముంగండ. వేదపండితులు, సంస్కృత భాషాకోవిదులు, కవులు, వ్యాకరణ శాస్త్రవేత్తలు ఇంటింటా వున్నారని పేరున్న వూరు. కోరి తమ దంపతులకు దీక్ష ఇచ్చిన గురువుగారిది ఆ ఊరు. ఆ వూళ్ళో తమ కూతురును ఇవ్వగలగడం తమ అదృష్టమని మురుసుకొన్నవాళ్ళే. కాని, ఈనాడు తమ అల్లుడు తన జీవితాన్ని పాడుచేసుకోవడమేగాక తనను కూడా ఆ గోతిలోకే ఈడుస్తున్నాడనే వ్యధతో ఆ మాట అంటున్నాడేగాని వేరు కాదని ఆమె ఎరుగును. ఏమీ అనలేదు. "ముందుకు పోవడం తప్ప నిలబడడానికి కూడా వీలు లేని స్థితి తెచ్చిపెట్టేరు." రెండురోజుల నుంచీ అప్రతిష్ఠ భయం చూపించి అల్లుడిమీద కేసూ ఏమీ లేకుండా చెయ్యమని మగడితో పోరుతున్న దానికి అది సమాధానం అని ఆమె గ్రహించింది. పైకి ఎంత బిర్రుగా పనికి రాదంటున్నా లోపల ఆయన కూడా అల్లుడిని బయటపడెయ్యాలనే అనుకుంటున్నాడన్నమాట. అన్నపూర్ణమ్మ చాల సంతోషించింది. "ఆ కోపంలో ఏదో చేశారు గాని ఆయనకు మాత్రం బాధ వుండదేమిటి?" అనుకొంది. ఇప్పుడొచ్చిన పుట్టి మునక ఏమిటో.... "అంబాజీపేట స్కూల్లో మొన్న మూడోఫారం ఓ సెక్షన్‌ కుర్రాళ్ళు హర్తాళ్‌ చేసేరట." హర్తాళ్‌ ఏదో కొత్తమాట. అదేమిటో తెలుసుకొని బుగ్గలు నొక్కుకొంది. వాళ్ళ హర్తాళ్‌ స్వభావం వింటే ఆవిడకి నవ్వొచ్చింది. "టోపీలు తీసేశారు నయం. గోచీలు పెట్టుకువచ్చేరు కాదు...." అంత తేలికగా తోసివేస్తున్న భార్య మనస్సు తేలికతనం చూసి నారాయణమూర్తికి కోపం వచ్చింది. "అంత నవ్వులాట మాట కాదిది." ఆ టోపీలు తీసెయ్యడంలో వున్న అంతరార్థం విన్నాక అన్నపూర్ణమ్మ నోరు తెరిచింది. "ఏమంటారు వాళ్ళు?" నారాయణమూర్తి చిరచిరలాడేడు. "ఇదేదో గంపసిరి అనుకొంటున్నారు. గేలపుసిరి అని ఎరగరు." నారాయణమూర్తి పరిషేచన పట్టి లేచేడు. చేయి కడుక్కుని వచ్చి భార్య అందించిన తుండుగుడ్డ అందుకుంటూ ఇంక తనను వేధించవలదని హెచ్చరించేడు. "ఈ వేళవరకూ నేను తటపటాయిస్తూనే వున్నాను. అతని మీద కేసుకు ఏర్పాట్లూ చేయలేదు. తన తమ్ముడిని పోలీసు వుద్యోగానికి వెళ్ళవద్దన్నానని గొప్పగా చెప్పుకున్నా వినిపించుకోకుండా ఒరగేసుకు వస్తున్నా....." అన్నపూర్ణమ్మకది కొత్త సమాచారం. ఆశ్చర్యం వెలిబుచ్చింది. తన అల్లుడు తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు. అతడు తమ్ముడనేదెవరినో ఆమెకు అర్థం కాలేదు. "తమ్ముడెవరు?" "వున్నాడుగా, ఆ పెత్తండ్రి, ఆయన వుంచుకున్నదాని కొడుకు....." "వాడా తమ్ముడు....." శుద్ధ శ్రోత్రియులమనుకొనే ముంగండ బ్రాహ్మణులు తమనాడు మధ్యన జరుగుతున్న ఈ అనాచారాన్ని గురించి చీమకుట్టినట్లుగా కూడ పట్టించుకోకపోవడం ఆమెకు ఎంతో కష్టంగా వుండేది. కాని ఆ అనాచారంలో బంధుత్వం పాటించడం కూడానా? "--అవ్‌వ్వ! అవ్‌వ్వ!" ఆమాట సబినస్పెక్టరు విన్నాడు. పక్కగదిలో 'కరుప్పుకుళ్ళాయి'కే.డీ గాళ్లు విన్నారు. అయినా వాళ్ళ నోరు నొక్కేద్దామనుకున్నాడు. కాని, ఇదేమిటి? ఇప్పుడింకా తాత్సారం చేస్తే తన ఉద్యోగానికి నీళ్లు వొదులుకోవలసిందే. తాను రామనాధాన్ని ఎందుకు అరెస్టు చేసిందీ తానుగా ఇంకా పేరు పెట్టలేదు. కేసు పెట్టలేదు. కాని, వాళ్ళే పేరుపెట్టేసి హర్తాళ్‌ చేసేరు. "చేస్తే ఆ మేస్టరు పిల్లల్ని మందలించేడు. హత్తేరీ మందలిస్తావాయని ఆ 'శిష్టుపూస' ఓ దుడ్డుకర్ర వేసుకొని హెడ్మాస్టరుమీదికొచ్చేడు. ఆయన ఏదో సర్దేసి పంపేసేడు. కాని, ఆ పాళాన్ని బుర్ర పగలేసి జైల్లో వుంచవలసిందే....." "అంత ఆకతాయితనమా......" అని అన్నపూర్ణమ్మ కళ్ళు చక్రాల్లా చేసింది. "బోడి ప్రజ్ఞ. అంతతో వూరుకోరాదూ? వాళ్ళా, వీళ్ళాయని వూళ్లో పెద్ద కోమట్లవద్దా, కాపులవద్దా తన మనమడిని మేస్టరు చితక్కొట్టేస్తే జ్వరం వచ్చి పడివున్నాడని యాగీ చేసేడుట." "పాపం కుర్రనాగమ్మని బాగా కొట్టివుంటాడు. లేకపోతే అంత కోపం రాదు. ఎప్పుడూ మాట్లాడలేదు గాని మంచివాడనే చెప్తారు." "చెప్పేను! గంపసిరి కాదిది, కొడితే కొడతాడు. వెధవపని చేస్తే పైనా క్రిందా మూసుకు వూరుకోక ఈ బోడి ప్రజ్ఞలెందుకు? వూళ్ళోవాళ్లు నలుగురూ పిలిచి ఆ మేస్టరుని చంపేస్తామన్నారుట. వాడు హడలిపోయి పరుగెత్తి వచ్చేడు. ఈ వూళ్ళో ఆయన అన్నగారుంటే అతడు నాదగ్గరికి తీసుకొచ్చేడు." ప్రొద్దుటినుంచీ మాట్లాడిన వాళ్ళెవరో అన్నపూర్ణమ్మకు అర్థం అయింది. వ్యవహారం వీధినబడింది. ఇప్పుడు తన మగడు వెనక తగ్గలేడు. అల్లుడిమీద కేసు పెట్టించాలి. అందులో ఆయనే ప్రథమసాక్షి. ఆయన మాటల్నిపట్టి అల్లుడు తమ్ముడనుకొనేవాడు రెండో సాక్షిగా సిద్ధం అవుతాడు. కేసు బలం అవుతూంటే ఆ అల్లుడు వకీలును పెట్టుకోనంటున్నాడన్న వార్త గుర్తువచ్చి శిక్ష తప్పదన్నట్లు కనిపించి ఆమె దిగులుపడి పోయింది. కూతుర్ని కౌగలించుకొని కన్నీళ్లు పెట్టుకుంది. "నీ గొంతు కోసేమే తల్లీ." అంటున్న తల్లి కన్నీళ్లు చూసి సుందరి కుంగిపోయింది. నలభయి తన కొడుకు వెంకటరమణ రామనాధం మీది కేసులో ప్రభుత్వం తరఫు సాక్షులలో ఒకడని విన్నప్పుడు విశ్వనాధం మొదట నమ్మలేకపోయేడు. కాని విశాలాక్షి పదేపదే చెప్తూంటే ఏమనుకోవాలి? "సత్యం ఇంట్లో చెప్తూంటే విన్నానని మంగమ్మ చెప్పింది నాన్నా!" సత్యం మంగమ్మ తమ్ముడు. "వాడికి ఎల్లా తెలిసింది?" "అదేమిటి నాన్నా అల్లా అడుగుతావు? వాళ్ళ పింతల్లిగారింటికి వెళ్ళేడు మొన్న, అక్కడొక రోజుండి రాత్రే వచ్చేడు." "ఉహు." అనుకొన్నాడు. సత్యం అమలాపురం పినతల్లిగారింటికి వెళ్ళి వుంటాడు. అక్కడ విన్న మాటలు ఇంట్లో చెప్పి వుంటాడు. ఆ మాటలు వాడి అక్కగారు మంగమ్మ తన కూతురుతో చెప్పింది. వాళ్ళిద్దరూ స్నేహితులు... ఇవన్నీ నిజమే. కాని, అసలు విషయమే అతను నమ్మలేకుండా వున్నాడు. రామనాధం అంటే వెంకటరమణ ఎంతో అభిమానంగా వుంటాడు. రామనాధం కూడా రమణ అంటే చాలా ప్రేమగా వుంటాడు. తన కూతురు విశాలాక్షే దూరంగా వుంచుతుంది గాని, రామనాధానికా ఎబ్బెట్టు లేదు. అటువంటి సందర్భంలో రామనాధం మీద పోలీసులు కేసు పెడితే దాంట్లో పోలీసుల తరఫున సాక్ష్యం ఇస్తాడా? ఏమని?.... "రమణ ఇచ్చే సాక్ష్యం ఏమిటో అడక్కపోయేవా?" "వాడిమీద నీకు చెప్పలేనంత నమ్మకం. పుట్టముంగిలా చూపులూ వాడూ....." "విశాలాక్షీ! వాడేమన్నా చెడ్డవాడుగా తయారయితే దానికి ఇల్లాంటి మాటలూ, ఈ చిన్న చూపూ మాత్రమే కారణం అవుతుంది. మరిచిపోకు. వాడు...." తానా మాట పూర్తిచేస్తే ఆమె ఏమంటుందో అతనికిదివరకే అనుభవం. విశాలాక్షికి తండ్రిమీద ఎంతో భక్తీ, అభిమానమూ వున్నా, ఆ కులాంతరురాలితో సంబంధాన్ని హర్షించలేకపోయింది. ఆ సంబంధంలో కలిగిన సంతానాన్ని తన రక్తసంబంధీకుడేనని ఆమె బ్రాహ్మణీకం అంగీకరించనీయలేదు. వినేమాటుంటే బాలకృష్ణని ఆ చుట్టుప్రక్కలకి చేరనివ్వకపోయేదే, కాని, అది సాగలేదు. విశ్వనాధం ఒక నిట్టూర్పు విడిచి లేచేడు. తిన్నగా సత్యాన్నే అడుగుదామని బయలుదేరేడు. కాని, అతడు చాల సేపటివరకూ కనబడలేదు. అక్కడుంటాడనీ, ఇక్కడుంటాడనీ, రెండు మూడు చోట్లకి వెళ్ళేడు. చివరకాతడు రావిక్రిందనే ఎదురయ్యేడు. కనిపించగానే ఎంతో సంతోషం ప్రకటించేడు. "ఇదిగో మామగారూ! మీ కోసం పొద్దుటినుంచి కనీసం పదిమందినైనా అడిగి వుంటాను...." అదంతా వట్టిదని ఎరిగివుండీ విశ్వనాధం ఎరగనట్లు నటించేడు. "ఏమిటి కథ?" "ఇంకా మీదాకా రాలేదేమిటి?" "అదేమిటో చెప్పందే నా దాకా వచ్చిందో లేదో తెలియడమెల్లాగోయి." "అదేనండి అదే..." "అయితే తెలిసిందిలే..." అన్నాడు విశ్వనాధం. "ఏది?" "అదే. అదే... నువ్వు అనుకొని మరిచిపోయిందే." సత్యం ఫక్కున నవ్వేడు. "రాండి. కూర్చోండి, ఓ ముఖ్యమైన మాట చెప్పాలి." "చెప్పు ముందు, ఏపాటి ముఖ్యమైనదో తర్వాత ఆలోచిద్దాం." "మా పిన్ని మీతో ముఖ్యంగా చెప్పమని గట్టిగా చెప్పింది." అన్నాడు సత్యం. "అందుకేనా నిన్న రాత్రి వచ్చి ఇంతవరకూ కనబడనేలేదు...." "అయితే మీకూ తెలిసిందన్నమాటే." "అన్నమాటే అని సందేహం ఎందుకు? అదేదో చెప్పు. మా వియ్యపరాలుగారేమన్నారో..." వియ్యపరాలు అన్న మాటలోని నొక్కును విననట్లు సత్యం అసలు విషయం ఏమిటో చెప్పేడు. "రామనాధం బావమీది కేసులో సాక్ష్యం మీ రమణ ఇస్తున్నాడట." "మీ బాబయ్య?" మీ రమణ అన్నదానికది ఎదురుదెబ్బ, సత్యం తెలియనట్లు దాటేసేడు. "మా పిన్ని మీతో చెప్పమని పదిమాట్లు చెప్పింది." "ఆమెకు నా మీద అంత దయ వున్నందుకు సంతోషం. అయితే...." సత్యం ఆగేడు. "మా రమణ ఏమని సాక్ష్యం ఇస్తాడు?" "నేనడగలేదు...." "ఆవిడ చెప్పలేదూ...." "లేదు..." విశ్వనాధం ఫక్కున నవ్వేడు. "నీ స్కూల్‌ ఫైనల్‌ చదువు వట్టి దండగోయ్‌. ఒక విషయం ఒకరితో చెప్పమన్నప్పుడు అదేమిటో, ఎందుకో తెలుసుకోవద్దూ. పుల్లయ్య వేమవరం కథ ఎప్పుడేనా విన్నావా?" సత్యం తగ్గేడు. "అతడిచ్చే సాక్ష్యం ఏమిటో తెలియనిస్తారా ఏమిటండీ...." "ఇంకా ఏం చెప్పమన్నారు మా వియ్యపురాలుగారు....." తన మాటలు వట్టి తట్టాబాజీగా కట్టేశాడని సత్యానికి అభిమానం కలిగింది. మీ రమణ సబిన్‌స్పెక్టరు సెలక్షన్‌కి కట్టేడుట. ఈ సాక్ష్యం ఇస్తే అతనికి సెలక్షన్‌ ఖాయమేనట." విశ్వనాధం ఈమారు ఆ వార్తను నమ్మవచ్చుననుకున్నాడు. వెంకట రమణ ఉద్యోగ ప్రయత్నాలతో ముడిపడి వుందని అన్నప్పుడా సమాచారాన్ని నమ్మవచ్చుననే అనిపించింది. దానితో అతడివ్వబోయే సాక్ష్యం స్వభావం కూడా అర్ధం అయింది. అయితే--ఆ ఇచ్చేది అబద్ధపు సాక్ష్యమా? తమ్ముడుగదా అని చనువుకొద్దీ చెప్పిన హితవచనాలను సాక్ష్యంగా చెప్తాడా? వెంకటరమణ స్వభావం ఎరిగిన విశ్వనాధానికి అతడు వెయ్యబోయే ప్రశ్న ఎలా వుంటుందో కూడ మనస్సుకి తట్టింది. సరిగ్గా వెంకటరమణ అలాగే అడిగేడు. దానికి తను వూహించుకొన్న రీతినే లచ్చమ్మా సమాధానమిచ్చింది. * * * * * విశ్వనాధం ఆ మాట చెప్పగానే లచ్చమ్మ నిర్ఘాంతపోయింది. వెంటనే రెండు బట్టలు సంచీలో బెట్టుకుని నడవమంది. "ప్రాణంలా చూసే రామనాధానికి అపకారం చేస్తాడూ..." తాము వెళ్ళడమేగాని, అసలు వెంకటరమణ కనిపించకనేపోవచ్చునని విశ్వనాధం అభిప్రాయం. కాని, తల్లీ తండ్రీ వచ్చి నాళం వారి సత్రంలో వున్నారని తెలియగానే వెంకటరమణ వచ్చేడు. తల్లి ప్రశ్నకు వెంకటరమణ అమాయకంగా సమాధానం ఇచ్చేడు. "నేనేం అబద్ధం సాక్ష్యం చెప్పబోవడం లేదమ్మా!" నిజమే అయినా దానిని సాక్ష్యంగా చెప్పి వానికి అపకారం చెయ్యవలసిన పనేమిటి? "రామనాధం తన అభిప్రాయాలను దాచుకోదలచలేదు. మామగారితో కూడ ఆ మాటలే అన్నాడట కదా." పైగా అతడు సత్యాగ్రహం చేయడానికి ప్రతిజ్ఞ తీసుకొన్నాడు. సహాయ నిరాకరణంలో భాగంగా చదువు మానేసేడు. కోర్టులో డిఫెన్సు పెట్టుకోనన్నాడు. అతనికి తన సాక్ష్యం అపకారం చెయ్యదు. పైగా అతడు తాను చెప్పింది ఆచరిస్తాడనీ, ఆ ఆచరణ ఇతరులెవ్వరికో వుపదేశించి తన వాళ్ళని మినహాయింపులో పెట్టుకొనే కొందరి మాదిరిగా కాదనీ తాను నిరూపించినట్లవుతుంది. "అది అతనికే ప్రతిష్ఠ" అన్నాడు. వెంకటరమణ అమాయకత్వం నటిస్తున్నాడని విశ్వనాధం గ్రహించేడు. "ఆ సంభాషణ మీ ఇద్దరి మధ్యా నడిచింది. ప్రభుత్వానికి దానిని సాయం ఎందుకివ్వాలి?" అన్న విశ్వనాధం ప్రశ్నకు వెంకటరమణ ఎంతో ఆశ్చర్యం, విసువూ కనబరిచేడు. "అల్లా అంటారేం బాబాయి! నేనేమన్నా సహాయ నిరాకరణం చేస్తున్నానా ఏమన్నానా?" "కాని, గవర్నమెంటుకి సాయం చేస్తాననీ అనలేదుగదా...." ఈమారు వెంకటరమణ నిజంగానే విసువు చూపించేడు. "ఎందుకనలేదు? సబినస్పెక్టర్‌ సెలక్షనుకి దరఖాస్తు పడేసింది. సహాయ నిరాకరణం చేస్తానికి కాదుగా--" విశ్వనాధానికి సమాధానమేమీ తోచలేదు. "నీ వాళ్ళని కాదనుకొని ఎవరిపంచో కాగుతావట్రా?" అని లచ్చమ్మ ఆక్రోశించింది. నైతికమైన విలువలను అర్ధం చేసుకోలేనిచోటా, చేసుకోదలచనిచోటా వాదనలు నిస్సహాయతకే దారితీయక తప్పదు. తర్కరీత్యా వెంకటరమణ వాదనలో లోపం లేదు. అక్కడ సౌజన్యమే. ఆ సౌజన్యాన్నే కోరి వాదించడం నిష్ప్రయోజనం... ఈమారు వెంకటరమణ భారతీయ వేదాంతాన్ని ఆసరా తీసుకున్నాడు. "నీవాళ్ళూ, నావాళ్ళూ! అది నాకేనా? పిల్లనిచ్చిన మామగారికి ఆ మాట ఎవ్వరూ చెప్పరేం? ఆయన వుద్యోగస్తుడు గనకనా? లేక దేవీపూజచేసే సద్బ్రాహ్మణుడు గనకనా?" "ఆయనేదో గడ్డితిన్నాడని..." "ఆ గడ్డి మేయాలనేకదా నేనూ దరఖాస్తు పడేసింది. మరి పేచీ లేదు..." లచ్చమ్మ తిడుతుందనీ, గోలు గోలున ఏడుస్తుందనీ విశ్వనాధం భయపడ్డాడు. కాని, ఆమె అటువంటిదేమీ చేయలేదు. బహు గంభీరంగా లేచి నిలబడింది. "పిల్లల్ని కనగలంగాని, వాళ్ళ బుద్ధుల్ని కనలేం, నడవండి పోదాం...." విశ్వనాధం ఆమెను సర్దుబాటు చేయబోయేడు. "కూర్చో, తొందరపడకు." కాని, ఆమె అంగీకరించలేదు. "నీవాళ్లూ నావాళ్లూ ఏమిటని శాస్త్రం చెప్తున్నాడు. ఆ మొండిచెయ్యే మనకీను.... ఎందుక్కూర్చోడం?" ఇంకా ఆమె సంభాషణలో పాల్గోలేదు. సంభాషణ కూడా విశేషంగా సాగలేదు. వెంకటరమణ లేచేడు. విశ్వనాధం తాను తెచ్చిన ఒక పాతిక రూపాయలు అతనికి ఇవ్వబోయేడు. కాని, రమణ తీసుకోలేదు. "కావలసింది వాళ్ళు పంపిస్తున్నారు. నిన్ననే ఓ వంద ఇచ్చి వెళ్ళారు" అన్నాడు. వాళ్లు అత్తారివాళ్లు. వంద ఇచ్చి వెళ్లేరన్నమాట. తన దగ్గర డబ్బుంది, మరి అవసరం లేదని చెప్పడమేనా? లేక నాకు వందలిచ్చేవాళ్లున్నారు. నీ పాతికలెవరికి కావాలని వెక్కిరించడమా? విశ్వనాధం వూరుకున్నాడు. వెంకటరమణ లేచేడు. "మీ అందరికీ కోపం వస్తుంది. నేను ఎరుగుదును. కాని, మీకీ దేశంమీదా, మనుష్యులమీదా ఎంత ప్రేమా, అభిమానమూ వున్నాయో ఆ మాత్రం నాకూ వున్నాయి. దేశం బాగుపడాలంటే ఇంగ్లీషువాడుండాలిసిందే. వాడు వచ్చేకనే మనకు ఆనకట్టలు, రైళ్లు, చదువులూ అంటూ వచ్చేయి. మాబోటిగాళ్లకి ఓ చదువనీ, వుద్యోగమనీ...." "మా బోటిగాళ్ళంటే..." "బ్రహ్మిగాడు కానివాడికి..." "నీకూ కులం పట్టింపు వుందన్నమాట." అన్నాడు విశ్వనాధం. రగులుతున్న కోపాన్ని అణుచుకుంటూ.... "మీ అందరికీ వుంది గదా..." "కాని నీదిప్పుడే కులం?" అన్నాడు విశ్వనాధం వెటకారంగా. "ముంగండవాళ్లు మా నాన్నవేపు బంధుత్వాన్ని ఒప్పుకోరు. చివరకు మా అక్కే వొప్పుకోదు...." విశ్వనాధం నిర్వాక్కుడయ్యేడు. "మీరు పెళ్ళి చేసి నా కులం ఏమిటో తేల్చేరు అనుకుంటున్నా...." మహా కసితో అంటున్నట్లున్న కొడుకు మాటలు విని విశ్వనాధం గోడకి జేరబడిపోయేడు. తన దాడిని వెంకటరమణ ఇంకో అడుగు ముందుకు వేయించేడు. "నా తల్లి వేరు కులానికి చెందినది కావడంచేత మీవాళ్లు మీ కొడుకునే దూరంగా వుంచేసేరు. మా అమ్మ కులం వాళ్లు నన్ను కలుపుకున్నారు. దూరం పెట్టలేదు. వాళ్లకి నా తండ్రి తెలుసు...." "తర్వాత మాటకూడా అనేసెయ్యి." అసలు విషయం తప్పించేడు. సంఘంలో అవమానకరంగా భావించే తమ దాంపత్య స్థితిని అతడూ నిందిస్తున్నాడనే భావంలో విశ్వనాధం కస్సుమన్నాడు. వెంకటరమణ తల్లివంక తిరిగేడు. "అమ్మా! నేనిప్పుడు కావాలన్నా నా యింటికి పిలవలేను. రెండేళ్ళలోపున ఏదో వుద్యోగం, ఓ ఇల్లూ ఏర్పడుతుంది. ఆ ఇల్లు నీదీను. ఆ రోజున..." లచ్చమ్మ చాలా అభిమానం కనబరిచింది. "మీ నాన్నగారి ధర్మమా అని నాకో ఇల్లు ఏర్పడింది. ఎవరి ఇంటికో..." "నా ఇల్లు ఎవరిదో ఏమిటమ్మా--" "అది నీ ఇల్లు. సుఖంగా వుండండి. ఆ యిల్లు నాది ఎల్లా అవుతుంది?..." విశ్వనాధం తన భార్య విషయం తాను చూసుకోగలనన్నాడు. "ఆమెకు తోస్తే ఏనాడైనా ఎక్కడికైనా వెడుతుంది. కాని, ఆమెకో ఇల్లు వుంది. ఆ విషయంలో నువ్వు ఇబ్బంది పడనక్కర్లేదు." నలభయ్యొకటి ముంగండ స్నేహితులు సాయంకాలం హాస్పిటలులో రామనాధాన్ని పట్టుకొన్నారు. కేసులో వాదించుకోవడానికి ఒప్పుకోవడం లేదన్న మాట విని వాళ్లు నలుగురైదుగురూ కట్టకట్టుకు వచ్చేరు. సబ్‌జైలులో కలుసుకోవడానికి వస్తే పోలీసులు తరిమేశారు. ఇంక సాయంకాలం మామగారు ప్రసాదించిన దెబ్బలకి కట్టుకట్టించుకొనేటందుకు హాస్పిటలుకు వస్తున్నాడన్న వార్త విని కాపలా వేసేరు. వకీలు రామసోమయాజులుకిచ్చిన సమాధానాన్నే రామనాధం వాళ్ళ వద్ద వల్లించేడు. "ఈ ప్రభుత్వం వుండడమే అన్యాయం...." "ఇది అబద్ధం కేసు అవునా కాదా?" అన్నారు మిత్రులు ఆ విషయం ఒప్పుకోడానికి అతనికి అభ్యంతరం లేదు.... "అవును" "అబద్ధాన్ని సహించడం దాన్ని ప్రోత్సహించడమే" అన్న మామూలు వాదాన్నే రామన్న పలికాడు. కాని శివరామయ్య వాదం భిన్నంగా వుంది. మామగారిని కోర్టులో నిల్చోబెట్టి అల్లరి చేసెయ్యాలని అతని అభిప్రాయం. "నువ్వేం మాట్లాడనక్కర్లేదు. ఆ పనేదో వకీలు చూస్తాడు. విని ఆనందించడం వరకే నీ పాత్ర..." అని సలహా. రామనాధం దానికి అంగీకరించలేదు. గాంధీగారు కోర్టుల విషయంలో కూడా సహాయ నిరాకరణం చేయమన్నారనే కాదు. వాదన పెట్టుకొని రంగంలోకి దిగితే తన భార్యని కూడా ముగ్గులోకి దింపవలసి వస్తుందనే ఆలోచన కూడా మనస్సులో ఓ మూల లేకపోలేదు. ఆనాడు జరిగిన ఘట్టాలు వీళ్ళెవరికీ తెలియదు. తానూ ఆ ప్రసక్తి రానివ్వడం లేదు. "ఇదివరకు, ఇంతవరకూ నేనే వుద్యోగినీ సహాయ నిరాకరణం చెయ్యమని చెప్పలేదనుకో...." "మరింకనేం?" అన్నాడు రామన్న. "అది కాదురా. ఒకవేళ చెప్పేవుంటే ఆ చెప్పడం తప్పా అనేది ప్రశ్న. తప్పు కాదని నా నమ్మకం. తప్పని వాళ్ళ అభిప్రాయం. ఆ అభిప్రాయం వాళ్ళకి చట్టంకన్న బలవత్తరం. నా నమ్మకం నాకు ఏ చట్టం కన్నా బలవత్తరం. ఇంక వాదాలకీ, న్యాయాలకీ అవకాశం ఏం వుంది?" శివరామయ్యకి కోపం వచ్చింది. నాలుగు తిట్టేడు. నవ్వుతో సమాధానం ఇచ్చేడు రామనాధం. "ఒకడు ఏదయినా నేరం చేస్తే అంగీకరించి శిక్ష పొందాలి. నేరం చేయకపోయినా శిక్షిస్తారనుకో. దానికి అవమాన పడనక్కర్లేదు." అన్నాడు. "ఇతి గాంధీ ఉవాచ" అని వెక్కిరించేడు సూరప్ప. ఈ అరగంటలోనూ అతడు ఆరుమాట్లు గాంధీ పేరు వుచ్చరించేడని అంతక్రితమే అతడు లెక్క తేల్చి చెప్పేడు. రామనాధం పకపక నవ్వేడు. "అత్తవారింట్లో లాగ అన్ని పరిచర్యలూ జరిగిస్తూంటే...." అంటూ మందు పరికరాలు తీసుకువచ్చిన కాంపౌండరు ఈసడింపుగా అన్నాడు. రామనాధం నవ్వు టక్కున ఆగిపోయింది. ఈ నాలుగైదు రోజుల నుంచీ కాంపౌండరు ధోరణి చూస్తూంటే అతడికి వొళ్లు మండిపోతూంది. హోటలునుంచి అన్నం తెచ్చిపెట్టడం, గాయాలకి కట్లు కట్టించడం అవినయాన్ని పెంచుతుందని ఆ కాంపౌండరు భయం. "పుచ్చి చావనివ్వాలి" అని అతని సూచన. కాని దానిని అధికారులు పాటించేలా కనబడలేదు. కనుక యధాశక్తి తానే రామనాధాన్ని హాస్పిటలుకు దూరంగా వుండేటట్లు చేయ ప్రయత్నించేడు. కట్టు కట్టడంలోనూ, విప్పడంలోనూ, మందు రాయడంలోనూ చాల మోటుగా పనిచేసి చాలా బాధ కలిగించేడు. అందుచేత రామనాధం మొదటి రెండు రోజులూ అయ్యేక హాస్పిటలుకు రానన్నాడు. మిత్రుల్ని చూసి ఈవేళ మళ్ళీ బయలుదేరేడు. కాంపౌండరు మాట వినగానే శివరామయ్య వేళాకోళం చేసేడు. "కాంపౌండరు గారికి అత్తవారింటికి వెళ్ళడం అంటే కట్లు కట్టించుకోడానికే తప్ప మరెందుకూ కాదని అనుభవం కాబోలు..." మిత్రులు ముగ్గురూ నవ్వేరు. ఆ మాట మెలిక అర్థం కాదేమోనని సూర్య తేలిక అయిన తెలుగులోకి అనువదించేడు. "సాధారణంగా సావిట్లో దుడ్డుకర్ర వుంటుంది కాబోలు. పాపం పోనీ చీపురు కట్టయినా వాడమని చెప్పకపోయేరా?" కాంపౌండరు మండిపడ్డాడు. "మీరంతా ఎందుకిక్కడ వున్నారు?" రామనాధం వెక్కిరింతగా అతనిని వెనకవేసుకు వచ్చేడు. "పాపం ఏమీ అనకండర్రా. ఈ వెధవ కాంపౌండరీగిరీ కాస్తా పోతుందేమోనని ఆయన గుండెలు పీచుపీచుమంటూ వుంటాయి."--అని రెండు చేతుల వేళ్ళూ దగ్గిరికి తెస్తూ, తెరుస్తూ అభినయించేడు. శివరామయ్య చాలా జాలి కనబరుస్తూ....."చ్‌..చ్‌.. చ్చు" అన్నాడు. కాంపౌండరుకి వొళ్ళు మండిపోయింది. అతనికి సహాయనిరాకరణలూ అవీ తెలియవు. బ్రిటిష్‌ ప్రభుత్వం మీద సాగుతున్న ఈ వుద్యమం ఆ ప్రభుత్వం తెచ్చిపెట్టిన సామాజిక పరిణామాలమీద వ్యతిరేకతగా కనిపిస్తూంది. అతడు దిగువ కులాలకు చెందినవాడు. సమాజంలో అడుగున పడి నలిగిపోతున్న ఆ కులాలకి చదువు ఇంగ్లీషు ప్రభుత్వం వచ్చేకనే సాధ్యం అయింది. రామనాధమూ, మిత్రులూ అంత ఈసడింపుగా చూస్తున్న కాంపౌండరుగిరీయో, గుమాస్తాగిరీయో, బంట్రోతుపనో దొరుకుతూంది ఇప్పుడే. ఆ అవకాశాలు చూసి వోర్వలేక పైకులాలు చేస్తున్న అల్లరి తప్ప సత్యాగ్రహాలకు మరో ఉద్దేశం లేదని అతని విశ్వాసం. ఆ విశ్వాసంతోనే ఆ బ్రాహ్మణ కుర్రవాళ్ళ వేళాకోళాలూ, ఎకసక్కేలూ విని చర్రుమన్నాడు. ఆ కోపంలో నోరు జారింది. "యెదవ నాయాళ్ళంతా....." మాట పూర్తికాకుండానే గూబ అదిరిపోయేటట్లు ఛెళ్లున లెంపకాయ తగిలింది. పరధ్యానంగా, దూరంగా నిల్చున్న కానిస్టేబులు ఆ ధ్వనికి తిరిగి చూసేడు. మామూలు పద్దతిలో గేటులోంచి వెళ్లేటంత తీరుబడిలేక ఎవరో ఆవరణ గోడ దాటిపోతున్నది మాత్రం కనబడింది. ప్రశాంతంగా వున్న ఆసుపత్రి వరండా మరుక్షణంలో కేకలూ, గంద్రగోళంతో నిండిపోయింది. తగిలిన దెబ్బ అదురుకు మూతబడిపోయిన కళ్ళు తెరిచేసరికి కాంపౌండరు ఎదుట తన్ను కొట్టిన మనిషి కనబడలేదు. పోలీసు బంట్రోతుని ఆక్రోశించేడు. సూరయ్య గోడ దాటేసి సురక్షితమైనంత దూరంలో వున్నాడనిపించేక శివరామయ్య కాంపౌండరును ఓదార్చడానికి ప్రయత్నించేడు. "అల్లా మాటలు మిగలడం తప్పు కాదూ కాంపౌండరుగారూ. పాపం! దుష్టుడు ఎంత దెబ్బకొట్టేడూ, అయిదు వేళ్ళూ అంటిపోయేయి. చ్‌.చ్‌. చ్చు. కాస్సేపు కూర్చోండి. కొంచెం మంచినీళ్ళు...." ఆ పరిణామాలు చూసి రామనాధం చాల విచారపడ్డాడు. మిత్రులు నలుగురూ వచ్చిన హుషారులో కాంపౌండరును రెచ్చగొట్టడంలో తానూ చాలా దూరం వెళ్ళేననిపించింది. తానే కాంపౌండరుకు క్షమాపణ చెప్పుకొన్నాడు. కాని అతడు దెబ్బతిన్నవాడు. గూబ ఇంకా మండుతూంది. ఆ మంటలో క్షమాపణను స్వీకరించే మనఃస్థితిలో లేడు. "మీరంతా తోడి దొంగలు. కేసు పెడతా. జైలునేయిస్తా. మీ పేర్లు చెప్పండి." అతడు రాసుకొనేలాగ జేబులోంచి పెన్సిలు తీసి కాగితం కోసం వెతుకుతూంటే రామనాధం మిత్రులకు కన్ను గీటేడు. "కొనుక్కొస్తానుండు" అంటూ శివరామయ్య చరచర వెళ్ళిపోయేడు. అంతా అతనివేపు తిరిగివున్న క్షణంలో రామన్న తప్పుకొన్నాడు. ఈమారు రామనాధం బిర్రబిగిసేడు. "కేసు పెట్టుకో. పెట్టి తలకొట్టి మొలవేయిస్తావా యేం? నోరు కొవ్వి తిడితే వూరుకుంటారా?" కాంపౌండరు ఇంకా చల్లబడలేదు. అతనిని డబాయించి, గదిమి నోరునొక్కడానికి కొంతసేపు పట్టింది. అయితే అతని నోరు మూయించినా, తన మనస్సులోని ఆలోచనలను మూయించడం రామనాధంకు సాధ్యం కాలేదు. కాంపౌండరు కులానికి ఓ ఎరుకలి--అని విన్నాడు. అతను కలిపి యిచ్చిన మందుల్ని అన్ని కులాలవాళ్ళూ త్రాగుతున్నారు. తమ వూళ్ళో పూజారి సుబ్బన్న చెయ్యి ముట్టుకొని నాడి చూస్తే బట్టలు తడిపెయ్యాలిసి వస్తుందని అంత జ్వరంలోనూ బాబాయి శంకరశాస్త్రి చిన్నగావంచా కట్టుకొని చాపలో పడుకున్నాడు. ఓ మారు ఆ ఘట్టం జ్ఞాపకం వచ్చింది. సుబ్బన్న చెయ్యి చూడడం పూర్తి అయినా కదలడు. బాతాఖానీ ప్రారంభించేడు. ఆయనకు తెలుసును. తాను ముట్టుకొంటే ఈ శ్రోత్రియులు మైలపడ్డామనుకుంటారని. కాని వూళ్లో వైద్యుడు తాను, మంగలి వెంకన్న ఒకడు. అంచేత తప్పదు. తన్ను పిలుస్తారు. కాని, తన ఎదట బట్టలు తడిపించి అవమానం చెయ్యలేరు. కనక ఎంతో బాధగా వున్నా ఓర్చుకుని, ఆయన వున్నంతసేపూ ఆ గోచీతోనో, గావంచాతోనో క్రిందే పడివుండేవారు. వాళ్ళని ఏడిపించడానికి సుబ్బన్న ఆ కబుర్లూ, ఈ కబుర్లూ చెప్తూ ఓ అరగంట అయినా కూర్చునేవాడు. ఆ మాదిరి సమాజంలో ఈ కాంపౌండరు ఏ కులంవాడైనా, ఏ నీళ్ళిచ్చినా తాగుతున్నారు. ఇంత మార్పు ఇంగ్లీషువాళ్లతోనే వచ్చిందనడంలో సందేహం అక్కర్లేదు. వెనుకటి పద్ధతే సాగేటట్టయితే క్రింద కులాల వాళ్ళకి ఆపాటి చదువూ సాధ్యమయ్యేదా? ఆ మాత్రం పనేనా ఇచ్చేవారా? అసలు ఆస్పత్రులే వుండేవి కావు. వాళ్ళు ఉద్యోగం చెయ్యడం, మందులు ఇవ్వడంలాంటివేమీ జరిగేవి కావు. అవన్నీ ఇంగ్లీషువాడి పాలనతో వచ్చాయి. తాము అంతా ఇంగ్లీషువాడి పాలన పోవాలంటున్నారు. దానితోపాటు ఆస్పత్రులు మూసేస్తారా? తక్కువ కులాల వాళ్ళకి వుద్యోగాలూ, చదువులూ లాగేస్తారా?" వాళ్ళ చేతి మందు త్రాగడానికి నిరాకరిస్తారా? ఈ వాదనలనే తన బావ తెచ్చినప్పుడు అతడు వెక్కిరిస్తున్నాడనుకొన్నాడే గాని, దాని వెనుకనున్న సామాజిక వ్యగ్రత అతనికి అర్ధం కాలేదు. ఒక్కటి స్పష్టంగా తెలుసు. --మూసెయ్యరు, వుద్యోగాల్లోంచి తీసెయ్యరు. అంతేకాదు, ఇంగ్లీషువాళ్ళు తగినంత వేగంగా విద్యావ్యాప్తి కానివ్వడం లేదని, వృత్తి విద్యాలయాలు పెరగనివ్వడం లేదని, పరిశ్రమలూ అవీ పెట్టుకోనివ్వడం లేదని తాము అంటున్నారు. అయితే అసలు ప్రశ్న వేరు. వాళ్ళని మర్యాదగా చూడడం, వాళ్ళచేతి నీళ్లు త్రాగడం, వాళ్ళతో కలిసి భోజన భాజనాలలో పాల్గోవడం, కులాంతరుల మధ్య పెళ్ళిళ్ళు... ఇవన్నీ ఇంగ్లీషువాడి రాకతో వచ్చినప్పటికీ దేశంలోని సామాజిక వ్యవస్థకి సంబంధించిన ప్రశ్నలు. ఆ విషయంలో తాము ఏం చెయ్యాలి? ఏం చెప్పాలి? ఈ హెచ్చుతగ్గుల్ని పాటిస్తారా? పాటించేటంత కాలం కాంపౌండరు వంటివాళ్లు తమ మార్గానికి ఎదురే తిరుగుతారు. ఇంగ్లీషువాళ్ళ పంచ కాగుతారు. అయితే అవసరం కొద్దీ అన్ని కులాల మధ్యా హెచ్చుతగ్గులు లేవనడం మనస్సుకి ఒప్పిదం కాలేదు. సమానత్వాన్ని అంగీకరించడం మానవతాదృష్టి. హెచ్చుతగ్గులు లేవనడం జాగా ఎరిగి బైఠాయించడం. ఏది సత్యం? ఏదసత్యం? వర్ణాలూ, కులాలూ ఏమిటో? ఏదేశంలోనూ లేని పట్టింపులు మనదేశంలోనే ఎందుకు వచ్చేయో.... ఆ ఆలోచనలతో అతనికారాత్రి నిద్రే లేకపోయింది. నలభయి రెండు ఆ రోజున చీకటి పడే వేళప్పుడు బళ్ళో నుంచి వస్తూ వస్తూ జగన్నాధాచార్యులు గుమ్మంలో నిలబడే ఆ మధ్యాహ్నం తామంతా బళ్లో చేసిన వీర కృత్యాన్ని వర్ణించేడు. ఆ కథనంలో రామనాధం అరెస్టు సంగతి తెలిసి స్వరాజ్యం మ్రాన్పడి పోయింది. "ఎప్పుడు అరెస్టు చేశారు?" "ఏ వూళ్లో చేశారు?" "ఎందుకు చేశారు?" అనేక ప్రశ్నలు వేసింది. ఈ వార్తలేవీ ఆచార్లు ఎరుగడు. కనుక్కోలేదు. రామనాధం మేనల్లుడు తమ క్లాసులో వున్నాడు. మంచి తెలివైనవాడు. వాడు చెప్పేడు. వాళ్ల మామయ్య గాంధీగారి శిష్యుడు. అందుకు అరెస్టు చేశారు అని. తామంతా హర్తాళ్‌ చేయాలన్నాడు. చేసేశారు. వాళ్ళ మేస్టారు వేపబెత్తాలూ, చింతబరికలూ దొరికినంతవరకూ బాదేడు. అందర్నీ బెంచీ లెక్కించేసేడు. "అబ్బ, మా స్నేహితుడు ఎంతసేపు కొట్టినా ఏడవలేదు. మేస్టారికి నొప్పి పుట్టి, ఆయాసం వచ్చేసింది. అంతే, వాడు నవ్వుతూ బల్ల ఎక్కేసేడండీ." అంటూ ఆశ్చర్యం ప్రకటిస్తూంటే స్వరాజ్యం కళ్ళనీళ్లు తిరిగేయి. "రేపు మీ స్నేహితుడిని ఓమారు తీసుకురండి. నేనూ చూస్తాను. ఏం." బాలకృష్ణకీ తనకూ గల సన్నిహిత మైత్రిని గురించి జగన్నాధాచార్యులు పదినిముషాలు చెప్పేడు. ఆ స్నేహానికి గల బలమైన ఆకర్షణ ఎరిగిన స్వరాజ్యం నవ్వింది. "ఏం, నవ్వుతున్నారు? నేను నిజం చెప్తున్నాను. ఒట్టు." "ఊరికేనే నవ్వు వచ్చింది. కాశీమజిలీ కథలో వ్రాసిన తిరస్కరణీ మంత్రం తెలుస్తే ఇప్పుడెంత బాగుండునో..." అంది. ఆ మాటలోని ఎకసక్కేన్ని జగన్నాధాచార్లు అర్ధం చేసుకోలేదు. "ఎంతో బాగుంటుంది కదండీ!" -- అని ఒక్క ఎగురు ఎగిరి అరుగెక్కేసేడు. ఎగతాళి చేసి అతని వుత్సాహాన్నీ, చిన్నతనపు కలల్నీ అవమానం చేస్తూన్నట్లనిపించి, స్వరాజ్యం సర్దుకొంది. అతని ప్రక్కనే కూర్చుని ఆ ఆటలో తానూ పాల్గొంది. ఏదో మంత్రం చదివేసి ఎవ్వళ్ళకీ కనబడకుండా అయిపోగలుగుతే ఎంతెంత వీరకృత్యాలు చేయవచ్చో జగన్నాధం కలలు కనడం మొదలు పెట్టేడు. పుస్తకాలు అరుగుమీద పెట్టేసి ఊహాలోకాలలోకి తేలిపోయేడు. రామనాధాన్ని పెట్టిన గది తాళం ఎవ్వరికీ తెలియకుండా ఎత్తుకు తీసుకొచ్చెయ్యవచ్చు. తలుపు తీసి రామనాధాన్ని ముట్టుకుంటే తనతోపాటు ఆయన కూడా అదృశ్యమయిపోతాడు. తీసుకొచ్చెయ్యడం. మళ్ళీ తాళం వేసేసి ఎప్పటి చోటే పెట్టేస్తాడు. ప్రొద్దున్నే చూసుకుంటారు. ఏముంటుంది? తాళాలు ఎప్పటిలాగే వుంటాయి. రామనాధం వుండడు. కాశీమజిలీకథల్లో అటువంటివెన్నో చదివేడు. ఆ ఘట్టం అధికారుల్లో ఎంత గందరగోళం కలిగిస్తుందో అనేక రూపాలలో వర్ణించేడు. తిరస్కరణీ మంత్రాన్ని అంతకంటే ఎక్కువ దిగ్భ్రమ కలిగించేటట్లు వుపయోగించడం ఎలాగో అనేక పాఠాంతరాలతో వర్ణించేడు. చివరకు రామనాధం కేసులో తీర్పు చెప్పెయ్యగానే తమ మంత్రబలంతో మాయం చేసి తీసుకుపోవడం చాల బ్రహ్మాండంగా వుంటుందని ఆమె కూడా ఒప్పుకుంది. "అల్లాంటి మంత్రాలుంటాయా?" "అదేమిటండి. మంత్రాల్లో వున్న శక్తి చాలా గొప్పదండి. మా నాన్నకివి అన్నీ తెలుసునండి. కాని చెప్పమంటే నవ్వుతున్నారు." ఆ మంత్రాలూ, తంత్రాలూ వట్టి అబద్ధమనీ, చిన్న పిల్లల వూహాలోకాలు తప్ప వేరేమీ కావనీ చెప్పడం ఎలాగో ఆమెకు అర్ధం కాలేదు. "మీరు చిన్నవాళ్ళని చెప్పడం లేదేమో." జగన్నాధాచార్యులు తాను చేసిన పొరపాటూ, అందువలన దేశక్షేమం ఏలాగ నష్టపడుతూందో రహస్యంలా చెప్పేడు. డయ్యర్‌ను అవసరమయి అంతవరకూ వస్తే బ్రిటిష్‌ రాజును చంపెయ్యడానికి ఆ మంత్రం తనకి చెప్పమన్నాడు తండ్రిని. ఆ ఇద్దరి మధ్యలో ఎవ్వరెవ్వరిని చంపేస్తే గాని దేశం స్వాతంత్య్రం పొందదో అతనికి తెలియదు. "మరి వాళ్ళ పెళ్ళాం, పిల్లలు గోలెత్తిపోరా..." అంది స్వరాజ్యం. "అదే మా నాన్నగారూ అన్నారు. ఒకరికి బాధ కలిగించేలా మంత్రాన్ని ప్రయోగిస్తే అది మనకే ఎదురుకొడుతుందిట. అందుచేత చెప్పనన్నారు"-- అంటూ తాను తొందరపడి మనస్సులో మాట పైకి చెప్పెయ్యడంతో దేశానికే ఎంత నష్టం కలిగిందో తలుచుకొని దిగులు పడిపోయేడు. అతని మంత్రాల మీది వ్యామోహాన్ని వదల్చడానికి స్వరాజ్యానికి దారి దొరికినట్లనిపించింది. "కాదా మరి." జగన్నాధాచార్లు చాల సులభంగానే సంతృప్తి పడ్డాడు. కాని, తరవాత బాలకృష్ణ వేసిన పేచీ విన్నప్పుడు ఆశ్చర్యం కలిగించింది. "ఉపయోగించకూడనిది ఇంక వుందనుకోవడం ఎందుకూ?" ఆ మంత్రాల కోసం వారం వారం రెండేసి రోజులు మిట్ట మధ్యాహ్నం చేలగట్ల వెంబడి పడి మూడేసి మైళ్ళు రావడమూ, గంటల తరబడి అరుగులమీద పడి వుండడమూ జ్ఞాపకం వచ్చింది. "ఆచార్లువన్నీ కోతలండీ!" "ఎల్లా చెప్తావు?" అని స్వరాజ్యం ప్రశ్నించింది. "బెడిసి కొడితే నష్టపోయేది మనం ఒక్కళ్ళమే కదా. ఇంగ్లీషు వాళ్ళ పీడ దేశానికి వదిలిపోయేటప్పుడు మనకొక్కరికీ నష్టం కలిగితే మాత్రం ఏం?" "ఏ ఒక్కళ్ళకీ నష్టం కలగకూడదని కదా...." "అల్లా వూరుకున్నా ఆగిందా? పంజాబులో ఎంతమంది చచ్చిపోయేరు? ఒక్క జలియన్‌వాలా బాగ్‌లోనే రెండు వేలమంది చచ్చిపోయేరు కదా...." ఎవ్వరికీ నష్టం కలగకుండా ఏదో చేస్తామన్నది అబద్ధం అన్నాడు. మంత్రంలో పస లేదు. కనుకనే దానిని దాచిపెట్టేటందుకు బెడిసికొడుతుందన్నారన్నాడు. చేతబడులూ, శకునాలూ గురించి వీరేశలింగం పంతులుగారు వ్రాసిన ప్రహసనాలు చాల బాగున్నాయని అతడు చెపుతూంటే స్వరాజ్యం చాల ఉత్సాహపడింది. "నాన్నగారూ! బాలకృష్ణ" అని పిలిచింది. మేస్టారు కొట్టిన దెబ్బలకి అదిరిపోయి జ్వరం పడినందుకు అనుతాపం తెలిపి నాయుడు ముందు కర్తవ్యం తెలిపేడు. "అల్లా చిన్న చిన్న వానికి లొంగిపోకుండా శరీరం గట్టి పరచుకోవాలి పంతులుగారూ!" ఆ ఆలోచన కుర్రవాళ్ళకి అప్పటికే తట్టింది. "ఈ వేళనే మా తాతయ్య చాకలి చెరువుమీది ఇంటి వెనకాల ఇసకపోసి గోదా తయారు చేయించేడు. నాయుడు చాల ఆనందపడ్డాడు. "అమ్మా!" "నాన్నా!" అని తానక్కడే వున్నట్లు స్వరాజ్యం సమాధానం ఇచ్చింది. "ఆ మూల గదిలో అటకమీద నేను చిన్నప్పుడు చేయించుకున్న కరేళాలూ, డంబేల్సూ వుండాలి. సూరాయికిచ్చి పంపించు తల్లీ." రెండోభాగం ఒకటి పది నెలల అనంతరం రామనాధం గన్నవరం రేవులో దిగేడు. జైలుశిక్ష అనుభవించినది ఆరు నెలలే అయినా ఎన్నో ఏళ్ళు గడిచినట్లుంది. తెల్లవారే ముందర మసక వెలుతురులో ఆ పరిచిత ప్రదేశాలు చూస్తూంటే చిరకాలం జబ్బుపడి లేచి, మొట్టమొదటి మారు వీధిముఖం చూసినవానికి కలిగే ఆనందం అనుభూతం అయింది. ఆ రోజున తనతో చిరతపూడి నాయుడుగారి భార్యా, కూతురూ కూడ వున్నారు. వాళ్ళు ఎంతో ఆప్యాయంగా మాట్లాడేరు.... వాళ్ళ బండీ వెనకనే నడిచి వస్తూంటే తనకు ఎదురుదెబ్బ తగిలిందిక్కడనే, స్వరాజ్యం ఎంత నొచ్చుకుంది. బండి ఎక్కేవరకూ వూరుకోలేదు. అక్కడే ముగ్గు తీసుకొని కట్టుకట్టింది. అంత మంచి అమ్మాయి. కాని తన బాబాయి ఆరోజున ఆ మాట అన్నాక వాళ్ళ యింటికి వెళ్లి ఓ మారు పలకరించి రావడం కూడా మంచిదనిపించలేదు. ఆ అమ్మాయికి అప్రతిష్ఠ కలిగించినవాడినవుతాననుకొన్నాడు. ఒక్కమారు ఎరిగిన ముఖాల్నీ, స్నేహితుల్నీ వెళ్ళి చూసి రావాలని వున్నా చిరతపూడికి రాస్తా బందయిపోయినట్లే తోచింది. * * * * * ఈ ఆరేడు నెలలలో అభిమానించే ముఖాలకోసం వాచిపోయినట్లయింది. హాస్పిటలులో కాంపౌండరును అతని మిత్రుల కొట్టేక రామనాధాన్ని మరి హాస్పిటలుకు పోనియ్యలేదు. ముంగండ వాళ్ళు మళ్ళీ ఏమీ అల్లర్లు చెయ్యకుండా విచారణలకు ఎవ్వరినీ కోర్టు చుట్టుపక్కలకు రాకుండా నిషేధించేరు. కోర్టుకు తెచ్చేటప్పుడు చేతులకు బేడీలు వేసి, గట్టి బందోబస్తులో తీసుకెళ్ళారు. విచారణ కూడా దడదడా పూర్తిచేసేశారు. ఆరు నెలలు కఠిన శిక్ష వేసేసి ఆ రాత్రికి రాత్రి కోటిపల్లి కాలవ పడవలో రాజమండ్రి చేర్చేసి, తెల్లవారేసరికి రాజమండ్రి సెంట్రల్‌ జైలులోకి పంపేసేరు. అమలాపురంలో తనకు కనిపించిన తన వాళ్ళు ఇద్దరే ఇద్దరు. తన మామగారు. పెదతండ్రి కొడుకూను. కాని, ఆ ఇద్దరూ తనకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వడానికి వచ్చినవాళ్ళు. వాళ్ళు గాక తన వూరివాళ్ళు, మిత్రులూ, బంధువులూ ఎవ్వరూ కోర్టుకి కూడా వచ్చినట్లు లేదు. వస్తే పోలీసువాళ్లు పంపేసేరో, లేక జైలులో పడ్డందుకు చూడడం అప్రతిష్ఠ అనుకొన్నారో? తన స్నేహితుల్ని గురించి ఆ అపనమ్మకం లేదు. కాని పల్లెటూరులో....ఏమో.... జైలుకి వెళ్ళడం పల్లెటూళ్ళలో మహా అప్రతిష్ఠాకరమైన పని. హత్యలు చేసిన వాళ్లు, అప్పులు ఎగబెట్టినవాళ్లు, మోసగాళ్లు అటువంటి సమాజ వ్యతిరేకులయిన వాళ్ళే జైళ్ళకి వెడతారు. రాజకీయ కారణాలక్కూడా జైళ్ళలో వుండడం పరిపాటి కాదు. అలాంటివాళ్లు తానున్న ఈ ఆరు నెలలలోనూ జైలులో తగలలేదు. తనకు కనిపించిన వాళ్ళంతా దొంగలూ, ఒకటో రెండో ప్రాణాలు తీసినవాళ్ళూ, పచ్చి మోసగాళ్ళూను. వాళ్ళంతా తన్ను తమ తోడిదొంగగానే లెక్కేసేరు. అయితే తన భాష, అలవాట్లు చూసి కాస్త ఘరానా దొంగగా జమకట్టేరు. అంతే. జైలు క్యాంటీన్‌లో అడుగుపెట్టిన మరు నిముషంలోనే వాళ్ళు తన కేసు సంగతి వాకబు చేసేరు. ఏం చెప్పాలో తెలియలేదు తనకు శిక్ష వేసిన నేరం తాను చెయ్యలేదు. మరేం చేసినట్లు? ఎందుకు వచ్చినట్లు? ఎవరో గాంధీ చదువు మానమనడం ఏమిటో, అది విని తాను చదువు మానేస్తే దేశానికి వుపకారం ఏమిటో, ఇంగ్లీషువాళ్ళని దేశంలోంచి పొమ్మనడం ఏమిటో, ఎందుకో వాళ్ళకేమీ అర్థం కాలేదు. సర్కిల్‌ ఇన్‌స్పెక్టరు అతని మామగారనీ ఆయన అతని మీద కేసు పెట్టించేడనీ, అదేదో అల్లుడు, మామల మధ్య తగాదాగా మాత్రమే కనబడింది. "కసికొద్దీ మేనమామను, మావూళ్ళో సుబ్బయ్య షావుకారు అప్పుకోసం జైలులో పెట్టించేడు, నెలకో ఎనిమిదో, పదో చేతిడబ్బు కట్టుకొని ఓ ఏడాది కాబోలు జైలులో వుంచేడు." అని ఒక ఖైదీ అల్లుడు మామల మధ్య తగాదాలెంత క్రూరంగా సాగుతాయో వుదహరించేడు. సెంట్రల్‌ జైలు లోపలికెళ్ళాక అక్కడివాళ్ళకి అతని కథ ఆద్యంతమూ అబద్ధంగానే కనిపించింది. సర్కిల్‌ ఇన్‌స్పెక్టరు అతని మామగారా? భార్యతో మాట్లాడడానికి వెళ్ళేడు. మాట్లాడడం జరగలేదు గాని ఆయన చేత దెబ్బలు తిన్నాడు, పైగా అబద్ధపు కేసా, ఆరు నెలల శిక్షా... అబద్ధం ఆడడం కూడా బాగా చేతకాని పసిపిల్లకాయనుగా జమకట్టారు. ఒక్కడూ సానుభూతి చూపలేదు. గొల్లున నవ్వేరు. వాళ్ళలో ఒక శుద్ధమొండి వేళాకోళంగా అనేశాడు కూడాను. "కన్నం వెయ్యడానికి వెళ్లి, అక్కడ కంటికి నదరుగా పిల్ల కనిపిస్తే అది పెళ్ళాం అనుకోకూడదు. అలా అనుకున్నావు. చూడు తిన్నగా అత్తారింటికి పంపేశారు." అయితే అందరూ ఒకందుకు మెచ్చుకున్నారు. పట్టపగలు సర్కిలినస్పెక్టరు ఇంటిలో దొంగతనానికి అంత జబర్దస్తీగా వెళ్ళగలిగాడంటే... సామాన్యం కాదు. మంచి గుండె ధైర్యం కలవాడై వుండాలనే అభిప్రాయానికి వచ్చేరు. కాని ఆ అభిప్రాయాన్ని రామనాధం హర్షించలేకపోయాడు. అతడు మరేమీ చెప్పలేదు. కాని చెప్పింది చాలు, వార్డర్లతో సహా అందరికీ తెలిసింది. అందరూ నమ్మని వాళ్ళే. పైగా తానేదో గొప్పతనం నటిస్తున్నాడని అపనమ్మకం ఏర్పడింది. చులకన చేయడం ప్రారంభించారు. వాళ్ళ మధ్య ఈ ఆరు నెలలూ జీవితం మహా దుర్భరం అనిపించింది. జైలులోకి వచ్చిన మరునాడే ఈ వార్డరు ఒక చీటీ తెచ్చి యిచ్చేడు. ఎవరు పంపేరో తెలియదు. తరువాత తెలిసింది. వెన్నేటి సత్యనారాయణగారు పంపేరని. అప్పటికి ఆ సంగతి తెలియదు. వ్రాత కూడా గుర్తుపట్టనూ లేదు. అందులో వున్నదొక సీసపద్యం. అది తానిదివరకు విన్నదే. చిలకమర్తి లక్ష్మీనరసింహంగారు వ్రాసింది. పాత దొంగలగుంపు బంధువర్గము మాకు పచ్చ జొన్నలకూడు పాయసంబు బలుకాలి సంకెళ్ళు బిరుదుటందెలు మాకు మురికి యోడెడి టోపి బొమిడికంబు.... ఆ పద్యం చదువుకొని అడుగడుగునా హుషారు తెచ్చుకోడానికి ప్రయత్నించేడు కాని.... ఆ దొంగల గుంపును బంధువర్గమూ అనుకోలేకపోయాడు. పచ్చజొన్నల సంకటి పాయసమూ కాలేదు. వాళ్ళు చెప్పుకొనే మాటలు, వాళ్ళ సంతోషాలు, ఏడ్పులు ఏవీ అతనిని కదిలించలేకపోయాయి. చిన్నచిన్న కొట్లాటలని ఇంగ్లండు జర్మనీ యుద్ధాలనుగా వర్ణించేవారు. వందలమైళ్ళ రంగంలో కొన్ని వేల సైన్యాల్ని నడిపించిన సేనాధిపతి పాత్రను అభినయించేవారు. మరికొందరుండేవారు. ఏదో మారుమూల తపస్సు చేసుకొంటూంటే పట్టి లాక్కొచ్చినట్లు చెప్పుకొనేవారు. అదంతా అబద్ధమని ఆ మాటలలోనే కనిపించేది... వాళ్ళ దగ్గరకెళ్ళడం, మాట్లాడ్డం కూడా ఎబ్బెట్టుగానే వుండేది. జొన్న సంకటికి తుప్పు వాసన తప్ప పాయసం వాసనేనా వుండేది కాదు. రుచి మాట ఎట్లా వుండనీ పైగా రోగం తెచ్చి పెట్టింది. రోగం వచ్చినా గానుగ తిప్పడం తప్పలేదు. పద్యంలోని 'బంధువర్గం' అందరూ ఆపని నుంచి తప్పించుకొనేవారు. ఆ నేర్పు తనకు పట్టుబడలేదు. తనవంటి అభాగ్యులే మరికొందరుండేవారు. కిచెన్‌లో పనిపడ్డా తమకు కుండీలో పోసిన జొన్నలు తొక్కి కడిగే పనే పడేదిగాని మరోపని పడేది కాదు. ఒక్క అరగంటలో అరికాళ్ళు మంట పుట్టేవి. ఆ పనయ్యేసరికి చర్మం అంతా కొట్టుకుపోయి ఒకే ఒక పుండుగా వుండేది. మళ్ళీ కుండీలో దిగడం మాట అటుంచి ఓ వారం రోజులవరకూ కాలు నేలమీద పెట్టలేకపోయేవాడు. కాని కర్రపోట్లతో లేవక తప్పేది కాదు. బరువుపని తప్పించుకొనే నేర్పు పట్టుబడని వాళ్ళు అతనితో మరికొందరుండే వారు. అయితే వారితో కూడా అతడు దగ్గరగా వుండలేకపోయాడు. అతని చదువు దానికో పెద్ద ఆటంకమయిపోయింది. జైలు గేటులో అతని దుస్తులిచ్చేసేరు. ఆ పంచె కట్టి, లాల్చీ తొడుక్కున్నాక తానూ మనిషినయ్యాననిపించింది. పడవ ఖర్చుకంటూ ఇచ్చిన పావలా డబ్బులు వాకిట్లో వార్డరు చేతిలో పడేశాడు. అటూ ఇటూ చూసేడు. ఎరిగివున్న ముఖం ఒక్కటీ కనిపించలేదు. ఆ రోజున తనతో విడుదలయినవాళ్ళు నలుగురైదుగురున్నారు. వాళ్ళందరినీ భార్యలో, పిల్లలో, అన్నదమ్ములో, తల్లిదండ్రులో ఎవరో ఒకరు తీసుకెళ్ళడానికి వచ్చి వున్నారు. తనకోసమే ఎవరూ రాలేదు. తనతోబాటు విడుదలయినవాడొకడు అడిగేడు. "ఎవ్వరూ రానట్లుందే పాపం!" అంటూనే విసవిసా బయట రోడ్డుమీద వున్న భార్యను కలుసుకొనబోయేడు. రామనాధమూ రోడ్డుమీదకు వచ్చేడు. అటూ ఇటూ మర్రిచెట్లతో రోడ్డు చీకటి చీకటిగా వున్నట్లుంది. ఎదురుగా రోడ్డు మీదికంటా శీతాఫలం చెట్లు గదుముకు వచ్చి అడవి మధ్యలోకి వచ్చినట్లు అనిపిస్తున్నాయి. ఆకాశంలో మబ్బులు కమ్ముకు వస్తున్నాయి. గబగబా పట్టణం వేపు నడక అందుకున్నాడు. దానవాయిగుంట దాకా వచ్చేసరికి తడిసిపోయేడు. జాంపేటకి వచ్చేసరికి ఇంక వేగంగా నడవవలసిన పనిలేదనిపించింది. నిలువున నీళ్ళోడుతున్న వానికి తడుస్తామనే భయం ఎందుకు? రాజమండ్రి పట్టణంలోకి వచ్చేక ధైర్యం పుంజుకుంది. బట్టలు మార్చుకొన్నాడు. శుభ్రమైన భోజనం కడుపులో పడింది. ఆతని గౌరవార్ధం సాయంకాలం టౌన్‌హాలులో సభ జరిగింది. వర్షం మూలంగా హెచ్చుమంది రాకపోయినా వచ్చినవాళ్ళు చాలు, అతనిలో వుత్సాహం రేకొనడానికి. జైలుకెళ్ళడం "గౌరవమే గాని, లాఘవము కాదు" అని చిలకమర్తి లక్ష్మీనరసింహంగారే దిలాసా ఇస్తూ వుంటే మనస్సు కుదుటపడింది. రాత్రి భోజనం చేసి కూర్చున్నప్పుడు సుబ్బమ్మగారే కదిపింది. ఏడెనిమిది నెలల క్రితం తీసుకువచ్చిన సమస్య ఏమయిందో ఆమె ఎరగదు. "తమ్ముడూ! మరదలుపిల్ల ఎక్కడుందిరా?" జరిగిన ఘటనలన్నీ విన్నాక ఆమె అనుతాపం తెలిపింది. అప్పుడాతడు తన నిర్ణయం తెలియపరచేడు. మామగారి చేతిలో ఆ అమర్యాద జరిగేక అతడు అసలు తనకు పెళ్ళి అయిందనీ, తనకో భార్య వున్నదనీ చెప్పుకోడానికి ఉత్సాహం చూపడం లేదు. ఆ విషయమే మరచిపోవాలనుకుంటున్నానన్నాడు. కాని సుబ్బమ్మగారు అంగీకరించలేదు. పైగా 'అభం-శుభం ఎరగని ఆడపిల్ల జీవితం పాడుచేస్తావట్రా....' అని కోపం చేసింది. "ఆ అమ్మాయి నిన్నేమన్నా అందా?" "లేదు కాని, అభిమానమూ చూపలేదు." "అంటే?" "అభిమానం చూపే మార్గాలు బోలెడు." భారతదేశంలో ఆడపిల్లల పరిస్థితుల గురించి సుబ్బమ్మగారు ఎంతో ఆవేశంతో వర్ణించింది. "వాళ్ళని ఉంచే కట్టడీ, పెట్టే ఆరడీ ఎరగవుట్రా....." అంది. చట్టున స్వరాజ్యం, మంగమ్మా అతని మనస్సులో మెదిలేరు. తాను వెళ్ళినప్పుడు సుందరి చూపిన ఆదరణ గుర్తు వచ్చింది. కొంచెం మెత్తపడ్డాడు. "వాళ్ళు పంపరు." "వెళ్లి తీసుకొచ్చెయ్యి." "ఆమె రాదు. నే వెళ్లను." రామనాధం మనస్సులోని అభిమానం ఆమెకు అర్ధం అయింది. అతడు వెళ్ళి తీసుకురాడు. ఆమె తండ్రి పంపడు. ఆ రెండింటిలో ఏ ఒకటన్నా జరగకుండా తెలుగుదేశంలో ఆడపిల్ల తనంతగా సాహసం చేసి భర్త వద్దకు వచ్చెయ్యడం జరగగల పని కాదు. "మీ బాబాయెవరో వున్నారన్నావు కదూ?" తాను జైలులో పడిన రోజు సాయంకాలం ఆ బాబాయి తన అత్తవారింటికి వెళ్ళి అవమానపడిన విషయం గుర్తు వచ్చింది. అక్కడికి మళ్ళీ వెళ్ళమనలేడు. ఆయన వెళ్ళరు కూడా. "నీకు దగ్గరగా వుండే వాళ్ళ వాళ్ళే ఎవరూ లేరూ?" తన బావమరిదీ, ఆయన భార్యా వున్నారు. వాళ్ళకీ ఆ గుమ్మంలో అడుగుపెట్టడం 'మనా'యే. సుబ్బమ్మగారు ఆలోచించింది. "మనం ఏ పని తలపెట్టినా ముందు దెబ్బ తగిలేది ఆడదానికి. పోనీ అని ఆ దెబ్బ తట్టుకొనే అవకాశమన్నా ఆమెకుండదు." కాని రామనాధం సంతృప్తి పడలేదు. తనవంతు పని తాను చేశాడు. ఆమెను బయటకు తీసుకురావడానికి సిద్ధం అయ్యేడు. ఆ ప్రయత్నంలోనే అవమానం పాలయ్యేడు. జైలులో నానా బాధలూ పడ్డాడు. ఆ రోజుల్లో ఒక్కమారు, సబ్‌జైలు ఇంటికంతదూరంలో వున్నా, ఆమె ముఖం చూపించలేదు. అతని అభిమానం చూసి సుబ్బమ్మగారు నవ్వింది. ఇవ్వాళ తన కోసం జైలు బయట ఎవరన్నా వుంటారేమోనని చూసేడు. సుబ్బమ్మగారు చిన్నపుచ్చుకుంది. "నువ్వు ఈవేళ విడుదల అవుతావని తెలియదు. ఇంకో వారం రోజులు తరవాత గాని విడుదల చెయ్యరనుకున్నాం." ఆమె గాని, ఇతర కాంగ్రెసు వారు గాని జైలు వద్దకు వచ్చి ఎదురు సన్నాహం చేయలేదని ఆతడనలేదు. కాని తన మాటకు ఆ అర్థం రావడంతో రామనాధం సిగ్గుపడ్డాడు. "నేనన్నది అది కాదు." కాని, ఈమారు సుబ్బమ్మగారింకో దిశ నుంచి తన అభ్యంతరాన్ని ఎదుర్కొంది. "నీ వయస్సెంత?" హఠాత్తుగా వేసిన ఆ ప్రశ్న ఎందుకో అర్ధంగాక రామనాధం బిక్కమొగం వేసేడు. "నీకంటె ఆమె ఎంత చిన్న?" "నువ్వు ఏం చదువుకొన్నావు? ఆమె చదువు ఏపాటిది?" "పడవ ఖర్చుకన్నా పావలా డబ్బులు ఆమె వద్ద వుంటాయా?" "అంత నిస్సహాయ స్థితిలో వున్న చిన్నపిల్ల మీదనా ఆ కసి" అంటూంటే రామనాధం ఆలోచనలో పడ్డాడు. సుబ్బమ్మగారు అంతతో వదలలేదు. "ఈవేళ మీ తమ్ముడిని చూసి వచ్చేనన్నావు కదూ" అంది. మధ్యాహ్నం భోజనం కాగానే అతడు మొదట చేసిన పని కాలేజీ హాస్టలుకి వెళ్ళి తమ్ముడిని చూడడం. నామీద సాక్ష్యం చెప్పినా నీమీద కోపం లేదు సుమాయని చూపదలచేడు. వెళ్ళేడు. అతని రాకకు వెంకటరమణ సిగ్గు పడలేదు. వుత్సాహమూ చూపలేదు. కించిత్తు అయిష్టం చూపేడనిపించింది. తనతో సంబంధం వుందంటే వచ్చిన సెలక్షన్‌ కాస్తా తప్పిపోతుందేమోననుకొంటున్నాడనిపించింది. ఓ నిముషం కూర్చున్నాడు. "మీ అమ్మతో ఏమన్నా చెప్పమంటావా?" అన్నాడు. "ఏమీలేద'నిపించుకుని లేచి వచ్చేడు. సహాయనిరాకరణంలో అసూయాద్వేషాలకు తావు లేదన్న గాంధీగారి మాటను అమలులో చూపడానికే అతడు వెళ్ళేడు. "అటువంటి ఉదారాశయాలు గలవాడివి. నీకేమి అపకారం చేసి వుండని అసహాయురాలి మీదనా కక్ష....." రామనాధం సిగ్గుపడ్డాడు. ఈమారు నిజంగానే సిగ్గుపడ్డాడు. "మళ్ళీ ప్రయత్నిస్తాను." ఆమె సంతోషించింది. ఎల్లా చేస్తావు? ఏమి చేస్తావని అడగలేదు. ప్రయత్నిస్తానన్నాడు చాలు. ప్రయత్నిస్తాడు. అభినందించింది. * * * * * ప్రయత్నిస్తానన్నాడేగాని ఎలా ప్రయత్నించాలో అతనికీ తెలియదు. .....ఊరు సమీపించేడు. ఆ రోడ్డు మొగలో స్వరాజ్యం సెలవు తీసుకొంటూ తమ వూరు రమ్మంది. ఆ మాట విన్న తన మిత్రుడు వేళాకోళం చేసేడు. అన్నీ గుర్తు వచ్చేయి. "ఏం మనుష్యులు?" అనుకొన్నాడు. ఆ రోజున వాళ్ల స్వరాజ్యం కాపురం ఫొక్తు పరచడానికెళ్ళేరు. "ఇప్పుడు నా కోసం వెడతారేమో" అనుకున్నాడు. నవ్వు వచ్చింది. ఆ ఆలోచనే నవ్వుతాలుగా కనిపించింది. రెండు చేతిలో వున్న రైలుసంచి తోటలో పాకలో పడేసి రామనాధం సరాసరి ఇంటికి బయలుదేరాడు. పెద్ద పావంచాల రేవులో బట్టలుతుక్కుంటున్న ఆడవాళ్ళు ఆతన్ని చూడగానే తమ చేతిలో పని నిలిపి తిరిగి చూసేరు. పలకరించేరు. "ఎప్పుడొచ్చేవురా? బాగున్నావా?" రామనాధం ప్రాణం లేచివచ్చినట్లయింది. నిలబడ్డాడు. వాళ్ళ ప్రశ్నలకి సమాధానం ఇస్తూ మరల బయలుదేరేడు. వెనకనుంచి సానుభూతి, సానుతాపం వినబడుతూంటే నవ్వొచ్చింది. "ఏమిటో, దురదృష్టం కాకపోతే, ఏమిటి? ఏదో పెద్ద వుద్యోగస్థుడవుతాడనుకొంటే ఇల్లా అయ్యేడు, జైళ్ళూ......" మిగిలిన మాటలు రాతి మీద బట్టలు బాదిన చప్పుళ్ళలో కలిసిపోయేయి. ఇంటికి వచ్చేసరికి శంకరశాస్త్రి అరుగు మీదనే కూర్చుని వున్నాడు. వ్యాసపీఠం మీద పుస్తకం వుంది. రామనాధం, ధర్మశాస్త్ర గ్రంథం తిరగేస్తున్నట్లు గ్రహించేడు. మెట్టుమీద అడుగుపెడుతూ, పలకరించబోయేసరికే శంకరశాస్త్రి తల ఎత్తి చూసేడు. పలకరించేడు. "ఎప్పుడు విడుదలయ్యేవురా? ఒంట్లో ఏం లేకుండా వున్నావా? రా. కూర్చో." సమాధానం వినిపించుకోకుండానే లోపలున్న భార్యను పిలిచేడు. "ఏమేవ్‌! ఏం చేస్తున్నావు? రావే. రా. ఇడిగో మన అబ్బిగాడు వొచ్చేడు." తనను ఇంట్లో అడుగు పెట్టకుండా చేసే ప్రయత్నం ఆ పలకరింపులోనూ, పిలుపులోనూ గమనించి రామనాధం గతుక్కుమన్నాడు. రాత్రి పడవలో వచ్చేటప్పుడు మంచినీళ్ళు అవసరమయ్యాయి. అంతసేపు తన కబుర్లు వింటూ హుషారు చేస్తున్న సరంగు చేద ముట్టుకుంటే మరి ఆవల పారెయ్యవలసి వస్తుందనేశాడు. అది తాటాకుతో కట్టింది. తడిసి నాని వుంది. రామనాధం బ్రాహ్మడు. మామూలు పరిస్థితులలో దానిని ఉపయోగించితే అతడు మైలపడతాడు. కాని, జైలు నుంచి వస్తున్నాడు. ఇప్పుడాతడు ముట్టుకొంటే ఆ చేద మైలపడుతుంది. ఆ జ్ఞాపకంతో రామనాధం మనస్సు చివుక్కుమంది. నిలబడిపోయేడు. భర్త పిలుపు విని రాజమ్మ ఇంట్లోంచి పరుగెత్తి వచ్చింది. కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ--"వచ్చేవురా నాయనా!" అంటూ అతని చుట్టూ అలగం తొక్కింది. "ఎల్లా వున్నావురా? ఎన్నాళ్ళయిపోయిందిరా!" అని కళ్లు తుడుచుకొంది. ఆమె మడి కట్టుకొని వంట చేసుకొంటూంది. పొయ్యి దిగమండి పోతూంది. ఆతణ్ణి నాలుగు కబుర్లూ అడగడానికి తీరుబడిలేదు. దగ్గర కూర్చోడానికీ లేదు. "కూర్చోరా. పొయ్యి మీది అన్నం దింపేసి వస్తా. కూర్చో." కూర్చోమనే గాని లోనికి రమ్మనలేదని అతడు గ్రహించేడు. ఆమె లోపలికి వెళ్ళింది. శంకరశాస్త్రి లేచేడు. అరుగుమీది గది తలుపు తెరిచేడు. "తర్వాత అన్నీ మాట్లాడుకుందాం. బట్టలు ఇందులో పెట్టుకో. స్నానం చేసిరా. నూతిదగ్గరికి గంత తలుపు తెరుస్తా. భోజనం చేసేక....." జైలుకి వెళ్ళివచ్చిన తనకి అగ్రహార సమాజంలో స్థానమేమిటో స్పష్టమైంది. తనను ఇళ్ళల్లోకి రానివ్వరు. రాత్రి సరంగు అభ్యంతరానికి కనిపించని అవమానం ఇప్పుడు తోచింది. ఈ పిలుపులూ, ఏర్పాట్లూ చూశాక తాను ఇంటికి ఎందుకు వచ్చేనా అనిపించింది. తోటలో వుండిపోవలసిందనుకొన్నాడు. అయితే భోజనం సమస్య. అక్కడ ఏ విధమైన ఏర్పాట్లూ లేవు. అయినా సరే ఇక్కడ ఇంక భోజనం చెయ్యవద్దనుకొన్నాడు. "ఎందుకు? నా బట్టలూ, పాతలూ తోటలో మకాంలో పడేశాను. మళ్ళీ ఇప్పుడీ గది ఎందుకు? అక్కడే వుంటాను." శంకరశాస్త్రి అర్థంకానట్లు వెనక్కి తిరిగి చూసేడు. "భోజనానికి అంత దూరం నుంచి వస్తూ పోతూండడం కష్టం. వర్షాలు కూడాను. అదీగాక రెండు రోజుల పనికి...." ఈమారు రామనాధం తాను వంట కూడా అక్కడే చేసుకొంటానని స్పష్టం చేశాడు. కప్పు కురుస్తూందంటే నాలుగు ఆకులు దోపిస్తానన్నాడు. కట్టెపుల్లలు అన్నీ తడిసి వుంటాయి చేసుకోలేవంటే చెట్లక్రింద వుంటున్న వాళ్ళంతా వంటలు చేసుకోవడంలేదా అన్నాడు. శంకరశాస్త్రికీ కష్టం అనిపించింది. ఆ సమాధానాలు ఆతనికి నచ్చలేదు. అతని అభిమానం అర్థం అయింది. "ఎంతయినా బ్రాహ్మలం కదా? జైలుకి వెళ్ళి వచ్చేవు...." అన్నాడు. ఈ ఏడెనిమిది నెలల్లో రామనాధం మానసికంగా పది పదిహేనేళ్లు పెరిగేడు. వెనకటి బెదురు, సంకోచం లేవు. ఏడాది క్రితం ఇవ్వలేని సమాధానాలు నేడు శంకరశాస్త్రి వింటున్నాడు. "ఏ పని చేసినా జైళ్ళకు వెళ్ళకుంటే మన బ్రాహ్మణ్యం నిలబడుతుందన్న మాట." శంకరశాస్త్రికి సమాధానం ఏమీ తోచలేదు. విసువు కలిగింది. రామనాధం వచ్చిన వార్త విని ఆ వీధిలో వాళ్లు నలుగురూ చేరేరు. తండ్రీ కొడుకుల అభిమానాలు గ్రహించి కుర్రవానిని ఓదార్చడానికి ప్రయత్నించేరు. "ఇంక రెండు రోజులు. ఇంతలో నువ్వు వంటేమిటి? తోటలో మకాం ఏమిటి?" రామనాధం వాళ్ళ ముందు తన అభిమానం ప్రకటించకూడదనుకొన్నాడు. కాని తన పట్టుదల వదలదలచుకోలేదు. "నేను వండుకోగలను. జైలులో పులుసూ, కారమూ లేని చప్పిడికూడు తినడం అలవాటయింది. మజ్జిగ, పెరుగు, నెయ్యి, నూనె ఏమీ పనిలేదు. ఆపాటి వంట కష్టం కాదు." ఎవరెన్ని చెప్పినా ఆతడు వినిపించుకోలేదు. శంకరశాస్త్రి ఇంక లాభంలేదనుకొన్నాడు. "పోనీ, ఈపూట స్నానం చేసి జంధ్యం మార్చుకో. ఇదిగో పట్టుకెళ్లు" అంటూ వ్యాసపీఠం మీద పుస్తకంలో గుర్తుగా పెట్టిన జందెంపిడి చేతిలోకి తీసుకొన్నాడు. జైలులోకి అడుగుపెడుతున్న క్షణంలో గార్డు రూమ్‌ ముందు కూర్చోబెట్టి తన బట్టలతో పాటు తన జంధ్యాన్ని కూడా తీసేసుకున్న మాట రామనాధానికి జ్ఞాపకం వచ్చింది. ఆనాటి వరకూ ఆతడు దానినెంతో భద్రంగా వుంచుకున్నాడు. సంధ్యావందనం ముప్పొద్దుల నుంచి రెండు మార్లయి, కేవలం ఉదయకాలానికి మాత్రమే పరిమితమయి పోయింది. కాని, తన కుల చిహ్నంగా దానిని కాపాడుకొంటూనే వచ్చేడు. ఇప్పుడు దానిని నిలుపుకోవడం సాధ్యం కాలేదు. లాక్కున్న బట్టలకి జైలు బట్టలిచ్చేరు. కాని జంధ్యానికి ప్రత్యామ్నాయంగా ఏమీ యివ్వలేదు. ఖైదీ నెంబరు వేసిన కర్రబిళ్ళ ఇచ్చారు. అయితే అది జంధ్యానికి ప్రత్యామ్నాయం కాగలదని అతడు భావించలేదు. ఆ అభిప్రాయాన్ని బయటికి స్పష్టంగా చెప్పేసరికి పక్కనే నిల్చున్న వార్డరు చేతిలోని కర్రతో రెండు దెబ్బలేసేడు. వాళ్లు ఇచ్చిన పొట్టిలాగుకి వుండవలసిన బొందునూ, తన జంధ్యాన్నీ ఒకే హోదాలో చూస్తారని అటు తరవాత తెలిసింది. 'కరుప్పుకుళ్ళాయి'(నల్లటోపీ)గాడొకడు చెప్పేడు; ఖైదీలు వురిపెట్టుకు చచ్చిపోకుండేందుకు తాడులాంటి వస్తువును దేనినీ వాళ్ళకు అందనివ్వరు. లాగుబొందూ, మెడలో జంధ్యమూ వాని వుపయోగాలూ, వుద్దేశ్యాలూ ఏవయినా రెండూ తాళ్ళే, కాకుంటే తాడులాంటి వస్తువులు. "మెళ్ళో జంధ్యం వాళ్ళు లాగేసుకున్నారు" అంటూ రామనాధం దానిని అందుకొన్నాడు. శంకరశాస్త్రీ, అక్కడ చేరినవాళ్ళూ ఎంతో కష్టం కనబరిచేరు. ఇంగ్లీషువాళ్ళు హిందూమత విధ్వంసానికి సాగిస్తున్న చర్యలలో అదొకటిగా నిర్ణయించి తలొక విధంగా తమ కోపాన్ని ప్రకటించేరు. "ఇన్ని నెలలూ మెళ్లో జంధ్యం లేదూ, చుచ్‌చ్చు." రామనాధం తల ఆడించేడు. అందరూ ఏకగ్రీవంగా శంకరశాస్త్రికి సలహా ఇచ్చేరు. "మామా! రేపటికే ఏర్పాట్లు చేసెయ్యి, ప్రాయశ్చిత్తం, ఉపాకర్మ జరిగించడానికి ఆలస్యం ఎందుకు?" మూడు ప్రాయశ్చిత్తం, ఉపాకర్మ మళ్ళీ ఆతడికి బ్రాహ్మణ కులంలో స్థానం కలిగిస్తాయి. కాని, ఎంత చెప్పినా, ఎవరు చెప్పినా, ఎంతమంది చెప్పినా రామనాధం వానికి ససేమిరా అన్నాడు. ఆ పేరున పెద్ద తంతు నడపబోమనీ, టూకీగా తేల్చివేస్తామనీ చెప్పినా అతడు అంగీకరించలేదు. సంఘసంస్కరణ భావాల ఉద్వేగం అది--అనే ఆలోచనతో విశ్వనాధం కొంచెం సర్దుబాటు చేయాలని చూసేడు. సంఘాన్ని ధిక్కరించినట్లూ, అనుసరించినట్లూ గాకుండా పక్కపక్కన వొరగేసుకుపోవాలనేది ఆయన ఆలోచన, చాల కాలం వరకూ వీరేశలింగం పంతులుగారు తల్లిదండ్రుల ఆబ్దికాలను యథావిధిగా పెడుతూండిన విషయాన్ని ఉదహరించాడు. కాని, రామనాధం అభ్యంతరం అది కానే కాదు. అటు పోలీసు వుద్యోగియైన మామగారూ, ఇటు ఛాందసుడైన తండ్రీ ఈ ఇద్దరూ కూడబలుక్కుని తన చేత తను చేసిన పనికి క్షమాపణ చెప్పించాలని చూస్తున్నట్లు అనిపిస్తూందతనికి. పిల్లనిచ్చినవాడు బ్రిటీష్‌వాళ్ళ తాబేదారు. తాను సత్యాగ్రహం చేయడం ఆయనకు కోపం. ఆ కోపంతో దొంగకేసు పెట్టి జైలుశిక్ష వేయించేడు. తన తండ్రీ, బంధువులూ ఆ దొంగ కేసును పెట్టిన పెద్దమనిషిని, ఏమీ అనడం లేదు. జైలులో వున్నందుకు తనకు ప్రాయశ్చిత్తం కావాలట. తాను ఇష్టపడి జైలులో కూర్చున్నాడా యేమన్నానా? ఈ వేళ తాను ప్రాయశ్చిత్తం చేసుకోవడమంటే తాను చేసిన పని తప్పు అని వొప్పుకోవడమన్నమాట. ఇక అటువంటి తప్పు పని చేయనని వాగ్దానం ఇవ్వడం అన్నమాట. తాను చేసిన తప్పేమిటి? జైలులో వుండడమా? తన కులం కాని వాళ్ళ చేతి అన్నం తినడమా? సబ్‌జైలులో వున్ననాడు హాస్పిటలు కాంపౌండరు తన కళ్ళు తెరిచేడు. అప్పటినుంచీ అతడీ కులభేదాలను గురించి కొద్దిగా చదివేడు. చాలా ఆలోచించాడు. అతనికి ఆ విచక్షణ అర్థరహితమని తోచింది. అతనికి జైలులో అన్నం తినబుద్ధి కాలేదు. రోగపడ్డాడు. దానికి కారణం వండినవాడూ, వడ్డించినవాళ్లూ తన కులంవాళ్ళు కాకపోవడంచేత కానే కాదు. బ్రాహ్మడే వండి వడ్డించినా ఆ జైలు మెతుకులంతే. ఇంక అటువంటి అర్థరహితమయిన అభ్యంతరాన్ని తాను పాటించడు! అది నిశ్చయం. ఇంక ప్రాయశ్చిత్తం. జైలులో పడవలసి వచ్చే నేరం చేసినందుకా? తాను చేసిన నేరం ఏమిటి? దేశంలో పరాయి పాలన పోవాలన్నాడు. ఆ పరాయి పాలనకు సహాయం ఇవ్వనన్నాడు. చేతితో వడికి చేతితో నేసిన బట్ట కట్టుకున్నాడు. ఆడపిల్లకు కనీసం పద్దెనిమిదేళ్ళయినా వస్తే గాని సంసారబంధం తగిలించకూడదన్నాడు. ఈ నేరాలు ఇకముందు కూడా చేయదలచుకొనే వున్నాడు. మొదట విశ్వనాధం కొంచెం దిగతీసినట్లు కనబడ్డా, ఆయన రామనాధం వాదనలకి కావలసిన ఆలోచనలను సమకూరుస్తూ వచ్చేడు. పురాణాలనుంచీ, పూర్వ గ్రంథాలనుంచీ, శ్రుతులనుంచీ, స్మృతుల నుంచీ ఆలోచనకి కావలసిన సంబారాలన్నీ అందచేసేవాడు. ఆ ఆచారాల్ని ఎగతాళి చేసేడు. కాని, పూర్తిగా ఇల్లా చెయ్యమని చెప్పడు. "ఇవన్నీ ఒకరికొకరు చెప్పవలసినవి కావు, చదువుకున్నవాడివి నీకు నేను చెప్పడమేమిటి? ఎవరికి వాళ్లు నిర్ణయించుకోవలసినవిగాని......" --అంటూనే మరో మెలిక వేసేవాడు. "ఒరేయి రామం. మనకి విశ్వాసం లేని పని ఒకరు చెప్పేరని చేసెయ్యకూడదు. ప్రాయశ్చిత్తం ఎందుకని నేనంటే కాబోలనుకోవడమూ, మరొకరు కాదు కూడదంటే సరేననడమూ పనికి రాదు. ఇది నీ జీవితంలో ఓ సంధి దశ...." అని హెచ్చరించేడు. వెనువెనుకనే మరో వాదన. "జరిగిందేదో జరిగిపోయింది. చేసింది తప్పో, వొప్పో, ఏదయినా సర్దుకొనేటందుకింకా వ్యవధి వుంది. ప్రాయశ్చిత్తం చేసుకొని కులంలో చేరవచ్చు. ఏదో కాస్త ఆస్తి వుంది. జరుగుబాటుకు లోటు లేదు. పోయి కాలేజీలో చేరవచ్చు. ఇంగ్లండూ వెళ్ళొచ్చు. ఐ. సి. ఎస్‌. కాకపోతే బారిస్టరయి రావచ్చు. ఉన్నవ లక్ష్మీనారాయణగారు అలా వెళ్ళి రాలేదూ? ఈ ఏడాది చదువు చెడిందని తప్ప పెద్ద నష్టం ఏమీ వుండదు. ఏదో వుద్యోగం దొరుకుతుంది. లేదా బల్ల కడతావు. స్వతంత్రమైన వృత్తి. మామగారు పిల్లను పంపుతారు. సుఖంగా రోజు గడుస్తుంది..... తన సుఖమయ జీవితానికి ప్రాయశ్చిత్తకాండ ప్రాతిపదిక కాగలదని చెప్పడంలోనే విశ్వనాధం దానికి వ్యతిరేకంగా మనస్సును మేల్కొలిపాడు. రెండో దిశన ఈ సుఖమయ చిత్రానికి రెండవ పెడ నాతడు వర్ణించలేదు. అది రామనాధానికి అనుభవంలోకి వచ్చేసింది. దానికితోడు మామగారు పిల్లను పంపక పోవచ్చుననే సూచన వుంది. రామనాధం ఆ ఆలోచనలనన్నింటినీ త్రోసి పుచ్చేడు. "నేను గాంధీజీ..." విశ్వనాధం నివారించేడు. "తొందరపడకురా. తొందరపడి వాగ్దానాలూ, ప్రతిజ్ఞలూ చేసెయ్యకు. ఆలోచించుకో...." రామనాధం ఆలోచించేడు. వెనక్కి తిరగవలసిన అవసరం కనబడలేదు. ఈమారు శంకరశాస్త్రి పితృదేవతలయెడ కుమారుడుగా ఆతడు నిర్వహించవలసిన కర్తవ్యాన్ని గుర్తు చేసేడు. రామనాధం ఆలోచనలో పడ్డాడు. సుబ్బన్న శాస్త్రులు వెంటబడ్డాడు. ఓమారు ఆతడు పితృతిథులు గుర్తుచేస్తూంటే విశ్వనాధం అక్కడుండడం తటస్థపడింది. వూరుకోలేకపోయేడు. "నరసమ్మత్త పోయి ఆరు నెలలయిందనుకుంటాను." "అంతా వారం అయింది షాణ్మాసికం పెట్టి....." అతనికి తద్దినాలూ, మాసికాలూ పెట్టడంలో వున్న శ్రద్ధను పొగుడుతూ విశ్వనాధం వుబ్బేసేడు. "గార్లూ, అరిసెలూతో యధావిధిగా జరుపుతున్నాడు...." "కొంతమందిలాగ రెండేసి, మూడేసి నెలలు ఎగబెట్టి, ఒక్కమారే జరపడం వట్టి పాడు పని...." అని తన ప్రత్యేకతని చెప్పుకున్నాడు సుబ్బన్నశాస్త్రి ఆ మాట మీద విశ్వనాధం చల్లగా అంటించేడు. "నువ్వు గార్లు వండేవో, అరిసెలు చేయించేవో పాపం ఆవిడ చూడవచ్చిందేమిటి గాని, నువ్విప్పుడొక్క మాసికానికి చేస్తున్న ఖర్చు ఆవిడ మనోవృత్తికి కలిపివుంటే, వెర్రిముండ మరో పదేళ్ళు బ్రతికేది....." నెలకో రూపాయి మనోవృత్తి చాలడం లేదనీ, మరో రూపాయేనా కావాలనీ నరసమ్మత్త గోల పెట్టేది. కాని సుబ్బన్నశాస్త్రి ఇవ్వలేదు. విశ్వనాధం ఆ మాట జ్ఞాపకం చెయ్యడంతోనే సుబ్బన్నశాస్త్రి వెల్లబోయేడు. "ఆవిడని మా యింట్లోనే వుండమన్నాను. కాని....." "ఎరుగుదును, ఎరుగుదును.. ఆవిడిదో తిక్క. పొత్తర్లబియ్యం తింటానా అంది. నాకు తెలుసు. బ్రాహ్మణకర్మ అయినప్పుడు చేస్తే తప్పేముంది?... ఒక్కొక్క ఘటం అల్లా వెళ్ళిపోవలసిందే." రామనాధం కళ్ళు విడినట్లయింది. విశ్వనాధం అంతతో వదలలేదు. ముక్తాయింపుగా మరో వాక్యం జతపరిచేడు. దానితో సుబ్బన్నశాస్త్రి తడిసిన పిల్లిలా చల్లగా జారుకున్నాడు. "చచ్చిపోయినవాళ్ళంతా వొచ్చి విస్తరి పరుచుక్కూర్చుంటే ఏడాదికోమారే ఆయెను. ఒక్కపూట ఇంత అన్నం పెడతామంటావా? ఆ రోజుకెన్ని అభ్యంతరాలొస్తాయి? గార్లమీదా, అరిసెలమీదా మనకున్న వాంఛని తీర్చుకోడానికిదో దారి చేసుకుంటున్నాముగాని...." ఆ సంభాషణ అక్కడితో ఆగలేదు. తద్దినాలు పెట్టకుండా రామనాధాన్ని విశ్వనాధమే ప్రోత్సహిస్తున్నాడని వీధిలో పడింది. విని విశ్వనాధం నవ్వి వూరుకున్నాడు. కానీ సత్యం అన్నప్పుడు వూరుకోలేకపోయేడు. "నువ్వు పితృస్థానంలో కూర్చుంటానను. వాడు ప్రాయశ్చిత్తం చేసుకొని...." సత్యం, అతని అన్నదమ్ములూ, బ్రాహ్మణార్ధాలకు వెళ్ళడం నీచంగా భావిస్తున్నారు. ఆ సంగతి తెలియకా, తెలిసి పంతం కోసమూ వాళ్ళని పిలిచి అనేక మంది సిగపట్లవరకూ తెచ్చుకొన్నారు. వారికి ప్రతిక్రియగా మరికొందరూ బ్రాహ్మణార్ధాలకూ పోనిరాకరించారు. సత్యం ముఖం ఎర్రబడిపోయింది. "మీరు గనక....." విశ్వనాధం నవ్వేడు. "తొందరపడకు, ఇది బ్రాహ్మణ కర్మ. అది నేనొక్కడినే చెయ్యగలిగేది కాదు. ఇంకో ఇద్దరిని ఆమంత్రించాలి కదా?" "ముంగండలో బ్రాహ్మణులే దొరకరా?" "ఎందుకు దొరకరు? వున్న బ్రాహ్మణుల యిళ్ళల్లో మీదొకటి....." సత్యం ముఖం ఎర్రబడింది. ఈమారు కళ్ళు కూడా నిప్పులు కురిశాయి. "మేము బ్రాహ్మణార్ధాలు చేసుకొనీ, పీనుగుల్ని మోసీ బ్రతికే దశలో లేము." విశ్వనాధం తొందరపడకుండానే అంట కాల్చేడు. "నీకు బ్రాహ్మణార్థం బూతయింది. మరి ఆ తప్పు పని చేయించమని బావమరిదిని ప్రోత్సహిస్తావేం?..." * * * * * రామనాధం ఒక నిశ్చయానికి వచ్చేడు. "ఇంక లాభంలేదు. ముసుగులో గుద్దులాట ఎందుకు? నేను ప్రాయశ్చిత్తానికి ఒప్పుకోను. నేను తప్పేం చెయ్యలేదు." శంకరశాస్త్రి సమస్యను బిగతీయ తలచలేదు. తోటలో వండుకొనేందుకభ్యంతరం చెప్పలేదు. భోజనానికి ఇంటికే రమ్మందామని రాజమ్మ గోల చేసినా వినిపించుకోలేదు. "కష్టసుఖాలు తెలిసిరానీ, కుసులు వొంగితేగాని..." అన్నాడు. కాని, తరువాతి కథలూ, పరిణామాలూ విన్నాక తన అంచనా తప్పేననిపించింది. సుబ్బన్నశాస్త్రీ, సత్యం తమ అనుభవాలు తమకు జ్ఞాపకం వున్న విధంగా చెప్పేరు. అన్నీ విని ఒక్క నిట్టూర్పు విడిచేడు. "తా చెడ్డకోతి వనమెల్లా చెరిచింది" అన్నాడు. ఆ చెడిపోయిన కోతి విశ్వనాధమో, సుబ్బన్నశాస్త్రో, సత్యనారాయణో తేలలేదు. విశ్వనాధం పితృకర్మలు చేస్తూనే వున్నాడు. ఆ మాట గుర్తుచేసుకొని సత్యనారాయణా, సుబ్బన్నశాస్త్రీ ఒకరికొకరు వూరడించుకొన్నారు. "ఎన్ని చెప్పినా వాళ్ళంతా ఒకటేరా." నాలుగు తోటలో మకాంలో గిన్నె మాడ్చడానికి నిశ్చయించుకోవడంతో తన ఆస్తిపాస్తుల్ని వప్పగించుకోకపోతే రోజు నడవదని రామనాధం గ్రహించేడు. రాజమండ్రిలో పడవ ఎక్కే ముందు అప్పు తీసుకొన్న రూపాయితో ఏవో కొద్ది అణాలు మాత్రం మిగిలేయి. ప్రాయశ్చిత్తం విషయం తేల్చుకొనే ఆదుర్దాలో శంకరశాస్త్రి డబ్బు విషయం ఆలోచించలేదు. అప్పుడే జైలు నుంచి వస్తున్నవాడి చేతిలో డబ్బు ఉండక పోవచ్చుననే మాట తోచలేదు. తిరిగి వెళ్ళిపోతూంటే వూరుకున్నాడు. తోటలోనికెళ్ళేసరికి తమ యింటి పనిమనిషి మరిడమ్మ అక్కడ కూర్చుని వుంది. ఆతడు పుట్టక పూర్వం నుంచీ ఆమె ఆ యిళ్ళల్లో పని చేస్తూంది. ఆతడు విడుదల అయి వచ్చేడని తెలియగానే పరుగెత్తుకుంటూ వచ్చింది. ఆతనిని చూడగానే బ్రహ్మానంద పడింది. ఆమె అకృత్రిమానందం చూసి రామనాధం కళ్ళనీళ్ళు తిరిగేయి. "బాగున్నావా మరిడమ్మా!" మరుక్షణంలోనే అతడక్కడ వంటబెట్టుకోబోతున్నాడని విని ఆమె చాల విచారం తెలిపింది. అంతమంది బంధువులుండగా చేయి కాల్చుకోవడమేమిటని ఆమె అభ్యంతరం. పట్టింపు వచ్చేక తమ యింట్లోనే అయితేనేం అతడు భోజనం చేయడు. పెదతండ్రి విశ్వనాధం యింటికి వెళ్ళవచ్చు. ఈ పట్టింపులలో ఎవరింటికి వెళ్ళినా వాళ్ళమీద శంకరశాస్త్రి విరుచుకు పడిపోతాడు. కనక కష్టమయినా తన వంట తానే చేసుకొంటాడు. ఉన్న రెండణాలూ ఆమె చేతికిచ్చి కుండలు తెమ్మన్నాడు. "కుండలేం కర్మండి. అమ్మనడిగి గిన్నెలు తెస్తాను." రామనాధం దానిని కూడా నిషేధించేడు. మరిడమ్మ చేసేదిలేక ఆ డబ్బులు తీసుకొని కుమ్మర్ల యింటికి బయలుదేరింది. ఆమెను అలా పంపించి రామనాధం కోమటింటికెళ్లేడు. అక్కడి వాళ్ళంతా కుశలప్రశ్నలు వేస్తూంటే ఆలస్యమయిపోతూంది. అక్కడ అంతమందిలో తాను వేరే వంట బెట్టుకున్నట్లు చెప్పడం సిగ్గుచేటుగా కనిపించింది. పైగా ఓ అర్ధశేరు బియ్యం, ఓ సోలెడు కందిపప్పు అరువు తీసుకోవడం తన హోదాకు తక్కువనిపించింది. ఆ మాత్రానిక్కూడా డబ్బులు లేవంటే ఏమనుకుంటారు? ఏమీ తీసుకోకుండా తిరిగి వచ్చేడు. మరిడమ్మ కుండలు తెచ్చి అక్కడ పెట్టుక్కూర్చుంది. పరిస్థితి విని మరిడమ్మ నవ్వింది. "ఈ తిప్పలు ఎందుకు బాబూ?" అంటూనే వెళ్ళి అతని కోసం ఒక శేరు బియ్యం, గిద్దెడు కందిపప్పు అరువు పట్టుకొచ్చింది. తీరా తోటలోకి వచ్చేకగాని మరిడమ్మకి తాను తెచ్చినవి వుప్పుడు బియ్యమని గుర్తుకు రాలేదు. అవి బ్రాహ్మలు తినరు. మళ్ళీ వెళ్ళబోతూంటే రామనాధం ఆమెను ఆపుచేసేడు. "ఇల్లా తే! ఈ ఆరేడు నెలలూ జైలులో కిచిలీ సాంబా బియ్యమా మాకిచ్చింది? ఈ ఉప్పుడు బియ్యం ఇంకా శుభ్రంగా వున్నాయి. అవి పుచ్చి పురుగులతో నిండి వుండేవి. అన్నం ముద్ద నీళ్ళలో కలిపేసి పైకి తేలిన పురుగుల్ని అడుక్కి చేరిన మేకుల్నీ తీసేసి తిన్నాను. తే" అన్నాడు. అది విని మరిడమ్మ నోరు తెరిచింది. నమ్మలేకపోయింది. కాని, అతడు తాను తయారుచేసుకొన్న పులగాన్ని ఇంత బెల్లం సాయంతో తినేసి సంతృప్తిపడడం చూసి నమ్మేసింది. ఆ మాట చెప్తూంటే విని రాజమ్మ ఏడ్చింది. శంకరశాస్త్రికి అందులో ఆశారేఖ మాత్రమే కనబడింది. "జైలులో ఏదో నానా గడ్డీ తిన్నామని బయట కూడా తినగలమనుకోకు." కనక రామనాధం ఒకటి రెండు రోజులలోనే ప్రపంచంలో పడడం ఖాయమని తేల్చుకున్నాడు. "వాడి డబ్బుండగా బాధపడడం ఎందుకు? సాయంకాలం వచ్చి కావలసింది పట్టుకెళ్ళమన్నానని చెప్పు" అని మరిడమ్మకు చెప్పేడు. కాని ఆ దంపతులు భావించినట్లు రామనాధం కాళ్ళు కడుక్కోమనగానే భోజనానికి లేచే పద్ధతిలో రాలేదు. అతడు సాయంకాలం అవుతుండగానే వంటా, భోజనం ముగించేసుకొని మరీ వచ్చేడు. శంకరశాస్త్రి సావట్లోకి రమ్మన్నా రామనాధం లోపలికి వెళ్ళలేదు. అరుగు మీదనే కూర్చున్నాడు. "కాళ్ళు బురదగా వున్నాయి. ఇల్లా కూర్చున్నాలే." రాజమ్మ వీధిగూట్లో ప్రమిదలో దీపం పెట్టి వచ్చి కూర్చుంది. రామనాధం ఏదో మాటవరసకు చెప్పినట్లుగా అన్నాడు. "రేపు ప్రొద్దున్నే అమలాపురం వెడుతున్నానమ్మా!" అమలాపురం మాట వినగానే శంకరశాస్త్రి చేస్తున్న సంధ్యావందనం త్వరగా ముగించి తానూ వీధిలోకి వచ్చేడు. మామగారితో మళ్ళీ పేచీ పెట్టుకోడానికా అనిపించింది రాజమ్మకు. లేకపోతే అతనికిప్పుడక్కడ పనేమిటి? భార్యను తీసుకురావడానికి తానే వెడుతున్నాడనుకోలేకపోయేడు శాస్త్రి. అది సంప్రదాయం కాదు. పైగా ఇంత గ్రంథం జరిగేక. అతడు జైలునుంచి వస్తూండగానే పిల్లను పంపమనడం తెలివైన పని కాదని ఆ మధ్యాహ్నమే తానూ, భార్యా అనుకొన్నారు. అసలు రామనాధం తన భార్యను తెచ్చుకొనే ప్రతిపాదనకు సుముఖుడుగా వుంటాడనే నమ్మకం వాళ్ళకి లేదు. జరిగిన దానిపై మహా కసిగా వుంటాడనీ, కాస్త చల్లబడే వరకూ ఆ ప్రసక్తి తేరాదనీ వాళ్ళు అనుకొన్నారు. అందుకే అడిగేడు. "ఊరికేనా?" "మీ కోడలిని తీసుకు వచ్చేస్తా." శాస్త్రి ఆందోళన కనబరిచేడు. నారాయణమూర్తి మాత్రమే కాక, ఆయన భార్య కూడా రామనాధం మీద చాలా వ్యతిరేకత కలిగివున్నదని శాస్త్రి ఎరుగును. ఆ వ్యతిరేకత వాళ్ళతోనే ఆగలేదు. ఆ వూళ్ళోనే వున్న అన్నపూర్ణమ్మ అక్కగారి కుటుంబం కూడా ఎంతో కక్షగా వున్నారు. రామనాధం తమకేదో మహాపకారం చేసిసట్లు వాళ్ళు బాధపడుతున్నారు. ఈ ఆవేశాలు కాస్త సర్దుకోనివ్వాలి. ఈ దశలో దిక్కు ఎవ్వరూ లేనట్లు రామనాధమే వెళ్ళి ఆ వ్యవహారం తేల్చమనడంలో వున్న అనౌచిత్యం మాట ఎలాగున్నా, అతడు వెడితే అసలు వ్యవహారమే చెడుతుంది. ఆ ఆలోచనతోనే శంకరశాస్త్రి ఆ ప్రయత్నం మంచిది కాదన్నాడు. దానిని రామనాధం మరొకవిధంగా అర్ధం చేసుకొన్నాడు. నారాయణమూర్తి చేసిన అవమానమూ, అన్యాయమూ దృష్ట్యా తన భార్యను పుట్టింట వదిలేసి తండ్రిని శిక్షించాలనుకుంటున్నట్లు భావించేడు. ఆ మాటే అన్నాడు. "ఆయనదే కాని ఆమెదేం తప్పు?" "తప్పు సమస్య కాదు, ఎవరు వెళ్ళాలని గాని, మనంత మనం సరాసరి వెడితే పని చెడుతుంది." "నువ్వు జైలులో పడ్డ మొదటి రోజున బాబయ్య వెడితే ఆయనగారు నానా మాటలు అన్నాడుట" అంది రాజమ్మ. "విన్నాను అందుకే...." ఒక నిముషం ఆగేడు. "ప్లీడరు రామసోమయాజులు గారినో, హైస్కూలు హెడ్మాస్టరు గారినో వెళ్ళి రమ్మందామని....." ఒక్క క్షణం క్రితం సావిట్లో అడుగుపెట్టడానికి నిరాకరించినదానికన్న, తమ ప్రమేయమేమీ లేకుండా భార్యను తెచ్చుకొనేటందుకు తన ఏర్పాట్లు తాను చేసుకుంటూండడం శంకరశాస్త్రికి కష్టమనిపించింది. ఆ పెంకితనం చూసి కోపమూ వచ్చింది. వాళ్ళు పంపిస్తే మాత్రం? ఆమెను ఎక్కడ వుంచుతాడు? ప్రాయశ్చిత్తం చేసుకోవలసి వుందనే మాట మరచి ఆ దంపతుల్ని తాను యింట్లో పెట్టుకోగలడా? ఆ మాటనే అతడు వేరొక విధంగా అడిగేడు. "ప్రస్తుతం నీ స్థితి ఏమిటి? ఆ మాట వాళ్ళూ అడుగుతారు కదా?" శంకరశాస్త్రి మాటను రామనాధం మరొక విధంగా అర్థం చేసుకొన్నాడు. "కులం వుందనుకొన్నా, చెడిందనుకొన్నా పెళ్ళంటూ అయింది కదా." "--అంటే అమీ తుమీ తేల్చుకొనాలన్నట్లు బయలుదేరుతున్నావన్నమాట. అది మంచి పని కాదు..." శంకరశాస్త్రి చాలసేపు అటు తిప్పి, ఇటు తిప్పి తన ఆలోచనలు చెప్పేడు. కొద్దికాలం వోపిక పట్టమనేది ఆయన సలహా. ఈ లోపున వ్యవహారాలు సర్దుబాటు చేసుకోమన్నాడు. అతనికి లోకుల నుంచి ఏడెనిమిది వేలు రావలసి వున్నాయి. క్రమంగా వసూలు చేసుకోవడమూ, ఓ యిల్లు అంటూ ఏర్పాటు చేసుకోవడమూ ముఖ్యమన్నాడు. పొలాలనీ, వ్యవసాయమనీ చూసుకొంటూంటే..... "ఆ స్థితిలో నారాయణమూర్తి కూతుర్ని పంపక ఏం చేస్తాడు?" అన్నాడు. "పంపకపోతే ప్రపంచంలో పిల్లలకే కరువా?" అన్నమాట నాలుక చివర వరకూ వచ్చింది. కాని, ఆ క్షణంలో నిగ్రహించుకొన్నాడు. కాని, ఆ సూచనను రామనాధం ఒప్పుకోలేకపోయాడు. దాని అర్ధం ఏమిటి? తాను సహాయ నిరాకరణంలో పాల్గొన్నది తప్పేనని ఒప్పుకోవడమే కదా? ఇంకెప్పుడూ అలాంటి పని చేసే ఉద్దేశ్యం లేదు. బుద్ధిమంతుడల్లే వుంటున్నా చూసుకోండి అని చూపించినట్లే కదా. ఆ బుద్ధిమంతుతనం తన వుద్దేశం కాదు. దేశానికేదో సేవ చేయాలనే సంకల్పం చావలేదు. బలపడింది గాని. తన సూచనను రామనాధం అంత స్పష్టంగా అర్ధం చేసుకోగలగడం శంకరశాస్త్రికి సంతృప్తి కలిగించలేదు. ఏమనడానికీ తోచలేదు. "ఆ విధంగా ఆలోచిస్తున్నప్పుడు నేను చెప్పవలసిందేదీ లేదు. సంపూర్ణ స్వతంత్రుడివిగా వెడితేనే బాగుంటుంది...!" "ఇప్పుడు కానా.....?" "కాదు.... రేపు భార్యను తీసుకురావడానికి వెడతానంటున్నావు. డబ్బు ఏదీ?" డబ్బు కోసమే మీ వద్దకు వచ్చేనంటాడని శంకరశాస్త్రి అభిప్రాయం. అతడు వచ్చినదందుకేననీ, తల్లివద్ద ఆ ప్రసక్తి తేవడం వుద్దేశం కూడా అదేననీ అతని ఆలోచన. కాని, రామనాధం ఆ ఆశను ఊదేసేడు. "సాయంకాలం షావుకారు వెంకటరత్నానికి కొబ్బరికాయ వేస్తానని ఓ పాతిక తీసుకొన్నా." ఆ మాట విని శంకరశాస్త్రి నిర్విణ్ణుడయ్యేడు. రాజమ్మ "అదేం పనిరా?" అంది. శాస్త్రి ఒక్కక్షణంలో సర్దుకొన్నాడు. రామనాధం మనస్థితి అర్థమయింది. "సరే బాగానే వుంది." వ్యవహారం అడ్డం తిరిగిందని రాజమ్మ గ్రహించేలోపునే తానిన్నాళ్ళూ భయపడుతూన్న మాటలే శంకరశాస్త్రి నోట వచ్చేశాయి. "అదేదో చేసిందేదో చేశాడు. వదిలెయ్యి, ఇంక అల్లా చెయ్యనక్కర్లేదు. ఇతర విషయాలలో స్వతంత్రుడివే అయినా, నీ ఆస్తి వ్యవహారాలన్నీ నా చేతిమీదుగా జరుగుతున్నాయి. కనకనే డబ్బు నీది వున్నా అప్పుచేసుకోవలసి వచ్చింది. ఇది ఇల్లాగే జరిగితే నిన్ను నా చాటువాడి క్రిందనే లెక్కగడతారు. అది మనకిద్దరికీ క్షేమం కాదు. పొద్దున్నే మీ విశ్వనాధం పెదనాన్నని పిలు. ఆయన ఎదుట అన్ని లెక్కలూ చూసుకొని వొప్పచెప్పేసుకో. తర్వాత నీ యిష్టం. మా సాయం కావాలంటే వస్తావు. లేకపోతే లేదు...." ఆస్తి వ్యవహారాల విషయం అడగటం ఎల్లాగా అనుకుంటున్న రామనాధానికి ఆ సమస్య అంత సులభంగా పరిష్కారం అయినందుకు మనస్సు తేలికపడింది. మరిడమ్మ అరువు పెట్టి శేరు బియ్యం తెచ్చి యిచ్చేవరకూ తనకు గతిలేకపోయిందని మనస్సు ఎంతో బాధపడింది. అప్పయ్యవధాన్లు వద్దకు వెడితే ఎనిమిది నెలల క్రింది ఘటనలు తలుచుకొని తాను ఏగాని ఇవ్వలేనన్నాడు, ఆ విసురున వెళ్ళి కొబ్బరికాయ దింపు తీసి వేస్తానని ఒక పాతిక తెచ్చుకోవలసి వచ్చింది. ఇంకా స్థితి వుండరాదనుకొంటూనే వచ్చేడు. ఆ మాట తెస్తే చాలా గొడవ అయిపోతుందేమోననుకొంటూ వుంటే శాస్త్రి తనంత తానే ఆనేశాడు. సంతోషం కలగవలసింది. కాని రామనాధం సిగ్గుపడ్డాడు. "అదేమిటి బాబయ్యా! మరొకరూ, మరొకరూ ఎందుకు?" కాని శంకరశాస్త్రి వినిపించుకోలేదు. "అది వ్యవహారధర్మం!" అయిదు రాత్రి తెల్లవార్లూ వర్షం కొట్టి కురిసింది. పక్కలనుంచి వచ్చే జల్లులకి మకాం పాకలో రక్షణ లేదు. మధ్య మధ్య పై నుంచి కూడా వర్షం పడ్తూంది. రామనాధం తెల్లవార్లూ మంచం అటూ ఇటూ జరుపుకుంటూనే వున్నాడు. ఏమూలా కూడా ఒక్క మంచం పట్టేంత మేర కూడా చినుకు పడని చోటు లేదు. పడుకుంటే కాళ్ళ మీదనో, తల మీదనో చినుకు. ఇంక కూర్చున్నాడు. అలాగే తెల్లవారింది. ఆకాశం ఇంకా మూసుకొని పోయే వుంది. వర్షం తగ్గింది కాని, సన్నని తుప్పర ఇంకా పడ్తూనే వుంది. ఆ పూటకి అమలాపురం వెళ్ళే ప్రయత్నం మాని తన మకాం పాక సంగతి చూసుకోవాలనుకొన్నాడు. లేకపోతే ఒక్కరోజు నడిచేలాగ లేదు. అనుకుంటుండగానే శివకామయ్య నెత్తిన అంగవస్త్రం వేసుకుని చెరువు గట్టు దిగి వచ్చేడు. "రాత్రి వర్షానికి పాక వుందిట్రా! వుండమన్నా వున్నావు కాదు. ఏమయ్యేవో అని ఒకటే అనుకున్నాం." "ఇంతమాత్రానికేనా?" మాటలోనే సూరప్ప వచ్చేడు. నరసింహులు, రామన్న వచ్చేరు. రామన్న పాకలోకి వెళ్ళి అంతా పరీక్షించేడు. విషయం గ్రహించేడు. "నేను పైకెక్కుతాను కాని, మీరెవరో నాలుగు ఆకులు అందివ్వండిరా" అంటూ పంచె విరిచి కట్టుకొనసాగేడు. "ఏమీ అక్కర్లేదురా. ఇల్లు నేతగాళ్ళని పిలుచుకొస్తాను." "ఈ వర్షంలో నీకు పనివాడెవడు దొరుకుతాడురా. దొరికితే మంచిదే, లేకుంటే..." అన్నాడు నరసింహులు. ఆ మాటను సూరప్ప సమర్థించేడు. ఆతడప్పుడే పాలెంలోకి వెళ్ళి వచ్చేడు. "రాత్రి కురిసిన వర్షంతో ఊరూ వాడా ఏకం అయిపోయేయి. అమ్మవారి గుడికంటా ఒకటే నీరు. ఇప్పుడు నీకు మనిషి కావాలంటే మాత్రం ఎలా వస్తాడు? ఎవడిల్లు వాడు సర్దుకోవడంలో వుంటాడు." శివకామయ్య సూరప్ప మాటలకి ఆమోదం తెలిపేడు..."బాగా చెప్పేవు." "వాడికేం తెలుసు. రాండిరా" అంటూ రామన్న రంగంలోకి దిగాడు. రామనాధం పాకలోంచి చూపుతూంటే చినుకు పడుతున్నచోట్లన్నింటా ఆకు దోపేరు. బణిపిలోంచి కొబ్బరాకు తెచ్చి కప్పుమీద వేసేరు. "ఇంక ఫరవాలేదు" అంటూ రామన్న పైనుంచి దిగివచ్చేడు. ఒక్కమారు లోపలికి వెళ్ళి నాలుగు పెణకలూ చూసేడు. ఎక్కడా వెలుతురు సందులు కనబడ్డం లేదు. "మరి పక్కదడులు మాటేమిటి?" అని అతడు మిత్రుల్ని కదిపేడు. రామనాధం స్నేహితులకు ఆ శ్రమ ఇవ్వడానికి సందేహిస్తున్నాడు. "ఎందుకొచ్చిన పీడరా మీకు. రాండి, కాసేపు కూర్చుని కబుర్లు చెప్పుకోక...." "అఘోరించేవులే. వెర్రికబుర్లు చెప్పకు...." అని శివకామయ్య కోప్పడ్డాడు. రాత్రి తమ ఇంటి వద్ద పడుకోవడానికి నిరాకరించిన మాట చెప్పేడు. సూరప్ప నవ్వేడు. "నువ్వు అరుగుమీద కూర్చున్నావా? సావిట్లోకెళ్ళేవురా?" అని అడిగేడు రామనాధాన్ని. "బల్లమీద కూర్చున్నా." "అయితే మీ ఆవిడ ప్రాణం తోడ్తూంటుంది ముసిలిది. పెందరాళే ఇంటికిపో. ఆ బల్లా అదీ వాకిట్లోకి పట్టి కడగాలి" అని శివకామయ్యకి సలహా ఇచ్చేడు సూరప్ప. రామనాధం చిరునవ్వు నవ్వేడు. మిగిలిన వాళ్ళు గొల్లుమన్నారు. శివకామయ్య తల్లిది వెర్రి ఆచారం. వీధిలోంచి గుమ్మం ఎక్కితే చెంబెడు పేడ నీళ్ళు కాళ్ళ మీద పోయించుకోవలసిందే. లేకపోతే వంటా గింటా వదలి ఇల్లు అలుకుతూ కూర్చుంటుంది. శివకామయ్య సిగ్గుపడ్డాడు. "చంపేస్తూందిరా" అని వొప్పుకొన్నాడు. కాని తల్లిని అంతకన్న ఏమీ అనలేకపోయేడు. "ఎవరి ఏడుపు వాళ్లు ఏడుస్తారు, ఈ వేళ వాళ్ళని మనం మరమ్మతు చేయగలమేమిటి?" మళ్ళీ రామన్న పనికి దింపేడు. కమ్మ నరికేసి కొబ్బరి ఆకు చుట్టూ దగ్గరగా నేలలో గుచ్చేడు. అవి లాగినాక కదలకుండా మూడు ఎత్తుల్ని పెండె కట్టేరు. పాక మూడు దిక్కులు మూసేసేక గాని వాళ్ళు ఊపిరి తీసుకోలేదు. "మిగిలింది. మధ్యాహ్నం చేద్దాంలే. ఈవేళ దూడని కూడా విప్పకుండా ఇల్లా వచ్చేశాను." అంటూ నరసింహులు హడావుడిగా వెళ్ళిపోయేడు. * * * * * భోజనం చేసేక ఒక్క నిముషం కూర్చుందామనుకుంటూంటే బాలకృష్ణ పరుగెత్తి వచ్చేడు. బట్టలన్నీ బురద అయిపోయేయి. చెరువు కట్ట మీది నుంచి దిగుతూంటే కాలుజారి పడిపోయేడు. "ఈ వర్షంలో నువ్వెందుకు వచ్చేవు? కొద్దిసేపట్లో నేనే వస్తున్నాను కదా....." అని రామనాధం కోపం చేసేడు. బాలకృష్ణ ఏమీ మాట్లాడలేదు. ఆ బాడీతో వీధుల్లోంచి ఇంటికెల్లాగ వెళ్ళడమా అని ఆలోచిస్తున్నాడు. ఆ అనుమానం పసికట్టి రామనాధం నవ్వేడు. "ఏం ఫర్వాలేదోయ్‌. మన ముంగండ వీధుల్లో పడి బట్టలు బురద చేసుకోని మగాడెవరోయ్‌?" బాలకృష్ణకి సందేహం కలిగింది. "నువ్వూ పడ్డావా?" "ఓస్‌. రాజమ్మ అమ్మమ్మని అడుగు. మామయ్య సొట్టపడగొట్టిన బిందేది చూపించమను. తెలుస్తుంది." ఎంతో తెలివైన వాడనుకొనే మేనమామ బురదలో కాలుజారి పడ్డాడన్న వృత్తాంతం బాలకృష్ణకి నవ్వు కలిగించింది. "ఎల్లా పడ్డావు, ఎందుకు పడ్డావు--చెప్పు మామయ్యా!" అదంతా విన్నాక బాలకృష్ణకి ఫర్వాలేదనిపించింది. ఇంటికి వెడుతూనే ముందు తల్లితో ఆ విషయమే చెప్పేడు. "మామయ్య కాలు జారిపడి బింద సొట్టపోగొట్టేడుట. నువ్వెరుగుదువా?" ఆ ఘటన అప్పుడే జరిగినట్లు భావించి విశాలాక్షి కంగారు పడింది. "ఏ కాలేనే నెప్పి పెట్టలేదుగద." ఆ సంభాషణ వింటున్న రామనాధం సావిట్లో నవ్వుతున్నాడు. నవ్వు విని విశాలాక్షి వచ్చింది. "ఏమిరా, నీకేం చెప్పేను? భోజనానికి రమ్మంటే ఎందుకు రాలేదు?" "నేను రానని చెప్పేను కాదా." "ఒరేయి. శంకరం బాబాయి ఏదన్నా అంటాడనే భయం లేదు నాకు. ఎందుకనాలి ఎవరు మాత్రం? అకార్యకరణం ఏం చేశామని అనాలి?" "అదేమీ కాదు. ఇదొక రోజుతో అయ్యేది కాదు. పొయ్యేది కాదు. ఒకరోజు వైభోగానికి మొగమంతా మసి అన్నట్లు లేనిపోని గొడవలు తీసుకురావడం నాకిష్టం లేదు." ఆతడు సంసారం ఏర్పరచుకొనే దాకా తమ యింటనే వుండమంది విశాలాక్షి. కాని రామనాధం ససేమిరా అన్నాడు. "వొద్దు. నన్ను బలవంత పెట్టవద్దు. వదిలెయ్యండి." విశాలాక్షి ఏమీ తోచక ఒక్క నిముషం వూరుకుంది. "వస్తూనే ఆస్తి లెక్క చెప్పడం మాట ఏమన్నా వచ్చిందా? శంకరం బాబాయి నాన్నని రమ్మన్నాడట." రామనాధానికి ఏం చెప్పడానికీ తోచలేదు. నసిగేడు. "అది కాదురా, ఇంతకాలం పెంచి పెద్దవాడిని చేశాడుకదా. వాళ్ళ ఆచారాలూ, చాదస్తాలూ ఏవో వుంటాయి. అంత మాత్రం చేత నువ్వు....." రామనాధానికి ఆశ్చర్యం వేసింది. శంకరం బాబాయి అలాగ్గాని చెప్తూన్నాడేమిటి? "అల్లా చెప్పేడా బాబాయి!" "ఏమో నాకేం తెలియదు. కాగితాలూ అవీ చూడాలి. నువ్వు కూడా వుండాలి అన్నాడట పొద్దున్న. ఆ మాట మీద నేను అనుకున్నా....." "నేనల్లా అంటానో అననో నీకు తెలియదా అక్కా!" విశాలాక్షికి ఆ అనుమానం అనిపించింది. కాని, ఏమో అది తప్పుగా తోచింది. అడిగేసింది. మనుష్యులు ఎప్పుడూ ఒక్కలాగే వ్యవహరిస్తారా? ఏ సమయంలో ఎటువంటి కక్ష కనిపిస్తుందో ఎవరన్నా చెప్పగలరా? రామనాధం తానా మాట అనలేదని చెప్పేడు. జరిగినవన్నీ చెప్పేడు. విశాలాక్షి తమ్మునిదే తప్పని చెప్పింది. "ఒరేయి, నువ్వు నోటితో చెప్పాలట్రా, వెంకటరత్నానికి తీయబోయే దింపుల బాపతు కాయవేస్తానని డబ్బు తెచ్చుకుంటే దాని అర్ధం ఏమిటి? బాబయ్య వెర్రివాడనుకున్నావా?" కాదని వొప్పుకున్నాడు. కాని, ఆస్తి వ్యవహారాలు ఎప్పటిలాగే ఆయన చేతిలోనే వదిలిపెట్టమన్న అభిప్రాయానికి అంగీకరించలేదు. "నేను తన చాటు వాడిని లాగే వుండడం కూడదన్నాడు బాబాయి. అది నిజమైన...." "ఆయన కోపంతో అన్నమాట...." రామనాధం అసలు ఆ విధంగా ఆలోచించడమే తప్పన్నాడు. "ఎందుకు అనుకోవాలి? అలా అనుకోవడం ఎందుకు? మనస్సు పాడు చేసుకోవడం ఎందుకు? ఆయన నిజంగానే అన్నాడనుకొని ఆయనని గౌరవిద్దాం. అంతేకాని." విశాలాక్షి ఒప్పుకోలేదు. "ఏమోరా! ఈ సహాయ నిరాకరణం అంటూ వచ్చేక నీకు మంచీ, చెడ్డా తల్లక్రిందులుగా కనిపిస్తున్నట్లున్నాయి." "కాదక్కయ్యా! ఒక్కటాలోచించు. ఆయన కోపంతో అన్నాడనే అనుకొందాము. దాని అర్ధం ఏమిటో? నిజంచేత నా ఆస్తి మీద తన పెత్తనమే జరగాలనుకుంటున్నాడనడమే కదా. అది ఆయనకు ప్రతిష్ఠయా?" "ఏమోరా బాబూ." "అది వదిలెయ్యి. రెండోవేపున నేనున్నాను. ఆ మాట అనడం నా వ్యవహారాలు నేను చూసుకోదలచుకోవడం లేదనడమే కదా....." "అప్పుడే ఆస్తి వ్యవహారాలు చూసుకొనేపాటి వాడివయేవా? రామనాధం నవ్వేడు. "నిరుడు అప్పయ్య అవధాన్లుగారికి నోటు వ్రాసి యిచ్చాను. నిన్న ఆయన అప్పు ఇవ్వనన్నాడు గనుకనే వెంకటరత్నానికి దింపు తీయబోయే కాయ అమ్మవలసి వచ్చింది. దాని అర్థం ఏమిటి? నా వ్యవహారాలు నేను చూసుకోక తప్పని పరిస్థితి వచ్చిందనే కదా." ఆమె ఆశ్చర్యంతో అతనికేసి చూస్తూ కూర్చుండిపోయింది. రామనాధం మాట మార్చేడు. "మరి పెద్దనాన్న ఏమన్నాడుట." "అదేం మాట. వాడినిప్పుడు వదిలేస్తావా? అన్నాడుట." "ఊఁ" "కుటుంబ భారం మీదపడడం కష్టసుఖాలు తెలిసి రావడానికి అవసరమన్నాడుట. శాస్రి బాబయ్య. వాడి యోగక్షేమాలు కోరేవారెవ్వరూ ఆటంకం చెప్పవద్దన్నాడుట." "ఆయన చాల తెలివిగలవాడు" అని రామనాధం మెచ్చుకున్నాడు. "ఎవరోయి ఆ తెలివిగలవాడు?" అంటూ మంగమ్మ గుమ్మంలో కనబడింది. "రావే మంగమ్మా!" అంటూ విశాలాక్షి ఆహ్వానించింది. "నిన్న ప్రొద్దుటనగా వచ్చి ఒక్కమారు కూడా రాకూడదటయ్యా!" అని మంగమ్మ నెపం పెట్టింది. "ఎందుకు రాకూడదూ? కాని ఇప్పుడు నేనెవరినో, నా స్థితి ఏమిటో? నాకే అర్థం కాకుండా వుంది. అందుచేతగాని.... ఎందుకు రాకూడదూ?" రామనాధం వుద్దేశం ప్రాయశ్చిత్తకాండ మీద వచ్చిన రభసను గురించి. కాని మంగమ్మ మరో విధంగా అర్ధం చేసుకొంది. రామనాధం భార్య ఆమెకు పినతల్లి కూతురు. "బాగుందయ్యా! మీకూ వారికీ లేనిది మధ్య మాకు వచ్చిందేమిటి?" "ఏమిటే అదీ?" అని విశాలాక్షి మంగమ్మ ఆ రోజు వుదయం తన తండ్రిని శంకరశాస్త్రి అమలాపురం పంపించిన వార్త చెప్పింది. "ఎందుకు?" అంటూ విశాలాక్షి తమ్ముడివంక చూసింది. "ఆయనకు ఒక ఆలోచన మనస్సులో పడింది. ఇంక దాని అంతేదో చూడాలి. బహుశా పెదనాన్నని పిలిచినట్లే ఆయనకీ కబురు పంపేడేమో." అతనికి ఆ పద్ధతి ఏమీ నచ్చలేదు. ఆమాటే చెప్పేడు. రాత్రి మళ్ళీ పనికట్టుకొని శంకరశాస్త్రి బాబాయిని కలుసుకున్నప్పుడు. "నాకు ఏ మాత్రం సంబంధం లేని వాళ్ళనీ, యోగక్షేమాలు పంచుకోని వాళ్ళనూ మీరు కబురంపడం ఏమిటి? నాకిష్టం లేదు." "ఒరేయి కష్టపెట్టుకొని లాభం లేదు. నాకు మాత్రం ఇష్టం వుండి కబురంపేనంటావా. ఒకరి ఆస్తిపాస్తులు చూడడం వుందే మంత్రసాని పని లాంటిది...." ఇంక సాగతియ్యడం లాభంలేదనుకున్నాడు రామనాధం. "వాళ్ళూ వీళ్ళూ ఎవరూ వద్దు. మీకు తోచినవారిని ఒకరిని మీరు పిలవండి. నాకు తోచిన వారొకరిని నేను పిలుస్తాను." శంకరశాస్త్రి ఆలోచించేడు. నారాయణమూర్తి నుంచి నిరాకరిస్తూ కబురు అప్పటికే అందింది. ఆయన తోడల్లుడు రామమూర్తి కూడా తనకు ఆ ప్రమేయం పెట్టవద్దన్నాడు. ఇంకెవరిని పిలవడం అనుకుంటూంటే ఈ మాట వచ్చింది. "కానియ్యి, రేపు తేల్చేసుకోవాలి. రామనాధం తననే కోరబోతున్నాడని శంకరశాస్త్రి కలలో కూడా వూహించలేదు. ఆ మాట విని ఒక్కక్షణం విస్తుబోయేడు. అంతలో వెర్రి నవ్వు నవ్వేసేడు. "దేవాంతకుడివిరా...." అతడు ఎంతో ఆనందపడ్డాడు. "సరే. సరే." ఆరు ఊళ్ళోకి వచ్చి రెండు రోజులైనా లచ్చమ్మను చూడలేదనుకుంటూ రామనాధం పెదతండ్రి తోట మకాంవేపు బయలుదేరేడు. ఈ రెండు రోజుల నుంచీ కురుస్తున్న వర్షాలతో చాకలి చెరువు నిండిపోవడమే కాదు. పుంతదార్లు మునిగి మోకాలులోతు నీళ్ళలో వున్నాయి. రోడ్డు మీది రావి క్రింద నిలబడి ఎటు వెళ్ళడమా అని ఆలోచిస్తూంటే చాకలి నారాయుడు చూసేడు. అతడికి తమ యిళ్ళ మధ్య నుంచి మెరకగా వున్న గట్టు మీదుగా దారి చూపించేడు. చెరువుగట్టు మీద చాకళ్ళ ఇళ్ళు వున్నాయనే గాని, అతడెన్నడూ ఆ యిళ్ళవేపు వెళ్ళలేదు. ఇప్పుడే మొదటి మారు ఆ యిళ్ళ మధ్య అడుగుపెట్టేడు. ఇంటిమీద ఇల్లు, ఇళ్ళ ముందూ వెనకా తాళ్ళమీద బట్టలు గాలికి ఆరగడుతున్నారు. "మీ యిళ్ళు ఇవా?" "ఇవి యిళ్ళేంటండి? గుడిసెలు. వాటికన్నా కాస్త నయం...." అన్నాడు నారాయుడు. "వర్షాలకి ఎల్లా వున్నాయి?" గడచిన రాత్రంతా పాకలో పొడిగా వున్న జాగాలేక జాగారం చేసిన విషయం జ్ఞాపకం వచ్చి అడిగేడు. "తాటాకు ఇళ్ళకి వర్షాల్లో ఎల్లావుండడానికేం వుందండి." మాట్లాడుకుంటూనే ఇళ్లు దాటేరు. సెలవు తీసుకుంటానంటూ నారాయుడు వెనక్కి తగ్గేడు. ఎవరికో తనను గాంధీగారుగా పరిచయం తెలుపుతూండడం విని రామనాధం నవ్వుకున్నాడు. ఆ మాట అనడంలో వ్యక్తం చేసిన భక్తీ, ప్రపత్తీ అతనికెంతో గర్వం కలిగించేయి. ఆ వుత్సాహంలో ఈ రెండు రోజులుగా కలిగిన శారీరక-మానసిక వ్యధ మరచిపోయేడు. అతడు వెళ్ళేసరికి లచ్చమ్మ రాట్టం ముందు కూర్చుని వుంది. చాలా సంతోషం కలిగింది. "ఇదెప్పటినుంచమ్మో!" అన్నాడు. "గాంధీగారు చెప్పినట్లు మీరంతా జైలుకెడుతూంటే మేమీపాటి పనేనా చెయ్యలేమా?" అంది లచ్చమ్మ. ఆ మేములో పెదతండ్రి కూడా వున్నాడని విన్నాక రామనాధం సంతోషానికి మేరలేదు. తనకు వ్యతిరేకంగా వెంకటరమణ కోర్టులో సాక్ష్యం ఇచ్చిన రోజు నుంచి వారిద్దరూ రాట్టం వొడుకుతున్నారు. "ఈ ఆరు నెలల్లో మాకు కావలసిన పంచెలూ, చీరలూ నేయించుకోగలిగేం. తెలుసా అబ్బాయిగారూ!" అంది లచ్చమ్మ. అంతేకాదు వారిద్దరూ తీసిన నూలుతో నేయించిన పంచెలచాపు చేతిలో పెడుతూంటే అతడి ఆనందానికి మేర లేకపోయింది. "ఈ నూలు మీరు తీసిందే?" నూలు చాలా సన్నగా వుంది. ఎనభయి నెంబరు వుంటుందనిపించింది. అది పైడిపత్తి పింజెతో, దంజ్యాల కదురు మీద తీసింది. ఆ పత్తి కోసం దొడ్లో పది పైడిపత్తి చెట్లు వేసేరు. చూపించింది. అవన్నీ చూసేక రామనాధానికి తాను చదివిన అర్థశాస్త్రం జ్ఞాపకం రాలేదు. ఖద్దరులో అర్థశాస్త్ర ప్రాముఖ్యం కన్న విశేషమైన ప్రాముఖ్యం వున్నదనడంలో గాంధీగారి వుద్దేశమేమిటో లచ్చమ్మ ముఖంలో అర్థమైనట్లు తోచింది. బట్టలు సాపుగా లేవని కాని, నూలు గొగ్గిగొగ్గిలుగా వుందని కాని ఆమె చిన్నపుచ్చుకోవడం లేదు. ఒక్క అంచుకి తప్ప చీరకి రంగు లేదు. కాని అవేవీ ఆమె వుత్సాహాన్ని తగ్గించలేదు. "చేతివడుకుబట్ట తప్ప మరొకటి ఎరగని దశలోనే మన స్వాతంత్య్రం పోయింది."... అన్న తమ అర్థశాస్త్ర లెక్చరరు కలిగించిన అనుమానాలిప్పుడాతనికి విశ్వసనీయంగా కనబడలేదు. మనస్సులోనే ఒక నిర్ణయానికి వచ్చేడు. తాను కూడ నూలు తియ్యాలి. రామనాధం కూర్చున్నాక తాను రాజమండ్రిలో వెంకటరమణను చూసి వచ్చిన విషయం చెప్పేడు. "ఆరోగ్యంగానే వున్నాడు." "వాడి మాట చెప్పకు, దుర్మార్గుడు." తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినందుకు ఆమె కొడుకును క్షమించలేకుండా వుంది. రామనాధానికామె మాట నచ్చలేదు. "నిన్న మొన్నటిదాకా నేనూ పెద్ద ఉద్యోగాలు చేయాలనుకున్న వాడిని కాదా? ఈ వేళంటే నా కళ్ళు తెరుచుకున్నాయనుకుంటున్నాగాని...." కాని, తన పర తెలియనక్కర్లేదాయని ఆమె ఆక్రోశం. వెంకటరమణ మనస్సులో వున్న కష్టం రామనాధం ఎరుగును. లచ్చమ్మకూ తెలుసు. సంఘంలో వున్న కులబేధాలు అతనిని అవమానిస్తున్నాయి. ఆ అవమానాలు అతని మనస్సుని గాయపరచాయి. కులాల పట్టుదలతో ఆతడు అన్నగారికీ, తండ్రికీ ఎదురు తిరగడమా అని లచ్చమ్మ అభ్యంతరం. కులభేదాలు దేశ స్వాతంత్య్ర యుధ్ధానికి ఆటంకకారులుగా వున్నాయని రామనాధం విచారం. చాతుర్వర్ణ్యం మయాసృష్టం గుణకర్మ విభాగశః|| అంటూ గీతా శ్లోకాలు రోజూ పఠిస్తూన్నారు. దానికెంతో విశదంగా వ్యాఖ్యానం చెప్తూనే వున్నారు, తమ వూరి బ్రాహ్మణీకం. నిత్య జీవితంతో ఈ గుణాలకీ, కర్మలకీ సంబంధంలేని కుల కట్టుబాట్లు ఆచరిస్తున్నారు. వాటిని కదిలించబోతే కరుస్తున్నారు. అటువంటప్పుడు వెంకటరమణననవలసిన పనేమిటి? తప్పు మనది..... లచ్చమ్మకు కులభేదాలు కృత్రిమం అంటే అర్ధం కాదు. వాని మధ్యనే ఆమె పుట్టి పెరిగింది. అంతకు మించిన ప్రపంచం ఆమెకు తెలియదు. కాని విశ్వనాధం సులభంగానే ఔననగలిగేడు. "వాడి మనస్సుకి బాధ నావల్లనా కలిగింది" అన్నాడు. "ఇక్కడ సమస్య వాడి మనస్సు నొప్పించడం కానే కాదు పెద్దనాన్నా! మన జీవితం, మన బ్రతుకు పద్ధతులూ ఎలా వుండాలి? మనం ఇంతవరకూ అలవాటు పడిన జీవితపద్ధతులు ఏవీ హేతువాదానికి నిలబడడం లేదు. అవి మన నడకకి అడ్డం అవుతున్నాయి. సంఘ సంస్కర్తలు ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో వున్న పేచీ చెప్తున్నారు. కాని, అసలు మన జీవిత పద్ధతి యావత్తూ మారిపోవలసే వస్తూంది. అలాగ మారకపోతే వెంకటరమణ ఒక్కడే కాదు. ముప్పయికోట్ల మంది వెంకటరమణలుగానే తయారు అవుతారు. కాదు! రమణలుగానే వున్నారు. వాళ్ళని దారిని పెట్టడం సులభం కాబోదు. వాళ్ళని మార్చాలి. మార్చి తీరాలి." ఏడు అమలాపురం కోర్టుల దగ్గరికి వచ్చేసరికి తన్నెవరో పిలుస్తున్నట్లు అనిపించి రామనాధం నిలబడ్డాడు. అటూ ఇటూ చూసేడు. పక్కనున్న ఇంటి గుమ్మంలో ఓ ఇరవయ్యేళ్ళ పడుచు తప్ప మరెవ్వరూ కనబడలేదు. తాను తిరిగి చూడడంతోనే ఆమె ముఖాన గుర్తింపు కూడా కనబడినట్లే తోచింది. కాని, ఆమె తననే పిలిచి వుంటుందనే అభిప్రాయం లేక మరల ముందడుగు వేయబోయేడు. "రామనాధంగారు కాదూ?" ఆ పిలుపు తననే, కాని ఆమె ఎవరో తనకు అర్థం అయినట్లు లేదు. "ఔను" ఆమె ఆతడు తనను గుర్తుపట్టలేదని గ్రహించింది. "మరిచిపోయేరన్న మాట." మరిచిపోయేనని చెప్పడానికి రామనాధం సిగ్గుపడ్డాడు. కాని జ్ఞాపకం లేదు. అందుచేత సమాచారం ఆవిడ నోటనే చెప్పించాలనే ప్రయత్నంలో జాగ్రత్తగా అడ్డుప్రశ్న వేశాడు. "మిమ్మల్ని హఠాత్తుగా ఇక్కడ చూసేసరికి ఎవరా అనుకున్నాను. సరి, ఏమిటి ఇక్కడ వున్నారు?" హాస్పిటలుకు వైద్యానికి వచ్చినవాళ్ళు సాధారణంగా వుండే యిళ్ళు అవి. కనక తరువాతి ప్రశ్న కూడా తగిలించేడు. "అంతా బాగున్నారా?" ఎరిగిన ముకం కనిపించిన సంతోషంలో ఆమె అతని మాటలలోని సందిగ్ధతను గమనించలేదు ఆమె తండ్రికి టైఫాయిడ్‌ వచ్చింది. చిరతపూడి వైద్యం మీద నమ్మకం లేక ఇక్కడికి తీసుకువచ్చేరు. ఆమె చిరతపూడి అనడంతోనే అర్థం అయింది. స్వరాజ్యం. అబ్బాయి నాయుడు కూతురు. "ఇప్పుడెల్లా వున్నారు. నడవండి, చూస్తాను."..... అన్నాడు ఆదుర్దా తెలిపిన కంఠంతో. "ప్రస్తుతం తగ్గింది. పథ్యం పెట్టేరు. కాని ఇంకా మంచం దిగి వీధిలోకి రాగల ఓపిక లేదు. డాక్టరుగారు మరో వారం ఉండమన్నారు." వాళ్ళ అమ్మగారు నిన్ననే ఇంటికి వెళ్ళేరు. నాలుగైదు రోజుల్లో తామూ వెడతారు. "సోమవారం మంచిరోజుట." అబ్బాయి నాయుడు వీరేశలింగంగారి శిష్యుడు. ఆయనకా మంచీ చెడ్డా రోజుల పట్టింపు! నవ్వు వచ్చింది. "ఆ పట్టింపు ఎవరిది?" "అమ్మది. ఇదివరలో నాన్నగారు తోసిపారేసేవారు. ఇప్పుడూరుకున్నారు." అతనిని తీసుకెళ్ళి స్వరాజ్యం తండ్రిని చూపింది. "నాన్నా! ఎవరో వచ్చేరు చెప్పుకోగలవా?".....అంది. "ఏం, నాయుడుగారు?" అంటూ రామనాధం కుశలప్రశ్నవేశాడు. గుడ్డివాళ్ళకి గ్రహణశక్తి చాలా నిశితంగా వుంటుందన్నమాటను నాయుడు రుజువు పరిచేడు. ఏడాది క్రితం ఒక్క రోజున ఓ గంటసేపు తనతో మాట్లాడిన రామనాధం కంఠస్వరాన్ని ఆయన గుర్తుపట్టేశాడు. చాల ఆనందంతో ఆహ్వానించేడు "ఎప్పుడు వచ్చేరు బాబూ?" నాయుడు జబ్బుచేసి అమలాపురంలో వున్నట్లే తెలియదని రామనాధం చాలా నొచ్చుకొన్నాడు. "బాలకృష్ణ రోజూ స్కూలు వదిలిపెట్టేక తప్పకుండా వచ్చి ఓ గంటసేపు కూర్చునే వెడుతున్నారు. ఆయనే చెప్పేడు మీరు జైలునుంచి వచ్చేరని..." అంది స్వరాజ్యం. రామనాధం వూళ్ళోకి వచ్చిన రోజున బాలకృష్ణ బడికి బయలుదేరుతున్నాడు. రోజూ ఇంటికి రాలేడు. గనక ఇక్కడే హైస్కూలు దగ్గరలో బస చూసుకొని వుంటున్నాడు. శని, ఆదివారాలు ఇంటికి వెడుతూంటాడు. "ఏదీ, నిల్చుని మాట్లాడినదేదీ? ఈ వేళ శుక్రవారం కదూ, రాత్రికి వస్తే తెలిసేది మీ పరిస్థితి" అన్నాడు రామనాధం. నాయుడు చాలసేపు తన పరిస్థితి వివరించి బాలకృష్ణతో కలిగిన పరిచయాన్ని ఎంతో సంతోషంగా వర్ణించేడు. "మంచి పిల్లవాడు." మీరిచ్చిన కరేలాలూ అవీ తిప్పుతున్నాడుట. ఓ అరడజను మందిని పోగుచేసేడుట." నాయుడు నవ్వేడు. టోపీలు తీసేసి హర్తాళ్‌ చేయాలనే ఆలోచన కలిగినందుకు ఇద్దరూ నవ్వుకున్నారు. వారిద్దరినీ కబుర్లకి వదిలి స్వరాజ్యం డాక్టరు వద్దకు బయలుదేరింది. వెళ్ళేముందు తాను వచ్చేవరకూ కదలవద్దని రామనాధాన్ని కోరింది. "మీరేదయినా పనిమీద వెళ్ళడం లేదుకదా? రెండు మాటలు చెప్పి మందు తీసుకు వచ్చెయ్యడమే." "త్వరగా రావాలి. నేనో చిన్న పని పెట్టుకు వచ్చేను." ఆ పని ఏదో చెప్పేడు. తన భార్యను తీసుకు వెళ్ళడం గురించి ఒక వకీలు గారినీ, హైస్కూలు హెడ్మాస్టరు గారినీ మామగారి వద్దకు కబురంపేడు. ఇప్పుడు రాజకీయాలకు తోడు, సాంఘిక బహిష్కార అభ్యంతరం కూడా అడ్డం పెట్టుకొని ఆయన ఆ ఆలోచనలను త్రోసిపుచ్చేడు. తాను సరాసరి ఆ అమ్మాయితో మాట్లాడుదామని వచ్చేడు. అన్నీ విని స్వరాజ్యం ఓ సలహా యిచ్చింది. "వారింటివద్దనైతే ఆ అమ్మాయి దైర్యంగా మాట్లాడకపోవచ్చు." మరి! ఆమె రోజూ ఏదో మందు కోసం డాక్టరు శాస్త్రిగారి వద్దకు వస్తూంది. సరిగ్గా వచ్చే వేళయింది. ఆమెతో మాట్లాడి తీసుకురావడానికి ప్రయత్నిస్తానని స్వరాజ్యం వాగ్దానం చేసింది. "వద్దు. మీకంత పరిచయం వుంటే నేను ఆమెతో సరాసరి మాట్లాడదలచి వస్తున్నానని చెప్పండి చాలు..." స్వరాజ్యం తిరిగి వచ్చి "చెప్పే"నంది. తాను వద్దన్నమాట కూడా మరచి రామనాధం "ఆమెనిక్కడకు రమ్మంటానన్నారు కదూ!" అన్నాడు. "మీరు వద్దన్నారని...." కాని, మళ్ళీ అంది. "చెప్పేననుకోండి. ఆవిడ ఔను, కాదు అనే లోపునే ఆమెకు తోడుగా వచ్చిన పోలీసు బంట్రోతు తొందర పెట్టడంచేత వెళ్ళిపోయేరామె..." రామనాధం నిరుత్సాహపడ్డాడు. "సరే. కానీండి." రామనాధం లేచేడు. "మీరు తిరిగి వచ్చేటప్పుడు కనిపిస్తారా?" అని నాయుడు ప్రశ్నించేడు. రామనాధం సందేహించేడు. తాను వెడుతూన్న చోట పని ఫలితాలనుబట్టి తన మనస్సు ఎలా వుంటుందో, ఆ గొడవలతో వీరిని బాధపెట్టడం అవుతుందనిపించింది. "కాదు, చీకటి పడేసరికి ఇంటికి వెళ్ళాలి. ఇంకోమారు కనిపిస్తాను." స్వరాజ్యం తాము వెళ్ళిపోయే రోజు గుర్తుచేసింది. "వీలయితే వచ్చే శనివారం పొద్దుట వస్తారా?" "ఏమన్నా పని వుందా?" "మీరు వస్తానంటే..." "సరే........" "తప్పకుండా రాండి." "పనేమిటో చెప్పకూడదా?" "చెప్తే అందం ఏం వుంది? మీరు వచ్చినప్పుడే తెలుస్తుంది." రామనాధం వెళ్ళేడు. ఆయన వెళ్ళేక నాయుడు అడిగేడు. "ఎందుకమ్మా! ఆయనను......" "మనకేం పనిలేదు. ఆ రోజున ఆ అమ్మాయిని తీసుకురావచ్చుననుకొన్నాను." నాయుడు ఏమీ అనలేదు. స్వరాజ్యమే చెప్పుకుపోయింది. ముంగండ వాళ్ళంటే ఏదో అపనమ్మకం. మగడంటే ఏదో భయం. ఆయన కులం చెడ్డాడని బెదురు. తల్లిదండ్రులు విషం నూరిపోశారు. ఇప్పుడేనా ఆమెను ఎదుట బెడతారని స్వరాజ్యానికి నమ్మకం లేదు. నాయుడు ఒక్క నిట్టూర్పు విడిచేడు. "కొత్తదారి ఏది తొక్కినా ఈ గొడవలు తప్పవు కాబోలు." చదువుకొన్న తన కూతురును భర్త నిరాకరించడం ఆయన మనస్సులో మెదిలింది. ఎనిమిది రామనాధాన్ని వాకిట్లోనే నిలబడి వున్న సబినస్పెక్టరు ముందుగా పలకరించేడు. "ఏమిటిలా వచ్చేరు?" ఎవరో పరిచితుడైన వ్యక్తిని, వూహించి వుండని చోట చూసినప్పుడు అడిగినట్లున్న ఆ ప్రశ్నకు రామనాధం తేరిపార చూసేడు. అప్రయత్నంగానే అలవాటు కొద్దీ అనేశాడు. "నమస్కారం." సబినస్పెక్టరు ప్రతినమస్కారం చేసేడు--"నన్ను గుర్తు పట్టలేదనుకుంటాను." అన్నాడు. "క్షమించాలి." "నేను అంబాజీపేటలో వుండేవాడిని." "ఓహో." అంటూ రామనాధం ముందడుగు వేయబోయేడు. సబినస్పెక్టరు మరల అడ్డు వచ్చేడు. "ఆగండి....." "ఎందుకు? నాతో తమకేమన్నా పనుందా?" "ఏమీలేదు." "మరి." "సర్కిల్‌గారు ఏదో పనిలో వున్నారు. తమరిని కలుసుకొనేటందుకు వచ్చేవారికిప్పుడు వీలు కాదని చెప్పమన్నారు." రామనాధం ఒక్కక్షణం నిలబడ్డాడు. వెళ్ళిపోదామనిపించింది. కాని, అంతలోనే తాను వచ్చిన పని పూర్తి చేసుకోనిదే పోరాదని మళ్ళీ అనిపించింది. అతని మనస్సులో కలిగిన సందిగ్ధభావాన్నికనిపెట్టినట్లు సబినస్పెక్టరు మళ్ళీ ప్రారంభించేడు. "అందుకే నేనిక్కడ నిల్చున్నాను." "సర్కిల్‌గారి కోసం వెడుతున్నానని ఎందుకు అనిపించింది?" సబినస్పెక్టరు అదో ప్రశ్నా అన్నట్లు నవ్వేడు. "ఈ ఇల్లు సర్కిల్‌గారిది కనుక." "క్షమించండి. మీ సర్కిల్‌గారితో నాకేం పనిలేదు. నా భార్య ఈ యింట్లో వుంది." మరు సమాధానానికి ఎదురు చూడకుండా అతనిని తప్పుకొని రామనాధం చరచరా గుమ్మాలెక్కేడు. వెనకనుంచి "ఆగండి" అంటున్న సబినస్పెక్టరును పొమ్మన్నట్లు చేయి ఆడించి, వెనుతిరిగి చూడకుండానే సావిట్లో అడుగుపెట్టేడు. పడక కుర్చీలో కూర్చుని పేపరు చదువుకుంటున్న నారాయణమూర్తి రామనాధాన్ని చూడగానే నిటారుగా కూర్చున్నాడు. "వాకిట్లో సబినస్పెక్టరు లేడూ?" "లేకేం వున్నారు. అయితే ఆయనతో నాకేం పనిలేదు. ఈ ఇంట్లో నా భార్య వుంది." ఆ అవహేళనకు నారాయణమూర్తికి కోపం వచ్చింది. "నీతో మాకు పనిలేదు. నాలుగు రోజుల క్రితం వెంకట్రామయ్య హెడ్మాస్టరుతో మాట్లాడేను." "కలుసుకున్నా, వారు చెప్పేరు. అంతకు పూర్వం రామసోమయాజులుగారితోనూ చెప్పేరు......" గుమ్మంలో కనిపించిన సబినస్పెక్టరుతో నారాయణమూర్తి తాను ఒక ఆరగంటలో పని పూర్తి చేసుకు వస్తాను వెళ్ళమన్నాడు. "ఒక అరగంట టైమిచ్చేరన్నమాట." "ఇంకా చాలా పనులున్నాయి" అన్నాడు నారాయణమూర్తి విసురుగా. "నాకేం అభ్యంతరం లేదు. నేను......" అతని పట్టుదలను చూసి నారాయణమూర్తి విస్తుపోయేడు. "అభిమానం, సిగ్గు లాంటివి వదిలేస్తేగాని జైలుకు వెళ్ళలేరు" అన్నాడు. "ఆ విషయంలో మీతో వాగ్వాదం పెట్టుకోవడం సరికాదు కాని, ఒకటి. మనిషి అయ్యేక కొన్ని బాధ్యతలుంటాయి. అభిమానపడితే ఎల్లాగ?" "ఓహో. బాధ్యతలు కొన్ని తెలుసునన్నమాట." "కూతురునిచ్చిన అభిమానంతో గాకపోయినా ఇంటికి వచ్చిన పెద్దమనిషి అనే మర్యాదకయినా కూర్చోమంటారు బాధ్యతలు గలవాళ్లు. కనీసం ఆ మాత్రం తెలియని వాళ్ళకన్న నేను చాలా నయం." నారాయణమూర్తి ఓడిపోయానన్నట్లు ముఖం పెట్టేడు. కుర్చీలోంచి లేచేడు. రామనాధం ఆ వేడిమీద మరోపోటు పొడిచేడు. "అయ్యయ్యో. తమరు పెద్దలు. తమరు లేచి నాకు చోటు ఇవ్వబోవడం మర్యాద కాదు. కనీసం నేనా మర్యాదను పాటిస్తాను." కొరడా దెబ్బ తగిలినట్లు నారాయణమూర్తి విలవిలలాడిపోయేడు. ఉక్రోషమూ కలిగింది. "నువ్వొస్తావని కలగన్నాం." వాకిట్లో సబినస్పెక్టరు ఆటంకమూ, నారాయణమూర్తి వ్యవహారమూ చూశాక తాను వస్తున్న వార్త ఇంటికి చేరిందని అతడు గ్రహించేడు. స్వరాజ్యం చెప్పిన మాటను సుందరి ఇంటిలో చెప్పింది. ఏం చెయ్యాలో వారికి అర్థం కాలేదు. ఎదుటపడకపోయినా ఇంటిలోని వారంతా గుమ్మాల ప్రక్కనా, గోడల వెనకా దాగి వున్నారని రామనాధానికి అనిపించింది. కాని పైకి ఏమీ తేలలేదు. నారాయణమూర్తి వీధిలో వున్న బంట్రోతును పిలిచి కుర్చీ తెప్పించి వేయించేడు. కూర్చున్నాక గృహస్తు మర్యాద గుర్తు వచ్చింది. "మంచినీళ్ళు కావాలా?" "ఇంటిలో ఎవరూ వున్న అలికిడి లేదు. కావాలంటే తమరు లేవాల్సి వస్తుంది. వద్దు." నారాయణమూర్తి కసిగా అనేశాడు. "మామూలు రోజుల్లో అయితే నువ్వు చెప్పిందే అనుకో. కాని, నీకిప్పుడా పట్టింపు వుండదు గదా. మా బంట్రోతు తెస్తాడు. మొహమాటపడకు. వాడు ఈడిగ." "అవసరం లేదు. అంతేకాని పట్టింపులకేముంది? జైలులో మాకు గంజి కాచి పోసింది, మీ వూరివాడేనట. మాదిగ పుల్లిగాడు." అతని మాట వింటూనే లోపలి నుంచి అన్నపూర్ణమ్మ విసవిసా వచ్చింది. ఆవిడ కళ్ళనీళ్ళు తిరుగుతున్నాయి. కంఠం డగ్గుత్తిక పడ్తూంది. ఆమెను చూడగానే రామనాధం నమస్కారం చేశాడు. "నమస్కారం అత్తగారూ." ఆమె అతని నమస్కారాన్నీ, మర్యాదనూ గమనించే స్థితిలో లేదు. "ఎందుకు నాయనా! ఏదో మా కర్మం ఇల్లా వచ్చిందని తల ఎత్తుకోలేక కుమిలి కుమిలి ఏడుస్తూంటే, పైగా మమ్మల్ని రచ్చ చేసి బాధపెడతావు?" ఆమె రాకకు మర్యాద చూపుతూ కుర్చీలోంచి లేచిన రామనాధం ఆమె అభియోగానికి నోరు తెరిచేడు. "నేను బాధ పెడుతున్నానా?" "కాకపోతే ఈ రాయబారాలేమిటి? ఈ రభసలేమిటి?" "మా నాన్నగారిని గుమ్మం ఎక్కవద్దన్నాక చెయ్యవలసిందేమిటి?" "నిన్ను మాత్రం ఎక్కమన్నామేమిటి?" అన్నాడు నారాయణమూర్తి. "ఇల్లాంటి వాటినే అనిచ్ఛాప్రారబ్ధాలంటారు. మరి నాకు తప్పదుగా." అందరూ ఒక్క నిముషం వూరుకున్నారు. మరల రామనాధమే ప్రారంభించేడు. "మీ పెద్దవాళ్ళ అభిప్రాయాలు నాకు తెలిశాయి. తెలియచెప్పడంలో మీరేమీ సందేహం మిగల్చలేదు. కాని, మీ అమ్మాయి ఆలోచన ఏమిటో తెలుసుకోవాలని గాని...." కాని అన్నపూర్ణమ్మే అది సాధ్యం కాదంది. "చిన్నపిల్ల, దానికేమి తెలుసు?" ఇంక నీతో మాట్లాడేది లేదు. నడవ్వచ్చునన్నట్లు నారాయణమూర్తి కుర్చీలోంచి లేచేడు. తాను వచ్చిన పనేదో తేలేవరకూ కదిలేది లేదన్నట్లు రామనాధం కుర్చీలో కూర్చున్నాడు. "మీరు చేస్తున్న పని కష్టసుఖాలననుభవించేది ఆవిడ" అన్నాడు. "ఒకటే సుఖం." అంటూ అన్నపూర్ణమ్మ ఒక్క నిట్టూర్పు విడిచింది. "అయిందేదో అయిపోయింది" అన్నాడు నారాయణమూర్తి. రామనాధం ఒప్పుకోలేదు. "మీకంతే కావచ్చు. నాకూ ఆమెకూ అల్లా కాదుగా. మా ఇద్దరిలో ఎవరు బ్రతికివున్నా తప్పదు. అయిపోయిందనుకోలేము." ఆ దంపతులకేమీ సమాధానం తోచలేదు. ఒక్క నిముషం ఆగి రామనాధం మళ్ళీ అన్నాడు. "నిజానికి నేనూ మీలాగే అనుకున్నాను. కాని దువ్వూరి సుబ్బమ్మగారు వొట్టు వేయించుకున్నారు. అభం శుభం ఎరగని ఆడపిల్లని బ్రతికున్నంత కాలం ఏడిపిస్తావుట్రా అని వేధించుకుతింది ఆవిడ. అందుకు వచ్చేను గాని..." దువ్వూరి సుబ్బమ్మగారి ప్రోత్సాహంతో వచ్చేననేసరికి నారాయణమూర్తికింక పట్టరాని కోపం వచ్చింది. "వెళ్ళి అల్లరి చేయమని ఆవిడ పంపుతూందన్నమాట." ఆ ఆరోపణ విని రామనాధానికి కోపం వచ్చింది. అసహ్యమూ కలిగింది. రామనాధం అనవసరమన్నట్లు తల తిప్పుకున్నాడు. కాని నారాయణమూర్తి వదలలేదు. "మళ్ళీ మళ్ళీ వచ్చి....." మాట మధ్యలోనే రామనాధం అందుకున్నాడు. "మీ ఇంటికి రావడానికి మహా సంతోషపడుతున్నాననుకోకండి..." ఆ మాటకి కష్టం తోచినా అన్నపూర్ణమ్మ ఏమీ అనలేదు. నారాయణమూర్తి ఆ అభిప్రాయాన్ని హర్షించేడు. "కోర్టు సమన్లు వచ్చినా సంతోషమే....." రామనాధం ఆశ్చర్యం కనబరిచేడు. "ఎందుకు?" "పిల్లను పంపడం లేదని కోర్టుకెక్కినా నా అభ్యంతరం లేదు." "చాల్లెండి" అని అన్నపూర్ణమ్మ మగడిని మందలించింది. "పిల్ల బ్రతుకు నవ్వులపాలు చేయకు నాయనా! ఇప్పటికి అయిందానికి అది దిగులు పడిపోయింది." అని రామనాధాన్ని బ్రతిమాలుతున్నట్లంది. భార్యను తెచ్చుకోనేటందుకు కోర్టుకెళ్ళమన్న తరువాత రామనాధం ఇంక కూర్చుండడం అనవసరం అనుకున్నాడు. లేచేడు. "ఇంత వరకూ నాకా ఆలోచన కలగలేదు. ఇంక ఆలోచిస్తాను. అయితే మీ అమ్మాయి అభిప్రాయం నాకు స్పష్టంగా తెలియాలి. నేను అక్కర్లేని పెళ్ళాన్ని తెచ్చుకొని నాకేం సుఖం? ఆవిడకేం సుఖం? కాని ఆమె ఆలోచన తెలియాలి..." "మేం చెప్తున్నాంగా......" అన్నాడు నారాయణమూర్తి "చిన్నపిల్ల దానికేం తెలుసు?" అంది అన్నపూర్ణమ్మ "మీరు చెప్పినట్లు మీ కూతురు చిన్నది. మిమ్మల్ని కాదనలేకుందేమో" అన్నాడు రామనాధం. "పెద్దదయ్యాక చెప్తుందిలే" నారాయణమూర్తి అవహేళనను రామనాధం లెక్కచెయ్యలేదు. "మగడి దగ్గరికి పంపే వయస్సు వచ్చిందని మీరంతా ఏడాది క్రితమే అనుకున్నారు. ఆపాటి వయస్సుగలామె మగడికి కబురు చెయ్యాలంటే దారే వుండదా?" ఆ మాట లోపల వుందనుకున్న సుందరికి వినబడేలాగున గట్టిగానే అన్నాడు. "మా పిల్లల్ని భయభక్తులూ, సిగ్గూ బిడియాలూ ఎరగకుండే లాగ పెంచలేదు" అని నారాయణమూర్తి సగర్వంగా చెప్పుకున్నాడు. "వాటి రంగూ, రుచీ, వాసనా వంటి లక్షణాలెల్లా వుంటాయో తమ సహవాసంలో తెలుసుకోగల అదృష్టం లేదు నాకు. ఏం చేస్తాం. అంతే పెట్టిపుట్టేనా" అంటూ ఎగతాళిచేస్తూ రామనాధం నమస్కరించేడు. "మరి సెలవా? నమస్కారం." అతని వెక్కిరింతనూ, నిర్లక్ష్యాన్నీ చూసి విస్తుపోయి నిల్చున్న ఆ దంపతుల్ని వదలి గుమ్మం వరకూ నడిచేడు. మళ్లీ అంతలో ఆగి వెనక్కి తిరిగేడు. "ఆమె అభిప్రాయం తెలిస్తే బాగుండునన్నానని చెప్పండి." మరల వెనుదిరిగి వీధిలోకి నడిచేడు. నారాయణమూర్తి గర్జించేడు. "ఎవరోయ్‌ అక్కడ?" "సార్‌!" అంటూ వాకిట్లో వున్న పోలీసు బంట్రోతు బెల్టు సవరించుకుంటూ గుమ్మం ఎక్కేడు. "తేలు వచ్చిందట, చెప్పు ఒకటి తీసుకెళ్ళు" అని అతనికి సలహా ఇచ్చి రామనాధం వెళ్ళిపోయేడు. మగని గొంతునూ, రామనాధం పోలీసువానికిచ్చిన సలహానూ విని అన్నపూర్ణమ్మ ఉలికిపడింది. భర్త మాట్లాడే లోపునే పోలీసువానికి పని చెప్పింది. "ఆ కుర్చీ తీసి వాకిట్లో వెయ్యి." తేలును చంపడానికి చేతిలోకి తీసుకున్న కాలి చెప్పునేం చెయ్యాలో అర్ధంగాక పోలీసువాడు తటపటాయించేడు. నారాయణమూర్తి అప్పటికి నిగ్రహించుకొన్నాడు. "అక్కర్లేదు. పోయిందిలే" అన్నాడు. తొమ్మిది తన తండ్రిని పురుగు మాదిరిగా దులపరించేస్తున్న రామనాధం మాటలకి సుందరి వుడికిపోతోంది. తన అభిప్రాయం ఏమిటో తెలిస్తే బాగుండునన్నప్పుడు ఎదుటపడాలనే అనిపించింది. నీతో కాపురం చెయ్యడం కన్న గోదావరిలో దిగడం సుఖమనుకుంటున్నానని చెప్పెయ్యాలనుకుంది. కాని పస్తాయించింది. ఆతడు వెళ్ళిపోయేక తల్లితో అనేసింది కూడా. "నేను వచ్చి చెప్పేస్తే ఈ పీడా వదిలిపోయేది కదే అమ్మా!" "పీడ అనకు. తప్పు." అని అన్నపూర్ణమ్మ మందలించింది. "పీడగాక ఏమిటీ రభస అంతా" అని సుందరి రెట్టించింది. దానినేమనాలో అన్నపూర్ణమ్మకు తోచలేదు. చిన్ననాటి నుంచీ పెరిగిన అలవాట్లలో భర్తను పీడగా భావించడం మహా పాపంగా భావిస్తూంది. తల్లిగా తన వయస్సు వచ్చిన కూతురు జీవితమంతా భర్తకు దూరంగా వుండాలా అనుకొని తల్లక్రిందులూ అయిపోతూంది. కాని, కాని....... అల్లుడు రాజకీయాలలో పడి తన భవిష్యత్తునంతనూ పాడుచేసుకొన్నాడే యనే బాధ వేరు... జైలులో నానాకూళ్ళూ కుడిచి కులం చెడి, ప్రాయశ్చిత్తానిక్కూడా నిరాకరించడం వేరూను.... కులం చెడిన వాడితో కూతురు కాపురం మాటను కూడా భరించలేదు. అతడెన్నటికేనా ప్రాయశ్చిత్తానికి అంగీకరించడా అనేది ఆమెకు మిగిలిన ఆశ. అదెల్లా సాధ్యమవుతుందో ఆమెకు తెలియదు. ఆ ఆశలేమన్నా వున్నా ఈవేళతో అవి భగ్నమయాయనే తోచింది. కాని, ఆ తగవులూ, గొడవలూ, తమకు మాత్రమే పరిమితం కావాలనీ, కూతురుకు దానిలో సంబంధం వుండరాదని ఆమె ఆలోచన. కూతురు మనస్సులో రేగుతున్న కల్లోలం ఆమెకేమీ తెలియదు. తమ సూటిపోటి మాటలు, ద్వేష ప్రకటనలతో ఆమె మనస్సు విరిగిపోయిందనే సంగతి ఆమె అర్థం చేసుకోవడమే లేదు. "తప్పు తల్లీ! లెంపలు వేసుకో!" అంటూ కూతురు బదులు తానే లెంపలు వేసుకొంది. ఆ పాతివ్రత్య ప్రబోధం వినేసరికి సుందరి ఒళ్ళు రగిలిపోయింది. తమకూ, తమ కుటుంబానికీ అవమానాలు కలిగించడమే పరమావధిగా వ్యవహరిస్తున్నాడనుకొంటున్న మనిషి పీడగా వున్నాడనుకోవడం తప్పా? "లక్ష మాట్లంటాను. పీడ, పీడ." అంటూ సుందరి ఉడుకుబోతుతనంతో భళ్ళున ఏడ్చేసింది. గదిలోకి పోయి తలుపు గడియపెట్టేసుకుంది. ఆ వేగం తగ్గేక కూడా ఆమె తలుపు తియ్యలేదు. సరంబీ వేపు కన్నార్పకుండా చూస్తూ ఏవేవో ఆలోచనలలో కొట్టుకుపోయింది. పండుగలకూ, సెలవులకూ వచ్చినప్పుడల్లా రామనాధం ఇంట్లో ఎంతో సరదాగా వుండేవాడు. తమ్ముళ్ళూ, చెల్లెళ్ళతో కబుర్లు చెప్తూ గంతులు వేస్తూంటే చాటునుంచే తాను ఎంతో పొంగిపోయేది. అటువంటి వాడు ఒక్కమారెల్లా అయిపోయేడు. మాటలలో ఆ అవహేళన, వెక్కిరింత, కోపం, ద్వేషం........ ఎందుకొచ్చాయి? అతనితో సుఖమయమైన జీవితం గడపగలదని తన వాళ్ళంతా తన అదృష్టానికెంతో మురిసిపోయేవారు. ఇప్పుడంతా తన్ను దురదృష్టవంతురాలంటున్నారు. ఆ అదృష్టం, దురదృష్టం తన జీవితంలో ఏ రూపంలో ప్రతిబింబిస్తున్నాయో ఆమెకే తెలియదు. ఒకటే తెలుసును. అతడు వస్తున్నాడంటే తనకు సంతోషం కలగలేదు. భయం వేసింది. వచ్చి వెళ్ళేక భయం కూడా లేదు. ఇప్పుడు ఎంతో కసి ఏర్పడింది. "తన అభిప్రాయం కావాలట." సుందరి గబగబా లేచి కూర్చుని తండ్రి డ్రాయరునుంచి కాగితం, ఫౌంటెన్‌పెన్నూ తీసింది. కాని ఎలా ప్రారంభించాలో ఆమెకు తోచలేదు. తను నేర్చుకొన్న అలవాట్ల ప్రకారం "బ్రహ్మశ్రీ వేదమూర్తులైన" అని ప్రారంభించింది. కాని అంతలో ఆ వేదమూర్తి తమ వూరి మాదిగ పుల్లడి చేతి అన్నం తిన్నానని గొప్పగా చెప్పుకొన్న మాట గుర్తు వచ్చింది. చిన్న నవ్వు, అంతో వెలపరం. కాగితం చింపేసింది. మరల వ్రాసింది. తీసేసింది. మరల వ్రాసింది. చివరకు ఆ కాగితాలన్నీ నలిపి పారేసి, కలం సొరుగులో పెట్టేసింది. కాని, తన అభిప్రాయం రామనాధానికి చెప్పాలి. లేకపోతే..... తన అభిప్రాయం తెలిసే కోర్టుకి వెడతానన్నాడో, తెలియక వెడతానన్నాడో రామనాధం మాట ఆమెకు స్పష్టంగా అర్థం గాలేదు. ఆమె ఆలోచనలన్నీ కోర్టుకెళ్ళాలిసి వొస్తుందేమోనన్న సమస్య మీదకు క్రమంగా కేంద్రీకృతమయ్యేయి. రాత్రి తల్లీ-తండ్రీ ఆ విషయమే మాట్లాడుకుంటూ వుంటే గోడ పక్కనుంచి వినడానికి ప్రయత్నించింది. "ఆతడు కోర్టుకెడితే పిల్లలెవ్వరికీ పెళ్ళిళ్ళు కావు. అందరూ వేలుపెట్టి చూపిస్తారు" అని తల్లి భయం. వీళ్ళు కూతుళ్ళని కాపురానికి పంపించరు. అల్లుళ్ళని కొడతారు. చివరకు కోర్టుకెళ్ళవలసి వస్తుందన్న మాట చిన్నదేం కాదు. అటువంటి ఘట్టం రాకుండా ఏం చెయ్యాలో ఆ దంపతులకు అర్ధం కాలేదు. మగడు మతాంతరుడైతే భార్యను రప్పించుకొనేటందుకు కోర్టు అనుమతిస్తుందేమో రేపు వకీలుగారిని అడిగి వస్తానని తండ్రి ఆలోచన.... "కోర్టులో గొడవ తప్పదంటారా?" అయితే జైలుకెళ్ళి కులం చెడినా, ప్రాయశ్చిత్తం చేయించుకోకపోవడం అనేది మతాంతరుడు కావడంగా లెక్కలోకి వస్తుందో రాదోయని నారాయణమూర్తి ఆలోచన. రామనాధం తన కోసం కోర్టుకెళ్ళడం స్థిరమే అయినట్లు సుందరికి భయం పట్టుకొంది. దానిని నివారించడం ఎల్లాగ? ఈ విషయం ఆలోచించిన కొద్దీ రామనాధంతో మాట్లాడడం అత్యవసరమని అమెకే అనిపించసాగింది. ఏమి మాట్లాడుతుంది? ఎలా మాట్లాడుతుంది? మరో రెండు రోజులు పోయాక పెత్తల్లి కొడుకు సత్యం వచ్చేడు. అతడిచ్చిన వార్తా సమాచారాలతో తల్లి మరీ ఆందోళన పడింది. 'కోర్టులో ఓ కాగితమ్ముక్క పడెయ్యవోయ్‌' అని వూళ్ళో వాళ్ళు సలహాలిస్తున్నారని అతడి వార్త. 'అనవసరంగా గొడవలు పెంచుకోకండ'ని ఆమె అక్క మగడు రామమూర్తి సలహా. అన్నపూర్ణమ్మ చతికిలపడిపోయింది. సత్యం చెప్పిన మాటలనుపట్టి తాము కోర్టుకు భయపడి పిల్లను పంపేసినా అక్కడ సుఖపడుతుందనే ఆశ లేదు. రామనాధం తోటలో పాకలోనే మకాం పెట్టేడు. చుట్టూ దగ్గరలో ఇళ్ళు లేవు. ఒంటరిగా పలకరించే ఆడవాళ్లు కూడా లేకుండా కాపురం చెయ్యాలి? అతడు తన వద్ద వున్న డబ్బూ, అప్పు చేసి తెచ్చిన డబ్బూ ఖద్దరు వొడికించడం, నేయించడం మీద పెడుతున్నాడు. ఓ పాతిక మందికి రాట్నాలు కొని యిచ్చి వొడికిస్తున్నాడు. ఎప్పుడూ ఇంటిపట్టున వుండడు. సంధ్య వగైరాలు గూర్చి ఇప్పుడంతగా ఎవరూ చెయ్యడం లేదు గాని, జందెం వేసుకోననీ, తద్దినాలు పెట్టననీ కూడా అంటున్నాడు..... రామనాధం అపరాధ సహస్రాన్ని ఎటు తిప్పి తిరగేసినా ఆశారేఖ కనబడ్డం లేదు. తల్లి ఆవేదన చూడలేక సుందరి తన్ను పంపించెయ్యమంది. "ఆ ఎద్దడినీళ్ళు తేగలవుటే కూతురా..."యని అంగలార్చింది అన్నపూర్ణమ్మ. "తేలేకపోతే అందులో పడి చస్తాను. వాళ్ళ ప్రాణం తేలిక పడుతుంది." విసువు, నిస్పృహ, ఆగతికత్వంతో యధాలాపంగా అన్నమాటైనా అన్నపూర్ణమ్మ నిజంగా అదిరిపోయింది. "అల్లాంటి పనెప్పుడూ చెయ్యకే తల్లీ. ఇన్నేళ్ళూ పువ్వుల్లో పెట్టి పెంచినది నిన్ను ముంగండ చెరువుకు వప్పచెప్పడానికి కాదమ్మా! చచ్చి ఎవరిని సాధిస్తాము.." అన్నపూర్ణమ్మ ఆత్మహత్య వలన కలిగే పాపం, అది సాధించలేని ప్రయోజకతా గురించి చెప్తూంటే సుందరికో ఆలోచన తట్టింది. ఆ భర్తతో కాపురం తనకిష్టం లేదని చెప్పేస్తుంది. నెమ్మదిగా చెప్పడం కాదు గట్టిగా చెప్పేస్తుంది. కాదు కూడదని అతడంటే నడవమంటుంది. "కాని, నీతో కాపురం చెయ్యను, ముట్టుకున్నావంటే చెర్లో పడి చస్తాను" అని కూడా చెప్పేస్తుంది. అతడు వినకపోతే నిజంగా చచ్చిపోతుంది. పెళ్ళాన్ని చంపేసేడని అతని మీద కేసు అవుతుంది. ఆ విధంగా కసి తీర్చుకుంటా... అనుకుని ఒక విధంగా మనస్సుని సంతృప్తి పరచుకొంది. మధ్యమధ్య తన నిర్ణయం తలచుకొని మనస్సులో వ్యధపడుతూంది. తాను బలవంతంగా మరణిస్తే ఎవరెవరు దుఃఖపడతారో, వ్యవహారాలు ఎలా మారతాయో వూహించడానికి ప్రయత్నించసాగింది. ఆ కల్పనలు ఒక్కొక్కప్పుడు భయం కలిగించినా కసి తీర్చుకోవాలనే ఆశను పురిగొల్పసాగేయి. రామనాధానికి చెప్పెయ్యాలి. "కులభ్రష్టుడితో తనకేం పనిలేదని చెప్పేస్తుంది. వినడూ.... అనుభవిస్తావు సుమా యని చెప్పేస్తుంది." నిర్ణయమైతే చేసింది కాని, రామనాధంతో చెప్పడమెలాగ? అతనిని చూడడం ఎక్కడ? తమ యింట్లో కూడదు. తాను ముంగండ వెళ్లదు. మరి? స్వరాజ్యం జ్ఞాపకం వచ్చింది. మొన్ననాతడు వచ్చినట్లు ఆమే చెప్పింది. వాళ్ళింటికి వస్తూంటాడేమో.... పది మరునాడు మాటవరసకు అడిగినట్లు స్వరాజ్యమే ఆసుపత్రిలో కనిపించినప్పుడు అడిగింది. "మీ భర్త వున్నారా?" "వుంటే మళ్ళీ కనిపించరా?" అని సుందరి టక్కున సమాధానమిచ్చింది. ఆ ప్రశ్న వచ్చినప్పుడు ఆమె ముఖంలో సిగ్గు గాని, సంతోషం గాని కనబడకపోవడం స్వరాజ్యానికి అనుమానం కలిగించింది. మాటకూడ తుంచేసినట్లే వుంది. ఆమెకు భర్త యెడ ఇష్టం వుండీ, తల్లిదండ్రులదే ఆటంకమైతే తానా భార్యాభర్తలను సమ్ముఖపరచడంలో అర్థం వుంది. చిన్న చిన్న మనఃక్లేశాలున్నా సర్దుకొంటాయి. కానీ, ఆమెకే వ్యతిరేకత అయితే మధ్యన తాను ఇరుకున పడవలసి వస్తుంది అనుకొని వూరుకుంది. కాని, అటుతర్వాత సుందరే తన ప్రయత్నాలకు సాయపడుతున్నట్లు అనిపించి స్వరాజ్యం ఆలోచనలో పడింది. ఆ ఆలోచన తేల్చుకొనే లోపునే ఆమె స్వరాజ్యాన్ని తమ యింటికి ఆహ్వానించింది. ఆమెచేత ఆహ్వానం ఇప్పించుకొంది.... ఆ రోజున వుదయం ఆస్పత్రిలో కనిపించినప్పుడు సుందరి స్వరాజ్యాన్ని పలకరించింది. "మీరు సోమవారం వెళ్ళిపోతారంటున్నాడు కాంపౌండరు. నిజమేనా?" స్వరాజ్యం అంగీకరించింది. "మీ నాన్నగారికి బాగా సులువు చిక్కిందా?" "ఆ. ఇంట్లో తిరుగుతున్నారు." "మీరు మళ్ళీ వెళ్ళిపోతారు. మళ్ళీ ఎందుకు కలుస్తారు? వెళ్ళేలోపున మా యింటికి ఓ మారు రాండి." స్వరాజ్యం అంగీకరించింది. వెంటనే సమయ నిర్దేశం కూడా చేసింది. "ఇప్పుడు రాండి." "మందు ఇంటి వద్ద ఇచ్చి...." "ఓస్‌. అంతేనా? మీ ఇల్లు ఇక్కడే కదా, నడవండి. మీ నాన్నగారిని నేనోమారు చూసినట్లూ అవుతుంది. ఇద్దరం కలిసే మా ఇంటికి వెడదాం." ఇద్దరూ బసకు వచ్చేరు. సుందరి పది నిముషాలు కూర్చుంది. అబ్బాయి నాయుడు యోగ క్షేమాలు తెలుసుకొంది. స్వరాజ్యం ఇచ్చిన బరణి అందుకొని బొట్టు పెట్టుకుంది. పండూ, తాంబూలమూ తీసుకుంది. ఆమె అక్కడున్న పది నిముషాలూ ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టే స్వరాజ్యానికి అనిపించింది. ఇద్దరూ కలిసి సుందరిగారింటికి వెళ్ళేరు. తిరిగి వచ్చేసేటప్పుడు స్వరాజ్యం తామిక వుండే నాలుగైదు రోజులలో ఎప్పుడేనా ఓమారు రావలసిందని ఆహ్వానించింది. కాని అన్నపూర్ణమ్మ 'అమ్మో' అంది. "గుమ్మం కదిలిందని వింటే వాళ్ళ నాన్నగారు కోపం చేస్తారు తల్లీ....!" సుందరి మామూలుగా అనేసింది. "మీ అమ్మగారు వస్తారన్నారు కదూ. వచ్చేక ఓ మారు వస్తాలెండి." --అంటూనే తల్లి భయానికి సమాధానం ఇచ్చింది. "డాక్టరు శాస్త్రిగారి ఆసుపత్రికి రెండిళ్ళ అవతలేనమ్మా వీరు వుంటున్నది." స్వరాజ్యం ఇంకేమీ అనలేదు. శనివారం ఉదయం తన తల్లి వచ్చినట్లు చెప్పగానే సుందరి బయలుదేరింది. అదంతా చూస్తూంటే ఆమె కోరికా, నిర్ణయమూ ప్రకారమే తాను రామనాధాన్ని రప్పిస్తున్నట్లు అనిపించి, స్వరాజ్యం కంగు తింది. తన తల్లిని పలకరించి పది నిముషాలు కూర్చుని 'ఇంక వెడతానండి" అని సుందరి లేస్తూండేసరికి వీధిలో మాట వినిపించింది. మంచం మీద కూర్చుని వున్న నాయుడు ఆ కంఠాన్ని గుర్తించేడు. "రామనాధంగారు వచ్చేరమ్మా!" మరు నిముషంలో గుమ్మం ఆవల నుంచి రామనాధం ప్రశ్న వినిపించింది. "తేలికగా వున్నారా నాయుడుగారూ?" "దయచేయండి....ఆఁ......మీ దయవలన బాగానే వుందండి." అంటూ నాయుడు కూతురుని పిలిచి కుర్చీపీట దగ్గరగా వేయమన్నాడు. రామనాధం గదిలో పైవాళ్ళు కూడా ఎవరో ఉన్నట్లనిపించి గుమ్మంలోనే నిలిచిపోయేడు. "ఎందుకులెండి. ఇక్కడ కూర్చుంటా." మాణిక్యమ్మ ఆహ్వానించింది. "లోపలికి రండి బాబూ! పైవాళ్ళెవ్వరూ లేరు" అంది. "మీరెప్పుడు వచ్చేరు? వారం రోజుల క్రితం వచ్చినప్పుడు మీరు లేరు..." అతడు లోపలికి కాలు పెట్టబోయి ఇంకా పైవారెవరో వున్నట్లు చూసి ఆగేడు. మాణిక్యమ్మ నవ్వుతూనే అంది-- "ఈ అమ్మాయి ఎవరో ఎరుగుదురా?" రామనాధం లోనికి చూసేడు. ఈ ఏడాది లోపలా సుందరి బాగా సాగింది. కొంత వొళ్ళు చేసింది. ఏడాది క్రితం ఓ పదినిముషాలు మాత్రమే చూసిన సుందరి కాదు ఇప్పుడాతని ఎదుట వున్నది. పైగా అతడామె అక్కడకు రాగలదనే ఆలోచనలో కూడా లేడు. ఒకమారు చూసేడు. సుందరి తల తిప్పుకొంది. ఇంకా కొత్త అమ్మాయిని దీక్షగా చూడడం మర్యాద కాదని తనూ తల తిప్పుకున్నాడు. "నేనెరిగినట్లు గుర్తు రావడం లేదు." సుందరి క్రింద పెదవి కరచుకొంది. స్వరాజ్యం ఫక్కున నవ్వింది. "వాళ్ళిద్దరూ పరిచయం చేసుకుంటారు మీరు రండి. భోజనం చేద్దురు గాని" అంటూ మాణిక్యమ్మ భర్తను లేవదీస్తూంటే రామనాధానికి ఆశ్చర్యమూ, సిగ్గూ కలిగేయి. తన భార్యనే తాను గుర్తుపట్టలేకపోయేడు. ఆమె సుందరియేనా? అనుకొన్నాడు. పదకొండు ఆతడాశ్చర్యం నుంచి తేరుకొనేలోపున నాయుడు కుటుంబం వంట గదిలోకి వెళ్ళిపోయేరు. రామనాధమూ-సుందరీ మాత్రమే ఆ గదిలో మిగిలేరు. ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ, తనలో తాననుకున్నట్లు అన్నాడు. "గుర్తు పట్టలేకపోయేను." 'గుర్తు కూడా పట్టలేని మనిషి కోసమేనా అంత రగడ చేశాడు' అనుకొంది సుందరి. అతడీ మారు సర్దుకొన్నాడు. "డాక్టరు దగ్గరకు వస్తున్నావన్నారు. ఏమిటనారోగ్యం? ఇప్పుడు నెమ్మదిగా వున్నావా?" "చూస్తున్నారుగా" అని సుందరి పుల్లవిరిచినట్లు అంది. రామనాధం ఉలికిపడ్డాడు. మాట కటువుతనంలో ఆమె తండ్రికి ఏ మాత్రమూ తీసిపోదు అనిపించింది. ఆ కంఠస్వరాన్ని తాను భరించలేడు. భార్యాభర్తలు నవ్వుతూ, తుళ్లుతూ సరదాగా వుండాలనేది అతని ఆశ. కాని, ఇదేమిటి? అయినా అంత త్వరలో ఓర్పు కోల్పోయే స్వభావం కాదు. ఆమె అని తెలిసిన వెంటనే మనస్సులో మెదిలిన అభిప్రాయాన్నే పైకి చెప్పేసేడు. "ఇదివరకు చూసినప్పటికన్న బాగా సాగేవు." ఆమె ఏమీ అనలేదు. అతని కళ్ళలో కనిపించిన మెచ్చుకోలుకు ఆమె ముఖం ఎర్రబడింది. "గుర్తు పట్టలేకపోవడంలో ఆశ్చర్యం ఏం వుందీ...." అన్న ఆత్మ సమర్థనకు కూడా ఆమె ముఖంలో కదలిక రాలేదు. "నిల్చున్నావు.....రా ఈ కుర్చీపీట మీద కూర్చో......" "ఎందుకు లెండి......." "నువ్వు నిల్చుంటే నాకు కాళ్ళు పీకుతున్నాయి." అంటూ రామనాధం మేలమాడేడు. సుందరి ముఖంలో నవ్వూ, ఉత్సాహమూ కనబడలేదు. రామనాధం మరింత చొరవ చెయ్యబోయేడు." "అంత సిగ్గు పనికిరాదు రా.....కూర్చో" అని చేయి పట్టుకొనేటందుకు ముందుకు అడుగువేసేడు. అసహ్యకరమైన పురుగు మీదకు వస్తూంటే జంకినట్లు సుందరి ఒక అడుగు వెనక్కి వేస్తూ ముణుచుకుంది. "ముట్టుకోవద్దు." ఆ భంగిమా, కంఠం చూసి రామనాధం గతుక్కుమన్నాడు. "నేను ముట్టుకొంటేనే మైలబడిపోతావా?" సుందరి చురుక్కుమనేలా చూసింది. నీ ప్రశ్నకు సమాధానం కూడా అవసరమా అన్నట్లనిపించి రామనాధం వెనక్కి తగ్గేడు. తమ దాంపత్య జీవితం ఇల్లాగే నడవాలి కాబోలనిపించి రామనాధం చిన్నపుచ్చుకొన్నాడు. ఆమె అన్నగారూ, అతని భార్యా మధ్య వున్న అన్యోన్యతను చూసి కలలుగన్న మనస్సుకు ఈ ప్రారంభం చురుక్కుమనిపించింది. "ఏడాదిక్రితం లేని మడి-మైల వచ్చిపడ్డాయి. కాని మన ఇంటికి వెళ్ళేక." "మన ఇల్లంటే.....?" రామనాధం ఆమె ముఖం వంక నిశితంగా చూశాడు. "చెరువుక్రింద తోటలో ఒక కుటీరం వేస్తున్నాను. అది మనది...." మనది అన్న మాటలో నొక్కు వినిపించి సుందరి తల తిప్పుకొంది. నీకిష్టమేనా అంటే లేదంటుందనిపించి నాలుక చివర వరకూ వచ్చిన ఆ ప్రశ్నను అంగిట్లోనే అణచివేసుకొన్నాడు రామనాధం. "ఈ వారం పది రోజులనుంచీ నిన్ను ఓమారు కలుసుకోవాలని నా ప్రయత్నం. ఈ వేళ అనుకోకుండా తటస్థపడ్డావు." "విన్నాను." అతడామె ముఖంవంక చూసేడు. "నాలుగు రోజులనాడు మీ యింటికి వచ్చేను....." "......." "మీ నాన్న, అమ్మా కనిపించేరు." "......." "వారితో కన్న నీతో మాట్లాడడం అవసరమని వారికి చెప్పేను." "ఆ మాట మీరు చెప్తూంటే విన్నా. ఒకమారు కాదు. రెండుమాట్లన్నారు. ఆ మాటలో వెటకారం వినిపించి రామనాధం చురుక్కుమనేలా చూసేడు. కాని, అంతలో నిగ్రహించుకొన్నాడు. "విని కూడా నిన్ను కాదన్నట్లు వూరుకొని వుండకపోతే....." "వూరుకోలేదు కనకనే ఇక్కడ వున్నాను." స్వరాజ్యం ప్రయత్న ఫలితం కాదన్న మాట ఈ దర్శనం. తానుగా కలుసుకొనడానికి వచ్చిన మనిషిలో ఆ మాట, పెళుసుతనం ఏమిటి? దెబ్బలాటకు వచ్చినట్లు ఆ కవ్వింపు ధోరణి ఏమిటి? తండ్రిగారి పోలీసు ఆఫీసరు హోదా తరిఫీదా ఏమిటి, ప్రారబ్ధం... అనుకుంటూ ఒక్కనిముషం వూరుకున్నాడు. "దానికోసం అలగడం అవసరం లేదు." అంది సుందరి. "అలగడమా.......?" రామనాధం ఆశ్చర్యంగా ఆమె వంక చూసేడు. "ఔను." "అలగడం అవసరమనుకుంటే నీతో ఈ మాటల అవసరమే లేదు." సుందరి ఏమీ అనలేదు. ఇద్దరూ ఒక నిముషం వూరుకొన్నారు. మరల రామనాధమే అన్నాడు. ఈమారతని కంఠంలో చికాకు వినిపించింది. "సరే, నా ప్రశ్నకూడా అర్థమయ్యే వుంటుంది." సుందరి అంగీకారంగా తల తిప్పింది. "నీ అభిప్రాయం ఏమిటి?" సుందరి అతని వంక చురుక్కుమన్నట్లు చూసింది. "మా అమ్మా నాన్న చెప్పేరు....." "నేను పెళ్ళి చేసుకొన్నది నిన్ను....." ఆమె ఏమీ అనలేదు. "నీ ముఖతః వినాలని నా కోరిక...." "నేనూ అలాగే అనుకుంటూంటే"--అంది. అతడు ఆమె నోట అటువంటి సమాధానం ఆశించని వానిలాగ కొద్దిసేపు నిర్వాక్కుడుగా నిలబడిపోయేడు. "ఆలోచించే అంటున్నావా? ఏదో ఆవేశంలో....." సుందరి టక్కున తెంపేసినట్లు అనేసింది.... "బాగానే ఆలోచించేను..." అతడు ఏమీ అనలేకపోయేడు. "మీరు కోర్టులో అడిగినా అదే మాట చెప్తాను...." అంది. రామనాధం ఆశ్చర్యంగా ఆమె వంక చూశాడు. "కోర్టు మాటెందుకు వచ్చింది?" తానాతడు కోర్టుకెళ్ళకుండా ఆగమనాలనే వచ్చింది. కాని, చివరకాతనిని ప్రోత్సహిస్తున్నది తానే యన్నట్లనిపించి సుందరి చటుక్కున వూరుకొంది. తన మామగారు కూడా వారం రోజుల క్రితం అదే మాట అన్నట్లు గుర్తు వచ్చింది. "నాకా వుద్దేశం లేదు. ఇష్టం లేని భార్య కోసం కోర్టుకెళ్ళాలనే ప్రయత్నం వట్టి దండుగ." సుందరి ఆ మాట నిజమేనా అన్నట్లు అతని ముఖం వంక చూసింది. ఆ చూపును గ్రహించేడు. "నేను సత్యాగ్రహిని. నా కేసునే నేను వాదించుకోలేదు. తెలుసు కదా....." ఆమె ఆలోచనలో పడింది. "మీ వాళ్ళే పంపుతే....." "తాళి కట్టించుకొన్నాక తప్పుతుందా?" రామనాధం ఒకమారాగేడు. "అప్పుడైనా ఇష్టం వుండి కాదన్నమాట." సుందరి ఏమీ అనలేదు. రామనాధం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తోచింది. "సరి. నీకు ఇబ్బంది కలిగిస్తే ఏమీ అనుకోకు......" "మీరు మళ్ళీ...." రామనాధం తల తిప్పేడు. "ఏమీ భయపడకు. మరల నీ ఛాయలక్కూడా రాను...." "నేను వెళ్ళిపోయేనని చెప్పు." గుమ్మంకేసి రెండడుగులు వేసి అంతలో ఆగేడు. మళ్ళీ అంతలో మనస్సు మార్చుకొని వెళ్లిపోయేడు. తాను వచ్చిన పని విజయవంతంగానే ముగిసినా సుందరికి ఎందుచేతనో సంతృప్తి కలగలేదు. రామనాధం అంత సులభంగా అంగీకరిస్తాడని ఆమె అనుకోలేదు. తాను అనెయ్యాలనుకొన్న మాటలూ, చేసుకొన్న నిర్ణయాలూ వినకుండానే సమస్య పరిష్కారం అయిపోయింది. అది సంతోషించదగిన విషయమో, విచారించదగినదో అర్థం కాలేదు. అతడు వెళ్ళినవేపే చూస్తూ సుందరి కొంత సేపు నిలబడి, తరవాత తలుపు జేరవేసి తానూ వెళ్ళిపోయింది. పన్నెండు పెంచిన ప్రేమ మనస్సుని పీకుతున్నా రాజమ్మ ఒక్క మారుకూడా తోటలోకి వెళ్ళలేకపోయింది. రామనాధానికేం సహాయం కావాలో తెలుసుకుందామన్నా కుదరడం లేదు. ఏదో వేళప్పుడు అతడే వస్తాడు. ఏమన్నా కావాలా అంటే ఏమీ వద్దంటాడు. ఏం పెట్టినా వద్దంటాడు. తింటున్నాడో, మానుతున్నాడో చూడలేకపోయింది. దూరమూ, భారమూ కాదు. తాను నిత్యమూ నీళ్ళు తెచ్చుకొనేటందుకూ, బట్టలుతుక్కునేటందుకూ వెళ్ళే పెద్ద చెరువు, పెద్ద రేవుకి నూరు గజాల్లో చెరువు పల్లంలోనే వుంది ఆతడి తోట. అందులో వున్న పాకను బాగు చేయిస్తున్నానన్నాడు. ఎంతవరకు వచ్చిందో? ఆ రోజునింక వుండబట్టలేక పోయింది. చెరువుకెడుతూ అప్పుడే తయారుచేసిన ఇంత కొబ్బరిపచ్చడి గిన్నెలో పెట్టి బిందెలో పెట్టుకుంది. రామనాధానికి కొబ్బరికాయ పచ్చడి ఇష్టం. గుమ్మం దిగేసరికి సుబ్బన్నశాస్త్రి కనిపించేడు. "మా రామన్న తోటలో వున్నాడటోయి!" అతడు ఒక నిముషం ఆగి ఆలోచించేడు. "సరిగ్గా చూడలేదమ్మా! కాని విశాలాక్షీ, ఇంకెవరో అమ్మాయీ వున్నట్లున్నారు. మరి వాడు...." పావంచాలలో బిందె వదలిపెట్టి పచ్చడి గిన్నె పైట చెంగుమాటున దాచుకొని రాజమ్మ తోటవేపు బయలుదేరింది. అప్పుడే చెరువుకు వస్తున్న రామలక్ష్మమ్మ పలకరించింది. "తోటలో కొడుకు కాపురం చూడడానికా మరదలా?" ఇరవయ్యేళ్ళు వచ్చేదాకా ప్రాణాలన్నీ వానిమీదనే పెట్టుకొని పెంచినవాడు. ఈ వేళ తోటలో వేరే వండుకు తింటున్నాడనడానికి మనసు వొప్పుకోవడం లేదు. కాని వూళ్ళో ఎవరెరుగని రహస్యం? శంకరశాస్త్రి ఆచారపు పట్టుదలను అభినందించినంత బలంగానూ, అదంతా చాదస్తం అని అంత చులకనగా త్రోసిపుచ్చిన వాళ్ళూ వున్నారు. "కుర్ర నాగన్న ఏం చేస్తున్నాడో ఓమారు చూసివద్దామనండీ వదిన గారూ?" "కాదమ్మా మరీ!.....ఔనుగాని." రాబోయే ప్రశ్న రాజమ్మకు తెలుసు. "ఔనుగాని....మీవాడు కూడా వెళ్ళి పెళ్ళాన్ని పంపమని అడిగేడట....." "వాళ్ళ బాబాయి చెప్పేరు. 'తొందరపడకురా. మగవాడి వాళ్ళం మనమే వెడితే వెలితి అయిపోతాం,' అన్నా వినలేదమ్మా." "ఈ గాంధీగారి జనం అంతా అదో మచ్చులే. పెళ్ళాంతో కూడా వీడే...." "ఆహా! లంక అంతా చుట్టపెట్టి వచ్చినట్లే చేసుకొచ్చేడమ్మా." రాజమ్మ తన అసంతృప్తిని వెలిబుచ్చింది. వియ్యంకుడి మీదా, కోడలి మీదా కారాలు నూరింది. "బలవంతంగా పంపితే చెర్లో దిగి చస్తానందిట ఆ మహాతల్లి." "అదో పాపం కూడానా? తూర్పు వాళ్ళ సంబంధాలు!" "అంతా కర్మ." నారాయణమూర్తి తన కూతురును కాపురానికి పంపకపోవడానికి ఆయన తూర్పువాడు కావడం కారణమో, రామనాధం కర్మ ఫలితం కారణమో తేలకుండానే రాజమ్మ కదిలింది. తల్లిని అంతదూరాన చెరువుకట్ట దిగుతూండగా చూసి రామనాధం ఎదురు వచ్చేడు. నాలుగు రోజుల నుంచి ఒక్కమారేనా ఇంటివేపు తొంగి చూడక పోయేసరికి ఆమెయే తన్ను వెదుక్కుంటూ వచ్చింది. ఆ గుర్తింపు మనస్సుకి బాధ కలిగించింది. క్షమాపణ చెప్పుకుంటున్నట్లు సంజాయిషీ యిచ్చుకొన్నాడు. "సర్దుబాట్లు చేసుకోవడంతో తీరుబడి లేకుండా వుంది. దీనికితోడు వర్షాలు. ఎప్పటికప్పుడు రావాలనుకోవడమే కాని....." ఆ సర్దుబాట్లు ఏమిటో చూపించడానికి కూడా వుండి తీసుకెళ్ళేడు. తోటలో అడుగు పెట్టేసరికి గేటువద్దనున్న సంపెంగ పొదలవద్ద విశాలాక్షి, మరొక అమ్మాయీ కనిపించేరు. విశాలాక్షి దారిలో నిల్చుని వుంది. రెండో ఆమె పొదకి ఎగబడి పువ్వులకోసం వెతుకుతూంది. "ఏం పిన్నీ! ఇంతవరకూ నువ్విటు రానేలేదనుకుంటాను. చూడు మన పెంకుటిళ్ళ కన్నా తమ్ముడి తాటాకు పాకే ఎంతో బాగుంది." పాక అయితే మామూలుదే. రెండు నిట్రాళ్ళది. ఒక నిట్రాటి భాగాన్ని మట్టి మెత్తిన పత్తి కంప దడులతో గదిలాగ చేశారు. ముందు భాగం తెరపిగానే వుంచారు. పాకకు ముందు మరో పందిరికూడా వేశారు. పదిమందీ కూర్చునేందుకు వీలుగా. అసలు అందమంతా పరిసరాలది. అప్పుడే కాపు పట్టిన కొబ్బరితోట, పెద్ద మోట బావి. బావికి దగ్గరలో తెల్లటి నందివర్ధనాలూ, ఎర్రటి కరవీరాలూ పువ్వులతో కళకళలాడుతున్నాయి. ఆ మొక్కలకి ఆవలనుంచి వయస్సులో వున్న పోకబోదెల వరసలు. నీరు అందని దూరంలో మామిళ్ళు, పనసలు. కట్టవలలో అక్కడక్కడ సంపెంగ పొదలు, సాయంకాలం అయ్యేసరికి ఎంత వెతికినా దొరకని పువ్వుల పరిమళం చెరువుకట్ట మీదికంటా విస్తరిస్తూ దారిన పోయేవాళ్ళని ఆశపెడుతూంటుంది. దారిన వచ్చేపోయేవాళ్ళు పది నిముషాలయినా పని మానుకొని వెతక్కుండా ముందడుగు వేయలేరు. ఆ పరిమళాల మధ్య పచ్చని పరిసరాల మధ్య, ఉండడమే ఆ పాక ప్రత్యేకతా, సౌందర్యమూను. రాజమ్మ పాక వద్దకు వస్తూనే పైట చెంగున దాచి తెచ్చిన పచ్చడి గిన్నెను చేతికిచ్చింది. "ఎందుకమ్మా యిది" అన్నాడు. "తమ్ముడు కారాలు తినడం లేదు" అంది విశాలాక్షి. "చెప్పేను... సరేలే తెచ్చేవు కదా." అని దానిని తీసుకొని పాకలో గదిలో వున్న కావడిపెట్టెలో దాచేడు రామనాధం. రాజమ్మ గోడలూ, అవీ ముట్టుకు చూసింది. "ఇంకో పూత పెట్టాలి." "వెల్లవేయిస్తే వెలుతురు వస్తుంది" అంది, అప్పుడే వచ్చిన స్వరాజ్యం సంభాషణలో కలగచేసుకొంటూ. విశాలాక్షి తిరిగి చూసింది. "ఏమన్నా దొరికేయా?" "మంచి పువ్వు ఒకటీ, ఓ గుడ్డి పువ్వూను. ఇంకా వున్నాయి." "వాసన బ్రహ్మాండంగా ఆశ పెడుతుంది. కాని ఆకుల మాటున ఒక్కటీ కనబడదు" అని రాజమ్మ తన అనుభవాన్ని చెప్పింది. స్వరాజ్యం తాను తెచ్చిన మంచి పువ్వును ఆకు గుత్తితో సహా ఆమెకిచ్చింది.. "పెట్టుకోండి." "నాకెందుకమ్మా! నువ్వు పెట్టుకో తల్లీ." విశాలాక్షి ఆమెను పరిచయం చేసింది. "చిరతపూడి నాయుడుగారి అమ్మాయి. మెట్రిక్యులేషన్‌ చదివింది. ఈవూరు పింతల్లిగారింటికి వచ్చింది." రాజమ్మ ఆ బంధువులెవరో తెలుసుకుంది కాని, వారిని ఆమె ఎరగదు. "పావంచాలరేవూ, మా పడమటిల్లూ మధ్యనున్నదే నా ప్రపంచం. నేనెవరినీ ఎరగను." అని క్షమాపణ చెప్పుకొంటున్నట్లు అంది. "పెళ్ళి అయిందా తల్లీ...." అని ప్రశ్నించింది. స్వరాజ్యం టక్కున సమాధానం చెప్పడానికి సందేహిస్తూంటే విశాలాక్షి అనేసింది. "లేదు. వాళ్ళ నాన్నగారు చదువు చెప్పిస్తూండగానే అనుకున్న సంబంధాలు దాటిపోయేయిట." విశాలాక్షి ఎరిగి వుండి ఆడిన ఆ అబద్ధానికి స్వరాజ్యం ఆశ్చర్యంతో నోరు తెరిచింది. రామనాధం పాక ముందు భాగంలో రెండు కొబ్బరి తడకలు వేసి ఆహ్వానించేడు. "రాండి, వచ్చి కూర్చో అమ్మా." స్వరాజ్యం మరో చిట్టి తడక తెచ్చుకొని వేసుక్కూర్చుంది. ఆమె ఏం చేస్తుందో అర్థంగాక అంతవరకూ నిలబడే కబుర్లు చెబుతున్న రాజమ్మ సంతృప్తిపడి తానూ కూర్చుంది. చదువుకున్న అమ్మాయికి ఆచారాలు తెలుసునో లేదో? తాను కూర్చున్న చాపలోనే కూర్చుంటే తాను మైలపడిపోవాలి. తరవాత ఏమనుకొన్నా, ఏమన్నా లాభం ఏమిటి? "ఈ చిట్టి తడకలు చాల బాగున్నాయి." రాజమ్మకు కనిపిస్తున్న బాగు వానిలో ఇద్దరు కూర్చునేటందుకు చోటులేక పోవడమే. ఆమె సంతృప్తికి రామనాధం నవ్వేడు. "ఎందుకురా ఆ నవ్వు?" అంది రాజమ్మ. "ఈ కొబ్బరి తడకల్ని పొగుడుతుంటేనూ, ఆ స్వరాజ్యంగారి యింట వాళ్ళు తివాచీలు వాడుకుంటారమ్మా!" స్వరాజ్యం నవ్వింది. "ఓ రోజున పై పెద్ద మనిషి వచ్చేరని మర్యాదకి వేసిన తివాచీ చూసి మేం గొప్పవాళ్ళము అనెయ్యకండి." "మర్యాదకు వెయ్యాలన్నా మా దగ్గర లేదు కదా." అన్నాడు రామనాధం. "ఇంత అందమైన తోట వుంటే...." రామనాధం ఆమె పొగడ్తకి చాల ఆనందపడ్డాడు. చుట్టూ చూస్తూ అన్నాడు. "ఋష్యాశ్రమంలా వుంది కదూ?" అన్నాడు. అక్కడున్న నలుగురికీ ఋషులూ తెలియదు. వారి ఆశ్రమాలూ ఎరుగరు. నిర్జన ప్రదేశంలో, నిశ్శబ్ద వాతావరణంలో, నిరాడంబరంగా వేసుకొన్న చిన్న పాక, చిన్న తాటాకుటిల్లును మెచ్చుకోడానికి అదో మాట. అంతే. రాజమ్మకు ఆశ్రమం అనే మాట ఏదో అపశ్రుతిలా వినిపించింది. చెరువుకట్ట మీద ఎదురుగా అక్కడ అవధూతస్వామి మఠము, ఇక్కడ ఆశ్రమం. అతని వయస్సు ఆశ్రమాల్లోనూ, మఠాల్లోనూ వుండవలసిందా? ఆనందంగా పెళ్ళాన్ని తెచ్చుకొని, సుఖంగా గడపవలసిన వయస్సులో సన్యాసులల్లే ఆశ్రమవాసం ఏమిటి? అనుకొంది. "ఓఘాయిత్యం మాటలనకు, భడవకానా" అని కోప్పడింది. రామనాధం నవ్వేడు. సంభాషణ కుటుంబ విషయాలలో తిరుగుతుండడం గమనించి తానక్కడ వుండడం మర్యాద కాదని స్వరాజ్యం లేచింది. "వచ్చి చాలా సేపయింది. పోయివస్తానండి." రామనాధం కూడా లేచేడు. "ఒక్క నిముషం ఆగండి. పుల్లాయి వస్తాడు తోడు." అతడు పుల్లాయిని తీసుకు రావడానికి వెళ్ళేడు. మరునాడు తమ యింటికి రమ్మనమని విశాలాక్షి ఆహ్వానించింది. "లేదండి. ప్రొద్దుటే వెళ్ళిపోతున్నా, నాన్నగారు ఒక్కరే వుండాలి." "మీ అమ్మగారు?" "పిన్నికి సాయం కావలసి ఓ పది రోజులుంటుంది ఇక్కడే." పుల్లయ్య వచ్చేడు. స్వరాజ్యాన్ని రోడ్డు వరకూ సాగనంపుతూ రామనాధం వెంబడించేడు. "ఆదివారం మరిచిపోకండి. సభ ఏర్పాట్లు చేయిస్తున్నారు నాన్నగారు." రామనాధం అలాగే అన్నాడు. "సభలేమిటి?" అని రాజమ్మ అడిగింది. పరాయి పడుచువాడిని పెళ్ళికాని పడుచుపిల్ల పిలవడమే ఆమెకందులో వినిపించింది. తండ్రి గుడ్డివాడు. వున్నా లేనట్లే. తల్లి వూళ్లో లేదు. ఒక్క పిలుపులో రాజమ్మ పెద్ద వ్యూహాన్నే కనిపెట్టింది. "కూతురు ఎక్కడికెళ్ళినా తల్లీ తండ్రీ ఏమీ అనడం వుండదా?" "మర్యాద, మంచితనం వున్న పిల్ల. ఎంత కలుపుగోలుతనం?" అంది విశాలాక్షి. తిరిగివస్తున్న రామనాధం కూడా ఆమెతోపాటు తానూ మాట కలిపాడు. "మంచి చొరవ! వ్యవహార దక్షత! మనవాళ్ళూ వున్నారు దద్దమ్మలు. గుడ్డి తండ్రి, ఇంటికి మరో దక్షత లేదు. వ్యవహారాలన్నీ ఆవిడే చేసుకొంటుందట... అల్లా వుండాలిగాని...." ఆడదానిలో చొరవ, వ్యవహార దక్షత కావాలంటున్న తమ్ముడి ముఖంవేపు విశాలాక్షి ఆశ్చర్యంతో చూసింది. సాధారణంగా ఆడదానిలో అవి రెండూ అవలక్షణాలుగా చూడడం ఆమె ఎరుగును. తండ్రి చాటున దాగి, అతడు గదిమేస్తూంటే, మగడికి అన్యాయం జరిగిపోతూన్నా చూస్తూ వూరుకున్న సుందరితో స్వరాజ్యాన్ని పోల్చి చూస్తున్నట్లనిపించి విశాలాక్షి గతుక్కుమంది. "అదేమిటిలే, చదువుకొని పట్నవాసంలో పెరిగిన పిల్ల మరి...." "పట్నాల్లో వుంటే మాత్రం...." అంతలో తాను స్వరాజ్యాన్ని మెచ్చుకోవడం అతి అవుతున్నట్లనిపించి రామనాధం మాట మధ్యలోనే ఆగిపోయేడు. మాట మార్చేడు. "చెట్టున ములక్కాడలున్నాయి. దారినపోయే వాళ్ళంతా కోసుకుపోతున్నారు. మరిడమ్మకిచ్చి పంపిస్తా." ఔను, కాదు అనకుండానే ఆతడు గెడ ఒకటి తీసుకొని ములక్కాయలు కోసుకురావడానికి వెళ్ళేడు. అతడటు వెళ్లాక రాజమ్మ నెమ్మదిగా అడిగింది. "ఏమిటంటాడు? ఏమి చేద్దామనుకొంటున్నాడు?" "భార్యను తెచ్చుకోడానికి అతడు నారాయణమూర్తిగారి వద్దకు పెద్ద మనుష్యుల్ని పంపేడు. తానుగా వెళ్ళేడు కూడా" అని విశాలాక్షి సమాధానం ఇచ్చింది. అది రాజమ్మ ప్రశ్నకు సమాధానం కాదు. ఆ సమాచారం ముంగండలో అందరికీ తెలిసి ఎన్నో చిలవలూ, పలవలూ వేసింది కూడా. అసలు రాజమ్మ సమాధానం కోరి వేసిన ప్రశ్నకూడా కాదు. మనస్సులో వుడికిపోతున్న బాధకది వాగ్రూపం అంతే. "అల్లుడంటే ఎంత సంబర పడేవాడు? చూసిన మంచి గుడ్డల్లా కొని బహుమతి ఇచ్చేవాడు. ఎక్కడికో లండను పంపుతాననేవాడు. 'కలక్టరయి వస్తాడు అక్కయ్యగారూ! మన రెండు కుటుంబాలకీ ఎంత ప్రతిష్ఠ, ఎంత పేరు!' అని తెగ మురిసిపోయేవాడు. కాదటే విశాలాక్షీ!" రాజమ్మకు వియ్యంకుడి మీద సదభిప్రాయమేగాని, ఏమాత్రం కష్టం పెట్టుకుంటున్నట్లు కూడా లేదు. అంత మంచివాడు ఇప్పుడిల్లా తయారయ్యేడంటే తన కుమారుడి దురదృష్టమే కారణమని ఆమె నమ్మకం. ఆ దురదృష్టం గాంధీ రూపంలో నెత్తికెక్కిందని ఓ విచారం. "దిక్కుమాలిన కాంగిరేసూ, దిశమాలిన గాంధీ......ఎక్కడ దాపరించేరే తల్లీ. పచ్చగా ఎక్కివస్తూన్న మొక్కని తుంపేసినట్లయింది కాదే అమ్మా!" ఆమెను ఎలా సమాధానపరచాలో విశాలాక్షికీ అర్థం కాలేదు. ఇంగ్లీషువాళ్ళు దేశంలోంచి వెళ్ళిపోయి తీరాలిసిన అవసరం గురించి తండ్రి చెప్తూండగా వింది. జలియన్వాలాబాగ్‌లో కాల్పులు కాల్చి, గాయపడ్డ వాళ్లని బ్రతికి వుండగానే నూతిలో పారవేశారన్నప్పుడు అల్లాంటి దుర్మార్గులు మన దేశంలో వుండకూడదనే అనుకొంది. కాని, ఆమె ఆలోచించినంతవరకు ఇంగ్లీషువాళ్లు వచ్చేక ఎన్నో లాభాలు కలిగేయనే ఆమె నమ్మకం. వీరేశలింగంగారి స్వీయ చరిత్ర చదివింది. రామమోహనరాయ్‌, ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌ల చరిత్రలు చదివింది. అవన్నీ చదివినకొద్దీ ఒక్కటనిపించింది. ఇంగ్లీషువాళ్ళు రాకపోతే ఆడపిల్లలకి ఓ చదువనీ, మోడైపోయిన అమాయకురాళ్ళ బ్రతుకులకు ఓ దారనీ ఏర్పడేదేనా అని ఆమె ఆలోచన. అందుచేత బ్రిటిష్‌ వ్యతిరేకత ఆమెలో అంతంతమాత్రం. 'నారాయణమూర్తి దుష్టుతనమేగాని, ఇంగ్లీషువాళ్ళు అల్లుడిమీద కేసు పెట్టమన్నారా' అనే అనుమానం కూడా ఆమెకు లేకపోలేదు. ఆ మనఃస్థితిలో విశాలాక్షి ఏం చెప్పగలదు? అందుచేతనే రామనాధం తన కుటుంబాన్ని నిలపుకునేటందుకు చేస్తున్న ప్రయత్నాలను చెప్పి, ఆమెను సంతృప్తి పరచడానికి ప్రయత్నించింది. "ఇల్లా వుందని బావమరిదిక్కూడా వ్రాశానన్నాడు?" రాజమ్మ కళ్ళు చక్రాల్లా చేసింది. "కాకినాడలో వున్న అతనికా?" "ఇంకెవరున్నారు? మిగిలినవాళ్ళంతా చిన్నవాళ్ళే కాదా పిన్నీ!" రాజమ్మ ఇంకా ఆశ్చర్యంనుంచి తేరుకోనేలేదు. "ఆ బ్రహ్మసమాజంగాడికి?" ఆమె మాట విని విశాలాక్షి నవ్వింది. "ఇంక ఈ కాపురం ససిపడినట్లే " అని రాజమ్మ నిరుత్సాహపడింది. "ఆరు నెల్ల క్రితం కాకినాడ వెడతానన్నవాడు అమలాపురంలో తేలేడు కాదుటే విశాలాక్షీ! తండ్రికీ ఆ కొడుక్కీ పడదు. ఈయన గొప్ప మంత్ర శాస్త్రవేత్తా. వాడూ దేవుడూ నై. దెయ్యమూ నై గాడూను. ఎల్లా కుదురుతుంది? అడుగుతూ, అడుగుతూ సలహా దొడ్డవాడి నడిగేడు. వాడేదో ముడ్డిగిల్లి పంపేడు. ఈ చవలమ్మ పోయి మామగారితో పేచీ పెట్టుకున్నాడు." రామనాధం జైలులో పడడానికి గల కారణాలను తన వూహకందినంత వరకు చెప్పి ఒక్క మాటలో తేల్చేసింది. "వీడి తాత వాడు. వీడు జైలుకుపోయి మాలకూడూ, మంగలికూడూ తినొస్తే వాడు జైలుకెళ్ళడం కూడా ఎందుకని ఓ మాదిగదాన్నే కట్టేసుకున్నాడు." విశాలాక్షికి ఏమనడానికీ తోచలేదు. తన బావమరిది భార్య చాలా మంచిదని రామనాధం చెప్పిన మాట జ్ఞాపకం వచ్చింది. "ఆ అమ్మాయి చాల తెలివీ, మంచితనమూ గలదటమ్మా!" విశాలాక్షి కూడా అంత అనాచారాన్ని సమర్ధించడం రాజమ్మకు నచ్చలేదు. తెలివీ, మంచితనమూ వుంటే మాత్రం కులం ఏమవుతుంది? విశాలాక్షి ఏమీ అనలేదు. రాజమ్మ మళ్ళీ అంతలో సరిపుచ్చుకుంది. "సరేలే ఎవరి కర్మకు ఎవరు కర్తలు." విశాలాక్షి క్షీణ స్వరంతో "అంతే, అంతే" అంది. పదమూడు తోట చివరకు వచ్చి రామనాధం మరిడమ్మ కోసం కేక వేసేసరికి ఆమె దగ్గరలోనే ఎక్కడో పలికింది. "ఎక్కడున్నావు?" పాతిక గజాలలో వున్న రావి మూల రేవులోంచి మరిడమ్మ గట్టెక్కింది. "ఏమయ్యగారూ!" "ఓమారు తోటలోకి రా." మరిడమ్మ వెంటనే బయలుదేరబోయింది. అక్కడున్న ఒకళ్ళిద్దరు పంచముల ఆడవాళ్ళు ఆమెను బ్రతిమాలుకోసాగేరు. "అమ్మమ్మ! ఈ ఒక్క కడవ పోయి తల్లీ. నీ కడుపున పుడతా. ఇంటికాడ పిల్ల ఏడుస్తుండది." "అయ్య పిలుస్తుండరు. ఇంకెవరన్నా వస్తారు. నన్ను పోనీ...." అంటూ మరిడమ్మ విదిలించుకు వచ్చేయడం వినిపించింది. తెల్లవారింది మొదలుకొని జామురాత్రి వేళ దాకా మూల రేవులో కుండలు వరసగా పెట్టుకొని ఎవరన్నా పరోపకారులు రాకపోతారాయని ఎదురుచూస్తూ, బతిమాలుతూ మాలపల్లె వాళ్ళు నిలబడి వుండడం ముంగండ చెరువు వద్ద ఒక సాధారణ దృశ్యం. పాతిక ఎకరాల వైశాల్యం గల అంత పెద్ద చెరువులో ఏమూలనా కూడా మాలమాదిగలు దిగడం నిషిద్ధం. పావంచాలు కట్టిన రేవులన్నీ బ్రాహ్మణ వీధుల్ని ఆనుకొనే వున్నాయి. ఆ రేవుల ముందు అస్పృశ్యులు నిలబడ్డానికే వీలు లేదు. అస్పృశ్యత నిషేధం లేకపోయినా బ్రాహ్మణేతర కులాల వాళ్ళు కూడా సాధారణంగా ఆ రేవుల్లో కనపడరు. కారణం ఏమీ లేదు. వాళ్లు వుంటున్న పాలెములు రోడ్డుకావలనే వున్నాయి. అసలు చెరువే దూరం. పావంచాల రేవులు మరీను. కనక మూల రేవుల్లోనే వాళ్ళు నీళ్ళు ముంచుకుపోతూంటారు. ఆ మూల రేవులోనే గట్టు లోపలా, వెలుపలా కుండలు పెట్టుకొని పల్లె వాళ్ళు కాపలా వేస్తారు. బారెడు దూరంలో నీలాల వంటి నీళ్ళు. ఒక్క కడివెడు ముంచుకోవడం మాట అటుంచి, నీటి అంచుకు వెళ్ళడానిక్కూడా వీలు లేదు. ఎవరో దయతలచి ఓ కడివెడు పోయవలసిందే. జ్ఞానం తెలిసినప్పటి నుంచీ చూస్తున్న దృశ్యమే అది. కాని, ఆనాటి వరకు దానినాతడు గమనించనేలేదు. మరిడమ్మకు ఒక సీసాడు కిరసనాయిలు తెచ్చిపెట్టమని దుకాణం మీదికి పంపించేడు. ఆమె వెళ్ళి పావుగంట దాటింది. కాని రేవులో ఆడవాళ్ళిద్దరూ అక్కడే వున్నారు. వాళ్ళకి తోడు మరో నలుగురు కూడా వచ్చేరు. పొలాల నుంచి తిరిగి వచ్చినవాళ్ళు ఒక్కొక్కరే చేరుతున్నారు. అది చూస్తూంటే రామనాధం మనస్సు బాధపడింది. మరిడమ్మను తానేదో పనిమీద పంపడం వలన అక్కడ వాళ్ళకి నీళ్ళు లేకపోయాయనిపించింది. పోనీ తానే వెళ్ళి పోస్తే? ఇప్పుడింకా స్నానం కూడా చెయ్యాలి కదా! అంతలో ఎవరో రెండు బిందెలు నీళ్ళు పోయడం కనిపించింది. అంతలో, తనకు పనుందని అతడూ వెళ్ళిపోయేడు. బ్రతిమాలుకుంటూంటే విదిలించుకుపోయేడు. అదీ మామూలే, వచ్చిన వాళ్ళల్లా సాయపడరు. కాని అందరినీ అమ్మా, బాబూ అనాలిసిందే. కొందరు వినిపించుకోరు. కొందరు విసుక్కుంటారు. ఎవరికో జాలి కలుగుతుంది. అతనికీ పని వుంటుంది. అయినా వెళ్ళలేడు. తన పని మానుకుని పది కుండల నీళ్ళు పోస్తాడు. దానికి అంతం ఏం వుంటుంది? ఎంత సేపని నిలవగలడు? మిగిలిన వాళ్ళు బ్రతిమాలుకుంటున్నా వినిపించుకోకుండా పారిపోతాడు. మళ్ళీ ఎవరో రాకపోరు. వస్తారు. వస్తే మాత్రం ఎవరికా తీరుబడి? ఏదో పని చేసుకొంటేగాని పొట్ట గడవని మనుష్యులు. నీళ్ళ కోసం వచ్చిన వాళ్ళూ అంతే, వాళ్ళూ కూలిపనులకి పరుగెత్తే వాళ్ళే, పిల్లా జెల్లా గలవాళ్ళే. ఆ కుండెడు నీళ్ళూ తీసుకెళ్ళి కూడు వుడకేసుకోవలసిన వాళ్ళే. రామనాధం వాళ్ళ బాధ చూడలేకపోయాడు. కంచె వొత్తిగించి పుంతలోకి వచ్చేడు. "వుండండర్రా. నే పోస్తాను." దగ్గరలో వున్న కంసాలుల ఇంటి వద్ద ఓ బిందె తీసుకొచ్చేడు. "ఇప్పుడే తెచ్చి ఇస్తా. పాపం చాలామంది చాలాసేపటి నుంచి నిలబడి వున్నారు" అని కంసాలి కామయ్యకు దిలాసా ఇచ్చేడు. "మా ఇంట్లో వున్నదీ ఒక్క బిందేనండీ" అంటూ కంసాలి కామయ్య నీళ్లు పారపోసి బిందె తెచ్చి యిచ్చేడు. రామనాధం పావుగంట అనుకున్నది అరగంట, గంట అయింది. ఈలోపున కామయ్య ఇంట్లో నీళ్ళ కోసం బిందె కావాలని రెండుమాట్లు వచ్చేడు. ఇంక బాగుండదని మూడోమారు వచ్చినప్పుడు నీళ్ళతో తెచ్చి ఇవ్వబోయేడు. కాని కామయ్య ఆ నీళ్ళతో వున్న బిందె పుచ్చుకోడే. "ఆ బిందెడూ ఆ కుండలో పోసెయ్యండి. నేను పొయ్యలేకపోవడమే గాక వాళ్ళకి తెచ్చినవి కూడా నే తీసుకొంటానా? మహాపాపం!" అన్నాడు. మొదట్లో అర్థంగాకపోయినా తర్వాత అర్ధం అయింది. కంసాలి కామయ్య తాను తెచ్చిన నీళ్లు ముట్టుకోడని జ్ఞాపకం వచ్చింది. తాను జైలుకి వెళ్లి రావడం చేతనే కాదు. విశ్వకర్మ కులంలో పుట్టినందుకు కామయ్యకు తన కులం ఇంకా ఎక్కువదని అభిప్రాయం. కాని పైకి చెప్పడానికి భయం. కులాలంటే అపహాస్యంగా కనబడుతున్న కొత్త దశలో వున్నాడేమో కామయ్యను ఏడిపించాలని తోచింది రామనాధానికి. "అబ్బెబ్బే! అదేమిటీ? మీ యింట్లో నీళ్లు పారపోయించి తెచ్చేను కూడా. నీళ్ళు మిమ్మల్నే తెచ్చుకోమనడం ఏం ధర్మం?" పట్టుకెళ్ళి నీళ్ళతో బిందె అరుగు మీద పెట్టేసి మరొకరి ఇంటినుంచి బిందె తేవడం కోసం పరుగెత్తేడు. "మీచేత పని చేయించుకున్న పాపం తెచ్చిపెట్టకండి" అంటూ కామయ్య అంగలార్చేడు. రామనాధం ఇంక వినిపించుకోనేలా లేడని ఉస్సురన్నాడు. ఆ నీళ్ళు తానే పారపోసేడు. వానిని ముట్టుకొన్నందుకు స్నానం చెయ్యాలి. చేసేడు. * * * * * ఓ పాతిక బిందెలు పోసినట్లు అనిపించింది. నీళ్ళ బిందెతో గట్టు ఎక్కనూ దిగనూ ఒళ్ళు హూనం అయిపోయింది. వంట చేసుకోలేకపోయేడు. పెరుగులో ఇన్ని అటుకులు నాన వేసుకొని తిని పడుకున్నాడు. పడుకున్నా చాలసేపటి వరకూ నిద్ర పట్టనే లేదు. తాను నీళ్లు పోస్తున్న సమయంలో వాళ్లు చెప్పుకుంటున్న మాటలు మనస్సులో మెదిలేయి. ఒక్క బిందెడు నీళ్లు పోసినందుకు వాళ్లు చూపిన సంతోషం, చేసిన అభినందన గుర్తు వచ్చాయి. ఇందాకా అవి సంతోషమే కలిగించేయి. కాని, ఆలోచిస్తున్న కొద్దీ అతనికి బాధ కలుగుతూంది. ఆ చెరువులో నీరు పెట్టేది పల్లెల వాళ్ళే. కాని చెరువు లోతట్టుకు నీరు చేరేక వాళ్ళు ముట్టుకోరాదని నిషేధం పెడతారు. ఇప్పుడు తనబోటివాడెవడో దయ తలిస్తే తప్ప వాళ్ళకి కడివెడు నీళ్ళకు గతిలేదు. ఆ మహాపరాధానికి తానే కారణం అయినంత బాధపడ్డాడు రామనాధం. ఆ అపరాధానికి శిక్ష... తాను వాళ్ళకి నీళ్లు పోయడమేననిపించింది. ఆ నిశ్చయాన్ని అమలు జరపడానికి తెల్లవారకుండా ఒక బిందె తీసుకొని రావిక్రింది మూలరేవులో హాజరయ్యేడు. ఆ పూట అతని స్నానానికి పొద్దుపోయింది. సిద్ధాంతిగారు అతడు ఆ పని చేస్తూంటే ఓ నిముషం నిలబడి చూసి వెళ్లిపోయేరు. సూరప్ప వచ్చి అతనితోపాటు నాలుగు బిందెలు పోసి తన పనిమీద వెళ్ళిపోయేడు. కొంతసేపున్నాక శివకామయ్య వచ్చేడు. అతడు కొంతసేపు బిందె అందుకున్నాడు. "నువ్వు వెళ్లు. వంట చేసుకోవాలిగా, నేను పోస్తానులే." కాని, రామనాధం కదలలేదు. పెద్దరేవులో స్నానం చేస్తున్న వాళ్ళూ, నీళ్ళు పట్టుకొనేందుకు వచ్చిన వాళ్ళూ అక్కడి నుంచే చూశారు. "కాలేజీ మాని మంచి పనే పెట్టుకొన్నాడు" అంది సోదెమ్మ. అందరి మనస్సులలో వున్న మాటనే ఆమె పైకి అనేసింది. అంతే. పావంచాలలో తులిసెమ్మ ముందు కూర్చుని జపం చేసుకుంటున్న సోమయాజులు తావళం తిప్పడం మానకుండానే తన అభిప్రాయం చెప్పేడు. "గాంధీ ఒకడు వచ్చేడుగా, వీళ్ళంతా స్వరాజ్యం తేవడం మాట ఎల్లావున్నా ముందు దేశాన్ని మాల మంచం చేసి పెడతారు." మంచానికి ఒక వేపున కొంతమేర నులక నెయ్యకుండా త్రాడు పెట్టి బిగిస్తారు. ఆ దిక్కు కాళ్ళగట్లు. అస్పృశ్య కులాలు తమ మంచాలకు కాళ్లగట్ల తాడు వుపయోగించడం కులాచారాల రీత్యా అభ్యంతరం. అటువంటి మంచానికి కాళ్ళగట్ల-తలాపియని తేడా ఏముంటుంది? తేడా పాడాలు, హెచ్చు తగ్గులు లేనిది మాలమంచం--అగ్రహార పరిభాషలో ఆ వ్యాఖ్యానం వినేసరికి రామనాధం వొళ్ళు మండింది. "చెరువుకు నీరు పెట్టిన కూలీలంతా అస్పృశ్యులే. వాళ్ళ కాళ్ళ మీదుగా దొర్లిన నీరు కాదూ ఇదంతా? ఆ నీరు చెర్లో పడగానే వాళ్ళు ముట్టుకుంటే మైలపడిపోతుందా?" అని తన పెదతండ్రి రావికింద ఎన్నో మాట్లు వాదనలు వేసుకోవడం తెలుసు. నిన్న సాయంకాలం తాను నీళ్ళు పోస్తున్నప్పుడు పల్లె స్త్రీలు తమలో తాము చెప్పుకొన్న మాటల్లో తాత్పర్యం కూడా అదే....ఆ మాటలు మరోమారు జ్ఞాపకం చెయ్యాలనిపించింది. శివకామయ్య వారించేడు. "వాదన వేసుకొంటే తేలేవి కావురా యివి. మనకు చేతనైంది చేసుకు పోవడమేగాని" రామన్న ఆ మాటను సమర్థించేడు. రామనాధం మాట్లాడలేదు. "అంతేలే." పద్నాలుగు అతడు ఆదివారం వెళ్ళేసరికి చిరతపూడిలో కాంగ్రెసు సభకు వ్యతిరేకమైన వాతావరణం ఏర్పడి వుంది. సబినస్పెక్టరు వచ్చి ఆ రోజు వుదయం టముకు వేయించేడు. 'సభకు ఎవ్వరూ వెళ్ళవద్దు.' అని పేట పేటకూ చాటింపు వేయించేడు. పెద్ద కుటుంబాల వాళ్ళ యింటికి కబురులు పెట్టించేడు. కాంగ్రెసు సభలకు వెడితే ప్రభుత్వం ఒప్పుకోదు. అసలు ఆ వూళ్ళోనే పెట్టనియ్యవద్దు--అని ఆదేశించేడు. ఆ ఆదేశాలు పాటించబడేటట్లు చేయడానికి మునసబు ఇంటి వద్ద ఒక పోలీసు కానిస్టేబులును వదిలి వెళ్ళేడు. ఆ వృత్తాంతం తెలియగానే అబ్బాయి నాయుడు ఆలోచించేడు. ఇంకా ఒంట్లో ఓపిక బాగా చేరలేదు. కనక ఇల్లు వదలి వెళ్ళడానికి శక్తి లేదు. తన స్నేహితులయిన ఇద్దరు ముగ్గురిని తన ఇంటికి రప్పించేడు. ఆలోచించేడు. సభ జరుగుతుందని వూళ్ళో అందరితో చెప్పేరు. ఉపన్యాసకుడిని కూడా మాట్లాడేరు. ఆయన వచ్చేడు. ఇప్పుడు పోలీసువాడు పనికి రాదన్నాడని మానేస్తే వూరికెంత అప్రతిష్ఠ? తమ పరువు మాటేమిటి? ఒక పెద్ద సమస్య ఎదురయింది. ప్రతిష్ఠ సమస్య మీద, పంతానికి, జనం వచ్చినా రాకపోయినా, వూరి మధ్య సభ పెట్టేద్దామని ఓ నిముషం అనిపించింది. కాని, ఎక్కడ పెట్టినా, ఆ దగ్గరలో వున్న యిళ్ళవాళ్ళు అభ్యంతరం చెప్పేలా కనిపించేరు. వాళ్ళ ఇంటి ఎదుట ఎందుకు పెట్టుకోనిచ్చేరని పోలీసులు కేసు పెడతారని భయం. "అయితే మా యింటి ముంగిట చాపలు వేయిస్తా...." నని నాయుడు నిశ్చయం తెలిపేడు. "మొన్ననే జబ్బుపడి లేచేవు. మరల పోలీసువాళ్లు ఏవన్నా గొడవలు తెస్తే...." అని మిత్రుల భయం. కాని, నాయుడు వినిపించుకోలేదు. "మీరు తొమ్మిది గంటలకి రాండి." మిత్రులు వెళ్ళిపోయేక రామనాధం భోజనం విషయమై ఏర్పాట్ల సమస్య వచ్చింది. మీటింగు స్థలం అంత సులభంగా పరిష్కరించేదిగా ఈ సమస్య కనబడలేదు. మొదట వూళ్ళో బ్రాహ్మణ కుటుంబాలు కూడా మీటింగుకి కలిసి వచ్చేటట్లు మాట్లాడేరు. సుబ్రహ్మణ్యం పంతులుగారింట అతనికి భోజనం ఏర్పాటు అనుకున్నారు. కాని, ఇప్పుడంతా తల్లక్రిందులైంది. మీటింగుకి భయపడ్డవాళ్లు భోజనం పెట్టగలుగుతారా? పెడతానన్నా వెళ్ళడానికి రామనాధం ఒప్పుకోలేదు. వాళ్ళు అననిదే తానే నాయుడింట భోజనం చేస్తానని చెప్పుకోడానికి రామనాధం బిడియపడ్డాడు. బ్రాహ్మణుణ్ణి తమ యింట భోజనం చేయమనడానికి అబ్బాయి నాయుడికి భయం. ఏమనుకొంటాడో ఏమో. స్వరాజ్యమే చొరవ తీసుకొంది. "జైలులో వండి వడ్డించిన వాళ్ళకన్న తీసిపోయేమా?" అంది. చివరకి రామనాధం అనేశాడు. "కులాల తేడా అర్థంలేనిదనుకొనేవాళ్ళం మనకి కూడా ఈ పట్టింపులవసరమేనా?" నాయుడు ఎంతో సంతోషపడ్డాడు. "మీకా అభిప్రాయం వుంటే అంతకన్నా కావలసిందేముంది?.... అమ్మా!" పదిహేను పంతానికి రామనాధం రెండు వారాల పాటు పొద్దుటా-సాయంకాలం బిందె తీసుకొని పల్లె జనానికి నీళ్ళు పోసేడు. అక్కడికీ ఆలస్యంగా వచ్చిన వాళ్ళు నలుగురో ముగ్గురో దిగబడిపోతూనే వున్నారు. వాళ్ళకి తోడు అతని పనులన్నీ కూడా మిగిలిపోతున్నాయి. ప్రతిరోజూ తెల్లవారేసరికి స్నానం చేయడమూ, కొంతసేపు ఆసనాలు వేయడమూ ఆతనికి అలవాటు. సాయంకాలం మిత్రులతో కలిసి వూళ్ళో వున్నప్పుడు కర్రసాము తప్పకుండా సాధన చేయడం ఓ అలవాటు. ఇప్పుడీ రెండూ కూడా సాధ్యం కావడం లేదు. పైగా వంటా, ఇతర స్వంత వ్యవహారాలూ చూసుకోవడం ఇబ్బందే అవుతూంది. సూరప్పో, శివకామయ్యో, రామన్నో ఒకరికొకరు నలుగురైదుగురు చేరేరు. సాయం చేస్తున్నారు. ఏదన్నా పనిమీద వూరికెడితే ఏ మిత్రుడికో వప్పచెప్పుతూనే వున్నాడు. కాని, వాళ్ళకేదన్నా పని తగిలితేనో, మరిచిపోతేనే పల్లెలవాళ్లు గంటల తరబడి నిలిచిపోతున్నారు. ఇది ఎలా పరిష్కరించాలో అతనికి అర్ధం కాలేదు. ఇదొక పూటతోనో, రోజుతోనో తెమిలేదేనా? ఎవరికి వారు చేసుకోగలదీ, చేసుకోవలసినదీను ఆ పని. దానిని ఆటంకపరచేరు. ఆ అపరాధానికి ప్రాయశ్చిత్తంగా ఈ పనిని చేయాల్సిందేనని విసుపు కలిగినప్పుడు ఓమారు తత్వబోధ చేసుకొంటాడు. ఆ వేడిలో రెండు రోజులు బాగానే సాగుతుంది. మళ్ళీ ఎక్కడో ఏ రాజకీయాలను గురించో మంచి ముమ్మరంగా చర్చ సాగుతున్నప్పుడు నీళ్ళబిందెకి వేళయిందని పరుగెత్తుకు రావలసి వచ్చేది. అటువంటి సమయంలో ఎంతో కష్టమే కలిగేది. స్వరాజ్యం అతని ప్రాయశ్చిత్త భావన విని నవ్వింది. "ఎవరు చేసిన పాపానికీ ప్రాయశ్చిత్తం?" అంది. ముంగండ వూళ్ళోవాళ్లు చేశారనాలా? బ్రాహ్మణ కులానిదనాలా? లేక కులం వర్ణం అంటూ ఎన్నో భేదాలూ, తేడాలూ సృష్టించుకొన్న సమాజానిదనాలా? అతనికి అర్థం కాలేదు. ఆమె తెచ్చిన మరో ధర్మసందేహం అతనికి కొరుకుడు పడనేలేదు. పైగా తాను చేస్తున్న పనికి అర్థమే లేదనిపించింది. "ప్రాయశ్చిత్తం చేసుకొంటున్న పాపాన్నే మళ్ళీ నిత్యం చేస్తూండడమూ, అదే సాగిస్తూండడమూ ధర్మమేనా?" ఆ క్షణంలో దానిని వేళాకోళంగా తోసేశాడు. అది మా బ్రాహ్మలకి అలవాటే. రోజూ ముమ్మారు మా పాపాలు ప్రక్షాళనం అయిపోతూనే వుంటాయి" అన్నాడు. సూర్యశ్చ మా మన్యుశ్చ మన్యుపతయశ్చ మన్యుకృతేభ్యః పాపేభ్యో రక్షంతాం యద్రాత్యా పాపమకార్షం మనసా వాచా హస్తాభ్యాం పద్భ్యాముదరేణ శిశ్నా రాత్రిస్తదవలుంపతు యత్కించ దురితం మయి ఇదమహం మా మమృతయోనౌ సూర్యే జ్యోతిషి జుహోమి స్వాహా!! .....అని సంధ్యావందన భాగం చదివి వినిపించేడు. కాని అది ఆమె ప్రశ్నకు సమాధానం కాదు. మంచి పండితురాలు అనుకొనే విశాలాక్షి కూడా ఆ చిక్కు విప్పలేకపోయింది. ఊళ్ళో వీధుల్లో అస్పృశ్యుల్ని నడవనీయకపోవడమూ, వడగొట్టి చస్తున్నా అస్పృశ్యుల్ని చెరువునీళ్ళు తాకనివ్వకపోవడమూ..... రెండూ ముంగండ పరిశుద్ధతకి రెండు భుజకీర్తులు. వీధిలో అస్పృశ్యులు నడవడం నిషేధం గనక తన బాబాయి తన అవసరానికి వీలుగా కొన్ని మినహాయింపులు కల్పించుకొన్నాడు. వీధిలోకి వచ్చిన గడ్డీ, గాదమూ పెరటి లోపలకు చేర్చవలసి వచ్చినా, పెరట్లో వున్న పెంటా-పేడా వీధిలో బండీలో పొయ్యవలసివచ్చినా దొడ్డిగుమ్మాన పాలేళ్ళని వీధిలోకి రమ్మనేవాడు. సాధ్యమైనంత కొద్ది అడుగులలో, తక్కువ కాలంలో ఆ పనేదో వాళ్ళు చేసెయ్యాలి. ఆయనను చూసి అటువంటి చిన్న చిన్న సర్దుబాట్లు మరికొందరు చేసుకొన్నా మొత్తంమీద గ్రామం మడిగానే వుండిపోతూంది. దానిని తుడిచి పెట్టే తర్కం విశాలాక్షికీ నచ్చలేదు. కనకనే రామనాధం స్వరాజ్యానికి ఒక చిన్న హామీ యిచ్చి సంతృప్తి పడదలచేడు. "అటువంటి తప్పును దిద్దుకోడానికి మనం చెయ్యగలదంతా చేస్తాం. మనం మాత్రం అల్లాంటి పని చేయవద్దు.... చేయను....." "అంటే..... ఇంకొకళ్ళు చేస్తూనే వుంటారు. మీరు చెయ్యని తప్పుకు ఓపికున్నంతగా ప్రాయశ్చిత్తం చేసుకొంటూనే వుంటారు. ఆ దోషం మీది కాదు. ఒకరి కోసం చేసే ప్రాయశ్చిత్త ప్రక్రియ ఏమాత్రం చేసినా ఘనమే....." ఆ అవహేళనకు రామనాధం వద్ద సమాధానం లేదు. తప్పు దిద్దుకోడానికి పది బిందెల నీళ్ళు పోస్తే అయిపోతుందా? ఒక రోజో, ఒక వారమో, ఒక నెలో పోస్తే తీరుతుందా? మరేం చెయ్యాలి? అతనికీ ఆలోచనలు తెగలేదు. తాను చేస్తున్నది సరియైన పని అనిపించడం లేదు. ఆ ఆలోచనతోనే అతడు అంబాజీపేట సంత నుంచి వచ్చేడు. కూడా తెచ్చిన ఏకుల మూట పాకలో పెట్టి నూతి వద్దనే స్నానం చేసేడు. మామూలుగా అయితే అతడు స్నానానికి చెరువుకెళ్ళేవాడే. కాని, నేడు వెళ్ళాలనిపించలేదు. పల్లెలవాళ్ళు కూడా సంతకు వెళతారు. వాళ్ళూ ఇప్పుడిప్పుడే వొస్తారు. తాను చెరువు వేపు వెడితే వాళ్ళు కనిపిస్తారు. నీళ్ళు పొయ్యకుండా తప్పించుకోలేడు. తప్పించుకోవాలంటే ఒక్కటే మార్గం. చెరువుకు ముఖం చాటు చెయ్యడమే. అతడా పనే చేశాడు. చేసినప్పుడు అనిపించకపోయినా తరువాత తానేదో తప్పు పని చేసి, మొగం చాటు చేస్తున్నట్లు అనిపించి మనస్సుకి చాలా బాధ కలిగింది. అయినా వెళ్ళలేదు. వెళ్ళాలనిపించలేదు. తాను వున్నట్లు తెలియకూడదని హరికేన్‌ లాంతరు వెలిగించలేదు. ఆ చీకట్లోనే మంచం వాల్చుకు పడుకున్నాడు. కొంత మందికి ఎవరో నీళ్ళు పోసి వుంటారు. తరవాత కొంతసేపు మామూలు వేడికోళ్ళు వినిపించేయి. ఎవరో ఒకామె తనను అభినందించడం వినిపించింది. "ఆ అయ్య తోటలో లేరల్లే వుంది. మారాజు ఈ నెల్లాళ్ళ నుంచీ ఎవర్నీ అడగనక్కర్లేకుండా ఓ కడవ నీళ్ళు పోస్తున్నారు." రోజులో కనీసం మూడు నాలుగు గంటల కాలం తాను చేస్తున్న పనంతా ఒక్క కడవ నీళ్ళు పోయడమేనన్నమాట. రామనాధం నిలువునా కుంగిపోయేడు. తాను చేస్తున్న శ్రమనంతా ఉఫ్‌న ఊదేస్తున్న ఆ మాటను అభినందనగా తీసుకోవాలో, అభిశంసనగా తీసుకోవాలో అతనికర్థం కాలేదు. ఆమె అభినందనగానే అన్నా అది మాత్రం అతనికి సంతోషం కలిగించలేదు. పదహారు తన పరోపకార బుద్ధికి తానే బందీ అయిపోయినట్లనిపించి రామనాధం చాల విసుక్కున్నాడు. ఊళ్ళోకెళ్ళి పెదతండ్రితో మాట్లాడాలి. తన మనస్సుని బాధపెడుతున్న ఈ సమస్యకి ఆయన మరో పరిష్కార మార్గం సూచిస్తారేమోనని ఆశ. మాలపల్లె మంచినీటి సమస్యను పరిష్కరించేదెల్లాగ? ఇప్పుడు తాను చేస్తున్న పనిని ఎంతోకాలం సాగించడం సాధ్యం కాదు. కాని వదిలెయ్యనూ లేడు. మనుష్యుడికి అవసరమైన మంచినీటి సమస్యా? మరొకటా? ఏం చెయ్యమంటారో, వెళ్ళి అడగాలి. కాని, ఆయన ఇల్లు రాజవీధిలో ఆ చివర వుంది. పెద్ద రేనిట్ల మీదుగా వెడితే పది నిముషాలలో వెళ్ళవచ్చు. కాని ఈ మూలలో నీళ్ళ కోసం ఎవరన్నా కాచుక్కూర్చున్నారేమో. వాళ్ళు అడిగితే తోసుకుపోలేడు. అడక్కపోయినా, కడివెడు నీళ్ళ కోసం తన ముఖం వేపు దీనంగా చూస్తూ నిలబడి వుంటే పట్టనట్లు వెళ్ళిపోయే మొండితనం లేదు. ఇంక చేయవలసిందల్లా రోడ్డు తిరిగి రాజవీధినే వెళ్ళడం. ఆ విధంగా వెళ్ళడం దొంగపనిలా కనిపించి చెరువుకట్ట మీదుగానే బయలుదేరేడు. కాని, మూల రేవు వద్దకి వచ్చేసరికి చెరువు గట్టు పల్లంలో ఎవరో నిలబడ్డట్లే కనిపించింది. పలకరించేడు. "ఎవరు వారు?" "నేనయ్యగోరూ, యెంకినండి." ఆ చీకట్లో కూడా ఆమె కాళ్ళ వద్ద కడవ నీడ నల్లగా కనిపిస్తూంది. నీళ్ళు కావాలని ఆమె అడక్కపోయినా అతడే అడిగేడు. "ఇంత రాత్రయ్యేదాకా వున్నావేం?" "సంత చేసుకొచ్చేతలికి ఈ యేలయిందండి." ఆమె చాలా సేపటి నుంచే అక్కడ కాచుకొని వుంది. కాని, ఆ దారిన ఎవ్వరూ రాలేదు. ఎవ్వరూ లేరు గదా యని ఆమె, ధైర్యం చేసి దొంగతనంగానైనా ఓ కడివెడు నీళ్లు పట్టుకుపోలేకపోయింది. చీకటి చాటున తాను గమనించి వుండని వాళ్ళెవరన్నా తనను చూస్తే..... కొంపలంటుకుపోతాయి. ఇప్పుడింతసేపటికి ఒక మనిషి అటు వచ్చేడు. అతడు సాయం చేసేవాడే. కాని చేతిలో బిందే, కడవా లేదు. అడిగినా ఏం చెయ్యగలడు. కనక అడగలేక పోయింది. రామనాధం ముందుకు అడుగు వెయ్యలేకపోయేడు. హఠాత్తుగా ఏదో నిశ్చయం చేసుకొన్నాడు. వెనక్కి తిరిగేడు. "రా. నాతో, కడవ తీసుకురా." వెంకి అనుమానించింది. ఆమెకా సమయంలో తన పడుచుదనమూ, రామనాధం యౌవనమూ గుర్తు వచ్చాయి. "ఏడకండి, బాబయ్యా?" ఆమె అనుమానం అతనికి అర్థం కాలేదు. "తోటలోకి, నూతిలోంచి తోడుకుపోదువుగాని రా, బాల్చీ యిస్తాను." వేసవికాలంలో చెరువు నీరు బాగా తగ్గిపోయినా, పసరెక్కి పాడైపోయినా చుట్టుపక్కలనున్న బ్రాహ్మణ ఇళ్ళకు ఆ నూతి నీళ్ళే గతి. ఇతరప్పుడు, మామూలు రోజుల్లో కూడా సుబ్బావధాన్లూ, రామశాస్త్రీ, సిద్ధాంతీ మొదలయిన వాళ్ళు ఆ నూతి వద్దనే స్నానం చేస్తారు. ప్రశాంతంగా వుంటుందని అక్కడే ఏ చెట్టు క్రిందనో జపం చేసుకొంటారు. వాళ్ళ కోసమని శంకరశాస్త్రి ప్రత్యేకంగా ఓ నాలుగు మేడిచెట్లు వేసేడు కూడా. తానా నుయ్యి మైలపరిచేస్తే వారంతా ఏమయిపోతారు? వెంకికి తన హద్దులు తెలుసు. తన మనస్సులోని అసలు భయాన్ని అతి వినయం మాటున దాచి పుచ్చింది. "ఒద్దండి బాబయ్యా! యారో ఓరు ఒత్తారు. ఓ కడివెడు నీళ్లు పోత్తారు." ఆ అభ్యంతరం వినేసరికి రామనాధానికి చెడ్డ విసువూ-కోపమూ వచ్చేయి. "మీ చావు మీరు చావండి." అని ఉమ్మడిగా ఓ తిట్టు తిట్టేడు. వెంకి ఏమీ అనలేదు. రామనాధం విసురుకు లేచిపోయేడు. వెంకి అసలు అనుమానాన్ని అర్ధం చేసుకోలేక, ఆమె అభ్యంతరాన్ని మరొకలా వ్యాఖ్యానించేడు. తన మెత్తదనం చూసి నీళ్లు తోడుకొనే శ్రమ కూడా ఎందుకనుకుంటున్నారు కాబోలు అనుకొన్నాడు. అతడి చిరాకూ, చిడుముడిపాటూ చూసీ, జరిగిన ఘటన వినీ విశాలాక్షి వులికి పడింది. నిజంగా అతని మాట విని వెంకి నూతిలో నీళ్ళు తోడుకుపోతే మరేమన్నా వుందా? "చంపేశావు" అంది. ఊళ్ళో వాళ్ళు చంపేస్తారు. పీకేస్తారు. గగ్గోలు పెట్టేస్తారు. ఇంకా నయం. పది నిముషాలలో పది రూపాలలో ఊళ్లో రాగల కల్లోలాన్ని ఆమె వ్యక్తపరిచింది. ఈ మారు రామనాధం వెంకికిచ్చిన సలహానే వూరి వాళ్ళకూ సూచించేడు. "తన్నుకు చావమను." కాని, వెంకి ముందు అన్నంత తేలికగా వాళ్ళ ముందు అనలేకపోయాడు. ముందు తన ప్రయత్నానికి కొంత జట్టును కూర్చుకోవాలి. ప్రొద్దున్నే నీళ్ళు పొయ్యడానికి బిందె తీసుకు వచ్చిన శివకామయ్యను కదిపేడు. "ఈ వుద్యోగం వచ్చేక మిగిలిన పనులన్నీ మూలపడ్డాయి." "ఔను" అన్నాడు ముక్తసరిగా, శివకామయ్య. "నలుగురు మనుష్యులు రోజూ పని చెరుపుకోవలసి వస్తూంది" అన్నాడు సూరప్ప. "నీకు పనులుంటే చూసుకో. పనుంటే ఇదేమన్నా నిర్బంధమా?" అన్నాడు సుబ్బన్నశాస్త్రి. కామేశ్వరరావు సలహా వేరు. "వాళ్ళనే చెర్లో ముంచుకు పొమ్మంటే వదిలిపోతుంది. రామన్న దానికి అభ్యంతరం చెప్పేడు. శాస్త్రీయంగా భిన్న కులాల మధ్య వుందనుకొనే హెచ్చుతగ్గుల్ని ఆతడు విశ్వసించడు. ఈ అస్పృశ్యత మూలంగానే దేశ ప్రజలలో కొందరి సహాయం విదేశీ పాలకులకు లభిస్తూందనేది అతని అభిప్రాయం. కాని-- "వూరివాళ్ళ మాటేమిటి?" అని అతని ప్రశ్న. "ఓ కడివెడు నీళ్ళ కోసం పడిగాపులు పడివుండడంతో పనివాళ్ళు పనుల్లోకి ఆలస్యంగా వస్తున్నారు." అని సూరప్ప నీళ్ళ సమస్య పరిష్కారం కావలసిన అవసరానికి ఆర్థిక కారణం చూపించేడు. "అంతేనా, ఆ పూట పని ఎగగొట్టాలనిపించినప్పుడు నాలుగు అరిటాకులు కోసి కట్టకు వచ్చి అటు రోడ్డుమీదనో, ఇటు కొట్లోనో, అటు చెరువుగట్టునో నిలబడి కేకలు ప్రారంభిస్తున్నారు. ఆ కేకలు ఎవరికి వినిపిస్తాయి? ఎవరి ద్వారానో మళ్ళీ ఊళ్ళోకి కబురు చెయ్యాలి. కబురు పట్టుకెళ్ళిన వాళ్ళు మరచిపోకుండా వుండాలి. ఇంటి వాళ్ళు రావాలి. ఇంక ఆ పూటకి మనిషి కూలి చెడిందనుకున్నా పని జరగడమే లేదు." అన్నాడు కామేశ్వరరావు. స్థూలంగా అస్పృశ్యతను పాటించడం వలన కలుగుతున్న ఇబ్బందుల్ని వుదహరిస్తూ. రామనాధం ఇంకో దిశనుంచి తన వాదనకు బలం చేకూర్చుకోవడానికి ఆశ చూపించేడు. "గాంధీగారు అస్పృశ్యతా నివారణ గురించి చెప్తున్నారు. మన వూళ్ళో ఓ చిన్న పనిచేసి మన శాయశక్తులా ఆయన కృషికి తోడ్పడదాం" అన్నాడు. ఆ చిన్న పని, చెరువులో నీళ్ళని అస్పృశ్యులు ముంచుకొని పోయేటందుకు వదిలిపెట్టించడము. ఏ కాశీనాథుని నాగేశ్వరరావుగారినో, ఉన్నవ లక్ష్మీనారాయణగారినో రప్పించి అస్పృశ్యులకు ఊరి చెరువులో నీరు ముంచుకొనే అవకాశానికి ప్రారంభోత్సవం చేయిస్తే మరీ అద్భుతంగా వుంటుందని కామేశ్వరరావు సలహా. "నాగేశ్వరరావుగారినే పిలుద్దాం. ఆయనే అయితే తమ ఖర్చులు తామే పెట్టుకు వస్తారు. ఆంధ్రపత్రిక ఆయనదే కనక పత్రికలో ఆ వార్త బాగా వేస్తారు" --అంటూ హెచ్చు ఖర్చులేకుండా ముంగండకి కలిగే పేరు ప్రతిష్ఠలను అతడు వర్ణించేడు. రామన్న నాగేశ్వరరావుగారినో, మరొకరినో పిలిచే అభిప్రాయాన్ని అభినందించేడు. "ఆమధ్య గుంటూరులో జరిగిన ఆంధ్రమహాసభలో వారిని కలుసుకొన్నాను. విశ్వనాధంగారు పరిచయం చేశారు. పిలిస్తే వారినే పిలవాలి. కాని......" చెరువులో అస్పృశ్యులకు ప్రవేశం ఇవ్వాలంటే అది ఊరు ఉమ్మడి వ్యవహారం అని అతని ఆటంకం. "ఈశ్వరుడి పెళ్ళికి ఊరందరం పెద్దలమే" అని కామేశ్వరరావు తమకందరికీ ఆ ఉమ్మడి వ్యవహారంలో వాటా, హక్కూ వున్నదని నిరూపించేడు. శివకామయ్య అంగీకరించలేదు. "ఇప్పటివరకూ వూళ్ళో పార్టీలంటూ లేకుండా నడిచిపోతూంది." సూరప్ప అతనిని సమర్థించేడు. "లేనిపోని పేచీలు తెచ్చి వూళ్ళో చిచ్చుపెట్టకండి" అన్నాడు. అనేక సలహాలు, అభ్యంతరాలూ మధ్య సమస్య ఎక్కడిదక్కడే నిలిచింది. "నీదీ నాదీ అయితే నా యిష్టం అనొచ్చుగాని" అంటూ శివకామయ్య తన అభ్యంతరాన్ని వివరిస్తూంటే చటుక్కున రామనాధం అందుకున్నాడు. "పోనీ, మా నూతిలోంచి తోడుకుపొమ్మందాం...." రామన్నకు ఆ ఆలోచన అభ్యంతరం కాదు. కాని ఆలోచిస్తే గాని అడుగు వెయ్యడానికి ఇష్టపడలేదు. "ఉండు. తొందరపడకు. ఆలోచించుకోనీ......" పదిహేడు వారి ఆలోచనలు తేలక పూర్వమే గ్రామంలో గగ్గోలు బయలుదేరింది. ఆ రోజు సాయంకాలమే సాంబావధాన్లు పెద్ద పావంచాల రేవులో నిలివెడు బాణాకర్రతో పరవళ్ళు తొక్కేడు. గట్టుమీద కర్రతో తాటిస్తూ గంతులేస్తున్నాడు. "చెరువులో దిగితే పుర్రెలు ఎగిరిపోతాయి." ఆ కేకలు విని రాట్టం వడుక్కుంటూన్న వాడల్లా ఏమిటోనని రామనాధం తోటలోంచి బయటకు వచ్చేడు. కర్రతో పరవళ్ళు తొక్కుతున్న సాంబావధాన్లని చూసి ఏమిటో గొడవ కనుక్కోవాలి అనిపించింది. హడావుడిగా పెద్ద రేవు వేపు నడిచేడు. అతన్ని చూస్తూండగానే అవధాని కంఠం ఖంగుమంది. "నాలుగెకరాల భూమి వుండే సరికి క్రిందూ, మీదూ కనబడ్డం లేదు." రామనాధానికి విషయం ఏమిటో తెలియలేదు. అడిగేడు. "ఏమిట్రా బావా?" అవధాని మరోమారు తన ప్రతిజ్ఞ వినిపించేడు. "ఇదేం, తడాఖా, ఏమనుకుంటున్నారో, కొబ్బరి పుచ్చెల్లా ఎగిరి పోవలసిందే." ఆవేశం చూస్తే రామనాధానికి నవ్వు వచ్చింది. "భేషుగ్గా వుంది. అర్ధమయింది. పుర్రెలు కొబ్బరి పుచ్చెల్లా ఎగరగొట్టేస్తావు. కాని, అసలు సంగతి చెప్పవేం? ఎవరిది?" అతని నవ్వు చూసి అవధాని నిర్ఘాంతపోయేడు. కోరచూపు చూస్తూ మీసం దువ్వేడు. "అంత వేళాకోళంగా వుందేం?" అన్నట్లున్నాయి ఆ చూపులు. అంతవరకూ చెరువులో స్నానం చేస్తూ, అవధాని కేకలూ, గంతులూ విని ఆనందిస్తున్నవాళ్ళొకరిద్దరు నీళ్ళలోంచే సలహా ఇచ్చేరు. ఇదేదో కొట్లాటదాకా వస్తుందేమోనని వాళ్ళ భయం. "ఎవరివీ లేదుగాని, ఒరేయి రామనాధం! నువ్వెళ్ళిపో బాబూ!" ఆ సలహా విన్నాక ఆ గొడవ తనను గురించేనని అర్ధం అయింది. సాంబావధాని ఇంకా తీండ్రంలోనే వున్నాడు. "ఎవరివేనా సరే." "చంపేసేవు. ఎందుకేం?" ఈమారు సాంబావధాని గుట్టుగా వుంచలేదు. "ముంగండ ప్రతిష్ఠకి ఏమాత్రం ఘాటా వచ్చినా సరే రక్తం పారుతుంది." అని ప్రతిజ్ఞ వినిపించేడు. అయితే తన తోటలో బావిలోంచి తోడుకోమంటే ముంగండ ప్రతిష్ఠకి నష్టం వస్తుందా అని రామనాధం చల్లగా ప్రశ్నించేడు. సాంబావధాని చటుక్కున చల్లబడ్డాడు కాని, పూర్తిగా నమ్మకం చిక్కలేదు. "అంతేనా?" "కాక, మరి!" "అల్లా చెప్పు." "ఏదీ, నువ్వెవరినడిగేవు? ఎవరిని చెప్పనిచ్చేవు? మొత్తం మీద కౌశిక గోత్రంవాడిననిపించేవు" అని రామనాధం ఎగతాళి చేసేడు. సాంబావధాని అడగలేదు గాని రామశాస్త్రి అడిగేడు. సుబ్బావధాన్లు, వెంకప్ప దీక్షితులు, ఆఖరుకి బండ సుబ్బడు సహా అడిగేసేరు. ఒకటే ప్రశ్న పలు రూపాల్లో వచ్చింది. "తోట నూతిని మైలపరిచేస్తావుషోయ్‌" అన్నాడు దీక్షితులు. "దర్భాసనాలూ, ఝారీచెంబులూ తలొకటీ ఇస్తావుటేమిటోయ్‌" అన్నాడు బండ సుబ్బడు. తోటలో నూతి నుంచి నీళ్ళు తోడుకోమనడం పల్లెల వాళ్ళకి ఏదో మతం ఇవ్వడంలా కనిపించింది అతనికి. "నుయ్యి మైలపరిచేస్తారని మీ బాబాయి ఈ తోటకి మాల పాలేరుని కూడా పెట్టలేదోయ్‌" అన్నాడు సుబ్బావధాన్లు. ఇంకా ఆ విషయంలో ఓ ఆలోచన జరగలేదు. నిర్ణయం అనుకోలేదు. ఎవరి ఆస్తో కొల్లబోతున్నట్లు ఎవళ్ళకి వాళ్ళే గందరగోళం చేసేస్తున్నారు. రామనాధానికది సవాలులాగ కనిపించింది. నిర్ణయం చేసేసుకొన్నాడు. "అదే అనుకుంటున్నా, మామగారూ!" మామగారూ అన్నా, బాబాయీ అని పిలుపు తేడా తప్ప అదే సమాధానం. "అట్లాంటి తెలివితక్కువ పనులు తలపెట్టకు"మని రామశాస్త్రి మందలించేడు. ఏనాటి నుంచో వున్న కులాచారాల ప్రాముఖ్యం వర్ణించేడు. శరీరాంగాల ప్రత్యేకోపయోగాలను చూపించి వర్ణవ్యవస్థని సమర్థించడానికి ప్రయత్నించేడు. వెకిలి ఉపమానాలూ, వెర్రిమొర్రి ప్రతివాదాలూ అనవసరం అనిపించేయి. "నిన్న రాత్రి వెంకిని తోడుకు పొమ్మన్నా" అని తన దృఢ నిశ్చయాన్ని వినిపించేడు రామనాధం. తేలు కనిపించినట్లు సుబ్బావధాన్లు వులికిపడ్డాడు. మైలపడిపోయిన నూతి నీళ్ళతో తానా వుదయం స్నానం చేసేడేమో, ఖర్మ! "ఏ వెంకి? వెంకి ఎవరు?" రామనాధానికి ఆ వెంకి ఎవరో తెలియదు. చీకట్లో చూడ్డం గుర్తు తెలియలేదు. చెప్పలేకపోయేడు. సుబ్బావధాన్లే జ్ఞాపకం చేయడానికి ప్రయత్నించేడు. "నల్లగా.......కుదిమట్టంగా......" చీకట్లో గట్టుమీద నిలబడి పల్లంలో వున్న మనిషిని చూడ్డం, మట్టం, రంగూ ఏం చెప్తాడు? పైగా వానా, ఎండా అనకుండా కూలి పని చేసుకొనే వాళ్ళు నల్లబడిపోవడం అసాధారణ విషయం కాదు. ఆ యక్ష ప్రశ్నలు చూస్తే మనసు రగిలిపోయింది. "కాదు, పొడుగ్గానే కనిపించింది. పచ్చగానే వున్నట్లనిపించింది." మాలలలో కన్నా, మాదిగలలో పచ్చనివాళ్ళు హెచ్చు సంఖ్యలో కనిపిస్తారు. సుబ్బావధాన్లు ఆలోచన ప్రారంభించేడు. "పెసరబద్దగాడి కూతురు కాదు కదా." మనుష్యుణ్ణి గుర్తించడం కోసం గాక వినోదం కోసమూ, వెక్కిరింత కోసమూ సృష్టించుకొనే అనంతకోటి ఉరఫులలో రాజయ్య వంతుకు వచ్చిన పర్యాయనామం పెసరబద్దగాడు. అతడు కులానికి మాదిగ. రామనాధానికి ఆ వివరం తెలియదు. కనక నిశ్శబ్దంగా తలవూపేడు. అవధాని భగ్గుమన్నాడు. "తోడుకెళ్ళిందా లంజ......" ఆయనను అల్లరి చేయడానికి తాను ప్రయత్నిస్తే మధ్యనెవరో అమ్మాయి తిట్టు తినడం భావ్యంగా తోచలేదు. చటుక్కున అనేశాడు. "లేదు." అవధాని సంతృప్తితో జంధ్యం తడుముకున్నాడు. "ప్రశాంతంగా వుంటుందని అక్కడే స్నానం, జపం చేసుకొంటూంటాను, ఎరుగుదువుగా" అన్నాడు. ఆయనను హుషారు చేస్తూ "ఇప్పుడు మాత్రం మీకు అడ్డు ఏమిటి మామగారూ?" అన్నాడు రామనాధం అతడు నూయి పంచమపేట వాళ్ళకి వదిలిపెడతానన్నది కేవలం ఆటకేననిపించింది. సుబ్బావధాన్లు సంతోషపడ్డాడు. "నువ్వు మరొకలా చేస్తావా? తులసి వనంలో గంజాయి మొక్క పుడుతుందా? శంకరశాస్త్రి తరిఫీదులో...." ఆ అభినందన పూర్తికాకుండానే ఆయన కోసం తాను కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేయించగలనని రామనాధం హామీ యిచ్చేడు. "నీళ్ళ కోసం వచ్చే పోయే వాళ్ళతో సందడిగా వుంటుందనుకొంటే పాక వెనకాల పెద్ద వుసిరి క్రింద అరుగు బాగు చేయిస్తా." "ఏమిటీఁఁఁఁ!" తనంత శ్రోత్రియుణ్ని అస్పృశ్యులు మైలపరచిన నూతి నీళ్ళల్లో స్నానం చేయమంటాడా? సుబ్బావధానులు నిర్ఘాంతపోయేడు. అంతక్రితమే అతని పెంపకాన్ని మెచ్చుకున్నంత సులభంగానూ ఇప్పుడు నిందించలేకపోయేడు. "జైలుకెళ్ళి వచ్చేక నీకు మడీ, మైలా బొత్తిగా తెలియడం లేదోయి!" "అదేమిటి మామగారూ! అల్లా అంటారు." రామనాధం కంఠంలో వినిపించిన అమాయకత్వానికి అవధాని వెనక్కి తగ్గేడు. "నేను మైలపడిన నూతి నీళ్ళలో స్నానం చేస్తాననేనుటోయ్‌." రామనాధం ఆలోచనలో పడ్డట్లు ఒక నిముషం ఊరుకుని అన్నాడు. "ఔను సుమండి. ఆమాటే తోచలేదు." ఇద్దరూ ఒకరి ఆలోచనలను వేరొకరు పరీక్షించుకొంటున్నట్లు ఒక్కక్షణం నిలబడిపోయేరు. "పోనీండి. పెద్ద చెరువు వుండనే వుంది. స్నానానికి నీళ్లు లేకపోయేయా?" "అంతేనంటావు?" "పోనీ మీరే చెప్పండి" అన్నారు. రామనాధం పల్లెవాళ్ళ నీటి అవసరాన్ని గుర్తుచేస్తూ. "మామూలుగా పోస్తూనే వున్నావు కాదటోయ్‌." ఆ స్వార్థానికి మనస్సు రగులుతున్నా రామనాధం నవ్వేసేడు. "నాకదే వుద్యోగం అంటారు." తన సలహాలో వినిపించిన సంకుచితత్వమూ, స్వార్థమూ అవధానికి అర్థం అయినట్లే లేదు. దానినింకా సాగతీసేడు. "ఇంతవరకూ నువ్వే పోశావేం? ఇక్కడికిన్నేళ్లు గడిచాయి." "నిజమేననుకోండి." "లేకపోతే మనిషిని పెట్టుకొంటారు......" ఆ స్వార్థం చూస్తూంటే రామనాధం అవహేళన చేయకుండా వుండలేకపోయేడు. "ఔనండి. ఇంతవరకు తోచనేలేదు సుమండి. రేపో మనిషిని చూసి పంపిస్తాను. బేరం ఆడి కుదర్చండి. "నెలకి ఇంటికి అణో బేడో వేసుకుంటే వాడి కూలి వెళ్ళిపోతుంది. ఎవ్వరికీ ఏ కష్టం వుండదు." ఆ సులువు ఇంతవరకు తోచలేదన్నప్పుడు సుబ్బావధానికి కలిగిన సంతోషం ఎంతోసేపు మిగలలేదు. రామనాధం ఆ ఖర్చు వాళ్ళ మీద వెయ్యడమేమిటన్నాడు. సుబ్బావధాని తెల్లబోయేడు. మంచినీళ్ళు తాగేది పల్లెలవాళ్లు. కూలి తానిచ్చుకోవడం--అందులోని సబబు ఏమిటో అతనికి అర్థం కాలేదు. నుయ్యి గలవాళ్లు అస్పృశ్యులకు దానిని వదిలి పెడతామంటూంటే తను ఆటంకపరచడం, పైగా కూలి ఇచ్చి తోడించుకోమనడం ఏమిటో రామనాధానికి అర్థం కాలేదు. "నీళ్ళు చింది మళ్ళీ అందులోనే పడడానికి మళ్ళీ అదొకటా? ఇంక నుయ్యి పనేముంది? చెర్లోంచే పోస్తాడు." రామనాధం సహనం కోల్పోయినా, మర్యాద తప్పలేదు. "ఏం చేయడం మరి? ఊరి వారందరిదీను ఆ చెరువు. నీళ్ళు కూడా మన తాత ముత్తాతల ఆస్తి కాదు. అయినా మనం వాళ్ళని ఆ దరిమానాలక్కూడా రావద్దంటున్నాం. పోనీ అది అగ్రహారపు సబబు అందాం. కాని, నా తోటలో వున్న నూతి నీళ్ళు వాళ్ళని పట్టుకెళ్ళమనడానికి ఒకరి అభ్యంతరం ఏమిటి చెప్పండి? మీ సౌకర్యాల కోసం అడ్డం పెడతానంటారు. అల్లాంటప్పుడు దానికయ్యే ఖర్చు ఇచ్చుకోవద్దూ?" ఒక్క నిముషం ఆగి తన అభిప్రాయాన్ని కొంచెం మోటుగానే తేల్చేడు. "సామెత చెప్పినట్లు త్రాగేవాడే తాటి పన్ను ఇచ్చుకోవద్దా?" నిర్వాక్కుగా నిలబడిపోయిన సుబ్బావధాన్లని వదలి రామనాధం చరచరా విసురుకు లేచిపోయాడు. పద్దెనిమిది ప్రతిఘటన వస్తున్నకొద్దీ రామనాధానికి పట్టుదల ఎక్కువయింది. "గాంధీగారు చెప్పినట్లు అస్పృశ్యతను వదిలించలేకపోతే మానె, కనీసం వాళ్ళకి కాసిన్ని మంచినీళ్ళకైనా మార్గం చూపించలేకపోతే ఎల్లాగ పెదనాన్నా?" "తప్పకుండా చెయ్యవలసినదే. అయితే...." విశ్వనాధం సంఘ సంస్కరణ కావాలనే అంటాడు. కాని, దానికి అందరినీ కలుపుకొని రావాలి కాని, మనం ముందే గోదాలోకి వురకకూడదంటాడు. ఆ అభ్యంతరాన్ని రామనాధం సహించలేకపోయేడు. "కాదు పెదనాన్నా! దీనికెక్కడో ఒకచోట హద్దు పెట్టక తప్పదు." ఎట్టకేలకు విశ్వనాధం 'సరే' అన్నాడు. కాని, మరో మెలికపడింది. "అయితే ఆ ప్రారంభం ఏ పెద్ద నాయకుణ్ణో రప్పించి వారి చేత చేయిస్తే మంచిది." "ఎందుకు పెదనాన్నా! లేనిపోని ఆర్భాటం? మన తోట్లో నూతి నీళ్ళు మన యిరుగు పొరుగు వాళ్ళను తోడుకుపొమ్మనడానికి ఇంత ఆర్భాటం నవ్వుతాలుగా వుంటుంది. చెరువులో నీళ్ళకైతే అది గాని." కాని, విశ్వనాధం చెప్పిన ఆ ఆర్భాటం కూడా అవసరమేనని తర్వాత అనిపించింది. మిత్రులు వొప్పుకొన్నారు. ఊళ్లో కూడా "పోనీ, కానీ" అనే స్థితికి వస్తున్నారు. కాని, పేటల వాళ్ళదే పెద్ద సందేహం అయిపోయింది. "ఏదో జరిగిపోతూంది పోనీండి. ఊరివారితో పేచీలెందుకు బాబయ్యా?" అని పుంతమాలపల్లి పెద్ద సుబ్బయ్యే నాన్పుడు పెట్టేడు. అస్పృశ్యులందరికీ పుంతలలోనేనా ఇళ్ళ స్థలాలు లేవు. చాలమంది ఎవరెవరి తోటల్లోనో గుడిసెలు వేసుకొని వుంటున్నారు. నిలబడాలంటే యజమాని దయాధర్మాల మీద ఆధార పడాలి. ఇదేమిటని వారికి కోపం వస్తే? పొమ్మంటే ఏం చెయ్యాలి? ఊరి వాళ్ళంతా ఇష్టాపూర్తిగా 'సై' అంటే తప్ప వాళ్ళ వేపు నుంచి కదలిక కలిగేలా తోచలేదు. అప్పుడు పెద్దనాన్న మాటలోని సత్యం అర్థం అయింది. "ఖర్చే అనుకోరా అబ్బాయి, ఆర్భాటమే అనుకో, కాని అనవసరం కాదనుకుంటా. ఇల్లాంటి మంచి పనులు కొన్ని ఆ ఆర్భాటంలో వున్న ఆనందం కోసమే జరుగుతూంటా" యన్నాడు ఆయన. "అలాగే చేద్దాం" అనిపించింది. "ఒకరోజు పెట్టుకుందాం. నవరాత్రులు వస్తున్నాయి. విజయదశమి లోపున్న ఆ తొమ్మిది రోజుల్లోనూ ఒకరోజు పెట్టుకుందాం." దానికీ అంగీకారమే. మిత్రులతో అదివరకే జరిగిన చర్చల దృష్ట్యా కాశీనాథుని నాగేశ్వరరావు గారిని పిలుద్దామనిపించింది. "వారిని నువ్వెరుగుదువు గనుక నువ్వే వెడితే బాగుంటుంది." విశ్వనాధానికి అభ్యంతరం లేదు. గాని రామనాధమే వెళ్ళడం శ్రేయమని ఆయన పట్టుదల. దానికి బోలెడు కారణాలు చెప్పేడు. ప్రస్తుతం అస్పృశ్యులకు వదలిపెట్టే నుయ్యి రామనాధానిది. అతడు సహాయ నిరాకరణం చేసి జైలుకు వెళ్ళేడు. అతడే వెడితే పంతులుగారు మహానందపడతారు. ఇంకేవన్నా పనులున్నా పక్కకు పెట్టి తప్పకుండా వస్తారు. కాని...... రామనాధం అప్పటికే రెండు మూడు పనులు నెత్తిన వేసుకున్నాడు. ఈ ప్రారంభోత్సవం అంటూ పెట్టుకొంటే కొన్ని అదనపు పనులు తగులుతాయి. ముంగండలో ఊళ్ళో ఇచ్చిన పాతిక ముప్పయి రాట్టాలకీ ఏకులివ్వడమూ, నూలు తీసుకోవడమూ, నేతపని కనుక్కోవడమూ లచ్చమ్మ తీసుకుంటానంది. "నాకూ పని లేక తోచడం లేదు బాబూ! ఎప్పుడేనా కాస్త చూసుకొంటూండు, నేనే ఆ పని చూస్తా" అంది. చెరువులో నీరు పల్లెలవాళ్ళ కడవలకి పోసే పని రామన్న తీసుకుంటానని ముందుకు వచ్చేడు. కాని అతడికి చిన్న చిన్న కమిషను వ్యాపారాలున్నాయి. వున్నట్లుండి పని తగులుతే, షావుకారు పనిమీద వెళ్ళిపోతూంటాడు. కాని సూరప్ప, శివకామయ్య తమ సంసిద్ధతను తెలిపేరు. సూరప్ప అతని ఎదురుగానే అంగోస్త్రం నడుముకి బిగించేడు. "రాత్రీ, పగలూ చెట్టుకిందే కూర్చుంటా, నీకెందుకు పోయిరా." "చీకటి పడ్డాక కాస్త పాట పాడుకుంటూ కూర్చో" అన్నాడు శివకామయ్య. లేకుంటే ఎవళ్ళేనా దయ్యమని జడుసుకుంటారన్నమాట అనకుండానే అర్థమయింది. నలుగురూ నవ్వేరు. సూరప్పది చిక్కని నలుపు. ఆ నల్లని ముఖాన నవ్వు విరిసినప్పుడు ఎర్రని ఇగుళ్ళూ, తెల్లని పళ్ళూ చాలా భయంకరంగా వుంటాడని మిత్రులు అతనిని ఎగతాళి చేస్తుంటారు. అదీ తేలిపోయింది. నూతి చుట్టూ ఇటిక పరిపించడం, సిమెంటు చేయించడం, గిలకలు వేయించడం బాధ్యతలు విశ్వనాధం తీసుకొన్నాడు. "దసరా సెలవులిస్తారు. బాలకృష్ణ వస్తాడు. తోరణాలూ, అలంకారాలూ వగైరా పనులన్నీ వాడు చూస్తాడు" అంటూ విశాలాక్షి అతడికి మరో అత్యవసర విషయం గుర్తు చేసింది. "శాస్త్రి బాబయ్యతో చెప్పేవా?" అని గుర్తుచేసింది. విశ్వనాధం "ఔనౌను" అన్నాడు. "తీరా నాతో చెప్పలేదని ఆయనంటే లేనిపోనిది అదో గొడవ." "అదేం మాటలే, ఆయనతో చెప్పకుండానా?" అంది విశాలాక్షి. "లేనిపోని పట్టుదలకు పోకు. వెళ్ళి చెప్పు" అని ప్రోత్సహించింది. పందొమ్మిది "రా, రా. ఎక్కడా కనబడ్డం లేదు. వూళ్ళోనే వున్నావా? నిన్న తోట్లోకి వచ్చేను. కనపళ్ళేదు" అంటూ శంకరశాస్త్రి రామనాధాన్ని సాదరంగా ఆహ్వానిస్తూనే, భార్యను పిలిచేడు. "ఏమే, అబ్బాయి వచ్చేడు. ఏవీ, కొంచెం వేపుడు బియ్యానికి కొంచెం కారం రాసి పట్టుకురా." రాజమ్మ వచ్చింది. "ఇన్ని రోజులకి తీరిక చిక్కిందిరా" అని నిష్ఠూరమాడుతూనే కుశల ప్రశ్నలు వేసింది. "మీ బావమరిదికి ఏదో వుత్తరం వ్రాశావన్నారు. వాళ్ళ నుంచి ఏమన్నా సమాధానం వచ్చిందా?" అని ఆమె సంసార వ్యవహారాలను గురించి ప్రశ్నలు ప్రారంభించింది. "ఏం చేస్తున్నావు? ఎప్పుడో ఓమారు చేనిగట్టుకేనా వెళ్లి వస్తున్నావా? పోయి చూసుకుంటూండాలి. అన్నీ పనివాళ్ళమీద వదిలెయ్యకూడదు. మూల చేను రెండోమారు కలుపుకు వచ్చిందనుకుంటాను" అంటూ శంకరశాస్త్రి పొలాలకూ, పంటలకూ సంబంధించిన కుశల ప్రశ్నలు సాగించేడు. ఆ దంపతులు కుశల ప్రశ్నలూ, లోకాభిరామాయణం మధ్య శంకరశాస్త్రి ఒక కొత్త ప్రతిపాదన తెచ్చేడు. "వేద సంస్కృత పాఠశాల ఒకటి నడిపించాలని అనుకుంటున్నాం వూళ్ళో. ప్రశాంతంగా వుండే విశాలమైన చోటు కావాలి. వూరికి దగ్గర్లో వుండాలి. పూర్వకాలపు ఆశ్రమాల పద్ధతిలో నడపాలని ఆలోచన.... ఆ సౌకర్యాలన్నీ వున్నది నీ తోట కనిపించింది...." ముంగండ వేదశాస్త్రాలకి పుట్టినిల్లని పేరుంది. దక్షిణామూర్తి శాస్త్రులు గారూ, లక్ష్మీనారాయణ దీక్షితులుగారూ వంటి మహా పండితులూ, ఋగ్వేద స్వాధ్యాయపరులూ ఇప్పుడు లేకపోయినా వారి శిష్యకోటి వున్నారు. వ్యాకరణ కేసరి అని పిలిపించుకొంటున్న ఉమామహేశ్వర శాస్త్రి గారున్నారు. పండిత ప్రకాండులు బోలెడందరున్నారు. ఎక్కడెక్కడి నుంచో విద్యార్థులు వస్తున్నారు. ఏ వారాలు చేసుకొనో, మధుకరము ఎత్తుకొనో తింటూ చదువుకొంటున్నవాళ్ళూ వూళ్లో ఏ రోజూ పదిహేను, ఇరవైమంది వుంటూనే వున్నారు. ఎవరి ఇంటి అరుగు మీదనో కాలక్షేపం చేస్తున్నారు. చెరువుగట్టుమీది రావిచెట్ల క్రింద కూర్చుని పాఠాలు చింతన చేసుకొంటున్నారు. ఇప్పుడు చేయదలచిందల్లా దానికో పాఠశాల రూపం ఇవ్వడం! ఆ ప్రతిపాదన వివరాలు చెప్తూవుంటే రవీంద్రుని శాంతినికేతనమూ, పూర్వకాలపు గురుకులాలూ రామనాధం మనస్సులో మెదిలేయి. ఆటంకాలనూహించలేని పడుచుదనపు భావనాబలం అతనిని వూహాలోకాలలోకి తీసుకు పోయింది. పెద్ద వుసిరిచెట్టు క్రింద కూర్చుని కౌముది పాఠం చెప్తున్న శాస్త్రులుగారూ, పుంతమూల మామిడి కొమ్మల పంగల్లో కూర్చుని వాక్య పఠనం చేస్తున్నవాళ్ళూ మనోనేత్రం ముందు మెదిలేరు. ఒకరి చదువుకు ఒకరు ఆటంకం కానక్కర్లేదు. బోలెడంతచోటు. బోలెడన్ని చెట్లు. తన తోట ఒక శాంతినికేతనం, ఒక గురుకులం అవుతుందన్న ఆలోచనే అతనిని ఉక్కిరిబిక్కిరి చేసేసింది. భారతీయ పద్ధతిలో విద్యాబోధన ఎంత చౌక! ఎంత నిరాడంబరం! ఎంత సులభం! అని మహానందపడిపోయేడు. పాఠశాలకి భవనాలు అక్కర్లేదు. గురువులకు జీతాల పనిలేదు. శిష్యకోటికి ప్రత్యేక భోజనపుటేర్పాట్లు చేయవలసిన పనిలేదు. వర్షాకాలంలో కాస్త ఆస్తరణ వుంటే చాలు.... "దానికేముంది మహా...." రామనాధం సరేనంటే-- "ఏ పుణ్యాత్ముడో ఆ వేళకి ముందుకు వస్తాడు. 'దేశో విశాలః ప్రభవోప్యనంతాః...' " అన్నాడు శంకరశాస్త్రి. అస్పృశ్యులకు తోటలో నూయి వదిలేటందుకు కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుగారిని తీసుకురావాలనుకొంటున్న వార్త చెప్పగానే శంకరశాస్త్రి ఎగిరి గంతేసేడు. "చూసేవా. దేవుడు మన ప్రయత్నాలను ఆశీర్వదిస్తున్నాడనుకోవాలి" అని శాస్త్రి అభిప్రాయం తెలిపాడు. లేకపోతే రామనాధానికి కాశీనాధుని వారి పేరు ఎందుకు తోస్తుంది? ఆయనే ఓ రెండు పాకలు వేయించేస్తారు. ఆయనే పాఠశాలను ప్రారంభిస్తారు... ఆ వుత్సాహంలో మధ్యన పంతులుగారిని తీసుకువచ్చే వుద్దేశం భిన్నమని గుర్తుకు వచ్చింది. "ఔను గాని, పాఠశాల అక్కడ పెట్టుకొనేటట్లయితే నుయ్యి పల్లెలవాళ్ళకివ్వడం ఎల్లా వీలవుతుంది?" అన్నాడు. అనేకానేక అభ్యంతరాలు..... వేద పఠనం అస్పృశ్యుల చెవిని పడకూడదు. మహాపాపం! అస్పృశ్యులు మైలపరచిన నూతి నీటిని వేదవేదాంగ విధులయిన పండితులూ, వారి శిష్యులూ వుపయోగిస్తారా? అది ధర్మ భాహ్యం కాదూ! ఆ అభ్యంతరాలు రామనాధానికి తోచనిమాట నిజం. కాని, తనకో పెద్ద ధర్మ సందేహం పట్టుకొంది. రామనాధం ప్రాయశ్చిత్తం చేయించుకోలేదు. ధర్మ భ్రష్టుడనేశారు. వూళ్ళోని కుటుంబాలన్నింటితో ఏదో బీరకాయపీచు బంధుత్వం వుండడం, దగ్గర బంధువుల బలగమే పెద్దది వుండడం మూలానా వెలి అంటూ పెట్టి అల్లరి చెయ్యలేదుగాని, మరో వూళ్ళో అయితేనూ, ఈ వూళ్ళోనే మరోవాడైతేనూ ఏడిపించేసేవారే కదా. అటువంటి తాను కూడా ఆ తోటలోకి అడుగు పెట్టరాదా? అడిగేసేడు. "అబ్బెబ్బే! నువ్వు కదలనక్కర్లేదు." అని శంకరశాస్త్రి హామీ యిచ్చేడు. "మరి పేచీ యేముంటుంది?" అన్నాడు రామనాధం. "పెద్ద చెరువు పక్కనేకదా....." పక్కనున్న నూతిని మైలపరుస్తాను. ఎదురుగావున్న చెరువుకు పొమ్మంటే అర్ధం ఏమిటి? తిట్టొద్దు, కొట్టొద్దు, పొగబెట్టు వాడే పోతాడన్నట్లే కదా...... "పోనీ నీకిష్టం లేదంటే చెప్పు" అన్నాడు శంకరశాస్త్రి. "మరో చోటు వెతుక్కుంటాం." తనకు లేని భావాన్ని అంటగడుతూంటే రామనాధానికి కష్టం అనిపించింది. "పల్లెల వాళ్ళకి నీటి మాటేమిటి?" శంకరశాస్త్రి ఒకదాని తర్వాత ఒకటి రెండు మార్గాలు సూచించేడు. "విద్యార్థులు ఓ ఇరవయిమంది వుంటారు. వంతులువారీగా పల్లెల వాళ్ళకి నీళ్ళు పోయిద్దాం. నీ పనులకు ఆటంకంగా వుందని కదా ఆ ఆలోచన? ఆ ఇబ్బందీ తీరుతుంది. విద్యార్థిగాళ్ళకి కాస్త పనీ వుంటుంది." ప్రారంభంలో నీళ్లు లేక మాడిపోతున్న పల్లె వాళ్ళ మీది దయ కొద్దీనే రామనాధం వాళ్ళకి నీళ్ళు పోయడం పని తీసుకొన్నాడు. తరువాత ఆ దయ నుంచి బయటపడలేకా, తన ఇతర పనులన్నీ చెడిపోతూంటే చూడలేకనే తన తోటలో నూయి వాళ్ళకి వదిలెయ్యాలనే భావం కలిగింది. కాని అస్పృశ్యత హిందూమతానికి మాసిపోని మచ్చ. ఒక మహానేరం. అస్పృశ్యతా నివారణకు జరిపే కృషి మానవుని ఘనతను గుర్తించడానికి జరిపే కృషి--అంటూ గాంధీగారి వ్యాసాలూ, ఉపన్యాసాలూ చదువుతున్నకొద్దీ తన ప్రయత్నం వట్టి దయ మూలకంగానే వుండకూడదనుకొన్నాడు. ఇప్పుడా నూతిని అస్పృశ్యులకి వదిలివెయ్యబోడం లేదు. దానిలో తనతోపాటు వాళ్ళూ తోడుకుంటారు. నాగేశ్వరరావు పంతులుగారు వచ్చి ప్రారంభించబోయే కొత్త అలవాటు అదే..... శంకరశాస్త్రి అప్పుడు తన రెండో ప్రతిపాదన తెచ్చేడు. పుంతల్లో పల్లెవాళ్ళకి గవర్నమెంటు ఇళ్ళ స్థలాలు తలో సెంటూ ఇస్తానంటూంది. కాని చేలకి వచ్చిపోయే రహదారికి అడ్డు అనీ, తమ చేలకి నష్టం అనీ వూళ్ళోవాళ్ళు పిటీషన్లు పెట్టేరు. అది నలుగుతూంది. నలుగురం పోగయి అక్కడ ఓ నుయ్యి తవ్వించి పెట్టవలసిందని కోరితే నాగేశ్వరరావు పంతులుగారే తవ్వించి పెడతారు. దానినే ఆయన ప్రారంభించి వెళ్ళిపోతారు. పాఠశాల పాకలకు మరో ధర్మాత్ముడిని అడగవచ్చును..... ఆ పద్ధతిలో అందరి ఆలోచనలూ నెరవేరుతాయి అని శంకరశాస్త్రి అభిప్రాయం. "వెళ్ళు. ఔను, కాదు అని ఇప్పుడే అనెయ్యకు. ఆలోచించుకో. రెండు రోజుల్లో చెప్పు" అని సెలవిచ్చేడు. ఇరవై ఆ గ్రంథం అంతా విని శివకామయ్య ఫక్కున నవ్వేడు. మీ బాబయ్య చాణక్యుడురా నాన్నా!" అతని మిత్రులంతా సాహిత్యంతో తమకున్న పరిచయాన్నిపట్టి శంకరశాస్త్రిని యుగంధరుడు, యౌగంధరాయణుడు, అమాత్యరాక్షసుడు, తిమ్మరుసు, అక్కన్న-మాదన్నలతో పోలుస్తుంటారు. పల్లె వాళ్ళని బావి వద్దకు రాకుండా చేసేందుకు శాస్త్రి వేసిన ఎత్తు తప్ప పాఠశాలా లేదు, పాంథశాలా లేదు అని వాళ్ళ వ్యాఖ్య. రామనాధానికి పాఠశాల జరగకుండా తాను ఆటంకమయ్యేనేమోనని సందేహం మనస్సుని ఓ మూల బాధిస్తూనే వుంది. ఆ సందేహం విని శివకామయ్య కోప్పడ్డాడు. "తగ్గరా, వెర్రిపప్పాయి." అతని వాదనలంత తోసివేయవలసినదిగా కనబళ్ళేదు. "ఊళ్ళో అడుక్కు తిని, పీర్లపంజాలో కాచుకు తాగి, మా అరుగుమీద అష్టపదులు పాడుకోమంటే పాడే వెర్రికుట్టె ఎవరురా?" అన్నాడు ఎగతాళిగా రామన్న. "అంతేనంటావా?" అన్నాడు రామనాధం. పండితులకు పావలా డబ్బులివ్వక్కరలేదు. విద్యార్థులకు భోజన సదుపాయాలు చూడనక్కర్లేదు. చివరకు పాకకో, పందిరికో నాగేశ్వరరావు పంతులుగారినో, వేరొకరినో చూడవచ్చు. కాని, ముంగండ వాళ్ళకి వేద సాహిత్య పాఠశాలను నిర్వహిస్తున్న ప్రతిష్ఠ దక్కుతుంది. ఆ ఆలోచననే అతని మిత్రులు అపహాస్యం చేశారు. కామేశ్వరరావు వూహలను మరికొంత సాగించేడు. "మీ బాబాయి పాఠశాలకి ఓ నామకరణం కూడా చేసే వుంటాడు." పండితరాయ జగన్నాథుడు ముంగండలో పుట్టేడు. ఆ విషయాన్ని ముంగండ వాళ్ళు ఎన్నటికీ మరిచిపోరు. ఎవరినీ మరిచిపోనివ్వరు. జగన్నాథ పండితరాయలు వేదశాస్త్రాలు ఒక్క బ్రాహ్మల సొత్తుగానే కాదు, ఒక్క హిందువుల సొత్తుగానే అంగీకరించలేదు. దారా షికోతో కలిసి ఉపనిషత్తుల్ని పారశీకంలోకి అనువదించేడంటారు. వివాహ విషయంలో కులాన్నీ, మతాన్నీ కూడా త్రోసి పుచ్చేడంటారు. వాటన్నింటినీ ఎంతో గొప్పగా చెప్పుకుంటారు. కాని, ఆయన జీవితాధ్యవసాయాన్ని మనస్సుకు పట్టించుకోరు. ఆ ధోరణిలోనే కామేశ్వరరావు పుట్టని పిల్లకు నామకరణం చేసి వెక్కిరించేడు. "పండితరాయ వేదవేదాంగ సాహిత్య విద్యాలయం." తన్ను పెంచి పెద్ద చేసిన వ్యక్తి శంకరశాస్త్రి. ఆయన తన్ను బోల్తాకొట్టించడానికే పాఠశాల ప్రయత్నం తలపెట్టేడంటే రామనాధం ఇంకా పూర్తిగా నమ్మలేకున్నాడు. కాని, మిత్రులు చెప్పిందీ సబబుగానే వుంది. తనకా వుత్సాహంలో అర్థం కాలేదుగాని, పండితులు బ్రతకడం ఎల్లాగ? వీళ్ళకు వచ్చి రోజూ నాలుగ్గంటలో, అయిదు గంటలో పాఠం చెప్పాలంటే అంత మేరకీ తమ జీవిత వృత్తులు పక్కకి నెట్టాలి. ఇప్పుడు చెప్పడం లేదా అంటే చెప్తున్నారు. ఆ చెప్పడానికో వేళాపాళా లేదు. ఓ ప్రత్యేక ప్రదేశం లేదు. అంబాజీపేట సంతకెడుతూనూ, నరేంద్రపురం పొలం వెడుతూనూ, పనస చెప్పుకొంటున్నారు. ఒక్కొక్కప్పుడు నాలుగేసి రోజులు పాఠాలే వుండవు. పాఠశాల అన్నాక అదెల్లా సాగుతుంది? "ఈ కంచి గరుడ సేవకి మనూళ్ళో రెండు మూడుమాట్లు ఏర్పాట్లు జరిగేయి ఇదివరకు" అన్నాడు రామన్న. "వేద పాఠశాల నడుపుకొనేందుకు వూళ్ళో చోటే లేదూ? పాపం అవధూత స్వామి ధర్మమాయని చెరువుగట్టుమీద మఠం ఒకటి వెలిసింది. ఎవరన్నా స్వామి వస్తేనంటారా? ఇప్పుడు చేస్తున్నట్లే చెరువుగట్టు మీద బోలెడు రావిచెట్లూ కాదంటారూ, తమ తమ ఇంటి అరుగులు వుండనే వున్నాయి." "నిజమే"నని రామనాధం వొప్పుకున్నాడు. "పల్లె వాళ్ళకి తాగేటందుకు నీరు మాటేమిటి?" అని రామన్న నిలదీశాడు. రామనాధం స్థిరం చేసుకొన్నాడు. ఇరవై ఒకటి అటు పంచమకులాల పెద్దల్నీ, ఇటు గ్రామంలోని పెద్దల్నీ తాను తలపెట్టిన పనికి ఒప్పించే ప్రయత్నంలో రామనాధం రాత్రింబగళ్ళు తిరుగుతున్నాడు. తన పథకాన్నంతనూ వివరంగా తెలుపుతూ నాగేశ్వరరావు పంతులుగారికి వుత్తరం వ్రాసేడు. ఎవరి తోటలోనో వున్న ఒక నూయిని అస్పృశ్యులకు వదలడంలో విశేషం ఏమున్నదని పంతులుగారు రావడానికి నిరాకరిస్తారేమోనని అతని భయం. తాను వెడితే పరిస్థితులు వివరంగా చెప్పగలడు. అగ్రహారం ప్రజల ఛాందసత్వాల మధ్య ఆ ప్రయత్నం యొక్క ప్రాముఖ్యాన్ని చెప్పగలడు. కాని, ఊళ్ళో ప్రతిఘటనను సర్దుబాటు చేయనిదే ఎక్కడికి వెడతాడు? పంతులుగారిని తీరా తీసుకువచ్చాక ఊళ్ళో వాళ్ళే కాకుండా, అసలు దాని వుపయోగం పొందవలసిన వాళ్ళు కూడా రాకపోతే? అందుచేత వారికి తానో వుత్తరం వ్రాసేడు. వివరంగానే వ్రాసేడు. దువ్వూరి సుబ్బమ్మగారికి కూడా సంగతులు తెలియబరచి, ఆమెను కూడా పంతులుగారికి వ్రాయమన్నాడు. ఆ అవసరం లేకుండానే పంతులుగారి నుంచి ఆశీర్వదిస్తూ వుత్తరం వచ్చింది. తేదీ నిర్ణయించి తెలుపమంటూ. ఆ జాబుతోపాటు ఆంధ్రపత్రిక పంపించడం కూడా ప్రారంభించారు. ఆ రోజు నాటికి సుబ్బమ్మగారూ వీలుపడితే తానూ వస్తున్నానని తెలియబరచారు. ఈ రెండు లేఖలూ రామనాధాన్ని, మిత్రకోటినీ విశేషంగా వుత్సాహ పరిచాయి. ఆ వుత్సాహంలో వారి ప్రయత్నాలూ విస్తరించాయి. చుట్టుప్రక్కల రెండు మూడు మైళ్ళలో వున్న గ్రామాల నుంచి కూడా ఈ ఉత్సవానికి జనాన్ని పోగుచెయ్యాలనుకొన్నారు. నాయకులు వస్తున్న వుత్సాహం, చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు సమావేశం కావడం దృష్ట్యా అగ్రహారం జనంలో ఏమన్నా వ్యతిరేకత ఉన్నా అది బయటకు రాదు. ఆ రోజున నాయకులు ఉపన్యాసాలిస్తారు. జనం కూర్చునేందుకు తోటలోనే పెద్ద పందిరి వేయడానికి సన్నాహాలు ప్రారంభించేరు. ఆ సందర్భంలో విందు కూడా చేస్తే...? విందు అన్నప్పుడు అన్ని కులాలవాళ్ళూ కలిసి కూర్చోగలిగితేనే అర్ధం వుంది. ఎంతమంది వస్తే అందరితోనే... ఈలాగ ఒకదానికొకటి అల్లుకుపోతున్నాయి. పనులు పెరుగుతున్నాయి. పనులతోపాటు మిత్రగణం పెరిగింది. పత్రిక చదివే వాళ్ళ సంఖ్య పెరిగింది. గ్రామంలో ఒకటి రెండు చోట్ల పత్రికా పురాణాలు నడుస్తున్నాయి. చదవడంతోపాటు చర్చలు సాగుతున్నాయి. "ఈవేళ పత్రికలో ఏం వేశారోయ్‌?" అని అడుగుతున్నవాళ్ళ పలకరింపులు హెచ్చవుతున్నాయి. వర్షాలు వెనకబట్టేయి. అస్పృశ్యులకు నూతి వద్ద నీళ్ళు తోడుకొనే అవకాశం కలిగించేటందుకు తేదీ నిర్ణయం అయింది. సరిగ్గా నెల రోజుల్లో కార్తీక పౌర్ణమి వస్తూంది. మొదట అనుకొన్నట్లు విజయదశమికి సాధ్యం కాలేదు. ఈ ఏడు తూర్పు వర్షాలు కుండపోతగా పడ్డాయి. రామనాధం పెద్ద రావి క్రింద గ్రంథాలయం అరుగుమీద ఆనాటి పత్రికను చదివి వినిపించడం ముగించి అప్పుడే మకాం చేరుకున్నాడు. రాత్రి ప్రొద్దుపోయింది. కాళ్ళ బురద వదుల్చుకొని పాకలో అడుగు పెట్టేసరికి పడక కుర్చీలో పడుకొని నిద్రపోతున్న చంద్రశేఖరం కనిపించేడు. ఎవరా అనుకుంటూండగానే అలికిడికి లేచేడు. "ఇంక ఈవేళకి రావేమో, ఏం చెయ్యడమా అనుకుంటూంటే నిద్ర పట్టేసింది." "ఎంతసేపయింది వచ్చి?" ఎంతసేపయిందో చెప్పడంతోపాటు చంద్రశేఖరం తన భోజనం అయిపోయిందనీ, తన కోసం ఏర్పాట్లేవీ చేయనక్కర్లేదనీ అన్నాడు. రామనాధం అతనిని మనస్సులోనే అభినందించేడు. లేకుంటే ఈ వేళప్పుడు అతడికి ఏం పెట్టగలడు? సాయంకాలం ఓ పావుశేరు బియ్యం అత్తెసరు వేసుకుని అల్లా వీధిలోకి వెళ్ళేడు. పనిమనిషి పెరుగు తెచ్చి ఉట్టిమీద పెట్టి పోయి వుంటుంది. తానైతే వుప్పూ, ఊరగాయా లేకుండా ఇంత పెరుగు పోసుకుని తిని లేచిపోగలడు. కాని, ఆ భోజనం అతిథికి పెట్టడం ఎల్లాగ? చేతనైనా, ఆ రాత్రివేళ వంట ఏం చేస్తాడు? చంద్రశేఖరం భోజనం చేసే వచ్చేననే సరికి ప్రాణం కుదుటపడింది. కాని మర్యాదకన్నా అసమ్మతి తెలుపకుండా ఊరుకోలేకపోయాడు. "అదేమిటండీ, ఆ మాత్రం...." చంద్రశేఖరం నవ్వేడు. "మర్యాద పేరుతో అబద్ధాలాడకయ్యా! ఇప్పుడు నే భోజనం చేస్తానంటే నువ్వు వొండి పెట్టగలవా?" "ఉలకం" "ఇంతకీ నీ భోజనమయిందా?" "లేవండి. ఎప్పుడు తిన్న తిండో." "ఇద్దరం పంచుకు తిందాం...." "సహనౌభునక్తు" అంటావు. చంద్రశేఖరం ఏమీ అక్కర్లేదని ఖచ్చితంగా చెప్పేసేడు. పైగా రామనాధం విస్తరి వేసుకొనేవరకూ ఊరుకోలేదు. అతని తిండి చూసి మనస్సులో జాలిపడ్డాడు. "రోజూ ఇంతేనా?" అన్నాడు. "మన దేశంలో ఈ మాత్రమూ దొరకని వాళ్ళు కోట్ల మంది." చంద్రశేఖరం ప్రశ్నకు ఆర్థికం మూలకం కాదు. కాని, రామనాధం తెలివిగా మాట మళ్ళించేడు. కొంతసేపు ఇద్దరూ ఆమాటా, ఈ మాటా మాట్లాడేరు. కాని అసలు విషయానికి రావడానికి ఇద్దరూ జంకుతున్నారు. "ఏమిటీ హడావిడి అంతా.....?" తోటలో పందిళ్ళకి సామాను తెచ్చి పడేసేరు. నూయి ఎత్తు చేయడానికీ, గచ్చు చేయడానికి తెప్పించిన ఇటుకా, ఇసుకా అస్తవ్యస్తంగా వున్నాయి. రామనాధం తన ప్రయత్నాలన్నీ చెప్పేడు. అన్నీ విని చంద్రశేఖరం చేసిన వ్యాఖ్య రామనాధానికి ఆశ్చర్యం అనిపించింది. "మనిషివి చిక్కేవు. ఆరోగ్యంగా వున్నావా?" అని చంద్రశేఖరం. రామనాధం ఛాతీ, దండలూ చూసుకొన్నాడు. "చిక్కేనా? నాకు తెలియడం లేదు." అనారోగ్యం ఏమీ లేదని ముఖమే చెప్తూంది. అయితే మనిషి నల్లబడ్డాడు. నవకం తగ్గి మనిషి దృఢపడ్డాడు. చంద్రశేఖరం కాస్సేపు ఊళ్ళో కబుర్లూ అడిగి చివరకు అతని మకాము కాకినాడకో, మద్రాసుకో మార్చమని సలహా ఇచ్చేడు. "తర్వాత ఏం చేసినా, ఆ బి.ఏ. పూర్తి చెయ్యరాదూ? ఇంతలో వ్యవహారాలూ చక్కబడతాయి." చక్కబడవలసిన వ్యవహారం అల్లా అత్తవారి తోడిదే.... అంటే, తాను బి.ఏ. చదువు పేరుతో ముంగండ వదలాలి. అల్లుడు దారిన పడుతున్నాడనే విశ్వాసం మామగారికి ఏర్పడుతుంది. భార్యను పంపుతాడు, అటు తర్వాత నా పరుగు అందుకోమంటే ఏం చేస్తాడేం?.... అని కాబోలుననుకొన్నాడు. రామనాధం ఆ ఆలోచనను అంగీకరించలేదు. తాను ముంగండలో కొన్ని పనులు తలపెట్టేడు. వానిని సాగించడం మాట ఎలా వున్నా భార్యను తెచ్చుకొనేటందుకు ఒక పెద్ద నాటకం ఆడడం, ఆషాఢభూతి వ్యవహారం నడపడం అతనికి సమ్మతం కాలేదు. కాని చంద్రశేఖరం ఒప్పుకోలేదు. "వంట చేసుకోలేక ఈ చప్పిడి కూడుతో ఎంతకాలం?" పెళ్ళాం అవసరం వంట చేసిపెట్టడానికేనా అనిపించింది. అంతే అయితే ప్రస్తుతం బాధ లేదు. జైలులో చప్పిడికూడు తినడం అలవాటు అయింది. ఇప్పుడు తినమన్నా కారం తినలేడు. మజ్జిగ అన్నంలోకి ఉప్పు కూడా పని లేదు. పైగా తనకి వంట బాగానే చేతనవును. అందుచేత తిండికి సంబంధించినంత వరకూ పెళ్ళాం రావలసిన అవసరం లేదు. ఆమాటే చెప్పేడు. "మరి నీ ఉత్తరం ఏమిటి?" రామనాధం క్లుప్తంగానే పరిస్థితి వివరించేడు. "మీ సలహా ఏమిటి? నా ఎడ కనీసపు సుహృద్భావం మీకుంది. ఆ వేపున చెల్లెలు, నన్ను ఏం చెయ్యమంటారు?" ఆ ప్రశ్న మర్యాద కోసం వేసిందేగాని వేరు కాదనిపించింది. రామనాధం ఒక అభిప్రాయానికి వచ్చేవున్నాడనిపించింది. "నీ అభిప్రాయం ఏమిటో చెప్పు?" "మీరు తండ్రిగారింటికి వెళ్ళేరు. బహుశా నే చెప్పిన దాని కన్నా మీకు వివరంగానే తెలిసి వుండాలి సంగతులు. నా అభిప్రాయంలో ఆనాటికీ, ఈనాటికీ తేడా లేకపోలేదు." చంద్రశేఖరం కాలక్రమంలో అన్నీ సర్దుకొంటాయి అన్నాడు. "ఇప్పుడేమీ తొందరపడకు, తొందరపెట్టకు. అన్నీ సర్దుకొంటాయి." "నాదో చిత్రమైన స్థితి. తల్లిదండ్రులూ, పెద్దవాళ్ళూ వెనక దాగడానికి లేదు. నేనే ముందుకు రావాలి." "అదేమిటిలే, బోలెడు బలగం వున్నవాడివి. ఏదో ఘట్టంలో ఎడంగా వున్నా, ఎప్పుడూ అలాగే వుంటుందా?" చంద్రశేఖరం తన అభిప్రాయాన్ని అర్ధం చేసుకోలేకపోయేడని ఈమారు స్పష్టంగానే చెప్పేడు. "పూర్వం తల్లీదండ్రీ ఈ వ్యవహారాలు చూసేవారు. వాళ్ళ రోజుల్లో ఇన్నిమాట్లు అడగడం, అసలు అడగడమే అవసరం వుండేది కాదు. అవసరం వస్తే మరీ ఆలోచించేవారూ కాదు. ఈనాడు నేను వాళ్ళ మాదిరిగా ఆలోచించలేకుండా వున్నాను. అందుకే పదే పదే ప్రయత్నం చేశాను. "విన్నాను. వాళ్లు చెప్పేరు." "బహుశా మీరు విని వుండనిది ఒకటుంటుంది." "ఏమిటది?" "మీ చెల్లెలితో మాట్లాడారా?" మాట్లాడేడు. ఆమె అభిప్రాయం అతనికి అంతు పట్టలేదు. కనక అబద్ధమే ఆడేడు. "లేదనే చెప్పాలి." "నేను మాట్లాడేను." చంద్రశేఖరానికి ఆ మాట ఎవ్వరూ చెప్పలేదు.-- "ఎరగరా?" "ఏం అంది?" "విశేషం ఏమీ లేదనుకోండి. తాళి కట్టేను కదా. ఏవో కొన్ని బాధ్యతలు ఏర్పడ్డాయి. కనక ప్రయత్నించేను. ఆమెను గాని, మీ వాళ్ళను గాని అల్లరి పెట్టి అప్రతిష్ఠ పాల్జేసి ఆ బాధ్యతలను నెరవేర్చాలనే ఆలోచన నాకు లేదు. ఒక స్నేహితుల కుటుంబ సహాయంతో ఆమెను కలుసుకొని మాట్లాడగలిగేను." పర్యవసానం నోటితోగాక, తల అడ్డంగా తిప్పడంతో సూచించేడు. చంద్రశేఖరం ఏమీ అనలేదు. ఆ పరిస్థితిని అతడూ గ్రహించేడు. కాని చెయ్యగలదేమీ కనపడ్డం లేదు. సుందరిది చిన్నతనం. దేశంలో విడాకులు అధికారం లేదు. అందుచేత ఈనాడు ఎలా వున్నా జ్ఞానం తెలిసిందంటే, ఆమెకీతడే దిక్కు, మరో వ్యక్తితో జీవించడం--ఆమెకాతడెంత ఇష్టుడే అయినా ధర్మ బాహ్యమూ, నీతి బాహ్యమూను. దానిని వూహించను కూడా లేడు. ఆమె నీతిగా బ్రతికేందుకయినా రామనాధం తెగతెంపులు చేసుకోకుండా వుండాలనిపించింది. "నాకిప్పుడేం చెప్పడానికీ తోచడం లేదు. కాకినాడ వచ్చినప్పుడు నీకో సలహా ఇచ్చేను. నువ్వానాడు అంగీకరించలేదు. అంగీకరించి ఆ విధంగా జరిగి వుంటే ఎంతో బాగుండేది. ఈనాడు తొందరపడుతున్నావు. ఆనాడు ఆ శుభకార్యం జరిగిపోతే చాలునన్న మా నాన్న నేడు ససేమిరా పనికిరాదంటున్నాడు. మీరుభయులూ చెరోవేపూ లాగి ఆ చిన్నపిల్ల మనస్సు క్షోభ పెడుతున్నారు." తన తండ్రినీ, తననూ ఈ పరిస్థితికి సమానకారకులనుగానే లెక్క కడుతున్నాడని, రామనాధం కష్టపెట్టుకొన్నాడు. ఆ కష్టంలో తాను ఆనాడు అమలాపురం వెళ్ళడానికి ఆ సలహాయే కారణం అనేశాడు. "కాకినాడలో నేను ఏమనివున్నా, నేను మీ సలహా ప్రకారమే చేశాను. అమలాపురం అందుకే వెళ్ళేను." "నేను అమలాపురం వెళ్లమనలేదే...." "అది నా పైత్యం వేడి, మీరు కాపురానికి తెచ్చుకొని, తర్వాత ఆమెతో మాట్లాడమన్నారు. నేను ముందు మాట్లాడి కర్తవ్యం ఆలోచించాలనుకొన్నా." "పోనీ వెళ్ళేవనుకో. నీ పని చూసుకొని లేచిరాక, మా నాన్నకి సత్యాగ్రహోపదేశం ఏమిటి?" "ఏమిటి మీ అభిప్రాయం? అదంతా వట్టి దొంగ కేసు. మీ నాన్న మొహం కూడా నేను కోర్టులో తప్ప చూడలేదు." చంద్రశేఖరానికది నమ్మదగిందిగా కనబడలేదు. "నిజంగా......?" రామనాధం ఆనాటి ఘటనలు చెప్తూంటే చంద్రశేఖరం తల్లడిల్లిపోయేడు. "కోర్టులో ఎందుకు..." "మీ నాన్న, ఆ కోర్టులూ ఒకే గవర్నమెంటు తాలూకు. వానిమీద నాకు నమ్మకం లేదు." "నీ నమ్మకం, అపనమ్మకం సమస్య కాదు....." రామనాధం ఏమీ అనలేదు. ఇంక ఆతడు ఆ విషయం చర్చించనిష్టపడడం లేదని గ్రహించి చంద్రశేఖరం ఆగేడు. "మా అమ్మకిదంతా తెలుసా?" "తెలుసుకోవాలనుంటే తెలుసుకోవడం కష్టమేం కాదు." చంద్రశేఖరం ఓ నిముషం వూరుకుని తానివ్వగల సలహానిచ్చేడు. "తొందరపడకు." "తొందరపడడం అంటే మీ ఉద్దేశం ఏమిటో నాకు అర్ధం కావడం లేదు. నేను మళ్ళీ పెళ్ళి చేసుకోవడం గురించా?" ఆ ఆలోచనతోనే చంద్రశేఖరం అన్నాడు. కాని బహిరంగంగా వొప్పుకోలేకపోయేడు. "అబ్బెబ్బే నువ్వంత అజ్ఞానప్పని....." "ఇష్టం లేని అమ్మాయిని యిబ్బంది పెట్టడానికి బదులు నచ్చిన పిల్లను పెళ్ళి చేసుకోవాలనుకోవడం అజ్ఞానం పనేనంటారేమిటి?" చంద్రశేఖరం తెల్లబోయేడు. "భార్య అనుకూలవతి గావాలంటారు మీరే. పెళ్ళి నాటికి పదేళ్ళకు మించకపోయినా ఆమె మంచి స్వభావం గురించి మీరే చెప్పేవారు. అందుకు విరుద్ధంగా తయారయితే తప్పు మీది కాదు. బాధ్యతా మీది కాదు. దానికి అనేక కారణాలుంటాయి. నా భార్య నా శత్రుకూటానికి చెందరాదు. అదొక్కటే నా కోరిక....." "ఫర్వాలేదు." "నాకు విశ్వాసం కలగడం లేదు." "ఆమె తల్లీదండ్రీ దగ్గరేనయ్యా వున్నది." "అదే దురదృష్టం..." చంద్రశేఖరం గతుక్కుమన్నాడు. నిజమే ఆ మాట. కాని, వినడానికి కష్టం అనిపించింది. "మీ చెల్లెల్ని తీసుకెళ్ళి మీ దగ్గర వుంచుకోరాదు? నాలుగేళ్ళు చదువుకోనిద్దాం. ఆనాటికి ఆమెకు సర్దుకోగలిగిందా....." చంద్రశేఖరం లేచేడు. "నీకు నా మీద ఆ మాత్రం విశ్వాసం మిగిలినందుకు సంతోషం కాని...." "అది జరగదు....." అంటూ రామనాధం మాటను పూర్తి చేశాడు. అతడు బావగారిని రోడ్డుమీదకంటా సాగనంపేడు. గుర్రపు బండి ఎక్కించి సెలవు తీసుకున్నాడు. ఆఖరున అన్నాడు. "మీరు రావడం వలన నా పని ఒకటి తేలిక అయింది. మీ చెల్లెలితో ఒక్కటి చెప్పండి." "ఊరికే మనస్సు పాడు చేసుకోకు." "మనస్సు పాడు చేసుకోవడం లేదు. ఏమీ లేదు. ఇదొక్కటే చెప్పండి." "ఒక్కటీ లేదు, రెండూ లేదు." "జరిగిపోయిన పెళ్లిని తుడిచివేయడానికి ఏమాత్రం మార్గం వున్నా తప్పకుండా చేసేసేవాడినే. కాని, ఆ సందర్భంగా నే చెయ్యగలది లేదు. ఇంక ఒకటి చెయ్యగలను. నాకో పది ఎకరాల భూమి వుంది. అందులో రెండెకరాల ఊడ్పు చేను విడిగా ఆసుపత్రి కాలవ క్రింద వుంది. చేను మంచిది. పది బస్తాలు ఎకరానికి ఎవడన్నా మక్తా ఇస్తాడు. అది ఆమె పేర వ్రాసేస్తాను. వారం పదిరోజుల్లో దస్తావేజు రిజిస్టరు చేసి పంపేస్తాను. ఆమె జీవితంలోకి మరెప్పుడూ రానని చెప్పెయ్యండి. "మతిగాని పోయిందా" అని చంద్రశేఖరం కోపపడ్డాడు. "పోలేదు. వుంది గనకనే." రామనాధం వెనక్కి తిరిగేడు. బండి కదిలింది. ఇరవై రెండు కనుచీకటి పడబోయే ముందు పంటకాలవ గట్టున వెడుతున్న రామనాధాన్ని స్వరాజ్యం గుర్తుపట్టింది. ఆ వేళప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాడో అనుకుంది. తమ యింటికి తిరగవలసిన దారి వదిలి ముందుకు పోతూంటే ఒక్కక్షణం అతడేనా అని అనుమానం కలిగింది. కాని నడక! లాంతర్లు వెలిగిస్తున్న సూరాయిని పిలిచింది. "ఆ వెడుతున్నదెవరురా?" వాడూ గుర్తించి తోటకి అడ్డంపడి పరుగెత్తేడు. పది నిముషాలలో రామనాధాన్ని వెంటపెట్టుకు వచ్చేడు. "కాలవ గట్టునే వెడుతూ మొహం చూపకపోవడానికి మేం చేసిన అపరాధం ఏమి"టని స్వరాజ్యం కష్టపెట్టుకుంది. "చీకటి పడిపోతూంది. మళ్ళీ రేపో ఎల్లుండో వద్దామని..." అంటూ రామనాధం క్షమాపణ చెప్పుకున్నాడు. "ఎక్కడి నుండి వస్తున్నారు?" అని నాయుడు. "చీకటి పడుతూంటే ఈ పూట ఇక్కడ ఆగకూడదా?" "అనవసరమైన శ్రమ కాదుటండీ. ఎటూ కాని వేళ....." స్వరాజ్యానికి ఈమారు నిజంగానే కోపం వచ్చింది. ఆమె కంఠాన్ని గమనించి నాయుడు రామనాధాన్ని ఆపేసేడు. "ఇప్పుడెక్కడికెడతారు? వుండిపోండి" రామనాధం ఆగక తప్పింది కాదు. కాళ్ళు కడుక్కుని వచ్చి సూరాయి వేసిన పడకకుర్చీలో కూర్చుంటూ నాయుడు కొంతసేపు క్రిందట వేసిన ప్రశ్నకు సమాధానం ఇచ్చేడు. "కొత్తపేట రిజిస్ట్రారు ఆఫీసుకి వెళ్ళేను." రిజిస్ట్రారు ఆఫీసుకి పోయి వస్తూన్న కారణం విని నాయుడూ, భార్యా దిగ్భ్రమ చెందేరు. కాని ఇద్దరూ మాత్రం పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు తెలిపేరు. "చాల మంచి పని చేశావు నాయనా?" అన్నాడు నాయుడు. తన యెడ విముఖత చూపుతున్న భార్యకు జీవనాధారం కల్పించడంలోని ఔదార్యాన్ని నాయుడు అభినందించేడు. కాని మాణిక్యమ్మ అభిప్రాయం దానికి భిన్నం. చిన్నతనం గనక సుందరి ఈవేళ తల్లిదండ్రులకు తాళం వేస్తూందిగాని, వయస్సు వచ్చి తనకూ ఓ కుటుంబం కావాలనుకొనేసరికి ఏమంటుంది? భర్తకి బదులు రెండెకరాలు ఆమెకు తృప్తిని ఇవ్వగలవా? "మంచి పని చెయ్యలేదు నాయనా!" అంది ఆమె. స్వరాజ్యం ఏమీ అనలేదు. సుందరిని దురదృష్టవంతురాలు అనుకొంది. అంతే. ఆమాటే చాటున తల్లి వద్ద అంది. తల్లి జాలి కనబరచింది. "ఇప్పుడేం తెలియదు....." స్వరాజ్యం ఏదో ఆలోచిస్తూ కూర్చుండిపోయింది. ఏదో తోచి రామనాధం నుంచి దస్తావేజు తీసుకుంది. దానిని అందిస్తూ రామనాధం స్పష్టంగా చెప్పేడు. "రేపు కరణంగారి చేత పట్టా బదలాయింపు చేయిస్తా." వ్యవహారాన్నంతనూ పకడ్బందీగా చేయదలచుకొన్నానన్న ఆ సూచనకు మాణిక్యమ్మ నవ్వింది. "దస్తావేజు పుట్టాక పట్టా బదిలీలో విశేషం ఏముందిలెండి." రామనాధం తన చర్యను సమర్థించుకున్నాడు. "ఏమో! ఏ సమయంలో నాలో ఎటువంటి మార్పులు వస్తాయో, ఆమె జీవిత భరణం కోసం వాళ్ళు అడగక మానరనీ, అప్పుడామెను పంపమని నిగ్గదీయవచ్చుననీ చాలామంది సలహా ఇచ్చేరు." "ఆ తల్లీదండ్రీ వున్నంతకాలం ఆమెకే లోటూ రాకపోవచ్చూ, కాని, వారు శాశ్వతమా? మీరు కూడా తెగతెంపులు చేసుక్కూర్చుంటే..." మాణిక్యమ్మ మాట పూర్తి కాకుండానే రామనాధం అందుకున్నాడు. "నామీద కోపం, కసీ, అయిష్టమూ వున్నా తిండి కావలసి వుంటుంది గనక రాక తప్పదనా? అంతకంటె ఆ అమ్మాయికి మరో అగౌరవం ఏం వుంటుంది? వద్దండి. అటువంటి దురభిప్రాయం కలగకూడదనే....." స్వరాజ్యం దస్తావేజును చేతిలోకి తీసుకుంటూ తానూ తండ్రీ మరునాడు అమలాపురం వెడుతున్నామంది. "నాన్నగారిని ఒకమారు డాక్టరుగారికి చూపించి వద్దామని. వెళ్ళినప్పుడు వారి యింటికి వెళ్ళి ఆమెను చూసి మాట్లాడి రావాలనుకొన్నాను. అప్పుడే ఇది ఇచ్చేస్తాలెండి." రామనాధం హడలిపోయేడు. "మీరిస్తారా? వద్దు. వద్దు. పోస్టులో పడేస్తాలెండి." పోస్టులో పంపవలసినవాడు దస్తావేజు ఇంటికి తీసుకుపోవడం ఎందుకు? రిజిస్ట్రారాఫీసులో పోస్టేజీ చెల్లించి చిరునామా ఇచ్చేస్తే వాళ్ళు పంపుదురు కాదా. కాని, అంతరాంతరాలలో తన భార్యను దారికి తీసుకురాగలననే ఆలోచన ఏ మూలనో వుంది. తన సౌజన్యంతో, మంచితనంతో ఆమెను దారికి తేగలననే ఆలోచన వుంది. ఆ వుద్దేశంతోనే దస్తావేజు కూడా తెచ్చుకొన్నాడు. దానితో భార్యకు ఓ చిన్న వుత్తరం కూడా వ్రాయాలనుకున్నాడు. కాని, ఆ మనఃస్థితి అతనికే స్పష్టంగా లేదు. ఉత్తరం వ్రాయడంకన్నా ఒక మనిషి ద్వారా పంపి, ఆమెతో మాట్లాడించడం మరీ మంచిదనే అభిప్రాయం లేకపోలేదు. కాని, వెళ్ళగల మనిషి అతనికి కనబడలేదు. సుందరిని కలుసుకొని ఆమెతో మాట్లాడగల వాళ్లు అతనికెవ్వరూ కనిపించలేదు. కనుక పోస్టు అనుకొన్నాడు. కాని తీరా స్వరాజ్యం తాను వెడతాననేసరికి భయం వేసింది. "వాళ్ళేమన్నా అంటే నాకు...." "ఎవరుమాత్రం ఎందుకేమంటారు? నాకూ ఆమెకూ స్నేహం ఉన్నదండీ." ఆ స్నేహం సంగతి రామనాధానికి తెలుసు. కాని, ఆమె ఎరుగనిది కూడా ఆతడెరుగును. ఆమె నాలిక మహా చురుకు. ఎంతమాటయినా అనెయ్యగలదని, ఆమెతో మాట్లాడిన పదిహేను-ఇరవై నిముషాలలోనూ ఆతడు గ్రహించేడు. స్వరాజ్యాన్ని అవమానం చేసి మాట్లాడితే! పుణ్యానికిపోతే పాపం ఎదురుకావడం మాట అలా వుండగా, తనను తాను క్షమించుకోగలడా? "వద్దు. మీరు ఎరగరేమో, వాళ్ళు ఏమన్నా అంటే...." ఆ 'వాళ్ళు'లో భార్యను స్పష్టంగా పేర్కోలేకపోయేడు. కూతురు ఆలోచనా ధోరణిని గ్రహించిన నాయుడికి కూడా ఆ రాయబారం ఫలిస్తుందనే ఆశలేదు. "కాని...... నువ్వు కలగచేసుకోవడం మంచిది కాదేమోనమ్మా!" "ఆ రోజున రామనాధంగారిని కలుసుకోడానికి ఆవిడే స్వయంగా నా సాయం కోరింది నాన్నా!" ఆ సమాచారం రామనాధానికి కొత్త. ఇంక అంగీకరించక తప్పలేదు. సరేనన్నట్లు మాటమార్చేడు. "ఇంక నాలుగు రోజులే వుంది. మీరు అమలాపురం నుంచి ఇక్కడికి తిరిగి రావద్దు. సరాసరి ముంగండే రాండి" ఆ రెండు రోజులూ అక్కడే వుండి తోటలో జరిగే వుత్సవానికి పాలెం ప్రజలను సమీకరించాలని అతడి కోరిక. పాలెంలో హెచ్చుమంది కాపులు నివసిస్తున్నారు. వాళ్ళలో నాయుడికి బంధువులున్నారు. ఆయన మాటంటే వాళ్ళకి గౌరవమూ వుంది. "స్వరాజ్యంగారూ! మీరూ అమ్మగారూ ఆ రోజున సభకి పాలెపు ఆడవాళ్ళని తీసుకురావాలి సుమండీ!" ప్రొద్దుటే బయలుదేరే వేళకి తోటలో పనులు పురమాయిస్తున్న స్వరాజ్యం వద్ద సెలవు తీసుకుంటూ మరోమారు జ్ఞాపకం చేసేడు. "మిమ్మల్ని అవమానిస్తారేమోననే నా భయం. అదే జరిగితే వాళ్లనీ జీవితంలో..." అతని భయానికి స్వరాజ్యం నవ్వేసింది. "ఏమీ పర్వాలేదండీ." ఇరవైమూడు గుమ్మంలో ఆగిన రెండెడ్ల బండి చప్పుడు విని వంటింట్లో అన్నపూర్ణమ్మా, గదిలోంచి సుందరీ, మంగమ్మా ఒక్కమారే సావట్లోకి వచ్చేరు. స్వరాజ్యం మెట్లు ఎక్కుతూ నమస్కారం చేసి కుశల ప్రశ్నలు వేసింది. "డాక్టరుగారి దగ్గరకు ఓమారు వచ్చాం. ఓమారు మిమ్మల్ని చూసి పోదామని ఇల్లా వచ్చాను." వాళ్ళ నాన్నగారి యోగక్షేమాలు అడుగుతూ అన్నపూర్ణమ్మ లోనికి దారితీసింది. సూరాయి బండిలోంచి ఒక అరటిగెల తెచ్చి వరండాలో పెట్టాడు. "మా దొడ్లో చెట్టున మగ్గిన గెల. లోపల పెట్టించండి" అంటూ స్వరాజ్యం నిలబడింది. "ఎందుకమ్మా ఇది తెచ్చేవు?" అంటూ అన్నపూర్ణమ్మ పనిమనిషిని పిలిచి గెల లోపల పెట్టించింది. సుందరి తన మిత్రురాలికి మంగమ్మను పరిచయం చేసింది. "ఈవిడను ఎరుగుదురా? మా పెద్దతల్లిగారి కూతురు మంగతాయారు." "వీరేశలింగంగారి వుద్యమం గురించి వచ్చినప్పుడు రామనాధం ఒకటి రెండుమార్లు చెప్పింది ఈవిడను గురించేనన్నమాట" అనుకొంది స్వరాజ్యం. అన్నపూర్ణమ్మ గెలలోంచి బాగా మగ్గిన అరటిపళ్ళు ఓ పది పళ్ళెంలో పెట్టి తీసుకువచ్చింది. "సుందరీ, ఒక చెంబుతో మంచినీళ్ళు తెచ్చిపెట్టమ్మా!" "ఇంకేం వద్దండీ, బండిలో ఇంకా వున్నాయి మాకు" అంటూ స్వరాజ్యం మర్యాదకు ఒక్క పండు తీసుకొని పక్కన పెట్టుకొంది. పడుచు వాళ్ళను ముగ్గురినీ కబుర్లు చెప్పుకొనేటందుకు వదలిపెట్టి మాణిక్యమ్మ పని చూసుకొనేటందుకు లోనికి వెళ్ళింది. స్వరాజ్యం నెమ్మదిగా కబుర్లు ముంగండ వేపు తిప్పింది. "మీ వూళ్ళో మంచి హడావిడిగా వున్న సమయంలో మీరిక్కడ వున్నారే?" అని మంగమ్మను కదిపింది. ఆమె చేత అస్పృశ్యులను రామనాధం తన తోటలో నూయి నీరు తోడుకోనివ్వడానికి తలపెట్టిన కార్యక్రమాన్ని వివరంగా చెప్పించింది. మంగమ్మ రామనాధానికి ఆ యింట్లో వున్న గౌరవ స్థితి ఎరిగి వుండటంచేత అతని పేరును తలపెట్టకుండానే కబుర్లు చెప్తోంది. సుందరి ఆ మాటలలో ఏమాత్రం ఆసక్తి కనబరచకపోయినా కదలలేదు. "మేం వస్తూంటే అంబాజీపేటలో కనిపించేరు. అన్నట్లు మరిచిపోయాను" అంటూ స్వరాజ్యం అప్పుడే గుర్తుకువచ్చినట్లు లేచింది. ఇప్పుడే వస్తున్నానంటూ బండి వద్దకు పరుగెత్తుకు వెళ్ళింది. తిరిగి వచ్చేసరికి ఆ ఇద్దరి ముఖాలు ఎర్రబడి వున్నాయి. కాని గమనించనట్లే తాను తెచ్చిన కవరు ఒకటి సుందరి చేతికిచ్చింది. "ఏమిటిది?" అంటూనే ఆమె అందుకొంది. "నాకూ తెలియదు. చూడలేదు. ఏదో దస్తావేజు అన్నారు. అమలాపురం వెడుతున్నానంటే మీకు ఇవ్వవలసిందన్నారు." "ఎవరు?" అంది మంగమ్మ. "వారి భర్తగారు." సుందరి చేతిలోని కాగితాలను పక్కనున్న టేబిలు మీద పడేసింది. "ఏమిటో చూసుకోరూ?" "ఏముంటుంది? ఏవో మదపిచ్చి వ్రాతలయి వుంటాయి." స్వరాజ్యం గతుక్కుమంది. మంగమ్మ తెల్లబోయింది. "ఏం మాటలే అవి?" అంది. "నీకంత సరదా వుంటే చదువుకో" అంది సుందరి. "తప్పు తప్పు" అని స్వరాజ్యం మందలించింది. "ఈ వుత్తరాలు మోయడం మీకు అసహ్యంగా లేదూ?" స్వరాజ్యం తేరుకుని బహు తాపీగా సమాధానం ఇచ్చింది. "రామనాధంగారిని బాగా ఎరుగుదును. ఆయన నోట సిగ్గుపడవలసిన మాట ఎన్నడూ వినలేదు. నేను పట్టుకురావడానికి సిగ్గుపడవలసిన కాగితాన్ని ఆయన తన భార్యకు పంపుతారనుకోను" అంది. ఒక నిముషం ఆగి మళ్ళీ అంది. "మీ నాన్నగారు వచ్చేక ఇవ్వండి." ఏడెనిమిది నెలల క్రితం భర్త తనకు ఇచ్చిన ఉత్తరాన్ని తండ్రికిచ్చిన ఘటనను ఎగతాళి చేసినట్లు సుందరి ఉడికిల్లింది. "మీ ఇద్దరికీ పరిచయమూ, స్నేహమూ వున్నదని ఆయనక్కూడా తెలియాలా?" "ఆ, ఆ" అంది మంగమ్మ. "ఆ మాటలు వింటూంటే ఆమె వయస్సును గురించీ, అమాయకత్వం గురించీ తనకు గల అభిప్రాయం తప్పేననిపించింది స్వరాజ్యానికి. కాని కోపం తెచ్చుకోలేదు. "బ్రాహ్మలం కాదు గదా తల్లీ! అల్లాంటివన్నీ మాకేం తెలుస్తాయి? మగడు భార్యకు పంపే కాగితాలు తేవడం తప్పని తెలియదు. తప్పు పట్టుకోకండి." సుందరికింక అక్కడ వుండాలనిపించలేదు. మర్యాద కూడా మరచి చరచరా వెళ్ళిపోయింది. ఆమె ప్రవర్తనకు మంగమ్మ ఎంతో సిగ్గుపడింది. బయలేదేరడానికి లేచిన స్వరాజ్యాన్ని అనునయిస్తూ "ఏమనుకోకండి" అంది. "ఇందులో ఏం అనుకోడానికేమిటుంది? సెలవు." "ఈ ఇంట్లో వాళ్ళందరికీ ఇదో జబ్బు. ఎంతెంత మాటలూ అనేస్తారు" అంటూ మంగమ్మ గొణిగింది. స్వరాజ్యం చిరునవ్వు నవ్వింది. మాట మారుస్తూ--"మీ వూళ్ళో మీటింగు రోజుకి రారూ?" అంది. "మధ్యాహ్నం వెళ్ళిపోతాను." "మేము ముంగండే వెడుతున్నాం. సభలయ్యేవరకూ అక్కడే వుంటాం." "అయితే అక్కడ మళ్ళీ కలుసుకుంటాము." "మేమయినా పొద్దు వాలే వరకూ బయలుదేరం. వస్తే మా బండిలో రాండి. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ పోవచ్చు." మంగమ్మకది ఇష్టమే. కాని ఎల్లా సాధ్యపడుతుంది?" "బయలుదేరేటప్పుడు సూరాయిని బండిలో పంపుతాను." "మా పిన్నితో చెప్తాను." "నేను వెడుతున్నానని కూడా చెప్పండి." మంగమ్మ లోపలికెళ్ళింది. అన్నపూర్ణమ్మ వస్తూనే అడిగింది. "అప్పుడే వెళ్ళిపోతున్నారా? వచ్చారు. వెడుతున్నారు. కూర్చుని మాట్లాడ్డానికేనా పడలేదు. ఏది సుందరి? బొట్టు పెట్టుకు మరీ వెళ్ళండి." స్వరాజ్యం చిరునవ్వుతో అంది. "ఆమె భర్తగారు నా చేతికి ఓ దస్తావేజు ఇచ్చి పంపేరు. స్వయంగా తెచ్చి ఇవ్వాలిగాని మధ్య ఈ దాసీ వ్యవహారం ఏమిటని ఆమెకు కోపం వచ్చింది." సుందరి భర్త మాట వచ్చేసరికి అన్నపూర్ణమ్మ ఉలికిపడింది. "దస్తావేజు ఏమిటి? దాసీతనం ఏమిటి?" పది రోజుల క్రితం కొడుకు ముంగండ వెళ్శి వచ్చానంటూ, అల్లుడు ఏవో భూముల వ్రాతకోతలు గురించి మాట్లాడాడని చెప్పినట్లు గుర్తు వచ్చింది. కానీ దాని గురించి తామెవ్వరూ పట్టించుకోలేదు. "దస్తావేజు ఏమిటి?" అంది మళ్ళీ. "అదిగో టేబిల్‌ మీద వుంది, చూసుకోండి. సెలవా!" ఆ మాట పూర్తికాకుండానే లోపలి నుంచి సుందరి విసవిసా వచ్చి టేబిలుపైనున్న కవరును గుమ్మంలోకి విసిరేసింది. "మాకెవ్వరూ మనోవృత్తులివ్వక్కరలేదు. మేమంత గతి లేకుండా లేము" అంది. ఆ రోజున కొడుకు మాటమీద తండ్రి యిచ్చిన సమాధానమే అది. అయితే ఆ మాటలు కూతురి నోట రావడం అన్నపూర్ణమ్మకు నచ్చలేదు. కాని ఏమీ అనలేదు. స్వరాజ్యం తన కాళ్ళ వద్ద పడి వున్న కాగితాలను చూడను కూడా లేదు. ఎడ్లను బండికి పూన్చమని సూరాయికి పురమాయించింది. "బండి తిప్పరా." --పురమాయిస్తూనే వెనక్కి తిరిగింది. "కాగితాలను వీధిలో పారేసినా ఇంకేమీ జరగదు. ఆయన చేసే పనేదో బ్రహ్మ భేద్యంగా చేశారు. భూమి మీ పేర వ్రాసెయ్యడమే కాదు, పట్టా ట్రాన్స్‌ఫర్‌ కూడా అయిపోయిందనీ, ఇంక ఈ ఏడు పంట కూడా మిమ్మల్నే చూసుకోమని చెప్పమన్నారు. ఇప్పుడాయన తీసుకోవాలన్నా సాధ్యపడదు. అక్కర్లేకపోతే మీ చేత్తోటే తోసి పారేసుకోవాలి. అంతే..." రెండడుగులేసింది. ఈమారు మంగమ్మతో అంది. "జాము పొద్దువేళకి బండి పంపుతాను. సిద్దంగా వుంటారు కదూ?" మంగమ్మ పినతల్లి ముఖం వంక చూసింది. "మీకు లేనిపోని ఇబ్బంది కాదూ?" అంటూనే ఆమె సరేనంది. మళ్ళీ అంతలో "మీరు ముంగండే వెడుతున్నారుట కదూ" అని వాకబు చేసింది. "ఔనండి మీ అల్లుడుగారి తోటలో పెద్ద సభ జరుగుతుంది. నాయకులెవరో వస్తున్నారు. చూడాలని సరదా--సరే సెలవా మరి? అంత పొద్దు వేళ మళ్ళీ....." అంటూ స్వరాజ్యం బండి ఎక్కింది. బండి కాలవగట్టు రోడ్డు ఎక్కేవరకూ ముగ్గురూ అక్కడే నిలబడ్డారు. అన్నపూర్ణమ్మ ఒక్క నిట్టూర్పు విడిచింది. "ఆ కాగితాలు తీసి నాన్నగారొచ్చేక ఇయ్యి. గోదావరి జిల్లావాళ్ళు చచ్చి కూడా సాధించే రకం. ఏం తెస్తారో ప్రాణానికి....." ఇరవైనాలుగు తెల్లవారేసరికి తోట ముందు గుర్రపు బండీలోంచి దిగిన రంగనాధరావు దంపతులను చూసి రామనాధం చాలా ఆశ్చర్యపడ్డాడు. వారు ప్రత్యేకంగా మరునాడు జరిగే కార్యక్రమాలలో పాల్గొనేటందుకే వస్తున్నారని వినేసరికి ఎంతో సిగ్గుపడిపోయాడు. అతడు వారికి ఆహ్వానపత్రిక వ్రాయనే లేదు. "పత్రికలో చదివేరు. ఆనాటి నుంచీ ఒకటే పాట" అంది గురుపత్ని మల్లికాంబ. "ఇదో పెద్ద ఘనకార్యంగా భావించలేదు" అంటూ రామనాధం ఆహ్వానించనందుకు క్షమాపణ చెప్పుకుంటున్నట్లు సమాధానం ఇచ్చేడు. "నో, నో..... అల్లాంటిదేం పెట్టుకోకూడదు. ఒక మంచి పని చేస్తున్నావు, నిన్నభినందించాలనిపించింది" అన్నాడు రంగనాధరావు. "నా మీద తమకటువంటి దయ వుంది" అని రామనాధం వినయం తెల్పేడు. ఆ దంపతులకి తన పాక గదిలో విడిది ఇవ్వడం తప్ప రామనాధానికి మారు మార్గం తోచలేదు. ఆయన కూడా సంఘ బహిష్కృతుడు. తాను జైలుకు వెళ్ళినందుకూ, ఆయన విదేశాలకు వెళ్ళినందుకూనూ. నాగేశ్వరరావు గారికైతే పెదతండ్రిగారి ఇంట బస ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడే వీరికి కూడా ఏర్పాట్లు చేయడం తప్ప మరో మార్గం లేదు. కాని, విశాలాక్షి మీద ఇంతమంది భారం పెట్టడానికి సందేహం. ఆమె ఒంటరిది. పైగా ఆమె కూడా మడీ, ఆచారం బోలెడు పాటించవలసిందని ఇతరులను బాధించదు కాని తాను ఆచరిస్తుంది. ఆ యింట్లో గురుపత్నిని ఎలాగ వుంచడం? తాము మగవాళ్లు గనక వంటయింట్లోకి వెళ్ళరు. కాని ఆడవారిని వంటయింట్లోకి రావద్దని గుమ్మం బయట నిలబెడితే ఎంతో చిన్నతనం అనిపిస్తుంది. ఆ విషయంలో ఆచారం పట్టింపు లేదని మగవాళ్ళ దగ్గర నటించినట్లు ఆడవాళ్ళ దగ్గర నటించడం సాధ్యం కాదు. గురుదంపతులకు తోట అంతా చూపి తీసుకువచ్చేక తెచ్చాడు అసలు సమస్య. "ఇదే నా యిల్లు మేష్టారూ! ఇక్కడ మీకు ఏం సౌకర్యం చూపగలను? మా అక్కగారింటికి తీసుకువెడతా." రంగనాధరావు "నో, నో" అని ఖచ్చితంగా నిరాకరించేడు. మల్లికాంబ భర్తను బలపరచింది. "వద్దు రామనాధం! మీ గురువుగారు నీతో ఒకరోజు గడపాలని వచ్చారు. నీతోనే కలో గంజో....." యూరోపియన్‌ పద్ధతులలో కొంతవరకు జీవిత పద్ధతులను అలవాటు చేసుకొన్న ఆ దంపతులు చెట్టు క్రింద కాపురం ఎలా వుంటుందో ఆరోజున రుచి చూశారు. నిత్యం ఆ పద్ధతికే అలవాటు పడినవాళ్ళలా కొత్తదనమే అనుకోలేదు. రంగనాధరావు ఆ రోజంతా బాలకృష్ణను వెంటేసుకుని ఊరంతా తిరిగి వచ్చేడు. బాలకృష్ణతో సమంగా తోటలోని గోదాలో పిల్లిమొగ్గలు వేసేడు. బట్టలు మాపుకొని వచ్చేడు. సాయంకాలం మాసిన బట్టలు చూపి, ఆ రోజు ఆడిన ఆటలు వర్ణిస్తూ రంగనాధరావు విరగబడి నవ్వుతూంటే రామనాధం ఆశ్చర్యపడ్డాడు. ఆ రెండు రోజులూ అతనికి అన్నీ ఆశ్చర్యంగానే కనిపించాయి. తాను వూహించి వుండని విధంగా పనులన్నీ సాగిపోతూంటే ఆశ్చర్యమే. కాశీనాధుని నాగేశ్వరరావుగారు వచ్చేరు. ఆయన్ని పలకరించేవాడుండడేమోనని మొదటి నుంచీ రామనాధం దిగులు. కాని, ఆయన మత్తుమందు చల్లినట్లు ముంగండ బ్రాహ్మణ్యాన్ని తన చుట్టూ తిప్పుకున్నారు. నూతిని పంచమపేటలవాళ్ళు తోడుకొనేటందుకు ప్రారంభోత్సవం జరిగించడానికై వూళ్ళో యువకులు ఆయన వెంట పెద్ద వూరేగింపుగా వచ్చేరు. తానూ పది మంది మిత్రులూ మాత్రం వుంటారనుకొన్నది నలభయి యేభయి మంది ఆయన వెంట వచ్చేరు. రాజవీధి వెంట వెడుతూంటే రెండు మూడు యిళ్ల వద్ద దండలు వేసి హారతులిచ్చేరు. మధ్యాహ్నం పెదతండ్రిగారి యింటి వద్ద విందు సమయంలోనూ అంతే. తానూ రంగనాధం దంపతులూ తప్ప నాగేశ్వరరావుగారి పంక్తిని వేరెవ్వరూ వుండరని అతని అభిప్రాయం. చివరకు పెదతండ్రి విశ్వనాధం కూడా వడ్డన నెపంతో తమ పంక్తికి రాడని అతని వూహ. కాని, తన స్నేహితులే ఓ అరడజను మంది తమ పంక్తికి వచ్చేరు. విశ్వనాధం కూడా కూర్చున్నాడు. సాంబావధాని తమకు వడ్డన. ఊళ్ళో పెద్దలు పదిమంది తాము భోజనాలు చేస్తూంటే సావట్లో కూర్చుని వున్నారు. ఈ అనాచారాన్ని ముంగండ పండితులు ఆశీర్వదిస్తున్నారా? ఆ మాట వచ్చినప్పుడు శివకామయ్య నవ్వేశాడు. "డబ్బురా నాన్నా! డబ్బు, నాగేశ్వరరావుపంతులుగారు ప్రొద్దుట ఓ అరడజను మంది శాస్తుర్లుగార్లకి తలో రూపాయి పడేశారు....." రామనాధానికి ఆ మాట నమ్మతగిందిగా తోచలేదు. "నివాళులిచ్చిన వారికి హారతి పళ్ళెం వేశారా?" లేదు. "సభకు వచ్చినవారికి దక్షిణ ఇచ్చేరంటావా?" లేదు. "ఈ మధ్యన తోటలో చిరుతిండి చేసుకునే కార్యక్రమాలన్నీ మూతబడ్డాయి. ఎందుచేతనో ఎరుగుదువు. వాళ్ళే ఈవేళ నా ప్రక్కన కూర్చున్నారు కదా." ఔను. "వీళ్ళందరికీ దక్షిణ తాంబూలాలు ముట్టేయా?" లేదు. "అందుచేత డబ్బు ఆశ కాదు కారణం, ఈ మార్పుకి." మరి? ఇద్దరికీ ప్రశ్నలే గాని సమాధానాలు దొరకనేలేదు. ఇరవయ్యయిదు "చదువుకున్నావే గాని, నీకేం ఆలోచన లేదోయ్‌ బావా!" అని మంగమ్మ అంటూంటే రామనాధానికి నవ్వు వచ్చింది. అమాయకపు పక్షి అనుకొనే మంగమ్మనుంచి ఆ మాట! "ఏమిటి వ్యవహారం?" అన్నాడు. ఆ నిర్లక్ష్యానికి మంగమ్మకు కోపం వచ్చింది. "నీ దస్తావేజిచ్చి ఆవిణ్ణే పంపించాలా?" మంగమ్మకి తెలిసిన దస్తావేజేమిటో తెలియని రామనాధం ఆశ్చర్యంతో చూశాడు. "దస్తావేజేమిటి?" "ఆవిడెవరు?" "ఎక్కడికి పంపేను?" అంటూ ఒక్కొక్క ప్రశ్న వేసి రాబట్టితే తప్ప అతనికి మంగమ్మ చెప్పదలచుకున్నదేమిటో అర్థం కాలేదు. జరిగిన సంగతి తెలిసేక రామనాధం నిలువునా నీళ్ళు కారిపోయేడు. అతనికింత గ్రంథం జరిగిందని తెలియదు. స్వరాజ్యం ఏమీ చెప్పలేదు. పని కట్టుకొని ఇంటికి వెళ్ళి అడిగినా చెప్పలేదు ఇదంతా. అమలాపురం వెళ్ళినప్పుడేం జరిగిందని తెలుసుకోవాలనుకొన్నా పనుల తొందరలో కుదిరింది కాదు. ఉత్సవం రోజు వరకూ ఆమె వూళ్ళోనే వుంది. ఆ రోజున సభకు కూడా వచ్చింది. మర్యాదకేవో ఒకటి రెండు మాటలాడేడేగాని అంతకన్న అవకాశం లేకపోయింది. తరవాత పదిహేను రోజుల వరకూ వ్యవసాయం పనులతో కుదిరిందే కాదు. అవన్నీ ముగించుకొని చిరతపూడి వెళ్ళేటప్పటికి ఆ ఉత్కంఠ లేకపోయింది. దస్తావేజు ఇచ్చేశానంటే సరేననుకున్నాడు. అటు తర్వాత కూడా ఈ నెల రోజుల్లోనూ ఒకటి రెండు మార్లు వారి ఇంటికి వెళ్ళేడు. ఆమె ఏమీ చెప్పలేదు. అంత అవమానకరంగా వ్యవహరిస్తే ఒకమాటన్నా అనదూ--అనిపించింది. కాని, మంగమ్మ అబద్ధం చెప్తూంది అనిపించలేదు. నిజమేనా అని అడగలేకపోయేడు. "నీకెవరు చెప్పేరు?" అని మాత్రం అనగలిగేడు. "ఒకరు చెప్పడం ఎందుకు? నేనక్కడే వున్నాను. నీకు తెలుసో లేదో స్వరాజ్యం నేనూ, వాళ్ళ నాన్నగారూ కలిసే వచ్చేం. ఆవిణ్ని ఆ మాట అంటూంటే నా ప్రాణం చచ్చిపోయింది. మరి వుండాలనిపించలేదు. వాళ్ళ బండిలోనే వచ్చేశాను. రామనాధం ఆలోచించేడు. "ఏమంది?" "ఆవిడకి నీతో స్నేహం వున్నదన్నమాట మరోమాటు వినాలని సరదాయా?" మంగమ్మ ఆ మాట అన్నాక ఇంక ఏదీ అడగాలనిపించలేదు. అటు తరువాత స్వరాజ్యం మొహం చూడాలన్నా చూడలేననిపించింది. అనవసరంగా వద్దంటున్నా బయలుదేరినందుకు కోపం, మాటలు అనిపించుకున్నందుకు దుఃఖం కలిగింది. పది రోజులు అటు మొగం చూపలేకపోయేడు. తర్వాత అంతకన్న క్షమాపణ చెప్పుకోవడం న్యాయమనిపించింది. వెళ్ళేసరికి తండ్రికి పత్రిక వినిపిస్తూంది స్వరాజ్యం. "చాల రోజులనుంచి కనబడ్డం లేదేమండీ?" అంది స్వరాజ్యం. తాను వచ్చిన పనినెలా ప్రారంభించాలో అర్ధంగాక రామనాధం చాలసేపు తటపటాయించాడు. చివరకు తప్పంతా ఆమెదే అయినట్లు--"మీరు అల్లా దాచి వుంచడం న్యాయం కాదు" అన్నాడు. స్వరాజ్యం విస్తుపోయింది. "ఏం దాచేను?" "మీరు అమలాపురం వెళ్ళినప్పుడు....." స్వరాజ్యం తేరుకుంది. "ఏం, మంగమ్మగారు ఏమన్నా చెప్పేరా?" నాయుడు నవ్వేసి, అన్నాడు. "అల్లాంటివన్నీ మనస్సులో వుంచుకోకండి. నేనే చెప్పవద్దన్నాను." "మీరు బాధపడతారనే చెప్పవద్దన్నాను" అన్నాడు మరో నిముషం ఆలోచించి. "మీకు జరిగిన అవమానం కన్న ఆమె అభిమానం కోసం బాధపడతాను. అంతేకదూ?" "తప్పేముంది రామనాధంగారూ! ఏవో పరిస్థితులలో ఆమె తెలివితక్కువగా వ్యవహరిస్తూన్నా ఆమె మీ భార్య. ఆమె చెడ్డదనిపించుకోవడం మీకు బాధ కలిగించదూ?" రామనాధం నాయుడు వేలుపెట్టి చూపించేవరకూ ఎంత సంబంధం లేదనుకున్నా సుందరిని కేవలం పరాయిదానినిగా భావించడమే లేదు అనిపించలేదు. "తప్పు నాదే. ఆమె మనఃస్థితి ఎరుగుదును, ఆ రోజున అమలాపురంలో మీ యింట్లో మామధ్య జరిగిన సంభాషణను మీకు చెప్పేవుంటే..." తన భార్య తనతో ఆడిన మాటల తీరునాతడు చెప్పలేదంటే ఆమె వానిని మార్చుకుంటుందనే ఆశయేనా వుండి వుండాలి. లేదా, తనకూ ఆమెకూ పొసగదనుకొన్నా ఆమె మర్యాదను కాపాడడంలో చూపిన శ్రద్ధ చూస్తే ఆమెయే తనకు సన్నిహితమైనదనే భావన అంతరాంతరాలలో వుండివుండాలి. లేకపోతే... అంత మాట అనడు-- నాయుడు అతనిని శాంతపరచడానికి ప్రయత్నించేడు. "ఆ మాట అనిపించుకోవడం మర్యాద కాదు, అనుకోండి...." రామనాధం మాట సాగనివ్వలేదు.."శత్రువునైనా అనడానికి సందేహించ వలసిన మాటను--తనకు ఉపకారం చేయడానికి బయలుదేరిన మనిషిమీద ప్రయోగించింది. స్వరాజ్యంగారూ! మీరు సందేహించేరు తప్పు లేదు. ఆప్తులయిన మిమ్మల్ని పరాయి వాళ్ళనుగానే చూసేను. అందుచేతనే మీకు చెప్పకుండా కొన్ని సంగతులు దాచిపెట్టేను. అక్కడికి వెళ్లనిచ్చేను. అవమానం పాల్జేసేను. తప్పు నాది. క్షమించండి." రామనాధం ఎంత హఠాత్తుగా వచ్చేడో అంత హఠాత్తుగానూ వెళ్ళిపోయేడు. అతనిని పిలుద్దామనుకున్న మాట స్వరాజ్యం గొంతులోనే మిగిలిపోయింది. నాయుడు ఒక్క నిట్టూర్పు విడిచేడు. "మంచిదే అయినా కొత్త అనేసరికి ఇంత మనఃక్లేశమూ తప్పదు. తప్పదు." ఇరవయ్యారు ఆ రోజున క్షమాపణ చెప్పుకున్నా రామనాధం మనస్సుకి శాంతి అనేది లేకుండాపోయింది. ఏదో పొగొట్టుకొన్నట్టూ, ఏదో మరచిపోయినట్లూ మనస్సు తల్లడిల్లి పోతూంది. మనశ్శాంతికి ఉపకరణం అని గాంధీగారు వర్ణించిన నూలు వడకడం కూడా మనశ్శాంతిని ఇవ్వలేకుండా వుంది. ఖద్దరు వుత్పత్తి కార్యక్రమం ఇప్పుడించుమించు లచ్చమ్మ చూసుకొంటూంది. ఊళ్ళో రావి క్రింద రాత్రి పేపరు చదివి వినిపించే కార్యక్రమాన్ని శివకామయ్య తీసుకొన్నాడు. పంచమ పేట వాళ్ళకి చెరువులో నీళ్ళు తోడి పోయవలసిన కార్యక్రమం తగ్గిపోయింది. నూతిలోంచి ఎవళ్ళకి వాళ్లు తోడుకు పోతున్నారు. పొలం పనులు ప్రధానమైనవి పూర్తి అయ్యాయి. పని రద్దీ లేని రోజులు ఇదివరకు అంతగా వుండేవి కావు. అలాంటి రోజున తప్పకుండా చిరతపూడి నాయుడుగారింటికి వెళ్ళేవాడు. అక్కడ తండ్రీ కూతుళ్ళతో ఏవో కబుర్లు చెప్తూంటే కాలం ఇట్టే గడిచిపోయేది. అతడూ ఆ యింటి వారిలో ఒకడుగానే పరిగణించేటంత చనువు ఏర్పడింది. ఇప్పుడు పని రద్దీ అంతగా వుండడం లేదు. కాని నాయుడు ఇంటికి వెళ్ళడానికి ఏదో సంకోచం. ఇప్పుడా స్వేచ్ఛ చూపలేకున్నాడు. ఆ స్వేచ్ఛ చూపలేకున్నా ఆ కుటుంబం నిత్యం, అనుక్షణం తన కళ్ళముందే వున్నట్లుంటుంది. ముఖ్యంగా స్వరాజ్యం. ఆమెను అవమానించిన సుందరి, స్వరాజ్యం గుర్తువచ్చినప్పుడల్లా జ్ఞాపకం వచ్చేది. ఆమె మీద ఎంతో అసహ్యం కలిగేది. క్రమంగా ఆ అసహ్యం తనమీదకే తిరిగింది. ఎంత పని చేశాను? అని పదిమాట్లు అనుకొనేవాడు. ఆమె ముఖం ఎల్లా చూడగలను అనుకొన్నాడు. కాని, జగ్గన్నతోట ప్రభల తీర్థంలో ఆమె తన ఖద్దరు దుకాణం ఎదుట కనిపించేసరికి ఏ సందేహాలూ, సంకోచాలూ, సిగ్గూ ఏమీ కనిపించలేదు. మనస్సూ-శరీరమూ ఆనందంతో నిండిపోయాయి. ఉత్ఫుల్లమయాయి. దుకాణాన్ని మిత్రుడు రామన్నకి వప్పచెప్పి బయటకు వచ్చేడు. ఇద్దరి కళ్ళలో ఒకే ప్రశ్న కనిపించింది. "ఎంతకాలానికి కనిపించేవ"న్న ఆనందం గొంతుకలలో వినిపించింది. కొద్ది దూరం ఆ జన సమ్మర్దంలో నిర్జనారణ్యంలో నడిచినట్లు బాహ్య స్పృహ లేకుండా నడిచేరు. చెరుకు గానుగ వద్ద నిలబడే ఇద్దరూ చెరో గ్లాసూ రసము త్రాగేరు. మొట్టమొదటి మారుగా రామనాధమే పలకరించేడు. "మీ బండి ఎక్కడుంది?" మురుగుకోడుకి ఆవల కొబ్బరితోటలో వుంది. ఇద్దరూ కొబ్బరి దుంగలతో వేసిన వంతెన మీదుగా ఆవలిగట్టుకు వెళ్ళేరు. ఇంకా ఇద్దరూ నిశ్శబ్దంగానే నడుస్తున్నారు. "మీకింకా కోపం తగ్గనే లేదూ?" రామనాధం కళ్లనీళ్ళు తిరిగినట్లనిపించింది. బలహీనంగా చిరునవ్వు నవ్వేడు. "నాకు కోపమా? మీ మొహం చూడడానికి చెల్లక....." తన స్థితి రామనాధానికే అర్ధం కాలేదు. తన కంఠంలో ఏదో అడ్డుపడినట్లు మాట రాలేదేం? కళ్ళనీళ్ళు తిరిగినట్లింత దైన్యస్థితి ఎందుకు?..... ఆమె ఏదో ఆలోచిస్తున్నట్లు తోచింది. "ఏమిటి ఆలోచిస్తున్నారు?" "పెద్ద ఏమీలేదు. మీ సలహా కావలసి వచ్చింది. ఈ పదిహేను, ఇరవై రోజులనుంచీ మీ కోసమే చూస్తున్నాను...." ఆమె తన కోసం ఎదురు చూస్తూందన్న మాటకు అతడు పరవశుడైపోయేడు. "కబురు చేయకపోయేరా?" "కబురు చేసే వరకూ రానంతటి కోపం వచ్చిందా?......" రామనాధం నిర్విణ్ణుడైనాడు. "చెప్పేను కాదూ. మీరు కోపం తెచ్చుకోనంటే ఒక్కటి చెప్తా." స్వరాజ్యం సందేహం. ఉత్కంఠ కనబరచింది. "ఈ నెల రోజుల్లో మిమ్మల్ని గురించి తలచని రోజు లేదు అంటే నమ్ముతారా?" ఆ మాట వినడం వలన కలిగిన సంతోషాన్ని స్వరాజ్యం హాస్యం మాటున దాచుకోడానికి ప్రయత్నించింది. "అంత కలలోకి వచ్చేటంత భయంకరంగా వున్నానా?" "నిజంగా....." అప్పుడే అటు వస్తున్న సూరాయిని గమనించి స్వరాజ్యం నెమ్మదిగా అంది. "మీతో మాట్లాడవలసినవి వున్నాయి. ఒకమారు ఇంటికి రాండి." తిరిగి వెళ్ళేటప్పుడు మరల జ్ఞాపకం చేసింది. "ఎప్పుడు రాగలరు?" "ఈ క్షణం రమ్మంటే దుకాణం వదిలేసి వచ్చేస్తాను." అందామనిపించింది. కాని, ఆమాట ఆమెకే మర్యాద కాదనిపించింది. మామూలుగానే అనేశాడు. "వస్తాను. తప్పకుండా వస్తాను." ఇరవైయ్యేడు మధ్యాహ్నం భోజనం చేసి కూర్చున్న వేళకు సూరన్న కాపు కొడుకును వెంటబెట్టుకొని మాణిక్యమ్మ తోటలోకి వచ్చింది. ప్రొద్దున్నే పనుల తొందరలో వెళ్ళలేకపోవడం చేత స్వరాజ్యమే తల్లిని వెంటబెట్టుకొని వచ్చిందనుకున్నాడు. అంత అవసరమైన కార్యమేమిటో అనుకొన్నాడు. మనస్సులో సంకోచంతోనే మాణిక్యమ్మకు చాప పరిచేడు. "కూర్చోండి. నాయుడుగారి ఆరోగ్యం బాగుంది కదా. చాలా రోజులు అయింది చూసి, ఈవేళ వద్దామనుకుంటున్నా, ఏరీ స్వరాజ్యంగారు రాలేదు?" అంటూ కుశల ప్రశ్నలు వేసేడు. మాణిక్యమ్మ తాను నాలుగు రోజులయి వచ్చేనంటూంటే, గడచిన రోజున తీర్థంలో స్వరాజ్యం తన తల్లి కనిపించిందా అని అడిగిన మాట గుర్తు వచ్చింది. బహుశా తీర్థంలోనే ఇద్దరూ చెరోదారీ అయివుంటారనుకున్నాడప్పుడు. తల్లి కోసమే తీర్థం వచ్చిందన్న మాట అనుకున్నాడిప్పుడు. "నిన్న స్వరాజ్యంగారు తీర్థంలో కనిపించేరు. మీరు కనిపించేరాయని అడిగేరు. అక్కడే ఇద్దరిదీ చెరోదారీ అయిందనుకున్నాను. లేదన్నాను." చాలసేపు మాణిక్యమ్మ ఆమాటా ఈమాటా చెప్పి అసలు తాను వచ్చిన పని తేల్చింది. నాయుడికి వయస్సు వచ్చిన కొద్దీ మంచీ చెడ్డా మరిచిపోతున్నాడని ఆమె వ్యధ. లేకుంటే కూతురికి మళ్లీ పెళ్ళి చేస్తానంటాడా? తక్కువ కులాలలో వాళ్ళకి మల్లే మారుమనువు తలపెడతారా? రామనాధం వెళ్ళాలి. ఒక్కమాట చెప్పాలి. ఆతని మాటంటే నాయుడికి మంచి గురియని మాణిక్యమ్మ అభిప్రాయం. "బాబ్బాబు! నీ కడుపున పుడతా. ఈ దుర్మార్గం ఆపండి. ఇంతవరకయినదానికే ఐన వాళ్ళలో తలెత్తుకోలేకుండా వున్నాను. ఈమారు లోతుగా చూచుకు దిగడం తప్ప మరి దారి వుండదు" అని మాణిక్యమ్మ అంగలారుస్తుంటే రామనాధానికి ఏమిచెప్పడానికీ తోచలేదు. నాయుడిది సరియైన ఆలోచనే అనిపించినా మాణిక్యమ్మను కేవలం నిరుత్సాహపరచడానికి మనస్సు ఒప్పలేదు. ఆమెను సంతృప్తి పరచడానికై అటూ ఇటూ గాకుండా చెప్పడం సాగించేడు. "మీరు ఆందోళన అనవసరంగా పడుతున్నారనుకుంటాను. నాయుడు గారు ఎప్పుడూ కాని పని చేస్తారనుకోను....." నాయుడు తలపెట్టిన పని మంచిదంటున్నాడో, కాని పని అంటున్నాడో మాణిక్యమ్మకు అర్ధం కాలేదు. తన వాదనలు, మగని పెంకె సమాధానాలూ వరసన ఏకరువు పెట్టింది. "ఆయన సంగతి మీకు బాగా తెలియదు. బహు పెంకె మనిషి. ఆయనకు ఎంత తోస్తే అంతే, మరొకరు చెప్తే వినే ఘటం కాదు...." ముప్పయి ముప్ఫయి అయిదేళ్ళు ఆ వ్యక్తితో చేసిన కాపురంలో కలిగిన అనుభవాలు అనేకం. వానిలో సూచన ప్రాయంగా రెండు మూడు మాత్రం వుదహరించింది. వారి కుటుంబపు వ్యవహారాలు వినడం సిగ్గనిపించి రామనాధం మాట మార్చడానికి ప్రయత్నించేడు. "ఇంతకీ స్వరాజ్యంగారు ఏమంటారు? పెళ్ళి చేస్తానన్నా చేసుకొనేదీ, మానేదీ ఆమె కదా......" మాణిక్యమ్మ పావుగంటసేపు చెప్పిన సమాచారం పట్టి స్వరాజ్యం ఆ ప్రయత్నానికి పూర్తిగా వ్యతిరేకం కాదనిపించింది. తండ్రిని తొందరపడవద్దనడంలో ఆమె వుద్దేశ్యం ఏమిటో--అనిపించి రామనాధం మనస్సు ఉత్కంఠితమయింది. తల్లి అభిప్రాయం ప్రకారము తండ్రి ప్రయత్నం ఆమెకు ఇష్టం కాదు. అయితే.... తనను రమ్మని నొక్కి నొక్కి చెప్పినది తండ్రిని వొప్పించడానికేనా? ఆ సమాధానం మనస్సుకి వొప్పిదం కాలేదు. ఆమెకు పెళ్ళి దృష్టి వుందనుకోవడం అతనికి సంతృప్తి కలిగిస్తూంది. లేకపోతే తొందర పడవద్దనదు. ఖచ్చితంగా చెప్పెయ్యగలదు? తండ్రి ఆమె అభిప్రాయాన్ని కాదని ఏమీ చెయ్యలేడు. చెయ్యడు. అటువంటి అనుమానమే మాణిక్యమ్మకు కూడా కలిగింది కాబోలు. దానికామె వేరొక విధంగా సమాధానం చెప్పుకుంది. జబ్బుపడినప్పటి నుంచీ తండ్రిని చంటిపిల్లవాడిని చూసినట్లు చూస్తూంది. ఇప్పటినుంచి వొప్పించటమెందుకులే యని సాచివేస్తూంది కాని మరేమీ కాదని సమాధానం చెప్పుకుంది. అదే రామనాధాన్నీ నమ్మమంది. ఆ పూటనే చిరతపూడి వెళ్ళి నాయుడుతో మాట్లాడతానని మాణిక్యమ్మకు మాట యిచ్చేడు. కాని ఆమె వెళ్ళిన గంటక్కూడా కూర్చున్న కుర్చీలోంచి లేవలేకపోయేడు. లేచినప్పుడు కూడా పెద్ద వుసిరిచెట్టు క్రింద తిన్నెమీదికి బదలా అయ్యేడే తప్ప బయలుదేరలేకపోయేడు. నిన్న మధ్యాహ్నం జగ్గన్నతోట తీర్థంలో స్వరాజ్యం ముఖం చూశాక ఆ నెల రోజుల తపన ఏమిటో, ఎందుకో అర్థం అయింది. తనకు స్వరాజ్యం కావాలి. ఆమె తన దగ్గర వుండాలి. ఆమెతో కబుర్లు చెప్పాలి, ఆమె నవ్వు వినాలి, ఆమె కోసం తన శరీరం, మనస్సు అణువణువునా, అనుక్షణం తపించిపోతున్నాయి. తీర్థంలో ఆమెను చూసిన మరుక్షణం నుంచీ అతనికి అనుభూతం అయినదది. స్వరాజ్యం కూడ తన మానసిక స్థితికి అనుగుణంగానే వున్నట్లు అనిపించింది. ఆమె మాటలను, చూపులను, అనునయాన్ని--అన్నింటినీ అతడు ఆ విధంగానే అర్థం చేసుకున్నాడు. తన పథకం కూడా దానికి అనుగుణంగానే వేసుకున్నాడు. ఉదయమే వెళ్ళి తన ప్రేమను స్వరాజ్యానికి తెలుపుకుంటాడు. తరువాత నాయుడిని అడిగేస్తాడు. స్వరాజ్యం ముందు తన ప్రేమనెల్లా తెలుపాలో, నాయుడు ముందు ఏమని చెప్పాలో మాటలు మార్చి మార్చి మనస్సులో ఒద్దికలు వేసుకున్నాడు. అతనికి మాణిక్యమ్మ అస్తిత్వమే గుర్తు రాలేదు. కాని, తెల్లవారి లేచేసరికి పనులు వెంటాడేయి. వానిని తెముల్చుకోలేకపోయేడు. అనుక్షణం స్వరాజ్యం తన రాక కోసం గుమ్మంలో నిలవబడివున్నట్లే అనిపించింది. ఏ క్షణానికాక్షణం మాట్లాడుతున్న వాళ్ళని పంపేసి చేతిలో వున్న పని వదిలేసి పోదామనిపిస్తూంది. కాని వెళ్ళలేకపోయాడు. ఇప్పుడు మాణిక్యమ్మ వెళ్ళిపోయాక మరింకే పని లేకపోయినా అతడు కదలలేననుకొన్నాడు. వెంటనే చిరతపూడి వెడతాననీ నాయుడుతో మాట్లాడుతాననీ ఆమెకు మాట యిచ్చేడు. కాని అడుగుపడలేదు. రాత్రినుంచీ అనుభూతమైన ఆ వుత్సాహము, ఆశ, మనఃస్థైర్యము ఇప్పుడు కలిగించుకోవాలన్నా సాధ్యం కావడం లేదు. ఇదివరకు తాను మాణిక్యమ్మ ప్రసక్తిని వూహించియే వుండలేదు. కాని, ఆమె తన ఆలోచనలకు ప్రధానమైన అభ్యంతరం అనిపించింది. తన మనస్సులోని ఆలోచన బయటకు రాకుండానే ఆ యింట్లో ఆమె వేపు నుంచి ప్రతిఘటన ప్రారంభమయింది. ఆమె అభ్యంతరము చెప్పినా నాయుడు కూతురు పెళ్ళి చేయాలని ఆలోచిస్తున్నాడని వినేసరికి కలిగిన ఉత్సాహం అతడు వరుని కోసం రఘుపతి వెంకటరత్నం నాయుడుగారికి కాకినాడ కబురంపించాడంటే చప్పబడిపోయింది. అన్నింటికన్న స్వరాజ్యం మనస్సు ఏమిటో అతనికి అర్థం కాలేదు. నిన్నటి నుంచీ తాను చేసుకొంటున్న కల్పనలన్నీ వట్టివేనా? తాను కనిపించేడు గనక ఇంటికి రావడంలేదేమని మర్యాదకి అడిగిందేమో, ఇంట్లో వచ్చిన ఈ గంద్రగోళంలో తన తండ్రిని వొప్పించడానికే తనను రమ్మన్నదేమో, లేకపోతే ఇరవయి రోజుల నుంచి ఈ గంద్రగోళం జరుగుతుంటే, నిన్న తాను జగ్గయ్యపేట తీర్థం వస్తాడని కలగందా? ఆ ఆలోచన తోచేక చిరతపూడి వెళ్ళాలనిపించలేదు. స్వరాజ్యం ఆలోచనలుగా తాను వూహించుకుంటున్నవన్నీ అత్యాశలు మాత్రమేననిపించేక మరిక వెళ్ళడం అర్థం ఏమిటి? నాయుడు ప్రయత్నాలన్నీ దిగతీయడానికా? స్వరాజ్యం ఇష్టం లేనిదే ఆయన ఒక్కడుగు ముందుకు వేయలేడు, వేయడు. తొందర పడవద్దన్న ఆమె సలహాకు మాణిక్యమ్మ చెప్పినదే అర్థం అయితే..... నాయుడు స్వయంగా ఆ వుత్తరాలు రాయలేడు. చెప్పి కూతురుచేత వ్రాయించవలసినవాడేగాని, ఆమెకిష్టం లేక వ్రాయను అంటే ఆయన చెయ్యగలది ఏముంది? కనక వివాహం చేసుకోవడం స్వరాజ్యానికి ఇష్టమే. తన వరుని ఎన్నికలో తన తండ్రితోపాటు తానూ వెంకటరత్నం నాయుడుగారి సహాయం కోరుతూంది. అంటే తాను భావిస్తున్నట్లు ఆమె తన కోసం ఎదురుచూడ్డం లేదు. తనను మనసులో వుంచుకొనే తండ్రిని తొందర పడవద్దంటున్నదని చెప్పుకొన్న సమాధానమూ సరికాదు. ఆ మాట అనిపించేక మరి రామనాధానికి నాయుడి ఇంటికి వెళ్ళాలని గాని, స్వరాజ్యం ప్రసక్తి పెట్టుకోవాలనిగాని అనిపించలేదు. ఆ పూటకింక అన్నం వండుకోవాలని కూడా అనిపించలేదు. రెండు రోజులు, మూడు రోజులు ఒక వారం గడిచిపోయింది. రామనాధానికి మనస్సు ఎంత నిలవరించుకొందామనుకున్నా సాధ్యం కావడం లేదు. స్వరాజ్యం అతని ఆలోచనల నుంచి వైదొలగడం లేదు. తీర్థంలో కోడు మీది కర్రలవంతెన వరకూ వచ్చి తనకు జాగ్రత్త చెప్పిన ఆమె కళ్ళు అతని మనస్సుని వదిలి పోవడం లేదు. తన సలహా అవసరం వచ్చిందన్నప్పటి గొంతులో వినిపించిన అనునయం, ఆశ కాదనుకున్నా మనస్సుని వదలడం లేదు. "స్వరాజ్యం నాది కాకపోతే మరి బ్రతికి ఎందుకు?" అని పదిమాట్లు ప్రశ్నించుకున్నాడు. ఆమె వద్దకు పోయి తన మనస్సుని ఆమె ముందు స్పష్టంగా పెట్టేద్దామని పదిమాట్లు అనుకున్నాడు. కాని,...... ఆమెకిష్టం కాకపోతే......ఇష్టం లేదంటే..... అల్లరిచేస్తే...... భారతదేశంలో పెళ్ళి చేసుకోవాలనుకున్న యువతీ యువకులు తామే చొరవ తీసుకొని నిర్ణయం చేసుకోవడం ఎక్కడుంది? అల్లాంటి అలవాట్లు లేవు. ఎవరన్నా ఎక్కడన్నా అలా నిశ్చయించుకొన్నా అవి పైకి రావు. ఆ విధమైన పని అవినయంగా జమకట్టి పెద్దవాళ్ళు ఎక్కడికక్కడ కమ్మేస్తూంటారు. అందుచేత అతడు విన్నవల్లా అల్లాంటి ఘట్టాలలో జరిగిన అల్లర్లను గురించి మాత్రమే. తనకిష్టం లేని పడుచువాడు తన ప్రేమను ప్రకటిస్తే పడుచులు అల్లరిచేసి అవమానించిన ఘట్టాలు విన్నాడు. ఇద్దరికీ ఇష్టం వున్నా తమ రహస్యం ఇతరుల కంటబడిందనిపించినప్పుడు పడుచులు అల్లరి పెట్టడం విన్నాడు. తన ఆలోచనలకు మగవాడు ప్రతిస్పందించనప్పుడు కసితో అల్లరి చేసిన ఘట్టాలు కథల్లో చదివేడు. స్వరాజ్యం అలా చేయదని పదిమాట్లు ఆత్మ విశ్వాసం కలిగించుకొన్నాడు కాని, జీవితంలో తాను చూసినవీ, విన్నవీ ఘటనలు ఆ విశ్వాసాన్ని నిలవనీయడంలేదు. నిజంగానే అలా జరుగుతే అంతకన్న మహావమానం ఏం వుంటుంది? చచ్చిపోవాలే తప్ప మరి వూళ్ళోవాళ్ళకి మొగం చూపగలడా? చచ్చిపోయినా అప్రతిష్ఠ పోతుందా? రామనాధాన్ని ఆ అప్రతిష్ఠ భయం ఒకటి రెండు రోజుల కన్నా బాధించలేకపోయింది. అయితే తన కార్యవిధానం మార్చుకోవాలనుకొన్నాడు. స్వరాజ్యమే తనను సలహా కావాలని ఆహ్వానించింది. ఆమె తల్లి నాయుడుగారితో మాట్లాడడానికి వెళ్ళమని నియమించింది. ఆ అవకాశాలను వుపయోగించుకొంటాడు. వెడతాడు. స్వరాజ్యాన్ని చూస్తాడు. తండ్రితో మాట్లాడబోయే ముందు ఆమె అభిప్రాయం తెలుసుకొనేటందుకు ప్రయత్నిస్తాడు. అంతవరకూ మార్గం దొరికేక రామనాధం బయలుదేరేసేడు. ఇంకేవో కొత్త అనుమానాలు బయలుదేరి మరల వెనక తీస్తానేమోనని అతనికే భయం పుట్టింది. "ఈవేళ ఏదో తేల్చుకోవాలి. ఇంకిల్లా బ్రతకడం సాధ్యం కాదు...." ఇరవయ్యెనిమిది నీరెండెల వేళ గుమ్మంలో ప్రత్యక్షమయిన రామనాధాన్ని చూసి స్వరాజ్యం ఆశ్చర్యం కనబరచింది. "దారి తప్పినట్లున్నారే?" రామనాధం ఏదో గొణిగేడు. కాని, ఆ మాట వినిపించుకోకుండానే స్వరాజ్యం లేచి నిలబడింది. "కూర్చోండి. నాన్నగారు కరణంగారి వీధికి వెళ్ళేరు. ఇప్పుడే వస్తారు" అంటూ ఆమె ఇంట్లోకి బయలుదేరింది. రామనాధం కంగారుగా ఆమెను పిలిచేడు. "ఏమండీ!" స్వరాజ్యం నిలబడి గ్రీవాభంగంలో ఏమన్నట్లు చూసింది. "క్షమించాలి....." "ఎందుకు?" రామనాధం కంగారుపడ్డాడు. ఆమె ఏదో సహాయం కావాలి, ఓమాటు మా యింటికి రమ్మంది. తాను వెళ్ళలేదు. పది రోజులు పోయాక వచ్చి క్షమించమనడంలో అర్థం ఏమిటి? స్వరాజ్యమే ఆ అభిప్రాయాన్ని మరో రూపంలో చెప్పింది. "అదేముందండి. వీలు లేకపోయింది." రామనాధం "అదేం కాదు" అన్నాడు. "పోనీ ఇష్టం లేకపోయింది. ఈ తగవుల్లో మనం తలదూర్చడమెందుకనుకున్నారు" "అబ్బెబ్బే! అదేం కాదు." మరి ఏం చెప్పాలో అతనికి అర్ధం కాలేదు. ఒక్క నిముషం చూసి స్వరాజ్యం ముందడుగు వేసింది. "పోనీలెండి, రాలేకపోయారు. రాలేదు. దానికి క్షమాపణ ఎందుకు? మీరు కూర్చోండి. నాన్నగారు వొచ్చేస్తారు." --అంటూ ఆమె లోనికి వెళ్ళిపోయింది. నీతో నాకేం పనిలేదన్నట్లు ఆమె మాట వినిపించి రామనాధం నిర్విణ్ణుడై అలాగే చూస్తూ నిలబడిపోయేడు. మరునాడు తప్పక వస్తానన్న మనిషి రాకపోయేసరికి స్వరాజ్యం చాల నిరుత్సాహపడింది. తండ్రి తనకు పెళ్ళి చేస్తానని సంబంధాలు వెతుకుతున్నాడు. పెళ్ళి తనకూ ఇష్టమే. కాని ఆమె చూపు వేరొకచోట వుంది. కాని--అతని అభిప్రాయం ఏమిటో..... తీర్థంలో కనిపించినప్పుడు రామనాధం కండ్లలో కనిపించిన ఆసక్తి, మాటలలో వినబడిన ఆప్యాయత ఆమెకు ఆశ కలిగించేయి. తన తండ్రి ప్రయత్నం తెలిస్తే ఆతడు బయటపడతాడు. అందుకోసమే అతనిని ఇంటికి పిలిచింది. కాని, అతడు రాలేదు. రెండు రోజులు పనుల తొందరకు జమ కట్టుకుంది. అటు తర్వాత అది సాధ్యం కాలేదు. తొందరపడిపోయేనే అనుకుంది. తనను అలుసు చేస్తాడని భయం కలిగింది. అవమానకరంగా వ్యవహరిస్తే ఏం చెప్పాలో మాటలు కూడా ఆలోచించుకుంది. మరో రెండు రోజులు పోయేసరికి అభిమానం వెనక ఆసక్తిని దాచుకోలేకపోయింది. ఏ అనారోగ్యమైనా కలిగిందేమో, లేవడం లేదేమో, పరిపరి విధాల ఆలోచనలు పోయేయి. ఎంతో ఆదుర్దా కలిగింది. కాని, తీరా అతడు కట్టెదుట కనిపించేసరికి వల్లమాలిన అభిమానం పట్టుకొంది. నీతో నాకేం పనిలేదన్నట్లు "మా నాన్నగారు వస్తారు. కూర్చోమ"ని లేచిపోయింది. లోపలికి వెళ్ళేక అతడు వెళ్ళిపోతాడేమోనని భయం కలిగింది. అతనిని మర్యాద చెయ్యకపోయినా, తాను వ్యవహరించిన తీరు తప్పకుండా అవమానమనిపిస్తుంది. అతడెప్పుడు వచ్చినా కూడా వుంటూ కబుర్లు చెప్పే మనిషి ఇప్పుడు ఇల్లా వ్యవహరిస్తే ఏమనుకుంటాడు? ఆమాట తోచి స్వరాజ్యం తిరిగి వచ్చింది. అతడక్కడే అప్పటికీ నిలబడిపోయి వున్నాడు. నొచ్చుకుంది. "ఏమిటల్లాగే నిలబడి వున్నారు? కూర్చోకుండా....." "సెలవిప్పిస్తారా? చెప్పిపోదామని ఆగేను..." స్వరాజ్యానికి కష్టం అనిపించింది. "అంత చెప్పుల్లో కాళ్ళు పెట్టుకు నిలబడ్డానికి.... మరి మీరెందుకు వచ్చినట్లు? ఎందుకు వెళ్ళిపోతామంటున్నట్లు? వచ్చి పది నిముషాలు కాకుండా వెళ్ళిపోతానంటే...." "అదీ నిజమే. ఎందుకు వచ్చేను" అనుకొంటున్నట్లున్నాయి అతని చూపులు. "ఓమారు మిమ్మల్ని చూడాలనిపించింది వచ్చేను" అన్నాడు. ఆమాటకామె మనస్సు సంతృప్తిపడింది. నవ్వు వచ్చింది. "ఏడెనిమిది రోజుల క్రితం మీతో పని వుందన్నాను. మీకిన్నాళ్ళకి రావాలనిపించిందన్నమాట! బాగానే వుంది. చూడాలనిపించింది--వచ్చేరు. వచ్చేరు గనక కూర్చోండి...." రామనాధం కూర్చున్నాడు. ఇరువురి మధ్య మాట సాగటం లేదు. ఒక నిముషం కూర్చుని స్వరాజ్యం లోపలికి వెళ్ళి వచ్చింది. అప్పుడూ అతడలాగే వుండిపోయేడు. "మాటామంతీ లేకుండా అల్లా కూర్చున్నారు. ఒంట్లో బాగుందా?" అంటూ ఆమె అతని ముఖం వంక చూసింది. మనిషి చిక్కినట్టున్నాడు. ముఖం కందిపోయినట్లు ఎర్రబడింది. కళ్ళు జ్యోతుల్లా వున్నా ఏదో దాచిపెడుతున్నట్లు చూపు తప్పిస్తున్నాయి. ఈమారామెకు నిజంగానే ఆదుర్దా కలిగింది. లేచి వచ్చి నుదురు ముట్టి చూసింది. ఆమె స్పర్శకు రామనాధం జలదరించేడు. రామనాధం నుదుటి మీదనున్న ఆమె చేతిని రెండు చేతులా తీసికొని కళ్ళమీద పెట్టుకున్నాడు. స్వరాజ్యం పరవశత్వంతో అతని కుర్చీ వీపున జేరబడి నిలబడిపోయింది. చేతి వ్రేళ్ళకు తడి తగిలినట్లనిపించి స్వరాజ్యం కంగారుగా చేతులు తీసుకుంది. "ఏం? ఏమయింది?" అనబోయింది. అతడు తడి కళ్ళను దాచుకొనేటందుకు చేసిన ప్రయత్నం చూస్తే నవ్వు వచ్చింది. వీధిలో నాయుడు కంఠం వినిపించింది. ఇద్దరూ ఉలికిపడ్డారు. స్వరాజ్యం రెండు అరచేతులతో అతని బుగ్గలు అదిమిపెట్టి తల తనకేసి తిప్పుకుంది. ఒక్క నిముషం అతని కళ్ళలోకి చూసింది. చిరునవ్వుతో ఇంట్లోకి పరుగెత్తింది. ఇరవైతొమ్మిది రామనాధం రాకకు అబ్బాయి నాయుడు మామూలు వుత్సాహం కనబరచలేకపోయేడు. కొంచెం చిరాకుపడ్డట్లేననిపించింది. అతడు వెనక్కి తగ్గేడు. నాయుడు గుడ్డివాడు. అవధ్యుడు. కూతురు వయస్సులో వుంది. ఒంటికత్తె. తల్లీ, తోడూ ఎవరూ లేరాయె. రామనాధం వంటి ప్రథమ యౌవనంలో వున్న తరుణుడు తన యింటికి తరచు వేళ కాని వేళల్లో రావడం మంచి పని కాదు అని నాయుడు వుద్దేశం. ఆ వుద్దేశం అర్థం అయ్యేలాగునే అతడు అతి మర్యాదగనే చెప్పేడు. "తోటల్లో గట్లవెంట పురుగూ, పుట్రా తిరుగుతూంటాయి. చీకట్లో కష్టం. మీకేమయినా అనిష్టం జరిగితే మా మనస్సులకెంతో బాధ. ఎప్పుడొచ్చినా చీకటిలో పోనక్కర్లేకుండా వస్తూండండి." ఆ మాటల అర్ధాన్ని పడుచువాళ్ళిద్దరూ గ్రహించేరు. రామనాధం తెల్ల మొగం వేసేడు. స్వరాజ్యం ముఖం గంటు పెట్టుకుంది. "చీకటి పడ్డాక వెళ్ళనిస్తామా ఏమిటి?" కూతురు మాటను అబ్బాయి నాయుడు కాదనలేదు. అలాగని రామనాధాన్ని వుండమననూ లేదు. అసలా విషయాన్ని గురించి తల పెట్టనే దలచలేదు. "నీళ్ళు కాగేయా?" స్వరాజ్యం ఆయనకు సరాసరి సమాధానం ఇవ్వలేదు. "రామనాధం గారూ! మీ కోసం వేడినీళ్ళు తోడి వుంచేను. నాన్నగారు బట్టలు మార్చుకొని వచ్చేలోగా వెళ్ళి స్నానం చేసి రండి" అది తండ్రీ కూతుళ్ళ మధ్య కుస్తీలా కనిపించింది. తన సంకల్పం వెలువరించడానికి అది సమయం కాదు. నాయుడు ఏదో ఆవేశంలో వున్నాడు. నాలుగు రోజులు పోనిచ్చి మళ్ళీ వస్తాడు. అప్పుడు మాట్లాడుతాడు. ఇప్పుడీ విధంగా ఆ యింట్లో కల్లోలం తీసుకురావడం తమ ఆలోచనకే ఆటంకం అవుతుంది అనుకొన్నాడు. "ఇప్పుడెందుకండీ, వెన్నెలగా వుంది. ఇంకా పొలాల మీద మనుష్యులు తిరుగుతూనే వుంటారు." స్వరాజ్యం ఖచ్చితంగా చెప్పేసింది. చీకట్లో అతనిని వెళ్ళనియ్యదు. నాయుడు ఆమె అభిమానాన్ని అర్థం చేసుకొని తగ్గేడు. "ఇప్పుడెక్కడికి వెడతారు. లేవండి" అన్నాడు. తనను పోనిమ్మన్నట్లు రామనాధం దీనంగా స్వరాజ్యం వంక చూసేడు. ఆమె పనికిరాదన్నట్లు తల అడ్డంగా తిప్పింది. "ఎంతో వేళ మిగలలేదండి" అన్నాడు నాయుడుకు సమాధానంగా. తండ్రి గుడ్డితనాన్ని వుపయోగించుకోవడానికి స్వరాజ్యం సందేహించలేదు. రామనాధం చేయి అందుకొంది. "ఇంక మీ మాట ఎవ్వరం వినదలచుకోలేదు." భోజనాల వేళ ఎవ్వరూ మాట్లాడలేదు. ఎవరి ఆలోచనలలో వారున్నారు. ఒక్క స్వరాజ్యమే మాట్లాడుతూంది. ఎవ్వరూ తిండి సరిగ్గా తిన్నట్లు లేదు. వారు చేతులు కడుక్కు వచ్చేసరికి రామనాధానికి వాకిట్లో అరుగు మీద మంచం వేసింది. "అదిగో దుప్పటి, మంచం క్రింద మంచినీళ్ళూ, చెంబూ వుంచేను. ఏమన్నా కావలిస్తే లేపండి. మొగమాటపడక." రామనాధం పరిస్థితులు ఆ రూపం తీసుకుంటాయనుకోలేదు. స్వరాజ్యం అభిమానం, ప్రేమా గురించే అతడీ వారం రోజులూ అనంతమైన వేదన ననుభవించేడు. ఆమె తనదే, దృఢపడిపోయింది. కాని ఈమారు అభ్యంతరం వేరొక దిశ నుంచి ఎదురయింది. కూతురు పెళ్ళి చెయ్యాలనుకొంటున్న నాయుడుకి తన విషయంలో ఎందుకు అభ్యంతరం వుండాలో తెలియదు. ఈ దశలో నాయుడుని రెచ్చగొట్టటం కన్నా నెమ్మదిగా సర్దుకోవడం మంచిదని అతని అభిప్రాయం. కాని, స్వరాజ్యం పద్ధతికి ఆమె కారణాలు ఆమెకు వున్నాయి. ఖచ్చితంగా తన పక్క నిలబడి రామనాధం తనకు సాయపడాలని ఆమె కోరిక. కాని, రామనాధం నీళ్ళు నమలడం ఆమెకు నచ్చలేదు. కాని, ఏమీ అనలేకపోయింది. "చాలులెండి. అది మీ పక్క." ముప్ఫయి తమ సమాజంలోని ఆచారాలూ, అలవాట్లూ, నీతి-అవినీతి భావనలూ దృష్ట్యా తాను రామనాధం యెడ కనబరుస్తున్న మమకారం తప్పు. కాని తమకిద్దరకూ మనస్సు కలిసింది. తమ యిద్దరి మధ్యా ఏర్పడిన ఆత్మీయత దృష్ట్యా అది తప్పు కాదు. తమ యింట్లో నడుస్తున్న చర్చల దృష్ట్యా కూడ ఆమె తమ మధ్య ఏర్పడుతున్న మమకారం మంచి చెడ్డల్ని పరిశీలిస్తూంది. తనకు పెళ్ళి అయిన మాట నిజం. ఆ మగనియెడ తనకు ఆత్మీయత పెరగడానికి తగిన అవకాశమూ లేదు. అవసరమూ లేదు, పెళ్ళి అయన కొద్ది నెలల నుంచే రెండు కుటుంబాలూ దూరం అయాయి. అతడు రెండో పెళ్ళి కూడా చేసేసుకున్నాడు. అయినా సరే సమాజంలోని ఆచారాలనూ, అలవాట్లనూ అనుసరించాలనే ఆమె తలచింది. ఆ మొగుడి మీద మమకారం పెంచుకోగలుగుతాననే తలచింది. ఏమో, ఏం జరుగునో అతడా అవకాశం ఇవ్వదలచలేదు. ఆమెకా అవసరం కలగనూ లేదు. అల్లుని వద్దకు నడిచిన రాయబారం విఫలం అయ్యేక నాయుడుకి కూతురు భవిష్యత్తు యెడ ఎంతో దిగులు పట్టుకొంది. ఆమెకు మళ్ళీ పెళ్ళి చేసేద్దామని ఆలోచన కలిగింది. చట్టరీత్యా ప్రతిబంధకాలున్నాయేమోనని వియ్యాలవారితో నడిపిన రాయబారాల పర్యవసానాలను తెలుపుతున్న జాబులన్నీ ఎక్కడెక్కడున్నవీ భద్రం చేయించేడు. తన బ్రహ్మసమాజం మిత్రులందరికీ జాబులు వ్రాయించేడు. వాటినన్నింటినీ స్వరాజ్యమే వ్రాసింది. ఆమె మనస్సులో మళ్ళీ పెళ్ళి చేసుకోవడం తప్పు కాదని శ్రుతి స్మృతి పురాణాలలోని కథలూ, కవితలూ, శ్లోకాల బలంతో ఒక అభిప్రాయం ఏర్పడింది. పెళ్ళిచేసుకోవాలనే ఆలోచనా కలిగింది. ఆ సమయంలో రామనాధం ఆమె ఎదుటికి వచ్చేడు. ఏ కులం వాడికైనా తండ్రి అంగీకరిస్తాడో లేదో అనే ఆలోచన ఆమెకు కలుగలేదు. చదువుకున్నవాడు, ఏ వుద్యోగంలోనో వున్నవాడు కావాలనే గాని, ఫలానా కులం వాడేనని తండ్రి ఎప్పుడూ వ్రాయలేదు. కులాల భేదాలు కృత్రిమాలనే భావం ఆ యింట్లో వుంది. ఒకవేళ అటువంటి అభ్యంతరాలు పెద్దవాళ్ళకున్నా, వానిని గమనించనీయని వయస్సు ఆమెది. రామనాధం రూపసి. మంచి విగ్రహం, హృదయం ఇవ్వగలవాడు. ఈ పూటతో అతడు తనవాడేనని స్పష్టం అయిపోయింది. ఆ విషయంలో ఆమెకెల్లాంటి సందేహమూ లేదు. అతడు తనవాడు. అతనిని ఏమన్నా అంటే పీకేస్తుంది. అతనిని కాపాడుకొంటుంది. ఆ ఆవేశంలో ఆమె తిండి తినలేకపోయింది. మగవాళ్ళిద్దరివీ భోజనాలయ్యాక ఇల్లు సర్దేసింది. తిన్నగా తండ్రి పడుకొన్న గది గుమ్మంలో హాజరయ్యింది. వస్తూనే అడిగేసింది. "ఏమిటి నాన్నా! ఇందాకా మీరన్న మాటకు అవసరం ఏం వచ్చింది?" ఆమె కంఠం నిండి వుంది. కోపంతో, అభిమానంతో మాటలు ముద్ద ముద్దగా వినిపించేయి. ఆమె గొంతు వినగానే అబ్బాయి నాయుడు మంచంమీద లేచి కూర్చున్నాడు. "నువ్వేనా? రా తల్లీ! పిలవాలనుకొంటూంటే నువ్వే వచ్చేవు. రా కూర్చో." తండ్రి కంఠంలోని మమతా, తానే పిలవాలనుకొంటున్నాననడమూ ఆమెను దిగ్భ్రమ చెందించేయి. ఆవేశం దెబ్బ తింది. కాని, పట్టుదల సడలలేదు. మాట్లాడకుండా కుర్చీ లాక్కుని కూర్చుంది. తానే అడగాలని వచ్చిన సంగతి మరచి ఆయన ఏమంటాడోనని ఎదురు చూసింది. "చెప్పండి." "రామనాధంగారు మన యింటికి తరచు రావడం పోవడం బాగాలేదు. చిన్నవాడు. తెలియకపోవచ్చు...." నిజానికి రామనాధం తరచుగా వస్తున్నాడన్న మాట అసత్యమని ఇద్దరూ ఎరుగుదురు. ఎప్పుడేనా పదిహేను ఇరవయి రోజులు వరుసగా కనిపించకపోతే నాయుడే పదిమాట్లు అనుకొనేవాడు. ఈ పర్యాయం అతడు వచ్చి నెల రోజులయింది. కాని, నాయుడు అభిప్రాయం వేరు. ఆ మెత్తని మందలింపునకు స్వరాజ్యం భగ్గుమంది. "ఈవేళ కొత్తగా, హఠాత్తుగా ఈ ఆలోచన ఎందుకు కలిగింది?" అబ్బాయి నాయుడు ఏం చెప్పగలడు? నెల రోజుల క్రితం స్వరాజ్యానికి అమలాపురంలో అవమానం జరగిందని విని, తాను క్షమాపణ చెప్పుకొనేటందుకు వచ్చినప్పుడు రామనాధం వెలిబుచ్చిన అభిప్రాయం నాయుడిని హెచ్చరించింది. తాను కట్టుకొన్న భార్య కన్నాస్వరాజ్యం ఆత్మీయురాలనడం నాయుడు మనస్సులో అనుమానాలు కలిగించింది. పది రోజుల క్రితం కూతురు తీర్థంలో రామనాధం కనిపించేడనీ, ఇంటికి రమ్మన్నాననీ చెప్పినప్పుడు అతడు మనస్సులోనే భయపడ్డాడు. కూతురు ఆలోచనలేమిటో అనిపించింది. అవన్నీ ఆమెకు చెప్పలేకపోయేడు. తన మనస్సులోని అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పనూ లేకపోయేడు. "ఇప్పుడు మాత్రం మనం రావద్దంటామా? కాని, రాకపోకలకి వేళాపాళా వుండాలిగాని, ఇల్లాగ సాయంకాలానికి వచ్చి రాత్రి మకాం వేస్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారు?" "ప్రపంచం ఏదన్నా అనుకుంటుందనే భయం మీకు ఎప్పటినుంచేం?" మాణిక్యమ్మ ఆమాట కోసమే ఇదివరకు ఎంతో బాధపడింది. కూతురికి పెళ్ళి చేస్తే ప్రపంచం ఏమంటుందని ఆమె భయం. ఆ భయంతోనే కోపం తెచ్చుకొని, భర్తను లొంగదీయడానికై ఇంట్లోంచి వెళ్ళి, చెల్లెలిగారింట మకాం పెట్టింది. అయినా నాయుడు లెక్కచేయలేదు. తన మనస్సుకు తప్పుకాదనుకున్న దానిని చెయ్యడంలో ఎవ్వరినీ లెక్కచేయననుకొంటాడు. కూతురుకు చిన్నప్పటి నుంచీ అదే తరిఫీదునిచ్చాడు. ఆ పాఠమే కూతురు వప్పచెప్పే సరికి నాయుడుకు కోపం వచ్చింది. "స్వరాజ్యం నువ్వు చిన్నపిల్లవూ, చితకపిల్లవూ కాదు. ప్రపంచం చూసేవు. చదువుకొన్నావు......" "చదువుకుంటే మనమూ మనుష్యులమేననే మాట మరిచిపోవాలా?" కూతురి అభిప్రాయం ఏమిటో తెలియక ఒక్క నిముషం నాయుడు ఆగేడు. "ఏమీ కాదు. ఎరిగి మసులుకోవాలి, అంతే! ఇంట్లో నువ్వొక్కర్తెవు. మీ అమ్మయినా లేదు. అతడు పరాయివాడు. మీ మనస్సులు ఎంత నిర్మలమైనవయినా....." "ఆయనను నేను పరాయివాడనుకోవడం లేదు." నాయుడు ముఖం వెల్లనయింది. "ఏమిటీ....?" స్వరాజ్యం జోడు కరిచింది. "మేము పెళ్ళి చేసుకోవాలనుకొంటున్నాం." నాయుడు మరి పట్టలేకపోయేడు. ఖణేల్మన్నాడు. "ఛట్‌! నోర్ముయ్‌!" స్వరాజ్యం లేస్తూ కుర్చీని వెనక్కు తోసేసి నిలబడింది. "ఎందుకు?" నాయుడు వణికిపోతున్నాడు. "కూర్చో." ఆ అదిలింపుకు కంగారుపడి స్వరాజ్యం చటుక్కున కూర్చుంది. "చెప్పండి. ఎందుక్కూడదు?" దెబ్బలాట వలన ఆ సమస్య తేలేదీ, పెట్టేదీ కాదు. సర్దుకొంది. అదేదో తేల్చుకోవాలన్నట్లుంది ఆమె కంఠం.... నాయుడు అనాలోచితంగా అనేశాడు. "మీ కులాలు ఒకటి కావని ఎరుగుదువా?" "కులాల పట్టింపు మీకెప్పటినుంచి?" అబ్బాయి నాయుడీమారు నిర్వాక్కుడే అయ్యాడు. పెద్దతనం, రోగిష్టితనం వచ్చి పల్లెటూరు చేరేక వచ్చేయిగాని, ఇన్ని అనుమానాలు, రాజమండ్రిలో వున్నంతకాలం అసలు ఆమాట చొరనివ్వలేదు. పంతులుగారు చేసిన ప్రతి సంస్కరణ వివాహానికి హాజరయ్యేడు. వాళ్ళతో భోజనాలకు కూర్చున్నాడు. రఘుపతి వెంకటరత్నం నాయుడుగారిని చూపించి కులాల తేడాలను హాస్యం చేసేడు. తన కూతురు పదిహేను-పదహారేళ్ళు వచ్చేవరకూ ఆ వాతావరణంలో పెరిగింది. ఆ వాదనలలో జ్ఞానం సమకూర్చుకుంది. ఇప్పుడామె ముందు కులాల తేడా తేవడం నాయుడు తగ్గేడు. "పెళ్ళి అయి, పెళ్ళాం సజీవంగా వున్నవాడు......" "నాకూ అయింది......" తమ వివాహాలు ఒకే దశలో వున్నాయంటున్న కూతురుకు ఏం సమాధానం ఇవ్వాలో నాయుడుకు అర్థం కాలేదు. అమలాపురంలో జరిగిన ఘటనలను తాను చెప్పినప్పుడు నాయుడు ఎంతో నొచ్చుకున్నాడు. రామనాధం సహృదయతను వాళ్ళు దురుపయోగం చేస్తున్నారన్నాడు. ఆ స్థితిలో మళ్ళీ పెళ్ళి చేసుకోవడం ఏమాత్రం తప్పు కాదన్నాడు. బహుశా రామనాధం మీద స్వరాజ్యం మనసు పెట్టుకోడానికి తండ్రి అభిప్రాయాలే ప్రధాన కారణం అయితే కావచ్చు. అటువంటివాడు ఇప్పుడు రామనాధానికొక మారు పెళ్ళి అయివుండడం అతని అనర్హతగా చెప్తే..... కాని అబ్బాయి నాయుడు ఆమె ఆలోచనలు వేటినీ అంగీకరించలేదు భిన్నకులాల మధ్య సంబంధం... ఇద్దరూ పెళ్ళయినవాళ్లు..... ఇద్దరికీ వివాహాలు భగ్నం అయిపోయినట్లే..... అయినా ఇద్దరికీ రెండో పక్షం వారు సజీవంగా వున్నారు. ఇద్దరికీ కూడా విడాకులు చట్టరీత్యా సాధ్యం కాదు. ఆచారాలరీత్యా మారు మనువులు లేని కులాల వాళ్ళే ఇద్దరూ.... వాళ్ళ సంబంధాన్ని ప్రజలు వివాహాలుగా గుర్తించరు. వ్యభిచారం అంటారు. "ఉంచుకొన్నాడంటారు. దానికదే పేరు. ఫలానా నాయుడు కూతుర్ని ఎవడో లేవదీసుకుపోయేడంటారు....." ఆ ఆలోచననే అతడు సహించలేకున్నాడు. కాని, కూతుర్ని ఒప్పించడం ఎల్లాగో తెలియదు. ఆమె వాదనలను కాదనలేడు. "నేను నీ కూతురునై వుండడం ఒక్కటేనా అభ్యంతరం......?" అని అడుగుతున్న ఆమెకేమి సమాధానం ఇవ్వగలడు? అతడు గతంలో అనేకమంది విషయంలో బాగున్నాయని సమ్మతించిన అనేక విషయాలకన్న ఈ పెళ్ళికి ఎన్నోరెట్లు బలీయమైన అనుకూల్యాలు వున్నాయి. నిజమే. కూతురు చెప్పవలసిన పనేముంది? రామనాధం అందగాడని తన భార్య ఎన్నోమార్లంది. ఆరోగ్యవంతుడు. మంచి చదువు వుంది, సంఘ సంస్కరణ దృక్పథం వుంది. దేశం అంటే ప్రేముంది. నాయుడు అభిమానించే అన్ని లక్షణాలూ వున్నాయి. కాని అతనిని కూతురు వరుడుగా అంగీకరించలేకున్నాడు. చేతకావడం లేదు. ఆ అభ్యంతరం ఏమిటో ఆలోచనకు అందడం లేదు. కూతురు ఎంచుకున్న వరుడు కన్న తాను మంచివాడిని తేగలడా అంటే..... స్వరాజ్యం చివరకు అనునయంగానే చెప్పింది. "అలవాట్లనీ, ఆచారాల్నీ ధిక్కరించినా, ప్రశ్నించినా ఎవరయినా ఈ చిక్కుల్ని ఎదుర్కోవలసిందే, మీరు నాకు పెళ్ళి చేయడానికి సిద్ధంగా వున్నారు. కాని ముక్కూ, మొగం ఎరగనివానినెవరినో తెచ్చి....." నాయుడు ఇంకా సర్దుకోలేకనే వున్నాడు.-- "ఈయనగారిని గురించి నువ్వేం ఎరుగుదువు?" "ఒక ఏడాది నుంచి నేనెరుగుదును. అంతకన్నా మేమిద్దరం ప్రేమించుకొంటున్నాం." మళ్ళీ అదే సమస్య. అదే అభ్యంతరం. అదే నిరుత్తరత. సమాధానం చెప్పలేక మనస్సు ఉడికిపోతూంది. ఏమీ చెయ్యలేని అశక్తత వలన మనస్సు మరిగిపోతూంది. అబ్బాయి నాయుడు గుడ్డి కళ్లు మూసుకొని ఎంతో సేపు అలాగే కూర్చుండిపోయేడు. మధ్యలో కూతురు లేచి వెళ్ళిపోవడాన్ని కూడా అతడెరుగడు. ముప్ఫయ్యొకటి మంచం ఎటున్నదో, మనిషి తల ఎటు పెట్టుకున్నాడో మనసులోనే అంచనాలు కట్టుకొని అబ్బాయి నాయుడు కర్ర ఎత్తేడు. ఒక్క దెబ్బతో తల పగిలిపోవాలన్నంత కసితో కర్ర లేచింది. --మనోవ్యాపారాలు స్తంభించినట్లయి చాలసేపు అలాగే కూర్చుండిపోయాక నాయుడికి హఠాత్తుగా తెలివి వచ్చినట్లయింది. ఇంట్లో ఎక్కడా అలికిడి వున్నట్లే లేదు. పిలిస్తే స్వరాజ్యం పలకలేదు. ఏమయింది? ఇంట్లోనే ఉన్నదా? లేచి మండువా సావిట్లోకి వచ్చేడు. ఎక్కడా చప్పుడు లేదు. ఆయనకు మనస్సులో ఎంతో భయం కలిగించింది. కూతురు ఇంట్లో వుందా? లేక..... వెంటనే రామనాధం వున్నాడా అనిపించింది. నెమ్మదిగా వీధి తలుపు గడియ తీసేడు. మంచం ఎక్కడున్నదీ కంటికి కనిపించకపోయినా మనస్సుకు తెలుసు. జాగ్రత్తగా ఆలకించేడు. వూర్పు తీసికొంటున్న చప్పుడు వినిపించింది. రామనాధం వున్నాడు. కనక స్వరాజ్యమూ వుండే వుంటుంది. ఆమె ఇల్లు విడిచి అతనితో వెళ్ళిపోయిందేమోనన్న భయం తీరాక ఇప్పుడు మరో భయం పట్టుకుంది. తన గుడ్డితనాన్ని ఆసరా చేసుకొని వాళ్ళు..... అటువంటి ఆలోచనను కూడా భరించలేకపోయేడు. వెర్రెత్తినట్లయిపోయింది. ఆ కక్షతో తాను వచ్చేసరికి తలుపులు లోపలి వేపునే వేసి వున్నాయనే మాట తోచలేదు. వాళ్ళిద్దరూ ఏకశయ్యాగతులయి వుంటారనే ఆలోచన మిగిలిన మానసిక వ్యాపారాలన్నింటినీ స్తంభింపచేసింది. తన ప్రతిష్ఠనూ, కుటుంబ ప్రతిష్ఠనూ ధ్వంసం చేయడానికి వచ్చిన ఈ ముల్లును తీసివెయ్యాలనే కసి ఒక్కటే సర్వగ్రాసిగా నిలిచింది. ఇంట్లోకి వచ్చేటప్పుడు గుమ్మం మూలలో విడిచిపెట్టే కర్రను చేతిలోకి తీసుకున్నాడు. కాని ఎత్తిన కర్రను చేతిలోంచే వెనక నుంచి ఎవరో లాగివేసేసరికి నాయుడు తూలిపోయేడు. "ఏమిటీ దురంతం. నిండుప్రాణం తీసేద్దువే....." అంటూ వెనుక నుంచి స్వరాజ్యం గొంతు వినిపించింది. దూరంగా విసిరేసిన కర్ర నేలబడిన చప్పుడు. నాయుడు అరుగు మీద చతికిలపడిపోయి రోదించేడు. "నా కూతురు ఎవడికో వుంపుడుకత్తె గావలసిందేనా భగవంతుడా?" ఆ గంద్రగోళం విని లేచి కూర్చున్న రామనాధానికి నాయుడు ఆవేశమూ, స్వరాజ్యం రొప్పూ అర్థం కాలేదు. ఆయన మాట కూడ చాలాసేపటి వరకు అర్థం కాలేదు. అర్థం అయిన తర్వాత రామనాధం తల్లక్రిందులయిపోయాడు. ఎంతో సిగ్గనిపించింది. దుఃఖమూ కలిగింది. "అదేమిటి నాయుడుగారూ! అటువంటి మాట ఎందుకు వచ్చింది? నేను స్వరాజ్యాన్ని పెళ్ళి చేసుకొందామని చెప్పడానికే వచ్చానండీ." నాయుడు ఎంతో ఉక్రోషం కనబరిచేడు. ఆక్రోశం వెల్లడించేడు. "మీకు పెళ్ళేమిటి? మీది పెళ్ళీ కాదు, పెటాకులూ కాదు. దాని పేరు....." ఎంతో అవమానకరంగా వినిపించే ఆ మాటను నొక్కి నొక్కి పలకడంలో నాయుడు సంతృప్తి కనబరుస్తూంటే రామనాధం చెవులు మూసుకొన్నాడు. "నా వలన స్వరాజ్యానికి అవమానం కలగనివ్వనండి. కలగదండి!" "పెళ్ళి! మీకు పెళ్ళి." అనుకుంటూ అబ్బాయి నాయుడు లేచి లోపలికి నడిచేడు. రామనాధానికి అనుమానం కలిగింది. తానూ లేచాడు. స్వరాజ్యానికి నాయుడు ఏమన్నా అపకారం తలపెడతాడేమో, నాయుడు వెనుకనే అంత దూరంలో అతడూ ఇంట్లోకి నడిచేడు. కాని, నాయుడు అటువంటిదేమీ తలపెట్టలేదు. భారంగా కాళ్ళు ఈడ్చుకుంటూ తన గదిలోకి పోయి తలుపు వేసుకొన్నాడు. స్వరాజ్యం ముందే తన గదిలోకి వెళ్ళిపోయింది. రామనాధం మండువా అంచున వెన్నెల పొడలో ఒక్క నిముషం నిలబడి ఆలోచించేడు. ఏమిటీ గంద్రగోళం! ఈ ఘట్టం ఎందుకు వచ్చింది? ఇప్పుడేం చెయ్యాలి? అతనికి ఈషణ్మాత్రం కూడా అర్ధం కాలేదు. స్వరాజ్యం స్థితి ఏమిటి? ఆమె ఇంత గంద్రగోళం జరిగేక కూడా తన మొదటి ఆలోచనలోనే వుంటుందా? వెనక్కి తగ్గుతుందా? రామనాధం స్వరాజ్యంతో మాట్లాడి తేల్చుకోవాలని నిర్ణయించుకొన్నాడు. ఆమె గదిని అతడెరుగును. గబగబ అటు నడిచేడు. గదిలో కిటికీ వద్ద మంచంమీద వెన్నెల పొడలో స్వరాజ్యం పడుకొని వుంది. అతని రాక నెదురు చూస్తున్నట్లు తల ఎత్తింది. దగ్గరకు రాగానే కూర్చోమన్నట్లు చోటు ఇస్తూ పక్కకు జరిగింది. మంచంమీద కూర్చున్న అతని ఒడిలో తల పెట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. అతడామెను చేతులలోకి తీసుకొని కళ్ళు తుడిచేడు. "కోపం తెచ్చుకోకండి. నన్ను వదలి పోవద్దు" అంటున్న ఆమె పెదవుల్ని ముద్దు పెట్టుకున్నాడు. అతనిని చుట్టుకొని, గుండెలపై తల పెట్టుకొని కరుచుకుపోయిన ఆమె తల, వీపు నిమురుతూ రామనాధం చాలసేపు ఆమెను ముద్దులతో నింపేసేడు. "నిన్ను వదలి ఎక్కడికి పోతాను స్వరాజ్యం. నీకు పెళ్ళి చేయాలని మీ నాన్నగారు సంబంధాలు చూస్తున్నారని తెలిసి ఈ పది రోజుల నుంచీ నేను పడ్డ తపన నీకు ఎల్లా చెప్పమంటావు? నీ ఇష్టం మీదనే ఆయన సంబంధాలు వెతుకుతున్నారని ఎంతో అభిమాన పడ్డాను. స్వరాజ్యం! నువ్వు నాదానివని గ్రహించేక ఏ అవమానాలూ, ఎవరి అయిష్టాలూ నన్ను కదిలించలేవు." కన్నీళ్ళతోనే తల ఎత్తి అతని కళ్ళలోకి చూస్తూ ఆమె అతని కంఠం కౌగలించుకొంది. ఇద్దరూ చాలాసేపు అలాగే వుండిపోయారు. సావిట్లో చప్పుడైనట్లయింది. స్వరాజ్యం తాచుపాములా తల‌ ఎత్తి ఆలకించింది. "ఎవరది?" --అంటూనే స్వరాజ్యం మంచం దిగింది. నాయుడు కంఠం. "మేలుకొని వున్నావా?" రామనాధం మంచం దిగి గుమ్మంవేపు అడుగు వేస్తూ స్వరాజ్యాన్ని చేయి పట్టుకు వెనక్కి లాగేడు. కాని, ఆమె అతని దారికడ్డంగా నిలబడింది. "ఈమారేం తరవాయి, కత్తి తెచ్చేవా?" నాయుడు ఒక్క నిముషం మాట్లాడలేదు. స్వరాజ్యం గద్దించింది. "మాట్లాడవేం?" "రామనాధంగారూ!' నాయుడు కంఠంలో తప్పనిసరి పరిస్థితులకు సర్దుకోక తప్పదన్న భావం వినిపించింది. తానా గదిలో వున్నట్లు ఆయన వూహను స్థిరపరచడమో, మానడమో తేల్చుకోలేక రామనాధం ఒక్క క్షణం తటపటాయించేడు. అతని సమాధానం కోసం ఎదురు చూడకుండానే నాయుడు తన నిర్ణయం తెలిపేడు. "మీరిద్దరూ ఇంట్లోంచి తొందరపడి వెళ్ళిపోకండి. పెళ్ళి చేసుకోండి." సమాధానం కోసం కూడా ఎదురుచూడకుండా నాయుడు వెనుతిరిగిపోయేడు. తిరిగిపోతూ విడిచిన దీర్ఘశ్వాసకు ఆ యిద్దరూ ముఖముఖాలు చూసుకొన్నారు. తమ భవిష్యత్తు అంత సులభంగా పరిష్కారం అవుతుందని వారు నమ్మలేకుండా వున్నారు. అంత సులభంగా పరిష్కారం కావడంతో కూడ ఏదో ఆశంక, అనిష్టభయం, ఆ భయాన్నుంచి ఒకరినొకరు కాపాడుకొనడానికి ప్రయత్నిస్తున్నట్లు పరస్పరం వొరుసుకుంటూ మంచం మీద కూర్చున్నారు. "నిజమేనా?" తెల్లవారేవేళ నాయుడు లేచిన చప్పుడు వినగానే రామనాధం-స్వరాజ్యం ఆయన గది గుమ్మంలో నిలబడ్డారు. వారి రాకను గమనించి నాయుడు మంచంమీది నుంచే సమాధానం ఇచ్చేడు. "ఏదో తప్పు చేస్తున్నట్లు ఎరిగివున్న వాళ్ళకి ముఖం మాటు చేసుకొనే మనఃస్థితి మీ పెళ్ళికి ప్రధానమయిన శత్రువు. మన సంఘంలో వున్న ఆచారాలూ, అలవాట్లూ ఆ మనఃస్థితికి మూలం, దాని నుంచి బయటపడి..." నాయుడు కంఠం గద్గదికం అయింది. ఆయన మాటలు అర్థంగాక గుమ్మంలో ఇరువురూ ముఖాలు చూసుకొన్నారు. "స్వరాజ్యాన్ని పెళ్ళి చేసుకోవడం నా పూర్వజన్మ సుకృతం అనుకుంటాను. కాని తప్పు అనే ఆలోచన......" నాయుడు ఒక నిట్టూర్పు విడిచేడు. "నువ్వనుకుంటే వచ్చే ఆలోచన కాదు అది. మన అంతరాంతరాలలో అణగివున్న మన సాంప్ర్రదాయిక ఆలోచనల ప్రభావం మన బ్రతుకులలో ఎప్పుడు, ఏ రూపంలో బయటపడుతుందో చెప్పలేము. కానీండి.... వివాహం ఆలోచనలో వుండండి... కాని, కాని...." ఆ వివాహాన్ని సంఘం వొప్పుకోదు. చట్టం వొప్పుకోదు. ప్రాచీన సంప్రదాయ పద్ధతి వారి వివాహ బంధాన్ని కూర్చలేదు. ఆధునిక సంప్రదాయం అంటూ ఏర్పడలేదు. ఆ విషయం నాయుడికి అప్పుడుగాని అర్థం కాలేదు. "నా ఆశీర్వచనం ఒక్కటే వీరిని సుఖవంతులు చేయగలుగుతే...." కానీ చేయగలుగుతుందనే ఆశ లేదనిపించింది. అంతలో లోపలి నుంచి ధ్వని విని ఆ యువదంపతులు ఒక్క నిట్టూర్పు విడిచి వెనుతిరిగేరు. మూడోభాగం ఒకటి ఆ సమయంలో రావలసిన రైలు ఏదీ లేదు. కాని బెజవాడ స్టేషను జనంతో కిటకిటలాడుతూ వుంది. అఖిలభారత కాంగ్రెసు కమిటీ సమావేశం ఈమారు బెజవాడలో జరుగుతుంది. సమావేశాలకు దేశం నలుమూలల నుంచీ నాయకులు వస్తున్నారు. వారిని చూడడానికీ, వారి వుపన్యాసాలు వినడానికీ తెలుగు దేశమే తరలి వస్తూంది. వస్తూన్న జనాన్ని సర్దడానికీ, నాయకుల ఏర్పాట్లు చూడడానికీ రాష్ట్రం నాలుగు చెరుగుల నుంచీ ఉత్సాహవంతులయిన యువకులు వందల సంఖ్యలో వచ్చేరు. వచ్చిన వాళ్ళనీ, వస్తున్న వాళ్ళనీ, రాగల వాళ్ళనీ కనిపెట్టి వుండడానికీ వాళ్ళ మనస్సులలో భయం కలిగించడానికీ రాష్ట్రం అన్ని మూలల నుంచీ పోలీసుల్నీ, పోలీసు ఆఫీసర్లనీ అధికార్లు రప్పించేరు. స్టేషనులో ప్లాట్‌ఫారం మీద డేరాలు బిగించి వాళ్ళని దింపేరు. అప్పుడే స్టేషన్‌లో అడుగుపెట్టిన రామనాధం ప్లాట్‌ఫారం మీద ఒక చోట జనం పోగుపడి వుండడాన్ని గమనించి అటువేపు నడిచేడు. గోదావరి జిల్లా నుంచి వచ్చిన కొంతమంది వాలంటీర్లకు అతడిని కెప్టెనుగా చేసి స్టేషను వద్ద వుంచేరు. వస్తూన్న నాయకుల్ని ఆహ్వానించి వారికి నిర్ణయించిన బసలకు దిగబెట్టడం పని అతని దళానికి వప్పచెప్పేరు. అంతక్రితమే ఒక బండి వచ్చింది. దానిలోంచి దిగిన నాయకులు నలుగురైదుగురిని బసలకు పంపేడు. అంతట్లో వచ్చే రైలేదీ లేదు. స్వరాజ్యాన్నీ, మరో ఇద్దర్నీ స్టేషనులో వుంచి అతడు కొద్దిసేపు స్టేషను వెలుపలికి వెళ్ళేడు. రావడం కొంచెం ఆలస్యమయింది. బహుశా ఏదన్నా బండి వచ్చిందేమో? ఎవరన్నా నాయకులు దిగేరేమో? అనుకుంటూ జనసమ్మర్ధం వేపు గబగబా నడిచేడు. కాని, అక్కడ చూచిన దృశ్యం అతనిలో మంటలు పుట్టించింది. స్వరాజ్యాన్ని ఒక పోలీసువాడు గదిమి నెట్టుతున్నాడు. ఆమె ఏడ్పు మొగం పెట్టి బిక్కు బిక్కుమంటూ దిక్కులు చూస్తూంది. ఆమె కదలడానికి నిరాకరిస్తూంటే పోలీసువాడు భుజంమీద చెయ్యేసి నెట్టుతున్నాడు. చుట్టూ జనం వున్నారు. అందరి మొహాలు క్రోధఘూర్ణితంగా వున్నాయి. గొణుగుతున్నారు. జరుగుతున్న ఘటనకు దిగ్భ్రమ చెంది నిస్సహాయంగా చూస్తున్నారేగాని, ఇదేమనలేకుండా వున్నారు. మొదట ఎవరో పోలీసువాడు ఒక పల్లెటూరి అమ్మాయిని బెదిరిస్తున్నాడనే ఆలోచనలతో ఆమెను విడిపించడానికి రామనాధం జనంలో దూరేడు. లైటు స్థంభాన్ని పెట్రోమాక్సు లైటు వెలుగుతున్న జనం నీడలలో ఆమె ఎవరో అతనికి మొదట అర్థం కాలేదు. అర్థం అయ్యేందుకు అందులో పెద్ద విశేషం ఏమీ లేదు. కాని, అటువంటి సంఘటన జరిగే అవకాశం వున్నదని ఎవరూ వూహించలేదు. అందుకే ఆ దిగ్భ్రమ. స్టేషన్‌లో స్వరాజ్యం ప్రొద్దుటి నుంచీ వుంది. అందరూ చూస్తూనే వున్నారు. కాని పోలీసువాడి అభిప్రాయం వేరు. ఆమె వేట కోసం స్టేషన్‌లో కాపలా వేసిందని ప్రకటించి స్టేషనుకు నడవమన్నాడు. సమాజంలో ఆస్తిపాస్తులనే కాదు, నీతినియమాలను కాపాడవలసిన పూచీ కూడ పోలీసు శాఖ మీదనే వుంది. అందుచేతనే ఆమె ప్రతిఘటించినా లెక్కచేయకుండా తిట్టి, తోసి అయినా పోలీసుస్టేషనుకు తీసుకుపోయే ప్రయత్నంలో వున్నాడు. సభలకి వస్తున్న జనానికి, నాయకులకూ స్వాగతం చెప్పడానికై వచ్చిన వాలంటీరునంది ఆమె. ఆమె కట్టుకున్న ఖద్దరు చీర ఆమెకు గట్టి సాక్ష్యమే. కాని, పోలీసువాని ఆరోపణలో ఆమె నిలువ చచ్చిపోయింది. కళ్ళనీళ్ళు పెట్టుకొని, నోటమాట లేకుండా నిలబడిపోయిన ఆమెను పోలీసువాడు సులభంగానే అదిలించేసేడు. వాని చేతిలోని కర్రనూ, రాష్ట్రం నలుమూలల నుంచీ వచ్చి స్టేషనులోనూ, చుట్టూనూ, డేరాలు బిగించి, బైఠాయించి వున్న పోలీసు బలగాన్నీ చూస్తున్న జనం అసలు విషయం తెలిసినా పోలీసువాని చేతి నుంచి ఆమెను కాపాడగల స్థితిలో లేరు. కాని ఆమెను గెంటుతూన్న పోలీసువాడు ఎంత అరచినా దారి మాత్రం ఇవ్వకుండా కమ్ముకొని నిలబడి వున్నారు. రామనాధం వస్తూనే పోలీసువానిని గద్దించాడు. "ఏయ్‌, ఏమిటిది?" జరుగుతున్నదేమిటో తెలియకపోయినా, పోలీసువాళ్ళ మంచితనంమీద ఏమాత్రమూ నమ్మకం లేని రామనాధం ఆ పోలీసువాడు ఏ పల్లెటూరి మనిషినో అల్లరి పెడుతున్నాడని మాత్రమే అనుకున్నాడు. ఎర్ర టోపీని డబాయించగల మనుష్యులింకా తెలుగుదేశంలో పుట్టలేదనుకుంటున్న పోలీసువాడు ఆ అదిరింపు తననే అనుకోలేదు. కాని, ఆ కంఠం విని జనం విరగబడి చూసేరు. వారి కంఠాలలో అమ్మయ్య అన్నమాట వినిపించింది. "వాళ్ళ నాయకుడు వచ్చేరు." --అన్నమాట నలుమూలలా వినిపించింది. అతనికి దారి ఇచ్చేసేరు. రామనాధం వస్తూనే ఆమె భుజంమీద వున్న పోలీసువాని చేయి లాగేశాడు. "ఏమిటిది?" అప్పుడు చూసేడు. స్వరాజ్యం! అతని మనస్సు భగ్గుమంది. ఒక్క అడుగులో ఆమె ముందుకు వచ్చేసేడు. తన చేతి నుంచి జారిపోతున్న ఆమెను పట్టుకోడానికి పోలీసువాడు అడుగు ముందుకు వేసేడు. రామనాధం మరి కోపం పట్టలేకపోయేడు. మీదకు వస్తున్న పోలీసువానిని గుండెలమీద చెయ్యేసి ఒక్క త్రోపు త్రోసేశాడు. వాడు తూలిపోయి జనంమీద పడ్డాడు. మరుక్షణంలో పోలీసువాని స్పర్శను భరించలేని జనం ఎవరికి వారు తమ మీద పడ్డప్పుడు త్రోసివేస్తూ వెనక్కి తప్పుకొన్నారు. ఒక్క క్షణకాలంలో జరిగిపోయిన ఈ ఘటనకు పోలీసువాడు నిర్వాక్కుడయిపోయాడు. ఒక్క నిముషం జనం ఎటు తోస్తే అటు తూలిపోయాడు. మధ్యలో ఒకమారు సాయం కోసం ఈల వూదబోయేడు. కాని, అది నోటి వరకూ వెళ్ళక పూర్వమే ఎవరో దానిని గుంజేశారు. ఆ గుంజుబాటులో ఈల, అది తగిలించిన బొత్తామూ సహా ఊడిపోయేయి. మరుక్షణంలో ఆ ఈల ఎక్కడో రైలు పట్టాల మీద పడి కంగుమంది. స్వరాజ్యానికి కలిగిన అవమానానికి ఉద్రిక్తుడై రామనాధం చొక్కా చేయి పైకి తోసి ముందుకడుగువేసేడు. "వీడి నెత్తురు కళ్ళచూస్తా." పోలీసువాడు ఆ వ్యవధిని రామనాధానికివ్వలేదు. నోటి వద్దకు వచ్చిన ఈల ఎగిరిపోగానే గొల్లుమన్నాడు. "హెల్ప్‌! హెల్ప్‌!" మరుక్షణంలో రంగం మీదికి హాజరయన పోలీసు ఆఫీసరును చూసేసరికి రామనాధానికి అసలు విషయం అర్థం అయింది. స్వరాజ్యాన్ని అల్లరి పెట్టడానికి మూలకారణం తన మీద వున్న కసి. చేతిలో రివాల్వరును జడిపిస్తూ వచ్చినవాడు అమలాపురం సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ నారాయణమూర్తి, రామనాధం మామగారు. రెండు రోజుల నుంచీ వలంటీరు దళంలో స్టేషనుకు వస్తూ పోతూన్న రామనాధం ఆయనను ఎన్నోమార్లు అక్కడ చూసేడు. ఆ రోజు ఉదయమే రైలులో వచ్చిన స్వరాజ్యానికి రామనాధం ఎంతో ప్రేమతో ఎదురు వెళ్లినప్పుడు ఆయన అక్కడే వున్నాడు. మధ్యాహ్నం ఆమె అతని దళంతోనే స్టేషనుకు వచ్చింది. ఆ నవదంపతుల హావభావాలను గమనించేడు నారాయణమూర్తి. కొత్త వూరు, పని కొత్త. ఉత్సాహం వున్నా బెరుకు, ఆమె ప్రతి చిన్న పనికీ రామనాధంవేపే చూస్తూంది. అతని మీదనే ఆధారపడుతోంది. అలాగ అధారపడడం కూడా అతనికి ఉత్సాహంగానే వుంది. ఎండలో ముఖం కంది, చెమటలు పట్టినప్పుడు తన జేబు రుమాలు ఇచ్చేడు. దాహంగా వుందంటే మంచినీళ్ళు తెచ్చిపెట్టేడు. అవన్నీ నారాయణమూర్తి చూస్తూనే వున్నాడు. వారిద్దరినీ పక్క పక్కనే చూస్తూంటే నారాయణమూర్తి మనస్సు తుకతుకలాడిపోయింది. కాని ఏమీ చేయలేకపోయేడు. ప్రజల్ని రెచ్చగొట్టే పనులేవీ చెయ్యరాదని పోలీసు అధికారులలో ఆలిఖితములయిన ఆదేశాలు ప్రచారంలో వున్నాయి. దేశం అంతటి నుంచీ కాంగ్రెసు నాయకులు బెజవాడ వస్తున్నారు. కలకత్తా స్పెషల్‌ కాంగ్రెసు తరవాత నాగపూరు మహాసభ నాటికీ, ఆనాటి నుంచి బెజవాడ కాంగ్రెసు కమిటీ సమావేశం నాటికీ కాంగ్రెసులో గాంధీజీ పలుకుబడి పెరుగుతూ వస్తూంది. ఆయన సహాయ నిరాకరణ సూత్రానికి కాంగ్రెసును అనుబద్ధం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వానిపై నిర్ణయాలు తీసుకోవలసిన చరిత్రాత్మక సమావేశం జరగనుంది. తెలుగుదేశమే కాదు, యావత్తు భారతదేశమూ బెజవాడవేపు చూస్తూంది. ఆ దిశగా కదులుతూంది. బెజవాడకు జనం రాకుండా చేసేందుకు టిక్కట్లు ఇవ్వవద్దని అధికార్లు ఆదేశాలిచ్చారు. ఈమారు జనం టిక్కట్లు లేకుండానే రైళ్లెక్కేస్తున్నారు. అలా ప్రయాణం చేస్తున్న వాళ్ళని బాధించడానికై కర్కోటకులైన టిక్కెట్టు కలక్టర్లనీ, వాళ్ళకి వత్తాసుగా పోలీసు బలగాన్నీ స్టేషనుకు తెచ్చేరు. ఈమారు జనం మరో అడుగు ముందుకేసేరు. స్టేషను సమీపిస్తూందనగానే గొలుసు లాగి, బండి ఆపి జనం దిగిపోయారని అప్పుడే వార్త వచ్చింది. లేక వారంతా స్టేషనులోనే దిగినా వారిని ఆపగల శక్తి తమకు లేదని అధికార్లు ఎరుగుదురు. ఆ రహస్యం ఇంకా ప్రజలకు తెలియదు. తెలియనిచ్చే వుద్దేశం అధికార్లకు లేదు. అందుచేతనే నారాయణమూర్తికి మనస్సులో ఎంత క్రోధం వున్నా తొందరపడలేదు. ఆ కసీ, కోపం, ద్వేషం అడుగడుగునా పొంగేయి. సాయంకాలం చీకటి పడే వేళ తన కసి తీర్చుకొనేటందుకు అవకాశం కనబడింది. ఆ కోపం తీర్చుకోవడానికి స్వరాజ్యమే ఆయనకు కనిపించింది. సాయంకాలం ఆమె ఒక్కర్తే స్టేషనులో వున్నట్లు చూసేడు. రామనాధం లేడు. మరొకళ్ళిద్దరు వలంటీర్లూ, జనం వున్నా భయం లేదనుకున్నాడు. ఆ అవకాశం చూసుకొని నారాయణమూర్తి విషం కక్కేడు. హెడ్‌ కానిస్టేబులును పిలిచి స్వరాజ్యాన్ని ఈడ్చుకు రమ్మని పురమాయించేడు. ఆమె మగాళ్ళ వేటకోసం వచ్చిందని కారణం చెప్తూంటే ఆ హెడ్‌కానిస్టేబుల్‌ మీసాలలోనే నవ్వుకున్నాడు. సిగ్గూ, దుఃఖమూతో స్వరాజ్యానికి మాట రావడం లేదు. రామనాధాన్ని ఆతని వెనక జనాన్నీ చూసేక హెడ్డుకు కాళ్లు ఆడడం లేదు. కాని, చేతిలో రివాల్వరును వూగిస్తూ నారాయణమూర్తి రంగం మీదికి వచ్చేసరికి జనం నిలబడిపోయేరు. హెడ్‌కు ధైర్యం పుంజుకుంది. నారాయణమూర్తి గర్జించేడు. "కదిలేరంటే కాల్చేస్తా!" "వీడు నన్ను కొట్టేడండి" అంటూ హెడ్‌ రామనాధం చెయ్యి పట్టుకున్నాడు. వెంటనే స్వరాజ్యం ఆ చేతిని విసిరికొట్టి తానాతని పక్క నిలబడింది. "ముట్టుకుంటే జాగ్రత్త" అని కళ్ళు ఎర్ర చేసింది. పరిస్థితులలో వచ్చిన మార్పుతో ఆమెలో భయం, సంకోచం ఎగిరిపోయేయి. పరిణామాల వేగానికి ఒక్క క్షణం నిస్తబ్ధుడుగా నిలబడ్డ రామనాధం ఆమె స్పర్శకు తేరుకున్నాడు. ఆమె జాగ్రత్త చెప్తూంటే ఆప్యాయంగా భుజంమీద చెయ్యి వేసి దగ్గరకు తీసుకున్నాడు. ఆ జంటను చూస్తూంటే నారాయణమూర్తి తల తిరిగిపోయింది. చేతిలో రివాల్వరు నిలబడింది. రివాల్వరు ఝుళిపిస్తూ ఎదుట నిలుచున్న సర్కిల్‌ను చూడగానే రామనాధానికి తమ బాంధవ్యం, తమ ద్వేషాలు మనస్సులో మెదిలేయి. మనస్సులో పేరుకున్న అసహ్యంలో ఎదుటనున్న ఆ వ్యక్తి పురుగులా కనిపించేడు. ఆ ఆయుధం క్షణంలో తన్ను చంపగలదనే ఆలోచన ఆ అసహ్యం ముందు ఒక లెక్క అనిపించనే లేదు. "కాలుస్తావేం?" తన భుజం పట్టుకున్న స్వరాజ్యం చేయి విడిపించుకొన్నాడు. చొక్కా గుండీలు వూడదీస్తూ ఒక్కడుగు ముందుకు వేసేడు. "ఏదీ కాల్చు." ఎవ్వరి ముఖానా నెత్తురు లేదు. నోట మాట లేదు. అందరి చూపులూ నిగనిగలాడుతున్న ఆ రివాల్వరు గొట్టంమీదనే వున్నాయి. రామనాధం మరో అడుగు ముందుకు వేసేడు. అతని ప్రక్కనే స్వరాజ్యం. ఆమె తోడ్పాటుతో అతడు మృత్యువుని ధిక్కరించడానికి కూడా లక్ష్యం చేయనట్లు కనిపిస్తున్నాడు. చొక్కా రెండు చేతులతో విడదీసేడు. "చూస్తావేం కాల్చు." మృత్యువుకు గుండెలిచ్చి నిలబడ్డ రామనాధాన్ని చూస్తూంటే సర్కిల్‌ ఇనస్పెక్టరు ముఖం వెలవెలపోయింది. చావు యెడ చూపుతున్న నిర్లక్ష్యం రామనాధం ముఖంలో ఒక విధమైన ఉత్తేజాన్ని కలిగించింది. రివాల్వర్‌ గుర్రం మీదున్న వేలు వణుకుతూ వుంది. రామనాధం గదమాయింపుకే ఆ వేలు అదుముకొనేలా వుంది. నారాయణమూర్తి అతి కష్టం మీద నిగ్రహించుకోగలిగేడు. రివాల్వరును నేలకు వాల్చేడు. జనం ఒక్కమారు వూర్పు తీసుకున్నారు. జయ జయ ధ్వనులతో స్టేషనంతా మార్మ్రోగుతూ వుంటే తల వాల్చుకొని నారాయణమూర్తి వెనుతిరిగిపోయేడు. పోలీసువానినీ, మృత్యువునూ ధిక్కరించిన ఆ యువకుణ్ని చూడడానికి జనం కళ్లు చాలలేదు. జనం మధ్య నలిగిపోతున్న స్వరాజ్యాన్ని ప్రక్కనే వున్న బల్ల ఎక్కించేడు. ఆమె ప్రక్కనే తానూ నిలబడి మహాజనానికి అభివాదన చేసేడు. జనం కీర్తించింది. "వందే.......మాతరం......" రెండు గాంధీజీ అభినందన వింటూన్నప్పుడుగాని రామనాధానికి తాను మృత్యువు యెడ చూపిన నిర్లక్ష్య భావం విలువ అర్థం కాలేదు. రాత్రి స్టేషనులో జరిగిన కథ వేయి ముఖాలుగా వ్యాపించింది. అది విన్న ప్రతి ఒక్కరూ అతనిని చూడడానికి ప్రత్యేక శ్రద్ధ చూపేరు. భేష్‌ అన్నారు. భుజం తట్టేరు. అయితే అవేవీ ఇవ్వలేని ఆనందాన్నీ, వుత్సాహాన్నీ కలిగించింది. తనను గాంధీజీ బస వద్ద నియమిస్తున్నామని కాళేశ్వరరావుగారు అన్నప్పుడు. తాను చేస్తున్నది సాహసకార్యం అని కూడా అతడు ఆ పని చేస్తున్నప్పుడు ఎరగనే ఎరగడు. దానికిగల తాత్విక ప్రాధాన్యం పెద్దలు జరిపిన చర్చలు విన్నప్పుడే అర్ధం అయింది. హింస, అహింస, సత్యాగ్రహం, స్త్రీల మర్యాద రక్షణ, వీరత్వం, ధీరత్వం అనేక సమస్యలు చర్చలోకి వచ్చేయి. తన యింట్లో ఆడవాళ్ళకి అవమానం జరుగుతూంటే వూరుకొనేవాడు మనిషే కాదన్నారు గాంధీజీ. అల్లాంటివాడు తండ్రి, తమ్ముడు, మగడు అనిపించుకొనే అర్హతను కోల్పోయాడని ఆయన సందేహానికి తావులేకుండా ఖరాఖండీగా తెలిపారు. మృత్యుదేవతకు ముఖాముఖీగా నిలబడి, ఎవ్వరికీ హాని తలపెట్టకుండా నిర్భయంగా మరణించగలవాడు వీరాధివీరుడని ఆయన చెప్పేరు. ఈ సమస్యలన్నీ తనను చూసినప్పుడల్లా నాయకుల బసలలో ఏదో రూపంలో చర్చకు వచ్చేవి. తనను గురించి అంత చర్చ జరగడము ఆతనికి ఆశ్చర్యమూ, గర్వమూ కూడ కలిగించింది. దానితోపాటు ఎన్నెన్నో సందేహాలు, దానికి ఎన్నో సమాధానాలు. స్వరాజ్యం భుజం నుంచి పోలీసువాని చేతిని లాగెయ్యడంలో మోతాదును మించి తీవ్రభావం చూపలేదుగదాయని ఆలోచనలో పడ్డ వాళ్లు లేకపోలేదు. అయితే పోలీసువానిని గుండెలమీద చెయ్యివేసి విసిరెయ్యడం మాంచి మగసిరి అయినపనిగా అభినందించిన వాళ్ళే ఎక్కువ. బంతితో ఆడినట్లు పోలీసువానిని అటూ ఇటూ గెంటివేసిన దృశ్యం తలచుకొని వలంటీర్లు చాలమంది ఆనందించేరు. రివాల్వరు ముందు గుండీలూడదీసి, గుండెలు చూపి నిలబడడం అసాధారణమైన వీరత్వం అన్నారు. కాని, ఆ ఘట్టం అంతా అతి సాధారణంగా జరిగిపోయింది. తన దృష్టిలో హింస, అహింసలూ, వీరత్వం, భీరుత్వం గురించిన ఆలోచనలు లేవు. ఆ విధంగా తప్ప మరొక విధంగా జరగడానికి వీలులేనంత సహజంగా అవి సాగిపోయాయి. అతని చేతిలో ఒక రివాల్వరే వుంటే ఫలితాలు ఎలా వుండనీ ఆ హెడ్‌ కానిస్టేబుల్ని కాల్చి పారేసేవాడినే అనుకొన్నాడు. రివాల్వరు లేదు గనక గుండె ఇచ్చి కాల్చమన్నానా అని అడిగితే అతడు ఖచ్చితంగా కాదని చెప్పేస్తాడు. అయితే వాళ్లెవరూ ఎరగనిదీ, అతడు బయటపెట్టనిదీ ఒక రహస్యం అతని మనస్సును అనుక్షణం కోసేస్తూంది. స్వరాజ్యాన్ని అవమానించాలనే భావం నారాయణమూర్తిలో కలగడానికి తన చర్యలే కారణమని అతని మనస్సు బాధపడుతూంది. తన మూలంగానే ఆమె అవమానం పాలయింది. ఆమె తన భార్య. చట్టం, ఆచారం అంగీకరించకపోయినా ఆమె తన భార్య. ఆ దృష్టితోనే ఆమెతో మెలగేడు. తన వ్యవహారంలో అనుచితమేదీ లేదు. వెకిలితనం లేదు. ఎండవేళ దాహం అనుకుంటే మంచినీళ్ళు స్వయంగా తెచ్చి యిచ్చేడు. ఆమెకు తమలపాకులు వేయడం అలవాటు, ఎప్పుడూ ఆమె కోసం ఒక కిళ్ళీ జేబులో వుంచుకున్నాడు. బుగ్గను కాటుక అంటుకుంటే తుడుచుకొనేటందుకు తన జేబు రుమాలు ఇచ్చేడు. ఎండలో ఎక్కడ అలిసిపోతుందోనన్నట్లు ఆమె మీదనే తన ప్రాణాలన్నీ నిక్షేపించేడు. కాని, ఆమె తన భార్య, సాంప్రదాయక పద్ధతిలో వివాహం చేసుకొన్నది కాదని నారాయణమూర్తికి తెలుసు. ఆమె ఎవ్వరో తెలియదు. కాని, సుందరి కాదు. సుందరితో తనకు తెగతెంపులు చేసినది ఆయనే. రాజకీయంగా తనకు వ్యతిరేక పక్షం వాడు. శత్రుకూటంలోని వాడు. ఆ శత్రుత్వాన్ని తన కుటుంబ జీవితంలోకి కూడా పాకించినవాడు. నారాయణమూర్తే. అతడెరుగును. అటువంటివాని ముందు తాను భార్యగా ఎన్నుకొన్న ఈమెను ప్రదర్శించడంలో ఆమె యెడ గౌరవం, ప్రేమ, అనుభూతి చూపడంలో ఒక విధమైన కసి తీర్చుకుంటున్నాననే భావం మనస్సులో ఒక్కక్షణం కలగకపోలేదు. నారాయణమూర్తీ, తానూ ఒకరితో ఒకరు సంబంధం వుండరాదనుకొన్నారు. కాని ఒకరినొకరు సాధించుకోవాలనే ఈ మనస్తత్వానికి కారణం ఏమిటి? తామిద్దరూ పోగడి స్వరాజ్యాన్ని అవమానం పాలు చేశామేయని రామనాధం ఎంతో బాధపడిపోయేడు. మరునాడు ఉదయం స్టేషనుకు వెళ్ళినప్పుడు రామనాధం స్వరాజ్యంతో సహా నారాయణమూర్తి గుడారాన్ని వెతుక్కుంటూ వెళ్ళేడు. స్వరాజ్యాన్ని పరిచయం చేసేడు. "ఈమె నా భార్య, మీరు ఎరగరు...." రామనాధం తనను ఎగతాళి చేయడానికి పనికట్టుకు వచ్చినట్లు మండిపడ్డాడు నారాయణమూర్తి. "ఎన్నో భార్య?" స్వరాజ్యం గతదినం తనకు అవమానం చేసినవాడు ఎవరో తెలిసేక మండిపడిపోతోంది. ఈ అవహేళనతో ఓర్పు కోల్పోయింది. "భర్తృత్యాగినిని భార్యగా చెప్పుకోవడం అవసరమైతే నేను రెండో దానిని...." నారాయణమూర్తి ముఖం జేవురించింది. "ఆతనికి నీవు అయినట్లే నీకు కూడా అతడు రెండో మగడేనా?" పరస్పరం అవమానించుకొనే ప్రయత్నంలో వారు ఎంతదూరం వెడతారోననిపించింది. వెంటనే రామనాధం కలుగచేసుకున్నాడు. "మీరు సరిగ్గానే గ్రహించేరు. అయితే మా ఇద్దరి మొదటి పెళ్ళిళ్ళూ చెడిపోయినందుకు మేము విచారపడ్డం లేదు. మేమిద్దరం ప్రేమించుకున్నాం. పెళ్ళి చేసుకున్నాం. మీ మనస్సులో మరెట్టి దురభిప్రాయాలూ మిగలకుండేందుకే నేనిప్పుడు వచ్చేను. మరి సెలవా?" మూడు ఒక ఆడకూతురు మర్యాదను కాపాడడంలో తాను చూపిన సాహసమే ఒక గాధ అయి, ఆనాటి చరిత్రాత్మక సమావేశాన్ని కల్లోలపరచడానికి కారణం కావడం రామనాధానికి ఎంతో ఆశ్చర్యమూ, బాధా కలిగించేయి. సమావేశంలో జనాన్ని సర్ది కూర్చోబెట్టవలసిన వలంటీర్లు ఆ రోజున వున్నట్టుండి హర్తాళ్‌ చేసేరు. వలంటీరు దళాల నాయకుడు యూనిఫారానికి జరిగిన ఒక అవమానానికి క్షమాపణ చెప్పుకొంటే తప్ప ఒక్క వలంటీరు పని చెయ్యడని ప్రకటించేడు. పని స్తంభించింది. జనాన్ని సర్ది కూర్చోబెట్టే వాళ్ళు లేకపోవడంచేత నాయకుల్ని చూడడానికీ, వారి మాటలు వినడానికీ వేదికమీదికి ఎగబడ్డారు. వారు ఏ నాయకుడినీ దగ్గర నుండి చూడ్డం పడడం లేదు. వారి మాటలు దగ్గరవాళ్ళకి కాని వినబడ్డం లేదు. కాని వలంటీర్లున్నప్పుడు, వారి సరిహద్దులు దాటడానికి వీలులేకుండా వుంది. ఇప్పుడు ఆ ఆటంకం లేకపోయేసరికి ప్రతి ఒక్కరూ ముందుకే తోసుకువచ్చేరు. అసంఖ్యాక ప్రజల ప్రేమాభిమానాలనుంచి గాంధీగారిని ప్రాణాలతో కాపాడడానికి వస్తాదు రాజు సోదరుల భుజదర్పం అవసరం అయింది. "నీ సాహసగాధ గాదు గాని, తెలుగుదేశానికి మహా అప్రతిష్ఠ చుట్టుకొని వుండేది" అన్నాడు వెంకట్రావు. గాంధీగారికి తప్పిన ప్రమాదాన్ని తలుచుకొని. "బెజవాడకు తీరని అప్రతిష్ఠ తెచ్చిపెట్టేవయ్యా దేముడా?" అన్నాడు బెజవాడ మిత్రుడొకడు. మ్యూజియం హాలులో ఎ.ఐ.సి.సి. సమావేశాలు. ఆ రోజు వుదయం దేశనాయకులు సభా స్థలానికి వెడుతున్న సమయంలో జరిగిన ఒక చిన్న ఘటన ఇంత ఉత్పాతం తెచ్చి పెడుతుందని ఆ క్షణంలో ఎవ్వరూ వూహించనుకూడా లేదు. రామనాధాన్ని ఆముదాల మిల్లు వద్దకు వచ్చేసరికి ఆ దారిన వెడుతున్న అయ్యదేవర కాళేశ్వరరావుగారు గుర్తించేరు. ఆయన వెంటనే వెర్రి ఆనందంతో తన్ను పిలిచేరు. నిలబడగానే తమతో వున్న చిత్తరంజన్‌దాసుకు పరిచయం చేసేరు. ఆతని వీరకృత్యాన్ని అభినందించేరు. అభిమాన ప్రకటనగా చెవి పట్టుకొన్నారు. వీపుమీద తట్టేరు. "గట్టివాడివి. గట్టి వాడివి" అని అభినందించేరు. "మా తెలుగు కుర్రాళ్ళు ఎల్లాంటి వాళ్లనుకున్నారు? మెరికలు మెరికలు" అంటూ ఎంతో గర్వం, అభిమానం ప్రకటించారు. కాళేశ్వరరావుగారి ముఖం చూసి, చిత్తరంజనదాసు మేలమాడేరు. "మీ తెలుగువాళ్ళకి తెలుగు అభిమానం జాస్తి." "మీ బెంగాలీల వద్ద నేర్చుకున్నది తప్ప అది సహజ లక్షణం కాదు" అని కాళేశ్వరరావుగారు మాట వప్పచెప్పేరు. ఆమాట విని నలుగురూ నవ్వేరు. నలుగురితో తానూ నవ్వేడు. అంతా ఎవరి దారిన వారు వెళ్ళిపోయేరు. పదిమంది మధ్య, చిన్నపిల్లాడిని చేసినట్లు చెవిపట్టుకోవడం చిన్నతనం అనిపించినా, అది దురుద్దేశంతో చేసింది కాదని రామనాధం ఎరుగును. నాయకుల హాస్యాలూ, నవ్వుతాలూలో పాల్గొన్న వుత్సాహంలో ఆ విషయం బాధాకరమూ కాలేదు, అది జ్ఞాపకమూ లేదు. అతనికది బాధ కలిగించలేదు గాని, ఇతరులు కొందరికి అది కష్టం అనిపించింది. రామనాధం మరచినా వారు మరువలేకపోయేరు. చెవి గుంజినందువలన కలిగిన చిన్నతనం కాళేశ్వరరావుగారి క్షమార్పణ చెప్తే సరిదిద్దబడదనే భావం రామనాధానికి లేదు. కాని వలంటీరు దళాల అధినాధుడు దానిని వలంటీరు దుస్తుల్ని చిన్నపరచడంగా భావించేడు. దానికి కాళేశ్వరరావుగారు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండు చేశారు. కాని, కాళేశ్వరరావుగారు నిరాకరించేరు. అయితే వలంటీర్ల పని బంద్‌ అని ఆయన ప్రకటించేడు. ఫలితంగా ఒక్క వలంటీరు కనబడలేదు. దీనికంతకూ తానే కారణమయినట్లు రామనాధం తల్లడిల్లిపోయేడు. ఒక్కొక్క చిన్న సంఘటన ఎంతెంత దూరం, ఎటువంటి ఫలితాలనిస్తుందో కండ్లారా చూస్తూ రామనాధం ఎంతో దుఃఖపడ్డాడు. ఆ సాయంకాలం బహిరంగ సభ కల్లోలం మధ్య ముగియడం ఒక్కటేనా? ఆ పూట గాంధీజీకి ఆహారం లేకుండా పోయింది. గాంధీజీ సరిగ్గా ఆరు గంటలకు ఆహారం తీసుకుంటారు. ఆ సమయంలో ఆయన సభా స్థలంలో వుండాలి, ఆ వుద్దేశంతోనే ఆయన ఆహారాన్ని అక్కడికే తీసుకెళ్ళేరు. కాని, ఆహారం తీసుకోవలసిన వేళకి ఆయనను కోడేరు వస్తాదు రాజు సోదరులు బసలోకి తీసుకువచ్చేరు. ఆయన ఆ వేళ దాటితే మరేమీ తీసుకోరు. బసకు వస్తూనే నిరాహారంగానే తమ పనికి వుపక్రమించేరు. ఆయన నిరాహారం వుండవలసి రావడం ప్రతివారికీ వ్యధ కలిగించింది. కాని ఆయన అది అతి సామాన్య విషయంగా త్రోసిపుచ్చేరు. "తరుచుగా ప్రయాణాల్లో ఇంతే. దీనివలన నా ఆరోగ్యం చెడదు" అన్నారు. అయినా మనసుకేమిటో కష్టంగానే వుంది. రైలెక్కే వరకూ ఆ ఘటన మనస్సుని కోస్తూనే వుంది. నాలుగు రాజమండ్రీలో దిగేక గాని గోదావరి కాలువలు కట్టేసి వుంటారనే సంగతి గుర్తు రాలేదు. వానపల్లి కాలువ కట్టేసి వుండరు. కాని, కాలువల్లో నీళ్ళు వుండవు. పడవలు సరిగ్గా వెడతాయనే నమ్మకం లేదు. నలభయి మైళ్ళలో వున్న ముంగండ చేరాలంటే అంచె బళ్ళ మీద రెండు రోజులు పట్టేలా వుంది. రామనాధం స్వరాజ్యం వంక చూసేడు. ఆమె తల అడ్డంగా తిప్పింది. భర్తను విడిచి ఒక్క రోజు కూడా దూరంగా వుండేందుకు ఆమె సిద్ధంగా లేదు. "నేనూ బ్రహ్మాండంగా నడిచెయ్యగలను." రామనాధం ఒక్క క్షణం ఆమె వంక చూసేడు. తాము తొందరగా వూరు చేరాలి. దారిలో పడవ ఎక్కడన్నా మెరకపడితే దానిని కదిలించేవరకూ కూర్చుందామన్నా కుదరదు. వెంటనే కదలవలసి వుంటుంది. ఎక్కడ ఆ అవస్థ తటస్థపడుతుందో..... అతని అభిప్రాయాన్ని, తటపటాయింపును గమనించి స్వరాజ్యమే చొరవ తీసుకుంది. గుర్రబ్బండీని కేకేసింది. "ధవిళేశ్వరం." రామనాధం ఒక చిన్న సవరణ పెట్టేడు. ఇంత బెడ్డింగు మోయడం కష్టం. అవసరమైనవి జోలె సంచులలో తీసుకొని మిగిలినవి రంగనాధరావు మేస్టారి ఇంట పడేసి పోదామని అతని సలహా. వారిని చూసి రంగనాధరావు దంపతులు బ్రహ్మానందపడ్డారు. వారు దంపతులయ్యేరని విని రంగనాధరావు ఆశ్చర్యపడ్డాడు. "ఎప్పుడు చేసుకున్నావు? నన్నెందుకు పిలవలేదు?" కాని, అసలు కథ విన్న తరువాత రంగనాధరావు ఔడు కరిచేడు. "భార్య వుండగా, భర్త వుండగా రెండో పెళ్ళి చేయడానికి బ్రహ్మసామాజికులు వొప్పుకోరు. హిందూమతం వొప్పుకుంటుంది. కాని మీరు వేర్వేరు కులాల వాళ్ళు. కనక అదీ వొప్పుకోదు." "కనకనే మాస్టారూ! మేము వివాహపు తంతుకి ప్రాముఖ్యం ఇవ్వం అనుకొన్నాం. మా మనస్సులు కలిశాయి. మేము ఆ క్షణంలోనే పెళ్ళి అయినట్లే భావించుకొన్నాం." "పెళ్ళి అనేది ఒక భావన. అది మన మనస్సులలో కొన్ని అనుబంధాలను కల్పించి వుంచింది. ఈనాడు పెళ్ళిని తోసెయ్యగలం. కాని ఆ అనుబంధాలను కూడా తోసివేయగలిగినప్పుడే...." "అంటే...." "ఆ అనుబంధాల బాహ్యరూపం తప్పు చేస్తున్నామనీ, తప్పు చేస్తున్నామన్న సంకోచాలూ, సంతోషాలూను." రామనాధం, స్వరాజ్యం ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. "మేము ప్రపంచాన్నే ధిక్కరించి నిలబడతాము మాస్టారూ! మేం చేస్తున్నది తప్పు కాదు. మాకు ఏర్పడిన పరిస్థితులలో ఆ పెళ్ళిళ్ళ నుంచి విముక్తి కావాలి. అది దొరకదు. మా వివాహాన్ని గుర్తించని సమాజాన్ని మేమూ గుర్తించము." "ఆ ధైర్యం అవసరం. మంచిదే, అయితే ఆ ధైర్యానికి అప్పుడప్పుడు సామాజికమైన ఆలంబన అవసరం. కనీసం ఆ ఆలంబన వున్నదనే భావనయన్నా అవసరం." ఆ అవసరం మనస్సుకి అనిపించినప్పుడు ఆ యువదంపతుల్ని రాజమండ్రి రమ్మని ఆహ్వానించేడు రంగనాధరావు. "మీకు వివాహం నేను చేయిస్తా." "దానికి సంఘబలం వుంటుందా మేస్టారూ!" "మీ యిద్దరికీ జరిగిన ప్రథమ వివాహాలతో సంఘబలం ఏం కనిపించింది? అది ఒక భావన మాత్రమేనని చెప్పాను. మన మనస్సులు కొన్ని కార్యకలాపాలకి అలవాటు పడిపోయాయి. వానిని మనం పాటించకుండా తోసేస్తూనే వుంటాం. కాని, ఆ కార్యకలాపాలతో ముడిపడి వున్న భావనలు మన మనస్సుల్ని పట్టుకొనే వుంటాయి. లేకుంటే వివాహబంధం విచ్ఛేదం చేసుకొనే అవకాశం కావాలనే మీ కోరికకు అర్థం ఏమిటి? అవి ఏనాడో విచ్ఛిన్నం అయేయికదా." రామనాధం ఆ మాటలోని నిజాన్ని అర్థం చేసుకోగలిగేడు. కాని, మనస్సులో అనేక అనుమానాలు. స్త్రీ పురుష సంబంధాలకు సామాజికమైన హద్దు అనేది లేకుండా చేసి కేవలం వ్యక్తి నిష్ఠమైన ప్రేమను మాత్రమే ప్రాతిపదికగా అంగీకరిస్తే రోజుకి ఒకళ్ళను మార్చే ఘట్టం ఏర్పడుతుంది కదా. అటువంటి స్వేచ్ఛా, ప్రేమ సంఘానికి గాని, వ్యక్తికి గాని లాభమా? "కాదు...." అని ఖచ్చితమైన కంఠంతో రంగనాధరావు స్పష్టం చేశాడు. "స్త్రీ పురుష సంబంధాలు కేవలం వైయక్తికాలు కావు. అవి సాంఘికమైనవి మాత్రమే కూడా కాదు. అందుచేత కనీసావసరములైన పరిమితులతో వానిని ఆమోదించవలసి వుంటుంది. రష్యాలో వాళ్ళు అటువంటిదేదో తలపెట్టినట్లు తోస్తుంది. వాటిని నిందిస్తూ వస్తున్న అభిప్రాయాల్ని బట్టి అసలు ఏమిటో వూహించవలసి వస్తున్నదే గాని, యథార్ధస్థితి తెలియడంలేదు" అంటూ ఆయన మరల రష్యాను గురించి చెప్పాడు. రామనాధం భార్యతో లేచేడు. "వెళ్ళి వస్తాం మేస్టారూ!" లాకుల వద్ద బండి దిగి ఆనకట్ట మీదికి వెడుతూంటే స్వరాజ్యం వెనక్కు తగ్గింది. "రా, మళ్ళీ ఆలస్యమయిపోతూంది." ఆమె అతని చాటుకి వచ్చింది. తల బాగా వంచేసుకుంది. ఆమె స్థితి అతనికి అర్ధం కాలేదు. కాళ్ళు అప్పుడే మెత్తపడిపోయాయనుకున్నాడు. జాలిపడ్డాడు. "రాళ్ళు గుచ్చుకుంటున్నాయి కదూ." "రాళ్ళూ లేవు, ఏమీ లేవు. నడవండి." ఇద్దరూ ఆనకట్టమీదికి వచ్చేరు. అప్పుడు చెప్పింది. ఆ కారణం వింటూ వుంటే ఆశ్చర్యం కలిగింది. ఆమె రాజమండ్రిలో వున్న రోజుల్లో వారి పొరుగునున్న ఒకళ్ళిద్దరు సర్‌ ఆర్థర్ ‌కాటన్‌ విగ్రహం దగ్గర పచ్చిక మీద కూర్చుని వున్నారు. వాళ్ళ కంటబడడానికి ఆమె సిగ్గుపడింది. బెజవాడలో ఆమె తనను భర్తగానే చెప్పింది కాని, ఇక్కడ కూర్చున్నవాళ్ళు ఆమె భర్తను--ఏలుకోడానికి నిరాకరించిన భర్తను--ఎరుగుదురు. ఈవేళ రామనాధాన్ని ఎవరంటే ఏమి చెప్తుంది? అదీ భయం. రంగనాధరావు చెప్పిన మాటలకర్థం ఇదన్నమాట అనుకున్నాడు. "మీరు భయపడరా?" అని స్వరాజ్యం అడిగింది. భయపడననే అనుకొన్నాడు. కాని, ఒక్క అరగంటలో తన ఆలోచన వట్టి అబద్ధమని తేలిపోయింది. ఆమె ఆ ప్రశ్న వేసినప్పుడు రామనాధం ఎగతాళి చేసేడు. "ఏం తల తీస్తారా? నడు. పలకరించిపోదాం." నిలబడిపోయిన రామనాధాన్ని స్వరాజ్యం నెట్టింది. "పలకరించి వచ్చే లోపున పడవ దాటిపోతుంది....." భుజాన వున్న సంచిని సర్దుకుంటూ రామనాధం ముందడుగు వేశాడు. "ఇల్లా ఇవ్వండి, కొంత దూరం నేను తెస్తాను" అంది స్వరాజ్యం. "అది నాకిస్తావా?" నిజానికి ఆమె సంచీయే కొంచెం పెద్దదిగా వుంది. అయినా ఆమె దానిని అతనికివ్వడానికి అంగీకరించలేదు. అతడు నవ్వేడు. తన భుజాల వంకా, ఆమె వంకా చూశాడు. "నిన్ను చేతుల్లో ఈ వేపునుంచి ఆవేపుకంటా తీసుకుపోగలను. ఎంత పందెం..." ఆమె అతని వంక చూసి కళ్ళతోనే నవ్వింది. "వద్దులెండి." ఆనకట్ట మీద కొంత దూరం వెళ్ళేక ఇద్దరు యువకులు ఎదురయ్యేరు. వాళ్ళని చూసి రామనాధం నిలబడ్డాడు. ఎదురుగా నాలుగైదు తలుపుల మేర ఆనకట్టమీద నీరు పొర్లుతూంది. చప్టా పాకుడు పట్టి వుంది. జాగ్రత్తగా నడవాలి. ఆ పాకుడు మీద తప్పుకోవడం కష్టం. "వాళ్ళని వచ్చెయ్యనీ...." వాళ్ళు వచ్చేశారు. ఎదుటకు వచ్చేశాక ఆ యువకులలో ఒకడిని తన మిత్రుడూ, సహాధ్యాయిగా గుర్తించేడు. అతడూ వారిద్దరినీ గుర్తించేడు. "ఇదిగో రామనాధం! బెజవాడనుంచి వస్తున్నావనుకొంటాను...... మీ పేరు స్వరాజ్యం కాదూ, జ్ఞాపకం వున్నానా? మనం ఇద్దరం మెట్రిక్‌లో......." "గుర్తుంది. మీ పేరు మంగరాజు కాదూ." అని స్వరాజ్యం తన జ్ఞాపకాన్ని ప్రకటించింది. "ఇప్పుడేం చేస్తున్నారు?" అంది. "ఇంజనీరింగ్‌ కాలేజీలో చేరేను." అన్నాడు మంగరాజు. రామనాధము ఆశ్చర్యం కనబరచేడు. సహాయ నిరాకరణంగా కాలేజీ మానేస్తున్నానని తనతోబాటు బయటకు వచ్చిన నలుగురైదుగురు యువకులలో మంగరాజొకడు. కాని సూపరింటెండింగ్‌ ఇంజనీరు తండ్రి మర్నాడే అతనిని కాలేజీకి తెచ్చి వదిలేసేడు. అతడు లక్షణంగా చదువుకొని డిగ్రీ తీసుకొన్నాడు. వెళ్ళి ఇంజనీరింగ్‌ కాలేజీలో చేరాడు. ఆ ఏడాదికి చదువు పూర్తి చేసుకొన్నాడంటే పోనీలే అనిపించింది. కాని, కొత్త కోర్సులో చేరేడని విన్నాక రామనాధం అతని వంక చూసిన చూపుకు మంగరాజు నవ్వేడు. "స్వరాజ్యం వచ్చేక టెక్నికల్‌ బలగం మనకెంతో అవసరం, ఆనాడు అద్దద్ద అంటే ఎక్కడ వస్తారు? ఆ విజ్ఞానం సాధించుకోలేకపోతే స్వరాజ్యం సంపాదించుకున్నాక మళ్ళీ నువ్వు వెనక్కేనా వెళ్ళాలి. లేదా మళ్ళీ ఆ ఇంగ్లీషువాడినో, మరొకడినో భంగపడాలి" అన్నాడు. రామనాధానికి ఆ వాదం నచ్చలేదు. స్వరాజ్యం సాధించడం కోసం నానా హింసలూ పడేది తాము. దానిని సుస్థిరం చేయడం పేరుతో ఇప్పటి నుంచీ అంగోస్త్రాలు పరుస్తున్నారన్నమాట అనుకున్నాడు. పైకి "ఆమాట నాకు తోచనే లేదు సుమా, తోస్తే బహుశా ఇంగ్లండులో వుండేవాడిని" అన్నాడు. మంగరాజు దానికి సమాధానం ఇవ్వలేదు. అతనికీ రామనాథం కథ అంతా తెలుసు. "మా మామగారు నిన్ననే వెళ్లేడిల్లాగ, గాంధీగారు డెల్టా సంచారం వస్తున్నారటగా, గుండెలు కొట్టుకుంటూ పరుగెత్తుతున్నాడులే" అంటూ నవ్వేడు. రామనాధం కనుబొమ్మ ముడిచేడు. క్షణంలో ఏదో నిర్ణయించుకొన్నట్లు ముఖం విప్పారింది. "నీకు పరిచయం చెయ్యడం మరిచిపోయేను. ఈమెను నువ్వు మీ క్లాస్‌మేట్‌గానే ఎరుగుదువు. ఈవిడ నా భార్య." మంగరాజు అంతవరకూ ఆలోచిస్తున్న సమస్యకు అర్థం దొరికింది. ఏవిధమయిన బంధుత్వమూ, పరిచయమూ కూడ వుండడానికి అవకాశం లేదనుకునే వీరిద్దరూ కలిసి ప్రయాణం చేస్తూండడం అతనికి ఆశ్చర్యంగా వుంది. ఆమె కులం అతని కులం ఒకటి కాదని అతడెరుగును. ఈ విషయం అతనికి మరీ ఆశ్చర్యంగా వినిపించింది. కాని మర్యాదకి బయటపడకుండా అభినందనలు తెలిపేడు. "మీ దంపతులిద్దరూ ఈవేళ మా యింటిలో వుండిపోండి....." రామనాధం మెత్తపడలేదు. "గాంధీగారు వస్తున్నారని ఎరుగుదువుగా, అందుకే ఈ పరుగు." బెజవాడ సభలో తిలక్‌ స్వరాజ్యనిధి కోటి రూపాయలు వసూలు చెయ్యాలని కాంగ్రెసు నాయకులు నిశ్చయించుకొన్నారు. ఆ వసూళ్ళ కోసమే గాంధీగారి పర్యటన. ముంగండకి గాంధీగారిని తీసుకువచ్చి తను నడుపుతున్న ఖద్దరు వుత్పత్తి కేంద్రానికి ఆయన ఆశీర్వచనం సంపాదించాలని రామనాధం ఆలోచన. కానీ, గాంధీగారిని ముంగండ తీసుకురావడం సాధ్యం కాదంటున్నారు కళా వెంకట్రావుగారు. ఆయన కార్యక్రమాన్ని డెల్టాలో సక్రమంగా నడిపించే బాధ్యత వెంకట్రావుగారిది. ఆయన గాంధీగారి ప్రయాణంలో ముంగండ చేర్చడానికి వీలు లేదంటున్నాడు. రాజోలునుంచి గన్నవరం మీదుగా అమలాపురం రావడానికి వీలుంటే ముంగండ గాంధీగారు రావడం సాధ్యమే. కాని, మధ్యలో వశిష్ట మీద ఆక్విడక్టు వుంది. దానిని దాటడం ఎలాగ? "ముందు ముంగండ వెళ్ళాలి. అక్కడికి వెళ్లేకనే ఏ ఆలోచన అయినా." కాని, అది మాటవరసకు ఇచ్చిన సమాధానం మాత్రమే. ఏం చెయ్యాలో అతడప్పుడే ఓ పథకం వేసుకున్నాడు. తిలక్‌ నిధికి తమ వూళ్ళో కూడా ఓ నూటపదహార్లు ఇస్తామంటే గాంధీగారి కార్యక్రమాన్ని అనుకూలంగా సర్దుబాటు చేస్తారని అతని ధైర్యం. బెజవాడలో ఆ నిధికి పెద్ద విరాళం ఇచ్చిన వర్తక ప్రముఖుని యింటిలో గాంధీగారి బస ఏర్పాటు చేశారు. అదీ అతని ధైర్యం. అతని ఆలోచన విని మంగరాజు ఆలోచించేడు. "కాలువలు కట్టేశారు కాదటయ్యా?" ప్రశ్న అడగడంలో మంగరాజు వుద్దేశం వేరు. రామనాధం అర్థం చేసుకొన్నది వేరూను. "వానపల్లి కాలవలో పడవలు వెడుతున్నాయి." మంగరాజు ఇంక ఆతనిని ఒత్తిడి పెట్టదలచుకోలేదు. స్వరాజ్యం వేపు తిరిగేడు. "మీ మాటేమిటి? నాన్నగారు రేపు కారులో రాజోలు ప్రయాణం పెట్టుకున్నారనుకుంటాను. వారి కారు ముంగండ మీదుగానే వెడుతుంది మీరు ఆగండి." ఆమె ప్రయాణంలో ఇబ్బంది పడలేదనే ఆలోచనతో రామనాధం ఆమె ముఖం వంక చూసేడు. కాని, ఆమె నిరాకరించింది. "కాదండి క్షమించాలి. ఇద్దరం వెళ్ళాలి." అయిదు ఊళ్ళో అడుగు పెట్టేసరికి దేవుడి గుడి వీధిలోంచి ప్రభాతభేరీ సాగుతూంది. సుందరమైన రాట్నమే. పసందు బాంబురా..... విశాలాక్షి నవ్వుతూ ఆ హడావిడి ఏమిటో వివరించింది. "మేనమామ పోలికలు వట్టినే పోవు. ఈయనగారు హైస్కూలు పూర్తి చేయకుండానే చదువు మానుతాడో ఏమో కొంపతీసి." ఆమె కంఠంలో ఆదుర్దాయేగాని కోపం వినిపించలేదు. బాలకృష్ణ ఈ వారం నుంచీ తన యీడు కుర్రకారును పోగుచేసి తెల్లవారగట్ల ప్రభాతభేరీ ముగించుకొని బడికి పరుగెత్తుతున్నాడు. రామనాధం నవ్వుకున్నాడు. "ఎక్కడో పాటలు కూడా సంపాదించేడు." విశాలాక్షికీమారు కోపం వచ్చింది. "ఏవో స్వరాజ్య గీతాలంటూ తెచ్చేడు. కుర్రనాగమ్మనిచేసి పుస్తకం ఖరీదు రెట్టింపు వసూలు చేశాడురా." రామనాధం ఆ మాటకు ఎక్కువ శ్రద్ధ చూపలేదు. కాని మాటవరసకు అడిగేడు. "ఎవరది?" "మన గవరయ్యే." "ఉహూఁ" అన్నాడు. గాంధీగారికి గ్రామంలో స్వాగతం ఇవ్వడానికై చేస్తున్న ప్రయత్నాలలో ఆ గవరయ్య ఆ రెండు రోజులూ తన వెనకనే వున్నాడు. కుర్రవాడికి స్వరాజ్యగీతాలు కావాలనే ఆసక్తిని వుపయోగించుకొని లాభం తీయడానికై అతడు ప్రయత్నం చేశాడన్న విషయం అతని మనస్సును గంద్రగోళ పరుస్తూనే వుంది. తీరా చేస్తే ఆ పుస్తకం మీద అతడు తీసిన లాభం రెండణాలే. అక్కడ డబ్బు ఎంత అని గాదు సమస్య. ఆ ధోరణిలో వున్న ప్రజాద్రోహ చింతన అతనిని బాధిస్తూంది. చివరకు వుండబట్టలేక రెండో రోజున అడిగేసేడు. అయితే గవరయ్య నవ్వేడు. తప్పు అనుకోలేదు. సిగ్గు పడలేదు. "లేకపోతే ఈ తిరగడానికి డబ్బులేవీ, పన్నెండు పుస్తకాలు అమ్మేను. రెండు రోజుల భత్యాలొచ్చేయి" అన్నాడు. కాని రామనాధం మనస్సు సంతృప్తి పడలేదు. దేశభక్తీ-మోసమూ పొత్తు కుదరని భావాలు. ఆ సమ్మిశ్రణం వెనుకనున్న స్వార్థాన్ని రామన్న చాల మోటుగా వివరించేడు. "దేశభక్తీ కాదు, దిబ్బభక్తీ కాదు, బీడీముక్క కావలసివస్తే పెళ్ళాన్ని కూడా ఆమ్మేస్తారు. ఇల్లాంటివాళ్ళే." అవమానకరమైన ఆ వ్యాఖ్యకు పెద్ద పేచీ వస్తుందని రామనాధం భయపడ్డాడు. కాని గవరయ్య నిశ్శంకగా నవ్వేశాడు. "గాంధీగారు వస్తున్నారన్నా, ఒక్కపూట సెలవు పెట్టి ఏదన్నా పని వున్నా చేయడానికి రారుగాని, వచ్చేవాళ్ళకి వెధవ నీతులు....." రామన్న కొత్తగా ఓ ఎలిమెంటరీ స్కూలులో మాస్టరీ సంపాదించేడు. ఒంటిపూట బడి, రెండోపూట వచ్చి పనిచెయ్యడం గవరయ్య దృష్టికి చాలడం లేదు. డబ్బుకోసం కట్టుబడిపోయాడని అతని అభ్యంతరం. రామనాధం అప్పటికి వాళ్ళని సర్దుబాటు చేశాడు. కాని, ఖచ్చితంగా అతని అభిమానం రామన్నవేపే. అతడు శ్రమపడి పనిచేస్తున్నాడు. తనకు కావలసిన డబ్బు సంపాదించుకొంటున్నాడు. మిగతా వేళల్లో వచ్చి గ్రామ ఉమ్మడి పనుల్లో పాల్గొంటున్నాడు. గవరయ్య ఇరవై నాలుగు గంటలూ పని చేయగలుగుతున్నానంటూ తన ప్రక్కనున్న వాళ్ళని మోసం చేస్తున్నాడు. "నేనెవ్వరినీ మోసం చెయ్యలేదు. రెట్టింపు ఖరీదు ఇస్తే పుస్తకాలు ఇస్తానన్నాను. బలవంతం ఏం వుందీ? నేను మీ వాడిని కొనమని ఏడిశానా ఏమన్నానా? అమ్ముడుకాకపోతే నాకు నష్టం కలగదా. నష్టం-లాభం....." రామనాధం అతని వాదనను ఒప్పుకోలేదు. ఆ గవరయ్యే సుబ్బావధాన్లు తిలక్‌నిధికి రూపాయన్నా ఇవ్వలేదని ఏమీ పుచ్చుకోకుండా లేచివచ్చేడు. ఆయన నిధికి రెండణాలు మాత్రమే ఇవ్వబోయేడు. గవరయ్య "ఇదా ఇచ్చేది" అని విసిరేసేడు. అంతకన్న ఏమీ ఇవ్వనని అవధాన్లు పొమ్మన్నాడు. ఆ విషయంలో కూడా రామనాధం గవరయ్యనే తప్పుపట్టేడు. "ఆ గాంధీగారు దీనిని 'పైసా ఫండు'గానే వసూలు చెయ్యమన్నారు. ఆ విధంగా కోటానుకోట్లమందికి కాంగ్రెసు ఆశయాలు ప్రచారం అవుతాయని....." గవరయ్య నవ్వేడు. "పైసా లెక్కన తేలిందే కూలిపని చేసుకొనేవాడు కూడా ఒక కానీ సులభంగా పడేస్తాడు." "పడేస్తే మంచిదే. ఇష్టాపూర్తిగా ఇచ్చినదే..." ఈమారు రామనాధం దొరికేడని గవరయ్య గంతువేసేడు. "ఇష్టాపూర్తిగా కుర్రాళ్ళు నా పుస్తకానికి ఇచ్చిన ఖరీదు మోసం అన్నావు. ఇప్పుడిది...." ఆ వ్యాఖ్యానం, సమర్థన విన్నాక గవరయ్యకు రామనాధం నమస్కారం చేయడం తప్ప మరో మార్గం లేదు. "నీబోటి తత్వవేత్త లభించినందుకు కాంగ్రెసు తల తీసి చంకన పెట్టుకోక తప్పదు." గవరయ్య కోపం చేయలేదు. సిగ్గుపడలేదు. బహు తేలికగా ఆ నమస్కారం అందుకొని ఆశీర్వదించేడు. "దీర్ఘాయుష్యమస్తు, ఆపాదశిరః పర్యంతం బహు-ఏదో-సమృద్ధిరస్తు....." గవరయ్యవంటి వాళ్ళ ఉత్సాహమూ, భక్తీ కాంగ్రెసుకి ప్రతిష్ఠో, అప్రతిష్ఠో తేల్చుకోలేకపోయేడు రామనాధం. కాంగ్రెసు మాట ఎలా వున్నా దేశానికీ, ప్రజలకూ నష్టమేగాని.... ఆ ఆలోచనలతో కొట్టుకుపోతూ అతడు వీధిన పోతూంటే అరుగుపై కూర్చుని జపం చేసుకుంటున్న సుబ్బావధాన్లు పిలిచేడు. ఆయన తనకు గత దినం రాత్రి వచ్చిన కలను చెప్పదలిచేడు. పెద్ద బుగ్గమీసాలున్న అజానుబాహువయిన వ్యక్తి కలలో కనిపించేడు. అతను అంగోస్త్రం వంటిది కట్టుకున్నట్లు అనిపించింది కాని అది పట్టుది. "పీతాంబరం సుమీ" అన్నాడు అవధాని. "చేతిలో ఏదో వుంది, ముందు రాట్నంలా అనిపించింది. కాని సరిగ్గా చూసేసరికి చక్రాయుధం, నా వళ్ళు పరవశమయిపోయింది. 'స్వామీ' అని ఒక్క సాష్టాంగం చేసేను. నా చేతిలోని ఒక్క తులసీ దళం ఆయన పాదాలమీద వుంచేను. సుబ్బావధాన్లు ఆత్మవంచన చేసుకొంటున్నాడో, తమకందరికీ ప్రోత్సాహం ఇవ్వదలచేడో రామనాధానికి అర్థం కాలేదు. గాంధీగారిని ఆయన విష్ణుస్వరూపుడిగా వర్ణిస్తున్నాడు. గాంధీగారికి ఏ కొద్దియో ఇవ్వాలనుంది. కాని వసూలు చేస్తున్న వాళ్ళు నిరాకరించారు. అది కష్టం అనిపించింది. ఎందుకో రామనాధానికి అర్థం కాలేదు. గాంధీగారు చెప్పిన అస్పృశ్యతా నివారణ ఆయనకిష్టం కాదు. అయిదారు నెలల క్రితం తన తోటలో నూతి సమస్యపై ఆయన కనబరచిన స్వార్థబుద్ధికి అప్పుడు కోపం వచ్చింది. ఈవేళ గాంధీగారు ప్రారంభించిన వసూళ్ళలో తన బేడా కూడ చేరాలని ఈ తాపత్రయం ఏమిటో. దానికై అబద్ధాలాడడానికీ, అభూత కల్పనలకీ కూడ సంసిద్ధం అవడం ఏమిటో..... రామనాధం తేల్చుకోలేకపోయినా, ఆయనను విరాళం కోసం అర్థించేడు. "పత్రం పుష్పం ఫలం తోయం... అన్నారు. గాంధీగారు కూడా దీనిని పైసా ఫండ్‌ గానే వసూలు చేయాలని..." అవధాన్లు ముఖం వికసించింది. "నిజంగా.....!" ముందుకు వంగి రహస్యంగా అడిగేడు. "ఒక అణా ఇస్తే బాగుంటుందంటావా!" అన్నాడు. రామనాధం కండువా కొంగు పట్టేడు. సుబ్బావధాన్లు ఆశ్చర్యంతో ముఖం వంక చూస్తూ నాలుగణాలబిళ్ళ వేసేడు. రామనాధం నమస్కరించి సెలవు తీసుకున్నాడు. "గాంధీగారు దీని విలువ కోటిరూపాయలతో సమంగా భావిస్తారు మామగారూ." ఆరు తోట మకాములోకి వచ్చేసరికి మంగరాజు కూర్చుని ఎదురు చూస్తున్నాడు. "ఎంతసేపయింది వచ్చి?" "ఇప్పుడే నాన్నగారు రాజోలు వెళ్ళాలనుకుంటున్నారన్నాను కదూ! వారితో వచ్చాను. వారు నన్నిక్కడ వదిలి గన్నవరం వెళ్ళేరు." కారు అక్విడక్టు తొట్టిలోకి దిగేటందుకూ ఎక్కేటందుకూ ఇటు గన్నవరం వేపునా, అటు లంకల గన్నవరం వేపునా, సొలుపులు చేయించమని మొన్ననే ఫోనులో చెప్పేడు. ఈ వేళ వచ్చేరు. ఆ వార్త వినగానే మత్తు వదిలినట్లు రామనాధం లేచేడు. "నడు, మీ నాన్నగారిని కలుసుకోవాలి." "అభ్యంతరము ఏమిటిగాని, ఆయన ఇంకా గన్నవరంలో వున్నారాయని సందేహం." పొంగుతున్న పాలమీద నీళ్ళు చల్లినట్లయి రామనాధం గమ్మున చప్పబడిపోయేడు. "గుర్రబ్బండి చేసుకువెడదాం. ఆయన్ని ఎక్కడున్నా పట్టుకోవాలి." ఆ ఆదుర్దా ఎందుకో మంగరాజు ఎరుగును. కాని, ఎరుగనట్లే నటించేడు. "ఏమిటా వుప్పెన, ఎక్కడున్నారని వెడతాము? ఆయన కారులో వెడుతూంటే గుర్రబ్బండీలో వెంటబడతావూ? నయం కాదూ, ఒంటెద్దు బండిలో వెడదామన్నావు కావు." రామనాధం తన అవసరం చెప్పేడు. అక్విడక్టు తొట్టిలోంచి గాంధీగారి కారు రావడానికి అనుమతి కోరాలి. అదే జరిగితే ఆయన ప్రయాణం వెనకముందులు కావలసిన పని లేదు. అమలాపురం నుంచి రాజోలు వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరగనక్కర లేకుండా గన్నవరం మీదుగా ముంగండ వస్తారు. తన ఖద్దరు ఉత్పత్తిశాఖకు ప్రారంభం జరుపుతారు. ముందుకు వెడతారు. కొత్తగా మరో నాలుగైదు గ్రామాలకు ఆయన వెళ్ళగలుగుతారు. మంగరాజు అన్నీ విని వుపాయం చెప్పేడు. సబ్‌డివిజనల్‌ ఆఫీసరుగారికి ఆయన ఎక్కడ వున్నదీ తెలుస్తుంది. అక్కడనుండి ఫోన్‌లో మాట్లాడవచ్చులే అన్నాడు. కాని, అంతకన్న అదనం చెప్పడానికి మంగరాజు సిద్ధంగా లేడు. గాంధీగారి ప్రయాణానికి సౌకర్యం కలిగించడానికి ప్రయత్నించినట్లు కనిపించకుండా సాయం చేయడానికే సూపరింటెండింగ్‌ ఇంజనీరు రాజోలు ప్రయాణం పెట్టుకున్నాడని మంగరాజు ఎరుగును. కాని అతడేమి చెప్పలేదు. ఆత్మాభిమానం చంపుకుని ప్రిన్సిపాల్‌కు క్షమాపణ చెప్పుకుని, కొడుకు కాలేజీలో చేరేటట్లు వొత్తిడి పెట్టిన ఇంజనీరు ఈనాడు గాంధీగారి ప్రయాణం సౌకర్యం కోసమే రాజోలు ప్రయాణం పెట్టుకొని వుంటాడన్నది రామనాధం వూహలకు అందని విషయం. "అయితే నడు, వెడదాం...." "మరి ఇక్కడి పనులు ఏం చేస్తావు. పోనీ నేను వెళ్ళి చెప్పి వస్తానులే" అన్నాడు మంగరాజు. "అక్కర్లేదు. స్వరాజ్యం వాళ్ళ నాన్నగారూ ఇక్కడే వున్నారు. వారే ఇక్కడి ఏర్పాట్లు చూస్తున్నారు." మంగరాజు రెండు రోజుల క్రితం స్వరాజ్యం సమ్ముఖంలో వుండడంచేత అడగలేకపోయిన ప్రశ్న ఇప్పుడు అడిగేశాడు. "మీరు వూళ్ళోనే కాపురం పెడతారా?" అతని ప్రశ్నలకు మూలం ఎరిగిన రామనాధం ఆచి యాచి, తూచి తూచి సమాధానం ఇచ్చేడు. "ఇంకా మా వివాహ వార్త ఎవ్వరికీ తెలియదు. వాళ్ళ నాన్నగారు వొప్పుకున్నారు. మా పెత్తండ్రిగారికి చెప్పేను. ఈ హడావిడి తగ్గగానే ఇక్కడే కాపురం పెడతాము. గొడవలు వస్తాయి......" "వస్తాయని ఎరిగి వుండి ఈ పల్లెటూళ్ళో ఎందుకు? పట్టణం చేరుకోకా?" ఏదో మహాపరాధం చేసినట్లు పారిపోతామా? ఇది మా వూరు. పుట్టి పెరిగిన చోటు, ఇక్కడ కొద్దిమందేనా నా తరఫున వుండే జనం వున్నారు. మా ఆస్తులు ఇక్కడ వున్నాయి. ఈ చుట్టుప్రక్కల ఏదో పని చెయ్యాలని బోలెడంత కార్యక్రమం వేసుకున్నాం. ఇవన్నీ వదులుకు పోవడమా...." "నీ సాహసం! అన్నింటిలోనూ ఒక్కలాగే వున్నావు" అంటూ మంగరాజు మెచ్చుకొన్నాడు. "ఇందులో నా సాహసం కాదు, స్వరాజ్యానిది చెప్పు." మంగరాజు కొంతసేపు ఏమీ అనలేదు. చివరన లేస్తూ అన్నాడు. "అదృష్టవంతుడివి." ఆఖరు నిముషంలో గాంధీగారి ప్రయాణ మార్గంలో జరిగిన మార్పు చిన్నదే కాని, ఆ చిన్న మార్పు ఎందరినో వుత్సాహపరిచింది. ఆయన రాకను విజయవంతం చేయడానికై ఎందరో ఉరుకులు, పరుగులుతో పని చేశారు. చీకటి పడే వేళ శంకరశాస్త్రి ఒక కత్తిరించిన తాటాకు రేకు చేతబట్టుకొని తోటలోకి వచ్చేడు. తోట అంతా హడావిడిగా వుంది. స్వరాజ్యం పిల్లవాళ్ళ సాయంతో మామిడి తోరణాలు, రంగు కాగితాల తోరణాలతో దారుల పొడుగునా అలంకరిస్తూంది. శాస్త్రి స్వరాజ్యాన్ని అదివరకెన్నడూ చూడలేదు. "ఎప్పుడూ చూడలేదు నువ్వెవరివమ్మా!" స్వరాజ్యం నిలబడింది. "చిరతపూడి నాయుడుగారి అమ్మాయినండి. రామనాధంగారు ఇక్కడ వున్నారండి...." ఆమె ఎవరో తెలిసిన తర్వాత ఏడాది క్రితం సుబ్బన్నశాస్త్రి తనకు చెప్పిన సమాచారం జ్ఞాపకం వచ్చింది. ఒక్క క్షణం ఎన్నో అనుమానాలు మనస్సులో మెదిలేయి. కాని, ఆనాటికి వలె కొడుకును ఏమీ అనేటందుకు వీలూ కాదు, సమయమూ కాదు. శంకరశాస్త్రి సాలోచనగా రామనాధం వున్న దిశగా తిరిగేడు. పది రాట్నాలు మామిడిచెట్టు క్రింద పెట్టుకొని శరభయ్య వానికి కావలసిన మరమ్మత్తులు చేస్తున్నాడు. పక్కనే లచ్చమ్మ కూర్చుని పనులు చేయిస్తూంది. విశ్వనాధం శంకరశాస్త్రిని చూడగానే ఎదురు వచ్చేడు. "రావయ్యా! రా, విన్నావు కాదూ, రేపు తెల్లవారి ఏడు గంటల వేళకి గాంధీగారు వస్తారు. ఇక్కడ పది నిముషాలు వుంచడానికి బ్రహ్మప్రళయం అయిపోయిందనుకో. మనవాడు...." "అదే విన్నాను. అందుకే వచ్చేను. అల్లాంటి మహాపురుషుడు వచ్చినప్పుడు వారిని వేదోక్తాశీస్సులతో పంపడం మన గ్రామానికి ప్రతిష్ఠ. వారి పనికి ఎంతో మేలూను. ఆ విషయం ఆలోచించేడో లేదోయని...." చేతిలో వున్న పని పక్కనెవరికో వప్పచెప్పి రామనాధం శంకరశాస్త్రి దగ్గరకు వచ్చేడు. ఆయన సూచనకు హర్షించేడు. "ఎవరెవరు వస్తారంటావు బాబాయి!" "అది నాకు వదిలెయ్యి. సుబ్బావధాని ఇందాకా ఈమాట జ్ఞాపకం చేసేడు. ఇంకెవరూ రాకపోయినా మేమిద్దరం వుంటాం. ఇంక శివకామయ్యా వాళ్ళూ కొద్దో గొప్పో స్మార్తం చెప్పుకున్న వాళ్ళేగా, వస్తారు." ఆఖరున తాను తెచ్చిన తాటాకు రేకును శంకరశాస్త్రి రామనాధానికందించేడు. చక్కని గుండ్రని అక్షరాలతో దానిమీద భగవద్గీత నుంచి ఒక్క శ్లోకం వ్రాసి వుంది. అక్షరాలు స్ఫుటంగా కనిపించేటందుకు కాకరాకు పసరు రుద్ది వుంది. మేనమామ చేతి క్రింది నుంచి బాలకృష్ణ చదివేడు. 'యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత! అభ్యుత్థానమధర్మస్య సంభవామి యుగే యుగే' ఆ శ్లోకం అర్థంగాని, ఎందుకోగాని ఎరగని బాలకృష్ణ ముచ్చటగా వున్న అక్షరాల పొందికను మెచ్చుకొన్నాడు. "గంటంతో వ్రాశావా, సిరాతో వ్రాశావా తాతయ్యా?" ఆ తాళపత్రం గాంధీగారికి విరాళంతోపాటు ఇవ్వడానికి తయారుచేశాడు ప్రత్యేకంగా శాస్త్రి. "ఏం బాగుండదా?" అన్నాడు శాస్త్రి. ముంగండ తరఫున గాంధీజీకి అది జ్ఞాపిక, ఆయన యెడ వారి విశ్వాసానికది గుర్తు. ఆయన సందేశం యెడ వారికిగల భక్తి భావానికది సూచిక. ముంగండే కాదు, తెలుగుదేశమే ఆ విశ్వాసంతో ప్రతిబింబించింది. తోటలో దూరాన సూరాయి పాడుతున్న పాట విని శాస్త్రి తల ఎత్తేడు... 'సుందరమైన రాట్నమే పసందు బాంబురా సందేహమేలా అందులోనే స్వరాజ్యమున్నాదిరా!' శంకరశాస్త్రి తల పంకించేడు. "ఒక్కొక్క జాతకం...." --అని ఏదో అదృశ్యశక్తికి ఓ నమస్కారం చేశాడు. రామనాధం నవ్వుకున్నాడు. కొల్లాయిగట్టితేనేమి? నేనెందుకు రాశాను? Hidden Springs of the Indian National Movement ను తెలుగు నాటి కమ్యూనిస్టు Cadre కి చెప్పడం కోసమే నేనీ నవలను వ్రాసేను. 1960ల నాడు నేను ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీ పత్రిక విశాలాంధ్రలో సబ్‌-ఎడిటరుగా పనిచేస్తున్నాను. ఆ రోజులలో ఆదివారం ప్రత్యేక సంచిక బాధ్యత నేను చూస్తున్నాను. అల్లూరి సీతారామరాజు జయంతి సంచికకై వ్యాసాలు సేకరిస్తున్నాను. ఆ సందర్భంగా వచ్చిన ఒక వ్యాసం నా మనస్సుకు చాలా బాధ కలిగించింది. 'అమృతాంజనం అమ్ముకోడానికి పుట్టిన ఆంధ్రపత్రిక అల్లూరి సీతారామరాజును దౌర్జన్యకారిగా నిందించిం'దని రచయిత అభ్యంతరం. గాంధేయ అహింసావాదాన్ని సమర్థిస్తూ 1922లో ఆంధ్రపత్రిక ఆ వ్యాఖ్య చేసి వుండవచ్చు. అభిప్రాయభేదంగా చూడాలి తప్ప అది నింద్యమేం కాదు. 1936నాడు సోషలిస్టు-కమ్యూనిస్టు సాహిత్యాన్ని పల్లెటూళ్ళకు తీసుకెళ్ళినప్పుడు మా వాకబు గ్రామంలో ఆంధ్రపత్రికనెవరు తెప్పిస్తారు? ఎవరు చదువుతారు? అనే. ఆ పాఠకులు సామాజికంగానూ, రాజకీయంగానూ పురోగామి భావాలు కలిగి వుంటారనీ, వారి మనస్సులు సోషలిస్టు భావాన్ని ఆకళింపు చేసుకోగలుగుతాయనే మా అభిప్రాయం. సాధారణంగా వారు మమ్మల్ని మాట్లాడనిచ్చేవారు, వినేవారు. మర్యాదకైనా పుస్తకాలు తీసుకొనేవారు. ఆ విధంగా ఆంధ్ర ప్రజలలో రాజకీయ, సామాజిక సంస్కారం కలిగించిన ఆంధ్రపత్రికను 'అమృతాంజనం అమ్ముకోడానికి పుట్టిందని' నిందించడం నాకు కష్టం అనిపించింది. దీనికి కారణం జాతీయోద్యమ పురోగతికి ఏయే శక్తులు ఏ విధంగా తోడు పడ్డాయో తెలీకపోవడమే అనిపించింది. ఆ రాసిన వారొక కమ్యూనిస్టు రచయిత. బహుగ్రంథకర్త. అంతేనా? ప్రజాసంఘాలతో సంబంధం వున్న కార్యకర్త. కమ్యూనిస్టు వుద్యమం పుట్టుక నుంచీ కాంగ్రెసు వ్యతిరేకతను జీర్ణించుకున్న వుద్యమం. కాంగ్రెసు జాతీయోద్యమంలో Identify అయి విస్తరిస్తూంటే కాంగ్రెసు ఆస్తిపరుల (బూర్జువాల) సంస్థ అనీ, అది శ్రామిక వర్గ ప్రయోజనాలకు శత్రువనీ, కనుక దానిని సర్వాత్మనా వ్యతిరేకించవలసిందేననీ Cadre ను నమ్మింపచేసింది. దాని ఫలితమే ఈ వ్యాసధోరణి అనిపించింది. కనక జాతీయోద్యమ విజృంభణకు దేశంలో మూలం ఎక్కడుందో చూపడం, Educate చేయడం అవసరమనిపించింది. ఎప్పుడో 1936-40 మధ్యకాలంలో నేను Hidden Springs of the Russian Revolution అనే పుస్తకం చదివేను. అది ఓ చరిత్ర గ్రంథం. ఆ పేరు గుర్తు వచ్చింది. జాతీయోద్యమ విజృంభణకు మూలం అయిన సామాజిక పరిణామాలను నా నవలలో చిత్రించాలి. * * * * * మన జాతీయోద్యమం చాలామంది భావిస్తున్నట్లు కేవలం రాజకీయాలకు మాత్రమే పరిమితమైనది కాదు. కులమత భేదాలను, ద్వేషాలనూ నిరాకరించడంలో, నిర్మూలించడంలో దాని భవిష్యత్తు ఆధారపడి వుంది. సమాజంలో సగం మంది వున్న స్త్రీలను ముందుకు తీసుకురావడం, సమానస్థాయి కల్పించడం మీద దాని పురోగతి ఆధారపడి వుంది. అస్పృశ్యతనూ, అసమానతనూ పోనాడి వెనకబాటుతనంతో అవమానాలకు గురి అవుతున్న వర్ణ పంచమత్వాన్ని నిరాకరించడం, వారికి మిగిలిన వారితో సమాన ప్రతిపత్తిని కలిగించడం ఆ వుద్యమ పురోగతికి ఆయువుపట్టుగా వుంది. ఫ్యూడల్‌ ఆచారాలనూ, ఆలోచనలనూ, అలవాట్లనూ పోనాడి, జనంలో తలెత్తుతున్న కొత్త ఆలోచనలకూ, ఆచారాలకూ పుష్టినివ్వాలి. వానిని అలవాటు చెయ్యాలి. చరిత్ర గతి క్రమంలో ఆంధ్ర ప్రజ ఫ్యూడల్‌ సమాజపు కట్టుబాట్లు, ఆచారాలు, ఆలోచనలు మానవతకు విరుద్ధంగా వున్నాయని అనుమానించడం, నిరసించడం, ధిక్కరించడం శతాబ్దాలుగా సాగుతూనే వుంది. అయితే 19వ శతాబ్దంలో బెంగాల్‌ నుంచి వలస వచ్చిన బ్రహ్మసమాజం ప్రభావం వానికో రూపాన్ని ఇచ్చింది. వాని బలంతో జాతీయోద్యమం పుంజుకుంది. దాని వత్తాసుతో అవి మరింత పుంజుకున్నాయి. ఆ కథలూ, గాధలూ చరిత్రగా రూపొందుతున్నట్లు గ్రహించకపోతే జాతీయోద్యమ గతీ, దానిలో మన పాత్రా అర్థం కావు. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణనిస్తాను. కొల్లాయి గట్టితేనేమికి ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య ఎకాడమీ 1968లో అవార్డునిచ్చింది. ఆ అవార్డు తీసుకోడానికి హైద్రాబాద్‌ సారస్వత పరిషత్తు హాలుకు వెళ్ళేను. అక్కడ నోరి నరసింహశాస్త్రిగారూ, పోలూరి ఆంజనేయ ప్రసాదుగారూ కనిపించేరు. శాస్త్రిగారు నన్నభినందించి-- "నీ నవల రెండు వడపోతలయి జడ్జిమెంటుకి వచ్చింది. నీ పుస్తకం నేను చూడలేదు. మార్కెట్టులో ప్రయత్నించినా దొరకలేదు. చివరకు అతను (ఆంజనేయ ప్రసాదు) తెచ్చి ఇచ్చాడు. చదివేను. నా చిన్ననాటి జీవితం గుర్తు వచ్చింది. చాలా అద్భుతంగా రాసేవు." అన్నారు. " నీ పుస్తకానికి నా వోటు వేశా." "సంధ్యావందనాదికాన్నీ, సాంప్రదాయికాచారాల్నీ అపహాస్యం చేశానే మీకది ఎట్లా నచ్చింది" అన్నా. శాస్త్రిగారూ, నేనూ 1936 నుంచి మిత్రులం. వారి నైష్ఠికత నాకు బాగా పరిచితం. మల్లారెడ్డి (శాస్త్రిగారి నవల) నవల పీఠిక గురించి నేనాయనతో భేదించడం, తనను సమర్థించుకుంటూ ధర్మశాస్త్రాలను ఉదహరిస్తూ ఒక రాత్రంతా ఆయన వాదించడమూ 1960లో కథ. "ధర్మ శాస్త్రాలు సరే, అవి ఈనాడూ అమలు జరుగుతాయనీ, జరగాలనీ మీరంటారా? నేనంగీకరించను" అన్నాను అప్పుడు. ఇప్పటి నా ప్రశ్నకి మూలం అది. శాస్త్రిగారు నవ్వుతూ. "అది నీ కమ్యూనిస్టు గోరోజనంలే, కాని చాల గొప్పగా రాసేవు. కమ్యూనిస్టువయిపోయావు గాని, తెలుగువాళ్ళు నీకు బ్రహ్మరథం పట్టేవారు కాదటోయ్‌" అన్నారు. "కమ్యూనిస్టునయ్యాను గనుకనే బ్రహ్మరథం పట్టించాలన్నట్లు వ్రాసేననుకోండి" అన్నాను. శాస్త్రిగారు గొప్ప జాతీయవాది. రెండో వేపున కట్టర్‌ సంప్రదాయ వాదిన్నీ. అందుకే ఈ సంభాషణను ఇక్కడ వుదహరించాను. ఆయనలోని సాంప్రదాయికత జాతీయోద్యమంలో వస్తున్న భిన్న ధోరణులకు వ్యతిరేకం కాలేదు. వానికి సహకరించింది. శాస్త్రిగారు నా నవలలో తమ చిన్ననాటి జీవితాన్ని చూసుకున్నాను అంటే నవలలో జీవిత వాస్తవాలు చిత్రించబడినాయనుకోవాలి. అంటే సమాజంలో వస్తున్న మార్పులు, అవి తమ సాంప్రదాయక పంథాకు భిన్నంగానే వున్నా "అది కమ్యూనిస్టు గోరోజనంలే" అని సాచివేయగలంతగా అలవాటయిపోయింది. అంటే ఆ మార్పులు జీవితంలో భాగాలయిపోయాయి. ఆ మార్పులు దేశ జీవితంలో భాగాలనడాన్ని కార్యకారణ సంబంధాలుగలవిగా చూపడం చేతనే ఆయన నవలలో తన చిన్ననాటి జీవితాన్ని చూడగలిగేరు. మాలపల్లి స్వాతంత్య్రోద్యమానికి సంబంధించిన నవలే. కొల్లాయి గట్టితేనేమి లాగ 1920 ప్రాంతాల నాటి వుద్యమాన్నే అందులో చిత్రింప బూనుకున్నారు. అయితే అందులో వుద్యమాన్నిidealistic పంథాలో చిత్రించారు. కాని, నేనీ నవలలో 'ఒక యుగసంధితో భిన్న చారిత్రక ధర్మాల మధ్య జరిగే చారిత్రక సంఘర్షణను వ్యక్తుల వ్యక్తిత్వాలలో జరిగే అంతస్సంఘర్షణ'గా చిత్రించ ప్రయత్నించాను. చాల అరుదైన ఈ కళాభిజ్ఞతను సమకూర్చినది మార్క్సు వివరించిన చారిత్రకభౌతికవాద విజ్ఞానమే. 1936-37లలో మార్క్సేయ గతితర్కాన్నీ, చారిత్రక భౌతికవాదాన్నీ చదివాను అని మాత్రమే చెప్పగలను. ఆ రోజుల్లో మాకు దొరికిన మార్క్సిస్టు సాహిత్యమే తక్కువ. లెనిన్‌ రాసిన 'Two Tactics', 'what is to be done' లాంటివి దొరికేవి. అయితే రష్యను రాజకీయ పార్టీల Polemics మీద నాకు ఎందుచేతనో ఆసక్తి కలుగలేదు. మార్క్సు గురించి లెనిన్‌ వ్రాసిన వ్యాసం చిక్కింది. కాంగ్రెసు నాయకుడు కళా వెంకట్రావుగారు మార్క్సు రాసిన Capital మొదటి సంపుటం ఇచ్చాడు. దానినింక వదలలేదు. అందులో ఆయన గతితర్క సూత్రాలను రాజకీయాలకి సమన్వయం చేయడం 18th బ్రూ మెయిర్‌లో చూశాను. జీవితానికి గతితర్క సూత్రాలనన్వయించడం, ఆ కోణం నుంచి జీవితాన్ని అర్థం చేసుకోవడం మీదనే నా దృష్టి అంతా. మార్క్సిజాన్ని అర్థం చేసుకున్నాక ఆ కోణం నుంచి నా అనుభవాలన్నీ కొత్త అర్థంలో కనబడసాగాయి. నేను చదువుకొన్నది సంస్కృతం, తెలుగు, హిందీ ఈ మూడు భాషలలోనూ సాహిత్యాన్ని బాగానే చదివాను. మార్క్సిజం చదివాక ఆ చదువుకొన్నదంతా కొత్త కోణం నుంచి కనబడింది. శాకుంతలంలో కాళిదాసు 'సతాం హి సందేహ పదేషు వస్తుషః ప్రమాణమంతఃకరణ ప్రవృత్తయః' అంటూ మంచివాళ్ళకి మంచి ఆలోచనలే వుంటాయి అనే ఆనాటి జనంలోని విశ్వాసాన్ని నొక్కి చెప్పాడు. తరువాత ఓ వెయ్యేళ్ళకు పుట్టిన అయ్యప్పదీక్షితుల వారు తమ 'చిత్ర మీమాంస'లో ఆ శాకుంతల శ్లోకాన్నే వుదహరించి దాన్ని ఒక అలంకారం--ఆత్మ ప్రత్యయాలంకారం అనేవాడు. అంటే కాళిదాసు కాలం నాటి విశ్వాసం అప్పయ్య దీక్షితుల కాలం నాడు--ఒక అందంగా చెప్పిన అబద్ధం! మనుష్యుని సంస్కారంలో ఎంత మార్పు వచ్చింది? ఆ కాళిదాసే కుమార సంభవంలో 'భవనేత్ర దహ్ని' మన్మధుణ్ని మసి చేసేసిందంటాడు. అక్కడ 'భవ' శబ్ద ప్రయోగం ఔచిత్య భంగం అంటాడు, ఓ వెయ్యేళ్ళ తరవాత పుట్టిన క్షేమేంద్రుడు తన ఔచిత్య విచార చర్చలో. ఈ మధ్యకాలంలో శబ్దార్థాలలోనే మార్పు వచ్చిందా? పాణిని వ్రాసినట్లు మేమంతా శతాంధువుల్లాగ చదివాం (శతాంధాః కూపం ప్రవిశంతి శతాంధుః) అన్నమాట. చదువుతున్న రోజుల్లో దేనికదే చదివాం. కంఠోపాఠం చేశాం. మార్క్సిజం చదివాక ఆ చదువుల లోపం కనబడసాగింది. 'హయ్యంగనీనమాదాయ ఘోష వృద్ధానుసస్థితాన్‌' అనే శ్లోకం ఆనాటి సామాజిక నిర్మాణాన్ని ఆలోచింప చేస్తున్నదనుకొన్నామా? 'సమ్పణ్శయే వీత హిరణ్మయ త్యాత్‌ పాత్రేనిధా యార్ఘ్యమనర్ఘశీలం' అనే శ్లోకంలో రఘు మహారాజు చేశాడని సూచించిన విశ్వజిద్యాగం వంటివి, సమాజంలో పెచ్చు పెరుగుతున్న కలిమిలేముల అవ్యవస్థను సరిదిద్దడం కోసం సమాజం విధించిన ఉపశమన క్రియలనే భావం మార్క్సిజం చెప్పే వరకూ వూహలకెందుకందలేదు? అలాగే జీవితంలో అనుభవించినవి, చూసినవి, విన్నవి అవగాహన కావడం మార్క్సిజం చదివాకనే. గత జీవితానుభవాలను కొత్త వెలుతురులో అవగాహన చేసుకొనేందుకు నేను నిత్యం ఆలోచిస్తుండేవాడిని. ముంగండలో సంస్కృత పాఠశాల పెట్టాలనే ప్రయత్నం మూన్నాళ్ళ ముచ్చటయింది. ఎందుచేత? అంతక్రితమూ, అటు తర్వాత కూడా గ్రామంలో వారాలు చేసుకుంటూ చదువుకొంటూండిన విద్యార్థులే ఆ పాఠశాల బాలురు. అంతవరకూ మాకు సాహిత్యం, అలంకార శాస్త్రం, వ్యాకరణం చెప్పిన-చెప్తూన్న పండిత గురువులే ఆ పాఠశాల వుపాధ్యాయులు. కాని అది మూడు రోజులైనా నిలవలేదు. ఎందుచేతనన్న ప్రశ్నకు చారిత్రక భౌతికవాదం సమాధానం ఇచ్చే వరకూ నాకు తట్టలేదు. చరిత్ర గతిని చూపి, జ్ఞానోదయం కలిగించిన మొదటి అంశం అది. రెండోది మాల, మాదిగలను వీధులలోకి రానివ్వని గ్రామ వీధుల్లో మే దినోత్సవం పేరున పేటల జనాన్ని వూరేగింపుగా తెచ్చేం. గంద్రగోళం జరుగుతుందేమోనని భయపడ్డాం. కాని ఎక్కడా అభ్యంతరం మాటే వినబడలేదు. దీనికి సమాధానం మార్క్సు ఆర్ధిక సూత్రాలలో దొరికింది. ఆర్ధికావసరాల దృష్ట్యా మాల మాదిగలను వూరి వీధులలోకి తీసుకురానివ్వాలనే దృష్టి గ్రామీణులలో అదివరకే అంతర్గతంగా వుంది. అందుచేతనే ఆ వూరేగింపు ఒక విధంగా వారి వాంఛకు రూపం ఇచ్చింది. కనకనే చల్లగా వూరుకున్నారు. రాజమండ్రిలో శ్రీపాద కామేశ్వరరావుగారని ఒక అడ్వకేట్‌ వుండేవారు. మంచి విద్యావంతుడు. ద్విజేంద్రలాల్‌రాయ్‌ నాటకాలెన్నింటినో తెలుగులోకి అనువదించిన రచయిత. వీరు తమ కోడలు చదువులకెగబడి కాపురానికి రావడం లేదని కోర్టుకెక్కేరు. ఆ కేసు విచారణలో ఒక రోజున 'వినోదం' చూడడానికి నేను కోర్టుకు హాజరయ్యేను. తరవాత కేసు నుంచి విడబడి ఆమె స్కూళ్ళ ఇన్‌స్పెక్ట్రస్‌గా పనిచేసి రిటైరయి ఇప్పుడు విజయవాడలోనే ఒక విద్యాసంస్థ నడుపుతున్నారు. ఆమె పేరు శీతారామమ్మ. నేనామెను ఇటీవలనే కలుసుకున్నా. ఆమె స్త్రీవాద దృష్టిలో అత్తవారిమీద తిరుగుబాటు చెయ్యలేదు. చదువు కోసం ఆమె ఆసక్తి, స్త్రీలలో పెచ్చు పెరుగుతున్న విద్యాభిలాషకి ఆమె తిరుగుబాటు ఒక సూచన. ఈనాడు కాలేజీలలో చదువుతున్న యువతులు, వివిధ ఉద్యోగాలలో వున్నవారు ఆమె వారసులు. ఆ రోజుల్లోనే అనేదేమిటి? సెక్సు జీవితంలో భాగం. సమాజంలో పెచ్చు పెరిగిన కులభేదాలు ఆచార భేదాలు ఆ జీవన సహజ వాంఛని వికృతం చేయగలవేగాని నిరోధించలేవు. మా పెత్తల్లిగారి మగడు ఒక బలిజ అమ్మాయిని చేరదీశాడు. ఆమెకో యిల్లు ఏర్పరచేడు. భోజనం మినహా ఆయన మకాం అక్కడే. ఆయనకో కొడుకు కలిగేడు. ఆ కుర్రవానిని ఇంటికి తీసుకొచ్చి తన పంక్తిన పెట్టుకొనేవాడు. చదువు చెప్పించేడు. పెళ్ళి మాత్రం తల్లి కులం పిల్లనే వెతికి చేశాడు. సంప్రదాయాచారాల ప్రకారం అయితే ఆయనని వూరిలో వెలివేసి వుండేవారు. కాని ఎవ్వరూ నోరు విప్పలేదు. కాని ఆ కుర్రవానికి తన స్థితి అవమానకరంగా తోచింది. ఒకరి ఉంపుడుకత్తెగా వుండిందని తల్లిమీద కోపం. తనతో సమంగా బ్రాహ్మణత్వం ఇవ్వనందుకు తండ్రిమీద కోపం. పెళ్లి అయి వుద్యోగంలో చేరేక మరి వూరు వేపు రాలేదు. తల్లిదండ్రులను చూడలేదు. ఒక పాతిక ముప్పయ్యేళ్ళ తరువాత అతని కూతురు తన కమ్యూనిస్టు భర్తతో మా వూరు వచ్చింది. ఆమెకు మా అమ్మగారు చీర పెట్టి సత్కరించింది. అది అప్రస్తుతం. అసలు విషయం తండ్రి అనాచారాన్ని బ్రాహ్మణ సమాజం సహించింది. ఎందుచేత? ఆ కొడుక్కు తల్లిదండ్రుల మీద ఆ కోపం ఏమిటి? మార్క్సిజం అధ్యయనం చేశాకనే ఆ ఘటనలు అర్థం అయ్యాయి. ఒకవేపున కులాచారాల పట్టు సమాజంలో శిధిలం అయిపోతూంది. కృత్రిమంగా బిగిసివున్న ఆచారాలు కల్పిస్తున్న అవమానం సహించరాదనే జ్ఞానం, చైతన్యం కొత్తతరంలో మేల్కొంది. ఈ విధంగా సమాజం నూతన సంబంధాలను ఏర్పరచుకోవలసిన రోజు వచ్చింది. సమాజం అటు వేపు కదులుతూంది. ఈ నిర్లక్ష్యాలు, కోపతాపాలు నూతన దశకు హార్బింజర్సు (Harbingers) మాత్రమే. మార్క్సిజం చదవనంత వరకు ఈ ఘటనల మీద నా ఆలోచనలు ఆ వ్యక్తుల చర్యలకు విరుద్ధంగానే వుండేవి. అవి సామాజిక ధర్మాలుగా తోచలేదు. రెబ్బాప్రగడ మందేశ్వరశర్మగారు, జోస్యుల అప్పురామమూర్తిగారు వంటి నైష్టిక దేశభక్తులు నాకు సన్నిహితంగా వుండేవారు. వారు తమ ఆస్తులు, ఆరోగ్యం, కుటుంబాలు గురించి చూసుకోలేదు. ప్రజాసేవకు అమూర్తమైన దేశ సేవకు కాదు సుమండీ. గిరిజన, హరిజన సేవకు జీవితాలను ఖర్చు చేశారు. కాని కులాచారాలను కొంచెం కూడా పట్టువిడవకుండా ఆచరించేవారు. దీనికి సమాధానం ఇచ్చినది మార్క్సిజంలోని మానవత్వం, కార్యకారణ సంబంధాలను ఆలోచింపచేయగల తార్కిక శక్తిని భూతకాలం నుంచి వర్తమానంలోకి, వర్తమానం నుంచి భవిష్యత్తులోకి వున్న మార్గాల క్రమ పరిణామాన్ని చూడగల అవగాహనశక్తిని అది అందించింది. నేను అందుకోగలిగేనని ఇప్పుడు చదువుతున్న అమృతలాల్‌ సాగర్‌ 'అమృత్‌ ఔర్‌ విష' చెప్తూంది. 1960ల నాటి లక్నో సమాజం, యు.పి., రాజకీయాలు దానిలో ప్రస్తుతం. 1960లలోనే నేను రాసిన కొల్లాయి గట్టితేనేమిలో చిత్రించిన 1920ల నాటి ఆంధ్రదేశపు గ్రామాల స్థితిని నైష్ఠికులైన నోరి నరసింహశాస్త్రిగారు తన కథే తను జీవించిన తెలుగు సమాజమే అన్నంత తాదాత్మ్యాన్ని అనుభవించారు. అది ఆయన మాటే. 1960ల నాటి మన ఆంధ్ర సమాజ జీవితాన్ని నా నవల 'కత్తుల వంతెన', 'ఎవరికోసం'లలో చిత్రించేను, ఈ మూడు చదివితే మన తెలుగునాడులో ఈ నలభై ఏళ్ళ మధ్య కాలంలో వచ్చిన అభివృద్ధి కనబడుతుంది. ఆ దృష్టిలోంచి చూస్తే ఉత్తరప్రదేశ్‌ సమాజం 1920 నాటి తెలుగు సమాజం స్థాయికి కూడా రాలేదనిపిస్తూంది. బి.జె.పి. ప్రభుత్వం ఏర్పడిన తీరే, సామాజిక పరిస్థితులే అక్కడ వున్నాయా? జాతీయోద్యమం విస్తరించడానికి అవసరమైన సామాజిక పరిణామ క్రమం అక్కడ పనిచేయలేదా? ఆ విషయంలో ఆంధ్రదేశం చాలా చాలా ముందే వుంది. ఇదెట్లా సందర్భపడింది? ఆంధ్ర జిల్లాలకు భౌగోళికమైన ఒక సౌలభ్యం వుంది. అది ఉత్తరానికి, దక్షిణానికీ మధ్య సేతువులా వుంది. పశ్చిమాన వున్న మహారాష్ట్రంతో, కర్ణాటకంతో సుదీర్ఘమైన సరిహద్దు వుంది. ఫలితంగా ఏ దిశలో వచ్చిన భావ విప్లవమూ ఆంధ్రకి ఇట్టే అందేది. ఈనాడు తెలుగునాడు ప్రతి గ్రామం కూడలిలోనూ జరుపుకొనే వినాయక నవరాత్రి ఉత్సవాలు మనకి మహారాష్ట్రం నుంచి అందేయి. ఆంధ్రదేశపు వర్తమాన చరిత్రనే మార్చివేసిన బ్రహ్మసమాజం, రెండు వేల ఏళ్ల క్రితం ఆంధ్రలో మూల మూలకంటా విస్తరించిన జైన బౌద్ధమతాలు ఉత్తరాది నుంచి వచ్చాయి. వీరశైవం కర్ణాటక దేశపు బహుమతి. వైష్ణవం తమిళ బహూకృతి. ఇటీవలి కాలంలో పెరియార్‌ రామస్వామి నాయకరు Self-respect movement మన వైవాహిక సంప్రదాయాలను పూర్తిగా తల్లక్రిందులు చేసింది. నేడు ఆంధ్రలో పరిపాటి అయిపోయిన దండల పెళ్ళిళ్ళూ, సభాముఖంగా పెళ్ళిళ్ళూ పద్ధతిని ప్రవేశపెట్టినదీ, అలవాటు చేసినదీ కమ్యూనిస్టులు. Self-respect వుద్యమ నాయకుడుగా పేరు పొందిన జీవానందం మొదటి తరం కమ్యూనిస్టులకు ఆప్త మిత్రుడు. ఈ వివిధ భావాలూ, వుద్యమాలూ తెచ్చిన సంస్కారాన్ని ప్రజల సంస్కారంగా మార్చిన ఘనత వీరేశలింగం, చలం గార్లదీ, మార్క్సిస్టు భావజాలానిదీ. మద్రాసులో నేను వుద్యోగం చేస్తున్న కాలంలో తమిళ, కర్ణాటక మిత్రులతో పలుమార్లు ఈ విషయం మీద చర్చలు జరిగినప్పుడు తెలుగు యువకుల మనస్సుల తుప్పుదుళ్ళ కొట్టినదీ, ఇతర రాష్ట్రాలు వారు వదుల్చుకోలేకుండా వున్న inhibitions పీడవదల్చినదీ వీరేశలింగం, చలమూనని వాదించేవాడిని. కేరళీయులకు వారి సంస్కర్తలున్నారు. పంతులుగారిదీ, చలంగారిదీ ఋణం తీర్చగలది కాదు. దేశ సాహిత్యంలో కొల్లాయి గట్టితేనేమి? నవలకున్న స్థానాన్ని అర్థము చేసుకోవాలంటే భారతీయ సమాజంలో ఆంధ్ర ప్రజాజీవితంలోని ప్రత్యేకతలను అర్థము చేసుకోవాలి. మిత్రులు రాచమల్లు రామచంద్రారెడ్డి తమ 'సంవేదన' వ్యాసంలో ఇలా వివరించేరు. ".....1920 నాటి రాజకీయ వాతావరణంలో కొన్ని అంశాలు గమనార్హం. బెంగాల్‌లోనూ, పంజాబ్‌లోను ఆనాడు టెర్రరిస్టు వుద్యమం బలంగా వుండింది. ఆంధ్రదేశ రాజకీయాల్లో అది ఎప్పుడూ ప్రవేశించలేదు. మహారాష్ట్రలోనూ, ఇతర ఉత్తర భారత ప్రాంతాలలోనూ, జాతీయోద్యమంలో హిందూ మతాభిమానమూ, సనాతన ధర్మ పునరుద్ధరణ వాదప్రాబల్యమూ పెనవేసుకొని వుండినాయి. ఆంధ్ర రాజకీయాల్లో వాటికెప్పుడూ స్థానమే లేదు. మతాభిమానమూ, సనాతన ధర్మమూ బ్రిటిష్‌వాళ్ళ తాబేదార్లుగా వ్యవహరించాయేగాని దేశభక్తులెప్పుడూ వానిని ఆదరించలేదు. కాంగ్రెసు మంత్రులకూ, స్వతంత్ర పార్టీ నాయకులకూ తిరుపతి దేవుడు ఈనాడు వేలుపైనాడు గాని, ఆనాటి జాతీయ నాయకులు ఉద్యమ ఫలసిద్ధికి తిరుపతి దేవునికెప్పుడూ ముడుపులు కట్టుకోలేదు. నిజానికి తెలుగుజాతి జీవితంలో జాతీయోద్యమం కంటే ముందే సంఘసంస్కరణా, తదనుబంధంగా మత సంస్కరణా ఉద్యమరూపంలో ప్రవేశించినాయి. అనగా 1920 నాటికే తెలుగుదేశంలో మత విశ్వాసాలమీద తిరుగుబాటు, బూర్జువా మనస్తత్వ వికాసమూ బహుముఖాలుగా ప్రారంభమై వుండింది. ఇది ఆనాటి ఆంధ్రదేశ ప్రత్యేకత అనుకోవచ్చు." (సారస్వత వివేచన పుట-10) ఆ సమాజంలో నిత్యజీవితం గడుపుతున్న వానికి ఈ లోతులు ఎప్పుడో కాని అర్ధం కావు. అర్థం అయినప్పుడు కలిగే ఆనందానికి అంబరం వుండదు. ఈ నవల రాస్తున్న రోజుల్లో ఓ మారు రాజమండ్రిలో మా తమ్ముడు జగన్మోహనుని యింటికి వెళ్ళేను. అప్పుడే అక్కడికి సుప్రసిద్ధ కాంగ్రెసు నాయకులు వెన్నేటి సత్యనారాయణగారు వచ్చేరు. నేను రాస్తున్న నవల ప్రసక్తి వచ్చింది. నా ప్రయత్నాన్ని అభినందిస్తూ నేనెప్పుడూ విని వుండని రెండు విషయాలు చెప్పేరు. గాడిచర్ల హరిసర్వోత్తమరావుగారిని కాలేజీ నుంచి బహిష్కరించిన కేసులో ప్రభుత్వం నియమించిన విచారణాధికారి మోచర్ల రామచంద్రరావుగారు విచారణానంతరం ఒక మాట అన్నారట. "నా కొడుకే ఆ విధంగా వ్యవహరించి వుంటే ఎంతో సంతోషించేవాడిని"... అని. "అటు తర్వాత రాజమండ్రిలో జాతీయ కళాశాల పెట్టాలనే ఆలోచన వచ్చి టౌనుహాలులో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి ముందు డిప్యూటీ కలెక్టరూ, డి.వై.ఎస్‌.పి. వచ్చి కూర్చున్నారు. వారి రాక టౌను పెద్దలలో చాల మందికి బెదురు పుట్టించింది. సభకు పిలిచిన న్యాయపతి సుబ్బారావుగారు అందరికీ ధైర్యం చెప్పేరు. సభను ప్రారంభించే ముందు ఆయన బంట్రోతును పిలిచి కొత్తవాళ్ళు రాకుండా గేటు వేసెయ్యమన్నారు. తరవాత సభలో కూర్చున్న వారిలో ఆహ్వానాలు లేనివారిని పంపెయ్యమన్నారు. ఆ మాట అనడంతో అనాహూతంగా వచ్చిన అధికారులు సభ విడిచిపోయారు" అంటూ "మీరు మితవాదులనేవారు చేసిన పని ఇది. మీరే అయితే ఆ ధైర్యం చేసి వుండేవారా?" అని సవాలు విసిరేరు. నేను నవ్వేను. "మా కమ్యూనిస్టులకి ఆ ఉపాయం తోస్తుందా అంటే చెప్పలేను. కాని ధైర్యం ఫర్వాలేదు" అన్నాను. మిత్రులు రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించినట్లు 'తెలుగుజాతి జీవనంలో జాతీయోద్యమం కంటె ముందే సంఘసంస్కరణా, తదనుబంధంగా మత సంస్కరణా ఉద్యమరూపంలో ప్రవేశించాయి' ఎలాగ? ఎందుచేత? అనే ప్రశ్నలకి సమాధాన రూపంలో మార్క్సు రచనల నుంచి పేజీలకు పేజీలు ఎత్తిచూపి నాకున్న పాండిత్యాన్ని ప్రదర్శించే బులపాటం లేదు. అంత అవసరమూ లేదు. నా మనస్సుని పట్టిపోయి, నా ఆలోచనలను శాసిస్తున్న మార్క్సు సిద్ధాంతాలను నా మాటలలో చెప్పి వదిలేస్తా-- ఆర్థిక నిర్మాణం మారుతున్నప్పుడు సమాజవ్యవస్థ యొక్క నిర్మాణ రూపాలు మారుతాయి. ఒక వ్యవస్థలో ఎంతో చక్కగా పనిచేసిన నిర్మాణరూపాలే మరో వ్యవస్థలో పనిచేయవు. మనిషి ఎప్పుడూ తన సుఖాన్నీ, సౌలభ్యాన్నీ చూసుకొంటాడు. వానికి అనుగుణంగా జీవనపద్ధతిని సవరించుకుంటాడు. అటువంటి సవరణల సంఖ్య పెరుగుతూ వచ్చి జీవన పద్ధతులే మారిపోతాయి. ఇదంతా చాపకింద నీరులా మారుతున్న మార్చుకుంటున్న మనిషికి కూడా తెలియకుండా జరిగిపోతుంది. కొత్తపాతలని అర్థం చేసుకునేందుకు శాతాల నిర్ణయం పనికిరాదు. ఏది క్రమంగా పెరుగుతూంది, ఏది క్షీణిస్తూంది గమనించాలి. నీ కోరికలతో నిమిత్తం లేకుండా ఈ పరివర్తన సాగిపోతూనే వుంది. ఆ క్రమంలో మానవుడూ, వాని సమాజ నిర్మాణమూ సాగిపోతున్నాయి. మనం ఎంతో దుర్భరమూ, అన్యాయమూ అని అసహ్యించుకొనే బానిసత్వం కూడా సామాజిక పురోగతికి అవసరంగానే ఏర్పడింది. అది సమాజంలోని ఆర్థిక పురోగతికి ఆటంకంగానున్నప్పుడే తొలగి పోతుంది. అమెరికాలో నీగ్రో బానిసల శ్రమ ఉత్పత్తికి ఆటంకమైంది. కనుకనే ఉత్తర రాష్ట్రాలు బానిసత్వ నిర్మూలనకై పోరాటం జరిపాయి. ఈ మార్పులన్నీ మనిషికి తెలియకుండానే జరిగిపోతున్నాయి. కారణం మార్పులకి మూలం ఎక్కడుందో వారికి అర్థం అయ్యే పరిస్థితులు లేవు. కారణం అర్థం కాకపోయినా ఫలితాలు చూస్తాడు. వాని ప్రతిబంధకత్వాన్ని చూస్తాడు. అనూచానంగా వస్తున్న నిర్మాణాలనూ, అచారాలుగా మారిపోయిన అలవాట్లనూ ఎందుకు మార్చాలో తన ఆలోచనలకనుగుణంగా సిద్ధాంతీకరిస్తాడు. ఇదో అనంతమైన యాత్ర. ఆర్థిక వ్యవస్థలో వచ్చిన పరిణామం, సమాజ పరిణామ సూత్రానికి భాష్యం చెప్పింది. దానిని అర్థం చేసుకుని పని చేస్తే సమాజ గతిని త్వరితపరచగలం. ప్రస్తుతం తలెత్తి విజృంభిస్తున్న శాస్త్ర, సాంకేతికాభివృద్ధితో ముడిపడిన అధికోత్పత్తి విధానం యొక్క పరిణామం సోషలిజంలోకి, దాని నుంచి కమ్యూనిజంలోకి పరివర్తనను తెచ్చి తీరుతుంది. ఆ పరిణామం ఎంతకాలంలో వస్తుంది? దాని తరువాత రాగల వ్యవస్థ ఏమిటి? అనే విషయాన్ని వారు భవిష్యత్తుకే వదలివేశారు. ఇది స్థూలంగా, అత్యంత సంగ్రహంగా ఘనీభూత రూపంలో గతి తార్కిక చారిత్రక భౌతిక వాద సిద్ధాంతం. కనీసం నేను అర్థం చేసుకున్నదీ, నాకు అర్థమయినదీ. నా జీవితంలో 5వ ఏడాది నుంచి 40వ ఏడు వరకూ చూసినవీ, విన్నవీ, చదివినవీ విశదంగా గుర్తున్నాయి. వానికి ఈ సిద్ధాంతాన్ని జోడించి అర్థం చేసుకొనేందుకు ప్రయత్నించాను. దానిని చూసి మార్క్సు సూత్రాలకి జీవిత ఘటనల్ని మెకానికల్‌గా అమరుస్తున్నానని 1941-44 జైలు కాలంలో ఎస్‌.వి. ఘాటే అధిక్షేపించారు. నేను ఒప్పుకోలేదు. మన బంధుత్వపు పిలుపులు పెదనాన్న, చిన్నాన్న అనేవి పెదతల్లి, పినతల్లి అనేవీ వాళ్ళందరి పిల్లలూ, అన్నదమ్ములూ, అక్కచెల్లెళ్ళుగా పిలుపులూ--ఇవి మనలో కూడా ప్యువలాన్‌ కుటుంబాలు పరిపాటిగా వుండేవనడానికి సాక్ష్యం అని నేను జైలులో క్లాసులు నడిపినప్పుడు చెప్పేవాడిని. దానికాయన మొదట ఒప్పుకోలేదు. కాని మన పిలుపులకు కారణం ఏమయివుండాలని నేను మొదలకించా. ఏమీ చెప్పలేక అర్ధాంగీకారంగా వూరుకున్నారు. (ఫ్యువలాన్‌ కుటుంబం మొదలయిన వాని వివరాలు ఏంగిల్సు రాసిన Origin of Family Private Property and State లో చూడండి) ఇటువంటి నాలుగైదు సందర్భాలు తటస్థపడి నా ఆలోచనలు సరియైన దారిలోనే నడుస్తున్నాయనే విశ్వాసం కలిగింది. నా నవలలన్నీ ఆ విధమైన సమన్వయ ధోరణితో రాసినవే-- నా 'కొల్లాయి గట్టితేనేమి?'ని సమాజ పరిణామ గతిని కథలో చూపడం కోసమే రాశాను. ఆ నా వుద్దేశ్యాన్ని రామచంద్రారెడ్డి సరిగ్గానే గ్రహించారు. అయితే ఆయన కూడా దేశరాజకీయాలకే తమ అన్వేషణను పరిమితం చేశారు. సమాజ పరిణామ క్రమగతి పరిశీలన ఆయన విశ్లేషణకు బయటనే ఉండిపోయింది. నేను ముంగండనే కథా రంగంగా తీసుకోవడం మీద ఆయన తన వ్యాసంలో చేసిన వ్యాఖ్య అందుకు వుదాహరణ. "ఛాందసత్వాన్ని, ఈ వ్యవస్థ యొక్క(ఫ్యూడలిజం) పరమమైన (Absolute) రూపాన్ని చూడాలంటే బ్రాహ్మణ అగ్రహారాలలోనే సాధ్యం. అందుచేత రచయిత ముంగండను కార్యరంగంగానూ, రామనాధాన్ని కథా నాయకునిగానూ ఎన్నుకొన్నారు" అని రాశారు. ఇది రాజకీయ విశ్లేషణతో హేతుబద్ధమైన వ్యాఖ్యయే కాని, సామాజిక పరిణామచిత్రణను ఉద్దేశించిన దృష్ట్యా సరి కాదు. ముంగండ బ్రాహ్మణ అగ్రహారమే. నేను విన్నంత వరకు 19వ శతాబ్ధం ప్రారంభం నుంచీ దేశచరిత్ర గతితో దాని పాత్రను వింటున్నాను. 20వ శతాబ్ధారంభం నుండి సామాజిక పరిణామ గతి ఛాయలను చూస్తున్నాను. 19వ శతాబ్ధం నాటికి పీష్వాల దర్బారులో ముంగండ పండితులకు ప్రవేశం వుంది. 1818లో కిర్కీ వద్ద యుద్ధంలో కంపెనీల సేనల చేతిలో పీష్వా సేనలు ఓడిపోయాయి. ఆ యుద్ధంలో పాల్గొన్న పీష్వా సేనానాయకులలో ఒకడైన విశ్వనాధరావు అనే ఆయన తప్పించుకొని, తనకు పరిచితులూ, మిత్రులూ అయిన పండితుల సాయంతో సన్యాసిగా ముంగండలో శేషజీవితం గడిపారని నాకు నాటక అలంకారశాస్త్రాలు పాఠం చెప్పిన ఉపద్రష్ట సుబ్రహ్మణ్యశాస్త్రిగారు చెప్పారు. ముంగండకు సన్యాసులకు ఆశ్రయం ఇచ్చే సంప్రదాయం వుంది. నేను బాగా చిన్నప్పుడు ఓ అవథూత స్వామి, దిగంబరంగా వీధుల వెంట నడిచిపోతుండడం చూశాను. ఆయన కోసం గ్రామస్థులు మంచినీళ్ళ చెరువు గట్టుమీద ఆశ్రమమూ చెరువులోని కంటా పావంచాలు కట్టించి ఇచ్చారు. ఈ మఠం 1930 తర్వాత గ్రంథాలయానికి, గ్రామ యువజన సంఘానికి స్థావరం అయి 1942 వరకూ పోలీసు దాడులకు గురి అయింది. దిగంబర స్వామి అనంతరం అగ్నిహోత్రస్వామి (ఈయనే మా అమ్మగారి మేనమామ), ఆయన తరువాత పొట్టి స్వాములు, చివరగా తల్లావఝుల శివశంకరశాస్త్రిగారి సోదరుడు(ఈయనే ఆఖరి వారు. 1936 వరకూ జీవించివున్న జ్ఞాపకం.) అటు తరవాత మఠం శిథిలం అయిపోయింది. మా కోసం సాగిన పోలీసు దాడులకు బెదిరిపోయారో ఏమో కొత్తవారు రానూ లేదు. ఈ పోలీసు దాడులలో మాకు గ్రామీణుల సాయం బాగా వుండేది. ఒక రోజున తెల్లవారేసరికి పోలీసు బలగం చెరువు గట్టున వున్న మఠం, గ్రంథాలయం, యువజన కార్యాలయం సముదాయాన్ని చుట్టు ముట్టుతున్నారన్న వార్త వచ్చింది. ఆ రోజుల్లో మా వద్ద ఒక రివాల్వరు (పాతది, తూటాలు లేనిది) ఉండేది. దానిని పొరపాటున గ్రంథాలయపు బీరువాలో పుస్తకాల వెనుక పడేసి, రాత్రి ఇంటికి వెళ్ళాను. దానిని తీసెయ్యాలి. వెంటనే వెళ్ళి గ్రంథాలయ కార్యదర్శికి విషయం చెప్పాను. ఇద్దరం ఆలోచనలో పడి మఠం కాంప్లెక్సుకి బయలుదేరాం. మా కంగారును చూసి పక్కింటి పడుచు ఒకామె చెరువుకు మంచినీటికి బయలుదేరినట్లు బిందె చంకన వేసుకుని బయలుదేరింది. నా మిత్రుడు పోలీసు ఆఫీసరును మాటలలో పెట్టి చెరువు వేపు తీసుకెళ్ళాడు. నేను వెనక తలుపు తెరచి గ్రంథాలయంలో ప్రవేశించి, బీరువాలో వున్న రివాల్వరు తీసి, కిటికీలోంచి క్రింద వున్న పొదల్లో పడేశాను. మా వెనక వస్తున్న యామె చూసింది. దారిన పోతున్నట్లు వచ్చి, దానిని బిందెలో పెట్టుకొని ఏమీ ఎరగనట్లు వెళ్ళిపోయింది. ఊళ్ళో ఇంటికి వచ్చిన వాళ్ళు పేడనీళ్ళు తొక్కి రావాలని శాసించే శివరామయ్య తల్లులూ, పురోహితునింట తిండి తినడం పాపంగా భావించే నరసమ్మలూనేనా వున్నది. పైన చెప్పిన ఘటనలోని శీతమ్మలూ ఉండేవారు. 1929లో 2-3 వందల మంది సత్యాగ్రహులతో కాకినాడలో ఉప్పు సత్యాగ్రహానికి వూరేగింపుగా వెడుతూ వచ్చిన బ్రహ్మాజోస్యుల సుబ్రహ్మణ్యం గారికి ప్రతి వీధిలో వారులు పోసి, పుష్పహారతులిచ్చిన బాలలు, పడుచులు, గృహిణులు ఎందరో గ్రామంలో ఛాందసులున్నారు. కాని వారి సంఖ్య తగ్గిపోతూంది. బ్రహ్మ సమాజ బోధనల బలంతో అందరినీ గౌరవంగా పిలవాలనే నియమం మా నాన్నగారిది. అందరూ పుల్లిగా అని పిలిచే ఒక పనివాడిని ఆయన పుల్లన్నా అని పిలిచేవారు. ఆ పిలుపుతో అతడు కనబరచిన ఆనందం, ఆత్మాభిమానం నాకు గుర్తుంది. ఈ పరిణామాలన్నీ ఏ బ్రహ్మ సమాజ మతబోధనలతో ప్రభావితులైన యువకుల ప్రభావమే అనుకోకూడదు. ముంగండ దేశ చరిత్రలో ఒక భాగంగానే వుంది. 19వ శతాబ్ధపు ప్రథమ పాదంలో పిండారీ దండుల చివరి దశలో ఒక దండు ముంగండ మీదపడి ధ్వంసం చేసింది. కాని అంతలో గ్రామంలోని యువకులు తేరుకుని కూడగట్టి, తిరిగిపోతున్న దండులో చివరనున్న ఇద్దరిని పట్టుకున్నారు. వారిద్దరినీ కట్టేసి బ్రతికి వుండగానే మంటలలో వేసి చంపేశారు. వారి పేర్లు రాజిగాడు, గన్నడు. వారిని ఆ విధంగా చంపించిన పాప పరిహారానికై ఆ జట్టు నాయకుడు తన ఇంటి మొదటి సంతానానికి వారి పేర్లు పెట్టుకుంటానని మొక్కుకున్నాడట. ఆ సంప్రదాయం ఆ కుటుంబంలో నేటికీ పాటిస్తున్నారు. 1857 సిపాయిల తిరుగుబాటు కాలంలో ముంగండవాసి చెల్లూరి సుబ్బారాయుడు అనే ఆయన ఝాన్సీరాణి సైన్యాలలో పనిచేశాడు. ఆమె ఓటమి అనంతరం ఆయన నానాసాహేబ్‌ తమ్ముడు రావు సాహేబ్‌ దళాలతో హైద్రాబాద్‌ వచ్చి, ఆ బలగం విచ్ఛిన్నం అయాక ముంగండ తిరిగి వచ్చేశారు. ఝాన్సీ సేనలలో తాము చేసిన దురంతక చర్యలను (పట్టుబడిన ఆంగ్లేయుల్ని స్త్రీలు, పిల్లలు అనే విచక్షణ లేకుండా చెరుకు గానుగల కందించి చంపారట) గొప్పగా కథలుగా చెప్పుకునేవాడట. ఆ కథలన్నీ నా చిన్నప్పుడు కూడా గ్రామంలో చెప్పుకునేవారు. ఆయన ఇంటికి వచ్చాక అకారణంగానే భార్యను గునపం ఒదె వేసి చంపేసిన ఘటన చూశాక ఆయన చెప్తూండిన ఘాతుకాలు నిజమే అయివుంటాయని గ్రామం నమ్మింది. అసహ్య పడింది. తరువాత ఆయన రెండో పెళ్ళాం ఆయనకు కలిగించిన అవమానాలు, పెట్టిన తిప్పలు జనం హాస్యంగా చెప్పుకుని ఆనందించేవారు. దురంతక చర్యలలో పాల్గొన్నాడని అసహ్యించుకున్నా, ఒక ముంగండ వాసి దేశ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నాడనేంత వరకే ఇక్కడ ప్రసక్తి. ఈయన నా భార్య ముత్తాత తమ్ముడు. ఈ విధంగా ముంగండ చరిత్ర గతిలో దేశంతోపాటు ముందుకు అడుగు వేసింది. దేశం అంతటితోపాటు మంచి చెడ్డల్ని అనుభవించింది. ఈ దృష్టితోనే నేను ఒక్క 'కొల్లాయి గట్టితేనేమి'లోనే కాదు. అన్ని నవలల్లోనూ దానినే కార్యరంగంగా తీసుకున్నాను. అలాగే నవలలోని పాత్రలు, ఘటనలు మాతృకలు నిజజీవితంలో చూసినవీ అనుభవించినవే. అయితే చాలా మందిలాగ "నేను చూసినవే రాశానర్రోయ్‌" అని చెప్పను. ఏమంటే మనం చూసిన మనుష్యుల జీవితాలు వేరు. వారిని యధాతథంగా చిత్రించలేము. 'కొల్లాయి గట్టితేనేమి?' నవలలో స్వరాజ్యం పాత్రకూ, దాని మాతృకకూ పోలిక వారికి చదువుమీద గల ఆసక్తి కుటుంబ జీవితాన్ని భగ్నం చేసిందన్నంత వరకే. రామనాధం పాత్ర అంతే. వీరేశలింగం గారి ప్రభావంతో బాల్య వివాహం చేసుకోకూడదనుకున్నాడు. చేసుకొన్నాడు. చిన్నప్పుడే భార్యతో కాపురం వద్దనుకున్నాడు. సాగలేదు. ఆ విషయం వరకు రామనాధంలో నవలా రచయిత తనను చూపించుకున్నాడు. తర్వాత అతని జీవితం అంతా భిన్నమే. బాలకృష్ణ అస్త్రాలు సంపాదించడానికి ప్రయత్నించిన కథా, రాజకీయాలకు Protest గా టోపీలు తీసెయ్యడం, టీచరు కొట్టడం, దానిమీద తాతగారు (తండ్రిగారు) వెళ్ళి హెడ్‌ మాస్టరును సంజాయిషీ కోరడం ఘటనలు నా జీవితంలోనివి. కాని బాలకృష్ణ జీవితం నాకు ప్రతిబింబం కాదు. అలాగే గాంధీగారిని గన్నవరం వద్ద గోదావరి దాటడానికి వీలుగా అక్విడక్టులోకి సొలుపులు చేయించిన ఇంజనీరు కథ నిజం. ఆ ఇంజనీరు కొడుకు, అతని కథా కల్పితం. నిన్ననే ఆ నవల చదివిన ఒక అమ్మాయి "గాంధీగారు నిజంగా ముంగండ వచ్చారా?" అని రాసింది. రావడమే కాదు. ఆయనకు "యదా యదాహి ధర్మస్య' శ్లోకం తాటాకు మీద రాసి, పసరు పూసి కనబడేలా చేసి ఇవ్వడం కూడా నిజమే. కాని, తరువాత నవలలో కనిపించే 'సుందరమైన రాట్నమే' పాట అబద్దం. నిజానికి ఆ క్షణంలో నేను అక్కడే వున్నాను. అల్లాగే బెజవాడ ఎఐసిసి బహిరంగ సభలో ఆలస్యం మూలంగా గాంధీ గారి భోజనం ఆగిపోవడం, ఆ జనం మధ్య నుంచి కోడూరు వస్తాదు సోదరులు ఆయనను భుజాన ఎత్తుకొని బస చేర్చడం నిజం. అయ్యదేవర కాళేశ్వరరావు గారి మీద అయిష్టంతో గోపాలకృష్ణయ్యగారు రామదండు వలంటీర్లను Withdraw చేయడం నిజం. కానీ పేచీకి కారణంగా చెప్పింది అబద్దం. ఆ ఘట్టంలో చిత్తరంజనదాసు, అయ్యదేవర వారు చేసుకొన్న హాస్యాలు "మీ తెలుగు వాళ్ళకి తెలుగు అభిమానం జాస్తి"-- "అది మీ బెంగాలీల వద్ద నేర్చుకొన్నవే" అనే వాక్యాలు యదార్థం. ఆ రోజున దాసుగారికి సహాయకులుగా వున్న వలంటీరు కాట్రగడ్డ మధుసూధనరావు గారు చెప్పినవవి. దానినక్కడ ఆ రూపంతోనే అమర్చాను. ఆ విధంగా జరిగిన వానిని యధార్థంగానే చిత్రించాను. కాని వాటి పూర్వాపరాలు భిన్నం. ఈ విధంగా వాస్తవాలు కథ నడకలో కలిసిపోయినందుచేతనే నోరి నరసింహశాస్త్రిగారు దానిలో తమ చిన్ననాటి జీవితాన్ని చూసుకున్నట్లు భ్రమపడ్డారు. ఇందులోని కథా భాగం ఏదీ సత్యం కాదు. ఉదాహరణకు అమలాపురం హాస్పిటలులో కాంపౌండరుతో జరిగిన ఘర్షణ కథ. కాని ముంగండలో శంకరశాస్త్రి జ్వరపడినప్పుడు పూజారి వైద్యుడితో జరిగిన పంతం (పాత్రలు మినహా) యథార్థం. ఫలితం ఏమయింది? నవలలో ఏ అంశమూ అసత్యం కాదు. ప్రతి ఒక్కటీ ఎక్కడో ఒకచోట, ఎవరికో ఒకరికి ఏదో రూపంతో అనుభూతమైనవే. కాని అవి అల్లాగే జరిగేయనుకున్నా ఈ పాత్ర నేనేనర్రోయ్‌ అన్నా, నన్ను చూసే రాశాడన్నా తామెరిగిన వ్యక్తుల్ని పాత్రలలో చూసినా అది అసత్యం, వట్టి భ్రమ. ఇంక నా నవలలో ఎప్పుడూ ఎక్కడా ఎరిగివుండి ఎవరినో, ఎవరి చేష్టలనో బయటపెట్టాలనీ, దుయ్యబట్టాలనీ ఆలోచించలేదు. సామాజికంగా ఎదురయ్యే మంచిచెడ్డలను గానే వానిని పరిగణించాను. అందుచేత ఎవరి ముఖమైనా వానిలో కనిపించవచ్చు. పైన స్వరాజ్యం కథకీ చరిత్రగా మారిన ఒక ఘటనకీ గల పోలిక చెప్పేను. రామనాధం బావమరిది చంద్రశేఖరరావు అనాధ శరణాలయం పిల్లని పెళ్ళి చేసుకున్నట్లు రాశాను. నిజజీవితంలో కంభంపాటి తారకంగారు అటువంటి వివాహం చేసుకున్న వుదాహరణ వుంది. కాని, బ్రహ్మ సమాజం ఆంధ్ర సమాజంలో ప్రవేశపెట్టిన సంస్కరణల స్వభావం, అవి కాలక్రమంలో కులాంతర వివాహాలకు దారితీసిన ప్రథమ సంఘటనలుగా చూపడానికే వుపయోగించాను. ఇల్లా చెప్పుకుపోతే నవలలోని ప్రతి పాత్రకీ ఒక ఉద్దిష్ట లక్ష్యం నిజజీవితంలో ఓ సాక్షీ వున్నారు. ఈ సందర్భంలో ఇంకొక్కటి గుర్తు వస్తూంది. 'కొల్లాయి గట్టితేనేమి' ఆంధ్రపత్రికలో బు.వెం.ర, (బహుశా మిత్రులు బులుసు వెంకట రమణగారేమో) స్వాతంత్రోద్యమ ప్రచారానికి రామనాధం తలపెట్టిన ఒకే ఒక పని చిరుతపూడిలో బహిరంగ సభ పెట్టబోవడం. కానీ తీరా చూస్తే ఆ సభ జరగలేదు అని హాస్యం చేసేరు తమ సమీక్షలో. మనస్సులోని కోరికలు, వేసుకొన్న పథకాలకీ, అవి క్రియారూపం ధరించడానికీ మధ్య ఎంతదూరం వుంటుందో మనకు తెలుసు. రామనాధం తానే పెట్టుకొన్న వివాహ వయోనియమాన్ని మరచి పెళ్ళి ఆడేశాడు. కారణం అటువంటి నియమాలు సమాజ సంస్కారంలో భాగం కాలేదు. భార్యతో కాపురం వెంటనే పెట్టుకోవడం తప్పు అనే ఆందోళనతో బయలుదేరి అత్తవారింటికి వచ్చినప్పుడు ఒంటరిగా చిక్కిన భార్యతో చెలగాటం ప్రారంభిస్తాడు. ఆ ఘట్టం చాల సహజంగా, చక్కగా వున్నదని రంగనాయకమ్మ గారు ప్రశంసించారు. ఈ రెండు విషయాలలోనూ రామనాధానికి నేనే ఉదాహరణా, సాక్ష్యమూను. వీరేశలింగం గారి ప్రభావంతో వివాహం చిన్నతనంలోనే చేసుకోరాదని మనస్సులోనే అనుకున్నా. ఆ రోజుల్లో అంటే-- ఈ శతాబ్ద ప్రారంభంలో మగవానికి పదేళ్లు, ఆడపిల్లకు ఎనిమిదేళ్లు వస్తుండగానే వివాహ సంబంధాలు వెతికేవారు. బ్రహ్మసమాజ ప్రభావంతో మా యింట మూడు నాలుగేళ్ళు గ్రేస్‌ పీరియడ్‌గా వదిలేరు. నేను 13 ఏళ్ళ వయస్సులో వుండగా మా వీధిలో, మా యింటికెదురుగా ఇల్లు కొనుక్కుని పొరుగూరు నుంచి ఒక కొత్త కుటుంబం కాపురం వచ్చింది. మర్నాడు ఉదయం మా ఇంటి గుమ్మంలో కొత్త అమ్మాయి 10 ఏళ్ళది -- పచ్చని ఛాయ, నవ్వు ముఖం, నల్లని మస్లిన్‌ దుస్తులతో హాజరయింది. ఆనాటి ఆ విగ్రహం 70 ఏళ్ళ తర్వాత కూడా నా కళ్ళముందు కనిపిస్తూంది. దానికి ప్రేమా, దోమా అని పేరు వద్దు. ఆడ మగ మధ్య వుండే ఆకర్షణ. అప్పటి నుంచి ఆమె మా యింటికే ఒక విధంగా అతుక్కుపోయింది. ఓ ఏడాది పోయాక ఆమెతో పెళ్ళి అన్నారు. నేను వీరేశలింగంగారి హితబోధ మరచిపోయేను. ఎగతాళిచేసి లాభం లేదు. వ్యక్తులు ఏర్పరచుకొనే నియమాలు సమాజగత సంస్కారంగా మారే లోపున వ్యవధి తీసుకుంటుంది. ఆ లోపున ఈ మాదిరి వైఫల్యాలు కలగవచ్చు. కాని ఇక్కడ ప్రధానం సంస్కరణల ఆలోచన ప్రారంభం కావడమే. అది సమాజంలో నిలదొక్కుకోవడంలో వ్యవధి పడుతుంది. "రాశి పెరగడం వాసిలో మార్పు." From quantity into quality--అనే గతి తర్క సూత్రం వినియోగం ఇక్కడే వుంది. ఆ దృష్టితోనే నా అనుభవంతో రామనాధం పాత్రను తీర్చేను. ఆ పాత్ర వేసిన ప్రతి అడుగులో వాస్తవ జీవితంలో ఎవరిదో ఒకరి అనుభవం వుంది. వివిధ భాషలలో నేను చదివిన అనంత సాహిత్యం నాకు ఎందరివో, ఎక్కడెక్కడివో అనుభవాలను సమకూర్చి పెట్టాయి. దానికి ఒక్క ఉదాహరణనిస్తా. రామనాధం అమలాపురంలో సుందరితో సరాసరి మాట్లాడి ఆమెను సుముఖం చేసుకొనే ప్రయత్నం కథాఘట్టం. (2వ భాగం 11వ ప్రకరణం) సుందరి విముఖత కనబరచింది. "మీవాళ్ళే పంపుతే"? "తాళి కట్టించుకున్నాక తప్పుతుందా?" ఈ ఘట్టం రాస్తుంటే నేను ఎప్పుడో చదివిన దేశిరాజు పెదబాపయ్య గారి జీవితం గుర్తు వచ్చింది. అందులోని మాటలే కాకపోవచ్చు. కాని అటువంటి ఘట్టంలో పలికించే మాటలు ఒకే విధంగా వుంటాయి. అయనా, భార్యా శాశ్వతంగా విడిపోయే ముందు జరిగిందన్న సంభాషణ నా మనస్సులో నిలిచిపోయింది. శ్రీ నోరి నరసింహశాస్త్రిగారితో నేను "సంధ్యావందనం వగైరాలను అపహాస్యం చేశానే" అని గుర్తు చేసినట్లు పైన రాశాను. కాని, అస్త్రాలు, మంత్రాల మీద మనకున్న నమ్మకం Childishness తప్ప వేరు కాదు. ఆ పేరుతో మనల్ని మోసం చేస్తున్నారని కథలోకి ప్రవేశపెట్టిన ఘట్టం స్వానుభవం. జలియన్‌వాలాబాగ్‌ దురంతాలు జరిపించిన బ్రిటిష్‌ జాతిని, బ్రిటనును భూతలం నుంచి తుడిచెయ్యాలన్నంత కోపం వచ్చింది. ఎల్లాగ? అగ్రహారంలో చెప్పే గొప్పలూ, భారత రామాయణాది హరికథల్లో వర్ణించిన అస్త్రాలు, కథలూ విన్న మా అన్నదమ్ములకు వాటిని సంపాదిస్తే పని తీరిపోతుందనిపించింది. అప్పటికి నాకు పదకొండేళ్ళు, మా తమ్ముడు జగన్మోహనుకి తొమ్మిదేళ్ళు. అప్పటికే నేను 3వఫారమ్‌ పాస్‌ అవడం, సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా చదువు మానెయ్యడమూ జరిగింది. సహాయ నిరాకరణం కాదు. అసలు సహాయం ఇవ్వవలసిన వాడే లేకుండా చేసే ప్రయత్నం ప్రారంభించేం. మా తరగతిలో తురగా శేషగిరిరావనే అతను చదివాడు. మాకంటె పెద్దవాడు. స్కూలులో చదివే రోజుల్లోనే తన తండ్రిగారి నైష్ఠికత్వం గురించీ, తమ అటక మీద వున్న తాటాకు పుస్తకాలు గురించీ, వానిలో వున్న అస్త్ర శస్త్రాల మంత్రాలు గురించి తెగ వర్ణించేవాడు. అతన్ని పట్టుకున్నాం. అతను ఎప్పుడు రమ్మంటే అప్పుడు ఎండ వాన అనకుండా ఓ ఆర్నెల్లు తిరిగేం... చివరకు వాడు చెప్పేవన్నీ గొప్పలని అర్ధం అయింది. ఆ ఘట్టం చదివి మంచికీ, చెడ్డకీ వ్యాఖ్యానించిన వాళ్ళు చాల మంది తగిలేరు. అలాగే ఆ దురంతాలకి అసమ్మతి తెలుపుతూ టోపీలు తీసేసి క్లాసుకి వెళ్ళి దెబ్బలు తిన్న ఘటన. దానిలోనూ ప్రధాన పాత్రను నేనే. ఆ రోజుల్లో టోపీయో, తల పాగాయో వుండి తీరాలనే స్కూళ్ళలో నిబంధన ఉండేది. దానిని నిరాకరించాం అసమ్మతి తెలపడానికి, "ఇల్లాంటి చర్యలే జాతీయోద్యమ చరిత్రలో భాగాలు" అంటూ. పూర్వకాలపు పిచ్చి నమ్మకాల నిరాకరణం జాతీయోద్యమ పురోగతికి ఓ ఆలంబనం. టోపీ పెట్టుకోమని వ్యతిరేకించడం ఆ వుద్యమంలో ఒక సాధనం. అవి చిన్న చిన్న ఘటనలే కాని రాశిగా విస్తరించి జాతీయ జీవనంలో ఒక అడుగు ముందుకు వేయిస్తాయి, వాశి హెచ్చుతుంది. దీనికి తరవాయి కథగా ఎత్తుకున్న 'దేశం కోసం', 'జ్వాలాతోరణం' నవలలు వాసి పెరుగుదల దశలు చూపుతున్నాయి. ఇక్కడ ముంగండ గ్రంథాలయం గురించీ, గ్రామ యువజన సంఘం గురించీ కొంత రాస్తే తప్ప గ్రామంలో వచ్చిన పరిణామాలు స్పష్టంగా తెలియవు. ముంగండ గ్రంథాలయం జిల్లాలోనే మొట్టమొదట ఏర్పరచిన వానిలో ఒకటి అని మా నాన్న చెప్పేవారు. గ్రామంలో మొదట రెండు గ్రంథాలయాలు పోటాపోటీగా ఏర్పడ్డాయి. ఒకటి మా నాన్న, ఆయన మిత్రులు పుల్య కృష్ణయ్యగారు ఏర్పరచిన రామమోహన గ్రంథాలయం. దీనిలో కొత్తగా వస్తున్న గ్రంథాలు వుండేవి. రెండోది గ్రామంలోని పండితులు పోటీగా పెట్టిన గజానన గ్రంథాలయం. తెలుగు కావ్యాలు, పురాణాలు మొదలైనవి ప్రధానంగా వుండేవి. 1910 ప్రాంతంలో రెండింటిని ఏకంచేసి, వివేకోదయ పుస్తక భాండాగారం అని పేరు పెట్టేరు. నాకు గుర్తు తెలిసిన అయిదవ ఏడాది నాటికి ఆ గ్రంథాలయం మా చావడిలో ఉండేది. నా చదువు దానిలోనే గనక నాకు బాగా తెలుసు. నన్ను 5వ ఏట బడిలో వేశారు. మొదటి రోజునే ఎందుకో గుర్తులేదు. మేష్టారు తొడపాశెం పెట్టారు. పసుపురాసిన పచ్చని ఒంటిమీద నల్లగా కమిలిపోయిన తొడను చూసి మా నాన్న వెళ్ళి మేష్టారిని తిట్టి నన్ను బడి మానిపించేడు. ఇంటి వద్ద తానే అక్షరాలు నేర్పి మా సావడిలోని గ్రంథాలయంలో వదిలేరు. ప్రథమలో నేను వాచకం నేర్చుకున్న "ఆర్య కథానిథి" పుస్తకాలు (వావిల కొలను సుబ్బారావుగారివి) నాకిప్పటికీ గుర్తు. అలాగే సెట్టి లక్ష్మీనరసింహంగారి గ్రీకు పురాణ కథలు, చిలకమర్తి వారి రాజస్థాన కధావళి, గాడిచర్ల హరి సర్వోత్తమరావుగారి అబ్రహాము లింకను మొదలైనవి జ్ఞాపకం. ప్రపంచ యుద్ధ కథలను ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక బొమ్మలతో వేసేది. ఆ ఏడేళ్ళ వయస్సులోనే అవన్నీ బహు ఆసక్తిగా చదివేవాడిని. 5-6 ఏళ్ళ వయసులోనే పట్టుబడిన పుస్తక పఠనాశక్తి ఈ 85 ఏళ్ళ వయస్సుకి కూడా తగ్గలేదు. ఆ గ్రంథాలయం 1910 నాటికి మా యింటి నుండి మారింది. 1929లో గ్రామ యువజన సంఘం ఏర్పడింది. మొదట కర్రసాము నేర్చుకోడానికి ప్రారంభమైన యువకుల సంఘం ఆనాడు నా యీడు వాళ్లు ఊళ్లో 10-15 మంది వుండేవారు. సత్యాగ్రహ ఉద్యమానికి వాలంటీర్లను పంపడం, పోలీసుల చేత దెబ్బలు తిన్నవారిని రహస్యంగా దాచి, వైద్యం చేసి తిరిగి పంపడం వంటి పనులతో బలమైన యువజన సంఘంగా ఏర్పడ్డాం. వారిలో సత్యాగ్రహ శిబిరంలో చేరిన నలుగురిలో నేనొకడిని. ఆ ప్రాంతంలోనే మా వూరి చెరువు గట్టుమీద కట్టిన మఠంలో చేర్చి వున్న ఒక గది శిథిలం అయింది. దానిని గ్రామ యువజన సంఘం మరల కట్టింది. డబ్బు కోసం వూరి చెరువుకి నీరు పెట్టడం బాధ్యత తీసుకొని ఓ పాతిక, గ్రామంలో లక్షపత్రి పూజలు తలపెట్టిన ఇద్దరు ముగ్గురికి పదేసి రూపాయలు తీసుకొని పత్రి తెచ్చి యిచ్చే డబ్బు సంపాదించాం. మేస్త్రీ సాయంతో మేమే కూలి పనిచేసి ఆ కొద్ది డబ్బుతోనే పడిపోయిన గదిని వేసేం. అందులోకి గ్రామ గ్రంథాలయాన్ని మార్చాం. నలిగిపోయిన పుస్తకాలను బైండింగు పని నేర్చుకుని మేమే చేశాం. ఈ కార్యక్రమాలతో ముంగండ యువజన సంఘం పోలీసు రికార్డుల్లోకి ఎక్కింది. ఒక దశలో ముస్తఫాలీఖాన్‌ (డివైఎస్‌పి) గ్రామం మీద దాడిచేసి సంఘం నామరూపాల్లేకుండా చెయ్యాలనే ప్రయత్నంలో వున్నట్లు తెలిసింది. సమావేశం అయాం. పోలీసుల చేతిలో దెబ్బలూ, చావులూ తప్పవు గనుక, మనం వాళ్ళని చుట్టుముట్టి చంపేద్దామని నిర్ణయించేసేం. కత్తులు, బల్లేలూ, ఒక రివాల్వరు, ఒక లైసెన్స్‌డ్‌ గన్‌ ( మా బావమరిదిది) సిద్ధం చేసుకున్నాం. కాని ముస్తఫాలీ దాడికి రాలేదు. మేమూ సర్దేసుకున్నాము. - మహీధర రామమోహనరావు End of Project Gutenberg's Kollayi Gattite Nemi, by Rama Mohana Rao Mahidhara *** END OF THE PROJECT GUTENBERG EBOOK కొల్లాయి గట్టితే నేమి? *** Updated editions will replace the previous one—the old editions will be renamed. Creating the works from print editions not protected by U.S. copyright law means that no one owns a United States copyright in these works, so the Foundation (and you!) can copy and distribute it in the United States without permission and without paying copyright royalties. Special rules, set forth in the General Terms of Use part of this license, apply to copying and distributing Project Gutenberg™ electronic works to protect the PROJECT GUTENBERG™ concept and trademark. Project Gutenberg is a registered trademark, and may not be used if you charge for an eBook, except by following the terms of the trademark license, including paying royalties for use of the Project Gutenberg trademark. If you do not charge anything for copies of this eBook, complying with the trademark license is very easy. You may use this eBook for nearly any purpose such as creation of derivative works, reports, performances and research. Project Gutenberg eBooks may be modified and printed and given away—you may do practically ANYTHING in the United States with eBooks not protected by U.S. copyright law. Redistribution is subject to the trademark license, especially commercial redistribution. START: FULL LICENSE THE FULL PROJECT GUTENBERG LICENSE PLEASE READ THIS BEFORE YOU DISTRIBUTE OR USE THIS WORK To protect the Project Gutenberg™ mission of promoting the free distribution of electronic works, by using or distributing this work (or any other work associated in any way with the phrase “Project Gutenberg”), you agree to comply with all the terms of the Full Project Gutenberg™ License available with this file or online at www.gutenberg.org/license. Section 1. General Terms of Use and Redistributing Project Gutenberg™ electronic works 1.A. By reading or using any part of this Project Gutenberg™ electronic work, you indicate that you have read, understand, agree to and accept all the terms of this license and intellectual property (trademark/copyright) agreement. If you do not agree to abide by all the terms of this agreement, you must cease using and return or destroy all copies of Project Gutenberg™ electronic works in your possession. If you paid a fee for obtaining a copy of or access to a Project Gutenberg™ electronic work and you do not agree to be bound by the terms of this agreement, you may obtain a refund from the person or entity to whom you paid the fee as set forth in paragraph 1.E.8. 1.B. “Project Gutenberg” is a registered trademark. It may only be used on or associated in any way with an electronic work by people who agree to be bound by the terms of this agreement. There are a few things that you can do with most Project Gutenberg™ electronic works even without complying with the full terms of this agreement. See paragraph 1.C below. There are a lot of things you can do with Project Gutenberg™ electronic works if you follow the terms of this agreement and help preserve free future access to Project Gutenberg™ electronic works. See paragraph 1.E below. 1.C. The Project Gutenberg Literary Archive Foundation (“the Foundation” or PGLAF), owns a compilation copyright in the collection of Project Gutenberg™ electronic works. Nearly all the individual works in the collection are in the public domain in the United States. If an individual work is unprotected by copyright law in the United States and you are located in the United States, we do not claim a right to prevent you from copying, distributing, performing, displaying or creating derivative works based on the work as long as all references to Project Gutenberg are removed. Of course, we hope that you will support the Project Gutenberg™ mission of promoting free access to electronic works by freely sharing Project Gutenberg™ works in compliance with the terms of this agreement for keeping the Project Gutenberg™ name associated with the work. You can easily comply with the terms of this agreement by keeping this work in the same format with its attached full Project Gutenberg™ License when you share it without charge with others. 1.D. The copyright laws of the place where you are located also govern what you can do with this work. Copyright laws in most countries are in a constant state of change. If you are outside the United States, check the laws of your country in addition to the terms of this agreement before downloading, copying, displaying, performing, distributing or creating derivative works based on this work or any other Project Gutenberg™ work. The Foundation makes no representations concerning the copyright status of any work in any country other than the United States. 1.E. Unless you have removed all references to Project Gutenberg: 1.E.1. The following sentence, with active links to, or other immediate access to, the full Project Gutenberg™ License must appear prominently whenever any copy of a Project Gutenberg™ work (any work on which the phrase “Project Gutenberg” appears, or with which the phrase “Project Gutenberg” is associated) is accessed, displayed, performed, viewed, copied or distributed: This eBook is for the use of anyone anywhere in the United States and most other parts of the world at no cost and with almost no restrictions whatsoever. You may copy it, give it away or re-use it under the terms of the Project Gutenberg License included with this eBook or online at www.gutenberg.org. If you are not located in the United States, you will have to check the laws of the country where you are located before using this eBook. 1.E.2. If an individual Project Gutenberg™ electronic work is derived from texts not protected by U.S. copyright law (does not contain a notice indicating that it is posted with permission of the copyright holder), the work can be copied and distributed to anyone in the United States without paying any fees or charges. If you are redistributing or providing access to a work with the phrase “Project Gutenberg” associated with or appearing on the work, you must comply either with the requirements of paragraphs 1.E.1 through 1.E.7 or obtain permission for the use of the work and the Project Gutenberg™ trademark as set forth in paragraphs 1.E.8 or 1.E.9. 1.E.3. If an individual Project Gutenberg™ electronic work is posted with the permission of the copyright holder, your use and distribution must comply with both paragraphs 1.E.1 through 1.E.7 and any additional terms imposed by the copyright holder. Additional terms will be linked to the Project Gutenberg™ License for all works posted with the permission of the copyright holder found at the beginning of this work. 1.E.4. Do not unlink or detach or remove the full Project Gutenberg™ License terms from this work, or any files containing a part of this work or any other work associated with Project Gutenberg™. 1.E.5. Do not copy, display, perform, distribute or redistribute this electronic work, or any part of this electronic work, without prominently displaying the sentence set forth in paragraph 1.E.1 with active links or immediate access to the full terms of the Project Gutenberg™ License. 1.E.6. You may convert to and distribute this work in any binary, compressed, marked up, nonproprietary or proprietary form, including any word processing or hypertext form. However, if you provide access to or distribute copies of a Project Gutenberg™ work in a format other than “Plain Vanilla ASCII” or other format used in the official version posted on the official Project Gutenberg™ website (www.gutenberg.org), you must, at no additional cost, fee or expense to the user, provide a copy, a means of exporting a copy, or a means of obtaining a copy upon request, of the work in its original “Plain Vanilla ASCII” or other form. Any alternate format must include the full Project Gutenberg™ License as specified in paragraph 1.E.1. 1.E.7. Do not charge a fee for access to, viewing, displaying, performing, copying or distributing any Project Gutenberg™ works unless you comply with paragraph 1.E.8 or 1.E.9. 1.E.8. You may charge a reasonable fee for copies of or providing access to or distributing Project Gutenberg™ electronic works provided that: • You pay a royalty fee of 20% of the gross profits you derive from the use of Project Gutenberg™ works calculated using the method you already use to calculate your applicable taxes. The fee is owed to the owner of the Project Gutenberg™ trademark, but he has agreed to donate royalties under this paragraph to the Project Gutenberg Literary Archive Foundation. Royalty payments must be paid within 60 days following each date on which you prepare (or are legally required to prepare) your periodic tax returns. Royalty payments should be clearly marked as such and sent to the Project Gutenberg Literary Archive Foundation at the address specified in Section 4, “Information about donations to the Project Gutenberg Literary Archive Foundation.” • You provide a full refund of any money paid by a user who notifies you in writing (or by e-mail) within 30 days of receipt that s/he does not agree to the terms of the full Project Gutenberg™ License. You must require such a user to return or destroy all copies of the works possessed in a physical medium and discontinue all use of and all access to other copies of Project Gutenberg™ works. • You provide, in accordance with paragraph 1.F.3, a full refund of any money paid for a work or a replacement copy, if a defect in the electronic work is discovered and reported to you within 90 days of receipt of the work. • You comply with all other terms of this agreement for free distribution of Project Gutenberg™ works. 1.E.9. If you wish to charge a fee or distribute a Project Gutenberg™ electronic work or group of works on different terms than are set forth in this agreement, you must obtain permission in writing from the Project Gutenberg Literary Archive Foundation, the manager of the Project Gutenberg™ trademark. Contact the Foundation as set forth in Section 3 below. 1.F. 1.F.1. Project Gutenberg volunteers and employees expend considerable effort to identify, do copyright research on, transcribe and proofread works not protected by U.S. copyright law in creating the Project Gutenberg™ collection. Despite these efforts, Project Gutenberg™ electronic works, and the medium on which they may be stored, may contain “Defects,” such as, but not limited to, incomplete, inaccurate or corrupt data, transcription errors, a copyright or other intellectual property infringement, a defective or damaged disk or other medium, a computer virus, or computer codes that damage or cannot be read by your equipment. 1.F.2. LIMITED WARRANTY, DISCLAIMER OF DAMAGES - Except for the “Right of Replacement or Refund” described in paragraph 1.F.3, the Project Gutenberg Literary Archive Foundation, the owner of the Project Gutenberg™ trademark, and any other party distributing a Project Gutenberg™ electronic work under this agreement, disclaim all liability to you for damages, costs and expenses, including legal fees. YOU AGREE THAT YOU HAVE NO REMEDIES FOR NEGLIGENCE, STRICT LIABILITY, BREACH OF WARRANTY OR BREACH OF CONTRACT EXCEPT THOSE PROVIDED IN PARAGRAPH 1.F.3. YOU AGREE THAT THE FOUNDATION, THE TRADEMARK OWNER, AND ANY DISTRIBUTOR UNDER THIS AGREEMENT WILL NOT BE LIABLE TO YOU FOR ACTUAL, DIRECT, INDIRECT, CONSEQUENTIAL, PUNITIVE OR INCIDENTAL DAMAGES EVEN IF YOU GIVE NOTICE OF THE POSSIBILITY OF SUCH DAMAGE. 1.F.3. LIMITED RIGHT OF REPLACEMENT OR REFUND - If you discover a defect in this electronic work within 90 days of receiving it, you can receive a refund of the money (if any) you paid for it by sending a written explanation to the person you received the work from. If you received the work on a physical medium, you must return the medium with your written explanation. The person or entity that provided you with the defective work may elect to provide a replacement copy in lieu of a refund. If you received the work electronically, the person or entity providing it to you may choose to give you a second opportunity to receive the work electronically in lieu of a refund. If the second copy is also defective, you may demand a refund in writing without further opportunities to fix the problem. 1.F.4. Except for the limited right of replacement or refund set forth in paragraph 1.F.3, this work is provided to you ‘AS-IS’, WITH NO OTHER WARRANTIES OF ANY KIND, EXPRESS OR IMPLIED, INCLUDING BUT NOT LIMITED TO WARRANTIES OF MERCHANTABILITY OR FITNESS FOR ANY PURPOSE. 1.F.5. Some states do not allow disclaimers of certain implied warranties or the exclusion or limitation of certain types of damages. If any disclaimer or limitation set forth in this agreement violates the law of the state applicable to this agreement, the agreement shall be interpreted to make the maximum disclaimer or limitation permitted by the applicable state law. The invalidity or unenforceability of any provision of this agreement shall not void the remaining provisions. 1.F.6. INDEMNITY - You agree to indemnify and hold the Foundation, the trademark owner, any agent or employee of the Foundation, anyone providing copies of Project Gutenberg™ electronic works in accordance with this agreement, and any volunteers associated with the production, promotion and distribution of Project Gutenberg™ electronic works, harmless from all liability, costs and expenses, including legal fees, that arise directly or indirectly from any of the following which you do or cause to occur: (a) distribution of this or any Project Gutenberg™ work, (b) alteration, modification, or additions or deletions to any Project Gutenberg™ work, and (c) any Defect you cause. Section 2. Information about the Mission of Project Gutenberg™ Project Gutenberg™ is synonymous with the free distribution of electronic works in formats readable by the widest variety of computers including obsolete, old, middle-aged and new computers. It exists because of the efforts of hundreds of volunteers and donations from people in all walks of life. Volunteers and financial support to provide volunteers with the assistance they need are critical to reaching Project Gutenberg™’s goals and ensuring that the Project Gutenberg™ collection will remain freely available for generations to come. In 2001, the Project Gutenberg Literary Archive Foundation was created to provide a secure and permanent future for Project Gutenberg™ and future generations. To learn more about the Project Gutenberg Literary Archive Foundation and how your efforts and donations can help, see Sections 3 and 4 and the Foundation information page at www.gutenberg.org. Section 3. Information about the Project Gutenberg Literary Archive Foundation The Project Gutenberg Literary Archive Foundation is a non-profit 501(c)(3) educational corporation organized under the laws of the state of Mississippi and granted tax exempt status by the Internal Revenue Service. The Foundation’s EIN or federal tax identification number is 64-6221541. Contributions to the Project Gutenberg Literary Archive Foundation are tax deductible to the full extent permitted by U.S. federal laws and your state’s laws. The Foundation’s business office is located at 809 North 1500 West, Salt Lake City, UT 84116, (801) 596-1887. Email contact links and up to date contact information can be found at the Foundation’s website and official page at www.gutenberg.org/contact Section 4. Information about Donations to the Project Gutenberg Literary Archive Foundation Project Gutenberg™ depends upon and cannot survive without widespread public support and donations to carry out its mission of increasing the number of public domain and licensed works that can be freely distributed in machine-readable form accessible by the widest array of equipment including outdated equipment. Many small donations ($1 to $5,000) are particularly important to maintaining tax exempt status with the IRS. The Foundation is committed to complying with the laws regulating charities and charitable donations in all 50 states of the United States. Compliance requirements are not uniform and it takes a considerable effort, much paperwork and many fees to meet and keep up with these requirements. We do not solicit donations in locations where we have not received written confirmation of compliance. To SEND DONATIONS or determine the status of compliance for any particular state visit www.gutenberg.org/donate. While we cannot and do not solicit contributions from states where we have not met the solicitation requirements, we know of no prohibition against accepting unsolicited donations from donors in such states who approach us with offers to donate. International donations are gratefully accepted, but we cannot make any statements concerning tax treatment of donations received from outside the United States. U.S. laws alone swamp our small staff. Please check the Project Gutenberg web pages for current donation methods and addresses. Donations are accepted in a number of other ways including checks, online payments and credit card donations. To donate, please visit: www.gutenberg.org/donate. Section 5. General Information About Project Gutenberg™ electronic works Professor Michael S. Hart was the originator of the Project Gutenberg™ concept of a library of electronic works that could be freely shared with anyone. For forty years, he produced and distributed Project Gutenberg™ eBooks with only a loose network of volunteer support. Project Gutenberg™ eBooks are often created from several printed editions, all of which are confirmed as not protected by copyright in the U.S. unless a copyright notice is included. Thus, we do not necessarily keep eBooks in compliance with any particular paper edition. Most people start at our website which has the main PG search facility: www.gutenberg.org. This website includes information about Project Gutenberg™, including how to make donations to the Project Gutenberg Literary Archive Foundation, how to help produce our new eBooks, and how to subscribe to our email newsletter to hear about new eBooks.